Thursday, September 17, 2026

ఇదే భాగ్యనగర్‌ కథ


శొంఠి కృష్ణమూర్తి

శొంఠి కృష్ణమూర్తి రచన ‘భాగ్యనగర్‌’ ఇది. తెలంగాణ మలితరం కథకుల్లో ఒకరు. 1924 నవంబరులో తూర్పు గోదావరి జిల్లాలోని సోమేశ్వరంలో జన్మించారు. ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు. ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. 1990 జూన్‌లో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఈయన కథల్ని ‘నవచేతన’ పునర్ముద్రించింది. కథలు రాయడమెలా అనే పుస్తకాన్ని కూడా కృష్ణమూర్తి రాశారు. 

----

 ఇదే ఇదే భాగ్యనగర్‌


ఎర్రటి నీరెండలు లోకాన్ని అరుణకాంతితో నింపుతున్నాయి.

దూరాన్నుండి అతివేగంతో, తన గర్భంలో యెన్నో గత చరిత్రల్ని దాచుకున్న కాలిబాట దుమ్ముని రేగకొడుతో వస్తున్న గుర్రం డెక్కల చప్పుడు అకస్మాత్తుగా ఆగింది.

అది మూసీ నదీతీరంలో వున్న పల్లెటూరు. పెద్ద పూలవనం. చుట్టూ ముళ్లకంచె. ఆ తోటలో పద్దెనిమిదేళ్ల అమ్మాయి. పూలు తెంపుతో పాడుకుంటూ వుంది.

మరుక్షణంలో గుర్రాన్ని వెనక్కి నాలుగడుగులు నడిపించి, ఆ రౌతు కంచెను దాటించి, ఆ అమ్మాయి వద్ద ఆపాడు. ఆవిడ భయపడి పూలసెజ్జని కింద వొదిలేసింది.

అతడు గుర్రం దిగి పూలసెజ్జను అందించబోయాడు. ప్రేమ ధారలు కురిపిస్తో ‘‘ఎవరు నువ్వు?’’ తీయని కంఠస్వరంతో అన్నాడు.

ఆ అమ్మాయికి కోపం వచ్చింది. తన తోటలోకి వచ్చి, తననే యెదురు ప్రశ్నిస్తున్నాడు.

‘‘నువ్వెవరు?’’ అంది.

‘‘మహారాజుని’’

మళ్లీ మొహంలోకి చూసింది. ‘‘ఇక్కడేం పని?’’ అంది, వీడని ధైర్యంతో.

‘‘వేటకోసం బయలుదేరాను. వొఠ్ఠి చేతుల్తో తిరిగిపోవడం ఇష్టంలేక...’’

పచ్చగడ్డి మీద చతికిలబడ్డాడు. గుర్రం తోచక సకిలించింది.

‘‘పల్లెల్లో ఏం వేట? అడవికి వెళ్లండి’’ అంది.

‘‘అడవిలో ఏదీ దొరక్కే ఇక్కడికి వచ్చా.’’

‘‘దయచేసి అవతలకు దయచెయ్యండి.’’

‘‘ప్రణయంలోనూ, రణంలోనూ వెనుకాడ్డం రాజలక్షణం గాదు’’ అన్నాడు, నోటితో గడ్డిపరకను కదిలిస్తో. ‘‘ఒకసారి మొహమెత్తి ఇటుచూడు... నా హృదయేశ్వరివి.’’

ఆ అమ్మాయి ఉక్కిరి బిక్కిరయింది.

అతనో గులాబీ పువ్వుని తెంచుకొచ్చాడు. ‘‘చూడు! అందమైన గులాబీ చెట్టుకీ ముళ్లున్నాయి; నీకూ ముక్కున కోపం ఉంది. అదే దేవుడి సృష్టిలో వింత అనుకుంటాను’’ అన్నాడు.

ఓరగా చూసింది. ‘‘ఆ ముళ్లు చేరేవాళ్ల తెలివిని బట్టి బాధించవు.’’

అతని కళ్లల్లో సంతృప్తి తాండవించింది. ‘‘నీ సౌందర్యాన్ని చూసి ముగ్ధుణ్ణయ్యాను. నీ పాదాల చెంతకు వచ్చి ప్రేమభిక్ష కోరాను.’’

ఆ అమ్మాయి మాట్లాడలేదు.

‘‘మాట్లాడవేం?’’ అని చేతులు పట్టుకున్నాడు.

అంతలోకి ‘‘భాగ్యం; భాగ్యం’’ అని అరుపులు వినపడ్డాయి.

‘‘మా నాన్న! నేను పోవాలి’’ అంది కంగారుగా.

‘‘నీ పేరు?’’

‘‘భాగ్యమతి’’


2

క్షణికమాత్రపు నిర్ణయాలెన్నో చరిత్ర రీతుల్నీ, తీరుల్నీ మార్చిన సందర్భాలున్నాయి. 

క్రమంగా భాగ్యమతికి ఆ నూతన యువకునితో పరిచయం ఎక్కువైంది. రహస్య సమావేశాలు, ప్రణయ కలాపాలు ఎక్కువయ్యాయి. భాగ్యమతి అతన్ని చూడందే ఒక్కరోజూ గడపలేకపోయేది. అతనూ అంతే! భాగ్యమతి సందర్శనా భాగ్యరహితుడై మనలేకపోయేవాడు.

అది వర్షాకాలం. ఉదయం మొదలు ఎడతెగని వర్షం కురుస్తోంది. కారు మేఘాలు క్రమ్మటం వల్ల సాయంత్రమే చీకటి పడినట్టుగా ఉంది. మూసీనది, వర్షపు నీరు చేరడం వల్ల వెల్లువలై పారుతోంది. ఆకాశంలో మెరుపులూ ఉరుములూ ఏదో ప్రళయం రాబోతున్నట్టుగా సూచిస్తూ వున్నాయి.

‘‘చలో, చలో’’ అంటూ కొరడాతో గుర్రాన్ని అదిలిస్తూ మన పరిచయస్థుడు ఏటికి అడ్డంగా ఈదసాగాడు. అతి కష్టం మీద అరగంట తర్వాత నాలుగు ఫర్లాంగుల దిగువన గట్టు చేరుకున్నాడు. అలసిపోయిన గుర్రం నురగలు గ్రక్కుతోంది.

పాకలో నుండి– ‘‘వచ్చారా?’’

‘‘ఎందుకు రాను?’’

‘‘ఇంత వర్షంలో...’’

‘‘నువ్వు మాత్రం యెందుకు నిరీక్షిస్తున్నావ్‌?’’

అతనామెను కౌగిట్లోకి తీసుకున్నాడు. ఇద్దరు కొన్ని క్షణాలు మాట్లాడలేదు.

‘‘మీరు ఇట్లాంటి దారుణానికి తయారైతే ఎలా? తుఫానులో వొస్తే వొప్పుకునేది లేదు.’’

‘‘రాణి గారి ఆజ్ఞ అనుసరించక తప్పుతుందా?’’

కొంతసేపు గడిచింది. బుగ్గమీద మీటి గుర్రాన్ని ఎక్కి వెళ్లిపోయాడు. ఎక్కడో దూరంగా పిడుగు పడినట్టయింది. భాగ్యమతి గుండెల్లో రాయిపడింది.


3

పదిహేను రోజుల వరకూ భాగ్యమతి ప్రియుని కోసం వృథాగా ఎదురు చూసింది.

పై సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే మూసీనది వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమైందని వింది.

గోల్కొండ నవాబ్‌ సుల్తాన్‌ ఇబ్రహీం కుతుబ్‌షా గారికి యువరాజు మహమ్మద్‌ మూసీనదిని దాటి జ్వరం పడ్డాడనే వార్త విచారాన్ని కలిగించింది. వెంటనే హకీముల్ని పిలిపించి వైద్యం చేయించసాగాడు. తన వజీర్‌ సాహెబ్‌కు తక్షణం మూసీనదిపై నెల లోపల వంతెన నిర్మించాలని ఫర్మానా జారీ చేశాడు.

ఇబ్రహీం కుతుబ్‌షా 1550 నుండి 1580 వరకు గోల్కొండ ఆంధ్రసామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప విద్వాంసుడు. అప్పుడు రాజ్యం ఒరిస్సా నుండి పెన్న వరకు విస్తరించి వుండేది. టర్కీ, అరేబియా, పర్షియా వరకు వర్తక వ్యాపారాలుండేవి. ఎంతోమంది తెలుగు కవులను పోషించాడు. ‘మల్కిభరాం’ పేరుతో ఆయన్ని తెలుగు కవులు కీర్తించారు. 

యువరాజు పది రోజుల వరకూ మూసిన కన్ను తెరవలేదు. అన్నాళ్లూ ఏదో కలవరిస్తూనే ఉన్నాడు. కాని వివరాలు ఎవరికీ తెలీలేదు. వైద్యులు మాత్రం యువరాజు ఏదో మనోవ్యధతో బాధపడుతున్నారని కనుగొన్నారు.

మహమ్మద్‌ కొంచెం కోలుకోగానే ‘‘భాగ్యమతీ, భాగ్యమతీ!’’ అని పలవరించసాగాడు. ఈ వార్తను విన్న సుల్తాన్‌ కొడుకును చూడ్డానికి వచ్చాడు. అప్పటికి అందరికీ తెలిసింది. యువరాజు పడిన ప్రణయమే ఇంత ప్రళయాన్ని కొని తెచ్చిందని.


4

మరో నెల రోజులు గడిస్తేనేగానీ యువరాజు పూర్తిగా ఆరోగ్యవంతుడు కాలేడు. అప్పుడు సుల్తాన్‌ యువరాజును ‘బాలా హిస్సార్‌’నకు పిలిపించాడు.

మహమ్మద్‌ కొంచెం బలం చేరినప్పట్నుంచీ కూడా న్యాయశాలపై డాబా మీదికి పోయి, సాయంత్రం వేళలందు మూసీనది వైపూ, మూసీనదికి ఆవలవున్న పల్లెవైపూ శూన్యదృక్కుల్ని ప్రసరిస్తుండేవాడు. అక్కడి నుంచీ చూస్తే ముప్పై మైళ్ల వరకూ కనబడతుంది.

ఒకనాడు అలాగే భాగ్యమతిని తల్చుకుంటూ వుంటే సుల్తాన్‌ వారి కబురు వచ్చింది. వెంటనే వెళ్లాడు. 

‘‘భాగ్యమతి ఎవరు?’’ అని నవ్వుతో ప్రశ్నించాడు. యువరాజు నుంచునే సిగ్గుతో తలవంచుకున్నాడు.

‘‘గొప్ప గొప్ప వజీర్లు, సర్దారులు కోట్ల కొలది హొన్నులతో తమ అపురూప సుందరులైన కన్యల్ని ఇస్తామంటుంటే ఇదేమిటి?’’

‘‘నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను.’’

‘‘మన ఇస్లాం మతం?’’

‘‘మీరు అన్నీ తెలిసినవారు. హిందూ, మహమ్మదీయ సఖ్యతకు పాటుపడేవారు.’’

‘‘నీ ఇష్టం. ఆలోచించు. నువ్వు కాబోయే సుల్తాన్‌వని గుర్తుంచుకో.’’


5

కాలచక్రం దొర్లిపోయింది. ఇబ్రహీంషా మరణించడం, మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా 1580లో రాజ్యాభిషిక్తుడవడం జరిగింది. భాగ్యమతి పట్టమహిషి అయింది. సిలాఖానా దక్షిణముగా ఆవిడకై ప్రత్యేక భవనం నిర్మించారు. అంబర్‌ ఖానాకు సమీపంలోనున్న గుహలో ఒక దేవాలయం నిర్మించారు. భాగ్యమతి అక్కడే రోజూ దేవి పూజ కావించుకునేది.

మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా సుల్తాన్‌గా వున్నప్పటికి దాదాపు ఆంధ్రదేశమంతా గోల్కొండ నవాబుల పాలనలోకి వచ్చింది.

రాజ్యానికి వచ్చిన పది సంవత్సరాల తర్వాత 1589లో గోల్కొండ సుల్తాన్‌ సతీ సపరివారంగా తాము కట్టించిన చార్‌మినార్‌ చూడ్డానికి వెళ్లారు. పక్కనే జుమ్మా మసీదు గొప్ప నేత్రానందాన్ని కలిగిస్తోంది. లెక్కలేనన్ని పావురాలు మసీదు మీద నివాసం చేసుకున్నాయి.

మూసీనది కిరువైపులా పూర్వపు పల్లెటూరు పెద్ద బస్తీగా మారిపోయింది. చార్‌మినార్‌ చుట్టూ చార్‌ కమాన్లు నిర్మించబడ్డాయి. విదేశీ వ్యాపారస్థులందరూ ఇక్కడే నివాసాలు ఏర్పర్చుకొని, అవసరమున్నప్పుడు దుర్గానికి వెళ్లి వస్తోవుండేవారు. విదేశీ రాయబారుల నివాసాలు కూడా ఇక్కడేవుండేవి.

భాగ్యమతితోపాటు సుల్తాన్‌ చార్‌మినార్‌ ఎక్కారు. మూసీనదిని, మరొక పక్క గోల్కొండ ఖిల్లాను చూసి భార్యాభర్తలు ముగ్ధులైపోయారు. మరొక పక్క మూసీనదికి ఆవలగా అల్లంత దూరంలో పూలతోట.

‘‘భాగ్యమతీ!’’ అన్నాడు సుల్తాన్‌.

‘‘ఏం ప్రభూ!’’

‘‘అక్కడ చూడు, ఆ పుష్పవనం! ఈ భాగ్యమతి, నా పాలిటి భాగ్యదేవత, ప్రథమ సందర్శనా భాగ్యాన్ని కలిగించిన పూదోట అదిగో.’’

భాగ్యమతి ముఖం మీది పల్చని తెరచాటు నుంచి, పొంచి చూసే చంద్రబింబంలా పటాన్ని తిలకిస్తోంది. 

‘‘నువ్వు నా పాలిటి భాగ్యదేవతవే కాదు, గోల్కొండ సామ్రాజ్యపు భాగ్యలక్ష్మివి. నీ పేరు మీదుగా, కలకాలం మన ప్రేమ ఈ లోకంలో నిలిచివుండేలా ఈ నగరానికి నేటి నుండి భాగ్యనగర్‌ అని పేరు పెడుతున్నాను.’’

‘‘ధన్యురాల్ని ప్రభూ. ప్రభువులు అన్నిటికీ సమర్థులు.’’ భాగ్యమతి హృదయం పొంగిపోయింది.

ఆ భాగ్యనగరే నేటికీ భోగ, భాగ్యాలతో విలసిల్లుతున్న హైదరాబాద్‌!


(సాక్షి సాహిత్యం; 2020 సెప్టెంబర్‌ 14)


Sunday, September 13, 2026

మనసు కవి


ఆచార్య ఆత్రేయ
7 May 1921 - 13 Sep 1989

 మనసు కవి

ఆత్రేయ అంటే అర్థం చంద్రుడు. సినీవినీలాకాశంలో ఆయన కాచిన పున్నమి వెన్నెళ్లు ఎన్నని! ‘మనసు మూగదేకాని బాసుంటది దానికి/ చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇదీ’. ‘నేనొక ప్రేమ పిపాసిని/ నీవొక ఆశ్రమవాసివి’. మనసంత సున్నితమైన మాటలు అల్లినవాడూ, మనసు మర్మాన్ని ఎరిగినవాడూ, మనసయ్యేలా రాసినవాడూ కాబట్టే ఆత్రేయ ‘మనసు కవి’ అయ్యాడు.

ఆత్రేయ అన్న గోత్రనామాన్నే కలంపేరుగా చేసుకున్న కిళాంబి వెంకట నరసింహాచార్యులు... కప్పలు, ఈనాడు, ఎన్జీవో, విశ్వశాంతి లాంటి నాటకాలతో ప్రజాదరణ పొంది సినీరంగంలోకి వచ్చాడు. ‘ఈ భూమి తిరిగేది రూపాయిచుట్టూ’ అని ఆయనకు తెలుసు. ‘కాటికెళ్లితే అందరూ ఒకటే అనుకోబోకు/ అక్కడ కూడా తేడాలున్నాయి కాలేవరకు’ అనీ తెలుసు. కాబట్టే, సమసమాజం ఆదర్శంగా రచనలు చేశాడు. ‘మన భూమి వేదభూమిరా తమ్ముడూ/ మన కీర్తి మంచుకొండరా’ అని పనికిరాని గతాన్ని ఎద్దేవా చేశాడు. ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిచాన (ను) బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా’ అని ప్రశ్నించాడు.

