Tuesday, March 16, 2021

నేనెలా రాస్తాను?

ఒకటేదైనా రాయడానికి మనల్ని ఏది ట్రిగ్గర్‌ చేస్తుందో అది మ్యాజిక్‌. ఏడేళ్ల క్రితం కినిగె మ్యాగజైన్‌లో నబొకోవ్‌ రచనా పద్ధతి అన్న వ్యాసం చదువుతూ ఉండగా, అందులో పెన్సిళ్లు, రబ్బర్ల ప్రస్తావన వచ్చింది. మిగిలిన అంశాలేవీ నాకు పట్టలేదు. కానీ భౌతికమైన, అత్యంత అల్పమైన వివరణ అయిన పెన్సిళ్లు, రబ్బర్ల ప్రస్తావన నన్ను లోపలెక్కడో కదిలించింది. అంతే! నేను చదువుతున్నది పక్కనపెట్టి, ఇది దాదాపుగా రాసేశాను. అంటే, రాయడం గురించి నా లోపల ఉన్న ఆలోచనలు అన్నింటినీ ఖాళీ చేసుకున్నాను. తర్వాత నబొకోవ్‌ వ్యాసం చదవడం పూర్తి చేసి,  తీరిగ్గా నాది దిద్దుకున్నాను. ఆజన్మంలో అనుబంధంగా ఇచ్చిన ఈ వ్యాసాన్ని పుస్తకం విడుదలైన సందర్భంగా ఈమాట తిరిగి ప్రచురించింది.

నేనెలా రాస్తాను? లేదా, నా రాతకు సంబంధించిన కొన్ని విషయాలు 

Saturday, March 13, 2021

రైతు బజార్‌ Rythu Bazaar

 మీరు ఎప్పుడైనా ఒక రైతుబజార్‌కు వెళ్లారా? ఇరువైపులా రాశుల్లా పోసివున్న కూరగాయల్లో రత్నాలను దర్శించారా? కొత్తిమీర వాసన ముక్కుకు ఎలా తగులుతుంది? టమోటాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా లేత ఆనిగెపుకాయను చూసినప్పుడు దాన్ని చేతుల్లోకి తీసుకోబుద్ధయిందా? దాన్ని గిచ్చకుండా ఉండటానికి వేళ్లను తమాయించుకున్నారా?   రైతుబజార్‌ అంటే నగరానికి వచ్చిన పల్లెటూరు. కుప్పపోసిన వ్యవసాయ క్షేత్రం. గమనించండి, ఇంట్లో తాజా కూరగాయలు ఉన్నప్పుడు వంట కూడా ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది. రైతుబజార్‌లో కూరగాయలు కొన్న, చూసిన అనుభవాలు ఈ రియాలిటీ చెక్‌లో. #RealityCheck #రియాలిటీచెక్‌ #పూడూరిరాజిరెడ్డి

రైతుబజార్ అనుభవం

Tuesday, March 2, 2021

Aajanmam Welcome Video ఆజన్మం పుస్తక ఆవిష్కరణ









ఫిబ్రవరి 14, 2021 రోజు ఊళ్లో మా ఇంట్లో జరిగిన ఆజన్మం ఆవిష్కరణ దృశ్యాలు

ఫొటోల్లో బాపు, పెద్దబాపు, అమ్మ, అత్తమ్మలు, చెల్లె, బావ, నా భార్య, పిల్లలు ఉన్నారు.

----------------------------------------------------------------


(28 ఫిబ్రవరి 2021 నాటి ఎఫ్బీ పోస్టు)

ఎటూ కోరుకున్నదే కాబట్టి పుస్తకం అచ్చుదాకా అయితే వస్తుంది. తీరా అది వచ్చేశాక చేయాల్సిన క్రతువులు కొంత చీదర పుట్టిస్తాయి. అందులో ఆవిష్కరణ ఒకటి. మధుపంకు సభ జరపలేదు. పలక–పెన్సిల్‌కూ జరపలేదు. రియాలిటీ చెక్‌ అప్పుడు మీరట్లా తెనాలి వస్తే చాలన్నారు; కాబట్టి వెళ్లొచ్చాను. చింతకింది మల్లయ్య ముచ్చటప్పుడు స్టేజీ మీదికి రాకపోయినా ఫర్లేదని అలాగే కథ నడిపించారు. కానీ ఆజన్మంకు ఏదైనా చేయాల్సిన ‘బరువు’ నామీదే పడింది. దానికి సంబంధించిన ఆలోచన తెగడం లేదు. జూమ్‌ మీటింగ్‌ ఎందుకో వద్దనుకున్నాం. ఫిజికల్‌ మీటింగ్‌ అంటే ఒక తతంగం. దానికి ప్రత్యామ్నాయంగా ఈ వీడియో బైట్ల ఆలోచన ఇచ్చాడు అజయ్‌. అయితే ఇది పుస్తకాన్ని విడుదల చేస్తూ, అంతకుముందే మనం వాళ్ల చేతికిచ్చిన పుస్తకాన్ని వక్తలు చదివొచ్చి మాట్లాడటం లాంటిది కాదు. ఆ రచయిత రైటింగుతో వాళ్లకున్న ఎటాచ్మెంట్‌ ఏమిటో చెప్పడం. కొంత ‘బ్రెయిన్‌ స్టార్మింగ్‌’ తర్వాత దీనికి నేను సంసిద్ధుడనయ్యాను.

