Showing posts with label ప్రసంగాలు. Show all posts
Showing posts with label ప్రసంగాలు. Show all posts

Wednesday, January 1, 2025

నచ్చిన/ప్రభావితం చేసిన పుస్తకం

(హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో నచ్చిన/ప్రభావితం చేసిన పుస్తకం గురించి ఒక పది నిమిషాలు మాట్లాడమని కవిమిత్రుడు ఒద్దిరాజు ప్రవీణ్‌ కాల్‌ చేశారు. రోజూ ఒక ధారావాహికగా చాలామంది రచయితలు పాల్గొన్న కార్యక్రమం అది. నాకు డిసెంబర్‌ 26న వీలు కుదిరింది. వర్షం పడి కార్యక్రమం కొంత ఆగం అయింది. అనుకున్న పది నిమిషాల్లో కూడా కోత పడింది.  ఆలస్యంగానైనా మొత్తానికి బాగానే జరిగింది. అయితే, అందరూ ఏకధారగా మాట్లాడితే నేను సహజంగానే తట్టుకుంటూ మాట్లాడాను. నేను అక్కడ చెప్పాలనుకున్నది ఇక్కడ పోస్టు చేస్తున్నా.)



మా సెషన్‌లో పాల్గొన్న/పాల్గొనాల్సిన వాళ్లు
 


మాట్లాడుతున్నవారు  మోతుకూరి నరహరి.
కూర్చున్నవారు: నెల్లుట్ల రమాదేవి(ముఖం కనబడటం లేదు), ఎస్‌.రఘు, 
పులికొండ సుబ్బాచారి, సంగనభట్ల నర్సయ్య, పూడూరి రాజిరెడ్డి, 
రాయారపు సూర్యప్రకాశరావు, మారోజు దేవేంద్ర
 


మాట్లాడినందుకు ప్రతిఫలం: పోచంపల్లి తువ్వాల
(ఈ ఫొటోలను పరిమి వెంకట సత్యమూర్తి గారు తీసి పంపారు. వారికి ధన్యవాదాలు.)
 
--------------------------------------------------------------- 


నచ్చిన/ప్రభావితం చేసిన పుస్తకం

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌

డిసెంబర్‌ 26; సాయంత్రం 6 గం.

పూడూరి రాజిరెడ్డి


అందరికీ నమస్తే.


ఇది చూస్తుంటే గుళ్లల్లో ప్రవచనం చెప్పడం గుర్తొస్తుంది. ప్రవచనం నడుస్తూనే ఉంటుంది, ఎవరి మానాన వాళ్లు పోతూనే ఉంటారు. కానీ ఆ పోతున్న క్రమంలోనే ఏ ఒక్క మంచి మాటైనా చెవిలో పడకపోతుందా అని ఆశ. బహుశా బుక్‌ ఫెయిర్‌ నిర్వాహకులు కూడా అలాంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటుచేసివుంటారు. అందులో నన్ను కూడా భాగం చేసినందుకు థాంక్యూ.

28 ఏళ్లకు మనిషి ఏర్పడిపోతాడు అంటాడు బుచ్చిబాబు. అంటే ఇంక ఆ తర్వాత మనిషి మారేది పెద్దగా ఉండదు. అందుకే వయసు పెరిగినాకొద్దీ ఆల్రెడీ ఉన్న అభిప్రాయాలను బలపరుచుకోవడానికి పనికొచ్చేవే ఎక్కువ చదువుతాం తప్ప, ఫ్రీగా, ఓపెన్‌గా ఉండి చదవం. మూవ్‌ అవడానికి సిద్ధంగా ఉండే వయసులో చదివేదే చదువు అనుకుంటాను. అందుకే నా డిగ్రీ నుంచి నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త వరకు చదివిందే అసలైన చదువు. డిగ్రీలో రెండు రోజులకొక్కటి చదవాలన్నంత ఆబగా చదివాను. జర్నలిజం వారానికో పుస్తకం కచ్చితంగా చదవాలని నియమం ఉండేది. ఇప్పుడు పుస్తకం మీద అలాంటి పాషన్‌ లేదు. కాబట్టి నాలాంటివాడు ఇప్పుడు పుస్తకం గురించి మాట్లాడటం రాంగ్‌ ఛాయిస్‌. కానీ సోషల్‌ మీడియా మీద విరక్తి కలిగాక మళ్లీ అలాంటి పాషన్‌ వస్తుందని ఆశిస్తున్నా.

నచ్చిన పుస్తకాలు ఉంటాయి. మన వ్యక్తిత్వానికి సరిపడే పుస్తకం మనకు నచ్చుతుంది. ఆ పుస్తకంలో మనకు ఏది నచ్చడానికి కారణం అవుతున్నదో అది మనలోపల ఆల్రెడీ ఉంటుంది. మనం గుర్తించకపోవచ్చు, ఉన్నట్టు తెలియకపోవచ్చు. కానీ ప్రభావితం చేసిన పుస్తకాలు ఉంటాయా? ఉంటే వాటి ప్రభావం నిజంగా ఎంత? దానివల్ల మన జీవితమే మొత్తంగా మారిపోయేంత ప్రభావం ఉంటుందా? మారిపోయింది అని చెప్పనుగానీ, వాటి ఎసెన్స్ నాలోకి ఎంతో కొంత ఇంకిపోయిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఒక్కదాని గురించి మాత్రం ఇక్కడ చెప్తాను.  జపాన్‌ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఓకా తన వ్యవసాయ అనుభవాలతో రాసిన ‘గడ్డి పరకతో విప్లవం’ అది.

గడ్డి పరకతో విప్లవం పుస్తకం జపనీస్‌ నుంచి ఇంగ్లీషులోకి ‘వన్‌ స్ట్రా రివొల్యూషన్‌’గా వచ్చింది. 1990లో దీన్ని తెలుగులో ‘టింబక్టు కలెక్టివ్‌’ వాళ్లు ప్రచురించారు. అనువాదం: సురేశ్, సంపత్‌.