అంతులేని కథ, అభినందన, అర్ధాంగి, ఆరాధన, జయభేరి, డాక్టర్‌ చక్రవర్తి, దసరా బుల్లోడు, నీరాజనం, ప్రేమనగర్, సెక్రటరీ, వెలుగు నీడలు లాంటి సుమారు రెండు వందల చిత్రాలకు మాటలూ, రెండు వేల వరకు పాటలూ రాశాడు ఆత్రేయ. మాటలతో దుఃఖపెట్టాడు. ‘మనిషికి చాలా కాలం బ్రతుకుతాడన్న అబద్ధం కంటే, నేడో రేపో చచ్చిపోతాడన్న నిజం తెలియడం చాలా మంచిది. చేయదల్చుకున్న మంచి ఏదైనా ఉంటే అప్పుడే చేస్తాడు’: వెలుగు నీడలు. పాటలతో సంతోషపెట్టాడు. ‘పెళ్లంటే– పందిళ్లు సందళ్లు/ తప్పట్లు తాళాలు తలంబ్రాలు/ మూడే ముళ్లు ఏడే అడుగులు/ మొత్తం కలిపి నూరేళ్లు’: త్రిశూలం.

‘అమ్మంటే అమ్మ/ ఈ అనంతసృష్టికి ఆమె అసలు బ్రహ్మ’ అన్న ఆత్రేయ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు. ప్రేమించిన ప్రియురాలి చేయిని అందుకోలేకపోయాడు. ‘అనుకున్నామని జరగవు అన్ని/ అనుకోలేదని ఆగవు కొన్ని/ జరిగేవన్నీ మంచికని/ అనుకోవడమే మనిషి పని’ అంటాడో చోట. జీవితం పట్లా, పొందలేనిదాని పట్లా సమాధానం పడటానికి పడే తపన కావొచ్చది. తన యౌవనంలో ఇష్టపడ్డ ‘బాణం అనే అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయిన నలుగుబాటు ఆయన్ని జీవితాంతం వెంటాడింది. ‘నిన్ను ఏమీ సుఖపెట్టలేకపోయాను, నేనూ సుఖపడ్డదీ లేదు,’ అని భార్య పద్మావతికి రాసిన ఉత్తరంలో ఆయన పడిన క్షోభ తెలుస్తుంది.

మనసున్నవాడికి మథనమే మిగిలేది! అది లేకపోవడమే ఒక్కోసారి మేలేమో! ‘తీపి మాటలు గొంతు కోతలు/ నరులకు మాకే సొంతం’ అన్నట్టుగా చరించే మనుషుల మధ్య, మనసనే మధుకలశంలో విషపుచుక్కలు జార్చే కఠిన పాషాణుల మధ్య మనసున్నవాడుగా బతకడం కష్టం. ఆ నిష్టూరంలోంచే కాబోలు, ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికీ సుఖము లేదంతే’ అన్నాడు. ‘బ్రతికుండగా నిన్ను ఏడిపించినోళ్లు/ నువ్వు చస్తే ఏడుత్తారు దొంగనాయాళ్లు’ అని వెక్కిరించాడు. ‘మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా/ తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా’ అని హితవు పలికాడు.

‘మగువ మనసు సగం చదివితే మగవాడప్పుడు డాక్టరాఫ్‌ రొమాన్స్‌’ అన్నాడేగానీ తప్పనిసరైన భోగంపాటలకు ఆత్రేయ నొచ్చుకున్నట్టే కనబడతాడు. ‘సినిమా కవి బ్రతుకు అనేకానేక అభిరుచులుగల విటులను సంతృప్తి పరచవలసిన పడుపు వృత్తి’ అన్న నిరసన బహుశా ఆయన మీద పడిన ‘బూత్రేయ’ ముద్రకు ఒక సంజాయిషీ అనుకోవాలి. 

ఇలాంటి వేదనలో మనిషికి నిద్ర ఎలా పడుతుంది? ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది/ కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది’. అన్నింటికీ నిద్రే మందు మరి. ఒక్కోసారి అది శాశ్వత నిద్రయినా కావొచ్చు.
 
అంతేగా, కాలం పాపమని దేన్నీ ఆపదు. ‘నేడు నిన్నౌతుంది/ రేపు నేడౌతుంది/ ఆ రేపుకూడా నిన్నగా మారుతుంది’. ఆత్రేయ అయినా అంతే! ‘మట్టి బొమ్మలే మనమంతాను/ గిట్టిపోవలె మట్టిలోపలే’.
 
కాకపోతే ఉన్నన్నాళ్లూ, ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ/ నవ్వుతూ చావాలిరా’!

(సాక్షి ఫన్‌డే; మే 4, 2014)

Friday, September 11, 2026

కొన్ని ఇన్నర్‌వ్యూ ఫొటోలు


న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌తో (22–6–2012)





నిర్మాత కె.రాఘవతో (26–7–2012)





సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో (20–4–2012)


సాక్షి ఫన్‌డే కోసం కొన్నేళ్ల కింద ఇన్నర్‌వ్యూ పేరుతో కొంతమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. కానీ ఎప్పుడూ ఫొటోలు దిగలేదు. నేను అడగలేదు. అది నా స్వభావం కాదు. ఏదో అడ్డంపడుతుంది. కానీ నా వెంబడి వచ్చిన ఫొటోగ్రాఫర్లు చొరవగా తీసిన ఈ ఫొటోలు మాత్రం ఇప్పుడు  జ్ఞాపకంగా మిగిలాయి.

Sunday, September 6, 2026

వెండితెర చక్రవర్తి కురొసావా


అకీరా కురొసావా 
23 March 1910 - 6 Sep 1998

వెండితెర చక్రవర్తి


ఒకసారి దర్శకుడు అకిరా కురసోవాకు ఈ ప్రశ్న ఎదురైంది: ‘‘మీరు ‘రాన్‌’లోని ఆ ఫ్రేమ్‌లో కెమెరా అలా ఎందుకు పెట్టారు?’’
దానికి కురసోవా ఇచ్చిన జవాబు: ‘‘నేను ఒక్క అంగుళం ఎడమకు ప్యాన్‌ చేసినా సోనీ ఫ్యాక్టరీ కనబడుతుంది, అదే ఒక్క అంగుళం కుడికి జరిపితే ఎయిర్‌పోర్టు కనబడుతుంది. పీరియడ్‌ సినిమాకు ఆ రెండూ అనవసరం’’.
కురసోవా అంత పర్ఫెక్షనిస్టు! సినిమా కోసం ప్రాణం పెట్టేవాడు.

1948తో మొదలై నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఆయన కెరీర్లో... రషోమన్, ఇకిరు, సెవెన్‌ సమురాయ్, యొజింబో, థ్రోన్‌ ఆఫ్‌ బ్లడ్, దెర్సు ఉజాలా, ద లోయర్‌ డెప్త్స్, హై అండ్‌ లో, డ్రీమ్స్, రప్సోడీ ఇన్‌ ఆగస్ట్‌... ఒక్కో సినిమా ఒక్కో చరిత్ర!

సినిమా మాస్టర్లు అనిపించుకున్న దర్శకులు ఇన్‌మార్‌ బెర్గ్‌మన్, ఫ్రెడరికో ఫెల్లిని, సత్యజిత్‌ రే, రోమన్‌ పోలన్‌స్కీ, జార్జ్‌ లుకాస్, ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పోలా, మార్టిన్‌ సోర్సెసె, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌లాంటివాళ్లు కూడా కురసోవా వల్ల ప్రభావితమయ్యారు. అందుకే ఆయన్ని విమర్శకులు గౌరవంగా ‘ఎంపరర్‌ ఆఫ్‌ ద సెల్యులాయిడ్‌’ అంటారు.

జపాన్‌ ‘సమురాయ్‌’(సైనిక) కుటుంబంలో జన్మించిన అకిరా సినిమాలు మాత్రమే తన ఉనికిగా బతికాడు. యుద్ధ సన్నివేశాలను చిత్రించడంలో, రిస్కు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి! నటీనటులకు అలవాటు కావడానికి, తద్వారా సహజత్వం కోసం సినిమా కాస్ట్యూమ్స్‌తో వాళ్లను కొంతకాలం పడపమనేవాడు. ఏరోజు రషెస్‌ ఆరోజు స్వయంగా ఎడిట్‌ చేసుకునేవాడు.

‘‘ఆలోచనలు సహజంగా వస్తాయి, కథ ఆ క్యారెక్టర్‌ వెంట సాగిపోతుంది’’ అని తను సినిమా తీసే విధానం గురించి చెప్పేవాడు కురసోవా. స్టోరీబోర్డ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. సినిమాకు ఫండింగ్‌ దొరకని విరామ సమయాల్లో తన సీన్లన్నింటినీ బొమ్మలుగా గీసుకునేవాడు. ఆయన స్వయంగా పెయింటర్‌ కూడా! సినిమాల్లోకి రాకముందు కమర్షియల్‌ ఆర్టిస్టుగా పనిచేశాడు. ‘‘నిజంగా డైరెక్టర్‌ కావాలనుకుంటే ముందు స్క్రీన్‌ప్లేలు రాయండి. రాయడం ద్వారానే సినిమా స్ట్రక్చర్‌ అర్థమవుతుంది, అసలు సినిమా ఏంటో కూడా అర్థమవుతుంది’’ అని ఔత్సాహిక దర్శకులకు సలహా ఇచ్చేవాడు. ‘‘నీలోపల ఎంతో రిజర్వు ఉంటేతప్ప, నువ్వు ఏదీ సృష్టించలేవు. జ్ఞాపకమే సృష్టికి మూలం. శూన్యం నుంచి దేన్నీ సృష్టించలేం’’. అందుకని చదవడం చాలా ముఖ్యమనేవాడు. ‘‘అయితే, చదవడం వల్లగానీ, నీ జీవితానుభవం వల్లగానీ వచ్చినదానికి జోడించగలిగేదేదో నీలోపల లేకపోతే నువ్వు ఏదీ సృజించలేవు’’ అనేవాడు.

ఆయన సినిమాలన్నీ ‘లార్జర్‌ దన్‌ లైఫ్‌’గా కనబడినా, ఆయన మాట్లాడిందంతా జీవితం గురించే! మనిషి ఎప్పుడూ తప్పకూడని నీతినీ, ఎప్పుడూ పాటించవలసిన మానవీయ విలువనీ ఆయన చిత్రాలు  ప్రతిబింబించాయి. మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్నీ, మనిషిగా నిలబడటం కోసం పడే ఆరాటాన్నీ, సమూహంతో కలిసిసాగే సంతోషపు వెతుకులాటనూ ఆయన చిత్రించాడు. అయితే, జీవితం ఎంత సంక్లిష్టమైందో ఆయన సినిమాలు కూడా అంతే సంక్లిష్టమైనవి. అందుకే కురసోవా తన సినిమాల్లో ‘ఫలానాది వెల్లడించాడు’ అనడం తప్పుడు విశ్లేషణే అవుతుంది.
‘‘నా సినిమా ఏం చెబుతుందో నేనేగనక వివరించగలిగితే అందరికీ వెళ్లి అదే చెప్తానుగానీ, అంత కష్టపడి సినిమా ఎందుకు తీస్తాను?’’ అన్నాడాయన. సినిమాను అర్థం చేసుకోవడంలో మెదడుకంటే హృదయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమనేవాడు. ఆయన చిత్రరాజాలు మాత్రం మెదడునూ, హృదయాన్నీ రెంటినీ సంతృప్తిపరుస్తాయి.

(సాక్షి ఫన్‌డే; 23 మార్చ్‌ 2014)
––––––––––––––––––––––

Thursday, September 3, 2026

అల్లం శేషగిరిరావు ‘నరమేధం’


అల్లం శేషగిరిరావు 

అల్లం శేషగిరిరావు (1934–2000) ‘నరమేధం’ సంక్షిప్తరూపం ఇది. 1979లో ప్రచురితమైంది. ఒరిస్సాలో జన్మించి, రైల్వేలో పనిచేసిన శేషగిరిరావు ‘మంచి ముత్యాలు’, ‘అరణ్య ఘోష’ కథాసంకలనాలు వెలువరించారు.

––––––––––

ఒక్కరోజు చావు


ఛత్ర చామరాలతో అలంకరించిన ముఖద్వారం, కొబ్బరాకులతో అల్లిన పూజా మంటపం, రథం అగ్రభాగాన పరుగులు తీస్తున్న శ్వేతాశ్వాలు నేత్రానందకరంగా ఉన్నాయి. జనం గంపులు గుంపులుగా వస్తున్నారు జాతరని చూడ్డానికి.

గంగరాజు సిల్కు లాల్చీ తొడుక్కుని పట్టపంచ కట్టుకున్నాడు. బొద్దు మీసాలతో, సన్నంగా, పొడవుగా, వెండి తీగెలా ఉన్నాడు. రథయాత్రా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు.

‘‘టైమయింది, గంగరాజుగారూ’’ అని పూజారి మంత్రజలం చల్లి గంగరాజు మెడలో పూలదండ వేసి కొబ్బరికాయ చేతికి అందించేడు. రాజు ‘‘జై జగన్నాథ్‌!’’ అని టెంకాయని మూడుసార్లు దిష్టితీసి బలంపూర్తిగా కొట్టేడు. కుర్రాళ్లు కొబ్బరి ముక్కల కోసం ఎగబడిపోతున్నారు.

‘‘జగన్నాథ మహాప్రభూకి జై’’ ‘‘గంగరాజు బాబుకీ జై’’. రథం బయలుదేరింది. నీలమాధవుడు జగన్నాథరూపంలో బలరామదేవునితోనూ, చెల్లెలు సుభద్రాదేవితోనూ విజయుని సారథ్యంలో ఊరేగుతున్నాడు. ప్రతి ఏటా ఆషాఢంలో నిజమందిరాన్ని విడిచి, విడిది మందిరం ‘‘గుడిసెన్న గుడికి’’ రథయాత్ర సాగిస్తాడు.

ధర్మకర్తృత్వం వంశపారంపర్యంగా గంగరాజుకి సంక్రమించింది. ఆ అధికారాన్ని సవాల్‌ చేస్తూ ప్రత్యర్థి వెంకునాయుడు కోర్టులో కేసు పెట్టేడు. రెండేళ్లుగా రథయాత్ర జరక్కుండా కోర్టు నుంచి ఇంజంక్షన్‌ ఆర్డరు తెప్పించి ఆపుచేస్తూ వచ్చాడు. చివరికి గంగరాజే గెలిచాడు. కోర్టులో గెలిచిన విజయోత్సాహంతోనూ, వెంకునాయుడి మీద కసితోనూ భోగరాగాలు అన్నీ గంగరాజే చూసుకుంటున్నాడు. ఎల్లక్షన్లు అతి దగ్గరలో ఉన్నాయి.

రథం మీద పూజారులు జనం అందిస్తున్న కొబ్బరికాయలు కొడుతున్నారు. పూలమాలల్ని విగ్రహాల పాదాల దగ్గరికి విసురుతున్నారు.

‘‘గంగరాజు బాబూ, మనం కాస్త జాగ్రత్తగా వుండాలి. ఎగస్పార్టీ వోళ్లు మనలో కలిసే తిరుగుతున్నారు. చూశారా ఆ గళ్ల చొక్కావోడు.’’

‘‘ఒరే సాంబా! కొండంత మనిషివి నువ్వుండగా, జగన్నాథుడు మన పార్టీ అయివుండగా ఎంకునాయుడు ఎవడ్రా? ఝూటాగాడు.’’

‘‘తగవుకి దిగితే తల తీసేస్తాను గాని, రాజుబాబు, రెండు రోజుల్నించి ఎంకునాయుడు ఇటు ఢిల్లీకి అటు హైదరాబాదుకి తెగ ఫోన్లు కొడుతున్నాడట. ఎవడో నాయకుణ్ని తెప్పించి మీటింగు పెడతాడట’’.

‘‘పెట్టనీరా, జనం బఠానీలు నవులుతూ వింటారు. తరువాత ఇళ్లకి పోతారు. మనం కూడా మలి రథయాత్ర నాడు అన్న సంతర్పణ చేయిస్తున్నాం. ఊరు ఊరంతా రావాలి. పూరీ నుంచి జగన్నాథ ప్రసాదాన్ని కుండల్లో తెప్పించి అందులో కలిపాం అందాం. వస్త్రదానం కూడా చేద్దాం. మరో రెండు వేలు ఖర్చు అవనీ. ప్రసాదం తిని మోసం చేస్తే కళ్లు పోవూ?’’