ఇంకొక విశేషం ఏమిటంటే– నేను ఆ ఆదివారం ఊరికి వెళ్లాల్సి వచ్చింది. పుస్తకాలేమో ప్రెస్సువాళ్లు తరువాతి వారం ఇస్తామన్నారు. ఊరికి వెళ్లేప్పుడు ఒకట్రెండు కాపీలు పట్టుకెళ్తే బాగుంటుంది కదా అని శనివారానికి ఏమైనా ఇమ్మంటే ఒప్పుకున్నారు. ఒక కాపీ చేతికిచ్చి, పట్టుకుపోవడానికి వీలుగా మిగతావి ప్యాక్‌ చేశారు. ఊరికి వెళ్లేముందు అందులోంచి రెండు కాపీలు తీద్దామని అనుకున్నది కూడా, దాన్ని ఓపెన్‌ చేయడంలో పిల్లలకు ఒక సంబరం ఉంటుంది కదా అని అలాగే ఉంచేశాను. నేను వెళ్లేసరికి మల్లన్న బోనాలని మా చెల్లె వాళ్లు, అత్తమ్మలు ఊరికి వచ్చి ఉన్నారు. ఇక అప్పటికప్పుడు పిల్లలు ప్యాకెట్‌ ఓపెన్‌ చేయడం అనేదే బహుశా పుస్తక ఆవిష్కరణ సభనేమో అన్న తలంపు వచ్చింది.

అట్లా నా తేల్చుకోలేనితనం అటు పుస్తకావిష్కరణా జరిగేట్టు చేసింది; ఇటు సమాంతరంగా ఈ ఆలోచన కూడా నడుస్తున్నది కాబట్టి వీడియో బైట్లూ వచ్చేశాయి. డబుల్‌ సెలబ్రేషన్‌! ఇందులో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పను. కానీ అందరికీ ❤

Aajanmam Welcome Video

Saturday, February 27, 2021

'సంఘటనలన్నీ ఆలోచనల ఘర్షణలే'



26 ఫిబ్రవరి 2021 రోజు మేడి చైతన్య రాసిన fb పోస్ట్. ఫొటో క్రెడిట్ కూడా తనదే. 
అయినా ట్యాగ్ చేయకపోయినా తెలియడానికి ఎంతసేపు పడుతుంది చైతన్యా:-)
-------------------------------------------


'ఆజన్మం' రాజిరెడ్డి గురించి.

నాకు రాజిరెడ్డి గారి రచనతో పరిచయం యాదృచ్ఛికంగా జరిగింది. అంటే నేను నేనుగా వాటిని వెతుక్కొని చదవలేదు. అలా తారసపడింది, అంతే. 2014 మే కినిగె సంచికలో నాదొక కథ వచ్చింది. అప్పట్లో కథని ఎవరైనా చదివి ఏమైనా రెస్పాండ్ అయితే బాగుండనే బాల్యపు దశలో ఉండి, ప్రతిరోజూ, అంటే మే నెల ఎండలంతా కినిగె కామెంట్స్ సెక్షన్స్ లోనే గడిపా. అలా చూస్తుండగానే జూన్ నెల వచ్చింది, కొత్త సంచిక, కొత్త కథలు కలుపుకొని. అదిగో అలా ‘రెక్కల పెళ్ళాం’ చదివాను. అదివరకు సాహిత్యం ఎక్కువ చదవకపోవడం, అప్పటికి చదివిన కాస్త సాహిత్యం కూడా ‘ఇహ’ లోకపు రీతులకే కట్టుబడిన జీవితాల మీదే వెలుగు ప్రసరించడం వల్ల, ఈ కథ చదవగానే  విప్పుకున్న రెక్కలు, మొలుస్తున్న ఎర్రటి తురాయి మనసులో ముద్ర పడ్డాయి. అప్పటికి నాకు తురాయి అంటే అర్ధం తెలియదు. ఆ విధంగా ఆన్లైన్ లో ఆంధ్రభారతి డిక్షనరీ కూడా ఈ కథే పరిచయం చేసింది. 

