Thursday, June 18, 2026

హైదరాబాద్‌ ‘రియాలిటీ’


రియాలిటీ చెక్‌




వెలమూరి శ్రీరామ్‌



ఫేస్‌బుక్‌ పోస్ట్‌ కింద పెట్టిన ఇద్దరి కామెంట్ల వరకూ క్రాప్‌ చేశాను.




(పద్మజ సూరపరాజు గారు 2024 ఫిబ్రవరి 15న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ ఇది. అయితే దీన్ని ఇప్పుడు షేర్‌ చేయడానికి అసలు కంటే కొసరు కారణం ఎక్కువ కావడం దానికదే విషాదం. ఈ పోస్టు కింద వెలమూరి శ్రీరామ్‌ గారు ఏకవాక్య కామెంట్‌ పెట్టారు. అంతకుముందొకసారి ఆయన ‘రియాలిటీ చెక్‌’  నచ్చిందంటూ ఫోన్‌లో మాట్లాడారు, శివ రాచర్ల గారి ద్వారా. ఆ ఒక్కసారే  ఆయనతో మాట్లాడింది! అప్పుడే ఆయన సీఐ అని తెలిసింది. పోలీసులు ఇంత దగ్గరగా పుస్తకాలు చదువుతారని తెలియడం ఒక ఆశ్చార్యానందం. ప్రకాశం జిల్లా డీఎస్పీ హోదాలో మొన్న 2026 జూన్‌ 11 నాడు ఆయన హఠాన్మరణం చెందారని తెలిసింది. ఆయన్ని ఇక్కడ ఇలా గుర్తుచేసుకుంటున్నాను.)



హైదరాబాద్‌ వదిలి వచ్చాక, స్టూడెంట్‌గా బస్సుల్లో తిరిగే చలాకీతనమూ, తిరగాల్సిన అవసరమూ లేకుండా పోయాక, పిల్లల్నీ సంచుల్నీ సాకు చెప్పి కార్‌లో దిగబడిపోతూ అంతకుముందు తిరిగిన రూట్లలో తిరుగుతుంటే ఏసీ కార్‌లో ఉండాల్సిన సౌఖ్యాన్ని ఏమాత్రమూ తెలియనీయకుండా కమ్మేస్తున్న ‘ఇక్కడ నేను ఇప్పుడు ఏమీ కాను’ అనే టన్నుల కొద్దీ బరువూ, మారిన నగరం రూపురేఖలు వీశెల కొద్దీ కుమ్మరించే పరాయితనమూ... అవి కలిగించే నిస్తేజం! అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.

కానీ, దీన్ని కూడా మరిచిపోయి మనం మరో ఆలోచనలో పడిపోయే  దృశ్యాలు కొన్ని ఉంటాయి దోవలో, అక్కడక్కడా కనిపిస్తూ.

కోఠీ, లక్డీకాపూల్‌ ఫుట్‌పాత్‌ల మీద అట్టలు కట్టిన తలలను తలగడలు చేసుకుని చిరిగిన గుడ్డల మూటల్లా మట్టిలో మట్టిగా కొన్ని మానవాకారాలు పడి ఉన్నట్టు పడుకుని ఉంటాయి.
ఈ వీధుల్లో ఏం అందం వెలిగిపోతోందని, ఏం అంత సంతోషం ఇక్కడ ఇంకా మిగిలిందని, అసలు ఏమి మెరుగైందని ఈ ఊరు కోసం బెంగ?!

ఇంకాస్త అవతల చింతల్‌ బస్తీ, ఖైరతాబాద్‌.
ఆ తర్వాత పంజాగుట్ట కాలనీ. అక్కడ ఏంటో, మొత్తం పాడుబడ్డట్టు, అసలు అంతకుముందు అక్కడ బస్సుల కోసం ఎదురు చూస్తూ జూబ్లీహిల్స్‌లో ఉండే మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిలు రెగ్యులర్‌గా నిల్చుంటూ ఉండేవాళ్ళనే స్మృతులు కూడా మర్చిపోయినట్టు ఉంటుంది శ్రీనగర్‌ కాలనీ, పంజాగుట్ట కాలనీ కలిసే కూడలి.

ఇంకొంచెం ముందుకుపోతే నేల ఈనినట్టు మరీ మధ్యతరగతి సంపాదనా పరులైన ఆడా మగా సంచుల భుజాలతో, ఏడో ఎనిమిదో అవబోతోంది అనే తొందరా భయాల కళ్ళతో, సరిపోయేంతగా స్ట్రీట్‌ లాంప్స్‌ పోగొట్టని చీకట్లో, బలహీనపు వెలుతురులో ఆలస్యం అయిందనే అసహనం నెడుతుంటే అమీర్‌పేట్‌ రోడ్‌ వెడల్పు సగానికి పైగా వచ్చేసి చిందరవందరగా మహా వ్యాకులంగా ఉంటారు.
ఎన్ని బస్‌లైతే సరిపోతాయి! వీళ్ళను వాళ్ళవాళ్ళ ఇళ్ళకు చేర్చటానికి! వచ్చేవన్నీ నిండే వస్తుంటాయి.
ఈ రాత్రి ఇంకా బస్‌ రాదు, ఈ రోడ్‌ వాపు ఇవాళ్టికిక తగ్గదూ అనిపిస్తుంది. ఏ బ్రతుకులు బాగుపడ్డాయి!
క్రితం కంటే విషాదం ఎక్కువే ఉన్నాది.

కానీ వీరంతా రేపు ఇక్కడ ఇలాగే నిల్చోవటానికి ఈ రాత్రి ఇల్లు ఎలాగైనా చేరాలి.
మన నోస్టాల్జియాలు తీసి కట్టకట్టి బస్‌ టైర్ల కింద విసిరేయాల్సిన పరిస్థితి.
నాకు ఏ ఊరూ వద్దు, నగరము వద్దు. అసలు ఏం బావుకుంటున్నామని ఇంకా పట్టుకుని వేలాడాలి ఈ ప్రపంచానికి అనిపించేది.

కానీ పూడూరి రాజిరెడ్డి గారి లాంటి వాళ్ళు ఇటువంటివి చూసినప్పుడు కలిగే వాళ్ళ ఆవేదనకి ఇలా పరుషంగా బదులు చెప్తారు. ఎవరూ బదులు చెప్పే ధైర్యం చేయలేని ప్రశ్నలు వేస్తారు.

వైరాగ్యం వినా వేరే కోరిక ఉండాలా!?

‘ఒకవేళ యుగాంతం నిజంగానే వస్తేనైనా ఈ భూమి మీద ఈ అనివార్య పరాన్నత అంతరిస్తుందా! ప్రళయం తర్వాత ప్రేమను కూడా కోరనక్కరలేని మనుషుల లోకం అవతరిస్తుందా!’

–––

పుస్తకం తెరవగానే కనిపించే పేజీ చదువుతాను ముందు, అది ఒక అధ్యాయానికి చివరి వాక్యం మాత్రం ఉన్న పేజీ అయినా సరే.
ఈ పుస్తకం ఇప్పుడే కుదిరింది తెరవటం.

పొద్దున నుంచీ కింద పెట్టలేదు మూడొంతులు అవవొస్తోంది.
ఈ పుస్తకం మిస్‌ అవకూడదు ఎట్టి వారైనా.
నిదానంగా మళ్ళీ రాయాలి.

తొంగి చూద్దామా ఈ wonder book లోకి....

పద్మజ సూరపరాజు
2024 ఫిబ్రవరి 15


No comments:

Post a Comment