Sunday, December 31, 2023

బ్లాగునామ సంవత్సరం

బ్లాగునామ సంవత్సరం


ఈ బ్లాగును ఇంకా ఎవరు చదువుతున్నారో, ఎందుకు చదువుతున్నారో తెలీదుగానీ– నాకైతే ఈ బ్లాగు మీద ఆసక్తిలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. నేను కూడా ‘అందరిలాగే’ ఎఫ్బీ వైపు మళ్లినప్పటికీ, ఏదైనా వెనక్కి తిరిగి చదువుకోవాలంటే అక్కడ కష్టం; స్క్రోలింగ్‌ చేస్తూనే పోవాలి. మనం రాసినవి కొంత పద్ధతిగా కూర్చుకునే వీలు బ్లాగులోనే ఉంటుంది. ఇది కూడా కొత్తగా నా ఆసక్తి మళ్లీ పెరగడానికి కారణం. 

ఈ బ్లాగును 2007లో మొదలుపెట్టాను. కొన్ని సంవత్సరాలు ఎక్కువే పోస్టులు పెట్టాను. ఆరు సంవత్సరాల్లో 30, అంతకుమించి పోస్టులున్నాయి. 2014లో అత్యధికం(38). ప్రారంభ సంవత్సరం వదిలేస్తే, నాలుగేళ్లలో పది, అంతకుతక్కువ పోస్టులున్నాయి. 2020లో అత్యల్పం (4). బాగా పోస్టులు ఉన్న సంవత్సరాల్లో కూడా, నెలల వారీగా చూస్తే కొన్ని నెలల్లో ఏమీలేవు. ఈ ఒక్క 2023లో మాత్రమే ప్రతి నెలా ఏదో ఒకటి పోస్టు చేస్తూ వచ్చానని గమనించాను. అందుకే ఇదొక అదనపు పోస్టు. ఎఫ్బీలోవి కొన్ని రీపోస్టు చేసినప్పటికీ, అత్యధిక పోస్టులు(45+) కూడా ఈ సంవత్సరమే అవుతున్నాయి. అందుకే ఇది బ్లాగునామ సంవత్సరం.



 

Friday, December 29, 2023

‘గంగరాజం బిడ్డ’ కోసం...





(Posted by Aju Publications on FB on 16th December 2023)

మేమెంతగానో అభిమానించే రచయిత పూడూరి రాజిరెడ్డి కథల పుస్తకం 'గంగరాజం బిడ్డ'ను మీ ముందుకు తీసుకొస్తున్నాం.
రాజిరెడ్డి 2017-2023 కాలంలో రాసిన పన్నెండు కథలున్నాయీ పుస్తకంలో. అజు పబ్లికేషన్స్ నుంచి వస్తున్న పదకొండో పుస్తకం ఇది.
'గంగరాజం బిడ్డ' మీ అందరి మెప్పు పొందుతుందని నమ్ముతున్నాం 🤗
Order your copy from amazon:
Gangaraajam Bidda | Collection of Short Stories by Poodoori Rajireddy.


--
--


(Posted by V.Mallikarjun, my friend and one of the publishers, on his FB wall on 19th December 2023)


నేను ఇంజినీరింగ్ చదివే రోజుల్లో ఆదివారమొస్తే పొద్దున్నే చౌరస్తాకి వెళ్ళి సాక్షి పత్రిక కొనుక్కొని పరుగులాంటి నడకతో ఇంటికొచ్చి ముందు ఫన్‌డే మ్యాగజైన్ తీసి అందులో వచ్చే 'రియాలిటీ చెక్' చదివితేగానీ నా రోజు మొదలయ్యేది కాదు. అంత ఇష్టంగా ఆ కాలమ్ చదువుకునేవాడిని.
అప్పట్నించి రాజిరెడ్డి అభిమానిని నేను. రాజిరెడ్డితోనే నవ్వుతూ అంటూ ఉంటాను - ఈ ప్రపంచంలో నాకంటే పెద్ద అభిమాని మీకెవ్వరూ ఉండరని.
నేను సాక్షి ఫన్‌డేలో ఉద్యోగానికి చేరినప్పుడు రాజిరెడ్డిని వెతుక్కుంటూ వెళ్ళి, "రాజిరెడ్డి అంటే ఎంత పెద్ద మనిషో అనుకున్న" అంటే, "ఏందబ్బా, బట్టతల, పొట్టతో ఉండింట అని ఎట్లనుకున్నవ్?" అని నవ్వాడు. ఆ తర్వాత పక్క పక్క సీట్లలో కూర్చొని పనిచేసే రోజులకి కూడా వచ్చా. 'చింతకింది మల్లయ్య ముచ్చట' ఫస్ట్ కాపీలు వచ్చినప్పుడు నేనక్కడే ఉన్నా. నాకొక కాపీ ఇస్తూ - 'నా సరికొత్త స్నేహితుడు మల్లిక్‌కి' అని రాశాడు. నేనెంత సంబరపడ్డానో.
అదిగో అక్కడ్నించి ఇప్పుడు ఆయన రెండో కథాసంపుటి 'గంగరాజం బిడ్డ'ను మా అజు పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించే వరకొచ్చా.
This is one of the best moments. Rajireddy sir, thank you for giving us this opportunity to publish your book. 🤗
గంగరాజం బిడ్డ కథల్లో కొత్త రాజిరెడ్డి కనిపిస్తాడు. నేనైతే రాజిరెడ్డి 2.0 అని పిలుస్తుంటాను. పబ్లిషర్‌గా పుస్తకం గురించి ఎక్కువేం మాట్లాడలేను, మీరూ చదివి చెప్పండి. మాట్లాడుకుందాం.
మీ అందరికీ గంగరాజం బిడ్డ నచ్చుతుందని నమ్ముతున్నా.
Order your copy from amazon:


Wednesday, December 27, 2023

ముస్లిం రచయితలకు, మేధావులకు ఒక ప్రశ్న

(ఇటీవల జరిగిన ‘రైటర్స్‌ మీట్‌’ సమావేశంలో ‘ముస్లిం రచయితలకు ఒక ప్రశ్న’ అన్న అంశం మీద నేను మాట్లాడాల్సి ఉండింది. కానీ అది సజావుగా సాగలేదు. అక్కడ మాట్లాడాలనుకున్నది ఇక్కడ పోస్టు చేస్తున్నా.)

