Thursday, August 6, 2026

ఆలోచనాపరుడు కృష్ణమూర్తి


జిడ్డు కృష్ణమూర్తి 
11 May 1895 - 17 Feb 1986


ఆలోచనాపరుడు


చిన్నారిగా ఇంకా ఆటలు ఆడుకుంటున్న జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో అనుకోని మలుపు– అతను దివ్యజ్ఞాన సమాజం దృష్టిలో పడటం! ఆ పిల్లాడే మున్ముందు అవతరించనున్న ‘వరల్డ్‌ టీచర్‌’ మైత్రేయుడికి వాహకుడై మానవజాతికి ‘మోక్షం’ కలిగిస్తాడని లెడ్‌బీటర్, అన్నీబీసెంట్‌లాంటి వాళ్లు సంపూర్ణంగా విశ్వసించారు; దానికి తగిన ఇమేజ్‌ను కృష్ణమూర్తికి కల్పించారు.

అయితే, యువకుడిగా కృష్ణమూర్తి జీవితంలోని రెండో మలుపునకు పూర్తి కారణం ఆయనే! తననొక దేవుడి అవతారంగా నమ్ముతుండటాన్ని ఆయన పూర్తిగా నిరసించాడు; తనచుట్టూ ఏర్పాటైన ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ద స్టార్‌’ సంస్థని రద్దుచేశాడు; సత్యాన్ని కనుగొనడానికి తొక్కుడుపడిన దారంటూ ఒకటి లేదు, అది వ్యవస్థలు అందిచ్చేది కాదు, అది పూర్తిగా వ్యక్తిగత ప్రయాణం, అని తేల్చేశాడు.

కృష్ణమూర్తి ఆలోచనల్లో సత్యానికి దారి చూపే గురువంటూ లేడు, దానికి పనికొచ్చే మతమంటూ లేదు, దానికోసం ఎవరూ చేయిపట్టుకుని నడిపించరు. అన్వేషణ, ప్రశ్నించే గుణాలే సత్యాన్ని చేరేందుకు ఉపకరణాలు!

కానీ దేవుడికో, గురువుకో ఒక నమస్కారం పెట్టేయడం తేలిక; వాటిచుట్టూవున్న అంశాల్ని తర్కించి అవగాహన చేసుకోవడం కష్టం; అందుకే జిడ్డు కృష్ణమూర్తి బాటలో నడవడంకన్నా ఏదో ఒక మతం చాటున దాక్కోవడం మనుషులకు సులభమవుతోంది. అయితే, ఈ మానవ బలహీనత గురించి కృష్ణమూర్తికి బాగా తెలుసు.

మనిషి తనకుతానుగా బతకడు; కనబడని షరతులకు లోబడివుంటాడు; అదృశ్య సంకెళ్లకు బందీగా ఉంటాడు;  నిత్యం రొద పెట్టే కీచుగొంతులకు బానిసయి ఉంటాడు; భావజాలాల ఒత్తిడిలో మునిగివుంటాడు. వీటన్నింటినీ తట్టుకుని ఒంటరిగా నిలబడాలంటే చాలా సామర్థ్యం ఉండాలి; ఇది లేనివాళ్లు మరొకరివైపు చూస్తారు; వాళ్లే గురువును నిలబెడతారు.

గురుపీఠాన్ని నిరాకరించిన ఈ సరికొత్త ఆలోచనాపరుడికి అనూహ్యమైన సంఖ్యలో అనుచరులు ఏర్పడ్డారు. వాళ్లు కృష్ణాజీ, కృష్ణ అని పిలిచేవారు. తనను గురువుగా కాకుండా ఒక స్నేహితుడిలా మాత్రమే చూడమన్నాడు కృష్ణమూర్తి. ప్రపంచమంతా తిరిగాడు; వేలాది ప్రసంగాలు చేశాడు; వ్యక్తులతోనూ, సమూహాలతోనూ సంభాషించాడు. అవే మనకు లభ్యమవుతున్న ఆయన తత్వచింతన!

ఏ మతమైనా నీ శత్రువును కూడా ప్రేమించమనే చెబితే, ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంత హింస ఎందుకు చోటు చేసుకుంటోంది? జాతీయత పేరుతో, మతం పేరుతో, సిద్ధాంతాల పేరుతో, మనుషుల మధ్య గీసుకునే గీతలు అవి ఏ రకమైనవైనా పనికిరావన్నాడు. గాలి వీచినప్పుడు అది గీతలు చూసుకోదు; సత్యం కూడా అలా  వ్యాపించాలి; అప్పుడు మాత్రమే జీవితానికి ఆధ్యాత్మిక సొబగు అద్దగలం. భయం, ఘర్షణ, హింస లేకుండా జీవించగలిగే స్వేచ్ఛ అందరికీ ఉండాలి. ఎవరూ సెకండ్‌ హాండ్‌ మనిషిలా బతగ్గూడదు; సొంతంగా ఆలోచించాలి; చేస్తున్న ఆలోచన మీద పూర్తి స్పృహ కలిగివుండాలి; ధ్యానం అంటే ఏదో ఒకటి చేయడం కాదు; ఏదీ చెయ్యకుండావుంటే దానికదే కలిగే ఒక స్థితి!

రోజువారీ జీవితంలో మనిషి ఎదుర్కునే అన్ని రకాల ఘర్షణలనూ ఆయన చర్చించాడు. ఒక సందర్భంలో, ‘‘నా రహస్యం ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా? అయితే వినండి, ఏది జరిగినా నేను పట్టించుకోను,’’ అన్నాడు. సమస్య ఉందని గుర్తించడానికీ, సమస్యను మనసుకు తీసుకోకుండా ఉండటానికీ మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాను పసిగట్టాలని ఆయన ఉద్దేశం!

జిడ్డు కృష్ణమూర్తి అన్న పేరు కూడా ఒక పూర్వవాసన కలిగివుంది కాబట్టి, కేవలం సాంకేతికంగా, తనను ‘కె’ అనిపించుకున్నాడు. ఆలోచనలు పవిత్రమైనవేమీ కావు; నన్ను కూడా గుడ్డిగా నమ్మవద్దన్నాడు. ఎప్పటికైనా నేను తెలుసుకున్న సత్యమే ఉంటుంది తప్ప, నీకు పనికొచ్చే సత్యం ఉండదు, నీది నువ్వే తెలుసుకోవాలి, అని చెప్పాడు.  తానేదో తెలుసుకున్నాడు కాబట్టి, తనకు గొప్పదనాన్ని ఆపాదించడానికి నిరాకరించాడు. మనుషులు మూర్ఖులైతే సత్యాన్నీ, వ్యక్తినీ కలగలుపుతారు; వ్యక్తి చుట్టూ ఆలయం నిర్మిస్తారు; వ్యక్తికంటే సత్యం గొప్పది; సత్యంకన్నా వ్యక్తి ఏనాటికీ గొప్పవాడు కాదు, అన్నాడు. ఆ విషయం చెప్పినందుకైనా ఆయన గొప్పవాడు!

(సాక్షి ఫన్‌డే; 11 మే 2014)
––––––––––––––––––––––

Sunday, August 2, 2026

ప్రేమతో... నీ వాలెంటైన్‌!


c.225 - c.270


 ప్రేమతో... నీ వాలెంటైన్‌!

(ప్రేమికుల దినోత్సవం కోసం రాసింది.)

 

ఒక మనిషి మీద ప్రేమ ఎందుకు పుడుతుందో ఎవరు చెప్పగలరు! కళ్లల్లోంచి హృదయంలోకి జారిపోయే ఆ వెలుగును వర్ణించడం ఎవరితరం?

సృష్టిని కొనసాగనిచ్చే ఆ పవిత్ర ప్రేమను ఎంతగానో ప్రేమించాడు సెయింట్‌ వాలెంటైన్‌. క్రీ.శ. 270 కాలంనాటి ఈ మతగురువు తమ రోమ్‌ సామ్రాజ్యం అంతటా ప్రేమతోటలు పెరగాలని కాంక్షించాడు. ప్రేమలో తడిసి ముద్దయ్యేవారిని ముద్దుచేశాడు.

అయితే, చక్రవర్తి రెండో క్లాడియస్‌ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. ఒంటరి బ్రహ్మచారులే మంచి సైనికులుగా పోరాడగలరని క్లాడియస్‌ ఆలోచన. భార్యా, పిల్లాపీచూ అని సైనికులు తలుస్తూంటే కత్తులమీద పట్టు బిగుస్తుందా? అశ్వారూఢులై యుద్ధంలో అరివీర భయంకరులు కాగలరా? అందుకే ఎవరూ వివాహలు చేసుకోకూడదన్నాడు క్లాడియస్‌. ఏడుస్తున్న పిల్లలను సముదాయించడంలో సహనం కాదు, శత్రువులను తరిమి తరిమి కొట్టడంలో సాహసం చూపమన్నాడు.

చక్రవర్తి అజ్ఞానానికి నవ్వుకున్నాడు వాలెంటైన్‌. అన్యాయం కాదూ! అతర్కం కాదూ! ప్రేమంటే సాక్షాత్తూ దైవమే కాదూ! స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడగలిగే మహోన్నత బంధాన్ని అడ్డుకోవడమా? పెళ్లి మీద నిషేధం విధించడమా?

పారిపోయి వచ్చిన యువతీయువకులకు పెళ్లిళ్లు జరిపించాడు వాలెంటైన్‌. ప్రేయసీ ప్రియులను నూతన వధూవరులుగా దీవించి పంపాడు. ప్రేమాగ్నిలో మీ పొరపొచ్చాలను దహించుకోండి; పిల్లాపాపలతో సుఖంగా ఉండండి; ఇంతకంటే అద్భుతమైన కార్యం మరొకటి లేనంతగా ప్రేమలో మునిగిపొండి!

కానీ రహస్యం దాగలేదు. క్లాడియస్‌కు విషయం తెలిసింది. ఉగ్రుడయ్యాడు. రాజద్రోహిని బంధించి తెమ్మని ఆదేశించాడు. భటులు పరుగెత్తారు. వాళ్లను ప్రేమగా ఆహ్వానించాడు వాలెంటైన్‌.

ఒకవైపు రాజ్యం పొరుగుదాడుల్తో సంక్షోభంలో ఉంటే మీరు ప్రేమమంత్రాలు జపిస్తున్నారా? అన్నాడు క్లాడియస్‌.
మనుషుల్ని దగ్గరగా చేసే ప్రేమకు మనుషుల్ని దగ్గర చేస్తున్నాను, అన్నాడు వాలెంటైన్‌.

ప్రేమ మీద అధికారం గెలిచింది. శాసన ధిక్కారం సాకుగా మరణశిక్ష ఖాయమైంది. కారాగారంలో బందీ అయ్యాడు వాలెంటైన్‌. ఆ ప్రేమగురువును చూసేందుకు ఎవరెవరో వచ్చేవారు. వారిలో జైలు అధికారి కుమార్తె కూడా ఉండేది. వాలెంటైన్‌లోని పూజారిలోంచి ప్రేమికుడు మేల్కొన్నాడు. ఆ చివరి రోజుల్లో ఆమె వచ్చే ఆ క్షణాల్నే ఆయన పొదువుకున్నాడు. వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరి తీశారు. ఉరితీయబోయే ముందురోజు రాత్రి ‘నీ వాలెంటైన్‌ నుంచి’ అన్న వాక్యంతో ఆమెకో ఉత్తరం రాశాడు. అదొక చరిత్రాత్మక వాక్యం అయింది. కాలక్రమంలో వాలెంటైన్‌ అనే పేరు ప్రేమికుడికి పర్యాయపదం అయింది. క్లాడియస్‌ మరణించాడు. వాలెంటైన్‌ మరణించీ జీవించాడు. ప్రేమ మీద అధికారం ఎన్నటికీ గెలవలేదు!

ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో, కాలం తొలగించిన దుస్తులెన్నో, కట్టుకున్న కొత్త రెక్కలెన్నో! వాలెంటైన్‌ గురించిన ఎన్నో కథనాలు! ఇది ‘ప్రేమ’కు సమీపంగా ఉన్న కథగా ప్రపంచప్రేమికులందరూ గానం చేస్తున్నారు, ప్రేమికుల రోజున ప్రేమకు పునరంకితం అవుతున్నారు.

అయితే, వాలెంటైన్‌ డే అంటే ‘వంద కోట్ల కార్డులు అమ్మడం కాదు. కేవలం కోరుకోవడం కాదు, ఇవ్వడం! ప్రేమంటే కళ్లుమిరుమిట్లుగొలిపే ప్రవాహం కాదు, నిత్యం ప్రవహించాల్సిన జీవధార! పుట్టిన మనిషి చేయగలిగే పుణ్యకార్యం. మరణం దాకా నిలుపుకోగలిగే మహత్వం!

(సాక్షి ఫన్‌డే; 9 ఫిబ్రవరి 2014)

Thursday, July 30, 2026

ఘనజీవి రావిశాస్త్రి


 రాచకొండ విశ్వనాథశాస్త్రి

30 July 1922 - 10 Nov 1993

ఘనజీవి

జూలై 30న రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి జయంతి
------------------------------------------------------------------------


‘‘రావిశాస్త్రి మంచి రచయిత కాడు’’.
అది సుబ్బయ్య అభిప్రాయం కాదు.
‘‘రావిశాస్త్రి ఒట్టి చచ్చు రచయిత’’.
అదీ సుబ్బయ్య అభిప్రాయం కాదు.
‘‘రావిశాస్త్రి ఈజ్‌ వెరీ ఎఫిషియన్ట్‌ రైటర్‌’’.
సుబ్బయ్యలాగే అనేకమంది ‘పాస్‌’ చేసే ‘రిమార్క్‌’ అది.