నిజం చెప్పాలంటే నేను రాజిరెడ్డి గారి సాహిత్యం చదివింది మొన్నటివరకు చాలా అంటే చాలా తక్కువ. నేను రియాలిటీ చెక్ చదివింది లేదు. అసలు ఆ పుస్తకం ముట్టింది లేదు. ఇంకా మధుపం, పలక-పెన్సిల్, చింతకింది మల్లయ్య ముచ్చట పుస్తకాలు అరువు తెచ్చుకున్నా, ఇష్టంగా ఆసాంతం ఏ పుస్తకం చదవలేకపొయ్యా. బహుశా ‘ఇలా ఉంటేనే సాహిత్యం నాకు నచ్చుతుంది’ అనే గీత గీసుకొని ఉండటం వల్ల, నాకు ఇష్టమైన సాహిత్యం పరిధి సహజంగా చిన్నదయింది. కానీ, ‘గంగరాజం బిడ్డ’ చదివిన తర్వాత, ఆయన రచనలు అన్ని రోజులు చదవకపోవడం వల్ల నేనేదో కోల్పోయానేమో అని అనిపించినా, అదేంటో నా పూర్తి గ్రహింపులోకి రాలేదు. ఆయన్నీ పూర్తిగా చదవాలనే కాంక్ష అయితే మొదలయింది ఆ కథ నుండే. కానీ, ఎప్పుడూ ఏదోక ఆటంకం. అనవసరపు పనులతో తీరికలేని తనం. అప్పుడే మళ్లీ ‘ఆటా సభల్లో నా  ప్రసంగం (డిసెంబర్ 14, 2019)’ అని ఒక బ్లాగ్ లింక్ నాకు 2020 మొదటిరోజే  ఎదురయితే చదివాను.

ఆ కొత్త సంవత్సరం రోజు ఆయన ప్రసంగంలో ఉన్న మూడు విషయాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి- ఒకటి ఆయన సాహిత్యం వైపు రావడానికి వెల్లడించిన కారణం, రెండు రాయడం పట్ల ఆయనకున్న దృక్పథం, మూడు జీవితాన్ని శుభ్రం చేసుకోవడానికి రాతని ఒక సాధనంగా ఎంచుకోవడం.

ఈ మూడు విషయాలు నా పఠనా ప్రపంచంలో ఒద్దికగా మోహరించి ఆయన మిగతా రచనలన్నీ చదివించేలా చేశాయి. ఇప్పుడు ‘ఆజన్మం’ అని చెప్పుకుంటున్న రాతల్లో మునుపటి కథల్లో కనపడని ఒక తత్త్వం ఉందేమోననిపిస్తుంది నాకు. ఆ తత్త్వానికి కారణం, ఈ రాతల్లో ఆయనకే పరిమితమితమైన చూపుతో లోకాన్ని చూసి, లోపలికి గ్రహించి, ఆ గ్రహింపును నిశితంగా పరిశీలన చేసి, దానిమీద ఒక స్థిరమైన అభిప్రాయం రావడానికి లోపల కొంత నలిగి, తీరా ఒక నిర్ణయానికి వచ్చేశాక దాని ధర్మం చెడకుండా బయటకు ఎలా చెప్పాలో అని ఒక వందసార్లు దానిని లోపల మననం చేసుకున్నాక, నిర్మమత్వంతో ఒక మాట రాస్తారు. అయన మెదడు గూటి దాటి ఒక మాట బయటకు రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. దీనికి మనం‘రాజిరెడ్డి తత్త్వం’ అనే పేరు ఒకటి పెట్టుకుందాం. ఈ వైవిధ్య గుణమే ఇందులో ఉన్న రాతల్ని, ఆయన రాసిన మిగతా రచనల ప్లేన్ లో కాకుండా, మరొకటేదో భిన్నమైన యూనివర్స్ లో నుండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి. ఆ వేరొక లోకం కూడా స్వతహాగా తనంతట తానుగా తెలుసుకున్న విలువల చుట్టే కట్టుబడి ఉంటుంది. 