ఒక గ్రీకు తత్వవేత్త ఏమంటాడంటే– మనిషికి గనక గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండివుంటే, దేవుడికి కూడా అదే గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండేవి అని! అంటే మనిషి తన రూపంలోనే దేవుడిని సృజించుకున్నాడు. మనుషుల దేవుడు మనిషి రూపంలో ఉంటాడు; చీమలకు కూడా దేవుడు ఉంటే చీమల ఆకారంలో ఉంటాడు కావొచ్చు; ఎవరికి తెలుసు?
మనకు తెలిసినంతలో అన్ని మతాల దేవుళ్లకు, లేదా వాళ్లు భక్తిగా కొలిచేవాళ్లకు ఒక ఆకారం ఉంది. ఒక ఇస్లాంలోనే దేవుడికి రూపం లేదు అనేది ఒక శాసనంలా ఉంది. దేవుడు నిరాకారుడు, సర్వాంతర్యామి అని హిందూమతపు పుస్తకాల్లో కూడా ఉంటుంది. కానీ హిందూమతం అనేది స్థిరపడినది కాదు; పరిణామం చెందుతూనే ఉండేది కాబట్టి, దాన్ని ఇదీ అని వ్యాఖ్యానించడం కష్టం. ప్రస్తుత రూపంలో ఉన్న హిందూమతంలో అయితే దేవుళ్లకు కచ్చితమైన ఆకృతి ఉంది. ఇస్లాంలో మాత్రం విగ్రహారాధన లేదు. ఒక హయ్యర్‌ పవర్‌ను రూపరహితంగా ఆరాధించడం అనేది కూడా నాకు మంచి భావనగానే కనబడుతుంది.
మతం అనేది మన జీవితాల్లో చాలా ప్రధానమైనది అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నామకరణం, వివాహం నుంచి, మన జీవితంలో ఉన్న అన్ని వ్యవహారాలు మతం ఆధారంగానే నడుస్తాయి; ఆఖరికి అంత్యక్రియలతో సహా. మతం లేదా దేవుడితో ముడిపడి మనకు ఇంజనీరింగ్‌ వర్ధిల్లింది. కళలు వర్ధిల్లినై. సాహిత్యం వచ్చింది. ఈస్తటిక్‌ సెన్స్‌ వృద్ధి అయింది. మతంతో ముడిపడిన నిర్మాణాల కోసం మనుషులు తమ జీవితాలను ధారపోశారు. ఉదా: సిస్టీన్‌ చాపెల్, ఖురాన్‌ కాలిగ్రఫీ, దేవాలయాల్లోని శిల్పాలు. హ్యూమన్‌ ఎండ్యూరన్స్‌ అనేదానికి మతం ఒక పరీక్ష. మనకు మనం మతానికి ఎంతగా ఇచ్చేసుకున్నామంటే– ఇంక దేవుడు లేడు అంటే ఒప్పుకోవడానికి ఏమాత్రం సిద్ధం లేనంతగా.
మతం, దేవుడు రెండింటినీ సందర్భాన్ని బట్టి ఒకే అర్థంలో వాడుతున్నాను. ఒక్కో మతంలో దానివైన సమస్యలున్నాయి, దానివైన వివక్షలున్నాయి, దానివైన సానుకూలతలు ఉన్నాయి, దానివైన అతిశయాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ప్రపంచంలోని అన్ని మతాలు వేరు, ఇస్లాం వేరు అని చెప్పాలన్నది నా ఉద్దేశం. దేవుడిని రూపరహితంగా ఆరాధించడం ఒక్కటే ఇస్లాంను వేరుగా ఉంచడం లేదు. ‘మతేతరుల’ గురించి ఇస్లాం నొక్కి మాట్లాడుతుంది(ఈ రెండు భావనలు జుడాయిజం లోనూ ఉన్నాయి). అత్యాధునిక మతం కావడం వల్ల కూడా ఇది జరిగివుండొచ్చు.
ముందుగా ఒకటి చెప్తాను. మనలో ద్వేషం ఎప్పుడూ ఒక ఊహా దయ్యం ఆధారంగా పనిచేస్తుంది. చాలావరకు మన లక్ష్యిత గ్రూపు ఏమిటో తెలియదు కాబట్టే, ఏ అడ్డు లేకుండా వ్యాఖ్యానాలు చేయగలుగుతాం. కానీ దీని ప్రతిఫలనం ఫలానా వాళ్ల మీద ఉంటుంది అని కచ్చితంగా తెలిసినప్పుడు అది మనకు ఒక నియంత్రణ రేఖలా పనిచేస్తుంది. అందుకే నేను నా ముస్లిం స్నేహితులను తలుచుకుంటూ దీన్ని మొదలుపెడుతున్నాను. ఇది ఏ ఒకరిద్దరు ముస్లిం రచయితల గురించో కాదు. వీరి సాకుగా నాకున్న కన్సెర్న్స్‌ను ముస్లిం కమ్యూనిటీలోని ఆలోచనాపరుల ముందు పెట్టాలన్నది నా ఆలోచన.
ఇంకొకటి కూడా చెప్పాలి. నాకు మొన్నమొన్నటిదాకా హనుమంతుడి వాహనం ఒంటె అని తెలియదు. చిన్నప్పటినుంచీ హనుమంతుడు ఎగురుకుంటూ వెళ్తాడనే తెలుసు. పుట్టుకతో హిందువును అయినప్పటికీ ఇంత చిన్న విషయం కూడా నాకు తెలీదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మతాల మీద, మత సాహిత్యం మీద నేనేమీ అథారిటీ కాదు అని ఒప్పుకోవడానికి. ఇంక నేను మాట్లాడుతున్నది పొరుగు మతం గురించి కాబట్టి, నా అవగాహన పరిమితుల మీద నాకు స్పృహ ఉంది.
‘అల్లాహ్‌ దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ’ మానవజాతి అల్లాహ్‌కు ఇచ్చిన ప్రమాణం(అహ్‌ దుల్లహి) అంటుంది దివ్య ఖుర్‌ఆ¯Œ . ఈ ఒక్క వాక్యం వల్ల ప్రపంచంలోని 600 కోట్ల మంది ఇచ్చిన మాటను తప్పినవాళ్లు అవుతున్నారు. ఇంకా ఖురాన్‌ ఏం చెప్తున్నదంటే– అల్లాహ్‌కు సాటిగా ఇంకో దేవుడిని నిలబెట్టడం క్షమించలేని మహాపాపం (శిర్క్‌) అంటుంది. ఇస్లాం మొత్తం పునాది ఈ భావనల మీద ఆధారపడి ఉంది. ఈ లెక్కన ఎంతమంది ఈ మహాపాపం చేస్తున్నట్టు? ఎందుకంటే ప్రతి మనిషీ ఏదో ఒక మతంతో అసోసియేట్‌ అయివున్నాడు కదా. అతడు ఆదివారం చర్చీకి పోతుండవచ్చు, గురువారం సాయిబాబా గుడికి పోతుండవచ్చు, కట్ట మైసమ్మకు కొబ్బరికాయ కొట్టివుండొచ్చు. వీళ్లందరూ మహాపాపులే. వాళ్లను ఏం చేయాలి? ధర్మయుద్ధం. ఇదిగో ఇక్కడుంది సమస్యంతా! దీనివల్ల ఇతర మతాల వారి ఉనికి ప్రమాదంలో పడుతోంది. నాస్తికులు అయినా మినహాయింపు లేదు.
ముస్లింలలో తార్కిక ఆలోచనలు కలిగినవాళ్లు లేరా? మనుషులు సామరస్యంతో సహజీవనం చేయడమే అత్యుత్తమ విలువ అని వారికి తెలియదా? అత్యధికులు పరమత సహనం ఉన్నవాళ్లు కాబట్టే, శాంతియుతంగా బతకగలుగుతున్నాం. కానీ ఎవరైనా ఈ భావనలను మానవాళికి వ్యతిరేకంగా అన్వయించుకునే వీలు లేదా?
ఇదిలా ఉంటే, మన రచయితలు ముస్లింవాద సాహిత్యం అంటుంటారు. అలాంటప్పుడు ఈ భావనల మీద వీరి వైఖరి ఏమిటి? ఇవన్నీ తెలిసే ముస్లింవాదమా? మెజారిటీవాద రాజకీయాల్లో మా బతుకుల గురించి మేము చెప్పుకుంటున్నాం అని వాళ్లు అనొచ్చు. కానీ ప్రపంచ లెక్కల్లోకి పోతే ఈ వాదం తేలిపోతుంది. హిందుత్వ రాజకీయాలను శత్రువుగా భావిస్తున్నప్పుడు, ఇస్లాం ఛాందసం కూడా ఇంకొకరికి శత్రువుగా ఉంటుందన్న అవగాహన వీరికి ఉందా? ఎందరెందరినో మీరెటువైపు అని నిలదీసిన నేల కదా ఇది! ఇప్పుడు నేను అడుగుతున్నాను. ముస్లిం రచయితలు, మేధావుల్లారా, మీరెటు వైపు? మనం ఏ మతంలో ఉన్నా అందరమూ కలిసిమెలిసి ఉండాలన్న అవగాహన వైపా? లేక, మా మతమే మిన్న, తక్కినవి సున్నా అని మీరు కూడా మనసులో అనుకుంటున్నారా? రెండోది మీ అభిప్రాయం అయితే, మీరు హిందుత్వ రాజకీయాలను ప్రశ్నించడంలో అర్థం లేదు. మీ అవగాహన మొదటిదే అయితే, మీ ఇస్లామేతర సహోదరుల కోసం మీరు ఏం చేస్తారు?
మతాలు తీవ్రరూపం దాలుస్తున్న కాలంలో ఉన్నాం. మనుషులు దేవుడి పేరుతో మృదువుగా కావాల్సింది పోయి, కఠినం అవుతున్నారు. ఎక్స్‌ట్రీమ్స్‌కు పోతున్నారు. మధ్యేమార్గం అనేది లేకుండా పోతోంది. ఎందుకంటే మతం అనేది ఆధ్యాత్మిక సాధన కోసం కాదు. అది ఒక రాజకీయం. దీనికి ఏ మతమూ మినహాయింపు కాదు. కానీ మనకు డిస్కోర్స్‌ ఎట్లా సెట్‌ అయివుందంటే, నిద్రలేస్తూ పాచిపళ్లతో కూడా హిందుత్వ అని తిట్టొచ్చు. కానీ స్నానం చేసి ఒళ్లంతా దగ్గరగా పెట్టుకుని కూడా ఇస్లాం ఛాందసం గురించి మాట్లాడకూడదు. దీనికి చాలావరకు మన వామపక్ష మేధావులు కారణం. ఎందుకంటే, మన దగ్గర ప్రతి చర్చనూ నడిపేదీ, ఏది ప్రగతిశీలమో, కాదో నిర్ణయించేదీ వాళ్లే. కానీ ఈ విషయంలో వాళ్లు ఉండాల్సినంత ఫెయిర్‌గా లేరని నా అభిప్రాయం. హిందుత్వ అని వామపక్షీయులు మాట్లాడకుండా ఏ దినపత్రిక అయినా ఏ ఒక్క రోజైనా ఉంటుందా? మరి ఇస్లాం ఛాందసం మీద వీళ్లు ఎంత మాట్లాడుతున్నారు? పైగా ఇలాంటి అంశం ఎత్తితే, అసలు విషయాన్ని పక్కనపెట్టి, స్టాంపు గుద్దడానికి ముందు సొరుగులోంచి ఇంక్‌ ప్యాడ్‌ తీస్తారని కూడా తెలుసు. ఇంత మాట్లాడిన తర్వాత, దీన్నొక హిందువు అభిప్రాయంగానే చూస్తారు కాబట్టి, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. డిగ్రీ అయ్యి, హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో, రామ్‌నగర్‌లోని నా రూమ్‌ నుంచి చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీకి వెళ్తుండేవాడిని. వేదం విన్న శూద్రుడి చెవుల్లో సీసం పోయాలన్న వాక్యం మొదటిసారి అక్కడే చదివాను. అది చదివినప్పటి ఒంటి కంపనం నాకు ఇంకా గుర్తుంది. ఇంతా చేస్తే ఇది నేను చదివింది, మనుధర్మం మీద వచ్చిన ఒక విమర్శా పుస్తకంలో. ఇదీ నేనంటున్నది! ఇలాంటి విమర్శ నేను ఎత్తిన అంశాల మీద కనీసంగా అయినా ఉన్నదా? మతం ఏదైనా సాటి మనిషితో ఆదరంగా ఉండాలన్నదే నా అభిమతం. మతం అని ఇక్కడ సందర్భవశాత్తూ వాడటమే గానీ, ప్రతి మనిషితోనూ వీలైనంత మంచిగా ఉండాలన్నది నా వ్యక్తిగత సంకల్పం, సాధన!