రావిశాస్త్రి హాఫ్‌ హాండ్స్‌ చొక్కా వేసుకుంటాడు. వేసుకున్న హాఫ్‌హాండ్స్‌ చొక్కాను టక్‌ చేసుకుంటాడు. మనిషి చూడ్డానికి తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్నాయన నల్లటి కళ్లద్దాలు పెట్టుకుంటాడు. ఆ కళ్లద్దాలు మందంగా ఉంటాయి. హాఫ్‌హాండ్స్‌ చొక్కాను టక్‌ చేసుకునే ఈ తెల్లటి నల్ల కళ్లద్దాల మనిషిని పూర్తిపేరుతో రాచకొండ విశ్వనాథశాస్త్రి అని ఎవరూ పిలవరు. ‘చాత్రిబాబు’ అంటారు. లాయర్‌ బాబు అని కూడా అంటారు. అలాంటి లాయర్‌బాబైన చాత్రిబాబు ‘నంగిరిపింగిరి’గా ఎప్పుడూ రాయలేదు. ధైర్యంగా రాసేడు. జోరుగా రాసేడు. రకరకాల బతుకుల్నీ, ‘అధోజగత్‌’ జీవుల్నీ; కోర్టుల్లోని ప్లీడర్లనూ, సాక్షులనూ, సారాకాసేవాళ్లనూ, ఆ కాసిన సారాతాగేవాళ్లనూ, సిల్కు జాకెట్లనీ, ‘గవరయ్య’ల్నీ, నాయకుల్నీ, దోపిడీగాళ్లనీ, అమాయకుల్నీ, పిరికివాళ్లనీ అందరినీ బొమ్మ కట్టించేడు. ‘ధైర్యం ఉంటేనే మిగతా సద్గుణాలు (నిలబడతాయి.)... పాపుల్లో సాహసులూ ఉంటారు, భయస్తులూ ఉంటారు. కాని– భయానికీ మంచికీ పొందిక లేదు. పిరికివారెవరూకూడా మంచివారు కాజాలరు; మంచికి నిలబడలేరు... మంచిగా ఉండాలంటే గుండె నిబ్బరం చాలా ఉండాలి,’ అని మనస్ఫూర్తిగా నమ్మి రాసేడు. ‘డబ్బులో వుండే సౌఖ్యాలూ, లేమిలో వుండు దుఃఖాలూ, ధనం కల్పించే గొప్ప గర్వం మదాంధతా, లేమి కల్పించే నిస్పృహ నైచ్యం దైన్యం’ అన్నీ కూడా జీవితంలోంచి బాగా ఎరిగి రాసేడు. ‘నిజంగా జరిగింది నిజంగా జరిగిందా? జరిగినది నిజం జరిగినది నిజమేనా?’ అని అక్షరాలను ఆచితూచి మరీ రాసేడు. ‘దారిద్య్రం ఎవ్వరికీ... (చివరికి తన) పగవాడిక్కూడా ఉండకూడదని’ మరీమరీ తలిచేడు, తలిచి మరీ రాసేడు. ‘‘సందర్భానికి తగినట్టుగా ఆయన రచన ఒకచోట సెలయేటి నడకలా ఆహ్లాదం కొలుపుతుంది. మరొకచోట ప్రవాహంలా పరవళ్లు తొక్కుతుంది. ఇంకొకచోట జలపాతంలా ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉండి ఉండి ఒక్కొకచోట కవిత్వంగా మారి కావ్యస్థాయికి తీసుకెళ్తుంది’’.

‘బందోబస్తుగా చాలా భారీగా ఉన్నాడతను. సీమపందిలా ఎర్రగానూ, పనసకాయలా గరుగ్గానూ ఉన్నాడు. బాగా సర్వీసు చేసినప్పటికీ చెడిపోకుండా నిలబడ్డ బెంజి లారీలా దిట్టంగానూ ఉన్నాడు’. (‘రాజు–మహిషి’ నవలలో మందుల భీముడి గురించి)
‘ఆమెకు ముప్పయ్యేండ్లుండొచ్చు. ఒకప్పుడామె అందంగా ఉండుంటుంది. పెద్ద కొప్పుని ఒకప్పుడు చక్కగా ముడుచుకుని ఉండుంటుంది. ఆమె కట్టుకున్న నల్లకోక ఒకప్పుడు, అప్పుడెప్పుడో కొత్తదయుంటుంది. చాలారోజుల కిందట చాలాసార్లు భోంచేసి ఆమె ఆరోగ్యంగా ఉండుంటుంది (‘మాయ’ కథలో ముత్తేలమ్మ వర్ణన)

శంకరగిరి గిరిజాశంకరం, అన్‌జానా, జాస్మిన్, కాంతాకాంత, గొల్కొండ రాంప్రసాద్‌ లాంటి మారుపేర్లతోనూ రాశాడు రావిశాస్త్రి. తన కోపం, తన దుఃఖం, సంతోషం, సరదా, క్యూరియాసిటీ వగైరాలు ఇతరులకు తెలియచెయ్యడానికి కూడా ఆయన రచయిత అవతారం ఎత్తాడు. అయితే, ‘తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తూందో అని ఆలోచిం’చి మరీ జాగ్రత్తగా రాసేడు. ‘రచయిత (అయిన) ప్రతివాడూ’ కూడా అలాగే రాయాలని కోరుకున్నాడు.

ఆరు సారా కథలు, ఆరు సారో కథలు, ఆరు చిత్రాలు, మరో ఆరు చిత్రాలు, రుక్కులు, బాకీ కథలతోపాటు, అల్పజీవి, ఇల్లు, సొమ్ములు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త నవలల్ని మళ్లీ మళ్లీ చదువుకొండని వదిలేసివెళ్లిపోయాడు రావిశాస్త్రి. రత్తాలు–రాంబాబు, రాజు–మహిషి లాంటి అసంపూర్ణ నవలలను పూరించుకునే అవకాశం కూడా ఇచ్చివెళ్లాడు. అర్ధాంతరంగా ముగించినా, వాటిని సంపూర్ణంగా పారాయణం చేయగలిగేలా చేసేది రావిశాస్త్రి చేసిన మాటల మాయాజాలం; కాళిదాసులాగా ముచ్చటగొలిపే ప్రతీకల శైలీ విన్యాసం. అసలు ఉపమానాలతోనే కడుపు నింపేస్తాడు. ఒక్కోసారి కథను పక్కనపెట్టి, చదవడం కోసమే చదువుకోగల వినోదం ఇస్తాడు. ఆ తరహా చాలా కొద్దిమందికి లోపమూ, చాలా ఎక్కువమందికి ఆయన అక్షరాల్ని విడిచిపెట్టకుండా చదువుకునే ఆకర్షణాబలమూ!

(సాక్షి ఫన్‌డే; 27 జూలై 2014)
––––––––––––––––––––––

Monday, July 27, 2026

నదిలాంటి మనిషి


రాహుల్‌ సాంకృత్యాయన్‌ 

9 Apr - 1893 - 14 Apr 1963


 

నదిలాంటి మనిషి



అద్భుతం అనే విశేషణానికే గనక రూపమొస్తే, అది ఆరడుగుల రాహుల్‌ సాంకృత్యాయన్‌లా ఉంటుంది. ఎలాంటి మనిషాయన!

యాత్రికుడు, చరిత్రకారుడు, భాషాశాస్త్రవేత్త, అనువాదకుడు, ఆచార్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అపారమైన పాండిత్యం ఉన్నప్పటికీ సరళమైన హిందీలో రాసిన రచయిత!

రాహుల్‌జీ పేరు వినగానే, కాళ్లకు కట్టుకోవడానికి బలపాల్ని వెతికేవాళ్లు ఉంటారు. అంతటి ఉత్తేజకర పాదాచారి ఆయన. యాత్రలు వాటికవే ఇవ్వగలిగే పరమానందాన్ని అనుభవిస్తూనే, వాటిద్వారా పరమార్థాన్ని కూడా ప్రజలకు అందించారు రాహులుడు.

ఒకసారి ఈ దృశ్యం ఊహిద్దాం! పదమూడో శతాబ్దంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలను భక్తియార్‌ ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధ భిక్షువులు పవిత్రమైన గ్రంథాలతో పారిపోయారనీ, ఆ విలువైన సంస్కృత పుస్తకాల్ని టిబెట్‌లోని ఆరామాల్లో భద్రపరిచివుంచారనీ ప్రచారంలో ఉంది. అయితే, ఆరు వందల ఏళ్లుగా వాటిల్లో ఏముందో చూసినవారు లేరు.

సాంకృత్యాయన్‌ వాటికోసం అన్వేషిస్తూ, దారి కూడా సరిగాలేని కొండల్లో నడుస్తూ, కాశ్మీర్, లడఖ్, కార్గిల్‌ మీదుగా టిబెట్‌ వెళ్లారు. అక్కడ పుస్తకాలైతే లభించాయిగానీ అవి సంస్కృతంలో లేవు. అన్నీ భోత్‌ భాషలో ఉన్నాయి. రాహుల్జీ కంచరగాడిదల మీద వాటిని తరలించుకొచ్చారు. మరో మూడుసార్లు టిబెట్‌ వెళ్లారు. టిబెటన్‌ నేర్చుకున్నారు. నేర్చుకోవడమేకాదు దాని వ్యాకరణ పుస్తకాలు రాశారు. టిబెటన్‌–హిందీ నిఘంటువు కూర్చారు. ఆ గ్రంథాలన్నీ పాట్నా మ్యూజియంలో ఉన్నాయిప్పుడు.

‘‘ప్రపంచంలో యాత్రలు చేయడానికి మించిన ముఖ్యమైన విషయం మరోటి లేదు. సమాజం కోసం ఒక యాత్రికుడికంటే శ్రేష్టంగా ఆలోచించగలవారు మరెవరూ ఉండరు,’’ అనేవారు రాహుల్జీ. ఈ ప్రపంచం ఈ రీతిన ఉండటానికి యాత్రికుల వివేకమే కారణమంటారాయన. ‘‘యాత్రలంటూ జరగకపోయివుంటే సోమరి మానవమూకలు పశుస్థాయినుంచి పరిణామం చెందేవే కాదు’’.

ఉత్తరప్రదేశ్‌లోని పల్లెటూరులో కేదార్‌నాథ్‌ పాండేగా జన్మించి, తొమ్మిదేళ్లప్పుడే ప్రపంచం ఏమిటో చూడాలని ఇంట్లోంచి పారిపోయాడు సాంకృత్యాయన్‌. వేలాది కిలోమీటర్లు కాలినడకన చుట్టివచ్చారు. బౌద్ధాన్ని తనలో ఇంకించుకున్నవాడుగా తన పేరును రాహుల్‌ సాంకృత్యాయన్‌గా మార్చుకున్నారు. మూడు బౌద్ధ వేదాలనూ జీర్ణించుకుని త్రిపిటకాచార్య అయ్యారు. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్‌ రష్యా... ఎక్కడ తిరిగితే అక్కడి భాష నేర్చుకున్నారు. అరబిక్, భోజ్‌పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళీస్, తమిళం, ఉర్దూలాంటి ముప్పైకి పైగా భాషలు, అందులోని యాసలు కూడా ఆయనకు తెలుసు. ఎక్కడా అధికారికంగా చదువుకోకపోయినా విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదిగారు. అందుకే ఆయన్ని మహాపండిత్‌ అనేవారు.

చివరికి మార్క్సిజం దగ్గర తన భావాల్ని స్థిరీకరించుకున్న రాహుల్జీ... సోషియాలజీ, మతం, తత్వం, భాష, సైన్సు మీద శతాధిక పుస్తకాలు రాశారు. రుగ్వేద ఆర్యులు, లోకసంచారి, దివోదాసు, విస్మృత యాత్రికుడు, సింహసేనాపతి, జయమౌధేయ, మధురస్వప్నం లాంటివి అందులో కొన్ని. సృష్టాది నుంచీ ఈ ప్రపంచపు నడతను మేఘాల్లో కూర్చుని వీక్షించినట్టుగా ఆయన చరిత్రను రికార్డు చేసిపెట్టారు. లేదంటే ‘ఓల్గా నుంచి గంగకు’ రాయడం ఎలా సాధ్యం!

చరిత్రను అర్థం చేయించడానికి ఆయన పూసిన పంచదార పూత ఒక్కోసారి అది చరిత్రేనా అన్న అనుమానాన్ని కలిగిస్తుంది. కానీ ఎన్ని చరిత్రగ్రంథాలు చదివినా మెదడులో నమోదుకాని దృశ్యమాలిక ఆయన ‘ఓల్గా నుంచి గంగకు’ ద్వారా నమోదవుతుంది. రిఫరెన్సు పుస్తకాలు కూడా కంఠోపాఠంగా ఉంచుకున్న ఈ మహావిజ్ఞాని చివరిరోజుల్లో తన పేరేమిటో తనే చెప్పుకోలేని మతిమరుపులోకి జారిపోవడం సృష్టి వైచిత్రి. కానీ ఆయన్ని మనం మాత్రం మరిచిపోగలమా!

(సాక్షి ఫన్‌డే; 6 ఏప్రిల్‌ 2014)
––––––––––––––––––––––

Friday, July 24, 2026

పండిత్‌ చౌరాసియా


హరిప్రసాద్‌ చౌరాసియా 

 

పండిత్‌

హరిప్రసాద్‌ చౌరాసియా వేణుగానం పలికించడం చూస్తే– ఆ నాదం వాద్యంలోంచి మాత్రమే వచ్చినట్టు ఉండదు; మడిచిన పెదాలలోంచీ, ఆడే చేతివేళ్లలోంచీ మాత్రమే కాదు, ఆయన వెన్నులోంచీ, ఎగిరే జుట్టులోంచీ, మొత్తంగా ఆయన ఒంట్లోంచీ సంగీతం వెలువడినట్టుంటుంది.

‘కృష్ణభగవానుడితో నేరుగా అనుసంధానం కలిగిన వాద్యమిది. ఏ ఆడంబరం లేదు, ఏ తొడుగులు లేవు, ఏ తంత్రులు అక్కర్లేదు. వెదురు ముక్క చాలు. గాలిని నియంత్రించడానికి రంధ్రాలు! దేవుడు మాత్రమే ఇంత సరళమైన వాద్యాన్ని కనిపెట్టగలడు!’ అంటారు చౌరాసియా. ‘పైగా తీసుకెళ్లడం ఎంత సులభం’!

ఒక వస్తాదు కొడుకుగా చౌరాసియా సంగీతంతో రహస్యంగా కుస్తీ పట్టాల్సివచ్చింది. కారణం, వాళ్ల నాన్నకు సంగీతమంటే వేశ్యలకు సంబంధించింది! తనలాగే కొడుకూ వస్తాదు కావాలని ఆయన కోరిక.
 
నాలుగున్నరేళ్లప్పుడే అమ్మపోయింది కాబట్టి, నాన్నను ఒప్పించే మార్గం లేకపోయింది. అందుకే గుడికి వెళ్తున్నానని చెప్పి స్నేహితుడింటికి వెళ్లేవారు. అక్కడ పాడటం సాధన చేసేవారు. పండిత్‌ రాజారామ్‌ ఆయనలో ప్రతిభ ఉందని గుర్తించి, బోధించడం మొదలుపెట్టారు. అప్పటికింకా హరిప్రసాద్‌ చేతుల్లోకి వేణువు రాలేదు.

‘పదిహేనేళ్ల వయసులో అలహాబాద్‌ రేడియోలో తొలిసారి వేణుగానం విన్నాను. స్వర్గానికి రవాణా అయినట్టుగా అనుభూతి చెందాను. అది నా జీవితంలో కీలకమలుపు,’ అంటారు చౌరాసియా. అంతే! అంత గొప్పగాలేని తన గాత్రానికి స్వస్తిచెప్పారు. ఆ వేణువూదిన పండిత్‌ భోలానాథ్‌ను వెతుక్కుంటూ వెళ్లి, గుమ్మంలో వాలిపోయారు. కూరగాయలు కోయడం, మసాలాలు నూరడానికైనా ఈ పిల్లాడు పనికొస్తాడని ఒప్పుకున్నారాయన. కానీ అదే భోలానాథ్‌ అచ్చెరువొందేలా, వేణువుకు సరికొత్త ఊపిరిలూదారు చౌరాసియా.

