Sunday, March 17, 2024

తమిళంలోకి ‘ఎడ్ది’







 

నా 'ఎడ్డి' కథ తమిళ అనువాదం కాలచువాడు మాసపత్రిక మార్చి 2024 సంచికలో ప్రచురితమైంది. అనువాదకులు మారియప్పన్‌ గారికీ, సంపాదకులకూ ధన్యవాదాలు.

Saturday, March 16, 2024

శాస్త్రి గారు - ఇడ్లీ పొట్లం




పతంజలి శాస్త్రి గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వచ్చినట్టుగా తెలియజేసిన వార్తాపత్రిక ఇడ్లీ పొట్లంగా మారడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ అది సరిగ్గా ఆ రచయిత దగ్గరికే చేరడంలోనే సృష్టి కుట్ర ఏదో ఉందనిపిస్తుంది. దీనికిదే ఒక చిన్న కథ అవుతుంది. టైటిల్ కావాలంటే పైది పెట్టుకోవచ్చు

😊
Patanjali Sastry గారి FB పోస్టు (3-2-24) చూశాక నాకో సంగతి గుర్తొచ్చింది. సిద్దిపేటలో డిగ్రీ చదువుతున్నప్పుడు, దేనికోసమో కిరాణా షాపుకు వెళ్తే, అనుకోకుండా నా కళ్లు పొట్లాలు కట్టడానికి ఉంచిన కాగితాల మీద పడ్డాయి. నా పేరుందేమిటి? నా కంటే ముందు ఒక్క మనిషి ఆ దుకాణానికి వెళ్లినా ఈ కాగితం నాకు దక్కకపోవును, ఇలాంటిదొకటి వేసినట్టుగా నాకు తెలియకపోవును. సృష్టి కుట్ర ఇలా కూడా ఉంటుంది!


Friday, March 15, 2024

గ్రంథాలయాల హననం



పుస్తక హననం

నేను గనక కాలంలో వెనక్కి వెళ్లగలిగితే, అలెగ్జాండ్రియా లైబ్రరీని దర్శిస్తానంటాడు ఖగోళ శాస్త్రవేత్త కార్ల్‌ సాగన్‌. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాలయం అని పేరు. వేలాది గ్రీకు, హీబ్రూ, మెసొపొటేమియన్‌ సాహిత్య స్క్రోల్స్, ప్రాచీన ఈజిప్టుకు చెందిన కళోపకరణాలు ఇక్కడ ఉండేవి. ఎరాటోస్తనీస్, ఆర్కిమెడీస్, యూక్లిడ్‌ వంటి గ్రీకు శాస్త్రజ్ఞులు దీన్ని సందర్శించారు. రెండు వేల ఏళ్ల కిందట ఇది వైభవోపేతంగా వర్ధిల్లిందనీ, దీన్ని క్రీ.పూ. 48–47 ప్రాంతంలో సీజర్‌ తగలబెట్టేశాడనీ చెబుతుంటారు. అయితే, తగలబడిందని నిర్ధారించడానికి చారిత్రక ఆధారాలు లేవనీ, మానవ జాతి పోగేసుకున్న సమస్త వివేకసారం మట్టి పాలైందని అనుకోవడంలో ఉన్న ఉద్వేగంలోంచి ఈ కథ పుట్టివుంటుందనీ చెబుతాడు బ్రిటిష్‌ లైబ్రేరియన్, రచయిత రిచర్డ్‌ ఓవెండెన్‌. ఇప్పటి ‘పుస్తకం’ ఉనికిలో లేని ఆ కాలంలో నునుపు చేసిన చెట్ల బెరడుల రోల్స్‌ కాలక్రమంలో నశించడమే ఈ కథగా మారివుంటుందని మరో కథ. ఏమైనా, సమస్త విజ్ఞానం ఒక చోట రాశిగా పోగయ్యే గ్రంథాలయం అనే భావనను ఊహించడమే మానవ నాగరికత సాధించిన విజయం. ఆ గ్రంథాలయాలనే నేలమట్టం చేయడం ద్వారా శత్రువు మీద పైచేయి సాధించే ప్రయత్నం చేయడం అదే నాగరిక మానవుడి అనాగరికతకు తార్కాణం.


ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచీ జరుగుతున్న ప్రాణనష్టం గురించి మీడియా మాట్లాడుతూనే ఉంది. కానీ గాజాలో కనీసం పదమూడు గ్రంథాలయాలకు ఇజ్రాయెల్‌ వల్ల నష్టం వాటిల్లింది. ఇందులో కొన్ని పూర్తిగా నాశనం కాగా, కొన్ని దారుణంగా దెబ్బతినడమో, అందులో ఉన్నవి దోచుకెళ్లడమో జరిగింది. నూటా యాభై ఏళ్ల గాజా చరిత్ర రికార్డులున్న సెంట్రల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ గాజా, పాలస్తీనాలోని అరుదైన పుస్తకాల కలెక్షన్‌ కలిగివున్న గ్రేట్‌ ఒమారి మాస్క్, వేలాది పుస్తకాలకు నెలవైన డయానా తమారీ సబ్బాగ్‌ లైబ్రరీతో పాటు, గాజా యూనివర్సిటీ లైబ్రరీ, అల్‌–ఇస్రా యూనివర్సిటీ లైబ్రరీ కూడా దెబ్బతిన్నవాటిల్లో ఉన్నాయి. ‘‘ఆర్కైవ్‌ మీద ఆధిపత్యం లేకపోతే రాజకీయ అధికారం లేదు’’ అంటాడు ఫ్రెంచ్‌ విమర్శకుడు జాక్వెస్‌ డెరిడా. అందుకే గ్రంథాలయాలను దొంగదెబ్బ కొట్టడం అనేది చరిత్ర పొడువునా జరుగుతూనే ఉంది.


ప్రపంచానికే జ్ఞానకాంతిగా వెలుగొందింది భారత్‌లోని నాలంద విశ్వవిద్యాలయం. 5వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఇది నిర్మితమైంది. రత్నదధి, రత్నసాగర, రత్నరంజక పేరుతో మూడు తొమ్మిదంతస్థుల భవనాలుండేవి. ఖగోళం, జ్యోతిష్యం, గణితం, రాజకీయం, ఆయుర్వేదం, వైద్యం, కళలు, సాహిత్యం, వ్యాకరణం, తర్కం సంబంధిత అంశాలన్నింటికీ నెలవు ఇది. జైన తీర్థంకరుడు మహావీరుడు 14 వర్షాకాలాలు ఇక్కడ గడిపాడట. క్రీ.శ.1193లో భక్తియార్‌ ఖిల్జీ దీన్ని తగలబెట్టించాడు. దేశంలో బౌద్ధ ప్రాభవం క్షీణించడానికి ఇదీ ఓ కారణమని చెబుతారు. ‘‘గ్రంథాలయాల ద్వారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంది. కొన్నిసార్లు గ్రంథాలయాలను సాంస్కృతిక హనన పథకంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు. ఎన్నో ప్రజా, ప్రైవేటు లైబ్రరీలు మూర్ఖ దురాక్రమణదారుల వల్ల నాశనం అయ్యాయి’’ అంటారు పాత్రికేయుడు జానీ డైమండ్‌.


బీజింగ్‌లో ఎనిమిదో శతాబ్దంలో నెలకొల్పిన హాన్లిన్‌ లైబ్రరీ ఒక విజ్ఞాన భాండాగారం. ఇందులో ఒక ముఖ్యమైన సోర్సు మింగ్‌ వంశపు చక్రవర్తి ఝూ డీ 1403లో ‘జాంగ్లే దాదియన్‌’ పేరుతో సిద్ధం చేయించిన ఎన్‌సైక్లోపీడియా. వ్యవసాయం, నాటకం, భూగర్భశాస్త్రం, వైద్యం, కళ, చరిత్ర, సాహిత్యం లాంటి వాటితో కూడిన 22,000 విభాగాలు అందులో ఉన్నాయి. 1900వ సంవత్సరంలో మంటల్లో లైబ్రరీ తగలబడినప్పుడు ఆ ఎన్‌సైక్లోపీడియా కూడా మసైపోయింది. వలసవాదులు, తిరుగుబాటుదారుల రూపంలో ఉన్న బ్రిటిష్‌ వాళ్లు, చైనీయులు దీనికి కారణం మీరంటే మీరేనని పరస్పరం నిందించుకున్నారు.