సాంబడు వెనకాల రథం దగ్గర గోలగా వుంటే అక్కడికి పరుగున వెళ్లేడు. ‘‘తొయ్యండ్రా, తొయ్యండెహే. జోర్సే.’’ రథచక్రాలు క్రీచుక్రీచుమంటూ నేలని రాసుకుంటూ కదలడం లేదు. అప్పటికే వడ్రంగి యినప చట్రాల్ని సుత్తితో కొడుతూ సరిచేస్తున్నాడు. ‘‘ఆవదం బాగా పొయ్యండ్రా’’ సాంబడు. ‘‘ఆదిలోనే ఏమిటీ అవాంతరం?’’ గంగరాజు.

‘‘నాయనా, రాజుబాబూ! ఢక్కువాడు రథం మీద కనిపించడం లేదు. దేవుడికి దిష్టి తగిలిందేమో’’ పక్కనే నిల్చున్న ముసలాయన. ఢక్కువాడి పేరు వినగానే చిన్న సంచలనం బయలుదేరింది. రథం మీద బూతు పాటలు పాడేవాణ్ని ఢక్కువాడు అంటారు. ఆ పాటలన్నీ ఒరియా భాషలో ఉంటాయి. రెండేళ్లుగా జాతర లేకపోవడంతో ఢక్కువాడి సంగతే మరిచిపోయాడు పూజారి. వెంటనే ఒక కుర్రాడు ఢక్కువాడి కోసం గాలిలా పరుగెత్తాడు.

‘‘బాబూ, ఢక్కువాడు రానంటున్నాడు. బ్లడీ భంచోత్‌. దేవుడి తరఫున నువ్వు వస్తావుట్రా, లింగులింగుమంటూ అని గసిరేశాడండి.’’

‘‘ఈ జాతి తక్కువ నా కొడుకుని నేను వెళ్లి బ్రతిమాలాలి కాబోలు’’ గంగరాజు.

‘‘వాళ్లు అలగడం, ధర్మకర్తలు వెళ్లి బ్రతిమాలి తీసుకురావడం ఆచారం’’ అన్నాడు పూజారి.

‘‘ఢక్కువాడికి కొత్తబట్టలు కుర్రాడిని పంపించి తెప్పించండి’’ జేబులో డబ్బు తీసి ఇచ్చాడు గంగరాజు.

ఢక్కువాడి పూరి గుడిసె ఊరవతల ఉంది. ఇంటి చుట్టూ కుళ్లు కాలవల కంపు. వైద్య విద్యార్థుల ముందు శవం ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు, ఏడాదికొకసారి ఢక్కువాడికి ప్రాముఖ్యం లభిస్తుంది. 

‘‘ఢక్కువా ఢక్కువా, పద పదరా రథం ఆగిపోయింది’’ హెచ్చరించేడు గంగరాజు. ఈ అలికిడికి పెరట్లో పనిచేసుకుంటున్న ఢక్కువాడి పెళ్లాం ఆదెమ్మ గబగబ వచ్చి ‘‘దండాలు బాబుగారు, ప్రొద్దుట్నుంచీ తెగ తాగేసి తిరుగుతున్నాడు. తిండి మానేసి కొడుకుని తల్చుకుంటూ తిరుగుతున్నాడు. ఇదిగో ఇనుకో, బాబులొచ్చారు, జాతరకెళ్లెల్లు’’ మొగుడ్ని కుదుపుతూ అంది.

‘‘జాత్తర? నెల రోజుల క్రితం నా కొడుక్కి శ్మశానంలో పెద్ద జాతర చేశాను. ఈ రోజు దేవుడికి జాతర పట్టిస్తాను.’’

‘‘ఏటి బాబులొస్తే మరియాద లేకుండా?’’

‘‘రెండేళ్ల నించి నేను సచ్చానో వున్నానో పట్టించుకోని బాబులు ఈయేళ ఎందుకొచ్చారే?’’

‘‘ఒరే ఢక్కువా, కొత్తబట్టలు తెచ్చేడు. కట్టుకొని బయలుదేర్రా’’ పూజారి గర్జించేడు.

‘‘ఓల్‌రైట్‌’’ కుర్రాడు తెచ్చిన బట్టల్ని అందుకున్నాడు. ‘‘మరి కట్నం?’’

‘‘ఇదుగో ఇరవై’’ చేతిలో పెట్టబోయాడు గంగరాజు.

‘‘నో నో ఫిఫ్టీ డాలర్స్‌. ఏభై లేకపోతే నేను రానెహోయ్‌’’ 

మిగతా ముప్పై కలిపి చేతిలో పెట్టాడు గంగరాజు. తూలుతున్న ఢక్కువాడి జబ్బ పట్టుకుని పెరట్లోకి తీసుకెళ్లింది ఆదెమ్మ. గిన్నెడు తరవాణి తాగించింది. ఆ పులుపుకి మొగమంతా వికృతంగా చిట్లించుకుంటూ బ్రేవ్‌మని తేన్చాడు. ‘‘ఇక్కడ కాదు, నా కొడుకు శవాన్ని స్నానం చేయించిన దగ్గరే నాకూ నీళ్లు పొయ్యి’’ తడబడుతూ వెళ్లి కూర్చున్నాడు.

‘‘ఏభై రూపాయలు ఇలా తే. మనం తిన్నా తినకపోయినా ముందు అప్పులోళ్ల సంగతి చూడు, బజార్లో పట్టుకుని నానా తిట్లు తిడతన్నారు.’’

‘‘అప్పులు చెయ్యడం, తిట్లు తినడం, పస్తులుండటం మనకలవాటేనే. ఈ అప్పు తీరిస్తే మళ్లీ మరో అప్పు. అప్పుడెక్కడ్నుంచి వస్తయి పైసలు. ఈరోజు నేను రాజా. ఈరోజు పోతే రేపు మరి నాకు లేదు. ఫుల్‌గా పఠాసు కొట్తేస్తాను.’’

‘‘తిండికి లేక సస్తుంటే తాగుతానంటా వేంటీ?’’

దూరంగా బాజాల మ్రోత. సన్నాయి మేళం, జేగంటలు దగ్గరవుతూ ఢక్కువాడి ఇంటి ముందర ఆగాయి. ఆదెమ్మ ఒళ్లంతా తుడిచి కొత్తబట్టలు కట్టించింది. కొత్త పంచ, కొత్త తలపాగా. కండువా నడుంకి. చేతి కర్రకి రంగు గావంచ యెత్తి పట్టుకుని వాకిట్లో నిల్చున్నాడు ఢక్కువాడు. గంగరాజు స్వయంగా కాళ్లు కడిగి పూలదండ వేసి నమస్కరించాడు. ఢక్కువాడు రథయాత్రకి  బయలుదేరాడు.

‘‘ఢక్కువాడొచ్చేడు! ఢక్కువాడొచ్చేడు’’ అంటూ జనం చుట్టుముట్టేరు. వాళ్లందర్నీ పక్కుకు నెడుతూ నిచ్చెన వేసి వాడ్ని రథం మీదకు ఎక్కించేరు. తండ్రులు పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని ఢక్కువాడ్ని చూపిస్తున్నారు.

‘‘తైతైతైతై తైతైతైతై’’ అంటూ సంకీర్తన మేలగాళ్లని గొడుగు కర్రని ఆడిస్తూ హెచ్చరించేడు. ‘‘ఢింఢిం తకఢింఢిం’’ ‘‘ఢైంయ్‌ ఢైంయ్‌’’ ‘‘రొధొ ఢీకొ ఢీకొయిలా! మహాప్రాంకొరొ కొండియా నపాయిలా తైతైతై’’ వలయాకారంగా నడ్డి తిప్పుకుంటూ రథం మీద గెంతుతున్నాడు ఢక్కువాడు. బూతు పేలింది. రథచక్రాలు కదిలేయి. ఆ పాటకి అర్థం యేమిటన్నట్లు పూజారికి సంజ్ఞ చేశాడు గంగరాజు. ఒరియా తెలిసిన పూజారి గంగరాజు చెవిలో గొణిగాడు. ముసిముసి నవ్వుకుంటూ సంబరంతో పాటు నడుస్తున్నాడు గంగరాజు. ఢక్కువాడు మరో పాట అందుకున్నాడు. రకరకాలుగా గెంతుతున్నాడు. కోతిలా యెగురుతున్నాడు.

రథం దగ్గర చిన్న గందరగోళం మొదలైంది. గళ్లచొక్కావాడు ‘‘కొబ్బరికాయలు అందిస్తున్న ఆడవాళ్ల చేతులు పట్టుకుంటావా?’’ అని పూజారి పెద్దకొడుకు చొక్కా పట్టుకున్నాడు. ‘‘రౌడీవెధవ, నువ్వు చూశావురా?’’

సాంబడు రథస్తంభం పట్టుకుని ఎగిరి గళ్ల చొక్కావాణ్ని జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. ‘‘సంబరం భగ్నం చేయడానికి పితూరీ లేవదీస్తున్నావా? ఎంకునాయుడు ఎంగిలి కూడు కతికి జగడానికి వస్తావా?’’ క్రిందపడేసి ఈడ్చి ఈడ్చి తంతున్నారు. వాడి పార్టీ వాళ్లు బలం చాలక జారుకున్నారు.

బాజాలు మ్రోగుతున్నాయి. ఈ సందడిలో ఢక్కువాడు దిగిపోయేడు. సీసా తీసి డగ్‌ డగ్‌ మని గుటకలు వేసి మూతి తుడుచుకున్నాడు. ‘‘నేను దరిద్రపు నా కొడుకుని. నా బాబూ తాతలందరూ దరిద్రంతో బతికి ఆకలితో సచ్చారు. తరతరాల నుంచి మా బూతులు యింటూ కులాసా పడిపోతున్న దేవుడు మా ఆకలి తీర్చాడా? నా కొడుకును రచ్చించాడా?’’ ఢక్కువాడి కంఠం రుద్దం అవుతోంది. ‘‘నా కొడుకు పోయాడు నాయనా, ఆరు నెలలు రోగంతో తీసుకుని మందుల్లేక తిండిలేక తడపలా అయిపోయి, బిళ్ల బిళ్లలు రకతం కక్కుకుంటూ సచ్చిపోయేడు. నా పద్దెనిమిదేళ్ల కొడుకు ఎలిపోయాడు నాయనా’’ గొల్లున ఏడుస్తూ కూలిపోయాడు. సాంబడు వాడ్ని ఓదారుస్తూ రథం యెక్కించి వెనకాల ఎవరికీ కనబడకుండా పడుకోబెట్టాడు.

చీకటి పడింది. గేస్‌లైట్లు, దివిటీలు వెలిగించారు. గుడిసెన్న గుడి దగ్గర పడుతుందనగా ధన్‌మని సోడాబుడ్డి పేలింది. నలువైపుల నుంచి రాళ్లవర్షం. జనంలో గోల. గళ్ల చొక్కావాడు సైకిల్‌ చెయిన్‌తో సాంబడ్ని కొట్టాడు. చెట్టులా పడిపోయేడు సాంబడు. పూజారులు గెంతేసి పరుగు లంకించుకున్నారు. ‘‘ఎలక్షన్‌ కార్యాలయానికి నిప్పింటించేరు’’ అరిచేడు జనంలోంచి వెంకునాయుడు పార్టీవాడు. క్షణంలా వూరంతా పాకిపోయింది వార్త. కొన్ని యిళ్లు తగలబడుతున్నాయి. గళ్లచొక్కావాడిని ఎవరో కత్తితో పొడిచేరు. ధన్‌ ధన్‌ ధన్‌– గాలిలో తుపాకుల కాల్పులు. పోలీసులు పోలీసులు. అరగంటలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గంగరాజునీ, వెంకునాయుణ్నీ అరెస్టు చేశారు. కరెంట్‌ కట్‌ చేశారు. కర్ఫ్యూ విధించారు. 

రథాన్ని గుడిసెన్న గుడికి తీసుకురావడానికి పోలీసుల బలగం బయలుదేరింది. పోలీసుల్ని పురమాయిస్తూ ఇన్‌స్పెక్టరు రథం మీదికి టార్చిలైటు వేశాడు. ఒక మానవ కళేబరం రథానికి వేలాడుతోంది. ఢక్కువాడు కొత్త కండువాతో ఉరిపోసుకున్నాడు.

తరువాతి కథ: గంగరాజు, వెంకునాయుడు తిరిగి జనాల్లోకి వచ్చారు. ప్రతీ సంవత్సరం వైభవంగా రథయాత్ర జరుగుతూనే ఉంది. వెంకునాయుడు, గంగరాజు రొటేషన్‌ పద్ధతిలో ఎంఎల్‌ఏలు అవుతూనే ఉన్నారు. పాత రథం స్థానే కొత్త రథం వచ్చింది. ఢక్కువాడి పీనుగుతో మైలపడిన పాత రథాన్ని ఊరవతల పడేశారు. చుట్టుపక్కల వాళ్లకి అప్పుడప్పుడూ ఊరవతల నించి అర్ధరాత్రివేళ స్పష్టాస్పష్టంగా ఏవో పాటలు, ఏడుపులు వినిపిస్తుంటాయట! 


(సాక్షి సాహిత్యం; 24 సెప్టెంబర్‌ 2018)

Monday, August 31, 2026

6ద్ర


ఆరుద్ర
31 Aug 1925 - 4 June 1998


6ద్ర

ఆగస్టు 31న ఆరుద్ర జయంతి
-------------------------------------

ఆరుద్రకు ఒక ‘నేమ్‌ప్లేట్‌’ చేయించాలంటే, ఆయన పేరుముందు ఏం చెక్కించాలి? బహుముఖ ప్రజ్ఞాశాలి అనేయొచ్చు సింపుల్‌గా. కానీ ఆ ప్రజ్ఞ  ఎన్నిరకాలు?

కవి, కథకుడు, డిటెక్టివ్‌ నవలా రచయిత(నెలకొకటి చొప్పున రాస్తానని అలాగే రాయడం ఆయన చేసిన ఆరుద్రశపథం), గేయకర్త, గేయనాటకకర్త, వ్యాసకర్త, గడీనుడీకారుడు, సంపాదకుడు, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, అభ్యుదయ రచయితల సంఘం– అరసం వ్యవస్థాపకుల్లో ఒకరు(సంఘాల గొడుగు ఎందుకు? అంటే, వానపడకుండా ఉండటానికంటాడు!), చివరగా సినిమా రచయిత. అనగా, పాటలూ మాటలూ అనువాదాలూ.
 
రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా(గోరంతదీపం); అమ్మకడుపు చల్లగా (సాక్షి); కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల); వేదంలా ప్రవహించే గోదావరి (ఆంధ్రకేసరి); ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం (ఎంఎల్‌ఏ); ఎదగడానికెందుకురా తొందర (అందాల రాముడు); ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ (ముత్యాలముగ్గు); శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది (పెళ్లిపుస్తకం)...  ఆరుద్రను ఇలాంటి ఏ కొన్ని పాటలతోనైనా పరిచయం చేయొచ్చు; లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ ఆయన్ని స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’.

భాగవతుల సదా శివశంకరశాస్త్రిగా జన్మించి, జన్మనక్షత్రం పేరిట తన కలంపేరును స్వీకరించిన ఆరుద్ర– కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చాటుకున్నాడు. ‘నాకోసం నేను రాసుకోను. అందరికోసం నేను రాస్తాను. అందరూ నావాళ్లే కాబట్టి, నాకోసం రాసింది అందరికోసం రాసిందే’ అంటాడు.

తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఆరుద్ర రాసిన ‘త్వమేవాహం’ చదివి, ఇక నేను పద్యాలు రాయకపోయినా పరవాలేదు, అని ఆనందపడ్డాడట ఆరుద్రకు మేనమామైన శ్రీశ్రీ. ఇందులో ఆరుద్ర– సమాజాన్ని గడియారంతోనూ, ధనికుల్ని గంటల ముల్లుతోనూ, మధ్యతరగతివాళ్లని నిమిషాలముల్లుతోనూ, పేదల్ని సెకన్లముల్లుతోనూ, ‘కీ’ని విప్లవగొంతుకగానూ ప్రతీకిస్తాడు.