ఆయన రాతల్లో కనిపించే ముఖ్యలక్షణం- ఎంచుకున్న అనుభవాల్లోంచి గ్రహించిన సత్యాలు రాయడం, జీవితం పట్ల ఉన్న నిబద్ధత, నిజాయితీని అక్షరాలవైపు ప్రసరించడం, ఆ రచనలతో కొంచెమైనా జీవితాన్ని శుభ్రపరచుకోవాలనే ఆయన ఆశ. అంటే సుదీర్ఘమైన అనంత కాలరేఖ మీద వేసిన జీవితపు తప్పటడుగులను, రాతల్లో మరొకసారి అనుభవించి, జీవికి అంటుకుపోయిన మలినాలను కొద్దికొద్దిగా శుభ్రం చేసుకోవడమే తన ముందున్న కర్తవ్యం. ఈ ప్రాసెస్ లో తనని తాను కొత్తగా మళ్ళీ పరిచయం చేసుకోవడం, అనుభవాలను అనుభావాల్లాగే గుర్తు చేసుకోవడం పరిపాటి (అంటే తనదైనది ఏదీ ఆ అనుభవాలకు జోడించకుండా, వాటిని యథాలాపముగా పరిశీలన చెయ్యడం). అందుకేనేమో 'ఆయన బతికేదంతా, ఆయన జార్చుకున్న క్షణాల్లోనే', గతంలోనే. ఆ గత కాల స్పృహతో ప్రస్తుతాన్ని జాగ్రత్తగా జీవించాలనుకుంటారు.

ఇలా కన్ఫెషన్ ఎలిమెంట్ ఉన్న రచనల్లో, వెలుగు ప్రసరించిన నిజాలకుండే విలువ కంటే దాచేయబడిన సత్యాలకు శక్తి ఎక్కువ. అలా అని దాచేయబడినవన్నీ సంపూర్ణ సత్యాలని, అక్షరాల్లో పొందుపరిచనవన్నీ పాకిక్షమైనవని కొట్టిపారేయలేము. జీవితం పట్ల ఉండే నిబద్ధతతో తమను తాము నిశితంగా పరిశీలన చేసే ఇటువంటి రచనల్లో, జీవిత సారానికి సంబందించిన అమూర్త రూపమేదో ఎదురుపడుతుంది. కానీ, అలా జరగాలంటే దాచుకోడానికి వీలుండి కూడా, మనసొప్పక, ఇతరులతో సహజంగా పంచుకోలేని కొన్ని వైయక్తిక జీవిత అనుభవాలెన్నో నిజాయితీగా పరీక్షకు పెట్టాల్సిందే. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఇదిగో ఇలాంటివన్నీ- “బయటికి చెప్పినవీ చెప్పలేకపోయి­నవీ లోపల ఉన్నవీ లోలోపల దాక్కున్నవీ అంతరాంతరాళాల్లో రక్తంలో ఉన్నవాటిని వేరుచేయడానికి శ్రమపడాల్సినవీ….   తప్పులు ఒప్పులు కన్ఫెషన్లు కోరికలు ఇబ్బందులు హిడెన్‌ ఎజెండాలు ఓపెన్‌ ఆదర్శాలు...”. అసలు నిజ్జంగా ఒక మనిషి తన మనసులోనున్న ఆలోచనలు, ఏరుకున్న జీవిత అనుభవాలు, చేసిన తప్పులు, ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుకు వచ్చే గతం తాలూకా చెత్త పనులు, ఇవన్నీ రచనల్లో వ్యక్తపరచగలడా? ఉన్నదున్నట్టు, జరిగింది జరిగినట్టు ఒక fact లా, ఏ conceptual ఫ్రేమ్ తాలూకా భావాలని/వాదాలని వాటికి జోడించకుండా, నిర్భీతితో వాటినన్నింటినీ తన రచనల్లో చెప్పుకోగలడా? అది కొంత అసాధ్యమేమో! అందుకే ఆయనే రాతకు పరిధిని కూడా ఆయనే సూచించుకున్నారు. లోపలున్న భావాలూ అక్షరాలలో నింపినప్పుడు, వాటికుండే సహజ గుణమేదో పాక్షికంగా వడలి పోతుందేమోనని అభిప్రాయపడ్డారు. అందుకే ఒక చోట ఇలా రాస్తారు- “అనుకుంటాంగానీ, నిజంగా మనిషి మనసులో ఉన్నవన్నీ రాయలేం. ఇలాంటి నా లోపలి విషయాలు ఇంకా వెయ్యి ఉన్నాయేమో, అనిపిస్తోంది. ఇంకొకటి చెప్పాలి. నిజంగా రాయలేమా అంటే, ఒక క్షణంలో మనకు కలిగిన భావాన్ని వాక్యంలోకి తర్జుమా చేస్తే అది సంపూర్ణ సత్యం కావాలని లేదు. అది ఆ క్షణానికి సత్యమే. కానీ ఎప్పటికీ నిలిచే సత్యం కాకపోవచ్చు.” అందుకేనేమో నేను చెప్పుకోవాల్సినవన్నీ రాయలేకపోయానని, ‘పూర్తి స్వచ్ఛంగా’ గా ఉండలేకపోయానని బాధపడతారు ఆయన.

రాజిరెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన రాయడం/సాహిత్యం వైపు రావడానికి ప్రధానంగా పనిచేసిన కారణం ‘ఈగో’ అని చెప్పారు. అయితే ఆ ‘ఈగో’ అంటే ఏంటి? ఆయన రచనల్ని ఎరుకలో ఉంచుకొని, ఏ సెన్స్ లో ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు? ఆయన చెప్పిన ‘ఈగో’కి బహుశా ఇలా ఒక సమాధానం మనం చెప్పుకోవచ్చు, ఒక రకంగా తనకు సంబంధించిన వైయక్తిక సత్యాలే తప్ప, సామూహిక సత్యాలని అలానే ఉమ్మడితనాల్ని అంగీకరించని తన గోడే ఈ రాతలంతా. అయితే శైశవదశలో చాలామందిలాగే రచనకి, జీవితానికి ఏ మాత్రం లంకె లేని రాతలు రాసి అబ్బురపడ్డారు. ఒకానొక రోజు ‘ఏమీ తెలియకుండా, అనుభవంలోంచి చీల్చుకుని రాకుండా ఒక్క వాక్యం కూడా రాయొద్దన్న ఇంగితం’ కలిగి, ఇంటెనకున్న జామచెట్టు సాక్షిగా పాత రాజిరెడ్డి కాలిపోయారు. అయన రచనలు కాకుండా ‘రాజిరెడ్డి కాలిపోయారని’ ఎందుకన్నానంటే, ఆయన ఇక ముందు నుండి రాసిందంతా ఆయన గురించే. ఇదే మాటను ఇదిగో ఒక చోట ఇలా అంటారు-’లోకం గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. నా గురించి రాసుకోగలిగేది నేను ఒక్కడినే కదా!’. ఒకొక్కసారి నాకేమనిపిస్తుందంటే ఆయన రాతల్లో జరిగినట్టుగా చెప్పే చాలా సంఘటనలు, నాకు మటుకు ఆయన మనస్సులో జరిగిన ఆలోచనల ఘర్షణల్లాగానే అనిపిస్తాయి. అవి మేటర్స్ అఫ్ ఫాక్ట్స్ కాదు కేవలం possibilities నేమో! ఇలా possibilities గురించి మాట్లాడటం వల్ల ఆయన ఒక్కరు కాదేమో అనిపిస్తుంది. రాజిరెడ్డి గారు నా అనుమానానికి వంత పాడుతూ ఇదిగో ఇలా అన్నారు ఒకచోట “నేనెప్పుడూ ఒకణ్ని కాదు, ఇద్దరం.” బహుశా అందుకేనేమో “మంచీ మర్యాదా” లో రమేశ్‌గాడు, “ప్రాణవాయువు” లో హరిగాడు తన కవల సోదరుడన్నా, అదేంటో నాకు ఈ రెండూ కూడా రాజిరెడ్డి గారి స్వీయానుభవాలే అనిపిస్తాయి. ఇలా అనిపించిడానికి కారణం, facts కి, possibilities కి మధ్య నుండే సన్నని గీత ఆయన రాతల్లో చెరిగిపోతుందనుకుంటాను.  

ఇలా లోపల నలిగిపోవడం, చిన్న చిన్న విషయాలకు ఎందుకు అంత బుర్ర పాడుచేసుకోవడం ఎందుకంటే, ‘చెప్పాలని ఒక దుగ్ధ. ఇంకా ము­ఖ్యంగా ఇవన్నీ చెప్పేస్తే ఏర్పడే ఖాళీతనం ఇష్టం’ అని చెప్తారు. ఇంత ఘర్షణ పడితే తప్ప శాంతి రాదనీ ఆయన నమ్మకం. అందుకే ఆయన అంటారు “నాతో నేను శాంతి పొందడం ఒక్కటే ఈ జీవితకాలం నేను చేస్తున్న సాధన.”