నేను ఏ ఒక్క రచయిత ఫొటోను కూడా ఇంట్లో పెట్టుకోలేదు. కానీ నాకు ఫుకుఓకా ఇష్టం అని తెలిసిన కొందరు మిత్రులు ఇలాంటి ఒక సాహిత్య సమావేశం జరిగినప్పుడు ప్రెజెంట్‌ చేశారు. అది నాకు రోజూ చూసే ముఖం అయిపోయింది. ఇప్పుడు అందరూ సహజ వ్యవసాయం, ఆర్గానిక్‌ ఫుడ్స్, ప్రకతి పరిరక్షణ అని మాట్లాడుతున్నారు. కానీ ఎన్నో ఏళ్ల క్రితమే, రసాయనిక ఎరువులు వేయకుండా, క్రిమి సంహారకాలు ఉపయోగించకుండా, కనీసం నేలను దున్నకుండా వ్యవసాయం చేశాడు ఫుకుఓకా. ఆ తర్వాత నాకు ఇలాంటి వ్యవసాయ పద్ధతులు, ఇలాంటి ప్రకతి ఆహారానికి సంబంధించిన ఆసక్తుల వెనుక ఈ పుస్తకం ఉంది. డక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, ఖాదర్‌వలీ, సుభాష్‌ పాలేకర్, సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్, తాజాగా ఆర్గానిక్‌ మండ్య... ఇట్లాంటివి ఫాలో కావడానికి ఈ పుస్తకం నాలో నింపిన ప్రకృతి స్పృహ కారణం. కనీసం మా ఇంటివరకైనా నేను స్వయంగా చిరుధాన్యాలు, వడ్లు ఒక ఆరేడేళ్లు పండించేంత దూరం కూడా ప్రయాణించాను. అది ఇంకా ముందుకుపోతుందా, ఆగుతుందా, ఇంకా సీరియస్‌గా టేకప్‌ చేస్తానా తెలీదు.

గాంధీజీ దక్షిణాఫ్రికాలో వ్యవసాయం చేసినప్పుడు ఆ వ్యవసాయ క్షేత్రానికి పెట్టిన పేరు ‘టాల్‌స్టాయ్‌ ఫామ్‌’. నేను అంత సీరియస్‌గా వ్యవసాయం చేయకపోయినా కనీసం నా బ్లాగు రాతలకు పెట్టకున్న పేరు ‘ఫుకుఓకా ఫామ్‌’.

అయితే, ఆరోగ్య స్పృహ పెరిగినప్పటి నుంచీ నాకు అనారోగ్యం పెరిగిందనుకోండి! అంటే తిండి అనగానే కలిగే ఎక్సైట్‌మెంట్‌ స్థానంలోకి ఒక సంశయం వచ్చి చేరుతుంది. దేన్నీ మనస్ఫూర్తిగా తిననీయదు. కానీ ఇది పుస్తకం సమస్య కాదు. నా సమస్య. మన సమస్య. ఆహారం మొత్తంగా కలుషితమైపోయిన సామాజిక సమస్య. మళ్లీ దీనికి పరిష్కారం ఫుకుఓకా దగ్గరే, ప్రకృతి వ్యవసాయం దగ్గరే ఉంది.

ఫుకుఓకా కేవలం వ్యవసాయం గురించి మాత్రమే మాట్లాడితే, ఈ పుస్తకం నాకు నచ్చిన పుస్తకం కాకపోయేదేమో! వ్యవసాయం అనేది కేవలం పంటలు పండించడం కాదు, అదొక జీవన సాధన, అదొక ఆధ్యాత్మిక ప్రగతి అంటాడు ఫుకుఓకా. ఈ జనన మరణ చక్రంలో ఇష్టంగా బందీ కావడం గురించి మాట్లాడుతాడు. ఈ ఇష్టంగా బందీ కావడం అనేది ఒక యోగి మాత్రమే చెప్పగలిగే మాట. జీవితం మొత్తాన్నీ అర్థం చేసుకుని, ఒక పూర్ణ మానవుడు తన తుది మాటగా వెల్లడించిన సత్యంలా ఇది నాకు అనిపిస్తుంటుంది. జీవితంలోకి తెచ్చుకోగలిగే నెమ్మదితనం గురించీ, జీవితాన్ని తేలిక చేసుకోవడం గురించీ కూడా ఈ పుస్తకం చెబుతుంది.

జీవితం ఎప్పుడు తేలికవుతుంది? పొరలు ఎప్పుడు విడిపోతాయి? మనం చేసే ఏ పనికీ అర్థం లేదంటాడు ఫుకుఓకా. ‘నా ఉనికి సైతం ఉత్త భ్రమే’ అన్న జ్ఞానోదయం ఫుకుఓకాకు కలిగింది. నా లాంటి సాధారణ మనిషికి అది కలగడం లేదు. అందుకే నేను దీనితో స్ట్రగుల్‌ అవుతున్నాను. 2006లో పుస్తకాన్ని మొదటిసారి చదివినప్పుడు ఏదైతో నచ్చిందో, 2024కు వచ్చేసరికల్లా ఎదురు తిరుగుతోంది. బహుశా పెరుగుతున్న వయసు ఈ జీవితానికి ఒక అర్థాన్ని, చేస్తున్న ప్రతి పనికి ఒక ప్రయోజనాన్ని కోరుకుంటున్నది కావొచ్చు. అలాగని ఈ భావనకు వ్యతిరేకమైనదేదీ నా దగ్గర లేదు. అనంత విశ్వంలో ధూళికణం లాంటి మనిషి జీవితానికి ఏ ఉద్దేశం ఉంది?

టాల్‌స్టాయ్‌ ప్రస్తావన ఇంతకు ముందు వచ్చింది కదా! అన్నా కరేనినా నవలలో లేవిన్‌  చిట్టచివరకు నేను ఇలాగే ఉంటాను, బండి వాడి మీద ఇలాగే అరుస్తాను, అనుకుంటాడు. ఎన్ని చేసినా మనం ఏమీ మారం అనేది కూడా చాలా పెద్ద అవగాహన నా వరకూ. ఇది చాలా పెద్ద బ్యాగేజీని మన మీది నుంచి దింపేస్తుంది. అన్నీ చూసి, అన్నీ తెలుసుకుని, ఒక దగ్గర మన మనసును స్థిరం చేసుకోవడం. అది ఏదో ఒక దగ్గర స్థిరం చేసుకోవడం కాదు. మన వ్యక్తిత్వానికి సరిగ్గా దగ్గరగా, మన అత్యంత సమీపానికి మనం చేరుకోవడం అది. మనం నిజంగా ఏమిటో అర్థం చేసుకోవడం. మనం ఏమిటో తెలుసుకోవడం అనేది చిన్న విషయం కాదని అందరికీ తెలుసనుకుంటున్నా.