వేణువు అర్హతగా ఒరిస్సా రేడియోలో ఉద్యోగం వచ్చినరోజున చౌరాసియా నాన్న ఆశ్చర్యపోయారు, దాచివుంచిన సంగతి గురించి! కానీ ఒప్పుకోక తప్పలేదు. అదే ఒరిస్సా రేడియో ఆయన్ని ‘బొంబాయి’ చేర్చింది. మదన్‌మోహన్, రోషన్‌ లాంటి సంగీతదర్శకులు ఆయన వేణుగానానికి సమ్మోహితులై సినిమాల్లోకి ఆహ్వానించారు. ఎస్‌ డి బర్మన్, ఆర్‌ డి బర్మన్‌తోనూ పనిచేశారు(తర్వాతి కాలంలో ‘సిరివెన్నెల’కు తన వేణువుతో  ప్రాణం పోశారు). ‘బాలీవుడ్‌ అవకాశాలు నన్ను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. భవంతి సమకూరింది, కారు ముంగిట ఆగింది, భౌతిక అవసరాలు తీరాయి; కానీ ఒక అసంతృప్తి మొదలైంది. నేను కళాకారుడిగా ఎదగడం లేదు. నాకు ఇంకేదో కావాలి, నా ఆత్మ సుఖించడం లేదు,’ అని అప్పటి మథనం గురించి చెబుతారాయన.

దాంతో ‘సుర్‌బహార్‌’ విద్వాంసురాలు అన్నపూర్ణాదేవిని కలిశారు. అప్పటికే పండిత్‌ రవిశంకర్‌నుంచి విడిగా ఉంటున్నారామె. బహిరంగ ప్రదర్శనలు మానేశారు. ఆమె చౌరాసియాను ముందు శిష్యుడిగా అంగీకరించలేదు. బయటికి తోసినంత పనిచేశారు. కానీ మూడేళ్లుగా చూపిస్తున్న ఆయన తపనకు తలొగ్గక తప్పలేదు. ‘నేను పట్టుదలతో ఉన్నానని తెలియజేయడానికి నా చేతుల్ని మార్చుకున్నాను. అంతకుముందు కుడిచేత్తో వాయించేవాడిని. ఎడమచేతికి మారిపోయాను. వెనక్కి చూడకుండా వెనక్కి తిరిగి నడవడం లాంటిదది. హింస! కానీ సంతోషం! ఆమె నాకు గురువు మాత్రమే కాదు, దేవతకన్నా ఎక్కువ. నా ఆకలి, ఆరోగ్యం పట్టించుకున్నారు. నా సంగీతానికి పరమార్థం కల్పించారు,’ అని తబ్బిబ్బవుతారు చౌరాసియా.

‘ఒక్కో క్షణం అద్భుతంగా ఉంటుంది. ఆ క్షణంలో సంగీతం ప్రవహిస్తుంది. ఒక నీటిచుక్క నువ్వు దాహంగా ఉన్నప్పుడు ఆర్తి తీర్చుతుంది. అదే బిందువు నీటియంత్రంలోంచి పైకి ఎగిరినప్పుడు దాని అందంతో మురిపిస్తుంది. మళ్లీ అదే చుక్క మురికినీరులో కలిసి అసహ్యం పుట్టిస్తుంది. అదే నీటిబిందువు నదిలో కలిసి ఈదే ఉత్సాహం కలిగిస్తుంది. అదే చుక్క సముద్రంలో కలిసినప్పుడు తన శక్తితో ఆశ్చర్యగొలుపుతుంది. ఇదంతా కూడా సంగీతంతో పలికించొచ్చు’.
 
‘వేణుగానం చేయడమంటే శ్వాసను నియంత్రించడం. ఇంకోమాటలో యోగా చేయడం. ఒక పవిత్రమైన బాధ్యతతో, ఆధ్యాత్మిక మానసిక స్థితితో ఒక ధ్యానంలాగా యోగంలాగా నేను పాడతాను. అసలు నేను శ్రోతలకోసమే పాడతాను. కానీ అందులో ఎన్నో రకాలవాళ్లుంటారు. వారందరినీ తృప్తి పరచడం సాధ్యం కాదు. వాళ్ల మధ్యలో ఒక గొప్ప శక్తి ఏదో కనబడుతుంది. అది మాధవుడే కావొచ్చు. ఆ శక్తికోసం నేను వేణువు పలుకుతాను. నాలోనేను దైవాన్ని అనుభవిస్తాను,’ అంటారు తన వేణుగానం గురించి.

‘సంగీతమే నా ప్రార్థన. సంగీతమే నా మతం’ అనే చౌరాసియాకు ఎక్కడా రికార్డుగా లేని కృష్ణుడి గానం వినలేదన్న చింత ఉందట! కానీ మనకా బాధ లేదు.

(సాక్షి ఫన్‌డే; 29 జూన్‌ 2014)
––––––––––––––––––––––

Tuesday, July 21, 2026

అగ్నిధార దాశరథి


దాశరథి కృష్ణమాచార్య
22 July 1925 - 5 Nov 1987
 

అగ్నిధార

జూలై 22న కవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి
---------------------------------------------------------------

‘‘నువ్వు ఎటు వెళుతున్నావ్‌?’’ అనడానికి ‘‘త్వకుంత్ర గచ్ఛసి’’ అనాలనేంతటి పట్టుదలవున్న ఇంట్లో జన్మించాడు దాశరథి. కానైతే ఆయనకు అంతటి సంస్కృత ‘ఛాందసం’ నచ్చేదికాదు. అలాగే, నిజాం కాలంలో ‘తెలుగు మీద దండయాత్ర’ జరుగుతున్న కాలంలో చదువుకున్నాడు. ఆయన అదీ సహించేవాడు కాదు. బహుశా, ఈ కారణాలవల్లేనేమో ఆయనలో రెండు పరస్పర విరుద్ధాంశాలు అద్భుతంగా సంలీనం చెందిన తీరు కనిపిస్తుంది. ‘సంప్రదాయం’లో బతుకుతూనే విప్లవమార్గాన్ని అనుసరించాడు; ‘పాత బూజు’గా ఎద్దేవా అవుతున్న పద్యాల్లోనే అభ్యుదయాన్ని కలగన్నాడు.

దాశరథి లాంటివాళ్లకు, లేదా ఆ కోవకు చెందిన రచయితలకు సాహిత్యం కేవలం సాహిత్యం కాదు; అది ఒక సామాజిక బాధ్యత. నిర్బంధం, చిత్రహింసలకు వ్యతిరేకంగా జాతిని జాగృతం చేయాల్సిన పవిత్ర కర్తవ్యం. అందువల్లే, ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’, ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘తిమిరంతో సమరం’ లాంటి కావ్యాలు వెలువరించాడు. ‘అగ్నిధార అనేపేరును కొందరు ఆక్షేపించారు. అగ్ని ధారలా ప్రవహిస్తుందా? అన్నారు కొందరు. విద్యుత్తు అగ్ని కాదా? అది ప్రవహించదా? సముద్రంలోని బడబ, అగ్ని కాదా? అది నీటిలో అన్నివైపులా సాగిపోదా?’ అన్నాడు దాశరథి. అగ్నిని చైతన్యానికి సంకేతంగా, ఆ చైతన్యం ఒక మానవహృదయంలోనుండి ఇంకొకనిలోకి ప్రవహించి, జాతినంతటినీ ఏకసూత్రాన కట్టిపడేసేదిగా ఆయన తలచాడు.

‘నా గమ్యం ప్రపంచశాంతి. నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం’ అని ప్రకటించుకున్న దాశరథి జీవితాన్నే పోరాటంగా మలుచుకున్నాడు. ‘తిమిరంతో ఘనసమరం, జరిపిన బ్రతుకే అమరం’ అన్నాడు. ‘ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగల్చి కాల్చి, నాలో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు’ అని ప్రకటించాడు. కార్యాచరణ కూడా కవి కర్తవ్యంగా భావించినవాడు కాబట్టి, కటకటాల పాలయ్యాడు.

1948లో ఆయన్ని వరంగల్లు జైలునుంచి నిజామాబాద్‌ జైలుకు మార్చినప్పుడు మొదట వట్టికోట ఆళ్వారుస్వామి కనిపించి సంబరపడ్డాడట. వట్టికోట కోసం దాశరథి జైలుగోడమీద బొగ్గుతో ఈ పద్యం రాశాడు: ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్నబోలిన రాజు మాకెన్నడేని;/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ, కోటిరత్నాల వీణ.’

గాఢమైన యౌవనప్రాయంలో ఆయన జైలుగోడల్లో బందీ అయ్యాడు. కానీ ఆయన మధురస్వప్నాల్ని ఎవరు బంధించగలరు? ‘అంగారం, శృంగారం నీ రచనలో కలగలిసి ఉంటాయి,’ అనేవారు ఆయన్ని చనువున్న మిత్రులు. సైనికుడు యుద్ధంలో పోరాడుతూకూడా అప్పుడప్పుడూ తన ప్రియురాలి అందమైన కళ్లను తలచుకోవడం అస్వాభావికమా? అని ప్రశ్నిస్తాడు దాశరథి. అందుకేనేమో, ఆ భయానక ఒంటరి క్షణాల్లో వాళ్ల ఊరి నదికి మంచినీళ్లు తీసుకుపోవడానికి వచ్చే పచ్చని అమ్మాయి తలపుల్లో మెదులుతుండేదట! ఆకాశంలోకి తలెత్తి చూస్తే, మేఘాలు అందమైన అమ్మాయిల ఆకారాలు ధరించి, పొంగిన వక్షస్థలాలతో కవ్వించేవట! మరోపక్కేమో జైలు బ్యారకు, నగ్న ఖడ్గం ధరించిన తుపాకీ భటుడు కనిపించేవాడు. వాణ్ని నరికేసి, లేదా వానిచే నరకబడి, ఆకాశంలోని మేఘభూమి వైపు సాగిపోవాలనిపించేదట! ఏ శషభిషలు లేకుండా, ‘పాపులర్‌’ మూడ్‌ను పట్టించుకోకుండా రాయడం దాశరథి నిజాయితీ!

‘నేను పోతన కవీశానుగంటములోని ఒడుపుల కొన్నింటిని బడసినాను’ అని తన అభిమానాన్ని వెల్లడించిన దాశరథి... ‘మంచి కవిత్వం ఏ భాషలో వుంటే అది నా భాష/ మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు’ అని తన రసహృదయాన్ని చాటుకున్నాడు. గాలిబ్‌ను అందువల్లే ఆయన పలవరించివుండొచ్చు. దాశరథిని తలుచుకోవడానికి నిజానికి గాలిబ్‌ గీతాల అనువాదం ఒక్కటి చాలు. ‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము/ నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము’. ‘దేవి! మన పూర్వబంధమ్ము త్రెంచబోకు/ ప్రేమలేకున్న నుండనీ ద్వేషమేని’. ‘మనిషి ఏకాకియౌనను మనసులోన/ గుంపులుగ భావములు జేరి గోష్ఠి జరుపు’.

ఇక... ‘ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’, ‘నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా’, ‘ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా’... సినిమా పాట స్థాయిని దిగజార్చకుండా పాటలు రాసిన అతికొద్దిమందిలో దాశరథీ ఒకరు.

ఆయన ‘ఆంధ్రప్రదేశ్‌ తొలి ఆస్థానకవి’గా నియమితుడయ్యాడు. ‘యాత్రాస్మృతి’ పేరిట చక్కటి వచనం రాశాడు. ఆయన్ని ఎరిగినవారు స్నేహశీలి, మృదుస్వభావి, నిరాడంబరుడు అని చెబుతారు. వేటూరి అన్నట్టు, ‘అతను బుడుగైనా ఆర్తి పొడుగు. మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది’!

(సాక్షి ఫన్‌డే; 20 జూలై 2014)

Saturday, July 18, 2026

Watching Iranian films helped me...

Watching Iranian films helped me to picture the sections set in Tehran, and I always like to cook any food that’s mentioned in the books I’m translating; listen to the music; do anything I can to get a feel for a place; though no, I’ve never been to Iran.


(Ruth Martin on Translating The Nights are Quiet in Tehran by Shida Bazyar; Outlook, June 8, 2026)

Wednesday, July 15, 2026

దిమ్మరి చార్లీ


చార్లీ చాప్లిన్‌
16 Apr 1889 - 25 Dec 1977


దిమ్మరి చార్లీ!


పుడుతూనే నడకతోపాటుగా నటన నేర్చుకున్నవాడు... చార్లీ చాప్లిన్‌! వేదిక మీద ఆగిపోయిన తల్లి పాటను అందుకుని గొంతెత్తి పాడితే, దానికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందిస్తుంటే, తనుమాత్రం మీదకు విసిరిన చిల్లరడబ్బుల్ని ఏరుకోవడంలో మునిగిపోయాడు. చప్పట్లు ఆకలి తీర్చుతాయా! ఆకలికి మాడినవాడు కాబట్టే, ‘బూట్లను ఉడికించి, తినాల్సివచ్చిన’ సన్నివేశాన్ని(గోల్డ్‌ రష్‌) సృజించగలిగాడు.

తాగుబోతు తండ్రి, మతిస్థిమితం తప్పిన తల్లి, అనాథశ్రమాల్లో గడపాల్సిన పరిస్థితి, రెండేళ్లు మాత్రమే చదివిన చదువు... ఖరీదైనదిగానే తప్ప మరోలా మన ఊహకు అందని లండన్‌ నగరంలోని అతిపేదరికాన్ని చిరు చాప్లిన్‌ అనుభవించాడు. అందుకేనేమో, ‘‘నేనెప్పుడూ వాననీటిలో నడవడానికి ఇష్టపడతాను, నా కన్నీళ్లు ఎవరికీ కనబడకుండా’’ అన్నాడు.

పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడకముందు చాప్లిన్‌ చాలాపనులు చేశాడు. స్టేషనరీ స్టోరులో, డాక్టర్‌ ఆఫీసులో, గ్లాసు ఫ్యాక్టరీలో, షాండ్లియర్‌ షాపులో, ప్రింటింగ్‌ ప్లాంటులో. అయినా అదంతా జీవితం ఇవ్వగలిగే అనుభవంగానే లెక్కించాడు. అసలంటూ బతక్కపోవడంకంటే అది మేలే కదా!
 
‘‘జీవితంలో ట్రాజెడీ ఒక భాగం. కానీ దాన్ని ఎదుర్కోవడానికి పుట్టిందే కామెడీ’’ అన్నాడు చాప్లిన్‌. కానీ ఆ కామెడీ ఎలా ఉండాలి? ‘‘నా బాధ ఒకరి నవ్వుకు కారణమైతే కావొచ్చుగాక, కానీ నా నవ్వుకు మాత్రం మరొకరి బాధ కారణం కారాదు’’. ‘‘ఒక వృద్ధుడు అరటితొక్క మీద కాలువేసి జారి పడితే– దానికి మనం నవ్వం. అదే కొంచెం అతిశయంతో నడుస్తున్న వ్యక్తి పడితే మాత్రం నవ్వుతాం’’. ఇదీ చాప్లిన్‌ హాస్యం! ప్రపంచంలో ఇంతమందికి బుగ్గల్లో సొట్టలు పడేలా చేసిన నటుడు మరొకరు లేరు.