(Posted the same on my FB wall on 7th October, 2023)

Sunday, December 17, 2023

కొందరు రచయితల రెండో గొంతు

 



రెండో గొంతు

మనదైనది ఏదో వ్యక్తం చేయడానికి మనదైన భాష ఒకటి ఉండాలనుకుంటాం. కానీ భాష చిత్రమైంది. ఒక్కోసారి అనుకున్న మాట వెంటనే తట్టదు. ఇంకో సందర్భంలో ఆ ఒక్కమాటకు పది మాటలు కనబడి గందరగోళ పరుస్తాయి. రెండు సందర్భాల్లోనూ మనిషి మూగ కావడం గమనార్హం. ఇదంతా భాష సమస్య కాదేమో; మన లోపలి భావానికి అనుగుణంగా భాష మనల్ని ఇలా ఒంటరిగా మాట తోడులేకుండా నిలబెట్టే స్థితిని కల్పిస్తుందేమో. భావం అనేది చాలా సంక్లిష్టమైంది కదా మరి! దాన్ని భాషలోకి తేవాలని అనుకున్నప్పుడు, ఎంతో తెలుసు అనుకున్నది కూడా, ఏ కొసను అందుకోవాలో తెలియక తికమక పరుస్తుంది. ఒక తేనెతుట్టె ఏదో లోపల కదిలినట్టయి గందరగోళం తలెత్తుతుంది. అనుకున్న వ్యక్తీకరణ గాడి తప్పుతుంది. భావాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష అయితే కావాలో అదే అవరోధంగా మారడం తమాషా కదా! మరి దానికేమిటి దారి? సంజ్ఞలైతే పనికిరావు. కాబట్టి మళ్లీ భాషే దిక్కు. పోనీ, ఇంకేదో భాష అయితే? అందులో మనకు అంతగా ప్రవేశం లేనిదైతే? ఒక్కోమాటా వాక్యంగా పేర్చుకునేదైతే? నిజంగా అలా రాయడం సాధ్యమా? ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న కొందరు రచయితలు ‘తమది కాని’ భాషలో సాహిత్యం సృజించారు.

1978లో బేస్‌బాల్‌ గేమ్‌ చూస్తున్నప్పుడు, ఆటగాడు బంతిని బలంగా కొట్టిన బ్యాట్‌ శబ్దం టోక్యో శివార్లలోని ‘జింగు’ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించిన ఒకానొక క్షణాన ఇరవైల్లో ఉన్న హరూకీ మురకామీకి ఉన్నట్టుండి తానూ రాయగలనని అనిపించింది. ఆ క్షణం ఆయనలో ఏదో ఎల్లలు లేని సృజనావేశం తన్నుకొచ్చింది. దాన్ని అలాగే పోనీయకుండా కొన్ని నెలలు శ్రమించి, రాత్రుళ్లు కుస్తీపట్టి జపనీస్‌ భాషలో మొదటి నవల రాయడానికి ప్రయత్నించాడు. అంతా అయ్యాక చదివితే ఆయనకే నచ్చలేదు. దీనికి కారణం, తన మాతృభాషలో ‘పశువుల కొట్టంలో పశువులు క్రిక్కిరిసినట్టుగా’ ఆలోచనలు రొద పెట్టడమే. దీనివల్ల ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు. ‘ఒకరి భావాలను అలవోకగా ఒక క్రమంలో పెట్టడం గురించి మాట్లాడటం సులభమేగానీ, అలా చేయడం అంత సులభం కాదు. బొత్తిగా అప్పుడే రాయడం మొదలుపెట్టిన నాలాంటివాడికి అది మరింత కష్టం. కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి, నేను చేయాల్సివచ్చిన మొదటి పని నా రాతప్రతుల కుప్పను, ఫౌంటెన్‌ పెన్‌ను వదిలించుకోవడం. అవి నా ముందు ఉన్నంతసేపూ నేనేదో ‘సాహిత్యం’ లాంటిదాన్ని రాస్తున్నట్టనిపించింది. వాటి స్థానంలోకి నా పాత అలవెటీ టైప్‌రైటర్‌ను అల్మారా లోంచి తెచ్చాను. తర్వాత, ఒక ప్రయోగం లాగా, నా నవల ప్రారంభాన్ని ఇంగ్లీష్‌లో రాయాలని నిర్ణయించుకున్నాను. ఎటూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదనిపించింది?’ అంటూ మురకామీ తాను తన జపనీస్‌ను కాదని ఆంగ్లంలో రాయడానికి పూనుకోవాల్సి వచ్చిన నేపథ్యం చెబుతాడు. అయితే, ఆంగ్లం ఆయనకేమీ మంచినీళ్ల ప్రాయం కాదు. ఈ భాష పరిమితి వల్ల సంక్లిష్ట వాక్యాలు రాయడం కుదరదు. ఆ ఉన్న కొద్దిపాటి పదసంపద, వ్యాకరణాలనే ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ‘మై కిచెన్‌ టేబుల్‌ ఫిక్షన్‌’ ధోరణిగా వర్ణించే ఆయన రచనలు అలా మొదలయ్యాయి. ఈ ధోరణిలో వచ్చిన ‘హియర్‌ ద విండ్‌ సింగ్‌’ నవలిక మురకామీని అమాంతం పైకి ఎత్తేసింది.

కృత్యాదిలోనే మురకామీ అవస్థ పడ్డాడు. కానీ ఝుంపా లాహిరిది ఇంకో కథ. లండన్‌లో పుట్టి, అమెరికాలో పెరిగిన భారత(బాంగ్లా) సంతతి ఝుంపా ‘ఇంటర్‌ప్రిటర్‌ ఆఫ్‌ మాలడీస్‌’ నవలకు ‘పులిట్జర్‌’ గెలుచుకుంది. ‘నేమ్‌సేక్‌’తో మరింత పేరొచ్చింది. ఉన్నట్టుండి తన నలభై ఐదేళ్ల వయసులో ఇటాలియన్‌లో రాయాలని నిర్ణయించుకుంది. కొత్త భాషలో రాయడంలో ఒక స్వేచ్ఛ ఉంది, అంటారామె. ‘పర్ఫెక్టుగా ఉండనక్కరలేని స్వేచ్ఛ’. న్యూయార్క్‌లో కొన్ని ఇటాలియన్‌ పాఠాలు విన్న అనుభవం ఉంది. కానీ ఆ భాష కోసమే 2015లో ఆమె కుటుంబంతో సహా రోమ్‌కు వెళ్లి, కొన్నేళ్లు ఉండివచ్చింది. తర్వాత మూడు పుస్తకాలు ఇటాలియన్‌లో వెలువరించింది. తర్వాత అవి ఆంగ్లంలోకి వచ్చాయి. సహజంగానే ఇటాలియన్‌లో రాయడమేంటని చాలామందే ఆమెను ప్రశ్నించారు. ఒక్కొక్క పదం, వాక్యం ద్వారా వ్యక్తీకరణను కూడగట్టుకొని కొత్త లోకపు ద్వారంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందానంటుంది. పాత కొత్త ప్రపంచాల మధ్య అదొక సవాలు కూడా. ‘ఇటాలియన్‌ భాష నా జీవితాన్నేమీ మార్చలేదు; అది నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది; మరో అదనపు జీవితం’.

తన అసంబద్ధ రచన ‘వెయిటింగ్‌ ఫర్‌ గోడో’ ద్వారా ఖ్యాతినొందిన శామ్యూల్‌ బెకెట్‌ పుట్టుకతో ఐరిష్‌వాడు అయినప్పటికీ ఫ్రెంచ్‌ను తన రచనాభాషగా ఎంచుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణాలు సాధారణంగా రచయితలు కోరుకునే లక్షణాలకు పూర్తి విరుద్ధమైనవి. తన మాతృభాషకు దూరం కావడం అనేది, ఒక ముసుగును చించుకోవడంతో సమానంగా చూశాడు. ఫ్రెంచ్‌లో(పరాయి భాష) మాత్రమే ఒక శైలి లేకుండా రాయడం సాధ్యమవుతుందన్నాడు. అలాగైతేనే తనకు తగిన వనరులు లేకుండా పోతాయన్నాడు. అందువల్లేనేమో, ఆయన ప్రసిద్ధ ‘మినిమలిస్ట్‌’ రచయిత కాగలిగాడు.

వేర్వేరు కారణాల వల్ల తమ మాతృభాషలకు దూరమైన రచయితలు ఎందరో ఉన్నారు. పరిస్థితులు వారికి అలాంటి పరీక్ష పెట్టాయి. ఆ వేదన ఇక్కడ అప్రస్తుతం. కానీ భాష అనేదాన్ని ఒక అవరోధంగా పెట్టుకుని రాయాలనుకోవడం దానికదే ఒక సవాలు. ప్రాణవాయువును మరీ ఎక్కువగా పీల్చకుండా పొదుపుగా వాడుకుంటూ బతికే యోగసాధన లాంటిది అది.

Thursday, December 14, 2023

జాలం

 జాలం


వాళ్లూ మనలాగే ఉంటారు.
మనతోనే ఉన్నట్టుంటారు.
కానీ వాళ్లు శక్తిమంతులు.
వాళ్ల అవసరాలను ఎలాగైనా తీర్చుకోగలరు.
నీకూ నాకూ అది చేతకాదు.

నీ భావజాలం ఉన్నవాడు నీ మిత్రుడు కాదు.
నీ భావజాలం పంచుకోనివాడు నీ శత్రువు కాదు.
నీ భావజాలానికి దగ్గరగా ఉన్నంతమాత్రాన వాళ్ల జీవితం నువ్వు జీవించవు.
నీ భావజాలానికి దగ్గరగా లేనివాడు కూడా జీవితాంతం నీలాగే జీవిస్తుంటాడని నీకు ఎప్పటికీ తెలీదు.

Saturday, December 9, 2023

‘ఎడ్డి’ కథ ఎందుకు రాశానంటే...