చివరిగా ఒక మాట- అయితే మొన్న మెహెర్ భాయ్ ఒక మాట చెప్పారు- “Your search for a suitable form of art may well end in finding a better version of yourself.” ఈ మాట బాగుంది. కానీ, రాజిరెడ్డి గారి విషయంలో నాకేమనిపిస్తుందంటే suitable form కోసం ఆయన అదే పనిగా ఎప్పుడు వెతుక్కోలేదేమో. ఈ ever changing world లో, ఒకొక్క phase లో, ఆయన అనుభవములోకి వచ్చిన మానవ సంబంధాల గాఢతని, అప్పుడు అందుబాటులో ఉన్న form లోకి ఒంపుకున్నారేమో. మనిషి మారుతున్న కొద్దీ పాత forms లలో ఆయన మాటలు ఇమడక, ఆ forms కి యెడంగా వస్తూ, ఇదిగో ఇలా ఈ ‘ఆజన్మం’ సమయానికి అయన మానసిక నిర్మాణానికి తగ్గట్టుగా అచ్చంగా సరిపడే శిల్పం తారసపడింది అనుకుంటా. అందుకేనేమో వీటికి అంత అందమూ, శాశ్వతంగా నిలిచిపొయ్యే గుణమూ ఉన్నాయని నా గట్టి నమ్మకం.

ఇకపోతే రియాలిటీ చెక్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. ఆజన్మం కి సంబంధించిన కొన్ని రాతలు ఆన్లైన్లో దొరుకపుచ్చుకొని, చదివి, రాసిన నోట్ ఇది. పుస్తకం మొత్తం చదవాలి, మళ్ళీ, మళ్లీ.  

‘కాంటెంపరరీ తెలుగు రచయితలలో నీకు ఇష్టమైన రచయిత ఎవరు?’ అని ఎవరు నన్ను అడిగినా తడుముకోకుండా వెంటనే చెప్పే సమాధానం మెహెర్ భాయ్ అని. అయితే ఆ లిస్ట్ లో ఇప్పుడు ‘అజన్మం’ రాసిన రాజిరెడ్డి గారు చేరారు. ఇంకో విధంగా చెప్పాలంటే రాజిరెడ్డి అనే మనిషే నచ్చాడు. ఎందుకంటే ఈ ఆజన్మంకి సంబందించినవరకు రాత, మనిషి వేరు కాదు.

PS- నేను రాసేవాటి గురించి నాకుండే ఒకే ఒక్క అభిప్రాయం- am I making any sense at all? అని. అందుకే ధైర్యం చేసి ఆయన్ని ట్యాగ్ చేయలేకపోతున్న 😕

-మేడి చైతన్య

Wednesday, February 24, 2021

ఎంతో ఎదురుచూసిన పుస్తకం



ఫొటోల్లో అజయ్ ప్రసాద్, పూడూరి రాజిరెడ్డి, మెహెర్ ఉన్నారు.
మబ్బుల 5 గంటల చలిలో ఇరానీ హోటల్లో కలవాలన్నది అజయ్ ఐడియా.
--------------------------------------------------------------------------------

 

(19 ఫిబ్రవరి 2021 రోజు facebookలో మెహెర్ రాసిన పోస్టు)

రాజిరెడ్డి ‘ఆజన్మం’ ఇవాళే చేతికొచ్చింది. ఈమధ్య కాలంలో ఇంతగా ఎదురుచూసిన పుస్తకం లేదు. ఈమధ్య అనేముంది, నేను రాయటం మొదలుపెట్టాకా ఎవరి పుస్తకం కోసమూ ఇంతగా ఎదురుచూడలేదు. అలాగని ఇందులోనివేవీ ఇంతకుముందు చదవలేదని కాదు. చాలా పీసెస్ అవి వెబ్ మేగజైన్లలో పబ్లిష్ కాకముందే చదివాను. అలాగని నా స్నేహితుడి రచన కాబట్టీ కాదు ఈ ఎదురుచూపు. అలా అనుకుంటే రాజిరెడ్డి మిగతా పుస్తకాల కోసం నేనేం ఇంతలా ఎదురుచూడలేదు, ఇలా పోస్టులూ పెట్టలేదు. నా కంటెంపరరీ రైటింగులో నన్ను బాగా ఆకట్టుకున్న ఏకైక వర్క్ కాబట్టి, దీని విలువ ఎక్కువమంది గుర్తించటమా ఎవరూ గుర్తించకపోవటమా అన్నదాన్నిబట్టి తెలుగు సాహిత్య చవిటిమాగాణాల మీద నాతో నేను వేసుకున్న పందేల ఫలితం తేలుతుంది కాబట్టి- దీని కోసం ఎదురు చూశాను.