కానీ ఆయన సినిమా అంటే హాస్యమొక్కటేనా? నలుపు తెలుపు చిత్రాల్లోనే జీవితంలోని అన్ని రంగుల్నీ చూపించాడు; నిశ్శబ్ద సినిమాల్లోనే జీవితపు అన్ని పార్శా్వల్నీ వ్యాఖ్యానించాడు.  పార్కు, ఓ అమ్మాయి, ఒక పోలీసు ఉంటే చాలు, సినిమా తీసేస్తాననేవాడు చాప్లిన్‌. మిగతా నటులందరికీ భిన్నంగా అందమైన ముఖాన్ని మేకప్‌ చాటున దాచిన ఏకైక నటుడు చాప్లిన్‌. బ్యాగీప్యాంటు, టైటుకోటు, పెద్ద తల, చిన్న టోపీ, వెలిసిపోయిన బట్టలు, అయినా హుందాతనాన్ని కాపాడుకునే యత్నంగా చేతికర్ర, చేసేది కామెడీయే అయినా సీరియస్‌నెస్‌ తేవడానికి చిన్నమీసాలు, పెద్దబూట్లు, పెంగ్విన్‌ లాంటి నడక... ఆయన నిజంగా దిమ్మరిగా గడిపినప్పుడు ఆదరణ లేదు; కానీ దిమ్మరి వేషానికి (ట్రాంప్‌) మాత్రం జేబుల్నిండా డబ్బులు కుక్కింది హాలీవుడ్‌. ద కిడ్, ద గోల్డ్‌ రష్, ద సర్కస్, సిటీ లైట్స్, మోడర్న్‌ టైమ్స్, ద గ్రేట్‌ డిక్టేటర్‌(టాకీ), లైమ్‌లైట్‌(టాకీ)... ఆయన సినిమాల్లోని సన్నివేశాల్లోంచీ, ఆయన కూర్చిన సంగీతంలోంచీ ఎన్నో సినిమాల్లో ఏదో ఒక రిఫరెన్సు లేకుండా ఉండదు! చాప్లిన్‌ లాంటివాళ్లకు తప్ప, కాలాతీతం అనేది ఊరికే వాడగలిగే మాటకాదు.

అయినా ఒరిజినాలిటీ అనేదాన్ని చాప్లిన్‌ అంగీకరించలేదు. ‘‘జీవితం మొత్తం స్టీరియోటైపే. మనం ఏ ఒరిజినాలిటీతోనూ నిద్ర లేవం. మనందరమూ మూడు పూటల భోజనం, ప్రేమలో పడి లేవడమనే సాధారణ వ్యవహారాలతోనే పుట్టి చచ్చిపోతాం. కాకపోతే దాన్ని మలచడంలోనే ఆసక్తి పుట్టించగలగాలి’’ అనేవాడు.

తొలుత ఆదరణ చూపిన అమెరికా చివరిదశలో వామపక్ష ముద్రతో తనను ఎంత వేధించినా, మనుషుల మీద ఆయన పూర్తి నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చినా, ‘‘అద్దం నా మంచి స్నేహితుడు; నేను ఏడ్చినప్పుడు అది నవ్వదు’’ అనేంతగా ఒంటరితనాన్ని అనుభవించినా, ‘‘జనం నిన్ను ఏకాంతంగా వదిలేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది’’ అనేంత పరాయితనాన్ని అనుభవించినా, ఆయన అందరికీ నవ్వునీ, ప్రేమనూ పంచాడు; ‘‘చిట్టచివరికి జీవితం ఒక ప్రాక్టికల్‌ జోక్‌’’ అని తేలిగ్గా తీసుకున్నాడు.

(సాక్షి ఫన్‌డే; ఏప్రిల్‌ 13, 2014)

Sunday, July 12, 2026

I am myself the matter of my book


Michel de Montaigne


 “Thus, reader, I am myself the matter of my book; you would be unreasonable to spend your leisure on so frivolous and vain a subject.”

— Michel de Montaigne, Essays, 1580


So, reader, here I am, the subject of my book, and I see no reason why you should spend your free time on so unimportant and pointless a topic.

- Michel de Montaigne, Essays, 1580

Thursday, July 9, 2026

దాహపు మనిషి గురుదత్‌


గురుదత్‌
9 July 1925 - 10 Oct 1964

 

దాహపు మనిషి

జూలై 9న దర్శకుడు గురుదత్‌ జయంతి
-------------------------------------------------------------


గురుదత్‌ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమా సంపూర్ణం కాదు.

భారతీయ సినిమాకు ముఖంగా పాశ్చాత్యులు పరిగణించే సత్యజిత్‌ రే మీద ఒక విమర్శ ఏమిటంటే, రే ప్రధాన ప్రేక్షకులు భారతీయేతరులే! కానీ గురుదత్‌ అలాకాదు. మౌఖిక సంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేశాడు. భారతీయ సినిమా తనకంటూ రూపొందించుకున్న నిర్దిష్టరూపాన్ని పాటిస్తూనే, సారంలో ఉన్నతిని ప్రదర్శించాడు. కెమెరాను స్వీయ వ్యక్తీకరణకు వాడుకున్నాడు.

వసంతకుమార్‌ శివశంకర్‌ పదుకోణెగా బెంగళూరులో జన్మించాడు గురుదత్‌. పూర్తి దక్షిణాదివాడు. పేరు మార్చుకునేలా చేసింది ఆయన ఇష్టంగా పీల్చిన బెంగాలీ గాలి! ఆయన సినిమాల్లో కూడా మార్మికత, అస్పష్టత లాంటి వంగతనం కనబడేది అందుకే!

ఒక కథ తట్టగానే అందులో లీనమవడం, అది ఉత్సాహమివ్వడం మానేయగానే దాన్ని వదిలేసి మరో కొత్తదాన్లో పడిపోవడం గురుదత్‌ స్వభావమట! పిల్లాడు బొమ్మను పొందేదాకా చాలా ముఖ్యమైందన్నంత పట్టింపు కనబరిచి, తీరా చేతిలోకొచ్చాక అటూయిటూ తిప్పి కిందపడేస్తాడు కదా, అలా ఉండేదట గురు శైలి. ఏ సన్నివేశమూ ఆయనకు ఒకపట్టాన నచ్చేది కాదు. ‘ఏక్‌ ఔర్, ఇంకోటి, ఇంకోటి,’ అంటూ తీస్తూపోయేవాడు. మరింత మెరుగైనది ముందుందని నమ్మేవాడు. ‘ప్యాసా’లోని ఒక సన్నివేశానికైతే 104 టేక్స్‌ చేశామని గురుదత్‌ ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌ వి.కె.మూర్తి అంటారు. అందుకే, నిర్మాతలను విసిగించలేకే తొలిహిట్లతో కూడబెట్టిన డబ్బుతో స్వయంగా నిర్మాణానికి పూనుకున్నాడు గురుదత్‌.
ఈ సన్నివేశానికి సిద్ధమవుతూ కూడా, తరువాయి సన్నివేశం గురించి ఆలోచించేవాడట గురుదత్‌. సృజనాత్మక మెదడు ఎప్పుడూ ఖాళీగా ఉండనట్టుగా, ఏదో లోకంలో ఉండేవాడు. ‘పిలవగానే ఒక్కసారిగా మేల్కొన్నట్టుగా అందులోంచి బయటకు వచ్చేవాడు’.

‘ప్యాసా’లో నిజానికి దిలీప్‌కుమార్‌ నటించాల్సింది! కానీ పారితోషికం విషయంలో వచ్చిన చిక్కులవల్ల తానే ఆ ‘కవి’ పాత్రను పోషించేందుకు సిద్ధపడ్డాడు గురుదత్‌. అది క్లాసిక్‌గా నిలవడానికి అదీ ఒక కారణమంటారు విమర్శకులు.
ఏ దర్శకుడైనా తన జీవితంలో ఉన్నది సినిమాలో కలపకుండా ఉండడు. మెరుగుల ప్రపంచంలో నిలబడలేని తనలాంటి సున్నితమైన దర్శకుడి జీవితాన్నే ‘కాగజ్‌ కె ఫూల్‌’లో పాక్షికంగానైనా తెరకెక్కించడం గురుదత్‌కే చెల్లింది. అయితే, చిత్రంగా కాగజ్‌ కె ఫూల్‌ను అప్పటి ప్రేక్షకులు తిప్పికొట్టారు. తెరమీదకు రాళ్లు విసిరారు. రచ్చ గెలిచాకే, ఇంట్లోనూ హారతి పట్టడం మొదలైంది. కానీ గురుదత్‌ మనసు తీవ్రంగా గాయపడింది. ఒకటి మాత్రం నిజం. ప్రేక్షకుల ప్రమాణం పాక్షికమే! కాలమే సిసలైన నిర్ణేత. రాళ్లు వేయించుకోవడానికి ‘సిద్ధపడ్డవాడి’కే కాలం పూలు జల్లుతుంది, తన పరీక్ష తాను పెట్టి!

‘పరిశ్రమకు కొత్తగా వచ్చినవాళ్లకు ఆయన మంచి దర్శకుడు. ప్రత్యేకించి కొత్తవాళ్ల పరిమితుల్ని అర్థంచేసుకుని, వాటిని పరిష్కరించేవారు,’ అంటారు దత్‌ ఆస్థాన నటి వహీదా రెహమాన్‌. అంత జీవితాన్ని చూశాక కూడా, ఆయన తన సమస్యల్ని తానే పరిష్కరించుకోలేకపోవడం విధి వైచిత్రి!

జానీ వాకర్‌తో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాడు. వి.కె.మూర్తితో దోశ, భేల్‌పూరి తినడానికి పోయేవాడు. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడు. మితం లేకుండా మద్యం తాగేవాడు. అటు భార్య గీతాదత్‌తో సర్దుబాటు కాలేక, ఇటు వహీదాతో కొత్త జీవితంలోకి అడుగిడలేక నలిగిపోయాడు.

(భర్తను భరించలేక) భార్య పిల్లల్తో సహా దూరమైపోవడం, వహీదా వేరే దర్శకులతో సినిమాలు తీయాలని నిర్ణయించుకోవడం, కొత్తగా జతచేరిన ఆర్థిక ఇబ్బందులు... అప్పటికే సొంతిల్లు అమ్మాడు. అద్దింట్లోకి మారాడు.
‘నేను అనాథను అయ్యాను. ఇంట్లోవాళ్లు లేరు. నువ్వు(వి.కె.మూర్తి) బెంగుళూరు వెళ్లిపోతున్నావు, అబ్రార్‌ (అల్వీ–గురుదత్‌ ఆస్థాన రచయిత) ఇంకో సినిమా రాయడానికి మద్రాసు వెళ్తున్నాడు, నేను ఏం చేయను?’ అన్నాడట, చివరిసారి తనను కలిసిన మిత్రులతో.

‘చూడు, నేను దర్శకుడిని కావాలనుకున్నాను, దర్శకుడిని అయ్యాను; నటుణ్ని కావాలనుకున్నాను, నటుణ్నయ్యాను; మంచి పిక్చర్లు తీయాలనుకున్నాను, మంచివి తీశాను. పైసలున్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా నా దగ్గర ఏమీలేదు,’ అనుకునేంత నిరాశలోకి కూరుకుపోయాడు. 39వ ఏట తనను తానే హత్య చేసుకున్నాడు.

‘యార్, జీవితంలో ఉన్నవేమిటి? రెండే రెండు విషయాలు... విజయం, పరాజయం. వీటికి మధ్యన ఏదీలేదు,’ అన్నాడో సందర్భంలో గురుదత్‌. ఆయన సినిమాల్లో సక్సెస్‌ అయ్యాడుగానీ జీవితంలో ఫెయిల్‌ అయ్యాడంటారు. కానీ ఆయనకు జీవితమే సినిమా అయినప్పుడు, జీవితంలో మాత్రం ఫెయిల్‌ అయ్యాడని అనగలమా!

(సాక్షి ఫన్‌డే; జూలై 6, 2014)
––––––––––––––––––––––

Monday, July 6, 2026

వెయ్యి బారల లోతు రచయిత



(కొన్నిసార్లు కొన్నింటిని ఓన్‌ చేసుకోవడానికి నేను భయపడుతాను. ఈ ‘సత్వం’ శీర్షికన ఫన్‌డే కోసం 2014లో రాసినవి కూడా అలాంటివే. అందుకే వాటికి బైలైన్‌ పెట్టుకోవడానికి జంకేవాడిని. (అందుకే ఆర్‌.ఆర్‌. పేరుతో రాశాను.) ఎందుకంటే వీటిల్లో జర్నలిస్టిక్‌ ట్రిక్‌ ఉంటుంది. అంటే ఎంతో మథించి రాసినట్టుగా పాఠకుడిని భ్రమింపజేయడం! కానీ అంత సీరియస్‌గా చదివి రాయడం కష్టం. ఒక పాత్రికేయ ఉద్యోగిగా వారంలో చేయాల్సిన పనుల్లో ఇదీ ఒకటి; అంతేగానీ ఇదే ఒకటి కాదు. తక్కువ సమయం, అందుబాటులో ఉండని మెటీరియల్‌ లాంటి పరిమితుల్లో 49 వారాల పాటు దీన్ని కొనసాగించాను. మళ్లీ ఇప్పుడు వాటిని చదువుకుంటే– గర్వపడేంత గొప్పగా లేకపోయినా, సిగ్గుపడేంత చెడ్డగా కూడా లేవు, అనిపించింది. అందుకే వరుసగా బ్లాగులో అప్డేట్‌ చేస్తూ వస్తున్నా.)



మార్క్‌ ట్వేన్‌
30 Nov 1835 - 21 Apr 1910

 

వెయ్యి బారల లోతు రచయిత

ఒక యువపాత్రికేయుడిగా రుడ్యార్డ్‌ కిప్లింగ్‌ తనను ఇంటర్వ్యూ చేసిన కొన్నాళ్ల తర్వాత, మార్క్‌ ట్వేన్‌ ఇలా వ్యాఖ్యానించాడు: ‘నేను అంతకుముందు కలిసిన వారందరికంటే ఆయనకు ఎక్కువ తెలుసు; అలాగే, ఆయన గతంలో కలిసిన వారందరిలోకీ నేను తక్కువ తెలిసినవాడినని ఆయనకు తెలుసని నాకు తెలుసు’.

మార్క్‌ ట్వేన్‌ అంటేనే ఒక చమత్కారం, ఒక నవ్వు, ఒక సరదా. ‘తల్లిదండ్రులకు విధేయంగా ఉండు, వాళ్లు ఉన్నప్పుడు’ అని పిల్లలకు సలహా ఇస్తాడు. ‘మనం తప్పులు చేయకూడదు, ఎవరైనా చూస్తున్నప్పుడు’ అని వ్యంగ్యం విసురుతాడు. ‘మంచిగా ఉండు; త్వరలోనే ఒంటరివాడవవుతావు’ అని సమాజతీరును పట్టిస్తాడు.

1876లో వచ్చిన ‘ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ టామ్‌ సాయర్‌’ ఆయన్ని రచయితగా నిలబెట్టింది. ప్రతి ఇంటి గోడకూ సాయర్‌ రంగులు పూశాడు. ప్రతి ఇంటి పిల్లాడికీ సాయర్‌తో దోస్తీ కుదిరింది. ప్రధానంగా బాలల వినోదం కోసం రాసినదైనా, పెద్దవాళ్లూ దాన్ని చదవడం మానలేదు. ‘పెద్దవాళ్లు తమ చిన్నతనంలో తాము ఎలా ఉండేవారో, తమ ఆలోచనలు ఎలా ఉండేవో, తాము ఎలా మాట్లాడేవారో, చిత్రమైన సన్నివేశాల్లో ఎలా చిక్కుకునేవారో ఆహ్లాదకరంగా వారికి జ్ఞాపకం’ చేసిందా నవల.