ఫుకుఓకాకు బోధపడినట్టుగా నా నిజమైన ప్రకృతి ఏమిటో నేను ఇంకా కనుక్కోవలసే ఉంది. బహుశా దానిక్కూడా మళ్లీ ఆయన పుస్తకమే నాకు దారి చూపుతుందనుకుంటాను. ఎందుకంటే, చదివినప్పుడల్లా నాకు మళ్లీ మళ్లీ ఇంకేదో కొత్త విషయం అది చెబుతూనే ఉన్నది.

 

Thursday, November 7, 2024

ఊరిలో ఒక పుస్తకావిష్కరణ

(మా ఊరి పెద్దాయన యెర్రం మోహన మురళి గారు ‘జీవన తరంగాలు’ పేరుతో తన ఆత్మకథ రాసుకున్నారు. మొన్న దసరాకు ఊరికి వెళ్లినప్పుడు జరిగిన ‘అలాయ్‌ బలాయ్‌’ కార్యక్రమంలో దీని ఆవిష్కరణ జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడింది ఇక్కడ ఇస్తున్నాను.)






ఊరి యువమిత్రుల సమక్షంలో పుస్తకావిష్కరణ. 
నాకు కుడివైపున ఉన్నది యెర్రం మెహన మురళి.
 


యెర్రం మోహన మురళి గారి
‘జీవన తరంగాలు’ మీద
పూడూరి రాజిరెడ్డి

అక్టోబర్‌ 13, 2024
నర్సింగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం


అందరికీ నమస్కారం.
నాతో పాటు వేదికను పంచుకుంటున్న మిత్రులకూ, ముందు కూర్చున్న యువమిత్రులకూ...

కరెంటు మనిషి
నాకు పాములు, కరెంట్‌ అంటే భయం. పాములతో సహవాసం తప్పకపోయినా అనివార్యం కాదు. కానీ కరెంట్‌ అట్లా కాదు. అది మనకు దాదాపుగా రెండో శ్వాస లాంటిది. శ్వాస ఆగిపోతే మనిషి ఎట్లా ఆగిపోతాడో, కరెంట్‌ ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది. మీరు ప్రపంచాన్ని స్తంభింపజేయాలనుకుంటే ఏం చేయనక్కర్లేదు. ఒక్క కరెంట్‌ తీసేస్తే చాలు. కరెంట్‌తో ముడిపడి ఎన్ని వ్యవహారాలున్నాయంటే, మనం ఊహించలేనన్ని. మనకు కరెంట్‌ అంటే మనకు కనబడే ఏ హెల్పరో, లైన్‌మనో అంతవరకే. ఎప్పుడైనా ఫోన్‌  చేస్తే ఎవరు ఎత్తుతారో వాళ్లే. కానీ అసలు మన ఊరిదాకా ఈ లైన్‌  ఎట్లా వచ్చింది, అసలు మన దగ్గర్లో ఒక సబ్‌ స్టేషన్‌ ఎట్లా వచ్చింది, దానికి అవసరమైన ప్లానింగ్‌ ఏంటి, అసలు మొత్తం ఒక వరంగల్, కరీంనగర్‌ జిల్లాలకు ఎట్లా ప్లా¯Œ  చేశారు... ఇవన్నీ జరుగుతున్నాయంటే దాని వెనుక ఎందరో ఇంజినీర్ల కృషి ఉంది. అలాంటి విద్యుత్‌ సంస్థలో డివిజినల్‌ ఇంజినీర్‌ స్థాయిలో రిటైర్‌ అయిన యెర్రం మోహన మురళి గారు మన ఊరివాడు కావడం మనకు గర్వకారణం.

ఇంటిపేరు పంతులు కాదు!
సర్‌ కూడా వాళ్ల నాన్న పోశెట్టి పంతులును తలుచుకుంటూనే ఈ పుస్తకం మొదలుపెట్టారు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు పోశెట్టి పంతులును చూసినుంటి. తెల్లటి బట్టలు, నల్లటి బూట్లు, అవి ఇట్లా ముందుకు వడి తిరిగి ఉండేటివి... వేసుకుని పోతుండే. పంతులోళ్లు, పంతులోళ్ల గిర్నీ అని అందరూ అంటుంటే, వాళ్ల ఇంటిపేరే పంతులు అనుకున్నా. మన ‘రామన్న’ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నప్పుడు ఎర్రం శ్రీమన్నారాయణ అని పేరొస్తే, అయితే వీళ్ల ఎర్రమోల్లా? అనుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక చదువు తాలూకు గౌరవం ఒక ఇంటికి ఎట్లా అంటుకుంటుందీ అని. వాళ్ల నాన్న పంతులుగా ఒక మెట్టు ఎక్కితే మోహన మురళి గారు దాన్ని అందుకుని మరిన్ని మెట్లు ఎక్కారు. మనలాంటి ఊరిలో తొట్టతొలి పెద్దస్థాయి ఉద్యోగి మోహన మురళి గారే! ఇప్పుడాయన కూతురు భవాని గారు కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మన ఊరి వరకూ ఇట్లాంటివన్నీ చాలా పెద్ద చదువులు.

నాలుగైదు విశేషాలున్నాయి:
1. మోహన మురళి గారు తన కెరీర్‌ను డిప్లొమాతో మొదలుపెట్టారు. ఉద్యోగం చేస్తూనే బీటెక్‌ చదివారు, ఎంటెక్‌ చదివారు. ఆ కొత్త పిల్లలతో పోటీ పడి టాప్‌ మార్కులు తెచ్చుకున్నారు. వాళ్లతో ఎంత కలిసిపోయిండంటే– ఈయనకు 20 ఏండ్ల సర్వీస్‌ ఉన్నంక మళ్లీ చదువుకుంటున్నారని శర్మ అని ఒకాయన బయటపెట్టేదాకా... ఏందిరా భయ్‌ అంటే ఏందిరా భయ్‌ అనుకునేదట. సీనియర్‌ అని తెలిసిన తర్వాత సార్, గారు అని మర్యాదలు మొదలయ్యాయి.
2. కెరీర్‌ అటు ఉండంగానే, సంస్కృతంలో ఎంఏ చేశారు. సంస్కృత పుస్తకాలను మూలరూపంలో చదవడానికి ప్రయత్నించారు. వాటి మీద రాసుకున్నారు. ఈ పుస్తకంలో ‘జ్ఞాన సముపార్జన పర్వం’ అని ఒక అధ్యాయం ఉంది. సర్‌కు సరిగ్గా సరిపోయే అధ్యాయం అది.
3. ఇవన్నీ ఉన్నంత మాత్రాన పుస్తకం రాయాలని ఏం లేదు. పుస్తకం రాశారు కాబట్టే, దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం, దాని సందర్భంగా ఇక్కడ కలుసుకున్నాం.
4. ఆయన పుస్తకం రాసినా కూడా– ఆయనెక్కడో ఆయన స్థిరపడిన వరంగల్‌లోనే ఉండిపోయినా మనకు తెలిసేవాళ్లు కాదు. ఆయన తన మూలాలతో టచ్‌లో ఉండటానికి, తన ఊరిలో ఒక్కడిగా ఉండిపోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టే, మనం ఇక్కడ కలవగలిగాం.
5. ఇంకొక విశేషం ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఉంది. అంటే, ఆయన తన జీవితాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా బతకడానికి ప్రయత్నిస్తున్న మనిషి అని మనకు అర్థమవుతుంది.