ఈ పుస్తకంలోని రచనలు ‘ఆజన్మం’ పేరుతో 2013లో సాక్షిలో ఆదివారం సంచికలో శీర్షికగా మొదలయ్యాయి. అది మొదలైన మూడో/ నాలుగో వారానికే నేను ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టాను (https://bit.ly/3ptphCs). ఆ వారం శీర్షికలో ‘ఫిక్షన్’, ‘నాన్ ఫిక్షన్’ల మధ్య తేడాపై రాజిరెడ్డి చేసిన తీర్మానాన్ని నెగేట్ చేస్తూ ఆ పోస్టు పెట్టాను. అయితే ఆ పోస్టులో రాజిరెడ్డితో విభేదించటంతోపాటు, నా తోటి రచయిత మొదలుపెట్టిన ఒక కొత్త ప్రయాణాన్ని గుర్తించిన కుతూహలం కూడా ఉంది. ఆ పోస్టు చివర్లోని వాక్యాలివి:
‘‘“నేను” వైపు చూసుకోవటంలో రెండు రకాలున్నాయి. [రచయిత] తనని తాను మనుషుల్లో ప్రత్యేకతగా చూసుకోవటం ఒకటి. తనని తాను మనిషికి ప్రతినిధిగా చూసుకోవటం ఒకటి. ఈ రెంటి మధ్యా గీత చాలా పల్చన. మొదటి రకం కేవలం narcissism. రెండోది, ఒక శాస్త్రీయమైన కుతూహలం. ఈ ఫలానా గెలాక్సీలో, ఫలానా సౌరకుటుంబంలో, మూడో గ్రహమైన భూమ్మీద పుడుతూ జీవిస్తూ చివరికి చచ్చే ఈ మనిషి అనే జీవిని పరిశీలించాలంటే... రచయితకు అతి దగ్గరగా అందుబాటులో ఉన్న స్పెసిమన్ తానే. కాబట్టి మొత్తం మానవాళికి ప్రాతినిధ్యం వహించగలిగే ఈ స్పెసిమన్ ని శ్రద్ధగా చూస్తాడు, తన పరిశీలనల్ని నిర్మమత్వంతో నమోదు చేస్తాడు.... ప్రక్రియల్ని నిరాకరించే దిలాసా రాజిరెడ్డిలో ఉంది (I hope it’s not his job as a journalist that’s making it compulsory for him to resort to these ingenious inventions). ప్రక్రియల మధ్య గీతలున్నాయని మర్చిపోగలిగేంత తన్మయత్వంలో కూడా పడిపోతేనో....’’
అంతకుముందు వచ్చిన రాజిరెడ్డి పుస్తకాలు ‘మధుపం’, ‘రియాల్టీ చెక్’లలో నాకు ఒక రచయితా, జర్నలిస్టూ కలగాపులంగంగా కలిసి కనపడ్డారు. ‘ఆజన్మం’తోనే రాజిరెడ్డి జర్నలిస్టును పూర్తిగా వెనక వదిలిపెట్టి ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. అది గమనించినందుకే నాకు ఆ కుతూహలం. ఈ ఏడేళ్ళలో వాటిని చదువుతూ వచ్చిన సందర్భాలన్నీ ఒక ఎక్సయిట్మెంట్. వీటిలో ఇండివిడ్యువల్ పీసెస్ ఏమైనా ఒక్కోచోట నిరాశ పరిచినా, తన మానసిక నిర్మాణానికి అచ్చంగా సరిపోయే శిల్పాన్ని కనుక్కోవటంలో ఆయన చేసిన ప్రయాణం నాకు ఎప్పుడూ గొప్పగానే అనిపించింది. ఇది తెలుగులో ఇంతకుముందు లేని శిల్పం అనను. అయితే ఇంతకుముందు ఈ తోవలో వచ్చినవేవీ, ఇలా అయితే లేవు. ఈ రచనల తీరుని బట్టి ఇది సహజమే కావొచ్చు. మన రచనా శిల్పాన్ని మన మానసిక నిర్మాణంవైపుకు దగ్గరగా జరిపేకొద్దీ ఈ వైవిధ్యం, అద్వితీయత వస్తాయి. ఆ తోవలో ఒంటరిగా సాగే ధైర్యం లేనప్పుడూ, ఆ నిశితమైన అన్వేషణ లేనప్పుడూ ఇప్పటి మిగతా కంటెంపరరీ రైటింగ్ మల్లే ప్రతి రచనా ఇంకో రచనకి నకల్లాగ, ఏ ఇండివిడ్యువాలిటీ లేకుండా, బాగా ఏడ్చి పౌడరు