అమెరికా జాతీయ గ్రంథాలయాన్ని 1814లో బ్రిటిష్‌వాళ్లు నాశనం చేశారు. అప్పటికి దాన్ని నెలకొల్పి నాలుగేళ్లే అయింది. సెనేటర్ల ఉపయోగార్థం 3000 వాల్యూములు అందులో ఉన్నాయి. అయినప్పటికీ ఆ దెబ్బ తమ జాతి ఆత్మను గాయపరిచిందంటాడు అమెరికా చరిత్రకారుడు రాబర్ట్‌ డార్న్‌టన్‌. అదే బ్రిటనీయులు 2003లో ఇరాక్‌ జాతీయ గ్రంథాలయాన్ని నాశనం చేశారు. పనామ్‌ పెన్హ్‌ నగరంలోని జాతీయ గ్రంథాలయాన్ని 1967లో సర్వనాశనం చేయడం ద్వారా కంబోడియా నాగరికత మొత్తాన్నీ ‘ఖ్మేర్‌ రూజ్‌’ తుడిచిపెట్టింది.


దేశ చరిత్రను మళ్లీ ‘ఇయర్‌ జీరో’ నుంచి మొదలుపెట్టించాలన్న మూర్ఖత్వంలో భాగంగా కమ్యూనిస్టు నాయకుడు పోల్‌ పాట్‌ సైన్యం నరమేధానికీ, సాంస్కృతిక హననానికీ పాల్పడింది. సుమారు లక్ష పుస్తకాలున్న, అప్పటికి యాభై ఏళ్ల పాతదైన శ్రీలంకలోని జాఫ్నా పబ్లిక్‌ లైబ్రరీని 1981లో సింహళ మూక కూడా అలాగే తగలబెట్టింది.
ఒక గ్రంథాలయం ధ్వంసమైతే మనం ఏం కోల్పోయామో కూడా మనకు తెలియకపోవడం అతి పెద్ద విషాదం. ఒక గ్రంథాలయాన్ని నిర్మూలించడమంటే ఒక దేశ, ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం; గతపు ఘనతను పూర్తిగా నేలమట్టం గావించడం; అన్నీ కోల్పోయినా మళ్లీ మొదలెట్టగలిగే శక్తియుక్తులను నిర్వీర్యం చేయడం; చెప్పాలంటే ఇంకేమీ లేకుండా చేయడం, సున్నా దగ్గరికి తెచ్చి నిలబెట్టడం. అయినా గోడలు కూలితేనే, పుస్తకాలు కాలితేనే గ్రంథాలయం నాశనం కావడమా? వాటిపట్ల నిర్లక్ష్యం వహించడం మాత్రం నెమ్మదిగా నాశనం చేయడం కాదా?