జీవితాన్ని ప్రేమించే మనిషి
నాకు బాగా నచ్చింది, ఆయన జీవితాన్ని ప్రేమించే మనిషి అని అర్థం కావడం. ఆయన తాలూకు ఎన్నో జ్ఞాపకాలను ఈ పుస్తకంలో ఫొటోల రూపంలో పదిలంగా దాచుకున్నారు. ఆఖరికి వాళ్లమ్మాయి తాలూకు స్నేహితురాళ్లు, వాళ్ల బంధువులను కూడా.
ఆ ప్రేమ ఆయన వరకే పరిమితం కాదు... ఎలక్ట్రికల్‌ ఇంజినీర్స్‌ కాలనీ అని కడదామని దానికోసం అందరూ కలిసి 22.5 ఎకరాల భూమి శాయంపేట ప్రాంతంలో కొని, దానికి అనుమతులు సంపాదించడానికి, దానికి తుదిరూపు ఇవ్వడానికి, అందరికీ ఇక ఇల్లంటూ ఉండాలని అనుకోవడం వల్ల ఒక పద్నాలుగు, పదిహేనేళ్లు దానికోసం తండ్లాడుతూనే ఉన్నారు. సెక్రటేరియర్‌కే ఒక నలభై సార్లు వెళ్లివుంటానని రాశారు.
ఇంకోటేందంటే, ఎప్పుడో ఆయన చిట్టి డబ్బులు ఎత్తితే సరిగ్గా రాలేదని, ఎవరికీ ఆర్థిక ఇబ్బంది ఉండకూడదని దీపియా ఫ్రెండ్స్‌ అసోసియేష¯Œ  అని పెట్టుడానికి కారణమయ్యారు. ఆ పేరు కూడా నాకు బాగా నచ్చింది. దీపాన్ని గుర్తుతెచ్చేలా డిప్లొమా ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ను దీపియా చేయడం– అది 20, 30 ఏండ్లుగా ఇంకా కొనసాగుతున్నదట.

సక్సెస్‌ స్టోరీ
ఈ పుస్తకంలో వాడిన భాష, రాసిన ధోరణి సాహిత్య ప్రమాణాలకు నిలిచేది కాదని చెప్పడానికి పెద్ద కష్టపడనక్కరలేదు. కానీ ప్రతి మనిషికీ ఒక సక్సెస్‌ స్టోరీ ఉంటుందని మోహన మురళి గారి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. సిన్సియారిటీ, హార్డ్‌ వర్క్, కుతూహలం, ఆహారంతో ప్రయోగాలు, ఒకటి వద్దనుకుంటే అట్లా వద్దన్నట్టుగానే ఉండిపోవడం... ఇట్లాంటి గుణాలెన్నో కనబడతాయి. ఇలాంటివాళ్లు మన ఊరి యువతకు ప్రేరణ కావాలి. ఎంతైనా సర్‌ కరెంట్‌ మనిషి కదా, ఆయన వెలుగు అందరిమీద ప్రసరించాలి.

ఈ పుస్తకాన్ని మన ఊరివాళ్ల మధ్య నాతో ఆవిష్కరింపచేయాలని మోహన మురళి గారు అనుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసిన ‘కేవీకేవీ’ యువమిత్రులకు అభినందనలు.  ఊరిలో ఒక సానుకూల వాతావరణం సృష్టించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు,  దానికి జేజేలు.

 

Wednesday, December 27, 2023

ముస్లిం రచయితలకు, మేధావులకు ఒక ప్రశ్న

(ఇటీవల జరిగిన ‘రైటర్స్‌ మీట్‌’ సమావేశంలో ‘ముస్లిం రచయితలకు ఒక ప్రశ్న’ అన్న అంశం మీద నేను మాట్లాడాల్సి ఉండింది. కానీ అది సజావుగా సాగలేదు. అక్కడ మాట్లాడాలనుకున్నది ఇక్కడ పోస్టు చేస్తున్నా.)