పూసుకున్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఆ రచనలకి సమాజం కోసం రాస్తున్న యుటిలిటేరియన్ కోణం ఒకటి ఆపాదించి సంతృప్తి పడతారు రచయితలు. మానవానుభవాన్ని అక్షరాల్లోకి తీసుకురావటం చేతకానప్పుడు, అది ఒక norm గాక exception అయి మిగిలినప్పుడు, అది కంటపడినా conceptual binaries లో కూరుకున్న మెదడుకి దాని విలువ అర్థం కానప్పుడు... ఇక ఏం చేయగలరు పాపం! ఇక ఇదొక గుంపులాగ మారుతుంది. రాజిరెడ్డి లాంటి రచయితల గురించి మాట్లాడటానికి వీళ్ల దగ్గర ‘వాక్యం బాగుంటుంది’, ‘వచనం బాగుంటుంది’ లాంటి డొల్లపుచ్చు విశేషణాలు తప్ప ఏమీ దొరకవు. ఎందుకంటే వాళ్ళకి ఈ రచనల్లో సామాజిక చలన సూత్రాలు లేవు, రాజిరెడ్డి విప్లవ ప్రసవ వేదనలెక్కడా పడలేదు, ఏ ఉద్యమానికీ ఎడమ భుజం అరువిచ్చిన పాపాన పోలేదు. కానీ అలాంటివాటి గురించి.. I am constitutionally incapable of giving a fuck కాబట్టి, ఏం చెప్పలేను.
‘సాక్షి’లో ‘ఆజన్మం’ శీర్షిక మొదలైన కొన్ని వారాలకే ఆగిపోయింది. తర్వాత కొన్ని పీసెస్ కినిగె వెబ్ మేగజైన్లో నేనే పబ్లిష్ చేశాను. అప్పట్లోనే మా మధ్య స్నేహం కూడా మొదలైంది. దాంతో మేం రాసుకున్నవన్నీ బైటికి పంపే ముందు ఒకరికొకరు పంపుకోవటం మొదలైంది. అలా ఇవన్నీ బైట పబ్లిష్ కాకముందే చదవగలిగాను. ‘ఆజన్మం’ స్కోప్ ని చాలామంది కంటే బాగా అర్థం చేసుకోగలిగాను. చాలామంది కంటే ముందే అర్థం చేసుకోగలిగాను. అందుకే గత ఏడాది ‘ఈ దశాబ్దం ధ్రువతారలు’ అన్న పోస్టులో ఇలా రాశాను:
‘‘రాజిరెడ్డి తలకు ఎత్తుకున్న ఈ ప్రాజెక్టుని ఎవరైనా దగ్గరగా గమనించారో లేదో తెలీదుగానీ, ఇది 'సాక్షి'లో మొదలై 'కినిగె పత్రిక'లో కొన్నాళ్లు నడిచి ప్రస్తుతం 'ఈమాట'కు చేరే దాకా నేను ఒక్కటీ వదలకుండా చదువుతూ వచ్చాను. ...బహుశా 'ఆజన్మం' పుస్తకంగా వచ్చాకనే దాని బృహత్ ఆకాంక్షా, అందులోని తెగువా అందరికీ అర్థమవుతాయేమో. ఫిక్షన్ అనే వ్యవస్థతో రాజిరెడ్డి పెట్టుకున్న తగువు తెలుగులో ఇదివరకూ ఎవ్వరూ పెట్టుకుని ఉండరు. దీనికి మధ్యలో అడపాదడపా బై ప్రొడక్టుల్లాగా వచ్చిన కథలు కూడా ఉన్నాయి. వాటినెందుకు కథలన్నాడో, వీటినెందుకు కథలనలేదో, ఈ రేఖామాత్రమైన బేధాన్ని పసిగట్టి అర్థం చేసుకుంటేనే ఫిక్షన్ తో రాజిరెడ్డికి ఉన్న తగువేమిటో అర్థమవుతుంది, కొంతలో కొంత రాజిరెడ్డీ అర్థమవుతాడు.’’
ఏడేళ్ళ క్రితం సాక్షిలో ‘ఆజన్మం’ అన్న పేరు చూడగానే దొంగిలించేయాలన్నంత ముచ్చటేసింది. ఆ తర్వాత ఆ పేరు మీద రాజిరెడ్డి రాసినవి చూశాక, దొంగిలించినా అంత గొప్పగా ఆ పేరు మీద ఏం రాయలేనులే అనిపించింది. ‘ఆజన్మం’ అని పేరుపెట్టి నలభై ఏళ్ళకే ఈ పుస్తకం తెచ్చేశాడు రాజిరెడ్డి. ఇప్పుడు ఆజన్మానికి అతీతంగా ఏం చేస్తాడన్నది మరో కుతూహలం.
Congratulations
mate! Go