శామ్యూల్‌ లాంగ్‌హార్న్‌ క్లెమెన్స్‌గా అమెరికాలో జన్మించిన మార్క్‌ ట్వేన్‌ తన కలంపేరును స్వీకరించిన తీరు కూడా విచిత్రంగా ఉంటుంది. ఆయన స్టీమ్‌బోట్లో కొంతకాలం పనిచేశాడు. నీటిలోతు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, అందులోని సిబ్బంది, గట్టిగా, ‘మార్క్‌ ట్వేన్‌’ అని అరిచేవాళ్లు. మార్క్‌=గురుతు; ట్వేన్‌=రెండు; రెండు బారలు అని చెప్పడం వాళ్ల ఉద్దేశం!

తన పదకొండో ఏట తండ్రిని కోల్పోయిన ట్వేన్‌– ఏడుగురిలో ఒకడిగా పుట్టాడు. వాళ్ల నాన్న దగ్గర ఒక బానిస పనిచేసేవాడు. వాళ్ల చిన్నాన్న దగ్గర ఎక్కువమంది ఉండేవారు. ఆ బానిసలతో ట్వేన్‌ పొలంలో గడిపేవాడు. వాళ్ల ఇళ్లళ్లోకి వెళ్లి కూర్చునేవాడు. వాళ్లు చెప్పే కథల్ని వినేవాడు. ఆ బాల్యమే ఆయన్ని తర్వాత్తర్వాత మహోదాత్తమైన ‘ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ హకల్‌బెరీ ఫిన్‌’ రాయించింది.

ట్వేన్‌ మామూలుగా కుడిచేత్తోనే రాసేవాడు. ఒక దశలో ఆ చేయి నొప్పితో బాధించినప్పుడు ఎడమ చేత్తో కూడా సాధన చేశాడు. ఏ చేత్తో రాసినా హాస్యం చిప్పిల్లేది. అయితే, మార్క్‌ ట్వేన్‌ హాస్యం ఉత్తి నవ్వులాట హాస్యం కాదు. హాస్యం ఎప్పుడూ దుఃఖంలోంచి, ఆ దుఃఖం ఉపశమనం కోసమే పుడుతుంది. ఆయనే అన్నట్టు, ‘నిజమైన హాస్యం కరుణరసానికి దారి తీస్తుంది’.

‘పుస్తకాలు, స్వేచ్ఛ పొందిన మనుషుల ఆత్మలు’ అంటాడు ట్వేన్‌. ఆ పుస్తకాల్లో హాస్యం సాకుగా ఆయన ఎంత లోతైన ఆలోచనలు వెల్లడించాడో ‘ద మిస్టీరియస్‌ స్ట్రేంజర్‌’ (విచిత్రవ్యక్తి)లోని ఈ వాక్యాలు చెబుతాయి: ‘అయితే ప్రతి మనిషికీ ఇన్ని లక్షల గమ్యస్థానాలున్నప్పుడు తనకు ఇష్టమైనది ఎంచుకోవచ్చుగదా అని నువ్వంటావు. కాని అతడు చేరవలసిన గమ్యస్థానం నిర్ణయించేది అతడు కాదు; అతడు జీవితంలో మొట్టమొదట చేసిన పనే దాన్ని నిర్ణయిస్తుంది. ఒకవేళ ఫలానా పని చెయ్యగూడదని అనుకుంటాడనుకో. ఆ అనుకోవడాన్ని నిర్ణయించేది కూడా అతని మొదటి పనే. ఫలానా పని చెయ్యడనుకో. ఆ చెయ్యకపోవడాన్ని నిర్ణయించేది కూడా మొదటి పనే’.

లోతైన, గాఢమైన, ఛిద్రమైన జీవితాన్ని అనుభవించాడాయన. ప్రచురణ సంస్థ పెట్టాడు. మొదట్లో డబ్బులు కళ్లజూసినా అది క్రమంగా ఆయన్ని అప్పులపాలు చేసింది. లెక్చర్లు ఇస్తూ డబ్బులు సంపాదించాడు. వాటికిగానూ ఎన్నో దేశాలు పర్యటించాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉపన్యసించేవాడు కాబట్టి, ఆయన రచనల్ని ప్రచురించడానికి సంస్థలు ముందుకొచ్చేవి కాదు. ఈ నష్టం ఇలావుంటే, కుటుంబనష్టం మరీ కుంగదీసింది!  డిఫ్తీరియాతో రెండేళ్ల కొడుకు లాంగ్డన్‌ చనిపోయాడు. 24 ఏళ్ల వయసులో కూతురు సుసీ స్పైనల్‌ మెనింజైటిస్‌తో మరణించింది. మూర్ఛరోగమున్న కూతురు జీన్‌ 29 ఏళ్ల వయసులో చనిపోయింది. క్లారా ఒక్కతే తల్లిదండ్రులకు చివరిదాకా మిగిలిన బిడ్డ! ‘తన స్వీయ సమ్మతి లేకుండా ఏ మనిషి కూడా సౌకర్యంగా ఉండలేడు’ అనేవాడు ట్వేన్‌. తన సమ్మతి లేకుండా ఏ మనిషైనా బాధ కూడా ఎలా పడగలడు! ట్వేన్‌ కూడా ఈ కష్టాల్ని ఇలాగే దాటాడేమో!

మతగ్రంథాల్ని, ఆధ్యాత్మిక రచనల్ని ఎంతగా చదివినప్పటికీ దేవుడి ఉనికి మీద విశ్వాసంగానీ, అవిశ్వాసంగానీ ప్రకటించని అజ్ఞేయవాదిగానే జీవితాంతం మిగిలిపోయిన ట్వేన్‌... 75 ఏళ్లకు ఒకసారి కనిపించే హేలీ తోకచుక్క కనబడిన 1835(నవంబర్‌ 30)లో జన్మించాడు. తిరిగి మళ్లీ కనబడిన 1910లో తన ఏడుపదుల వయసులో అస్తమించాడు. చావుపుట్టుకల్ని కూడా చమత్కారంతో మేళవించడం ఎలా సాధ్యమైందో ఆయన్ని ఎలా అడగటం!

(సాక్షి ఫన్‌డే; 30 నవంబర్‌ 2014)
––––––––––––––––––––––

Friday, July 3, 2026

ద లాస్ట్‌ నైట్‌ ఆఫ్‌ ద వల్డ్‌


రే బ్య్రాడ్బరీ

రే బ్య్రాడ్బరీ(1920–2012) కథ ‘ద లాస్ట్‌ నైట్‌ ఆఫ్‌ ద వల్డ్‌’ సంక్షిప్త స్వేచ్ఛానువాదం ఇది.  నిజంగానే ఆ యుగాంతం లాంటిది సంభవించనుందని మనుషులకు ముందే తెలిస్తే? ఈ కథ దీన్నే చిత్రిస్తుంది. ఇది మొదటిసారి 1951లో ప్రచురితమైంది. ఈ అమెరికన్‌ రచయిత చాలా చిన్నప్పుడే, తాను ఏదో ఒక కళలోకి ప్రవేశిస్తానని అనుకున్నాడు. పదకొండేళ్ల వయసు నుంచే రాయడం మొదలుపెట్టాడు. ఫాంటసీ, సైన్స్‌ ఫిక్షన్, హారర్‌ లాంటి రకరకాల జాన్రాల్లో గొప్ప కథలు రాశాడు. ఫారిన్‌హీట్‌ 451 ఆయన ప్రసిద్ధ నవల.


తర్వాతి రోజుల్లో ఒక రాత్రి


‘‘ప్రపంచానికి ఇదే చివరి రాత్రి అని తెలిస్తే నువ్వేం చేస్తావు?’’

‘‘నేనేం చేస్తాను; సీరియస్‌గానే అడుగుతున్నావా?’’

‘‘అవును, సీరియస్‌గానే.’’

‘‘నాకు తెలీదు– నేను ఆలోచించలేదు’’. వెండి కాఫీపాత్ర హాండిల్‌ను అతడి వైపు తిప్పి, సాసర్లలో రెండు కప్పులు పెట్టింది. అతడు కొంచెం కాఫీ వంపాడు. వెనక లాంతరు వెలుగులో ఇద్దరు బాలికలు బ్లాక్స్‌ ఆడుతున్నారు. సాయంత్రం గాలి కాఫీ వాసన వేస్తోంది.

‘‘ఇప్పుడు ఆలోచించరాదూ,’’ అన్నాడతను.

‘‘ఏంటి యుద్ధమా?’’ అతడు తలూపాడు.

‘‘హైడ్రోజనో, ఆటంబాంబో కాదుగా.’’

‘‘కాదు.’’

‘‘లేదంటే ఈ బయో వార్‌?’’

కాఫీని నెమ్మదిగా కలుపుతూ, ఆ నల్లటి వలయపు లోతుల్లోకి చూస్తూ, ‘‘అవేమీ కాదు, ఒక పుస్తకం అయిపోవడం అనుకుందాం’’ అన్నాడు.

‘‘నాకేమీ అర్థం కావడం లేదు.’’

‘‘చెప్పాలంటే నాకూ కాలేదు. ఏదో ఒక ఫీలింగ్‌; కొన్నిసార్లు అది భయపెడుతుంది, కొన్నిసార్లు అసలు భయమే వేయకపోగా శాంతిగా ఉంటుంది.’’ అతడు అమ్మాయిల వైపు చూశాడు. దీపం వెలుగులో వారి పసుపు రంగు జుట్టు మెరుస్తోంది. ‘‘నేను నీకు చెప్పలేదుగానీ నాలుగు రాత్రుల క్రితం మొదటిసారి అనిపించింది.’’

‘‘ఏంటి?’’

‘‘నాకో కలొచ్చింది. ఇదంతా ముగిసిపోనుందని ఏదో గొంతు చెబుతోంది, అది నాకు తెలిసిన గొంతయితే కాదు. కానీ ఈ భూమ్మీద అన్నీ ఆగిపోతాయని చెప్పింది. నిద్ర లేచాక దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆ ఫీలింగ్‌ మాత్రం ఆ రోజంతా నాతో ఉండింది. మధ్యాహ్నం కిటికీలోంచి బయటకు చూస్తున్న స్టాన్‌ విల్లీస్‌తో, ‘స్టాన్, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌’ అనగానే, ‘నాకు రాత్రో కల వచ్చింది’ అని అతడు మొదలుపెట్టబోయేంతలోనే, అతడికి వచ్చిన కలేమిటో నాకు తెలిసిపోయింది. నాకూ అలాంటి కలే వచ్చిందని చెబితే అతడేమీ ఆశ్చర్యపోలేదు. విశ్రాంతిగా కనిపించాడు కూడా. ఊరికే అలా నడుచుకుంటూ ఆఫీసంతా కలయదిరిగాం. ప్రతి ఒక్కరూ కిటికీల వైపో, చేతుల వైపో చూస్తున్నారు.’’

‘‘వారందరూ అదే కలగన్నారంటావా?’’

‘‘అందరూ. అదే కల, మార్పే లేకుండా.’’

‘‘మరి ఎప్పుడు ముగుస్తుందంటావు? అంటే, ఈ ప్రపంచం.’’

‘‘రాత్రిలో ఏదో ఒక సమయంలో మనకు, ఎలా రాత్రవుతే అలా మిగతా ప్రపంచానికి. మొత్తం పోవడానికి 24 గంటలు పడుతుంది.’’

కాసేపు వాళ్లు కాఫీని తాకకుండా కూర్చున్నారు. మళ్లీ నెమ్మదిగా చేతుల్లోకి తీసుకుని, ఒకరినొకరు చూసుకుంటూ తాగారు.

‘‘నిజంగా మనకు ఇలా జరగాల్సిన వాళ్లమా?’’ అడిగిందామె.

‘‘జరగాల్సిన వాళ్లమా, కాదా అనికాదు. ఏదో తేడా జరిగిందంతే. కానీ నువ్వు దీని గురించి ఏమీ వాదించలేదు, ఏం?’’

‘‘దానికో కారణం ఉంది. చెప్పాలనిపించలేదు గానీ రాత్రే ఆ కల నాకూ వచ్చింది. మన వీధిలో ఉన్న ఆడవాళ్లు కూడా అదే మాట్లాడుకుంటున్నారు.’’ సాయంత్రం దినపత్రికను అతడి వైపు పెడుతూ, ‘‘కానీ ఇందులో దీని గురించి వార్తే లేదు’’ అంది.

‘‘అందరికీ తెలిసిపోయిం తర్వాత ఇంకెందుకు?’’ అతడు పత్రికను తీసుకుని, విరామంగా కుర్చీలో కూర్చుని, చిన్నారుల వంకోసారి చూశాడు. ‘‘నువ్వు భయపడ్డావా?’’

‘‘ఊహు. పిల్లల కోసం కూడా భయపడలేదు. చచ్చేంత భయమవుతుందని అనుకున్నాను గానీ కాలేదు.’’

‘‘మనుషులు తమను తాము కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారని శాస్త్రవేత్తలు తెగ మాట్లాడుతుంటారే.’’

‘‘జరుగుతుందంతా తార్కికంగానే ఉందనుకున్నప్పుడు నువ్వు అంత ఉద్వేగపడవు. మనం బతికిన విధానానికి ఇంకోలా జరిగే వీలే లేదు.’’

‘‘మనం అంత చెడుగా ఏమీ ప్రవర్తించలేదు, అవునా?’’

‘‘లేదు, అలాగని గొప్ప మంచిగా కూడా లేము. నేననుకోవడం అదే సమస్య. ప్రపంచం ఎన్నో రకాల ఘోరాల్లో మునిగివున్నప్పుడు, మన గురించి తప్ప మనం ఇంక దేనిగురించీ పెద్ద పట్టించుకోలేదు.’’

అమ్మాయిలు చేతులు ఊపుతూ బ్లాక్స్‌ కింద పడగొట్టి నవ్వుతున్నారు.

‘‘ఇట్లాంటి సమయాల్లో జనమంతా వీధుల్లో అరుస్తూ ఉంటారనుకున్నాను.’’

‘‘వాస్తవమైన విషయానికి ఎవరూ అరవరు.’’

‘‘నిన్నూ పాపలనూ మిస్సవుతానని తప్పిస్తే నాకేం బాధలేదు. ఈ సిటీ, ఆటోలు, ఫ్యాక్టరీలు, నా పని– ఇవేమీ ఎట్లాగూ నాకు నచ్చలేదు. నా కుటుంబమూ, వాతావరణంలో జరిగే మార్పులూ, ఎండలో వచ్చినప్పుడు గ్లాసెడు చల్లటి నీళ్లూ, నిద్ర అనే విలాసమూ, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కోల్పోతాను. ఇట్లా కూర్చుని మనం ఎట్లా మాట్లాడుకోగలం చెప్పు?’’