ఆవిష్కరణ: ఎల్‌.ఆర్‌.స్వామి, కొప్పర్తి వెంకట రమణమూర్తి, కె.శివారెడ్డి, పాపినేని శివశంకర్, గంటేడ గౌరునాయుడు, నందిని సిధారెడ్డి, కన్నెగంటి చంద్ర, కె.ఎన్‌.మల్లీశ్వరి, వి.వి.రమణమూర్తి,చింతకింది శ్రీనివాసరావు




నందిని సిధారెడ్డి గారి నుంచి కథ–2022 కాపీలు స్వీకరిస్తూ...
Photo: Anil Atluri



కథానేపథ్యంలో– వక్త: మధురాంతకం నరేంద్ర.
ఎ.వి.రమణమూర్తి, బహుశా వేణుగోపాల్, ఎంఎస్‌కె కృష్ణజ్యోతి, పూడూరి రాజిరెడ్డి, వల్లూరి శాంతిప్రబోధ, పి.చిన్నయ్య, చరణ్‌ పరిమి, ఎం.రవీంద్ర బాబు, వేంపల్లె షరీఫ్‌



Thotlakonda



Rock Arch, Vizag Beach. Photo: Narukurthi Sridhar


చరణ్‌ పరిమి, పూడూరి రాజిరెడ్డి, కన్నెగంటి చంద్ర, మంజుల, కె.ఎన్‌.మల్లీశ్వరి, శాంతిప్రబోధ, మధురాంతకం నరేంద్ర, నరుకుర్తి శ్రీధర్‌



కథ–2022 ఆవిష్కరణలో నా ‘కథా నేపథ్యం’


విశాఖ పౌర గ్రంథాలయం, విశాఖపట్నం

డిసెంబర్‌ 3, 2023; ఆదివారం

(అవి నాలుగు మాటలైనా సరే, ఒక నోట్‌ రాసుకోకుండా నేను మాట్లాడలేను. కానీ అనుకున్న టైముకంటే ట్రెయిన్‌ మూడు గంటలు ఆలస్యంగా చేరింది. బస నుంచి వేదికకు పరుగెత్తినంత పనైన హడావుడిలో ‘కాగితం’ మర్చిపోయాను. గుర్తుచేసుకుంటూ మాట్లాడాను కాబట్టి, యధాతథంగా మాట్లాడలేదు. కానీ స్పిరిట్‌ అదే. అప్పటికప్పుడు కూడా కొంత కలిసింది. మళ్లీ రాస్తున్నప్పుడు కొంత పెరిగింది. అవన్నీ కలుపుకొన్న తర్వాత వచ్చిన తుదిరూపం ఇది. అక్కడ మాట్లాడినదానికీ, ఇక్కడ రాస్తున్నదానికీ తేడా ఏదైనా కనబడితే ఇదే ఫైనల్‌గా భావించాలి.)


‘ఎడ్డి’ కథ ఎందుకు రాశానంటే...

అందరికీ నమస్తే.

నాకు నేను ఒక పజిల్‌ విప్పుకోవడానికి ఈ కథ రాశాను. ఏమిటా పజిల్‌? అరే, ఒక మనిషి ఎట్లా తప్పిపోతుంది? ఆ తప్పిపోయే మూమెంట్‌ ఎలా వచ్చివుంటుంది?
ఇప్పుడంటే మా ఇంట్లో వ్యవసాయ పనులు తగ్గిపోయినాయి. మొత్తంగా వ్యవసాయానికి దూరమైనామని కాదు... నేను పెద్దయ్యి ఇంకో మార్గంలోకి రావడం ఒకటైతే, అసలు వ్యవసాయ పనులు అని మనం చెప్పుకొనేవి ఏవీ ఇప్పుడు లేవు. వరి కోతలు అయ్యాక బంతి కొట్టేవాళ్లం, కల్లాలు చేసేవాళ్లం. ఇప్పుడు ఆ పనులేవీ లేవు. అసలు మనుషులు చేతుల్తో వరి కోయడమే లేదు. ఏదో జరిగిపోయిందని నేను ఇక్కడ చెప్పడం లేదు. అది ఇక్కడ అప్రస్తుతం కూడా. నా చిన్నప్పుడు ఈ పనులు చేస్తున్నప్పుడు ముచ్చట్లు చెప్పుకోవడానికి బొచ్చెడు టైముండేది. మొత్తం టైమే. అప్పుడు మా బాపు ఏవేవో చెప్పేవాడు. అట్లా చెప్పిన ముచ్చట్లలో ఒకటి, ఒక ముసలామె, తిరుపతి యాత్రలకని పోయి, ప్రయాణంలో తప్పిపోయి, నాలుగేళ్ల తర్వాత ఇంటికి చేరడం. నాకు ఆ ముసలామె అట్లా గుర్తుండిపోయింది. ఆ చివరలో పట్టిన గతి తలుచుకుని కలుక్కుమనేది. కానీ ఆమె గురించి ఏదైనా రాద్దామనుకున్నప్పుడల్లా ఎట్లా తప్పిపోతుంది, నాకే నమ్మకం కలగట్లేదు, దీన్ని కన్విన్సింగ్‌గా చెప్పలేను అనిపించేది. మనుషులు తప్పిపోవడం గురించి ఎన్నో వార్తలు వింటూనే ఉంటాం. కానీ ఆ మూమెంట్‌ను సాహిత్యంలోకి ఎలా తేవాలి?
ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలిగే ఇంకేదో శక్తి మనకు కావాలి. అంటే, ఇది నిజమే అని ఒప్పుదల రావాలంటే అలాంటిది మన జీవితంలో కూడా జరగాలి. నా జీవితంలో కూడా నేను కొన్ని విలువైన క్షణాలను అట్లా జార్చుకున్నాను. అయ్యో అయ్యో అనుకుంటూ కూడా ఏమీ చెయ్యకుండా ఉండిపోవడం అది. పెద్ద పరిణామాలకు కారణమయ్యే విషయాలే అక్కర్లేదు; చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎర్రితనం చూపిస్తుంటాం. కనీసం నా వరకూ చూపించాను, దాని తర్వాత గింజుకున్నాను. చెప్పుకుంటే సిల్లీగా అనిపిస్తాయి గానీ ఆ క్షణానికి అవి నిజం. తర్వాత పడే వేదనం కూడా నిజం. ఆ ముసలావిడ తప్పిపోవడానికి ‘కారణమైనవాడి’, లేదా ఆమె తప్పిపోకుండా కాపాడగలిగేవాడి ఆ మొద్దుతనం, ఆ ఎడ్డితనం నాలోనూ ఉన్నాయి; అలా ఉండటం సాధ్యమే అనిపించాక కథ రాయగలిగాను. అంటే, ఆ మూమెంట్‌లోకి నేను వెళ్లగలిగాను. అసలు ఆమెను అట్లా గాలికి వదిలేసి, ఇంటికి నల్లమొఖంతో వచ్చిన వాడిని నేనేనేమో!
వాస్తవంలో జరిగిందని చెప్పిన కథను నేను కొంచెం మార్చాను. ముఖ్యంగా ‘సత్తయ్య’ పాత్ర. దానివల్ల మనకంటే ముందు తరాల సంబంధాలను అదనంగా చూపొచ్చు అనిపించింది. అయితే, స్థూలంగా విషయాన్ని మార్చే అధికారం నాకు లేదు. ముసలమ్మ తప్పిపోవడం వాస్తవం. సామాన్యుల జీవితం కూడా చరిత్రలో భాగం అనుకుంటే, ఆమె జీవితం కూడా ఒక చరిత్ర లాంటిదే. కాబట్టి దాన్ని మార్చలేను. ఆ తుది పర్యవసానానికి దారితీసిన సందర్భాన్ని ఎలా రాయగలనన్నదే నా సవాలు. అది కన్విన్సింగ్‌గా లేకపోతే అది నా అసమర్థత. ఇంకా, ఈ కథను రెండు రకాలుగా రాయొచ్చనుకున్నాను. మొదటి వెర్షన్‌లో అసలు నెరేటర్‌ లేడు. అప్పుడు కూడా కథ ఇప్పుడిచ్చే ఎఫెక్టే ఇస్తుందిగానీ, అందులోకి రాజిరెడ్డితనం ఏమీ రాదు. అందుకే నెరేటర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కథకు అదనపు డైమెన్షన్‌ను ఇవ్వగలిగానని అనుకుంటున్నాను. అలాగని నెరేటర్, రాజిరెడ్డి కాదు. రాజిరెడ్డి వేరు, రాజిరెడ్డితనం వేరు. నేను మొదట రాసిన వచనంలో(కథల్లో కాదు) రాజిరెడ్డిని ప్రవేశపెట్టడానికి ఉబలాటపడేవాడిని. అది అర్థం లేనిదని తెలుసుకున్న తర్వాత రాజిరెడ్డితనంలోకి వచ్చాను. కానీ ఇందులోనే మరింత రాజిరెడ్డి ఉంటాడు. అదే తమాషా!
రాజకీయ ఉద్యమాలకు ఈ కథ దన్ను ఇచ్చేదిగా ఉందని (కథానేపధ్యం నిర్వాహకుడు) ఎ.వి.రమణమూర్తి గారు అన్నారు. బహుశా ఈ కారణం వల్లే ఈ కథను ఈ సంకలనంలోకి తీసుకున్నారని నేను అనుకున్నాను. నిజానికి ఈ కథను ఫలానా ప్రయోజనం ఆశించి అయితే రాయలేదు. అసలు ఒక రచయిత తాను ఇందుకు రాశానని చెప్పగలడా? తాను అనుకున్నది మాత్రమే అందులోకి వస్తుందా? రచయిత అనుకున్నదానికి భిన్నంగా కూడా పాఠకులు తీసుకోవచ్చు. అందుకే రమణమూర్తి గారి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, ఈ కథ అంతిమ ప్రయోజనం ఇదీ అని నేను చెప్పలేను, అంటున్నా. ఒకవేళ ఒకటంటూ చెప్పాల్సి వస్తే, ఈ కథ రాయడంలో నా ఉద్దేశం, వ్యక్తిగతమే. అలాంటి ఒక ఎడ్డిమనిషి మన జీవితంలో కనబడితే వాడిని క్షమించొచ్చు అన్నంతవరకే నా ఊహ పోతోంది. క్షమ అనేది సామాజిక ఉద్యమాల కంటే మించినది అని నేను అనుకుంటున్నాను.
చివరగా ఒక మాట. ఇందాక ‘చరిత’ సుబ్బయ్య గారు పలకరించారు. నరసాపురం మీటింగ్‌లో(కథ–2018; అందులో నా ‘రెండో భాగం’ ఉంది.) నేను కొంచెం అల్లరి చేశాననీ, ఈసారి ఏం చేయబోతున్నాననీ నవ్వుతూ అడిగారు. కథల ఎంపికలో సంపాదకులు పెట్టుకున్న ‘సోకాల్డ్‌ అభ్యుదయ’ ప్రమాణాల వల్ల కొన్ని మంచి కథలు బయటే ఉండిపోతున్నాయని అప్పుడు అన్నాను. ఎంపిక పరమైన ఫిర్యాదులు అలాగే ఉన్నప్పటికీ ఈసారి అలాంటి అల్లరి ఏదీ చేయదలుచుకోలేదు. నేను కూడా కొంచెం పెద్దరికంతో అందరినీ క్షమించేయాలని అనుకుంటున్నాను. దానికి ఒక కారణం ఏమంటే– క్రమశిక్షణతో, పద్ధతిగా పనిచేసేవాళ్లంటే నాకు గౌరవం. పుస్తకం చివర వీళ్లిచ్చే ‘కథలు–కథకులు’ జాబితా ఒక్కటి చాలు వీళ్ల పనితీరును పట్టించడానికి. అందుకే నా కథను ఈ సంకలనంలోకి తీసుకున్న సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌ గార్లకు ధన్యవాదాలు. ‘2022లో మరికొన్ని మంచి కథలు’ జాబితాలో నా మరో కథ ‘ఎఱుక’ను కూడా ఇచ్చారు. దానికి కూడా థాంక్యూ. ఈ రెండు కథలూ మహమ్మద్‌ ఖదీర్‌బాబు గారు సంపాదకుడుగా వచ్చిన ‘కొత్త కథ–2022’, ‘తెలుగు పెద్ద కథలు’ పుస్తకాల్లో వచ్చాయి. ఆయనను కూడా ఇక్కడ తలుచుకుంటున్నా. ఈ సంకలనంలో చోటు చేసుకున్న సహ కథకులకు నా అభినందనలు.