అంత్యప్రాసల ముద్ర–ఆరుద్ర అనిపించుకున్న ఈ ‘సన్యాసి రూప’ కవి... ‘ఛందస్సులతో అడ్డమైన చాకిరీ అందంగా చేయించుకోగలడు’. శ్లేషలు, చమత్కారాలతో మురిపిస్తాడు. చెరిషించి, పెరిషించి లాంటి తెలుగు ఇంగ్లీషు పదాల కాక్‌టెయిల్‌ సృష్టిస్తాడు. ‘ఆ/ మెన్‌/ ఆమెన్‌/ చెరపట్టన్‌/ మ్రోగెన్‌/ నీగన్‌/ నా/ పెన్‌/ ఆపెన్‌’... లాంటి పదాల గారడీలో వస్తువుకు ఔచిత్యభంగం వాటిల్లుతోందా? అనే మీమాంస ఒకటి కలిగినప్పటికీ!

‘చిన్ని పాదములందు/చివరి ప్రాసల చిందు/ చేయు వీనులవిందు/ ఓ కూనలమ్మా’ అంటూ కూనలమ్మ పదాలు ప్రారంభించాడు ఆరుద్ర. ‘ఆలి కొన్నది కోక/ అంతరిక్షపు నౌక/ అంతకన్నను చౌక/ ఓ కూనలమ్మా’ అని నవ్విస్తూనే, ‘కోర్టుకెక్కినవాడు/ కొండకెక్కినవాడు/ వడివడిగ దిగిరాడు’ అన్న సత్యాన్నీ చెబుతాడు. ‘అంతుచూసేవరకు/ అకట ఆంధ్రుల చురుకు/ నిలువ ఉండని సరుకు’ అని తెలుగువారి ఆరంభశూరత్వాన్ని వెక్కిరిస్తాడు. ‘అణువు గుండెను చీల్చి/ అమితశక్తిని పేల్చి/ నరుడు తన్నును బాల్చి’... చిన్న పదాల్లో పెద్ద భావాన్ని ఇముడుస్తాడు. ‘పరుల మేలును కోరి/ పదములల్లెడు వారి/ పథము చక్కని దారి’ అనిపిస్తాడు.

ప్రయోగశీలత ఆయన కథల్లోనూ కనిపిస్తుంది. ‘సుబ్బారావున్నరగంటలసేపు’ అంటాడొకచోట. తన పురుషుడిని తన పూర్తి ప్రపంచంగా మలచుకున్న స్త్రీ హృదయానికి ఈ కొలత సులభంగా అర్థమవుతుంది!

‘రాముడికి సీత ఏమౌతుంది?’ లాంటి ఆకస్తికర శీర్షికతో సకల రామాయణాల్ని తవ్విపోశాడాయన. శ్రీకృష్ణుడు అసలుసిసలు ఆంధ్రుడనీ, ఏకలవ్యుడు కుంతీదేవి అక్క కొడుకనీ, పుత్రికకూ కుమార్తెకూ భేదముందనీ, పుత్రిక అంటే సహోదరులు లేనిదనీ, కుమార్తె అంటే తోడబుట్టినవారిని కలిగినదనీ తేల్చిచెప్పాడు.

‘సినీవాలి’, ‘ఇంటింటి పజ్యాలు’, ‘గాయాలు–గేయాలు’, ‘పైలాపచ్చీసు’, ‘శుద్ధ మధ్యాక్కరలు’, ‘గుడిలో సెక్స్‌’, ‘వేమన్న వాదం’, ‘తిరుక్కురళ్‌’అనువాదం, చదరంగ పుస్తకం, ‘సినీ మినీ కబుర్లు’... ఇక, రాయడం అటుండనీ, చదవడానికే జీవితకాలం చాలదనిపించే బృహత్తరమైన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ ఆయన పరిశోధనాశక్తికి పరాకాష్ట! సంస్థలుగా మాత్రమే చేయగలిగిన పనిని ఒక్కడే పూనిక వహించి పూర్తిచేశాడు. ‘నాకు స్పష్టంగా తెలుసు అనుకున్నదాన్ని పాఠకులకు స్పష్టంగా’ చెప్పదలిచాడు. చాళుక్యులు నుండి ఆధునిక కాలం వరకు ‘ఆర్థికసంబంధాల ప్రాతిపదికన యుగవిభజన’ చేసిన ఈ పుస్తకం కోసం– ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. మధుమేహం పెరిగి మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. కంటిచూపు తగ్గిపోయింది. అయినా అన్ని కష్టాలనూ ఓర్చి వెయ్యేళ్ల చరిత్రను తెలుగువాళ్లకు అందించగలిగాడు. ‘సాహిత్యం అర్ణవమైతే, ఆరుద్ర మథించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు; ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు’.

(సాక్షి ఫన్‌డే; 31 ఆగస్ట్‌ 2014)
––––––––––––––––––––––

Thursday, August 27, 2026

ఏబది వేల బేరము


కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు(1877–1923) కథ ‘ఏబది వేల బేరము’కు సంక్షిప్త రూపం. కె.రామానుజరావు అనే కలంపేరుతో రాశారు. ఆంధ్రపత్రికలో1910లో ప్రచురితం. సౌజన్యం: వికీపీడియా. కొమర్రాజు తెలుగు, మరాఠీ భాషల్లో సమాన పండితుడు. సంస్కృతం, హిందీ, బెంగాలీ, గుజరాతీ భాషల మీదా పట్టుంది. శివాజీ చరిత్ర, హిందూ మహాయుగము, ముస్లిం మహాయుగము రాశారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలు వెలువరించారు. వ్యక్తి కాదు, సంస్థ అనిపించుకున్నారు. అనారోగ్యంతో 46 ఏళ్లకే మరణించారు. తొలి తెలుగు కథారచయిత్రి భండారు అచ్చమాంబ ఈయన అక్క.

–––

కంగారు ఆభరణాలు


చెన్న పట్టణమందలి షాహుకారుపేట లక్ష్మికి నివాస స్థలము.

ఒకనాడుదయము జగజీవన్‌ లాల్‌ నాలుగంతస్థుల మేడ యెదుట రెండు గుఱ<ముల కోచి బండి నిలచెను. బండిలో వెనుక ప్రక్కనొక పురుషుడును, అతని భార్యయు గూర్చుండియండిరి. వారికి నెదుట నైదారు నెలల పిల్లవాని నెత్తుకొని యొక దాసి కూర్చుండి యుండెను. బండి వెనుక చిత్రమైన దుస్తులు ధరించిన గుఱ<పు వాండ్రిద్దరు నిలిచి యుండిరి. బండికి ముందు భాగమున నెత్తుగనున్న యాసనముపై కోచిమన్, వాని ప్రక్కన మరియొక సేవకుడును గూర్చుండియుండిరి. యజమానుడు తన జేబులో నుండి విజిటింగ్‌ కార్డు నొకదానిని తీసిచ్చెను. జగజీవన్‌ లాల్‌ ఆ కార్డును చూచుకొని రాజా ఆఫ్‌ నర్సాపూర్‌ అని చదివి తత్తరపాటుతో బండియొద్దకు వచ్చెను.

ఈ వర్తకుడు రవ్వలు, కెంపులు, పచ్చలు, వైఢూర్యముల వర్తకమే చేయుచుండును. పుష్యరాగముల వంటి తక్కువ వెలగల రాళ్ళనుగాని, వెండి బంగారములను గాని ముట్టనే ముట్టడు. ఆతని పద్దులన్నియు వేలు లక్షలు. రాజులు, మహరాజులితని వద్ద లక్షల కొద్ది వెల గల రాళ్ళను తీసికొని పోవుచుండిరి. ఆతడు బండి సమీపమునకు వచ్చిన తోడనే, సేవకుడు బండి తలుపుల దీసెను. బండిలో నుండి జమీందారు దిగి, షాహుకారుతో షేక్‌ హాండు చేసి ‘మీరేనా జగజీవనలాలు షేట్జీగారు’ అని యడిగెను. ‘కుబేరుని తరువాత తామే కుబేరులని వినియున్నాను’.

‘మీ వంటి రాజాధిరాజుల యనుగ్రహముండ నేను కుబేరుడనే, దయచేయుడు’ అని మాట్లాడుకొనుచు వారిద్దరును లోనికి పోయిరి. జమీందారు భార్యయు, పిల్లను నెత్తుకొన్న దాసియు లోనికి బ్రవేశించిరి. ఈ జమీందారుడు ఇంగ్లీషు ఫ్యాషన్‌ గలవాడగుటచే తన భార్యకు ఘోషా లేకుండజేసినట్లు కానవచ్చుచున్నది. ఘోషా లేదుకాని, యీమెకు వంటిమీద నగలు మాత్రము పరిమితముగా నుండెను. మెడలోనున్న సూర్యహారమే యొక పదివేలు, చంద్రహారమే పదియైదు వేలు చేయవచ్చును. కాళ్ళకున్న బంగారు పాంజేవులు అయిదువేలయిన ఖరీదు చేయవో? దాసి భుజముపై నిద్రించుచున్న బాలునికి మిక్కిలి విలువగల నగలు పెట్టబడెను.

మేడమీద గొప్ప గొప్ప రాజుల కొఱకై అలంకరించబడిన హాలులోనికి దీసికొనిపోయి జమీందారు నొక కుర్చీమీద కూర్చుండబెట్టి అతని భార్యకు కొంచెము చాటుననున్న యొక స్థలమును చూపించెను. 

జగ: ‘అయ్యా, తమ రాజధాని ఏ జిల్లాలోదండి.’

జమీం: ‘మా సంస్థానము గోదావరి జిల్లాలోనున్నది. మేము కలక్టరును చూచుటకు వెళ్ళినపుడు పదిహేను ఫిరంగులు కాల్చెదరు. వెండి కుర్చీల మీదగాని మేము కూర్చుండము. కాని నేనింగ్లీషు యెడ్యుకేటెడ్‌ జంటిల్‌మన్‌ అయినందున ఈ పిచ్చి ఆచారములు పాటింపను. టట్‌ నాన్సెన్సు అని మా ఆడవారి ఘోషా కూడ తీసివేసితిని. ఈ సంగతులకేమి గాని నిన్నటిదినము జయపురము మహారాజు మీవద్ద కొన్న లక్ష రూపాయల జవాహిరి చూచితిని. వారికి నాకు మిక్కిలి స్నేహము.’

జగ: ‘చిత్తము, మహారాజులంగారికి నాయందు మిక్కిలి అనుగ్రహము.’

జమీం: ‘రవ్వలంటే మీ వద్దనే రవ్వలు, ఏమి ఆ కాంతి? ఇంకను అట్టి రవ్వలు గలవా?’

జగ: ‘కొనువారుండిన రవ్వలకేమి తక్కువ. తెప్పించెదనా?’ అని అడిగి, లేచి లోనికి బోయి సేవకునిచే నొక పెద్ద ట్రంకు పెట్టెను పట్టించుకొని వచ్చి బల్లమీద పెట్టి దానిందెఱిచి రవ్వల పొట్లము నొకటి వెనుక నొకటి తీయుచు జమీందారు గారికి చూపదొడగెను. ఇవి బాగున్నదని బాగుండ లేదనియు జెప్పుచు, దీని వెల యెంత దాని వెల యెంత అని అడుగుచు ‘మీరు మిక్కిలి సత్యసంధులని జయపుర మహారాజా గారు నాతో చెప్పినంతనే వచ్చితిని. క్రమమైన వెల జెప్పవలయును సుమా’యని నడుమ నడుమ ననుచు తనకు చక్కగ గానుపించిన వానిని భార్య వద్దకి తీసుకొనివెళ్ళి చూపుచు మరల దెచ్చును. గంట వఱకు బేరము చేసెను. తుద కేబది వేల రవ్వలను బేరము చేసి విడిగా తీయించెను. షాహుకారు జమీందారు రత్నపరీక్ష జ్ఞానమునకు యాశ్చర్యమందుచు నడుమ నడుమ అతనిని పొగడుచుండెను.

ఇట్లు సిసలు పఱిచిన రవలనన్నింటిని చిన్న చిన్న పొట్లములుగా గట్టి ఆ పొట్లముల నన్నింటిని జమీందారు తనయొద్దనున్న పెద్ద మనీగాన్‌లో పెట్టి దానిని తన జేబులో నుంచుకొని షాహుకారుతో నిట్లనియె.

‘అయ్యా, అప్పనగా నాకు చీదఱ. కొన్న సరుకులకు వెలవెంటనే ఇయ్యవలయునని నా తాత్పర్యము. ఇంటి నుండి బయలుదేరునప్పుడు మీవద్దకు రావలెనని యనుకొనలేదు. ఈ త్రోవన మఱియొక చోటికి పోవుచుండగా నదియే మీ యిల్లని మా బండివాడు చెప్పెను. మిమ్ముల చుడవలెనని యాగితిమి. చూచినందుకు లాభమేయైనది. నిచ్చటికి వచ్చెదమని తలంపనందున పైకము తేలేదు. నేను యింటికి వెళ్ళి పైకము తీసుకొని వచ్చెదను. అంతవఱకు మన వాండ్రిక్కడనే యుండెదరు. తండియార్పేట వఱకు మనవాళ్లను తీసుకొని వెళ్ళవలసిన పనివున్నది. కావున ఇప్పుడు వీని నింటికి తీసుకొని పోవుట యెందుకు’ అని చెప్పి యాతడు లేచి భార్యతో నే వచ్చువఱకు నీ విక్కడనే యుండుమని చెప్పి కోచిబండి నెక్కి వెళ్ళిపోయెను.

భార్యాపుత్రులను యుంచి వెళ్ళుటకు జమీందారు గారొక కారణము చెప్పినను, జగజీవనలాలు మాత్రమా కారణమును నమ్మక, జమీందారు మిక్కిలి మర్యాదగల వాడగుటచే, తన నమ్మకమునకై వారిని తన ఇంట దించిపోయెనని తలచి, సంతసించెను.

జమీందారు వెళ్ళి అరఘంటయిన తరువాత సేవకుడు పరుగెత్తుకొని వచ్చి ‘దొరసానిగారూ? ఖజానా తాళపుచేతుల గుత్తి మీవద్దనే యున్నదట, దొరగారు మఱచి వెళ్ళినారు. తొందరగా తీసుకొని రమ్మని నన్ను పంపినారు. ప్రొద్దెక్కుచున్నది. పైకము తెచ్చి షాహుకారుగారికిచ్చి మనము తండియార్పేట వెళ్ళవలసి యున్నది’ అని పలికెను. అంతనామె తాళపు చేతుల గుత్తి వానిపై వేసి తొందరగా పొమ్మని యాజ్ఞాపించెను. వాడు పదియడుగులు వేయగా మఱల వానిని బిలిచి ఏమో యాలోచించి ‘గుత్తి నిటుతే’యని, ‘దినములు మంచివి కావు. లక్షల కొలది ధనమున్న ఖజానా తాళపుచేతులు వీనికిచ్చి పంపిన వీడేమి చేయునో? వీడు నమ్మిక కలవాడే గాని ధనముజూచిన ఎట్టి వారికి దుర్బుద్ధి పుట్టకమానదు. ఏమండీ షాహుకారుగారూ నిజమేనా?’ అని యడుగగా నాతడు ‘నిజమే నిజమే. డబ్బునెడల బహు జాగ్రత్తగా నుండవలెను’ అని తల యూపెను. ‘అట్లయిన నేనే తాళపుచెవుల గుత్తిని తీసుకొని వెళ్ళి పైకము తీసుకొని మేమిద్దఱము వచ్చెదము. నేను వచ్చు వఱకు అబ్బాయి పాలకేడ్చునేమో కావున కొంచెము పాలిచ్చి వెళ్ళెదనని ‘సీతా సీతా’యని దాసిని పిలిచెను.

దాసి పిల్లవానిని జోలపాడి నిద్రబుచ్చుచు మేడ క్రింద నొంటరిగా నుండెను. దాని జోల పాట మాత్రము పైకి వినబడుచుండెను. పిలిచిన తోడనేయది పిల్లవానిందీసికొని యజమానురాలి వద్దకు వచ్చెను. పిల్లవాని శరీరమంతయు నగలతో నిండియుండెను. రవ్వల, కెంపుల, పచ్చల పతకములు వ్రేలాడుచు ముఖమును కప్పివేసి యుండెను. యామె వానికి పాలిచ్చి యొక చిన్న పరుపు దెప్పించి వానినచ్చట బరుండబెట్టి భద్రమని దాసికి జెప్పి తన శరీరము మీది యేబది యరువది వేల విలువగల నగలను తీసి యాపిల్లవాని ప్రక్కనే యుంచి ‘మీ నమ్మిక కొఱకు వీనినిక్కడ నుంచుచున్నానని’ షావుకారుతో చెప్పెను. ‘కోటి వెలగల మీ కుమారునే ఇచ్చట నుంచుచున్నపుడు వేరే నగలుంచవలయునా? ఒకరిపై నొకరికి నమ్మిక లేని యెడల కలియుగ మెట్లుసాగు’నని, ‘మీరు వెళ్ళుటకు నా కోచిబండిని తెప్పింతునా’ అని యడిగెను. అచటనున్న సేవకుడు ‘అక్కర లేదు. నేను నడచి వచ్చిన తాళపు చేతి గుత్తి తీసికొని వచ్చుట కాలస్యమగునని నా యజమానుడు నన్ను కోచిబండి మీదనే పంపెను’ అని చెప్పెను. 