4-3-2024

Thursday, March 14, 2024

సోమర్‌సెట్‌ మామ్‌: ఫస్ట్‌–రేట్‌ రచయత





 ఫస్ట్‌–రేట్‌ రచయత

సెకండ్‌–రేట్‌ రచయితల్లో తాను మొదటి వరుసలో ఉంటానని చెప్పుకొన్నాడట సోమర్‌సెట్‌ మామ్‌. ఆయన దృష్టిలో బాల్జాక్, డికెన్స్, టాల్‌స్టాయ్, దోస్తోవ్‌స్కీ ప్రపంచం చూసిన నలుగురు గొప్ప నవలాకారులు. పాఠకులను సాహిత్యం వైపు ఆకర్షించడమే కొందరు రచయితల విలువైన కాంట్రిబ్యూషన్‌ అవుతుంది. ఇక్కడ కూడా మామ్‌ మొదటి వరుసలో ఉంటారు. ఆంగ్ల అనువాద కథలతో పరిచయం ఉండే తెలుగు పాఠకులకు దాదాపుగా తగిలే మొదటిపేరు విలియమ్‌ సోమర్‌సెట్‌ మామ్‌. అత్యధిక కాపీల అమ్మకం, అత్యంత పేరు, అత్యధిక సంపాదనలతో చాలా విధాలుగా ఒక కమర్షియల్‌ రచయిత కూడా కలలు కనలేని జీవితాన్ని మామ్‌ అనుభవించాడు. హాలీవుడ్‌ సినిమాలకు పనిచేశాడు, దేశదేశాలు తిరిగాడు, అత్యంత ప్రముఖులతో విలాసవంతమైన టూర్లు, డిన్నర్లల్లో పాల్గొన్నాడు. తన గురించి మామ్‌ ఏమని చెప్పుకొన్నా, ఆయన ‘ద మూన్‌ అండ్‌ సిక్స్‌పెన్స్‌’, ‘ద పేంటెడ్‌ వీల్‌’, ‘కేక్స్‌ అండ్‌ ఎయిల్‌’, ‘ద రేజర్స్‌ ఎడ్జ్‌’ గొప్ప నవలలుగా పేరొందాయి. ఇక మామ్‌ మాస్టర్‌పీస్‌గా చెప్పే ‘ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌’ ప్రపంచ గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచిపోయింది. నూటికి పైగా కథలు, పదులకొద్దీ నాటకాలు, నవలలు... ఎంత విస్తృతంగా రాశాడో అంత అదరణ పొందిన మామ్‌కు ఇది నూటా యాభయ్యో జయంతి సంవత్సరం.

మామ్‌ జీవితంలోనూ ఒక రచనకు కావాల్సినంత డ్రామా, కన్నీళ్లు, కష్టాలు, ట్విస్టులు ఉన్నాయి. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆంగ్లాన్ని చిన్నతనంలో సాటి విద్యార్థులు హేళన చేసేవారు. కారణం, జన్మకు ఆంగ్లేయుడు అయినా, పుట్టింది ఫ్రెంచ్‌ గడ్డ మీద. అలా ఫ్రెంచ్‌ ఆయన మొదటి భాష అయింది. ఫ్రెంచ్‌ గడ్డ మీద పుట్టిన అందరూ ఫ్రెంచ్‌వాళ్లే అవుతారనీ, తప్పక మిలిటరీలో చేరాల్సిందేననీ శాసనం వచ్చినప్పుడు ఆ స్థానీయతను తప్పించుకోవడానికి మామ్‌ కుటుంబం ఫ్రాన్స్‌లోని బ్రిటిష్‌ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించింది. అందులోనే మామ్‌కు జన్మనిచ్చింది(1874 జనవరి 25) వాళ్ల తల్లి. అలా బ్రిటన్‌ ఎంబసీలో జన్మించడం వల్ల మామ్‌ బ్రిటనీయత స్థిరపడిపోయింది. వాళ్ల గ్రేట్‌–అంకుల్‌ గుర్తుగా పెట్టిన సోమర్‌సెట్‌ అనే మధ్యపేరు ఆయనకు నచ్చలేదు. ఇంట్లో విల్లీ అని పిలిచేవాళ్లు. మామ్‌కు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే తల్లి క్షయవ్యాధితో చనిపోయింది. ఆ లోటు ఆయనకు ఎప్పుడూ తీరలేదు. ‘అది ఎప్పడూ పూర్తిగా మానని గాయం’గానే ఉండిపోయింది. వృద్ధుడయ్యాక కూడా తల్లి ఫొటోను మంచం పక్కనే ఉంచుకునేవాడు. ఆ తర్వాత రెండేళ్లకే తండ్రి చనిపోవడం మరో దెబ్బ. అప్పుడు బ్రిటన్‌లోని చిన్నాన్న దగ్గరికి వచ్చాడు. ఆ కొత్త ఇల్లు, వాతావరణం బాగున్నప్పటికీ, తల్లిదండ్రులు లేని చింత, కొత్త సమాజంలో కలవలేకపోవడం, సిగ్గరి కావడం వంటి కారణాల వల్ల ఇట్టే మాట్లాడేవాడు కాదు. అది క్రమంగా నత్తిగా మారి జీవితాంతం ఆయనతో ఉండిపోయింది. తాత, తండ్రి న్యాయవాదులు అయినప్పటికీ మామ్‌ ఆ బాటలోకి పోకపోవడానికి ఈ నత్తి కూడా ఒక కారణం.