థాంక్యూ.

--

పీఎస్‌1: ఒకరిని క్షమించడం, క్షమించే స్థితిలో ఉండటం కూడా అహంకారంలో భాగమే అని తర్వాత విడి సంభాషణల్లో చంద్ర కన్నెగంటి గారు అన్నారు. నాకు అది నచ్చింది.

పీఎస్‌2: మీటింగ్‌ జరిగింది ఒకేరోజు. నిజానికి, తర్వాతి రెండు రోజుల కోసమే అంతదూరం విశాఖ వెళ్లింది. ‘మిచౌంగ్‌’ తుపాను వల్ల అంతా కిందిమీదయ్యే పరిస్థితి వచ్చిందనే అనుకున్నాను. కానీ, వానయినా వరదయినా మిమ్మల్ని తిప్పే తీరుతాను అన్నట్టుగా నరుకుర్తి శ్రీధర్‌ గారు ఆ చినుకుల్లోనే బయల్దేరారు. రెండ్రోజులూ ఆయనే నాకు పెద్ద అండ. తగు మోతాదు వానతో ఈ పర్యటనకు ఒక భిన్న ఫీల్‌ కూడా వచ్చింది. అసలు కథంతా ఇక్కడుంది!

Friday, November 24, 2023

ఒక క్రియేటివ్‌ రైటింగ్‌ సెషన్‌


(ఓ ఏడాది క్రితం, వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో క్రియేటివ్‌ రైటింగ్‌ క్లాస్‌ తీసుకోవాలని పోపూరి సురేశ్‌బాబు గారు అడిగారు. ఆయన అక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా కథల గురించి చెప్పాలన్నారు. నాకు ఇట్లాంటిది కొత్త. పిల్లలకూ ఎంతమాత్రం ఆసక్తి ఉంటుందో తెలీదు. నాకు తోచింది చెప్తానన్నాను. నాతో పాటు అజయ్‌ ప్రసాద్‌ కూడా వచ్చాడు. ఇదే కార్యక్రమంలో కవిత్వం గురించి అనిల్‌ బత్తుల మాట్లాడాడు. ఇదొక భిన్న అనుభవం. వాళ్లకు మధ్యమధ్యలో కొన్ని కథలు చెప్తూ దీన్ని కొనసాగించాను. పాక్షికంగా దీన్ని ఒక ఇంటెరాక్టివ్‌ సెషన్‌గా ప్లాన్‌ చేసుకున్నాను కాబట్టి, ఇందులో గ్యాప్స్‌ ఉంటాయి. అయినా దీనికిదే ఇచ్చేది కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ పోస్ట్‌ చేస్తున్నా. చివర్లో కొంతభాగం మాత్రం కత్తిరించాను. ఇంతకుముందు చదవకపోయివుంటే, 
  ఇందులోని కథలు వెతుక్కుని చదువుకోవడం మీ ఎక్సర్‌సైజ్‌...  అన్నట్టూ,  ఎప్పుడూ చేయని పని చేసినందుకేమో, మేము బయటికి వచ్చీరాగానే జోరు వాన అందుకుంది.)







క్రియేటివ్‌ రైటింగ్‌ సెషన్‌

వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, హైదరాబాద్‌

 సెప్టెంబర్‌ 8, 2022

పూడూరి రాజిరెడ్డి


నాకు కొంచెం స్టేజ్‌ ఫియర్‌ ఉంది. నా వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుందోగానీ, దీనివల్ల నాకు ఒక ప్రాక్టీస్‌ సెషన్‌ అనుకోవచ్చు.


ఇక్కడికి రావడానికి నాకున్న అర్హత ఏమంటే– నేనొక మూణ్నాలుగు పుస్తకాలు రాసివున్నా. సాక్షి పేపర్లో సాహిత్యం పేజీని ఒక ఐదున్నరేళ్లు నడిపివున్నాను.


క్లుప్తంగా మీ పరిచయం: మీ పేరు– మీ ఊరు– మీ ట్రేడ్‌?


మీరు పుస్తకాలు చదువుతారా?

బాగా నచ్చిన పుస్తకాలేంటి?

మీకు తెలిసిన కొందరు రచయితల పేర్లు ఏంటి?

మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు?

డైరీ ఎవరైనా రాస్తారా?

కనీసం రోజూ న్యూస్‌ పేపర్స్‌ చదువుతారా?


మీరు దేనికీ సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోయినా నేను హేపీనే. ఎందుకో తెలుసా? ఈ మధ్య ఒక ఇట్లానే జరిగిన ఒక రైటింగ్‌ ప్రోగ్రామ్‌లో ఆ నిర్వాహకుడు అన్నారు: ప్రపంచంలో 99 శాతం మంది రాయరు. ఒక్క శాతం మందికి మాత్రమే రాయాలన్న ఆలోచన ఉంటుంది. రాస్తారో లేదో తర్వాత సంగతి. కానీ మీకు రాయాలన్న ఆలోచన వచ్చినందుకే మీరు ఆ ఒక్క శాతం బ్రాకెట్లోకి వచ్చేసినట్టు. అంటే క్రీమీ లేయర్‌ మీరు. అందుకనైనా మిమ్మల్ని మీరు అభినందించుకోవచ్చు.

((క్లాప్స్‌))


ముందుగా ఒక కథ చెప్పుకుందాం. తర్వాత కొంత బోర్‌ కొట్టిస్తా.


వడ్ల గింజలు

––––––––

ఒకటో కథ: వడ్ల గింజలు– శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

గడికి రెండు వడ్ల గింజలను పెంచుకుంటూ 64 గళ్ల వరకూ వెళ్లడం అనేది ప్లాట్‌.


రైటింగ్‌/ సాహిత్యం అంటే?

––––––––––––––––

అయితే రైటింగ్‌ అనేది ఏమిటి? (మొత్తంగా దీన్ని సాహిత్యం, లిటరేచర్‌...)


1. అయితే రైటింగ్‌ అనేది ఏమంటే– చాలా చిన్న ఏరియా. కానీ మనదైనది. సేక్రెడ్‌ స్పేస్‌. బ్యూటిఫుల్‌ స్పాట్‌.

ఒక ఇళ్లు చూడండి. ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్‌ నైపుణ్యం, దాని ఎత్తు, వైభవం... అన్నీ ఉండొచ్చు. కానీ ఒక చిన్న పూలమొక్క దాని ముందట నాటితే ఆ ఇళ్లు మొత్తానికి ఒక అందం వస్తుంది. ఆ ప్రక్రియ మొత్తం అర్థవంతం అవుతుంది, అదీ సాహిత్యం అంటే. అదీ సృజన.


2. ఇంకో రకంగా చెప్పాలంటే, సాహిత్యం అనేది ఒక ఎమోషన్‌. మనం ఒక చారిత్రక ప్రదేశానికి పోయామనుకుందాం. అక్కడ అద్భుతమైన నిర్మాణం కనబడుతుంది. ఒక ఫీలింగ్‌ వస్తుంది. దాన్ని ఎవరు ఎప్పుడు కట్టారో అక్కడ ఫలకాల మీద వివరాలు దొరకొచ్చు. కానీ ఆ కట్టే ప్రాసెస్‌లో జరిగిన మనుషుల అనుభవాలు ఏమిటి, ఆలోచనలు ఏమిటి, ఆ వివరాలు మనకు అక్కడ దొరకవు. వాటిని ఎవరైనా నమోదు చేస్తే అది సాహిత్యం అవుతుంది.

ఇదే కాలేజీ తీసుకోండి. ఇది ఫలానా సంవత్సరంలో ప్రారంభమైమంది, ఇక్కడ ఇంతమంది చదువుతున్నారు, ఈయీ విభాగాలున్నాయి, ఈయీ టైముల్లో బస్సులు వస్తాయి, అనే వివరాలు మనకు ఉపయోగపడతాయి. కానీ సాహిత్యం అనేది అంతకుమించి. ఆ సినిమాలో అంటాడు కదా... అట్లా అంతకుమించి. 

ఒక విద్యార్థి మొదటిరోజు ఈ కాలేజికి వచ్చినప్పుడు అతడికి ఎలాంటి ఫీలింగ్‌ కలిగింది, క్యాంటీన్లో అతడు ఏది ఇష్టంగా తింటాడు, ఫీజు కట్టడానికి అతడు ఎలాంటి ఘర్షణ అనుభవించాడు, ఈ చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలన్న మథనం అతడిలో ఎంత తీవ్రంగా ఉంది... ఇవన్నీ సాహిత్యం అవుతాయి. 