యజమానురాలు వెడలిన కొంతసేపటికి దాసి షాహుకారు వద్దకు వచ్చి ‘అయ్యా బీదదానిని. మా దొరవారు మీ యొద్దనెన్నో రాళ్ళు కొన్నారు. మీకింత లాభమైనప్పుడు నాకు కొంచెము యీనామియ్యకూడదా? దొరసానితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను’ అని పెక్కు మాటలు చెప్పి ఎప్పుడెవ్వరి కేమియు నియ్యని లుబ్ధాగ్రేసర చక్రవర్తియగు జగజీవనలాలు యొద్దనుండి యొక రూపాయి బహుమానము వడసెను. రూపాయి చేతిలో పడగానే ‘అయ్యా, కల్లుగాని సారాగాని త్రాగనిది యుండలేము. మా దొరగారికి దొరసాని గారికీ పేరన్న గిట్టదు. నెలదినముల నుండి లేక చచ్చిపోవుచున్నాను. వారు వచ్చువఱకు ఈ ప్రక్క యంగడిలోనికి పోయి పావులా సారా తాగి వచ్చెదను. నిముసములో వచ్చెదను. అంతవఱకు చిన్నదొరగారికి కొంచెము చూచుచుండుడి. నిద్రలో ఏడ్చెనేని కొంచెము జోకొట్టుడి’ అని చెప్పి వెడలిపోయెను.

పది ఘంటలాయెను. పదునొకండు ఘంటలాయెను. పండ్రెండు ఘంటల సమయమై ‘ధమ్మ’ని ఫిరంగి మ్రోత వినబడెను. షాహుకారుకు సంశయము పుట్టదొడగెను. కడుపున పుట్టిన బిడ్డను, ఇంత ధనముని విడిచి వారేల పోయెదరని సమాధానము చేసికొనెను. నొంటిగంటయ్యె. అప్పటికైనను, ఎవ్వరు తిరిగి రాలేదు. నిద్రబోవుచున్న పిల్లడైనను యేడువలేదు. ఆహారము లేక సొమ్మసిల్లెనేమోయని షాహుకారు పిల్లవాని యొద్దకుపోయి నెత్తుకొని చూడ యాశ్చర్యము! అది పిల్లవాని యంతయాకారము గల యొక జాతి బొమ్మ!! షాహుకారు సేవకులనందఱిని పిలిచి చూపెను. వారందఱును అదియొక మోసమని తెలిసికొని ‘మోసమైన మనకేమి, మనరాళ్ళ వెలకంటె మించిన నగలున్నవి’ యని నగలకు మదింపు వేయసాగిరి. ఒక్కోనగ తీసి చూచిన కొలదిని అవి గిల్టు నగలేకాని నిజమైనవి కావని స్థిరపడెను. నగలన్నియు నూరు రూపాయల కంటె వెలచేయవు.

పోలీసు వారికీ సమాచారమును తెలిపిరి. పోలీసువారు కొందఱును జగజీవనులాలు సేవకులు కొందఱును మాఱు వేషములతో నర్సాపురము వెళ్ళి విచారించి, నర్సాపురపు జమీందారీ సృష్టియందెచ్చటను లేదని తిరిగివచ్చిరి.

ఎంతమంది జమీందారులనో మోసపుచ్చిన తనను ఈ బూటకపు జమీందారు మోసపుచ్చె గదాయని చింతించుట తక్క జగజీవనలాలుకు మఱియేమి యుపాయమును లేకపోయెను.


(సాక్షి సాహిత్యం; 12 ఆగస్ట్‌ 2019)

Monday, August 24, 2026

చదువరి బోర్హెస్‌


జార్జ్‌ లూయీ బోర్హెస్‌


చదువరి, రాయరి

ఆగస్టు 24న జార్జ్‌ లూయీ బోర్హెస్‌ జయంతి
-----------------------------------------------------

బోర్హెస్‌ను పట్టించే రెండే పదాల్ని చెప్పమంటే, తడుముకోకుండా ఎంచుకోగలిగేవి: చదవడం, రాయడం!

చిన్నతనంలోనే వాళ్ల నాన్న తన గ్రంథాలయాన్ని బోర్హెస్‌కు పరిచయం చేశాడట. ‘అందులో ఏం కావలిస్తే అది చదువుకో’మన్నాడట. ‘కాని ఏదైనా విసిగిస్తే వెంటనే దాన్ని పక్కన పెట్టేయమన్నాడు. అంటే నిర్బంధ పఠనానికి వ్యతిరేకం అన్నమాట. పఠనమంటే ఆనందం కలిగించేదిగా వుండాలి.’

తన పఠనాన్ని బోర్హెస్‌ ఎంత ఆనందమయం చేసుకున్నాడంటే, స్వర్గం కూడా గ్రంథాలయంలా ఉండింటే బాగుండేదని తలపోశాడు.

అయితే, ముప్పై ఏళ్లవరకూ తనను తాను నిరర్థకమైన జీవిగానే భావించుకున్నాడాయన. గంభీరమైన చరిత్రగల కుటంబంలో అర్జెంటీనాలో జన్మించిన బోర్హెస్‌(1899–1986) తాతలు యుద్ధాల్లో పాల్గొన్నవారు! తనకు రోజూ పొద్దునే గడ్డం గీసుకోవడానికి ఉపకరించే రెమింగ్టన్‌ కంపెనీయే తన తాతయ్య మరణానికి కారణమైన రైఫిళ్లను ఉత్పత్తి చేసిందన్న నిజం ఆయనకు చిత్రమైన గగుర్పాటు కలిగించేదట. సాహసాలతో నిండి సుసంపన్నంగా కనిపించే తన పూర్వీకుల జీవితంతో పోల్చుకుంటే ఆయనకు న్యూనత కలిగేదట. కార్యశూరత లేని ‘ఒక పాఠకుని జీవితం, అప్పుడప్పుడు తీవ్రంగా, ఒక పేద జీవితమని అనిపించే’దట.
 
కాని దాన్నుంచి ఆయన బయటపడగలిగాడు. ‘ఒక పాఠకుని జీవితం కూడా వేరే ఏ జీవితంతోనైనా సమానంగా సమృద్ధమైనదే’ అని మనస్ఫూర్తిగా తెలుసుకున్నాడు. ‘అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటారు. కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటాను. నేను మంచి రచయితను అవునో కాదో నాకు తెలియదుగాని నేను చాలా మంచి పాఠకుణ్ని,’ అని గర్వంగా చాటుకున్నాడు.

తర్వాత ఎన్ని ముద్రణలు వెలువడినప్పటికీ, తను చదివిన ఆ పాత పుస్తకం, దాని అట్ట, అందులోని అక్షరదోషాలు,  గీసుకున్న గీతలున్నదే అసలైన ‘డాన్‌ కిహోటి’గా భావించడం ఆయన వేలాది పఠనానుభవాల్లో ఒకటి!

తన మాతృభాష స్పానిష్‌ సాహిత్యంతో మొదలుకొని, జర్మన్‌ సాహిత్యం (ఎంతో ఉన్నతమైన సాహిత్యాన్ని అందించిన జర్మన్, ఆ సాహిత్యకంటే అందమైన భాషంటాడు!), ఫ్రెంచ్‌ సాహిత్యం (ఎంతో శ్రేష్టమైన సాహిత్యాన్ని అందించిన ఫ్రెంచ్, ఆయనకు వికారంగా తోచిందట!), ఆంగ్ల సాహిత్యం (ఆయన్ని షేక్‌స్పియర్‌ ముగ్ధుణ్ని చేయలేదు; ఆంగ్లాన్ని మాత్రం సొంతభాషలా ప్రేమించాడు.), ఇంకా, చరిత్ర, తత్వశాస్త్రం, గణితం, భూగోళం, మతగ్రంథాలు... ఎంత చదవాలో అంత చదివాడు; తిరిగి, వాటి గురించి ఎంత రాయాలో అంత రాశాడు. ‘కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు, మేజిక్‌ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకు ఆద్యుడు’గా నిలిచాడు. ‘ఫిక్షన్స్‌’ ‘ది అలెఫ్‌’ కథాసంకలనాలు ఆయనకు విశ్వవిఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

ఆయన తండ్రి జార్జ్‌ గిలెర్మో బోర్హెస్‌ ఒక విఫల రచయిత! తండ్రి సాధించలేని చోట, తను కృతకృత్యుడవ్వాలన్న నైతిక ఒత్తిడి కూడా ఆయన్ని రాయడానికి పురిగొల్పింది. తొమ్మిదేళ్లప్పుడే ఆస్కార్‌ వైల్డ్‌ ‘ద హాపీ ప్రిన్స్‌’ను స్పానిష్‌లోకి అనువదించాడు; కానీ అది వాళ్ల నాన్న చేశాడనుకున్నారట. అయితే, తరువాతి రెండు దశాబ్దాలపాటు ఆయన ఎన్నో పుస్తకాలు రాసినప్పటికీ, వాటిలో కొన్ని అచ్చువేసినప్పటికీ వాటన్నింటినీ తన ‘ప్రాక్టీస్‌’గా మాత్రమే పరిగణించాడు. ఆడంబర గుణంలోంచి జనించే ‘మేలిమి రచన’కన్నా, ఏ అవాంతరాలూ లేకుండా సాఫీగా సాగే మంచి రచనే ఉత్తమమైనదిగా పేర్కొన్నాడు. ఎవరైనా తనని విమర్శిస్తూ సమీక్షించినప్పుడు, వాళ్లకన్నా తనే మారుపేరుతో మరింత పదునుగా విమర్శ చేసుకోగలనన్నాడు!

తొమ్మిదేళ్లపాటు బోర్హెస్‌ లైబ్రరీలో పనిచేశాడు. గొప్ప పాఠకుడికి తగిన చోటు! మరోవైపు రచయితగానూ ఆయన పేరు మార్మోగుతోంది. అలాంటి రోజుల్లో ఆయన సహోద్యోగి ఒకరు, ‘జార్జ్‌ లూయీ బోర్హెస్‌’ అనే రచయిత పేరూ, ఇతడి పేరూ ఒకటేకావడం; పైగా ఇద్దరికీ ఒకే పుట్టినరోజు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట! తనపక్కనుండి బుద్దిగా పుస్తకాలు సర్దుతుండే ఈ యువకుడే అంతటి కథకుడని ఆ సహోద్యోగి ఎలా నమ్మగలడు!

55 ఏళ్ల వయసులో బోర్హెస్‌కు చూపు పోయింది. అటు ఎనిమిది లక్షల పుస్తకాల వరాన్నీ ఇచ్చి, ఇటు అంధత్వాన్నీ శాపించిన దేవుణ్ని ఆయన నిందించాడు. అయితే, ఒక కళాకారునికి సంభవించే ప్రతిదీ అతని కళకు కావాల్సిన ముడిసరుకేననీ, తనకు ప్రాప్తించే ప్రతీ వేదననీ మూసలోకి మలిచేందుకు పనికొచ్చే మన్నుగానే భావించాలనీ ఆయన చెప్పినట్టుగానే... క్రూరమైన అంధత్వాన్ని కూడా తన జీవితానికి దక్కిన బహుమతిగానే స్వీకరించాడు. డిక్టేషన్‌ చెబుతూ రచనలు చేశాడు; అడాల్ఫో బోయ్‌ కాసరస్‌ లాంటివారితో జతగానూ రాశాడు; ఎన్నో దేశాల్లో పర్యటించాడు; విశ్వవిద్యాలయాల్లో రచన కళ గురించి ఉపన్యసించాడు; పాఠకుడిగానూ, రచయితగానూ రెండు జీవితాల్నీ సంపూర్ణంగా జీవించి నిష్క్రమించాడు!

(సాక్షి ఫన్‌డే; 24 ఆగస్ట్‌ 2014)

Wednesday, August 19, 2026

You’re in a terrible situation either way.



Yan Lianke

 

INTERVIEWER

You talk about the lure of the city, but don’t The Explosion Chronicles and The Family Plot suggest that, as rural villages expand and become wealthier, their inhabitants tend to lose their moral compasses?

YAN LIANKE

I’ve written about all the problems wealth brings, but also about the difficulties of being poor. Humankind lives in an eternal dilemma. You’re in a terrible situation either way.


INTERVIEWER

Could we say that your real subject is power, then? People are powerless when they’re poor, and after gaining power, they use it to oppress others.

YAN

Gaining the power to control others is a terrifying business. I’m currently writing a novel that includes all the revolutionaries who emerged after the Qing dynasty⁠—Sun Yat-Sen, Chiang Kai-Shek, Mao Zedong, Zhou Enlai, Deng Xiaoping, and so on, along with fictional characters from other people’s work, as well as Lu Xun, Hu Shih, and virtually every other Modernist writer. And the writers who killed themselves during the Cultural Revolution, like Lao She and Fu Lei. Obviously, the novel is unpublishable, but I’m strongly drawn to writing it. If only there were no such heroes and we could all calmly live our lives. In any case, I won’t discuss the plot in this interview. Let’s just say that I’m writing a book that I plan never to publish. I’ll leave it to my son, and maybe he’ll pass it on to his children. Maybe, far in the future, people will read it and know that their ancestors once thought and wrote in this way.


(The Paris Review: Yan Lianke, The Art of Fiction  No. 269)

Saturday, August 15, 2026

‘దేశభక్తుల్లో రాజకుమారుడు’


సుభాష్‌చంద్రబోస్‌



‘దేశభక్తుల్లో రాజకుమారుడు’


‘‘భారతదేశ విముక్తి కోసం, 38 కోట్ల నా సాటి భారతీయుల విముక్తి కోసం, దేవుడి పేరుమీద నేను ఈ పవిత్ర ప్రతిన బూనుతున్నాను. సుభాష్‌ చంద్రబోస్‌ అనబడే నేను, నా చివరి శ్వాస వరకూ స్వతంత్రం కోసం పవిత్రయుద్ధం చేస్తాను.’’
బ్రిటిష్‌వారితో పోరాటానికి దిగడానికి, తన 30,000 బలగంతో కూడిన ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ను అధికారికంగా ప్రకటిస్తూ నేతాజీ తనను తాను అంకితం చేసుకున్న తీరు ఇది. ప్రాణాలు అర్పిస్తానని మాటవరసకు చేసిన ఉత్తుత్తి ప్రతిజ్ఞ కాదది. ఉపనిషత్తుల్లో చెప్పిన త్యాగగుణాన్ని నేతాజీ తన రక్తంలో ఇంకించుకున్నాడు. అందుకే ప్రాపంచిక విలాసాలను సమకూర్చగలిగే సివిల్‌ సర్వీసు ఉద్యోగాన్ని ఒక మహోన్నత లక్ష్యం కోసం అట్టే వదిలేయగలిగాడు. 11 సార్లు జైలుకు పోయివచ్చాడు. అంతిమగమ్యం చేరేలోగా మధ్యమార్గంలో ప్రాణం పోయినా ఫర్వాలేదన్నది తనకు తాను ఇచ్చుకున్న తర్ఫీదు.

బేసిగ్గా నేతాజీ కార్యవాది. ఉడుకు నెత్తురు. అందుకే, నూరేళ్ల చరిత్ర ఉన్న ప్రెసిడెన్సీ కాలేజీలో... ‘‘చూడు, అధికులదే ఎప్పుడూ అధికారం. ఇండియన్స్‌ కన్నా బ్రిటిషర్లు మోరల్లీ సుపీరియర్స్‌. ఇది వాస్తవం. దీన్ని అంగీకరించకుండా ఎన్నాళ్లని నినాదాలిస్తారు?’’ అని ‘పేలిన’ ప్రొఫెసర్‌ ఆటెన్‌ మీద ‘చేయిచేసుకున్న’ బీఏ ఫస్టియర్‌ విద్యార్థుల్లో మొదటగా సుభాషుడి పేరే వినిపించింది.