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అవడంలా కాకుండా, నిజంగానే డాక్టరీ చదివినా దాని జోలికి పోకుండా రంగస్థలంలో ప్రాక్టీస్‌ చేశాడు మామ్‌. నాటకాలతో ముందు ప్రజాదరణ పొందినా తర్వాత నవలలు, కథల మీద మాత్రమే దృష్టిసారించాలని నిశ్చయించుకున్నాడు. ఒక చదవదగ్గ కథకు మెటీరియల్‌ రాకపోతే తానెవరి సమక్షంలోనూ గంటసేపు కూడా గడపనని అనేవాడు. ఆయనకు ఏదైనా కథావస్తువే. దానికి తగినట్టే ఆయన జీవితం కూడా అనుభవాల పుట్ట. యువకుడిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌ సీక్రెట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ కోసం కొన్నాళ్లు స్విట్జర్లాండ్‌లో గూఢచారిగా పనిచేశాడు. ఫ్రెంచ్‌ నాటక రచయిత అన్నది అప్పుడు ఆయన కవర్‌. తర్వాత, రష్యాలోనూ బోల్షివిక్కులకు వ్యతిరేకంగా, జర్నన్‌ నిఘా నెట్‌వర్క్‌ మీద సమాచారాన్ని పంపాడు. మెన్షివిక్కులకు మద్దతు ఇవ్వాలన్నది బ్రిటన్‌ ఆలోచన. జర్మనీలో చదువుకున్నందువల్ల మామ్‌కు జర్మన్‌ వచ్చు. ఈసారి అమెరికా పబ్లిషర్‌ అనేది కవర్‌. అయితే ఈ అనుభవాలను రచనలుగా తెచ్చాడుగానీ అధికార రహస్యాల చట్టాన్ని ఇవి ఉల్లంఘిస్తుండటంతో చాలావాటిని కాల్చేశాడు. అయినా గూఢచర్య కథలు రాసిన తొలి గూఢాచార రచయిత మామ్‌ అయ్యాడు. జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌ రాయడానికి ఇయాన్‌ ఫ్లెమింగ్‌కు ప్రేరణగా నిలిచాడు. కానీ గూఢచర్యంలో పనిరోజులు ఒకేవిధంగా ఉండి విసుగు పుట్టిస్తాయనీ, చాలా రోజులు నిరర్థకమనీ వ్యాఖ్యానించాడు.