ఒక గ్రీకు తత్వవేత్త ఏమంటాడంటే– మనిషికి గనక గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండివుంటే, దేవుడికి కూడా అదే గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండేవి అని! అంటే మనిషి తన రూపంలోనే దేవుడిని సృజించుకున్నాడు. మనుషుల దేవుడు మనిషి రూపంలో ఉంటాడు; చీమలకు కూడా దేవుడు ఉంటే చీమల ఆకారంలో ఉంటాడు కావొచ్చు; ఎవరికి తెలుసు?
మనకు తెలిసినంతలో అన్ని మతాల దేవుళ్లకు, లేదా వాళ్లు భక్తిగా కొలిచేవాళ్లకు ఒక ఆకారం ఉంది. ఒక ఇస్లాంలోనే దేవుడికి రూపం లేదు అనేది ఒక శాసనంలా ఉంది. దేవుడు నిరాకారుడు, సర్వాంతర్యామి అని హిందూమతపు పుస్తకాల్లో కూడా ఉంటుంది. కానీ హిందూమతం అనేది స్థిరపడినది కాదు; పరిణామం చెందుతూనే ఉండేది కాబట్టి, దాన్ని ఇదీ అని వ్యాఖ్యానించడం కష్టం. ప్రస్తుత రూపంలో ఉన్న హిందూమతంలో అయితే దేవుళ్లకు కచ్చితమైన ఆకృతి ఉంది. ఇస్లాంలో మాత్రం విగ్రహారాధన లేదు. ఒక హయ్యర్‌ పవర్‌ను రూపరహితంగా ఆరాధించడం అనేది కూడా నాకు మంచి భావనగానే కనబడుతుంది.
మతం అనేది మన జీవితాల్లో చాలా ప్రధానమైనది అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నామకరణం, వివాహం నుంచి, మన జీవితంలో ఉన్న అన్ని వ్యవహారాలు మతం ఆధారంగానే నడుస్తాయి; ఆఖరికి అంత్యక్రియలతో సహా. మతం లేదా దేవుడితో ముడిపడి మనకు ఇంజనీరింగ్‌ వర్ధిల్లింది. కళలు వర్ధిల్లినై. సాహిత్యం వచ్చింది. ఈస్తటిక్‌ సెన్స్‌ వృద్ధి అయింది. మతంతో ముడిపడిన నిర్మాణాల కోసం మనుషులు తమ జీవితాలను ధారపోశారు. ఉదా: సిస్టీన్‌ చాపెల్, ఖురాన్‌ కాలిగ్రఫీ, దేవాలయాల్లోని శిల్పాలు. హ్యూమన్‌ ఎండ్యూరన్స్‌ అనేదానికి మతం ఒక పరీక్ష. మనకు మనం మతానికి ఎంతగా ఇచ్చేసుకున్నామంటే– ఇంక దేవుడు లేడు అంటే ఒప్పుకోవడానికి ఏమాత్రం సిద్ధం లేనంతగా.
మతం, దేవుడు రెండింటినీ సందర్భాన్ని బట్టి ఒకే అర్థంలో వాడుతున్నాను. ఒక్కో మతంలో దానివైన సమస్యలున్నాయి, దానివైన వివక్షలున్నాయి, దానివైన సానుకూలతలు ఉన్నాయి, దానివైన అతిశయాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ప్రపంచంలోని అన్ని మతాలు వేరు, ఇస్లాం వేరు అని చెప్పాలన్నది నా ఉద్దేశం. దేవుడిని రూపరహితంగా ఆరాధించడం ఒక్కటే ఇస్లాంను వేరుగా ఉంచడం లేదు. ‘మతేతరుల’ గురించి ఇస్లాం నొక్కి మాట్లాడుతుంది(ఈ రెండు భావనలు జుడాయిజం లోనూ ఉన్నాయి). అత్యాధునిక మతం కావడం వల్ల కూడా ఇది జరిగివుండొచ్చు.
ముందుగా ఒకటి చెప్తాను. మనలో ద్వేషం ఎప్పుడూ ఒక ఊహా దయ్యం ఆధారంగా పనిచేస్తుంది. చాలావరకు మన లక్ష్యిత గ్రూపు ఏమిటో తెలియదు కాబట్టే, ఏ అడ్డు లేకుండా వ్యాఖ్యానాలు చేయగలుగుతాం. కానీ దీని ప్రతిఫలనం ఫలానా వాళ్ల మీద ఉంటుంది అని కచ్చితంగా తెలిసినప్పుడు అది మనకు ఒక నియంత్రణ రేఖలా పనిచేస్తుంది. అందుకే నేను నా ముస్లిం స్నేహితులను తలుచుకుంటూ దీన్ని మొదలుపెడుతున్నాను. ఇది ఏ ఒకరిద్దరు ముస్లిం రచయితల గురించో కాదు. వీరి సాకుగా నాకున్న కన్సెర్న్స్‌ను ముస్లిం కమ్యూనిటీలోని ఆలోచనాపరుల ముందు పెట్టాలన్నది నా ఆలోచన.
ఇంకొకటి కూడా చెప్పాలి. నాకు మొన్నమొన్నటిదాకా హనుమంతుడి వాహనం ఒంటె అని తెలియదు. చిన్నప్పటినుంచీ హనుమంతుడు ఎగురుకుంటూ వెళ్తాడనే తెలుసు. పుట్టుకతో హిందువును అయినప్పటికీ ఇంత చిన్న విషయం కూడా నాకు తెలీదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మతాల మీద, మత సాహిత్యం మీద నేనేమీ అథారిటీ కాదు అని ఒప్పుకోవడానికి. ఇంక నేను మాట్లాడుతున్నది పొరుగు మతం గురించి కాబట్టి, నా అవగాహన పరిమితుల మీద నాకు స్పృహ ఉంది.
‘అల్లాహ్‌ దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ’ మానవజాతి అల్లాహ్‌కు ఇచ్చిన ప్రమాణం(అహ్‌ దుల్లహి) అంటుంది దివ్య ఖుర్‌ఆ¯Œ . ఈ ఒక్క వాక్యం వల్ల ప్రపంచంలోని 600 కోట్ల మంది ఇచ్చిన మాటను తప్పినవాళ్లు అవుతున్నారు. ఇంకా ఖురాన్‌ ఏం చెప్తున్నదంటే– అల్లాహ్‌కు సాటిగా ఇంకో దేవుడిని నిలబెట్టడం క్షమించలేని మహాపాపం (శిర్క్‌) అంటుంది. ఇస్లాం మొత్తం పునాది ఈ భావనల మీద ఆధారపడి ఉంది. ఈ లెక్కన ఎంతమంది ఈ మహాపాపం చేస్తున్నట్టు? ఎందుకంటే ప్రతి మనిషీ ఏదో ఒక మతంతో అసోసియేట్‌ అయివున్నాడు కదా. అతడు ఆదివారం చర్చీకి పోతుండవచ్చు, గురువారం సాయిబాబా గుడికి పోతుండవచ్చు, కట్ట మైసమ్మకు కొబ్బరికాయ కొట్టివుండొచ్చు. వీళ్లందరూ మహాపాపులే. వాళ్లను ఏం చేయాలి? ధర్మయుద్ధం. ఇదిగో ఇక్కడుంది సమస్యంతా! దీనివల్ల ఇతర మతాల వారి ఉనికి ప్రమాదంలో పడుతోంది. నాస్తికులు అయినా మినహాయింపు లేదు.
ముస్లింలలో తార్కిక ఆలోచనలు కలిగినవాళ్లు లేరా? మనుషులు సామరస్యంతో సహజీవనం చేయడమే అత్యుత్తమ విలువ అని వారికి తెలియదా? అత్యధికులు పరమత సహనం ఉన్నవాళ్లు కాబట్టే, శాంతియుతంగా బతకగలుగుతున్నాం. కానీ ఎవరైనా ఈ భావనలను మానవాళికి వ్యతిరేకంగా అన్వయించుకునే వీలు లేదా?
ఇదిలా ఉంటే, మన రచయితలు ముస్లింవాద సాహిత్యం అంటుంటారు. అలాంటప్పుడు ఈ భావనల మీద వీరి వైఖరి ఏమిటి? ఇవన్నీ తెలిసే ముస్లింవాదమా? మెజారిటీవాద రాజకీయాల్లో మా బతుకుల గురించి మేము చెప్పుకుంటున్నాం అని వాళ్లు అనొచ్చు. కానీ ప్రపంచ లెక్కల్లోకి పోతే ఈ వాదం తేలిపోతుంది. హిందుత్వ రాజకీయాలను శత్రువుగా భావిస్తున్నప్పుడు, ఇస్లాం ఛాందసం కూడా ఇంకొకరికి శత్రువుగా ఉంటుందన్న అవగాహన వీరికి ఉందా? ఎందరెందరినో మీరెటువైపు అని నిలదీసిన నేల కదా ఇది! ఇప్పుడు నేను అడుగుతున్నాను. ముస్లిం రచయితలు, మేధావుల్లారా, మీరెటు వైపు? మనం ఏ మతంలో ఉన్నా అందరమూ కలిసిమెలిసి ఉండాలన్న అవగాహన వైపా? లేక, మా మతమే మిన్న, తక్కినవి సున్నా అని మీరు కూడా మనసులో అనుకుంటున్నారా? రెండోది మీ అభిప్రాయం అయితే, మీరు హిందుత్వ రాజకీయాలను ప్రశ్నించడంలో అర్థం లేదు. మీ అవగాహన మొదటిదే అయితే, మీ ఇస్లామేతర సహోదరుల కోసం మీరు ఏం చేస్తారు?
మతాలు తీవ్రరూపం దాలుస్తున్న కాలంలో ఉన్నాం. మనుషులు దేవుడి పేరుతో మృదువుగా కావాల్సింది పోయి, కఠినం అవుతున్నారు. ఎక్స్‌ట్రీమ్స్‌కు పోతున్నారు. మధ్యేమార్గం అనేది లేకుండా పోతోంది. ఎందుకంటే మతం అనేది ఆధ్యాత్మిక సాధన కోసం కాదు. అది ఒక రాజకీయం. దీనికి ఏ మతమూ మినహాయింపు కాదు. కానీ మనకు డిస్కోర్స్‌ ఎట్లా సెట్‌ అయివుందంటే, నిద్రలేస్తూ పాచిపళ్లతో కూడా హిందుత్వ అని తిట్టొచ్చు. కానీ స్నానం చేసి ఒళ్లంతా దగ్గరగా పెట్టుకుని కూడా ఇస్లాం ఛాందసం గురించి మాట్లాడకూడదు. దీనికి చాలావరకు మన వామపక్ష మేధావులు కారణం. ఎందుకంటే, మన దగ్గర ప్రతి చర్చనూ నడిపేదీ, ఏది ప్రగతిశీలమో, కాదో నిర్ణయించేదీ వాళ్లే. కానీ ఈ విషయంలో వాళ్లు ఉండాల్సినంత ఫెయిర్‌గా లేరని నా అభిప్రాయం. హిందుత్వ అని వామపక్షీయులు మాట్లాడకుండా ఏ దినపత్రిక అయినా ఏ ఒక్క రోజైనా ఉంటుందా? మరి ఇస్లాం ఛాందసం మీద వీళ్లు ఎంత మాట్లాడుతున్నారు? పైగా ఇలాంటి అంశం ఎత్తితే, అసలు విషయాన్ని పక్కనపెట్టి, స్టాంపు గుద్దడానికి ముందు సొరుగులోంచి ఇంక్‌ ప్యాడ్‌ తీస్తారని కూడా తెలుసు. ఇంత మాట్లాడిన తర్వాత, దీన్నొక హిందువు అభిప్రాయంగానే చూస్తారు కాబట్టి, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. డిగ్రీ అయ్యి, హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో, రామ్‌నగర్‌లోని నా రూమ్‌ నుంచి చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీకి వెళ్తుండేవాడిని. వేదం విన్న శూద్రుడి చెవుల్లో సీసం పోయాలన్న వాక్యం మొదటిసారి అక్కడే చదివాను. అది చదివినప్పటి ఒంటి కంపనం నాకు ఇంకా గుర్తుంది. ఇంతా చేస్తే ఇది నేను చదివింది, మనుధర్మం మీద వచ్చిన ఒక విమర్శా పుస్తకంలో. ఇదీ నేనంటున్నది! ఇలాంటి విమర్శ నేను ఎత్తిన అంశాల మీద కనీసంగా అయినా ఉన్నదా? మతం ఏదైనా సాటి మనిషితో ఆదరంగా ఉండాలన్నదే నా అభిమతం. మతం అని ఇక్కడ సందర్భవశాత్తూ వాడటమే గానీ, ప్రతి మనిషితోనూ వీలైనంత మంచిగా ఉండాలన్నది నా వ్యక్తిగత సంకల్పం, సాధన!