గాంధీజీ ప్రవచించే అహింసా సిద్ధాంతం మీద నేతాజీకి విముఖతకన్నా తనదైన ఒక స్పష్టత ఉంది. తొలిఅడుగు కూడా అహింసతో పడాలనేది మహాత్ముడి ఆలోచన. బ్రిటిష్‌వాడి మెడలు వంచేదాకా దాని అవసరం లేదన్నది సుభాషుడి ప్రతిపాదన. ఆ విభేదం వల్లే, ఆయన ఆల్‌ ఇండియా నేషనల్‌ కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చాడు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ స్థాపించాడు. స్వాతంత్య్రం అనేది బ్రిటిష్‌ వారు తాంబూలంలో పెట్టి సమర్పించే కానుక కాదన్నాడు. దశలవారీ స్వాతంత్య్రాన్ని నిరాకరించాడు. ‘పూర్ణ స్వరాజ్‌’ మాత్రమే అంగీకారమన్నాడు. ‘నాకు రక్తాన్ని ఇవ్వండి; నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అని పలికాడు.

యుద్ధక్షేత్రంలో వ్యూహాలు పన్నడమే కాదు, స్వాతంత్య్రం సిద్ధించాక ఆచరించాల్సిన కార్యాచరణ నిమిత్తం ప్రణాళికలు కూడా లిఖించాడు.

భూస్వామ్య వ్యవస్థ ఉండకూడదు. కులాంతర వివాహాలు జరగాలి. గాంధీ అయిష్టత కనబరిచినా నెహ్రూ సంపూర్ణ మద్దతునిచ్చే భారీ పరిశ్రమల స్థాపన జరగాలి. దేశాన్ని కాపాడుకోగలిగే ఆయుధ సంపత్తి మనమే తయారుచేసుకోవాలి. ఉద్యోగి జీవితం యజమాని దయమీద ఆధారపడి ఉండకూడదు. కార్మికులను యధేచ్చగా వీధుల్లోకి తోసేసి ఆకలికి మాడ్చడం కుదరని పని. అందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దేశంలో అసమానతలు తొలగిపోవాలంటే, రష్యా, టర్కీల్లోలాగా ‘సోషలిస్ట్‌ అథారిటేరియనిజం’ ఉండాలి. అలాగని, ప్రభుత్వం యజమాని, ప్రజలు బానిసలు కావడానికి వ్యతిరేకం.

భగవద్గీతను గాఢంగా అభిమానించినప్పటికీ మతం అనేది నేతాజీకి వ్యక్తిగత వ్యవహారమే. దానికి రాజ్యంతో సంబంధం లేదు. దేశమాత సంకెళ్లను తెంచడానికి పనికొచ్చే ప్రతివ్యక్తీ ఆయనకు ఆత్మీయుడే. వాళ్లు మసీదులో ప్రార్థిస్తారని తప్ప ఇంకేవిధంగానూ ముస్లింలు భిన్నమని నాకెన్నడూ తోచలేదన్నాడు. అందుకే ఆయన సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి. తుపాకీ కాల్చడానికి కూడా వెనుకంజ వేయకూడదనేవాడు. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్‌’ను ఏర్పాటుచేసి యువతులనూ సైన్యంలో భర్తీ చేసుకున్నాడు. అమెరికా, ఇటలీ, చెకొస్లొవేకియా, ఐర్లాండ్‌ దేశాల స్వాతంత్య్ర పోరాటాల తీరును పరిశీలించాడు. ఎన్ని విమర్శలు వచ్చినా జర్మనీ, జపాన్, ఇటలీ దేశాల సాయం కోరాడు. ముల్లును తీయడానికి మరో ముల్లును ఆయుధంగా చేసుకోవాలనుకున్నాడు. స్వాతంత్య్రం లభించాక, ఢిల్లీ గద్దె మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాక, అప్పుడు, ‘గురుదేవా! ఇప్పుడిక దేశానికి నీ అహింసే కావాలి’ అని ఎలుగెత్తి చాటాలనుకున్నాడు. పవిత్ర గంగాజలంతో హింసను శుభ్రపరచాలనుకున్నాడు.
కానీ, ఆకాశమంతటి నాయకుణ్ని ఆ ఆకాశం విమానం సహా మాయం చేసింది. కాయం దొరక్కపోయినా ఆ తేజం అంతటా వ్యాపించింది. అది ఎవరినైనా కదిలించింది. గాంధీజీ ఆయన్ని ఇలా కొనియాడారు: ‘దేశభక్తుల్లో రాజకుమారుడు.’

(సాక్షి ఫన్‌డే; 19 జనవరి 2014)
––––––––––––––––––––––

Thursday, August 13, 2026

హిచ్‌ షాక్‌


ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌
13 Aug 1899 - 29 Apr 1980

 హిచ్‌ షాక్‌

ఆగస్టు 13న మేటి దర్శకుడు ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ జయంతి
------------------------------------------------------------------------

కోడిగుడ్లను చూస్తే, హిచ్‌కాక్‌కు భయమేస్తుందట. భయం అటుండనీ, అవి తిరగబడతాయనిపిస్తుందట! ఏ రంధ్రాలూ లేని ఆ గుండ్రటి తెల్లటి ఆకారం... దాన్ని పగలగొట్టుకుని బయటకువచ్చే పసుప్చచ్చటి సొన... రక్తం కూడా ఉత్సాహం కొలిపేదిగా కనబడుతుందటగానీ, ఈ పసుపురంగు సొన మాత్రం... అమ్మో! అందుకే కోడిగుడ్డును ఆయన ఎప్పుడూ రుచి చూడలేదట!

కోడిగుడ్లే కాదు, పోలీసులన్నా ఆయనకు భయమే! ‘నేను పోలీసులకు వ్యతిరేకం కాదు; వాళ్లంటే భయపడతానంతే!’ అంటాడు. కారు నడుపుతూ వెళ్తుంటే ఎక్కడ ‘చలానా’ రాస్తారేమోనని కూడా ఆందోళన చెందుతాడు.

దీనికి చిన్న నేపథ్యం ఉంది. ఐదేళ్లప్పుడు హిచ్‌కాక్‌ బాగా అల్లరిచేస్తే, వాళ్ల నాన్న ఒక నోటు రాసిచ్చి, పోలీసు చీఫు దగ్గరికి పంపాడు. దానిప్రకారం ఐదు నిమిషాలపాటు పిల్లాణ్ని సెల్‌లో పెట్టి, తాళం వేసి, మళ్లీ వదిలేశాడా అధికారి. వదిలేసేముందు, ‘తుంటరి పిల్లలను ఏం చేస్తామో చూశావు కదా’ అని హెచ్చరించడం మరిచిపోలేదు.
మూలాల్ని కనుక్కుంటే సమస్య తొలగిపోతుందంటారుగానీ, తనవరకు పోలీసుల భయం అలాగే పేరుకుపోయిందంటాడు.

అందుకేనేమో, ఆయన సినిమాల్లో హీరోను అటు నేరస్థులూ ఇటు పోలీసులూ కూడా తరుముతుంటారు. అయితే దానికి హిచ్‌కాక్‌ ఇంకోలా జవాబిస్తాడు: ‘క్రిమినల్స్‌ తరుముతుంటే హీరో పోలీసుల దగ్గరికి వెళ్లొచ్చుకదా అనుకుంటారు ప్రేక్షకులు. పోలీసులు కూడా అతడికోసం వెతుకుతుంటే ఇక ఆ అవకాశం లేదుగా!’

మూకీల నుంచి సినిమారంగంలో ఉన్న ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌(1899–1980) కెరీర్‌ సుదీర్ఘమైనది. హింస, భయం, శృంగారం, నేరం, సస్పెన్స్‌ నేపథ్యంగా ఆయన తీసినవి ప్రత్యేక విశేషణంతో ‘హిచ్‌కాకియన్‌ మూవీస్‌’ అయ్యాయి. వెర్టిగో, సైకో, నార్త్‌ బై నార్త్‌వెస్ట్, రేర్‌ విండో, ద బర్డ్స్, నొటోరియస్, రెబెకా, డయల్‌ ఎం ఫర్‌ మర్డర్, ద ట్రబుల్‌ విత్‌ హ్యారీ, ఐ కన్ఫెస్, రోప్, షాడో ఆఫ్‌ ఎ డౌట్, స్ట్రేంజర్స్‌ ఆన్‌ ఎ ట్రెయిన్‌... కాలంతోపాటు ఆయన సినిమాలు ‘ఎదుగుతున్నాయి’. ‘విమర్శకులు ఎప్పుడూ నా సినిమాల్ని మొదటిసారి ఇష్టపడలేదు. సైకో విడుదలైనప్పడు ఒక లండన్‌ విమర్శకుడు అది నా కెరీర్‌ మీద మచ్చలాంటిది అన్నాడు. అదే సినిమాను ఏడాది తర్వాత క్లాసిక్‌ అన్నారు’ అని పేర్కొన్నాడు.

‘ఎవరిని వారు కాపీ కొట్టుకోవడమే శైలి’ అని జోకులేసే హిచ్‌కాక్‌– ఎన్నో అధునాతన మెళకువల్ని సినీరంగానికి నేర్పాడు. ఆయన ఇచ్చినన్ని ఇంటర్వ్యూలు ఎవరూ ఇవ్వలేదు. మరో సుప్రసిద్ధ దర్శకుడు ఫ్రాంకోయిస్‌ ట్రుప్ఫాట్‌ ఆయన్ని చేసిన ‘50’ గంటల ఇంటర్వ్యూ సుప్రసిద్ధం.

హిచ్‌కాక్‌ పనితీరు చాలా పద్ధతిగా ఉండేది. సెట్లో కెమెరాలోంచి చూడ్డానికి ఇష్టపడడు. తనకు కావాల్సిందేమిటో కెమెరామన్‌కు బాగా తెలుసంటాడు. అవసరమైతే ‘దీర్ఘచతురస్రం’ గీసిస్తాడు. షాట్‌ కంపోజిషన్‌ అంటే పూరించాల్సిన దీర్ఘచతురస్రమే కదా!

నిజానికి ఆయనకు కథ రాసుకున్నప్పుడే మానసికంగా సినిమా పూర్తయిపోతుంది! వారాలకు వారాలు స్క్రిప్టు మీద కూర్చుని, షాట్స్‌ కూడా విభజించి, అవసరమైన చోట బొమ్మలేసి... కాగితం మీదే మొత్తం పూర్తయిపోతుంది! కాకపోతే, ఇంగ్లండ్‌ నుంచి అమెరికా వచ్చాక, తన పాతపద్ధతికి కొంత సడలింపు ఇచ్చానంటాడు. ‘అంత డీటైల్డ్‌గా అమెరికన్‌ రచయితలు వర్కు చేయరు’.

అలాగే, నటీనటుల కళ్లే కథ చెప్పాలని ఆయన భావిస్తాడు. ‘సంభాషణలు కూడా శబ్దాల్లో కలిసిపోయే ఇంకోరకం శబ్దాలు మాత్రమే. కాకపోతే అవి మనుషుల నోట్లోంచి వస్తాయి.’ అలాగని, ఎక్కువ వ్యక్తీకరణల్ని కూడా ఆయన ఇష్టపడడు. ఎన్నో భావాలు ముఖంలో పలికితే– ప్రేక్షకుడు దేన్నని పట్టుకోవాలి? కాగితం మీద ఎక్కువ అక్షరాలుంటే దేన్నని చదువుతాం? తెల్లజాగా ఉంటే చదవడానికి హాయిగా ఉంటుంది. రాతలో పదాల్ని మితంగా వాడినట్టే, నటనలోనూ వ్యక్తీకరణ మితంగా ఉండాలంటాడు. దర్శకుడు కాకపోయివుంటే హిచ్‌కాక్‌ మంచి సంపాదకుడు అయ్యుండేవాడేమో! కాకపోతే, ఆయనమాత్రం క్రిమినల్‌ లాయర్‌కు ఓటేస్తాడు. ‘విలన్‌ పూర్తి చెడ్డవాడు కాదు; హీరో పూర్తి మంచివాడు కాదు’ అని విశ్వసిస్తాడు కాబట్టి.

ఇన్ని చెబుతాడు కాబట్టి, హిచ్‌కాక్‌కు ఎలాంటి నేరబుర్ర ఉంది? ఎప్పుడైనా హత్య చేశాడా? అండీ వార్‌హోల్‌ ఈ ప్రశ్నలు అడిగాడు కూడా. ‘నా ఉద్వేగాలేవీ నా పాత్రలు ప్రకటించవు. నేను వాటితో ఐడెంటిఫై కాను’ అని చెబుతాడు హిచ్‌కాక్‌. ‘వస్తువు కన్నా నాకు శైలి ప్రధానం. అది మాత్రమే ఒకరిని కళాకారుణ్ని చేస్తుంది. ఒక చిత్రకారుడు చిత్రించాలి కాబట్టి పళ్లబుట్టను వేసినట్టుగా– నాకు కథ అనేది కేవలం సినిమాను మలుచుకోవడానికి ఒక అంశం’ అంటాడు. ఆ లెక్కన ఆయన నిజమైన కళాకారుడు.

(సాక్షి ఫన్‌డే; 10 ఆగస్ట్‌ 2014)
––––––––––––––––––––––

Monday, August 10, 2026

చాసో ‘వాయులీనం’

 


చాగంటి సోమయాజులు

చాసోగా సుప్రసిద్ధులైన కథకులు, కవి చాగంటి సోమయాజులు(1915–1994) ‘వాయులీనం’ కథకు ఇది సంక్షిప్త రూపం.

–––


మూగ గీతం/ మౌన రాగం


రాజ్యానికి వొంటిమీద స్పృహ తప్పిపోయింది. వెంకటప్పయ్య పెళ్లాం మొహంలోకి చూశాడు. పెదిమలు కదులుతున్నాయి.

‘‘వొసే రాజ్యం!’’ ఆదుర్దాగా పిలిచాడు. పలకలేదు. మనోహరమైన తోడిరాగాన్ని తోడుపుచ్చుకుని అంబరవీధుల్లో విహరిస్తున్నాది.

వసారాలో పిల్లలు గందరగోళం చేస్తున్నారు. ‘‘వెధవల్లారా ఏమిటా అల్లరి!’’ వెంకటప్పయ్య కసిరాడు.

‘‘అబ్బ తుళ్లిపడ్డానండీ! పిడుగు పడ్డట్టు విరుచుకు పడుతున్నారేం?’’ రాజ్యం తెలివి తెచ్చుకొని అడిగింది.

‘‘కసిరితే కసిరాను. వంట్లో ఎలాగుందో చెప్పు?’’

‘‘ఇప్పుడేమొచ్చిందని?’’ రాజ్యం నవ్వింది. నవ్వుమొహం చూడ్డానికి భయంకరంగా వుంది. పైకి వచ్చేసిన గుడ్లగూబ కళ్లు, పొడుచుకు కనబడుతున్న ముందు పళ్లు.

రాజ్యం టైఫాయిడ్‌ జ్వరంతో తీసుకొని కిందపెట్టవలసినంతా అయి బతికి బట్టకడుతున్నాది. పత్యం తింటూ ఇంకా వారం రోజులే అయింది. జ్వరం మూడు వారాలుగా పొక్కిపోసిన తరువాత దిగజారలేదు. మళ్లా తిరగబెట్టింది. ఏ క్షణంలోనైనా ప్రాణం గుటుక్కుమంటుందనే వాడి భీతి!

‘‘నా వంట్లో హాయిగా ఉంది. తింటున్నది అరుగుతున్నాది. అంత జబ్బు పడ్డాక నిలుచున్న పాళంలా మామ్మూలు మనిషిని కమ్మంటే అవుతానా?’’ అన్నాది రాజ్యం.

‘‘నువ్వు పరధ్యానంగా ఉంటే గుండెలార్చుకు పోయాయి’’ అన్నాడు.

‘‘ఈ యింటికి మారిన దగ్గరనుంచీ హాయిగా ఉంది. ఎటొచ్చి అద్దెకే బెంగగా ఉంది’’ అన్నాది రాజ్యం.

అంతకుముందు వాళ్లు ఇరుకు సందులో ఉండేవారు. ఇప్పుడు కొత్తగా కట్టిన డాబాలో రెండు చిన్న గదులూ, వసారా అద్దెకు తీసుకొన్నారు. చుట్టూ విశాలంగా పెరళ్లున్నాయి.

‘‘వెధవ డబ్బు. ఏదో కూడిక చేసుకొంటాము. నువ్వు బతికావు చాలు’’ అన్నాడు.

‘‘నా జబ్బుకి ఎక్కణ్ణుంచి తెచ్చారో, ఎంత అయిందో ఇప్పటికి నాకు చెప్పకుండా ఉన్నారు’’ అన్నాది.

‘‘ఆ వూసు నిన్నెత్తొద్దన్నానా? ఆరోగ్యం చూసుకో. కావలసినంత ఓవల్టిన్ను తాగు. తెచ్చిన పళ్లన్నీ తినెయ్యి. పిల్లలకు కూడా పెట్టకు.’’