ఇటీవల వచ్చిన మలయాళ సినిమా ‘కాదల్‌’లో హోమోసెక్సువల్‌ అయినప్పటికీ హీరోకు ఒక కూతురు ఉంటుంది. దాంపత్య బంధపు ఒత్తిడి అది. మామ్‌ కూడా లైంగిక ధోరణి రీత్యా హోమోసెక్సువల్‌. పదేళ్ల వివాహ బంధంతో ఆయనకు ఒక కూతురు. కానీ తర్వాత వివాహం నుంచి విముక్తం అయ్యి స్నేహితులతో స్వేచ్ఛాజీవితం గడిపాడు. తల్లి దూరమవడం మొదలు తన జీవితంలోని అపసవ్యతలన్నింటి కారణంగా, జీవితాంతం దేవుడి మీద అవిశ్వాసిగా ఉన్న మామ్‌ తన ఆత్మకథాత్మక నవలను చివరి దశలో చదువుకున్నా కన్నీళ్లు కార్చకుండా పూర్తిచేసేవాడు కాదు. ఇంకేది కలిపినా డిజైన్‌ పాడవుతుందని తెలిసినప్పుడు ఆర్టిస్ట్‌ ఇక దాన్ని వదిలేసినట్టుగా, తాను రచయితగా సంతృప్తికర దశలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలించాలని మామ్‌ ఆశపడ్డాడు. అన్నింటి విషయంలో జరిగినట్టుగానే ప్రకృతికి ఆయన విషయంలో వేరే లెక్ఖుంది. కోరుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత, అన్ని వృద్ధాప్యపు సమస్యలతో పాటు 91 ఏళ్ల నిండుతనం కూడా ఇచ్చిగానీ ఆయన్ని సాగనంపలేదు.


5-2-24

Friday, January 19, 2024

గంగరాజం బిడ్డ పుస్తకంపై పద్మజ సూరపరాజు గారి స్పందన


(గంగరాజం బిడ్డ పుస్తకంపై పద్మజ సూరపరాజు గారు తన అభిప్రాయాన్ని జనవరి 3న తన ఫేస్‌బుక్‌ వాల్‌ మీద పోస్ట్‌ చేశారు. దాన్నే ఇక్కడ కాపీ చేస్తున్నా.)

 