(Posted the same on my FB wall on 7th October, 2023)

Saturday, December 9, 2023

‘ఎడ్డి’ కథ ఎందుకు రాశానంటే...


ఆవిష్కరణ: ఎల్‌.ఆర్‌.స్వామి, కొప్పర్తి వెంకట రమణమూర్తి, కె.శివారెడ్డి, పాపినేని శివశంకర్, గంటేడ గౌరునాయుడు, నందిని సిధారెడ్డి, కన్నెగంటి చంద్ర, కె.ఎన్‌.మల్లీశ్వరి, వి.వి.రమణమూర్తి,చింతకింది శ్రీనివాసరావు




నందిని సిధారెడ్డి గారి నుంచి కథ–2022 కాపీలు స్వీకరిస్తూ...
Photo: Anil Atluri



కథానేపథ్యంలో– వక్త: మధురాంతకం నరేంద్ర.
ఎ.వి.రమణమూర్తి, బహుశా వేణుగోపాల్, ఎంఎస్‌కె కృష్ణజ్యోతి, పూడూరి రాజిరెడ్డి, వల్లూరి శాంతిప్రబోధ, పి.చిన్నయ్య, చరణ్‌ పరిమి, ఎం.రవీంద్ర బాబు, వేంపల్లె షరీఫ్‌



Thotlakonda



Rock Arch, Vizag Beach. Photo: Narukurthi Sridhar


చరణ్‌ పరిమి, పూడూరి రాజిరెడ్డి, కన్నెగంటి చంద్ర, మంజుల, కె.ఎన్‌.మల్లీశ్వరి, శాంతిప్రబోధ, మధురాంతకం నరేంద్ర, నరుకుర్తి శ్రీధర్‌