‘‘తినకేం చేస్తున్నాను? కాళ్లు జాపుకొని మీ చేత వండించుకొని మరీ తింటున్నాను. ఏదైనా అప్పు అప్పే కదా? మనకింకో విధం ఉంది కనకనా?’’

డబ్బు మాటెత్తగానే వాడికి గాభరా పుట్టింది. జీతం రెండు నెలలదీ కాక రెండువందలకి దాటి ఖర్చు అయిపోయింది. వాడికా సంభాషణ పెంచటం ఇష్టం లేదు. పెరట్లో కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కొని వచ్చాడు. 

రాజ్యం మళ్లా ఈ ప్రపంచంలో లేదు. మొహం మీదపడి బంగారపు పూత పూస్తున్నాది. కొన్ని సంవత్సరాలై రాజ్యం అంత సంతోషంగా ఉండటం వెంకటప్పయ్య చూడలేదు. కాపరానికొచ్చిన తొలి సంవత్సరం కిలకిల నవ్వుతూ ఉండేది. సంవత్సరం తిరక్కుండా గుండెలికి చంటికుర్రాణ్ణి వప్పగించి సంసార సాగరాన్ని ఉత్తరించుకుంటూవెళుతూ, అవతలదరికి చేరమంది జీవితం! కాపరానికొచ్చి ఆరేళ్లయింది. ముగ్గురు కొడుకుల తల్లి అయి ఈదుతున్నాది.

అకస్మాత్తుగా రాజ్యం తల ఓ పక్కకు పెట్టి ఆడిస్తున్నాది. వెంకటప్పయ్య పకాలున నవ్వాడు.

‘‘ఎందుకూ అంత విరగబాటు నవ్వు?’’ మొగుణ్ణడిగింది.

‘‘ఏదీ, మళ్లా మెడవంచి ఆడించు’’

‘‘అదా! ఎదురింటి పిల్ల పాడుతున్నాది, వినండి’’ అన్నాది. రాజ్యం చెప్పాక ఎదురింటి నుంచి సంగీతం వస్తున్నట్లు చెవులకు తెలిసింది.

‘‘ఓహో! అదియా సంగతి! చిన్నప్పుడు నువ్వు వాయులీన విద్వాంసురాలివి కదూ!’’ అన్నాడు. 

‘‘చీకటిపడుతూ ఉంటే ఇప్పుడెందుకూ వీధిలోకి? పెందరాళే అన్నం తినకూడదూ?’’ అన్నాది.

‘‘అనుకొంటూ ఉండగా ఆలస్యమైపోతున్నాది. ఇలాగ్గా ఇహనెళ్లి పాపపరిహారార్థం మంచిపని చెయ్యాలి’’ అన్నాడు.

‘‘పాపాలు కూడా చేస్తున్నారా?’’

‘‘పాపం చెయ్యందీ బతుకు వెళ్లలేదు.’’ వెంకటప్పయ్య వీధిలోకి నడిచాడు.

పిల్లలిద్దరూ సంగీతం వింటున్నారు. రాజ్యం మెల్లిగా లేచి స్విచ్చి నొక్కింది. గదినిండా కాంతి పడ్డాది. రాజ్యం ఫిడేలు మూలపడ్డాది. కమాను విరిగి పెంటకుప్పని చేరింది. జీవితంలోంచి సంగీతం తొలగిపోయినా ఎదురింటి అమ్మాయి పాడుతూవుంటే ఎక్కడలేని సంతోషాన్ని ఇస్తున్నాది.

ఆరేళ్ల క్రితం రాజ్యాన్ని చూడడానికి పెళ్లివారు వచ్చారు. వాళ్లతో వెంకటప్పయ్య వచ్చాడు. రాజ్యాన్ని పాడమన్నారు. వాళ్ల నాన్న నాలుగేళ్లయి సంగీతం చెప్పిస్తున్నందుకు పాడవలసిన శుభముహూర్తం వచ్చింది. తోడిలో కీర్తన సిగ్గుపడుతూ అందుకుంది. గొంతుకెత్తేసరికి అపశృతి. ఉసిలోకి రావాలసిన తాళం వేలుమీదకొచ్చింది. వొళ్లంతా జలదరించి పాటంతా గాభరా అయింది. రాజ్యానికి ఏడుపు పర్యంతం అయింది. కాని పెళ్లిపెద్దలు సెహబాస్‌ అన్నారు. తెలుగు పెద్దలకి శృతీ, అపశృతీ తెలియవనీ, వాళ్ల జీవితాలలో సంగీతం లేనేలేదనీ అమాయకపు పెళ్లికూతుళ్లకి ఏమితెలుసు!

వెంకటప్పయ్య పెళ్లినాటికి ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారి పట్టభద్రుల్లో ఒకడు. చెన్న రాష్ట్ర ప్రభుత్వపు డెబ్బయి రెండు రూపాయల ఎల్‌.డి. గుమస్తాలలో ఒకడు. 

పెళ్లయిన కొత్తలో రాజ్యం మాబాగా పాడుతుందని ఊళ్లోవాళ్లు పేరంటానికి వెళితే పాడించేవారు. అత్తవారింట్లో నోరెత్తి పాడుకొనే సమయం రాకుండానే వేవిళ్లతో పుట్టింటి కెళ్లింది.

వసారాలో పిల్లలు గందరగోళం ప్రారంభించారు. 

‘‘తమ్ముడు నిద్రపోతున్నాడా??’’ అనడిగింది.

‘‘గుర్రు పెడుతున్నాడు’’ అన్నాడు పెద్దవాడు.

‘‘అల్లరి చేస్తే లేచిపోడూ. ఎదురింటి అమ్మాయి హాయిగా పాడుతున్నాది. కూచుని వినండి’’ అన్నాది. ఎదురింటి అమ్మాయి స్వరకల్పన ప్రారంభించింది. రాజ్యానికి ఏనుగంత సత్తువ వచ్చింది. జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి సంగీతం అవసరమే.

పానకంలో పుడకలాగ ఎదురింటి అమ్మాయి తమ్ముడు కాబోలు వచ్చాడు. ‘‘గిమపదని ఓజగ...’’ గొంతుక చించుకొని అపశృతిలో స్వరాలు వేశాడు. ఆ అమ్మాయి తంబూరా, పాటా ఆపేసింది.

‘‘వెధవా! సంగీతం నేర్చుకోమంటే రావుకానీ అల్లరికి సిద్ధం’’ అన్నాది.

‘‘ఇంక పాడదేంటమ్మా?’’ పెద్దకొడుకు అడిగాడు.

‘‘అదిగో మీలాంటి అల్లరి కుర్రవాడు వచ్చి కంగాళీ చేస్తే కోపం వచ్చి పాట మానేసింది.’’ 

‘‘నువ్వు పాడతావూ?’’

‘‘ఓ పాడతాను. నీకు చెప్పమన్నావా?’’

‘‘ఛీ! మొగాళ్లు పాడరు.’’

‘‘మొగాళ్లూ పాడతారమ్మా’’ అని రాజ్యం కాళ్లు జాపి గదిలో అడ్డంగా పడుకుంది. ‘‘ఒరే పెద్దాడూ! కాళ్లు పట్టుబాబూ’’ అంది. పెద్దవాడు మెల్లిగా కాళ్లు గుద్దుతూ కూచున్నాడు. 

‘‘నేను చేతులు గుద్దుతానమ్మా!’’ అంటూ రెండోవాడు చేతులు గుద్దుతూ కూచున్నాడు.

రాజ్యం కళ్యాణి కృతి అనుకొంటూ పడుకుంది. అంతా మరిచిపోయింది. సంగతులు చిక్కుపడ్డ కురుల్లాగ అవకతవక అయిపోయాయి.

‘‘నువ్వా పిల్లలాగ పాడ్డం లేదు’’ అన్నాడు పెద్దవాడు.

‘‘అంతా మరిచిపోయానురా!’’ పెరటి వసారా గూట్లోంచి సిబ్బి కిందపడి వికారంగా చప్పుడు.

‘‘కుక్క కాబోలు కొట్టండి. గూట్లో అన్నం మండబెట్టింది కాబోలు!’’ అన్నాది రాజ్యం.

కొడుకులు పరిగెట్టారు. ‘‘కుక్క కాదమ్మా పిల్లి. అన్నంగిన్నె మీదా సిబ్బి తిరగదోసింది’’ అన్నాడు పెద్దవాడు.

‘‘నయమే. మళ్లా వండుకోకుండా. కుక్క ముట్టుకున్న కూడూ తినవలసిన రోజులు. గడియ పెట్టి రావొద్దూ?’’ అన్నాది రాజ్యం.

వెంకటప్పయ్య తిరిగి వచ్చేశాడు. ‘‘పెరట్లో వెన్నెలా, పువ్వువెలగ వాసన మహబాగున్నాయి’’ అన్నాడు.

‘‘అప్పడే వచ్చేశారేం? పాపపరిహారం అయిందా?’’

‘‘కొంచెం అయింది.’’ వెంకటప్పయ్య కండువాలో దాచి చంకక్రింద ఏదో పెట్టాడు. గుండ్రంగా పేపరు చుట్టి ఉంది.

‘‘ఏమిటిది?’’ అన్నాది రాజ్యం.

లోపల నాలుగువేళ్ల వెడల్పు చుట్టు జరీ అంచు చీర ఉంది. దానికి తగ్గ పట్టు రవికల గుడ్డా ఉంది.

‘‘కొన్నారా?’’

‘‘కొన్నాను. ఉన్నడబ్బు కాస్తా అయిపోకుండా కొనేశాను.’’

‘‘డబ్బెక్కడిది?’’

‘‘చెపితే నువ్వు నన్ను క్షమించవు.’’

‘‘ఏం చేశారండీ?’’

‘‘ఏమీ అననని చేతిలో చెయ్యివెయ్యి’’ అన్నాడు. ముందుకు చెయ్యి జాపాడు. వాడి చెయ్యి వణుకుతున్నాది. రాజ్యం చేతిలో చెయ్యి వేసింది.

‘‘అలాగ వొణికిపోతున్నారేం? దొంగతనం చెయ్యలేదు కదా?’’

‘‘అంతకన్నా హీనమైనదే. నీకు టైఫాయిడు మళ్లా తిరగబెట్టింది కదూ! నాకు ఆశలన్నీ ఉడిగిపోయాయి. స్నేహితుడొకడు ఇంటికివచ్చి చూసీచూడ్డంతో సలహా ఇచ్చాడు. తెగించి వాడికిచ్చేశాను.’’

‘‘ఏమిటిచ్చేశారు?’’

‘‘నీ కింకా తెలియలేదు. వాడే పట్టుకెళ్లి రెండువందల ఏభైకి అమ్మేశాడు. అంతడబ్బు వస్తుందని కలలోకూడా అనుకోలేదు. పాతదనుకున్నాను. పాతదానికే విలువ ఎక్కువట!’’

రాజ్యానికి అర్థమైంది. గది నాలుగుపక్కలా కలియజూసింది.

‘‘ఇహ నువ్వు చూడనక్కర్లేదు.’’

‘‘వెళ్లిపోయిందా?’’ అని దీర్ఘంగా నిట్టూర్చింది.

‘‘నీకు కష్టంగా ఉంటుందని తెలుసు. నేను చేసింది తప్పే!’’ అని నేరస్తుడిలాగ మొహం పెట్టుకున్నాడు. మొగుడి మనస్సు బాధపడుతున్నాదని గ్రహించి తన విచారాన్ని క్షణంలో దిగమింగుకుంది.

‘‘ఏ తప్పూ చెయ్యలేదు. ఏం సంసారైనా అదే చేస్తాడు. మీరేం తినేశారా?’’

‘‘మనకంతా మొగపిల్లలే కదా అని ధైర్యం చేశాను.’’

‘‘పోనియ్యండి, నా నోరు ఏనాడో నొక్కుకుపోయింది. ఇహ నా ఫిడేలు ఉండి నన్ను రక్షిస్తుందా? సర్వతీ కటాక్షం నా కంతే ఉంది. తల్లి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ తల్లిగుణాన్ని చూపించుకొంది. నాకు ప్రాణం పోసింది. నాకో చీరా రవికలగుడ్డా పెట్టింది’’ అని గుడ్లనిండా నీళ్లు నింపుకొంది.

‘‘నాలుగు కాలాల పాటు ఉంటుంది కదా అని కొనేశాను’’ అని చీర సగం విప్పేసి రాజ్యం భుజం మీద కప్పేశాడు వెంకటప్పయ్య.

‘‘జ్ఞాపకంగా ఉంటుంది లెండి!’’ అన్నాది రాజ్యం.

(సాక్షి సాహిత్యం; డిసెంబర్‌ 3, 2018)


Thursday, August 6, 2026

ఆలోచనాపరుడు కృష్ణమూర్తి


జిడ్డు కృష్ణమూర్తి 
11 May 1895 - 17 Feb 1986


ఆలోచనాపరుడు


చిన్నారిగా ఇంకా ఆటలు ఆడుకుంటున్న జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో అనుకోని మలుపు– అతను దివ్యజ్ఞాన సమాజం దృష్టిలో పడటం! ఆ పిల్లాడే మున్ముందు అవతరించనున్న ‘వరల్డ్‌ టీచర్‌’ మైత్రేయుడికి వాహకుడై మానవజాతికి ‘మోక్షం’ కలిగిస్తాడని లెడ్‌బీటర్, అన్నీబీసెంట్‌లాంటి వాళ్లు సంపూర్ణంగా విశ్వసించారు; దానికి తగిన ఇమేజ్‌ను కృష్ణమూర్తికి కల్పించారు.

అయితే, యువకుడిగా కృష్ణమూర్తి జీవితంలోని రెండో మలుపునకు పూర్తి కారణం ఆయనే! తననొక దేవుడి అవతారంగా నమ్ముతుండటాన్ని ఆయన పూర్తిగా నిరసించాడు; తనచుట్టూ ఏర్పాటైన ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ద స్టార్‌’ సంస్థని రద్దుచేశాడు; సత్యాన్ని కనుగొనడానికి తొక్కుడుపడిన దారంటూ ఒకటి లేదు, అది వ్యవస్థలు అందిచ్చేది కాదు, అది పూర్తిగా వ్యక్తిగత ప్రయాణం, అని తేల్చేశాడు.

కృష్ణమూర్తి ఆలోచనల్లో సత్యానికి దారి చూపే గురువంటూ లేడు, దానికి పనికొచ్చే మతమంటూ లేదు, దానికోసం ఎవరూ చేయిపట్టుకుని నడిపించరు. అన్వేషణ, ప్రశ్నించే గుణాలే సత్యాన్ని చేరేందుకు ఉపకరణాలు!

కానీ దేవుడికో, గురువుకో ఒక నమస్కారం పెట్టేయడం తేలిక; వాటిచుట్టూవున్న అంశాల్ని తర్కించి అవగాహన చేసుకోవడం కష్టం; అందుకే జిడ్డు కృష్ణమూర్తి బాటలో నడవడంకన్నా ఏదో ఒక మతం చాటున దాక్కోవడం మనుషులకు సులభమవుతోంది. అయితే, ఈ మానవ బలహీనత గురించి కృష్ణమూర్తికి బాగా తెలుసు.

మనిషి తనకుతానుగా బతకడు; కనబడని షరతులకు లోబడివుంటాడు; అదృశ్య సంకెళ్లకు బందీగా ఉంటాడు;  నిత్యం రొద పెట్టే కీచుగొంతులకు బానిసయి ఉంటాడు; భావజాలాల ఒత్తిడిలో మునిగివుంటాడు. వీటన్నింటినీ తట్టుకుని ఒంటరిగా నిలబడాలంటే చాలా సామర్థ్యం ఉండాలి; ఇది లేనివాళ్లు మరొకరివైపు చూస్తారు; వాళ్లే గురువును నిలబెడతారు.

గురుపీఠాన్ని నిరాకరించిన ఈ సరికొత్త ఆలోచనాపరుడికి అనూహ్యమైన సంఖ్యలో అనుచరులు ఏర్పడ్డారు. వాళ్లు కృష్ణాజీ, కృష్ణ అని పిలిచేవారు. తనను గురువుగా కాకుండా ఒక స్నేహితుడిలా మాత్రమే చూడమన్నాడు కృష్ణమూర్తి. ప్రపంచమంతా తిరిగాడు; వేలాది ప్రసంగాలు చేశాడు; వ్యక్తులతోనూ, సమూహాలతోనూ సంభాషించాడు. అవే మనకు లభ్యమవుతున్న ఆయన తత్వచింతన!