‘‘ఎట్లాగూ ఇంకేం చేయలేకా?’’

‘‘అట్లాగే అనుకో, ఒకవేళ ఉంటే అవే చేసేవాళ్లం. మనుషులు ప్రతి ఒక్కరికీ చివరి రాత్రి ఏమేం చేయబోతున్నారో తెలియడం నేననుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి.’’

‘‘ఈ సాయంత్రం, ఈ కొన్ని గంటలు మనుషులంతా ఏం చేస్తుంటారో కదా!’’

‘‘ఏదో షోకు వెళ్లడం, రేడియో వినడం, టీవీ చూడటం, పేకాడటం, పిల్లల్ని నిద్రపుచ్చడం, వాళ్లు  నిద్రపోవడం, ఎప్పటిలాగే.’’

‘‘ఎప్పటిలాగే మనం ఎంతోకొంత గర్వపడే విషయాలు.’’

‘‘మనం అంత చెడ్డవాళ్లమేం కాదు.’’

వాళ్లు అలా క్షణం ఉన్నాక, అతడు మరింత కాఫీ పోశాడు. ‘‘ఈరోజే అని ఎందుకు అనుకుంటున్నావు?’’

‘‘ఎందుకంటే’’

‘‘గత శతాబ్దిలోని ఓ పదేళ్ల కిందటి రాత్రో, ఓ ఐదో పదో వందల ఏళ్ల కిందో ఎందుక్కాదని?’’

‘‘ఎందుకంటే, చరిత్రలో ఇంతకుముందెన్నడూ 1951 ఫిబ్రవరి 30 అనే తేదీ లేదు గనక, ఇప్పుడు మాత్రమే ఉంది గనక, ఏ తేదీకీ లేని ప్రాముఖ్యత ఈ తేదీకి మాత్రమే ఉన్నది గనుక, 

ఈ సంవత్సరం మాత్రమే పరిస్థితులు ప్రపంచమంతటా ఎలా ఉండాలో అలా ఉన్నాయి గనక, అందుకే ఇది అంతం.’’

‘‘మహాసముద్రం మీద ఇరువైపులా ఈరాత్రి ప్రయాణిస్తున్న బాంబర్స్‌ ఇంకెప్పటికీ భూమిని చూడలేవు.’’

‘‘కారణాల్లో అది కూడా ఒక భాగం.’’

‘‘సరే అయితే, తర్వాతేంటి? గిన్నెలు తోమడమా?’’ అన్నాడతను.

గిన్నెలను ఇద్దరూ చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి, అంతే నీటుగా వాటిని ఎక్కడివక్కడ సర్దారు.

ఎనిమిదిన్నరకు అమ్మాయిలను మంచం మీద నిద్రపుచ్చి, వారికి గుడ్‌నైట్‌ ముద్దిచ్చి, మంచాల పక్కన ఉన్న చిన్న లైట్లను మాత్రం వేసి, గది తలుపును కొద్దిగా తెరిచివుండేట్టుగా దగ్గరకు వేశారు.

‘‘నాకు అర్థం కావట్లేదు,’’ అన్నాడు భర్త, గదిలోంచి బయటికి వస్తూ, ఓసారి మళ్లీ వెనక్కి చూసి, తన పైపును అలాగే కాసేపు పట్టుకుని నిలబడి.

‘‘ఏంటి?’’

‘‘తలుపులు మొత్తం వేసేద్దామా, లేక వాళ్లు దేనికైనా పిలిస్తే వినబడేట్టు కొంచెం తెరిచివుంచుదామా?’’

‘‘నేనైతే పిల్లలకు తెలుసనుకోవట్లేదు, వాళ్లతో ఎవరూ ఏమీ చెప్పివుండరు.’’

‘‘అంతేలే. లేదంటే వాళ్లు మనల్ని అడిగివుండేవారుగా.’’

వాళ్లు కూర్చుని కాసేపు న్యూస్‌ పేపర్‌ చదివారు, కాసేపు రేడియోలో సంగీతం విన్నారు. తర్వాత ఇద్దరూ కట్టెబొగ్గుల్ని చూస్తూ పొయ్యి దగ్గర కూర్చున్నారు. గడియారం పదిన్నర, పదకొండు, పదకొండున్నర కొట్టింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ సాయంత్రాన్ని తమకే సొంతమైన రీతిలో గడిపివుంటారని వాళ్లు తలపోశారు.

అతడు భార్యను దగ్గరకు తీసుకుని చాలాసేపు ముద్దాడాడు.

‘‘మనం అయితే ఒకరికొకరం బానేవున్నాం.’’

‘‘నీకు ఏడవాలనిపిస్తోందా?’’ అడిగాడు అతను.

‘‘అట్లేం లేదు.’’

వాళ్లు ఇంట్లోకి వెళ్లి, తలుపులు వేసి, లైట్లన్నీ ఆర్పి, పడకగదిలోకి వెళ్లారు.

‘‘నేను అలిసిపోయాను.’’

‘‘ఇద్దరం అలిసిపోయాం.’’

ఇద్దరూ మంచంలోకి ఎక్కి అట్లా ఒరిగారు. ‘‘ఇప్పుడే వస్తా,’’ అంటూ ఆమె లేచింది.

ఆమె ఇంటివెనగ్గా వెళ్లడమూ, తరుపు తెరుచుకోవడమూ అతడికి వినబడింది. క్షణంలో ఆమె తిరిగొచ్చింది. ‘‘కిచెన్లో నల్లా మరిచిపోయినట్టు ఉన్నాను, ఆపేసి వచ్చాను,’’ అంది.

అదెందుకో తమాషాగా కనబడి అతడికి నవ్వొచ్చింది.

ఆమెక్కూడా తను చేసిన పని చిత్రంగా అనిపించి, ఆ నవ్వుతో జత కలిపింది.

కాసేపటికి ఇద్దరూ నవ్వడం ఆపేసి, తలలు దగ్గరగా జరిపి, ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని, విశ్రాంతిగా పడుకున్నారు.

కాసేపటికి, ‘‘గుడ్‌ నైట్‌’’ అన్నాడతను.

ఆమె ‘‘గుడ్‌ నైట్‌’’ అని, దానికి మృదువుగా ‘‘డియర్‌’’ అని చేర్చింది.


(సాక్షి సాహిత్యం; 13 ఏప్రిల్‌ 2020)


Tuesday, June 30, 2026

ద లిటిల్‌ మాచ్‌స్టిక్‌ గర్ల్‌


హాన్స్‌ క్రిస్టియన్‌ యాండెర్సెన్‌

హాన్స్‌ క్రిస్టియన్‌ యాండెర్సెన్‌ (1805–75) రాసిన ‘ద లిటిల్‌ మాచ్‌స్టిక్‌ గర్ల్‌’ కథకు ఇది అనువాదం. రచనాకాలం: 1845. మనుషుల్లో ఉండవలసిన కరుణను ప్రధాన వస్తువుగా చేసుకున్న ఈ ఫెయిర్‌ టేల్‌ ప్రపంచవ్యాప్తంగా ఎందరో కళాకారులను ఇప్పటికీ ఆకర్షిస్తూనేవుంది; ఎన్నోసార్లు వివిధ రూపాల్లో తెరకెక్కుతూనేవుంది. అదే కారణంగా ఎన్నో క్రిస్‌మస్‌ కథా సంకలనాల్లోనూ చోటు చేసుకుంది. డెన్మార్క్‌కు చెందిన యాండెర్సెన్‌ కవి, నవలాకారుడు, నాటక రచయిత అయినప్పటికీ ఆయన పేరు ఫెయిర్‌ టేల్స్‌తోనే ముడిపడిపోయింది. మూడు వేలకుపైనే ఇలాంటివి రాశాడంటారు. పిల్లలకోసం ఉద్దేశించినా పెద్దలూ చదివారు. పాశ్చాత్య ప్రపంచపు ఉమ్మడి చైతన్యాన్ని రూపొందించిన కథలుగా వీటిని పరిగణిస్తారు. అందువల్లేనేమో ఎన్నో దేశాల్లో ఆయన విగ్రహాలు కనబడతాయి. 


వెలుగులనమ్మే చిన్నారి


––––––––

సంవత్సరం చివరి రోజున జరిగే కథ.

సంవత్సరంలో ఏరోజూ జరగకూడని కథ.

––––––––––


చలి మరీ తీవ్రంగా ఉంది; మంచు కురిసింది; చీకటి కూడా పడుతోంది. అది సాయంత్రం, ఆ సంవత్సరపు చివరి సాయంత్రం. ఇట్లాంటి చలిలో, చీకటిలో ఒక పేద బాలిక నడుస్తూవుంది;  తలకు కట్టయినా, కాళ్లకు చెప్పులయినా లేకుండా. ఇల్లు వదిలినప్పుడు ఆమె కాళ్లకు చెప్పులున్న మాట వాస్తవం; కానీ ఏం లాభం? అవి ఆమె కాళ్లకు చాలా పెద్దవైనాయి; అంతకుముందు వాళ్లమ్మ వేసుకున్నవాయె. పోనీ అవైనా ఉన్నాయనుకుంటే, ఆ వీధిలోంచి భయంకరమైన వేగంతో వెళ్లిన రెండు గుర్రపుబళ్లకు భయపడి పరుగెత్తడంలో అవెక్కడో జారిపోయినై.

ఒక చెప్పు ఎక్కడా కనబడనేలేదు; కనబడిన రెండోదాన్ని ఎవరో పేద తుంటరి పిల్లాడు ఎత్తుకొని పరుగెత్తాడు; వాడికి ఎప్పటికైనా పిల్లలు పుడితే కొనవలసిన ఊయలకు పెట్టుబడిగా పనికి వస్తుందనేమో. ఇంక ఈ చిన్నారి తల్లి తన చిన్న కాళ్లతోనే నడుచుకుంటూ పోయింది. చలికి ఆమె ఎర్రటి పాదాలు నీలంరంగులోకి మారుతున్నాయి. ఆమె వేసుకున్న పాత ఏప్రానులో కొన్ని అగ్గిపుల్లలున్నాయి; ఇంకో కట్టేమో ఆమె చేతిలో ఉంది. పొద్దుటినుంచీ అందులోంచి ఒక్కటైనా ఎవరూ కొనలేదు, ఒక్క ‘ఫార్తింగ్‌’ అయినా ఇవ్వలేదు.

పాపం ఆ చిన్నారి అట్లానే ఆ చలికి వణుకుతూ, ఆకలికి మాడుతూ, కాళ్లను ఈడ్చుకుంటూ పోయింది. ఎంత హృదయ విదారక దృశ్యం!

ఆమె మెడచుట్టూ అందంగా జాలువారిన ఆమె పొడవాటి జుట్టు మంచు ముద్దలతో నిండిపోయింది. కానీ ఆమె దానిగురించి ఒక్కసారైనా ఆలోచించలేదు. అన్ని కిటికీల్లోనూ కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, రుచికరమైన బాతు మాంసం వాసన వేస్తోంది. అది కొత్త సంవత్సరపు వేడుక. దీని గురించైతే ఆమె ఆలోచించకుండా ఉండలేకపోయింది.

రెండు ఇళ్ల మధ్య ఏర్పడిన మూలలో– అందులోంచి ఒక ఇల్లు కొంచెం ఎక్కువ పొడుచుకు వచ్చినట్టుగా ముందుకు వచ్చింది– ఆ చిన్నారి చేతులు ముడుచుకుని కూర్చుంది; తన కాళ్లను మరింత, మరింత దగ్గరకు లాక్కుంది; అయినా చలికి ఇంకా, ఇంకా వణుకుతూనేవుంది. అయినప్పటికీ ఇంటికి తిరిగివెళ్లడానికి ధైర్యం చాల్లేదు; ఒక్క అగ్గిపుల్లయినా అమ్మలేదాయె, చేతిలోకి ఒక్క ఫార్తింగ్‌ అయినా రాలేదాయె, ఇంటికి వెళ్తే నాన్న నుంచి దెబ్బలు తప్పవాయె. పోనీ ఇంటికి వెళ్లినా అక్కడా చలి తప్పదాయె; ఇంటికి పైకప్పు తప్ప ఏమీలేదాయె. పెద్ద పెద్ద పర్రెలను గడ్డితోనూ పాతబట్టలతోనూ కప్పినప్పటికీ గాలి ఇంకా ఈల వేస్తూనేవుంటుంది.

ఆమె చిన్న చేతులు చలికి దాదాపుగా మొద్దుబారిపోయినై. అయ్యో! కట్టలోని ఒక్క అగ్గిపుల్ల వెలిగించగలిగినా ఆమెకు కొంత ఉపశమనమైనా దొరుకునే! ఆ కట్టలోంచి తీయడానికి ధైర్యం చేసి, దాన్ని ఆ గోడకు గీకి, ఆ మంటకు తన వేళ్లను కాపుకోగలిగితే బాగుండు! ఆ, ఆమె ఒకటి బయటికి తీసింది. ‘సుర్‌ర్‌!’ ఎలా వెలిగింది, ఎలా మండింది! కొవ్వొత్తిలాగా వెచ్చటి, ప్రకాశవంతమైన మంట. దాని మీద ఆమె వేళ్లను ఉంచింది. ఎంత బాగుంది! మెరుగుపెట్టిన ఇత్తడి కాళ్లతో ఉండే ఒక పెద్ద ఇనుప పొయ్యి ముందు కూర్చున్నట్టుగా అనిపించింది. ఎంత అందమైన మంట! చిన్నారి తన పాదాలను కూడా ఆ వేడి తగిలేట్టుగా చాపింది; కానీ ఇంతలోనే ఆ బుల్లి మంట ఆరిపోయింది; పొయ్యి మాయమైంది. ఆమె చేతిలో కాలిపోయిన పుల్ల తప్ప ఇంకేమీ లేదు.

మరొక్కదాన్ని గోడకు వ్యతిరేకంగా గీకింది; ప్రకాశంగా అది మండింది; గోడ మీద ఎక్కడైతే వెలుతురు పడిందో ఉన్నట్టుండి అది పారదర్శకమైన తెరలా మారిపోయింది; లోపల గది అంతా ఆమెకు కనబడుతోంది. టేబుల్‌ మీద మంచులాంటి తెల్లటి బట్ట పరిచివుంది; దానిమీద అందమైన పింగాణీ పాత్రలు అమర్చివున్నాయి; యాపిల్‌ ముక్కలు, ఎండు రేగుపళ్లతో గొప్పగా గార్నిష్‌ చేసిన కాల్చిన బాతులోంచి ఉడుకు పొగలు వస్తున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం, ఛాతీకి కత్తి, ఫోర్కులను గుచ్చివున్న ఆ బాతు ఆ పాత్రలోంచి గెంతి, నేరుగా ఆ చిన్నారి దగ్గరకే నడుచుకుంటూ వచ్చేలోగా ఆ అగ్గిపుల్ల ఆరిపోయింది; మందపు, చల్లటి, తడిసిన గోడ తప్ప అక్కడ ఇంకేమీ లేదు. ఆమె ఇంకోటి వెలిగించింది. ఇప్పుడు ఆమె ఒక బ్రహ్మాండమైన క్రిస్‌మస్‌ ట్రీ కింద కూర్చునివుంది; గాజు తలుపులోంచి ధనిక వ్యాపారి ఇంట్లో తను చూసినదానికన్నా పెద్దది; అంతకంటే దివ్యమైన అలంకరణ చేసినది!