కథ–2022 ఆవిష్కరణలో నా ‘కథా నేపథ్యం’


విశాఖ పౌర గ్రంథాలయం, విశాఖపట్నం

డిసెంబర్‌ 3, 2023; ఆదివారం

(అవి నాలుగు మాటలైనా సరే, ఒక నోట్‌ రాసుకోకుండా నేను మాట్లాడలేను. కానీ అనుకున్న టైముకంటే ట్రెయిన్‌ మూడు గంటలు ఆలస్యంగా చేరింది. బస నుంచి వేదికకు పరుగెత్తినంత పనైన హడావుడిలో ‘కాగితం’ మర్చిపోయాను. గుర్తుచేసుకుంటూ మాట్లాడాను కాబట్టి, యధాతథంగా మాట్లాడలేదు. కానీ స్పిరిట్‌ అదే. అప్పటికప్పుడు కూడా కొంత కలిసింది. మళ్లీ రాస్తున్నప్పుడు కొంత పెరిగింది. అవన్నీ కలుపుకొన్న తర్వాత వచ్చిన తుదిరూపం ఇది. అక్కడ మాట్లాడినదానికీ, ఇక్కడ రాస్తున్నదానికీ తేడా ఏదైనా కనబడితే ఇదే ఫైనల్‌గా భావించాలి.)


‘ఎడ్డి’ కథ ఎందుకు రాశానంటే...

అందరికీ నమస్తే.

నాకు నేను ఒక పజిల్‌ విప్పుకోవడానికి ఈ కథ రాశాను. ఏమిటా పజిల్‌? అరే, ఒక మనిషి ఎట్లా తప్పిపోతుంది? ఆ తప్పిపోయే మూమెంట్‌ ఎలా వచ్చివుంటుంది?
ఇప్పుడంటే మా ఇంట్లో వ్యవసాయ పనులు తగ్గిపోయినాయి. మొత్తంగా వ్యవసాయానికి దూరమైనామని కాదు... నేను పెద్దయ్యి ఇంకో మార్గంలోకి రావడం ఒకటైతే, అసలు వ్యవసాయ పనులు అని మనం చెప్పుకొనేవి ఏవీ ఇప్పుడు లేవు. వరి కోతలు అయ్యాక బంతి కొట్టేవాళ్లం, కల్లాలు చేసేవాళ్లం. ఇప్పుడు ఆ పనులేవీ లేవు. అసలు మనుషులు చేతుల్తో వరి కోయడమే లేదు. ఏదో జరిగిపోయిందని నేను ఇక్కడ చెప్పడం లేదు. అది ఇక్కడ అప్రస్తుతం కూడా. నా చిన్నప్పుడు ఈ పనులు చేస్తున్నప్పుడు ముచ్చట్లు చెప్పుకోవడానికి బొచ్చెడు టైముండేది. మొత్తం టైమే. అప్పుడు మా బాపు ఏవేవో చెప్పేవాడు. అట్లా చెప్పిన ముచ్చట్లలో ఒకటి, ఒక ముసలామె, తిరుపతి యాత్రలకని పోయి, ప్రయాణంలో తప్పిపోయి, నాలుగేళ్ల తర్వాత ఇంటికి చేరడం. నాకు ఆ ముసలామె అట్లా గుర్తుండిపోయింది. ఆ చివరలో పట్టిన గతి తలుచుకుని కలుక్కుమనేది. కానీ ఆమె గురించి ఏదైనా రాద్దామనుకున్నప్పుడల్లా ఎట్లా తప్పిపోతుంది, నాకే నమ్మకం కలగట్లేదు, దీన్ని కన్విన్సింగ్‌గా చెప్పలేను అనిపించేది. మనుషులు తప్పిపోవడం గురించి ఎన్నో వార్తలు వింటూనే ఉంటాం. కానీ ఆ మూమెంట్‌ను సాహిత్యంలోకి ఎలా తేవాలి?
ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలిగే ఇంకేదో శక్తి మనకు కావాలి. అంటే, ఇది నిజమే అని ఒప్పుదల రావాలంటే అలాంటిది మన జీవితంలో కూడా జరగాలి. నా జీవితంలో కూడా నేను కొన్ని విలువైన క్షణాలను అట్లా జార్చుకున్నాను. అయ్యో అయ్యో అనుకుంటూ కూడా ఏమీ చెయ్యకుండా ఉండిపోవడం అది. పెద్ద పరిణామాలకు కారణమయ్యే విషయాలే అక్కర్లేదు; చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎర్రితనం చూపిస్తుంటాం. కనీసం నా వరకూ చూపించాను, దాని తర్వాత గింజుకున్నాను. చెప్పుకుంటే సిల్లీగా అనిపిస్తాయి గానీ ఆ క్షణానికి అవి నిజం. తర్వాత పడే వేదనం కూడా నిజం. ఆ ముసలావిడ తప్పిపోవడానికి ‘కారణమైనవాడి’, లేదా ఆమె తప్పిపోకుండా కాపాడగలిగేవాడి ఆ మొద్దుతనం, ఆ ఎడ్డితనం నాలోనూ ఉన్నాయి; అలా ఉండటం సాధ్యమే అనిపించాక కథ రాయగలిగాను. అంటే, ఆ మూమెంట్‌లోకి నేను వెళ్లగలిగాను. అసలు ఆమెను అట్లా గాలికి వదిలేసి, ఇంటికి నల్లమొఖంతో వచ్చిన వాడిని నేనేనేమో!
వాస్తవంలో జరిగిందని చెప్పిన కథను నేను కొంచెం మార్చాను. ముఖ్యంగా ‘సత్తయ్య’ పాత్ర. దానివల్ల మనకంటే ముందు తరాల సంబంధాలను అదనంగా చూపొచ్చు అనిపించింది. అయితే, స్థూలంగా విషయాన్ని మార్చే అధికారం నాకు లేదు. ముసలమ్మ తప్పిపోవడం వాస్తవం. సామాన్యుల జీవితం కూడా చరిత్రలో భాగం అనుకుంటే, ఆమె జీవితం కూడా ఒక చరిత్ర లాంటిదే. కాబట్టి దాన్ని మార్చలేను. ఆ తుది పర్యవసానానికి దారితీసిన సందర్భాన్ని ఎలా రాయగలనన్నదే నా సవాలు. అది కన్విన్సింగ్‌గా లేకపోతే అది నా అసమర్థత. ఇంకా, ఈ కథను రెండు రకాలుగా రాయొచ్చనుకున్నాను. మొదటి వెర్షన్‌లో అసలు నెరేటర్‌ లేడు. అప్పుడు కూడా కథ ఇప్పుడిచ్చే ఎఫెక్టే ఇస్తుందిగానీ, అందులోకి రాజిరెడ్డితనం ఏమీ రాదు. అందుకే నెరేటర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కథకు అదనపు డైమెన్షన్‌ను ఇవ్వగలిగానని అనుకుంటున్నాను. అలాగని నెరేటర్, రాజిరెడ్డి కాదు. రాజిరెడ్డి వేరు, రాజిరెడ్డితనం వేరు. నేను మొదట రాసిన వచనంలో(కథల్లో కాదు) రాజిరెడ్డిని ప్రవేశపెట్టడానికి ఉబలాటపడేవాడిని. అది అర్థం లేనిదని తెలుసుకున్న తర్వాత రాజిరెడ్డితనంలోకి వచ్చాను. కానీ ఇందులోనే మరింత రాజిరెడ్డి ఉంటాడు. అదే తమాషా!
రాజకీయ ఉద్యమాలకు ఈ కథ దన్ను ఇచ్చేదిగా ఉందని (కథానేపధ్యం నిర్వాహకుడు) ఎ.వి.రమణమూర్తి గారు అన్నారు. బహుశా ఈ కారణం వల్లే ఈ కథను ఈ సంకలనంలోకి తీసుకున్నారని నేను అనుకున్నాను. నిజానికి ఈ కథను ఫలానా ప్రయోజనం ఆశించి అయితే రాయలేదు. అసలు ఒక రచయిత తాను ఇందుకు రాశానని చెప్పగలడా? తాను అనుకున్నది మాత్రమే అందులోకి వస్తుందా? రచయిత అనుకున్నదానికి భిన్నంగా కూడా పాఠకులు తీసుకోవచ్చు. అందుకే రమణమూర్తి గారి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, ఈ కథ అంతిమ ప్రయోజనం ఇదీ అని నేను చెప్పలేను, అంటున్నా. ఒకవేళ ఒకటంటూ చెప్పాల్సి వస్తే, ఈ కథ రాయడంలో నా ఉద్దేశం, వ్యక్తిగతమే. అలాంటి ఒక ఎడ్డిమనిషి మన జీవితంలో కనబడితే వాడిని క్షమించొచ్చు అన్నంతవరకే నా ఊహ పోతోంది. క్షమ అనేది సామాజిక ఉద్యమాల కంటే మించినది అని నేను అనుకుంటున్నాను.
చివరగా ఒక మాట. ఇందాక ‘చరిత’ సుబ్బయ్య గారు పలకరించారు. నరసాపురం మీటింగ్‌లో(కథ–2018; అందులో నా ‘రెండో భాగం’ ఉంది.) నేను కొంచెం అల్లరి చేశాననీ, ఈసారి ఏం చేయబోతున్నాననీ నవ్వుతూ అడిగారు. కథల ఎంపికలో సంపాదకులు పెట్టుకున్న ‘సోకాల్డ్‌ అభ్యుదయ’ ప్రమాణాల వల్ల కొన్ని మంచి కథలు బయటే ఉండిపోతున్నాయని అప్పుడు అన్నాను. ఎంపిక పరమైన ఫిర్యాదులు అలాగే ఉన్నప్పటికీ ఈసారి అలాంటి అల్లరి ఏదీ చేయదలుచుకోలేదు. నేను కూడా కొంచెం పెద్దరికంతో అందరినీ క్షమించేయాలని అనుకుంటున్నాను. దానికి ఒక కారణం ఏమంటే– క్రమశిక్షణతో, పద్ధతిగా పనిచేసేవాళ్లంటే నాకు గౌరవం. పుస్తకం చివర వీళ్లిచ్చే ‘కథలు–కథకులు’ జాబితా ఒక్కటి చాలు వీళ్ల పనితీరును పట్టించడానికి. అందుకే నా కథను ఈ సంకలనంలోకి తీసుకున్న సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌ గార్లకు ధన్యవాదాలు. ‘2022లో మరికొన్ని మంచి కథలు’ జాబితాలో నా మరో కథ ‘ఎఱుక’ను కూడా ఇచ్చారు. దానికి కూడా థాంక్యూ. ఈ రెండు కథలూ మహమ్మద్‌ ఖదీర్‌బాబు గారు సంపాదకుడుగా వచ్చిన ‘కొత్త కథ–2022’, ‘తెలుగు పెద్ద కథలు’ పుస్తకాల్లో వచ్చాయి. ఆయనను కూడా ఇక్కడ తలుచుకుంటున్నా. ఈ సంకలనంలో చోటు చేసుకున్న సహ కథకులకు నా అభినందనలు.