ఎవరో మనిషి గురించి ఇంకెవరో రాస్తే అది మనకెందుకు పనికొస్తుంది? మనకెందుకు నచ్చుతుంది?

ఎందుకంటే అందులో మనల్ని చూసుకుంటాం. అక్కడ వచ్చిన విద్యార్థి తొలిరోజు భయం లాంటిదే మనకూ ఉంటుంది. అతడికి ఈ కాలేజీలో ఏదో ఒకటి ప్రత్యేకంగా నచ్చినట్టు మనకు ఇంకేదో ఉంటుంది. అతడికి వాళ్ల నాన్నతోనో అమ్మతోనో ఉండే ఉద్వేగం లాంటిది మనకూ మన కుటుంబంతో ఉంటుంది. వివరాలు మారుతాయి. కానీ ఎమోషన్‌ అదే. అందువల్ల మనం కనెక్ట్‌ అవుతాం. అతడితో కలిసి మనం కూడా ప్రయాణిస్తాం.

సాహిత్యం అనేది హ్యూమన్‌ కండీషన్‌ను చెప్పేది.


ఎ డేస్‌ వెయిట్‌

–––––––––

ఎర్నెస్ట్‌ హెమింగ్వే. ఫారిన్‌హీట్‌కూ సెంటీగ్రేడ్‌కూ తేడా తెలియని పిల్లాడి కథ. 1933. ఫస్ట్‌ పెర్సన్‌ కథ. 102 డిగ్రీల ఫారిన్‌హీట్‌. 44 డిగ్రీల సెల్సియస్‌.


రైటింగ్‌ అనేదాన్ని నేర్పవచ్చా?

––––––––––––––––––

నా ఉద్దేశంలో అయితే నేర్పలేము. మరి మీరెందుకు వచ్చినట్టు అని ప్రశ్న వస్తుంది. కానీ నేర్పలేము అని చెప్పడానికైనా నేను రావాలి కదా:–)

వంట నేర్పొచ్చు. బట్టలు కుట్టడం నేర్పొచ్చు. ఏదైనా యంత్రాన్ని ఆపరేట్‌ చేయడం నేర్పొచ్చు. అవన్నీ స్కిల్స్‌. కానీ రైటింగ్‌ అనేది ఆర్ట్‌. ఏ ఆర్ట్‌ అయినా ఎవరికి వారే నేర్చుకోవాలి. ఆర్టిస్టు ఉన్నాడనుకుందాం. ఏ కలర్‌తో ఏది కలిపితే ఏ షేడ్‌ వస్తుంది అనే వివరం చెప్పొచ్చు. ఏ కాగితం వాడాలి అని చెప్పొచ్చు. కానీ బొమ్మ ఎలా గీయాలి అనేది మనమే సాధన చేయాలి. అట్లాగే రైటింగ్‌ కూడా.

అందుకే కొన్ని విషయాలు మాత్రం చెప్తాను.


సాహిత్యంలో ప్రక్రియలు: కథ

–––––––––––––––

ఇందులో ఎన్నో రకాల ప్రక్రియలున్నాయి. క£ý,, కవిత్వం, నవల, వ్యాసం, నాటకం. ఇవన్నీ కూడా మనం ఎంపిక చేసుకునే విషయం, దాని విస్తృతి, దాన్ని చెప్పాలనుకునే పద్ధతిని బట్టి మారుతాయి. కానీ అన్నీ కూడా మొత్తంగా సాహిత్యం కిందికే వస్తాయి.


కథ ఇక్కడ మనకు టాపిక్‌ కాబట్టి– ఏది కథ అవుతుంది?


మన జీవితంలోని ఒక అధ్యాయం కథ అవుతుంది.

ఒక పాయింట్‌ నుంచి ఇంకో పాయింట్‌కు చేసే ప్రయాణం కథ.

లేదా ఒక నియమిత టైమ్‌ పీరియడ్‌లో జరిగే వ్యవహారం. అంటే ఒక ఉదయం నుంచి ఒక సాయంత్రం వరకు. కొన్ని రోజుల్లో కూడా జరగొచ్చు. అది టాపిక్‌ను బట్టి ఉంటుంది.


అసలు ఏం రాయొచ్చు?

దానికి జవాబు ఏం రాయకూడదు? అండర్‌ ద స్కై ఏదైనా రాయొచ్చు. 


సినిమాల ఉదాహరణ అయితే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నా. ఎన్ని సినిమాలున్నాయో అన్ని రకాల కథలున్నాయి. ఇది వద్దు, ఇది రాయొద్దు అనేది ఏమీ ఉండదు. కానీ సినిమా అనేది నవల కిందకు వస్తుంది. ఎందుకంటే అందులో టైమ్‌ స్పాన్‌ ఎక్కువుంటుంది. పాత్రలు ఎక్కువుంటాయి. అదే కథలో తక్కువ పాత్రలు ఉంటాయి. తక్కువ టైములో అయిపోతుంది.


కథ ఎన్ని పేజీలుండొచ్చు? 

పది పేజీలు.

నాలుగు పేజీలు.

ఒక్క పేజీ.

ఒక్క పేరా.


అలాగని ఇదేమీ రూల్‌ కాదు. సాహిత్యంలో దేనికీ రూల్స్‌ ఉండవు. ఇలాగే చేయాలీ అని దేనికీ ఉండదు. ఇవన్నీ కూడా అందాజాగా చెప్పుకోవడానికే.


వంద పేజీలు కూడా ఉండొచ్చు. పాత కాలంలో అట్లా రాసేవాళ్లు. అప్పుడు నవల సైజు వెయ్యి పేజీలుండేది. కానీ ఇప్పుడు రెండొందల పేజీల్లో నవల అయిపోతుంది. జనాల చదివే ఓపికను బట్టి కూడా అది మారిపోతుంది. మీరు ఇప్పుడు వంద పేజీల కథ రాస్తా అంటే ఎవరూ వద్దనరు.


కథల్లో రకాలు

––––––––

హాస్య కథ. డ్రామా. ట్విస్ట్‌. క్రైమ్‌. పిల్లల కథ. జానపద కథ. సస్పెన్స్‌. బ్లాక్‌ హ్యూమర్‌. సెటైర్‌.


మీకు వివరాల కంటే కూడా ఇంకో కథ చెప్తా. 


ద లేడీ ఆర్‌ ద టైగర్‌

–––––––––––––

ద లేడీ ఆర్‌ ద టైగర్‌. రచయిత: ఫ్రాంక్‌ ఆర్‌.స్టాక్‌టన్‌. 1882. అమెరికన్‌ రైటర్‌.

బార్బారిక్‌ కింగ్‌. టూ కేజెస్‌. లేడీ. టైగర్‌. శిక్షలో భాగంగా లేడీని వివాహం చేసుకోవాలి. లేదా పులికి అర్పణం కావాలి. కూతురి ప్రేమికుడు. అందులో ఉన్న అమ్మాయి మీద యువరాణికి జెలసీ. పజిల్‌ స్టోరీ.


సింపుల్‌గా మీకు నేరేట్‌ చేయడానికి పనికొచ్చేవి చెప్తున్నా. వంద పేజీల కథలు ఇట్లా ఉండవు.

ఇంకో కథ.


గుమస్తా మరణం

––––––––––

చెహోవ్‌. రష్యన్‌.


భాష, శైలి, శిల్పం

–––––––––––

భాష: స్పోకెన్‌ / రిటెన్‌ లాంగ్వేజెస్‌

మీ ప్రాంత మాండలీకాన్ని వాడుకోవడం. 

పిల్లాడి కోణంలో కథ చెప్తే ఆ పిల్లాడికి తెలిసిన భాష వరకే వాడాలి. మీకు తెలిసిన పదాలన్నీ పెట్టొద్దు. మీకు భాష వచ్చు కదా అని రాయొద్దు.

అట్లాగే ఒక పేదవాడు, చదువుకోనివాడు కథలో ఉంటే ఆ పాత్ర ఏం మాట్లాడుతుందో అంతవరకే రాయాలి. 


మధ్యాహ్న భోజనానికి ఒక పేదవాడు జొమాటోలో బుక్‌ చేసుకున్నాడు అని రాయకూడదు. ఒక మిడిల్‌ క్లాస్, అర్బన్‌ మిడిల్‌ క్లాస్‌ అయితే అట్లాంటిది జరగడం సంభవమే. అంటే మనం చెప్పేది ఎదుటివాడు నమ్మేట్టుగా ఉండాలి.


శైలి:

ఆ రచయితకే ప్రత్యేకం.


శిల్పం:

ఫస్ట్‌ పెర్సన్‌.

సెకండ్‌ పెర్సన్‌.

థర్డ్‌ పెర్సన్‌.


కథను ఎట్లా చెబుతున్నాం. ఇందాకటి ఫారిన్‌హీట్‌(ఎ డేస్‌ వెయిట్‌) స్టోరీలో– తండ్రి ఆ కథ చెప్పినట్టుగా రాయొచ్చు. ఆ కొడుకు చెప్పినట్టుగా రాయొచ్చు. వాళ్లింట్లో ఉండే ఓ పనిమనిషి చెప్పినట్టు రాయొచ్చు. లేదా వాళ్లింట్లో కుక్క చెప్పినట్టు కూడా రాయొచ్చు. ఏం ఎందుకు రాయకూడదు? కానీ అప్పుడు ఆ కుక్క అనేదానికి దగ్గరగా మనం వెళ్లాలి. 


సాహిత్యం అనేది ఏమంటే, మనం ఒకటి చెప్పి ఎదుటివాటిని ఒప్పించడం. 

అలా లేదంటే– కథ అయితే చదవబుద్ధి కాదు.

పుస్తకం కొనుక్కుంటే విసరకొట్టబుద్ధి అవుతుంది.

సినిమా అయితే ఫ్లాప్‌ అవుతుంది.