దాని ఆకుపచ్చ కొమ్మల మీద వేలాది దివ్వెలు వెలుగుతున్నాయి, గొప్ప రంగుల బొమ్మలు మెరుస్తున్నాయి, దుకాణాల్లో చూసి ఎప్పటికీ కొనలేనని తను అనుకున్నలాంటివి. వాటిని అందుకోవడానికి చేతులు సాచేలోగా అగ్గిపుల్ల ఆరిపోయింది. క్రిస్‌మస్‌ ట్రీలోని దివ్వెలు పైకి, ఇంకా పైకి లేచాయి; అవిప్పుడు స్వర్గంలోని నక్షత్రాల్లా ఆమెకు కనబడుతున్నాయి; అందులోంచి ఒక తార రాలిపోయింది, ఒక పెద్ద మంటతో.

‘‘ఇప్పుడే ఎవరో చనిపోయారు!’’ అని చెప్పింది, వాళ్ల నానమ్మతో. ఆమెను ముద్దుచేసిన ఏకైక వ్యక్తి ఇప్పుడు లేని ఈ నానమ్మ. ఒక తార రాలిందంటే ఒక ఆత్మ దేవుడి దగ్గరకు చేరుకున్నట్టని చెప్పిందావిడ.

ఆ గోడకు మరో అగ్గిపుల్ల వెలిగింది; మళ్లీ దివ్యమైన వెలుగు; అందులో ముసలి నానమ్మ నిలుచునివుంది, ఒళ్లంతా కాంతులీనుతూ, ముఖం నిండా శాంతితో, ప్రేమతో.

‘‘నానమ్మా!’’ అని కేకేసింది పాప. ‘‘నీతో నన్ను తీసుకెళ్లు. అగ్గిపుల్ల ఆరిపోగానే నువ్వు వెళ్లిపోతావు, మాయమైపోతావు– వెచ్చటి పొయ్యిలా, రుచికరమైన బాతులా, బ్రహ్మాండమైన క్రిస్‌మస్‌ ట్రీలా నువ్వు కనబడకుండా పోతావు!’’ వెంటనే తన దగ్గరున్న మొత్తం అగ్గిపుల్లల్ని ఆ గోడకు గీకి వెలిగించింది, నాన్నమ్మను తన దగ్గరే ఉంచుకోవాలన్న కృత నిశ్చయంతో. ఆ అగ్గిపుల్లలు ఎంత గొప్పగా వెలిగినాయంటే పట్టపగలు కాంతి కూడా వాటిముందు వెలవెలబోతుంది. అంతకుముందెప్పుడు నాన్నమ్మ అంత పొడుగ్గా, అంత అందంగా కనబడలేదు. ఆమె ఆ చిన్నారి బాలికను తన చేతిలోకి తీసుకుంది; ఆ వెలుగులో, ఆ సంతోషంలో ఇరువురూ పైకి, ఎంతో ఎత్తుకి ఎగిరిపోయారు. ఇంక అక్కడ చలి లేదు, ఆకలి లేదు, వేదన లేదు– వాళ్లు దేవుడితో ఉన్నారు.

కానీ ఆ మూలకు, ఆ సాయంత్రపు చలి వేళలో, గోడకు ఆనుకుని కూర్చున్న ఆ గులాబీ చెక్కిళ్ల నవ్వు ముఖపు చిన్నారి పాప మంచుకు గడ్డ కట్టుకుపోయింది, ఆ ఏడాది చివరి రోజున. బొమ్మలా, కదలకుండా తన అగ్గిపుల్లలతో కూర్చుంది ఆ చిన్నారి; ఆ అగ్గిపుల్లల్లో ఒక కట్ట కాలిపోయివుంది. ‘‘తనను తాను వెచ్చగా కాపుకోవాలనుకుంది పాపం,’’ అన్నారు జనం. కానీ ఏ ఒక్కరికైనా ఇంత కూడా అనిపించలేదు, కలలో కూడా వాళ్లు తలిచివుండరు; ఎంత అందమైన వాటిని తను చూసివుంటుంది! ఎంత తేజస్సుతో ఆమె తన నానమ్మతో కలిసి కొత్త సంవత్సరపు సంరంభంలోకి అడుగిడివుంటుంది!


(30 డిసెంబర్‌ 2019)


Saturday, June 27, 2026

లేదు క్షమాపణ


ఓర్కెనీ ఇస్త్వాన్‌

ఓర్కెనీ ఇస్త్వాన్‌ కథ ‘నో పాడన్‌’ కథకు ఇది అనువాదం. పొడి స్వరంలో చెప్పబడిన, మన హాస్పిటళ్లలో జరిగినట్టు అనిపించే హంగరీ కథ. ఓర్కెనీ(1912–1979) ఇరవయ్యో శతాబ్దపు ప్రసిద్ధ హంగరీ కథా, నాటక రచయిత. ఒక చిన్న సందర్భంలోంచే గొప్ప సత్యాలను వెలికితీసే రచయితగా పేరొందారు. ‘వన్‌ మినట్‌ స్టోరీస్‌’ పేరుతో తన కథలు ప్రచురించారు. తొలినాళ్లలో వీర కమ్యూనిస్టుగా ఉండి, అటుపై తప్పుదోవ పట్టానని బహిరంగంగా ఒప్పుకున్నారు. ద తోథ్‌ ఫ్యామిలీ, ద క్యాట్స్‌ ప్లే ఆయన పేరొందిన నాటకాలు.


లేదు క్షమాపణ


ఆయన్ని స్ట్రెచర్‌ మీద కిందికి మెట్లగుండా ఆంబులెన్స్‌ కారు దాకా మోసుకెళ్లిన ఇద్దరు మగ నర్సులకు ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చాను. క్లినిక్‌ దగ్గర కూడా వార్డుల్లో పగలు, రాత్రి షిఫ్టుల్లో ఉన్న నర్సులిద్దరికీ చెరో ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చి, ఆయన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పాను. పేషెంట్‌ను అరగంటకోసారి వచ్చి చూసుకుంటామని వాళ్లు నాకు భరోసా ఇచ్చారు, అదృష్టవశాత్తూ ఆయన ఇంకా స్పృహలోనే ఉన్నప్పటికీ. తరువాయి రోజు ఆదివారం, నేను ఆయన్ని వెళ్లి చూసే వీలుండే రోజు. ఆయన స్పృహలోనే ఉన్నారు, కానీ తక్కువ మాట్లాడారు. ఆయన పక్క మంచం మీద ఉన్న ఇంకో పేషెంటు వల్ల తెలిసిందేమంటే– ఆ ఇద్దరు నర్సులు ఒక్కసారైనా వచ్చి చూసిన పాపాన పోలేదు; అదేమంత ఆశ్చర్యం కలిగించలేదు, వాళ్లు కనీసం నూటాడెబ్బై మందిని చూసుకోవాలి; కనీసం డాక్టర్లన్నా వచ్చి ఆయన్ని పరీక్షేమీ చేయలేదు, అన్నిరకాలుగా సోమవారం చెకప్‌ చేస్తామని చెప్పి. శనివారం పొద్దున తెచ్చినవాళ్ల పరిస్థితి ఎప్పుడూ ఇంతేనని చెప్పాడు ఆ పక్క బెడ్డాయన.

నర్సు కోసం నేను నడవలోకి వెళ్లాను, అంతుకుముందు రోజు వాళ్లెవరూ కనబడలేదు. చాలాసేపు గాలించాక ఆదివారం డ్యూటీలో ఉన్న నర్సును కనిపెట్టగలిగాను; ఆమెకు కూడా ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చి కొంచెం మా నాన్నను కనిపెట్టుకుని ఉండమన్నాను. నాకు డాక్టర్‌తో కూడా మాట్లాడాలనుంది, దానికోసం ఇంటి దగ్గర ఎన్వెలప్‌లో ఓ వంద ఫోరింట్‌ నోటు పెట్టుకునొచ్చాను, కానీ డాక్టర్‌ మహిళల వార్డుకు వెళ్లాల్సివచ్చిందనీ, అక్కడ ఒకరికి రక్తం ఎక్కిస్తున్నారనీ, మీకేం టెన్షన్‌ లేదు, నేను ఆయనతో మాట్లాడుతాననీ చెప్పిందామె. నేను మళ్లీ పేషెంట్ల రూమ్‌కు వెళ్లాను, అక్కడ మా నాన్న పక్కబెడ్డాయన పేషెంట్లను చూడ్డానికి డాక్టరుకు ఎటూ టైముండదని కచ్చితంగా చెప్పడంతో ఆయనకు ఇక డబ్బులు ఇచ్చే వీలు లేనట్టయింది. రేపు వార్డు డాక్టర్లు వచ్చినప్పుడే మా నాన్నను చూడటానికి టైముంటుంది.

‘‘నీకేమైనా కావాలా?’’ మా నాన్నను అడిగాను.

‘‘ఏంవొద్దు, థాంక్స్‌.’’

‘‘కొన్ని ఆపిల్స్‌ తెచ్చాను.’’

‘‘థాంక్యూ, నాకేం ఆకలిగా లేదు.’’

మంచం పక్కనే ఇంకో గంటసేపు కూర్చున్నాను. నాకు ఇంకా ఏమైనా మాట్లాడాలని వుందిగానీ మాట్లాడుకునే అంశాలేమీ దొరకలేదు. కొద్దిసేపయ్యాక, ఏమైనా నొప్పిగా ఉందా అని అడిగాను, లేదని చెప్పాడు, ఇంక దాని గురించి మరిన్ని ప్రశ్నలు వేసే వీలులేకపోయింది. నిశ్శబ్దంగా ఉండిపోయాం. మేమిద్దరమూ ఎప్పుడూ పెద్ద కలుపుగోలుగా మాట్లాడుకున్నది లేదు, మాట్లాడుకున్నవి ఏమైనా ఉన్నాయీ అంటే అవి జరుగుతున్న సంగతుల గురించే, నిన్న ఉనికిలోకి వచ్చి ఇవ్వాళ ప్రాధాన్యత కోల్పోయి శూన్యంలోకి క్షయించిపోయేవి. ఉద్వేగాల గురించి మేము ఎప్పుడూ సంభాషించుకోలేదు.

‘‘అయితే మరి నేను బయల్దేరుతా,’’ కాసేపయ్యాక అన్నాను.

‘‘సరే.’’

‘‘రేపొచ్చి డాక్టరును కలుస్తాను.’’

‘‘అలాగే.’’

‘‘వార్డు డాక్టరు రేప్పొద్దటికంటే ముందేమీ రాడు.’’

‘‘అంత అర్జెంటేం లేదు,’’ అన్నాడాయన, తన చూపుతో నన్ను తలుపుదాకా అనుసరిస్తూ.

తెల్లారి ఉదయం ఏడింటికి వాళ్లు ఫోన్‌ చేశారు, రాత్రి ఆయన చనిపోయారని. నేను మళ్లీ 217 నంబరు గదికి వెళ్లేసరికి ఆ బెడ్డులో అప్పటికే ఇంకో పేషెంటును ఉంచారు. మా నాన్న పోయేముందు పెద్ద ఇబ్బందేమీ పడలేదనీ, కొంచెం ఎగశ్వాస మాత్రం తీసుకున్నాడనీ పక్కబెడ్డాయన నిశ్చయంగా చెప్పాడు. కానీ ఎందుకో ఈ మనిషి నిజం చెప్పట్లేదని నాకు అనుమానం కలిగింది, కానీ ఆయన స్థానంలో నేనున్నా అవే మాటల్ని అదేలాగా చెప్పేవాడిని అనిపించింది. ఇంక నేను ఈయన నన్నేమీ మోసం చేయట్లేదనీ, మా నాన్న నిజంగానే ఏ నొప్పీ లేకుండా ప్రశాంతంగా చనిపోయాడనీ నన్ను నేను నమ్మించుకున్నాను.

ఎన్నో లాంఛనాలు పరిష్కారం చేసుకోవాల్సి ఉంది. హాస్పిటల్‌ రిసెప్షన్‌లో నన్నో నర్సు కలిసి (శనివారం డ్యూటీలోగానీ, ఆదివారం డ్యూటీలోగానీ లేని నేను అంతకుముందు చూడని కొత్తావిడ) ఆయన బంగారు వాచీ, ఆయన కళ్లద్దాలు, ఆయన పర్సు, ఆయన సిగరెట్‌ లైటరు, ఆపిల్‌ పళ్ల కాగితపు సంచీ ఇచ్చింది. ఆమెకు ఇరవై ఫోరింట్స్‌ ఇచ్చాను, తరువాయి చేయవలసిన కార్యక్రమం గురించి ఆమె వివరించింది. దాని తర్వాత తోలు టోపీ పెట్టుకున్న ఒకతను వచ్చి బాడీని శుభ్రం చేసి, షేవ్‌ చేసి, బట్టలు వేస్తానన్నాడు. అయితే బాడీ అన్నప్పుడు తన ఉద్దేశం ఏమనిపించిందంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ల గురించీ అని; ఆయన ఇంకా బతికి లేకపోయినప్పటికీ, శుభ్రం చేయలేదూ బట్టలు వేయలేదూ కాబట్టి, అది శవం కూడా పూర్తిగా అప్పటికి అవ్వలేదని.

వంద ఫోరింట్‌ నోట్‌ పెట్టి అతికించిన ఎన్వెలప్‌ ఇంకా నా దగ్గర అలాగే ఉంది, దాన్ని అతనికిచ్చేశాను. దాన్ని అతడు చించి, లోపలికి చూసి, కొట్టినట్టుగా నెత్తిమీదున్న టోపీ తీశాడు, మళ్లీ నా సమక్షంలో ఆ టోపీని పెట్టుకోలేదు. అన్నింటినీ సరిగ్గా చూసుకుంటాననీ, నేను ఒక శుభ్రమైన బట్ట మాత్రం పంపగలిగితే చాలనీ అన్నాడు, నేను కచ్చితంగా తృప్తిపడతానని నమ్మకంగా ఉన్నాడు. నేను మధ్యాహ్నం ఆ బట్ట తెస్తాననీ, దానితోపాటు ఒక ముదురు రంగు సూట్‌ కూడా తెస్తాననీ, కానీ ఇప్పుడు ఆయన్నోసారి చూడాలనుందనీ చెప్పాను.

‘‘ఏంటీ, మీకు బాడీని చూడాలనుందా?’’ నమ్మలేనట్టుగా అడిగాడు.

‘‘అవును,’’ అని చెప్పాను.

‘‘కాని తరువాత చూస్తే మంచిదేమో,’’ అని సూచించాడు.

‘‘నాకు ఇప్పుడే చూడాలనుంది, ఆయన పోయినప్పుడు నేను పక్కన లేకపోయాను,’’ అన్నాను.