ఏ మతమైనా నీ శత్రువును కూడా ప్రేమించమనే చెబితే, ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంత హింస ఎందుకు చోటు చేసుకుంటోంది? జాతీయత పేరుతో, మతం పేరుతో, సిద్ధాంతాల పేరుతో, మనుషుల మధ్య గీసుకునే గీతలు అవి ఏ రకమైనవైనా పనికిరావన్నాడు. గాలి వీచినప్పుడు అది గీతలు చూసుకోదు; సత్యం కూడా అలా  వ్యాపించాలి; అప్పుడు మాత్రమే జీవితానికి ఆధ్యాత్మిక సొబగు అద్దగలం. భయం, ఘర్షణ, హింస లేకుండా జీవించగలిగే స్వేచ్ఛ అందరికీ ఉండాలి. ఎవరూ సెకండ్‌ హాండ్‌ మనిషిలా బతగ్గూడదు; సొంతంగా ఆలోచించాలి; చేస్తున్న ఆలోచన మీద పూర్తి స్పృహ కలిగివుండాలి; ధ్యానం అంటే ఏదో ఒకటి చేయడం కాదు; ఏదీ చెయ్యకుండావుంటే దానికదే కలిగే ఒక స్థితి!

రోజువారీ జీవితంలో మనిషి ఎదుర్కునే అన్ని రకాల ఘర్షణలనూ ఆయన చర్చించాడు. ఒక సందర్భంలో, ‘‘నా రహస్యం ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా? అయితే వినండి, ఏది జరిగినా నేను పట్టించుకోను,’’ అన్నాడు. సమస్య ఉందని గుర్తించడానికీ, సమస్యను మనసుకు తీసుకోకుండా ఉండటానికీ మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాను పసిగట్టాలని ఆయన ఉద్దేశం!

జిడ్డు కృష్ణమూర్తి అన్న పేరు కూడా ఒక పూర్వవాసన కలిగివుంది కాబట్టి, కేవలం సాంకేతికంగా, తనను ‘కె’ అనిపించుకున్నాడు. ఆలోచనలు పవిత్రమైనవేమీ కావు; నన్ను కూడా గుడ్డిగా నమ్మవద్దన్నాడు. ఎప్పటికైనా నేను తెలుసుకున్న సత్యమే ఉంటుంది తప్ప, నీకు పనికొచ్చే సత్యం ఉండదు, నీది నువ్వే తెలుసుకోవాలి, అని చెప్పాడు.  తానేదో తెలుసుకున్నాడు కాబట్టి, తనకు గొప్పదనాన్ని ఆపాదించడానికి నిరాకరించాడు. మనుషులు మూర్ఖులైతే సత్యాన్నీ, వ్యక్తినీ కలగలుపుతారు; వ్యక్తి చుట్టూ ఆలయం నిర్మిస్తారు; వ్యక్తికంటే సత్యం గొప్పది; సత్యంకన్నా వ్యక్తి ఏనాటికీ గొప్పవాడు కాదు, అన్నాడు. ఆ విషయం చెప్పినందుకైనా ఆయన గొప్పవాడు!

(సాక్షి ఫన్‌డే; 11 మే 2014)
––––––––––––––––––––––

Sunday, August 2, 2026

ప్రేమతో... నీ వాలెంటైన్‌!


c.225 - c.270


 ప్రేమతో... నీ వాలెంటైన్‌!

(ప్రేమికుల దినోత్సవం కోసం రాసింది.)

 

ఒక మనిషి మీద ప్రేమ ఎందుకు పుడుతుందో ఎవరు చెప్పగలరు! కళ్లల్లోంచి హృదయంలోకి జారిపోయే ఆ వెలుగును వర్ణించడం ఎవరితరం?

సృష్టిని కొనసాగనిచ్చే ఆ పవిత్ర ప్రేమను ఎంతగానో ప్రేమించాడు సెయింట్‌ వాలెంటైన్‌. క్రీ.శ. 270 కాలంనాటి ఈ మతగురువు తమ రోమ్‌ సామ్రాజ్యం అంతటా ప్రేమతోటలు పెరగాలని కాంక్షించాడు. ప్రేమలో తడిసి ముద్దయ్యేవారిని ముద్దుచేశాడు.

అయితే, చక్రవర్తి రెండో క్లాడియస్‌ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. ఒంటరి బ్రహ్మచారులే మంచి సైనికులుగా పోరాడగలరని క్లాడియస్‌ ఆలోచన. భార్యా, పిల్లాపీచూ అని సైనికులు తలుస్తూంటే కత్తులమీద పట్టు బిగుస్తుందా? అశ్వారూఢులై యుద్ధంలో అరివీర భయంకరులు కాగలరా? అందుకే ఎవరూ వివాహలు చేసుకోకూడదన్నాడు క్లాడియస్‌. ఏడుస్తున్న పిల్లలను సముదాయించడంలో సహనం కాదు, శత్రువులను తరిమి తరిమి కొట్టడంలో సాహసం చూపమన్నాడు.

చక్రవర్తి అజ్ఞానానికి నవ్వుకున్నాడు వాలెంటైన్‌. అన్యాయం కాదూ! అతర్కం కాదూ! ప్రేమంటే సాక్షాత్తూ దైవమే కాదూ! స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడగలిగే మహోన్నత బంధాన్ని అడ్డుకోవడమా? పెళ్లి మీద నిషేధం విధించడమా?

పారిపోయి వచ్చిన యువతీయువకులకు పెళ్లిళ్లు జరిపించాడు వాలెంటైన్‌. ప్రేయసీ ప్రియులను నూతన వధూవరులుగా దీవించి పంపాడు. ప్రేమాగ్నిలో మీ పొరపొచ్చాలను దహించుకోండి; పిల్లాపాపలతో సుఖంగా ఉండండి; ఇంతకంటే అద్భుతమైన కార్యం మరొకటి లేనంతగా ప్రేమలో మునిగిపొండి!

కానీ రహస్యం దాగలేదు. క్లాడియస్‌కు విషయం తెలిసింది. ఉగ్రుడయ్యాడు. రాజద్రోహిని బంధించి తెమ్మని ఆదేశించాడు. భటులు పరుగెత్తారు. వాళ్లను ప్రేమగా ఆహ్వానించాడు వాలెంటైన్‌.

ఒకవైపు రాజ్యం పొరుగుదాడుల్తో సంక్షోభంలో ఉంటే మీరు ప్రేమమంత్రాలు జపిస్తున్నారా? అన్నాడు క్లాడియస్‌.
మనుషుల్ని దగ్గరగా చేసే ప్రేమకు మనుషుల్ని దగ్గర చేస్తున్నాను, అన్నాడు వాలెంటైన్‌.

ప్రేమ మీద అధికారం గెలిచింది. శాసన ధిక్కారం సాకుగా మరణశిక్ష ఖాయమైంది. కారాగారంలో బందీ అయ్యాడు వాలెంటైన్‌. ఆ ప్రేమగురువును చూసేందుకు ఎవరెవరో వచ్చేవారు. వారిలో జైలు అధికారి కుమార్తె కూడా ఉండేది. వాలెంటైన్‌లోని పూజారిలోంచి ప్రేమికుడు మేల్కొన్నాడు. ఆ చివరి రోజుల్లో ఆమె వచ్చే ఆ క్షణాల్నే ఆయన పొదువుకున్నాడు. వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరి తీశారు. ఉరితీయబోయే ముందురోజు రాత్రి ‘నీ వాలెంటైన్‌ నుంచి’ అన్న వాక్యంతో ఆమెకో ఉత్తరం రాశాడు. అదొక చరిత్రాత్మక వాక్యం అయింది. కాలక్రమంలో వాలెంటైన్‌ అనే పేరు ప్రేమికుడికి పర్యాయపదం అయింది. క్లాడియస్‌ మరణించాడు. వాలెంటైన్‌ మరణించీ జీవించాడు. ప్రేమ మీద అధికారం ఎన్నటికీ గెలవలేదు!

ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో, కాలం తొలగించిన దుస్తులెన్నో, కట్టుకున్న కొత్త రెక్కలెన్నో! వాలెంటైన్‌ గురించిన ఎన్నో కథనాలు! ఇది ‘ప్రేమ’కు సమీపంగా ఉన్న కథగా ప్రపంచప్రేమికులందరూ గానం చేస్తున్నారు, ప్రేమికుల రోజున ప్రేమకు పునరంకితం అవుతున్నారు.

అయితే, వాలెంటైన్‌ డే అంటే ‘వంద కోట్ల కార్డులు అమ్మడం కాదు. కేవలం కోరుకోవడం కాదు, ఇవ్వడం! ప్రేమంటే కళ్లుమిరుమిట్లుగొలిపే ప్రవాహం కాదు, నిత్యం ప్రవహించాల్సిన జీవధార! పుట్టిన మనిషి చేయగలిగే పుణ్యకార్యం. మరణం దాకా నిలుపుకోగలిగే మహత్వం!

(సాక్షి ఫన్‌డే; 9 ఫిబ్రవరి 2014)

Thursday, July 30, 2026

ఘనజీవి రావిశాస్త్రి


 రాచకొండ విశ్వనాథశాస్త్రి

30 July 1922 - 10 Nov 1993

ఘనజీవి

జూలై 30న రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి జయంతి
------------------------------------------------------------------------


‘‘రావిశాస్త్రి మంచి రచయిత కాడు’’.
అది సుబ్బయ్య అభిప్రాయం కాదు.
‘‘రావిశాస్త్రి ఒట్టి చచ్చు రచయిత’’.
అదీ సుబ్బయ్య అభిప్రాయం కాదు.
‘‘రావిశాస్త్రి ఈజ్‌ వెరీ ఎఫిషియన్ట్‌ రైటర్‌’’.
సుబ్బయ్యలాగే అనేకమంది ‘పాస్‌’ చేసే ‘రిమార్క్‌’ అది.

రావిశాస్త్రి హాఫ్‌ హాండ్స్‌ చొక్కా వేసుకుంటాడు. వేసుకున్న హాఫ్‌హాండ్స్‌ చొక్కాను టక్‌ చేసుకుంటాడు. మనిషి చూడ్డానికి తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్నాయన నల్లటి కళ్లద్దాలు పెట్టుకుంటాడు. ఆ కళ్లద్దాలు మందంగా ఉంటాయి. హాఫ్‌హాండ్స్‌ చొక్కాను టక్‌ చేసుకునే ఈ తెల్లటి నల్ల కళ్లద్దాల మనిషిని పూర్తిపేరుతో రాచకొండ విశ్వనాథశాస్త్రి అని ఎవరూ పిలవరు. ‘చాత్రిబాబు’ అంటారు. లాయర్‌ బాబు అని కూడా అంటారు. అలాంటి లాయర్‌బాబైన చాత్రిబాబు ‘నంగిరిపింగిరి’గా ఎప్పుడూ రాయలేదు. ధైర్యంగా రాసేడు. జోరుగా రాసేడు. రకరకాల బతుకుల్నీ, ‘అధోజగత్‌’ జీవుల్నీ; కోర్టుల్లోని ప్లీడర్లనూ, సాక్షులనూ, సారాకాసేవాళ్లనూ, ఆ కాసిన సారాతాగేవాళ్లనూ, సిల్కు జాకెట్లనీ, ‘గవరయ్య’ల్నీ, నాయకుల్నీ, దోపిడీగాళ్లనీ, అమాయకుల్నీ, పిరికివాళ్లనీ అందరినీ బొమ్మ కట్టించేడు. ‘ధైర్యం ఉంటేనే మిగతా సద్గుణాలు (నిలబడతాయి.)... పాపుల్లో సాహసులూ ఉంటారు, భయస్తులూ ఉంటారు. కాని– భయానికీ మంచికీ పొందిక లేదు. పిరికివారెవరూకూడా మంచివారు కాజాలరు; మంచికి నిలబడలేరు... మంచిగా ఉండాలంటే గుండె నిబ్బరం చాలా ఉండాలి,’ అని మనస్ఫూర్తిగా నమ్మి రాసేడు. ‘డబ్బులో వుండే సౌఖ్యాలూ, లేమిలో వుండు దుఃఖాలూ, ధనం కల్పించే గొప్ప గర్వం మదాంధతా, లేమి కల్పించే నిస్పృహ నైచ్యం దైన్యం’ అన్నీ కూడా జీవితంలోంచి బాగా ఎరిగి రాసేడు. ‘నిజంగా జరిగింది నిజంగా జరిగిందా? జరిగినది నిజం జరిగినది నిజమేనా?’ అని అక్షరాలను ఆచితూచి మరీ రాసేడు. ‘దారిద్య్రం ఎవ్వరికీ... (చివరికి తన) పగవాడిక్కూడా ఉండకూడదని’ మరీమరీ తలిచేడు, తలిచి మరీ రాసేడు. ‘‘సందర్భానికి తగినట్టుగా ఆయన రచన ఒకచోట సెలయేటి నడకలా ఆహ్లాదం కొలుపుతుంది. మరొకచోట ప్రవాహంలా పరవళ్లు తొక్కుతుంది. ఇంకొకచోట జలపాతంలా ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉండి ఉండి ఒక్కొకచోట కవిత్వంగా మారి కావ్యస్థాయికి తీసుకెళ్తుంది’’.

‘బందోబస్తుగా చాలా భారీగా ఉన్నాడతను. సీమపందిలా ఎర్రగానూ, పనసకాయలా గరుగ్గానూ ఉన్నాడు. బాగా సర్వీసు చేసినప్పటికీ చెడిపోకుండా నిలబడ్డ బెంజి లారీలా దిట్టంగానూ ఉన్నాడు’. (‘రాజు–మహిషి’ నవలలో మందుల భీముడి గురించి)
‘ఆమెకు ముప్పయ్యేండ్లుండొచ్చు. ఒకప్పుడామె అందంగా ఉండుంటుంది. పెద్ద కొప్పుని ఒకప్పుడు చక్కగా ముడుచుకుని ఉండుంటుంది. ఆమె కట్టుకున్న నల్లకోక ఒకప్పుడు, అప్పుడెప్పుడో కొత్తదయుంటుంది. చాలారోజుల కిందట చాలాసార్లు భోంచేసి ఆమె ఆరోగ్యంగా ఉండుంటుంది (‘మాయ’ కథలో ముత్తేలమ్మ వర్ణన)

శంకరగిరి గిరిజాశంకరం, అన్‌జానా, జాస్మిన్, కాంతాకాంత, గొల్కొండ రాంప్రసాద్‌ లాంటి మారుపేర్లతోనూ రాశాడు రావిశాస్త్రి. తన కోపం, తన దుఃఖం, సంతోషం, సరదా, క్యూరియాసిటీ వగైరాలు ఇతరులకు తెలియచెయ్యడానికి కూడా ఆయన రచయిత అవతారం ఎత్తాడు. అయితే, ‘తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తూందో అని ఆలోచిం’చి మరీ జాగ్రత్తగా రాసేడు. ‘రచయిత (అయిన) ప్రతివాడూ’ కూడా అలాగే రాయాలని కోరుకున్నాడు.

ఆరు సారా కథలు, ఆరు సారో కథలు, ఆరు చిత్రాలు, మరో ఆరు చిత్రాలు, రుక్కులు, బాకీ కథలతోపాటు, అల్పజీవి, ఇల్లు, సొమ్ములు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త నవలల్ని మళ్లీ మళ్లీ చదువుకొండని వదిలేసివెళ్లిపోయాడు రావిశాస్త్రి. రత్తాలు–రాంబాబు, రాజు–మహిషి లాంటి అసంపూర్ణ నవలలను పూరించుకునే అవకాశం కూడా ఇచ్చివెళ్లాడు. అర్ధాంతరంగా ముగించినా, వాటిని సంపూర్ణంగా పారాయణం చేయగలిగేలా చేసేది రావిశాస్త్రి చేసిన మాటల మాయాజాలం; కాళిదాసులాగా ముచ్చటగొలిపే ప్రతీకల శైలీ విన్యాసం. అసలు ఉపమానాలతోనే కడుపు నింపేస్తాడు. ఒక్కోసారి కథను పక్కనపెట్టి, చదవడం కోసమే చదువుకోగల వినోదం ఇస్తాడు. ఆ తరహా చాలా కొద్దిమందికి లోపమూ, చాలా ఎక్కువమందికి ఆయన అక్షరాల్ని విడిచిపెట్టకుండా చదువుకునే ఆకర్షణాబలమూ!

(సాక్షి ఫన్‌డే; 27 జూలై 2014)
––––––––––––––––––––––