మనమూ ఒక కథ రాద్దాం

–––––––––––––––

ఒక పేదవాడు జొమాటోలో బుక్‌ చేసుకున్నాడు అని రాయకూడదు అన్నాను. కానీ ఇదే కథ రాయకూడదా? రాయొచ్చు. అతడు ఏ బిల్డింగ్‌ పనికో పోయాడనుకుందాం, అక్కడ ఎవరో బుక్‌ చేసుకోవడం చూస్తాడు, తనకూ అట్లా తినాలని ఆశ పుడుతుంది, దానికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తాడు... ఇంక ఇప్పుడు.... 


ఏది సాహిత్యం అవుతుంది?

(మనలోంచి రాకుండా, మన అనుభవంలోంచి, మన ట్రూ ఎమోషన్‌లోంచి రానిదేదీ సాహిత్యం కాదు.

దిశకూ అప్లై అయ్యి, ఇంకొకరికి కాకూడదు. తేడా అర్థం చేసుకోండి.

స్పెసిఫిగ్గా ఉండాలి. అప్పుడు అది జనరలైజ్‌ అవుతుంది.


ద గిఫ్ట్‌ ఆఫ్‌ ద మ్యాజి

––––––––––––

ఓ.హెన్రీ. 1905. జిమ్‌. డెల్లా. ఆర్నమెంటల్‌ కోంబ్‌. తండ్రి నుంచి వచ్చిన వాచీకి చెయిన్‌. పరస్పరం రహస్య క్రిస్ట్‌మస్‌ బహుమతులు.


రాయడం వల్ల ఏమొస్తుంది?

––––––––––––––––

1. ఒక సమస్య నుంచి రిలీవ్‌ అయిపోతాం.

2, లార్జర్‌ పెర్‌స్పెక్టివ్‌లో విషయాన్ని చూస్తాం.

3. క్రియేటివ్‌ ప్లెజర్‌.

4. ఆటో బయాగ్రఫీ.

5. ఇంకా ఏంటంటే– రాస్తే మీ ఆలోచనలు ఒక పర్ఫెక్ట్‌ షేప్‌లోకి వస్తాయి. మీ వేగ్‌ థాట్స్‌ ఒక క్రమబద్ధీకరణ జరగుతుంది.

6. ఇంకో ఆనందం ఏమిటంటే– మీరు రాస్తూ కూర్చున్నప్పుడు వాటికవే కొన్ని ఆలోచనలు తన్నుకుని వస్తాయి. అవి మన లోపల ఉన్నట్టు మనక్కూడా తెలియదు. అదొక మ్యాజిక్‌.

7. ఉన్న జీవితాన్ని మరింత అందంగా, అర్థవంతంగా మార్చుకోవడానికి సాహిత్యం పనికొస్తుంది.


బాగా రాయాలంటే ఏం చేయాలి?

––––––––––––––––––––

రాయడానికి చదవడం ఒక్కటే దారి. ఎంత చదివితే అంత తెలుస్తుంది.


నేను ఎట్లా రాస్తాను?

–––––––––––––

1. ఆలోచన రాగానే ఇట్లా నోటుబుక్కులో(నా పాకెట్‌ నోట్స్‌) రాసుకుంటాను.

2. రియాలిటీ అనేది బట్ట అనుకుంటే, దానికి నా ఊహతో కుట్లు వేస్తాను.

3. చీకట్లో హెడ్‌లైట్‌ వేసుకుని చేసే ప్రయాణం లాంటిది. దానితోపాటే మనమూ ప్రయాణిస్తాం. మనక్కూడా అప్పుడే తెలుస్తుంటుంది, తొవ్వ.

4. మన పెర్సనాలిటీ కలుపుకొని ఒక పాత్రను సృష్టిస్తాం. ఒక్కోసారి రెండు మూడింటిని కలిపి సృష్టిస్తాం.


నాకోసం ఒక ఎక్సర్‌సైజ్‌

––––––––––––––

ఈత గురించి మీకు ఎంత చెప్పినా ఈత రాదు. నీళ్లలోకి దిగితేనే ఈత వస్తుంది.

రాయడం బద్దకం. సినిమా చూస్తే చేరగిలబడి చూడటం లాంటిది కాదు. దిగాలి. పని. పెయిన్‌. కాని రాసింది చూసుకుంటే ఆనందం వస్తుంది. కాబట్టి రాయాలి.


క్లుప్తత:

50 పదాలు – 500 పదాలు

ఏది రాసినా దానికదే కేంద్రకం ఉండాలి.

అమీబా తెలుసుగా...ద్విదా విచ్ఛిత్తి... ఎన్నిసార్లు విడిపోయినా ప్రతిదీ ఒక పరిపూర్ణమైన జీవి కదా...

అట్లా మీరు రాసేది కూడా ఎంత నిడివితో అయినా అంతే ప్రాణంతో ఉండాలి.


మా పెద్దాడు– చిన్నప్పుడు ఏదీ తింటా అనడు. 

ఉప్మా.

ఆ పల్లీలు

ఆ వాసన

నెమ్మదిగా అందులోకి దిగుతాడు.

మీరు కూడా తెల్లకాగితం ముందుపెట్టుకుని కూర్చోండి. మీకు మీరు హిప్నటైజ్‌ చేసుకోండి...

Wednesday, November 22, 2023

ఉండకూడని స్పేస్‌







పేపర్లో ఒక వెబ్‌ సిరీస్‌ గురించిన ఫుల్‌ పేజీ యాడ్‌ కనబడింది (21-11-2023). పోస్ట్‌ ఆ సిరీస్‌ గురించి కాదు. దాని వంకన ఒక దోషం గురించి మాట్లాడుదామని. ఆ ప్రకటనలో ఇలా ఉంది:
బుధవారం నుంచి వెజాగ్‌ ని వణికిస్తున్న అంతుచిక్కని హత్యలు
ఇక్కడ వైజాగ్, ని మధ్యన స్పేస్‌ ఉండకూడదు. కానీ కలిపి రాస్తే వైజాగ్ని అయిపోతుంది. అందుకే స్పేస్‌ ఇవ్వడం ద్వారా దాన్ని మేనేజ్‌ చేసివుంటారు. చాలామంది పెట్టే ఎఫ్బీ పోస్టుల్లో కూడా దీన్ని గమనించాను. మనోహర్‌ కు, రాజస్థాన్‌ లో, కంప్యూటర్‌ తో... నకారంతో ముగిసే పదాలు వచ్చినప్పుడే ఈ సమస్య వస్తోంది. విషయాన్ని బట్టి ఫ్లోలో పెద్ద ఇబ్బందిగా ఉండదు గానీ, మరీ కొట్టొచ్చినట్టు కనబడితే బాగోదు. అది పక్కనపెడితే, అట్లా ఉండకూడదు కదా! సరిగ్గా అతుకు పడనట్టుగా రాయడం భాషా దోషమే.
నేనైతే పాత తెలుగు పద్ధతిలో వైజాగును, రాజస్థానులో, కంప్యూటరుతో అని రాయడం ద్వారా ఈ దోషాన్ని అధిగమించేవాడిని. కానీ అన్నిసార్లూ అలా కుదరదు. నామవాచకాలు యథాతథంగా రాస్తేనే బాగుంటుంది. ఈ సమస్య నాకు మొబైల్‌ ఫోన్లో చేసే టైపింగుకు మాత్రమే వస్తుంది. ఆఫీసు సాఫ్ట్‌వేర్‌లో ఈ ఇబ్బంది లేదు. కొందరు, రెండింటి మధ్యా క్యారట్ (^) వాడతారు. కొంత నయం. అప్పుడు అది వైజాగ్‌^ని అవుతుంది. కానీ సమస్య అలాగే ఉంది.
ఇంత సాఫ్ట్‌వేర్‌ తయారుచేసినవాళ్లు ఈ దోషాన్ని ఎలా వదిలేసివుంటారు అని చాలాసార్లు అనుకున్నాను. అందుకే ఒకరోజు మొబైల్‌ కీ–ప్యాడ్‌ను కిందికీ, మీదికీ గాలించి, ఈ కీ(ఫొటో చూడండి) పట్టుకున్నాను. ఈ కీయే ఆ సమస్యకు కీ అన్నమాట! ఇది చాలామందికి తెలిసేవుండొచ్చు. నాకైతే అదొక యురేకా మూమెంట్‌! రాయాల్సిన పదం(వైజాగ్‌) రాసి, ఈ కీ నొక్కి, తర్వాతిది (ని) రాస్తే– ఆ పదం వైజాగ్ని అని కలిసిపోకుండా, వైజాగ్‌ని అవుతుంది.
(నేనైతే వైజాగ్‌ని అనకుండా, వైజాగ్‌ను అని రాస్తాను. అదింకో చర్చ. మనోహర్‌ని–మనోహర్‌ను; రాజస్థాన్‌ని–రాజస్థాన్‌ను; చిరంజీవిను అనకపోతే చాలు.)

Monday, November 20, 2023

కన్నడ వాన





నా ‘నగరంలో వాన’ కన్నడ అనువాదం, మయూర కన్నడ మంత్లీ 2018 డిసెంబర్‌ సంచికలో ప్రచురితమైంది. ‘ఉత్తమ తెలుగు వాన కథలు’ సంకలనంలోంచి దీన్ని అనువదించినవారు జగదీశ్‌ చంద్ర బాగ్లి. ఖదీర్‌బాబు గారి సంపాదకత్వంలో కృష్ణమోహన్‌బాబు గారు ప్రచురించిన ఈ పుస్తకాన్ని కువెంపు భాషాభారతి ప్రాధికార సంస్థ మొత్తంగా కన్నడంలోకి అనువదించే పని చేపట్టింది. అయితే జగదీశ్‌ గారు తన చొరవ కొద్దీ దాన్ని మయూరకు కూడా ఇచ్చారు. ఈ మాసపత్రికను నేను ఎలా రిలేట్‌ చేసుకోగలనా అని చూస్తే, పి.లంకేశ్, పూర్ణచంద్ర తేజస్వి లాంటివాళ్లు దానికి ఒకప్పుడు సంపాదకులుగా పనిచేశారని వికీ చెబుతోంది. ఇక కన్నడ అక్షరాల్లో ఉన్న నా పేరును మా పిల్లలిద్దరు కూడా పోల్చుకోగలగడం అదనపు సంతోషం.