అయిష్టంగానే నన్ను మార్చురీకి తీసుకెళ్లాడు, క్లినిక్‌ గార్డెన్‌ మధ్యలో ఉన్న విడి భవనం అది. సెల్లార్‌లో దట్టమైన బల్బు వెలుగుతూ ఉంది. కొన్ని కాంక్రీట్‌ మెట్లు దిగాం, ఆ మెట్లు దిగీ దిగంగానే ఆ కాంక్రీట్‌ ఫ్లోర్‌ మీద వెల్లకిలా పడుకుని ఉన్న మా నాన్న కనిపించాడు. ఆయన మెకాళ్లు పైకెత్తి, కాళ్లు వెడల్పుగా చేసుకుని ఉన్నాడు– సైనికులు యుద్ధంలో చనిపోయినట్టు, పెయింటింగ్స్‌లో వాళ్లను చిత్రించినట్టు. కాకపోతే ఆయనకు బట్టలేవీ లేవు; ఏదో చిన్న దూది ఉండ ఒకటి ఒక ముక్కురంధ్రంలోంచి బయటికి వేలాడుతూ ఉంది. ఇంకొంచెం దూది ఆయన ఎడమ తొడకు అతికించివుంది, కచ్చితంగా చివరి పోటు పొడిచిన స్థానం అయివుండాలి.

‘‘మీరప్పుడే ఏమీ చూళ్లేరు,’’ తోలు టోపీ అతను క్షమించమన్నట్టుగా అన్నాడు. అంత చలిగా ఉన్న సెల్లార్‌లో కూడా అతను ఏమీ వేసుకోకుండా నిలుచున్నాడు. ‘‘కానీ ఆయనకు డ్రెస్‌ చేశాక ఎలా కనబడుతాడో మీరే చూద్దురు.’’

నేను ఏమీ మాట్లాడలేదు.

‘‘ఆయనకు చాలా రోజులుగా ఆరోగ్యం బాగాలేదా?’’ కాసేపయ్యాక అడిగాడు అతను.

‘‘అవును, చాలా రోజులుగా,’’ అని బదులిచ్చాను.

‘‘నాకు ఏం చేయాలో తెలుసు,’’ అన్నాడతను, ‘‘కొద్దిగా జుట్టు క్షవరం చేస్తాను. అది చాలా తేడా చూపెడుతుంది.’’

‘‘నీకు ఎలా అనిపిస్తే అలా,’’ అన్నాను.

‘‘అతడు జుట్టును పక్కకు దువ్వుకునేవాడా?’’

‘‘అవును, అదే.’’

అతడు మాట్లాడటం ఆపేశాడు. నేనూ ఏమీ చెప్పలేదు. మా నాన్న గురించి నేను చెప్పవలసిందిగానీ, చేయవలసిందిగానీ ఇంకేమీ లేకపోయింది. అలాగే నేను డబ్బులు ఇవ్వాల్సినవాళ్లు కూడా ఇంకెవరూ లేరు. ఇక నన్ను నేను దిద్దుకోవడానికి ఏ దారీ లేదు, ఆయనతో పాటు నన్ను కూడా పూడ్చిపెట్టినా.


(సాక్షి సాహిత్యం; 17 ఫిబ్రవరి 2020)



 

Wednesday, June 24, 2026

Solitude as a teacher

 Solitude as a teacher and discipline of silence


By Venerable Gyaltsen Samten


There was a time when life began to draw me away from worldly concerns, and i recognised this shift clearly. It was this inner orientation that led me to choose a monastic life. Within the monastery, i was increasingly drawn to lives of practitioners and yogis, and over time, a strong longing arose to enter a long, solitary retreat.

I was grateful for the guidance of my Guru, because without it the spiritual path could easily become a marketplace. Years unfolded in the mountains of Ladakh, held by deep silence, wind, and vast open sky. Solitude served as a form of training; a teacher in its own right. On the path of awakening, solitude is never accidental. Either one enters it willingly through discernment, or life leads one there through breaking the resistance barrier. I entered with trust.

Even when solitude was chosen, the ego did not surrender easily. Silence revealed its restlessness. In the beginning, the mind searched for movement, affirmation, and reassurance. Old habits of seeking meaning through others surfaced repeatedly. The ego craved distraction, conversation, roles, and recognition. In isolation, it staged quiet rebellions: self-pity, doubt, subtle longing for a different life.

Living alone in the mountains, i learned to watch these movements. The absence of social mirrors made it impossible to sustain an identity. Without audience or approval, the ego weakened. The real practice was staying. Staying with long afternoons of stillness, with boredom, fear, and longing as they rose and fell.

Suffering arises when we resist what is present. As resistance softens, silence reveals its gentleness.

Days became simple: meditation, prayer, walking under an endless sky, studying Dharma, and doing nothing at all. Life stripped itself down to breath, awareness, and the changing light on barren mountains.
Solitude is uncompromising. Over time, it stripped away not only worldly identities, but spiritual ones, too. Even the sense of being ‘a practitioner’ loosened. What remained was presence, unadorned, intimate, and alive.

During this phase, i realised: it’s easy to follow a religion or a belief system that many pursue, because it offers safety net and comfort of belonging. Spiritual awakening, however, is the awakening from all belief systems. These structures and concepts naturally fell away, leaving experience itself as the guide. One is alone yet not separate. The mountains, moon and the starry nights taught me to trust the unfolding of life, unravelling mysteries. I bow to those years of solitude. What might appear as isolation revealed itself as grace. Solitude became my most faithful teacher, opening me to what remains when everything else falls away.

The writer is a Buddhist nun in the Tibetan tradition, formerly known as Barkha Madan

(The Times of India- Speaking Tree- 5th May 2026)

Sunday, June 21, 2026

‘మీరు తెలుగువాడని ఆజన్మాంతం గుర్తు పెట్టుకుంటాను’


సాయి పద్మ



సాయి పద్మ ఎఫ్బీలో షేర్‌ చేసిన ఫొటో

(సాయి పద్మ గారు 2021 సెప్టెంబర్‌ 11న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ ఇది. ఇందులో ఆమె ప్రస్తావించిన సుధామయి గారు ఆజన్మం పబ్లిషర్‌. శ్రీదేవి మురళీధర్‌ వాళ్లు వేసిన ఒక పుస్తకం గురించి అంతకుముందెప్పుడో ఒకసారి సాయి పద్మ నాతో ఫోన్‌లో మాట్లాడారు. అదే పరిచయం. శరీరంతో ఆమె చేస్తున్న పోరాటం గురించి ఎఫ్బీలోనే తెలిసింది. చివరికి 2024 ఏప్రిల్‌ 15న ఆమె వెళ్లిపోయారు. కొన్ని సంభాషణలకు ఎప్పటికీ కొనసాగింపు ఉండదు.)



రాజి రెడ్డి గారూ..
సుధామయి గారు పంపగా ఆజన్మం పుస్తకం నా దగ్గరికి వచ్చి కొన్ని రోజులు అయిందేమో సగం చదివి మళ్లీ నా శరీర పిపీలిక బాధల్లో పడ్డాను. అప్పుడే ఝుంపా లహరి కొత్త పుస్తకం ‘Whereabouts‘ వస్తే మొదలెట్టాను.
అప్పుడు మళ్ళీ ఆజన్మంకి షిఫ్ట్‌ అయి పూర్తి చేశాను. గొప్ప గొప్ప రచయితలు అందరూ ఒకేలా ఆలోచిస్తారు ఏమో.
వాళ్లు మాత్రమే పాడగల ఒక జన్మాంతర స్వరం వినిపిస్తారు అనిపించింది. ఏదో రోజు ఈ రెండిటి మధ్య నేను గమనించిన విషయాలు అన్నీ రాస్తాను.
కానీ, ఆజన్మం రాసిన మీరు తెలుగువాడు అన్న విషయం ఆజన్మాంతం గుర్తు పెట్టుకుంటాను.
మారుతున్న స్థల, కాల, విలువల్లో... మిమ్మల్ని అక్షరాల్లో బ్రతికించుకున్నారు. ధన్యవాదాలు.
జన్మదిన శుభాకాంక్షలు!

అభిమానంతో,
సాయి పద్మ


 

Thursday, June 18, 2026

హైదరాబాద్‌ ‘రియాలిటీ’


రియాలిటీ చెక్‌




వెలమూరి శ్రీరామ్‌



ఫేస్‌బుక్‌ పోస్ట్‌ కింద పెట్టిన ఇద్దరి కామెంట్ల వరకూ క్రాప్‌ చేశాను.




(పద్మజ సూరపరాజు గారు 2024 ఫిబ్రవరి 15న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ ఇది. అయితే దీన్ని ఇప్పుడు షేర్‌ చేయడానికి అసలు కంటే కొసరు కారణం ఎక్కువ కావడం దానికదే విషాదం. ఈ పోస్టు కింద వెలమూరి శ్రీరామ్‌ గారు ఏకవాక్య కామెంట్‌ పెట్టారు. అంతకుముందొకసారి ఆయన ‘రియాలిటీ చెక్‌’  నచ్చిందంటూ ఫోన్‌లో మాట్లాడారు, శివ రాచర్ల గారి ద్వారా. ఆ ఒక్కసారే  ఆయనతో మాట్లాడింది! అప్పుడే ఆయన సీఐ అని తెలిసింది. పోలీసులు ఇంత దగ్గరగా పుస్తకాలు చదువుతారని తెలియడం ఒక ఆశ్చార్యానందం. ప్రకాశం జిల్లా డీఎస్పీ హోదాలో మొన్న 2026 జూన్‌ 11 నాడు ఆయన హఠాన్మరణం చెందారని తెలిసింది. ఆయన్ని ఇక్కడ ఇలా గుర్తుచేసుకుంటున్నాను.)



హైదరాబాద్‌ వదిలి వచ్చాక, స్టూడెంట్‌గా బస్సుల్లో తిరిగే చలాకీతనమూ, తిరగాల్సిన అవసరమూ లేకుండా పోయాక, పిల్లల్నీ సంచుల్నీ సాకు చెప్పి కార్‌లో దిగబడిపోతూ అంతకుముందు తిరిగిన రూట్లలో తిరుగుతుంటే ఏసీ కార్‌లో ఉండాల్సిన సౌఖ్యాన్ని ఏమాత్రమూ తెలియనీయకుండా కమ్మేస్తున్న ‘ఇక్కడ నేను ఇప్పుడు ఏమీ కాను’ అనే టన్నుల కొద్దీ బరువూ, మారిన నగరం రూపురేఖలు వీశెల కొద్దీ కుమ్మరించే పరాయితనమూ... అవి కలిగించే నిస్తేజం! అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.

కానీ, దీన్ని కూడా మరిచిపోయి మనం మరో ఆలోచనలో పడిపోయే  దృశ్యాలు కొన్ని ఉంటాయి దోవలో, అక్కడక్కడా కనిపిస్తూ.

కోఠీ, లక్డీకాపూల్‌ ఫుట్‌పాత్‌ల మీద అట్టలు కట్టిన తలలను తలగడలు చేసుకుని చిరిగిన గుడ్డల మూటల్లా మట్టిలో మట్టిగా కొన్ని మానవాకారాలు పడి ఉన్నట్టు పడుకుని ఉంటాయి.
ఈ వీధుల్లో ఏం అందం వెలిగిపోతోందని, ఏం అంత సంతోషం ఇక్కడ ఇంకా మిగిలిందని, అసలు ఏమి మెరుగైందని ఈ ఊరు కోసం బెంగ?!

ఇంకాస్త అవతల చింతల్‌ బస్తీ, ఖైరతాబాద్‌.
ఆ తర్వాత పంజాగుట్ట కాలనీ. అక్కడ ఏంటో, మొత్తం పాడుబడ్డట్టు, అసలు అంతకుముందు అక్కడ బస్సుల కోసం ఎదురు చూస్తూ జూబ్లీహిల్స్‌లో ఉండే మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిలు రెగ్యులర్‌గా నిల్చుంటూ ఉండేవాళ్ళనే స్మృతులు కూడా మర్చిపోయినట్టు ఉంటుంది శ్రీనగర్‌ కాలనీ, పంజాగుట్ట కాలనీ కలిసే కూడలి.

ఇంకొంచెం ముందుకుపోతే నేల ఈనినట్టు మరీ మధ్యతరగతి సంపాదనా పరులైన ఆడా మగా సంచుల భుజాలతో, ఏడో ఎనిమిదో అవబోతోంది అనే తొందరా భయాల కళ్ళతో, సరిపోయేంతగా స్ట్రీట్‌ లాంప్స్‌ పోగొట్టని చీకట్లో, బలహీనపు వెలుతురులో ఆలస్యం అయిందనే అసహనం నెడుతుంటే అమీర్‌పేట్‌ రోడ్‌ వెడల్పు సగానికి పైగా వచ్చేసి చిందరవందరగా మహా వ్యాకులంగా ఉంటారు.
ఎన్ని బస్‌లైతే సరిపోతాయి! వీళ్ళను వాళ్ళవాళ్ళ ఇళ్ళకు చేర్చటానికి! వచ్చేవన్నీ నిండే వస్తుంటాయి.
ఈ రాత్రి ఇంకా బస్‌ రాదు, ఈ రోడ్‌ వాపు ఇవాళ్టికిక తగ్గదూ అనిపిస్తుంది. ఏ బ్రతుకులు బాగుపడ్డాయి!
క్రితం కంటే విషాదం ఎక్కువే ఉన్నాది.

కానీ వీరంతా రేపు ఇక్కడ ఇలాగే నిల్చోవటానికి ఈ రాత్రి ఇల్లు ఎలాగైనా చేరాలి.
మన నోస్టాల్జియాలు తీసి కట్టకట్టి బస్‌ టైర్ల కింద విసిరేయాల్సిన పరిస్థితి.
నాకు ఏ ఊరూ వద్దు, నగరము వద్దు. అసలు ఏం బావుకుంటున్నామని ఇంకా పట్టుకుని వేలాడాలి ఈ ప్రపంచానికి అనిపించేది.

కానీ పూడూరి రాజిరెడ్డి గారి లాంటి వాళ్ళు ఇటువంటివి చూసినప్పుడు కలిగే వాళ్ళ ఆవేదనకి ఇలా పరుషంగా బదులు చెప్తారు. ఎవరూ బదులు చెప్పే ధైర్యం చేయలేని ప్రశ్నలు వేస్తారు.

వైరాగ్యం వినా వేరే కోరిక ఉండాలా!?

‘ఒకవేళ యుగాంతం నిజంగానే వస్తేనైనా ఈ భూమి మీద ఈ అనివార్య పరాన్నత అంతరిస్తుందా! ప్రళయం తర్వాత ప్రేమను కూడా కోరనక్కరలేని మనుషుల లోకం అవతరిస్తుందా!’

–––

పుస్తకం తెరవగానే కనిపించే పేజీ చదువుతాను ముందు, అది ఒక అధ్యాయానికి చివరి వాక్యం మాత్రం ఉన్న పేజీ అయినా సరే.
ఈ పుస్తకం ఇప్పుడే కుదిరింది తెరవటం.

పొద్దున నుంచీ కింద పెట్టలేదు మూడొంతులు అవవొస్తోంది.
ఈ పుస్తకం మిస్‌ అవకూడదు ఎట్టి వారైనా.
నిదానంగా మళ్ళీ రాయాలి.

తొంగి చూద్దామా ఈ wonder book లోకి....

పద్మజ సూరపరాజు
2024 ఫిబ్రవరి 15