గంగరాజం బిడ్డ - పూడూరి రాజిరెడ్డి

"ఈ వగలాడులు ఎందుకు వశం చేసుకోవాలి? ఎందుకు పశ్చాత్తాపానికి గురి చేయాలి?‘‘
వీటికి ముందువాక్యంలోనే ‘‘ఎందుకింత ఇమోషనల్ గా డిపెండ్ అవుతారు వీళ్ళు?‘‘ అంటూ ప్రశ్నరూపంలో పై ప్రశ్నలకు జవాబు!
‘‘ఎంత అనుభవించినా ఇంకా మిగిలిపోయే స్త్రీ శరీరం‘‘
ఈ కొన్ని వాక్యాలనే కాదు, ఈ ప్రస్తుత పుస్తకానికి క్రితం ఈ రచయిత కలం నుంచి వచ్చిన ఆత్మకథనాత్మక రచనలూ, ఇంకొన్ని వేరే కథలూ చదివిన వారికి ఇతని wonderment at woman కాస్త జాస్తిగానే amusing గా తోస్తుంది.
తనతో క్షణం సేపు, గుడికి ఒక ప్రదక్షిణ చేసినంతసేపు, ఆకాశం పంచుకున్నందుకా లేక ఈ ఆకాశం కింద ఎక్కడకు వెళ్ళినా తనతో ఆ నేలలను ఎప్పుడూ సమంగా పంచుకుంటున్నందుకా స్త్రీకి అంత ఆకర్షణ!?
కానీ ఈ ముచ్చట ఎక్కడినుంచో పనిగట్టుకుని రాదు, తీర్మానంగా కొన్ని specific స్త్రీ పురుష సంబంధాల గురించిన కథలైనందు వల్ల రాదు. ఆరాధనీయమైన ప్రేమకథలైనందువల్ల రాదు. ఎక్కడా, పెద్ద మోతాదుల సంఘర్షణలలోనో పుట్టిన ఉలికిపాటు వాక్యాలూ కావివి.
దినసరి చాయ్ రోటీల వలెనే, మరీ మాట్లాడితే ఊపిరి తీసుకోవడం వలెనే ఈ observations.
"ఒక స్త్రీ కలిగించగలిగే ఆవేశము, ఆమె మీద నాకు ఏ అధికారమూ లేదన్న వాస్తవమూ ఏకకాలంలో ఆశనిరాశల మధ్య ఊగించాయి" ఎంత మంది మగవాళ్ళు ఎవరూ కాదనలేని ఈ పురుష సత్యాన్ని ఒప్పుకుంటారు!
అన్ని బలహీనతలలోకి బలమైనది స్త్రీ అందం పట్ల ఆకర్షణ. అది ఉండదనటం ఎంత అబద్ధమో, దానికి చలించి వెంటపడం అంత అధమం.
మరో మగ వ్యథ!
పదో యేట నుంచే అస్తిత్వ భయం, తనకు నిరూపణకు వచ్చిందాకా తన పురుషాస్తిత్వ ఆందోళనం!
దీన్ని వ్రాతల్లో నమోదు చేయడమూ అంత తేలికైన పనేమీ కాదు.
ఏ కల్పిత పాత్ర వెనకనో నుంచోకుండా తనను సాంతం చదివేసుకున్న వ్రాతలు ఈ రచయితవి.
కానీ, ఈ సంచలనాలను నీళ్ళమీద గులకరాయి చేసే వలయాలను చూస్తున్నట్లు ఒడ్డున ఉండి చూసినప్పటి ముచ్చట్లు ఇవి. స్థితప్రజ్ఞత వంటి పెద్ద మాటలు పరిచయం అయిందాకా అతనికే తెలీదు అది తనకు కాస్తో కూస్తో ముందునుంచే ఉందని.
కాబట్టే ఇలా అనుకోగలడు, ఏం సంబంధం లేకపోయినా ఆ సౌందర్యస్వరూపాలతో ఒక ఉమ్మడితనమేదో తనకు ఉండగలిగితే బావుండునని.
అది ఇతనికి కేవలం అనుకోవడంలో ఆగిపోలేదు.
సౌందర్యాన్ని ఎంత నిశితంగా గమనిస్తాడో ఈ రచయిత తన శ్వాసను అంత నిమగ్నతతో చూస్తాడు, కళ్ళు మూసుకుని.
"మెడిటేషన్" ఈ పుస్తకంలో అత్యుత్తమ రచన. బోలెడంత హాస్యం, లిప్తపాటులో ఎగిరిపోయి ఎక్కడెక్కడో తిరిగి, తిరిగి వచ్చి ముక్కు కొనమీద వాలే మనసు తాలూకు అల్లరి కబుర్లు, తర్వాత కావలసినంత సద్విచారం, సత్యమైన అనుభవం!
ప్రాణికి నేర్చుకోకుండా అబ్బే మొదటి విద్య శ్వాసించడం. ఆ అనులోమ విలోమ శ్వాసలను ఎఱుకతో గమనించడం అంతిమ అధ్యయనం .
ఈ రెండింటి మధ్య చేసేవి చూసేవి నేర్చేవి కోటి విద్యలు. కొన్ని పొట్ట కూటికి అయితే కొన్ని కంటికి భోజనం.
మెడిటేషన్ లో 'రియల్ బ్లిస్' దొరికితే చాలా !?
ఎంత సేపు?!
చిన్న పిట్టొకటి వచ్చి పచ్చికాయ కొరికిన వాసన మరింతగా అనుభవానికి వస్తేనే ఈ తోటలో మనిషొక యోగి.
భోగి.
ధ్యానం నేర్పిన గురువు చేసిందల్లా, ధ్యానించటం అనే మానవ సహజ లక్షణానికి తనను మేల్కొలపటమే.
ఈ సంకలనంలోని కథలు కుదిపేస్తాయి, మీకూ తెలుసుకదా ఇవన్నీ అని నిలదీస్తాయి.
'ఎడ్డి', 'కొండ' కథలు కదిలిస్తాయి.
అన్నీ చదవవలసిన కథలే.
రచయిత స్టైల్ ఎవరూ అనుకరించలేనిది,
అతని పరిశీలనలు, వాటికి స్పందనలు, వ్యక్తీకరణలు అతనివే సాంతం అయుండటమే అందుకు కారణము.
Cover design, cover art ముచ్చటగా ఉన్నాయి.

(3-1-2024)