Saturday, November 18, 2023

ఎందరో మహానుభావులు

 


పీవీ సతీశ్ (ఈ పొటో నెట్లోంచి తీసుకున్నది)


ధాన్యాగారం


లక్ష్మమ్మ


కొర్ర


సజ్జ


రాగి


అరికె


పులిచింత


గుంట గలగర







తెల్లాపూర్ ప్రదర్శన


ఎందరో మహానుభావులు

––––––––––––––––
పీవీ సతీశ్‌ గారు పోయారని తెలిసింది (2023 మార్చి 19). ఆయన్ని రెండుసార్లు చూశాను. దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) తరఫున తినదగిన ‘కలుపు’ మొక్కల గురించిన ఒక అవగాహనా కార్యక్రమాన్ని జహీరాబాద్‌ దగ్గరి పస్తాపూర్‌ ప్రాంతంలో ఏర్పాటుచేసి, బస్సులు పెట్టారు. నేను మా ఫ్యామిలీతో కలిసి వెళ్లాను. అక్కడ పనిచేస్తున్న గ్రామీణ మహిళలతో చేన్లలోనే మాట్లాడుతూ, సాధారణంగా మనం కలుపు అని తీసివేసే ఎన్నింటిని నిజానికి తినవచ్చో ప్రత్యక్షంగా చూపించే కార్యక్రమం అది. దానికి తగినట్టుగానే ఆ రోజు మధ్యాహ్న భోజనం ఆ ఆకుకూరలతోనే అద్భుతంగా వడ్డించారు. వాళ్ల ఉద్దేశంలో కలుపు అనేది లేదు. అవి వైల్డ్‌ ప్లాంట్స్‌ లేదా సాగుచేయని మొక్కలు మాత్రమే. చిన్నప్పటినుంచీ బతుకమ్మలో పువ్వుగా ఉపయోగించే గునుగు లేత ఆకుల్ని కూడా కూరగా వండుకోవచ్చని అంతకుముందు నాకు తెలీదు. ఇదే గునుగుకు కవలలా అనిపించే జొన్న చెంచలి అత్యంత పోషక పదార్థాలున్న వైల్డ్‌ ప్లాంట్‌ అని వాళ్ల పరిశోధనలో తేలిందన్నారు. వంటలు, ఇతర ప్రదర్శన ఏర్పాటుచేసిన ఆ ప్రదేశం కూడా సింపుల్‌గా, కళాత్మకంగా ఉంటుంది. అది నాకు ఎంత నచ్చిందంటే, నా యూట్యూబ్‌ ఛానల్‌కు పెట్టుకున్న కవర్‌ ఫొటో అక్కడ తీసుకున్నదే. ఆ రోజంతా కార్యక్రమాలు ముగిసిపోయాక, మళ్లీ తిరుగు ప్రయాణంలో హెడ్‌ ఆఫీసు దగ్గర కాసేపు ఆగాం. అప్పుడు సతీశ్‌ గారు మాతో పిచ్చాపాటీలాగే కానీ చాలా మంచి విషయాలు మాట్లాడారు.
డీడీఎస్‌ లక్ష్యాలు నాకు ఆసక్తికరమైనవి. పర్యావరణ హిత పంటలు పండించడం, ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, ఆహార వైవిధ్యాన్ని గుర్తించడం, సహజ విత్తనాలను కాపాడటం, జలవనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెట్ట పంటలతో ఆర్థిక స్వావలంబన కలిగించడం. గ్రామీణ మహిళల మహిళల సర్వతోముఖాభివృద్ధికి పాటు పడటం లాంటివి వారి కార్యకలాపాలు. ఆ మహిళలే వాళ్ల కమ్యూనిటీ రేడియో నడుపుతారు. డీడీఎస్‌ లాగే సతీశ్‌ గారి కెరియర్‌ కూడా ఆసక్తికరమే, 1990ల మొదట్లో డీడీఎస్‌ ప్రారంభించడానికి ముందు ఆయన కీలక పనుల్లో ఉన్నారు.
‘ఆకుకూరల పండుగ’ అవగాహనతో తర్వాత్తర్వాత మేము మా ఇంట్లో జొన్న చెంచలి, గునుగుతో పాటు, బంకంటి, ఎన్నాద్రి, గుంట గలగర, గలిజేరు, పులిచింత లాంటి ఆకుకూరల్ని వండటం మొదలుపెట్టాం. అంటే ఎప్పుడైనా నగర శివార్లు దాటినప్పుడు, ‘అరే ఇది తగరంచ కూర కదా, పనికొస్తుంది’ అని ఆత్రంగా తెంపుకొచ్చేవాడినన్నమాట! తెంపుకొచ్చేవాడిని అంటే, ఇప్పుడు చేయట్లేదా అంటే– ఆ ఉడుకు కొంచెం తగ్గింది.
మళ్లీ రెండోసారి ఆయన్ని ఇదే డీడీఎస్‌ వాళ్లు తెల్లాపూర్‌లో ఇవే సాగుచేయని ఆకుకూరలతో భోజనం, అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేసినప్పుడు చూశాను. ఆయన మాట్లాడుతుంటే తెలంగాణవాడు కాదని తెలిసిపోతుంది(కర్ణాటక పెద్దమనిషి). కానీ పాత తెలంగాణ యాస ఒకటి ఆయన నోట చిత్రంగా పలుకుతుంది. బహుశా దశాబ్దాలుగా పల్లీయులతో మమేకం కావడం వల్ల ఒంటబట్టిన భాష అయివుండాలి.
నిజానికి ఈ సాగుచేయని ఆకుకూరలు అనేవి డీడీఎస్‌ వల్ల నాకు అందిన ఒక పార్శ్వం మాత్రమే. రోజువారీ బియ్యానికి ప్రత్యామ్నాయ ఆహారం గురించిన ఆలోచన చేస్తున్నప్పుడు– అంబటి సురేంద్రరాజు గారు ఈ డీడీఎస్‌ గురించి మొదటిసారి చెప్పారు. అసలు వందల ఎకరాల్లో గ్రామీణ స్త్రీలు మెట్టపంటలు పండిస్తున్నారన్న విషయం నన్ను ఎక్సయిట్‌ చేసింది. వ్యవసాయం, ఆహారం గురించి చాలా విషయాలు పంచుకునే పంతంగి రాంబాబు గారు డీడీఎస్‌ దగ్గరికి వెళ్లేలా పురిగొల్పారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచనల్లో కనబడి ఉత్తేజితం చేసే ‘యవలు’ మొదటిసారి బేగంపేటలోని డీడీఎస్‌ స్టోర్‌లోనే చూశాను. చూడ్డానికి పొడువు రకం గోధుమల్లా ఉంటాయివి.
కేవలం స్టోర్‌ నుంచి తెచ్చుకుని ఏదో వండుకోవడం కాకుండా, వాటిని మా ఊళ్లోనే పండించాలని అనుకుని– అంటే ఈ ఆకుకూరల పండుగలన్నింటికన్నా చాలా ముందు– పస్తాపూర్‌ వెళ్లి చిరుధాన్యాల విత్తనాలను సంపాదించాను. ప్రతిచోటికీ కలిసి తిరిగే అజయ్‌ ప్రసాద్‌ తానూ వస్తానని నా వెంట వచ్చాడప్పుడు. ఝరాసంగం పర్యటన అని మాకు మేము చెప్పుకొంటాం దాని గురించి. మా ఆసక్తికి ముచ్చటపడి, ఆ విత్తనాలను ఆ పెద్ద నిల్వ చేసిన కాగుల్లోంచి తోడి ఇచ్చింది లక్ష్మమ్మ. అప్పుడు తెచ్చిన సజ్జ, రాగి, కొర్ర, సామ, ఊదల్ని మా ఊళ్లో వేశాం. మా ఊళ్లో చాలామంది ఆసక్తికి కారణమవుతూ కొన్నేళ్లు వరుసగా పండించాం. కానీ మానవ ప్రయత్నం చాలా ఎక్కువ. అన్నీ మాన్యువల్‌గానే చేయాలి. విస్తారంగా అందుబాటులోకి వచ్చినప్పుడే ఈ ప్రాసెస్‌ కొంత సుళువవుతుంది. (తర్వాత ఖాదర్‌వలీ గారు రంగప్రవేశం చేయడం, ఆయన ఐదింటిని– కొర్ర, అండుకొర్ర, అరికె, సామ, ఊద– ప్రత్యేకంగా చిరుధాన్యాలుగా నామకరణం చేయడం తర్వాతి సంగతి. ఈ స్ఫూర్తితో డీడీఎస్‌ దగ్గర లేని అరికలు, అండుకొర్రలు కూడా విడిగా సంపాదించి పండించాను. అరికలను రాజేంద్ర నగర్‌ వ్యవసాయ యూనివర్సిటీ సురేశ్‌ గారు ఇచ్చారు. అండుకొర్రల్ని రాంబాబు గారు కడప నుంచి సంపాదించి ఇచ్చారు.)
పీవీ సతీశ్‌ గురించి మొదలుపెట్టి నేను చాలామంది పేర్లు తలుస్తున్నానని తెలుసు. అంటే ఏ ఒక్కరో మన ప్రపంచాన్ని విస్తృతపరచరు. ఉదాహరణకు నేల ఉసిరి, తుమ్మికూర, అటకమామిడి గురించి నేను మొదటిసారి నామిని దగ్గర విన్నాను. నిజానికి ఇదంతా మనకు పరంపరగా రావాల్సిన జ్ఞానం. కానీ ఎక్కడో లంకె తెగిపోయింది. దాన్ని తిరిగి ముడివేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ నా జీవితానికి సంబంధించి చాలా విలువైనవాళ్లు. అందులో డీడీఎస్‌ వ్యవస్థాపకుడిగా పీవీ సతీశ్‌ మొదటి వరుసలో ఉంటారు.

21-3-2023