థాంక్యూ.

--

పీఎస్‌1: ఒకరిని క్షమించడం, క్షమించే స్థితిలో ఉండటం కూడా అహంకారంలో భాగమే అని తర్వాత విడి సంభాషణల్లో చంద్ర కన్నెగంటి గారు అన్నారు. నాకు అది నచ్చింది.

పీఎస్‌2: మీటింగ్‌ జరిగింది ఒకేరోజు. నిజానికి, తర్వాతి రెండు రోజుల కోసమే అంతదూరం విశాఖ వెళ్లింది. ‘మిచౌంగ్‌’ తుపాను వల్ల అంతా కిందిమీదయ్యే పరిస్థితి వచ్చిందనే అనుకున్నాను. కానీ, వానయినా వరదయినా మిమ్మల్ని తిప్పే తీరుతాను అన్నట్టుగా నరుకుర్తి శ్రీధర్‌ గారు ఆ చినుకుల్లోనే బయల్దేరారు. రెండ్రోజులూ ఆయనే నాకు పెద్ద అండ. తగు మోతాదు వానతో ఈ పర్యటనకు ఒక భిన్న ఫీల్‌ కూడా వచ్చింది. అసలు కథంతా ఇక్కడుంది!

Saturday, October 28, 2023

మా ఊరి ముచ్చట 3: అభినందన




గ్రూప్‌ ఫొటో

 

కార్యక్రమం అనంతరం...


(ఇటీవల మా ఊరి దిలీప్‌కు హెచ్‌సీయూలో సీటొచ్చింది. సాయికిరణ్‌కు మెడిసిన్‌లో సీటొచ్చింది. నలుగురు(జలంధర్, రణధీర్, ప్రశాంత్, మనోజ్‌) కానిస్టేబుల్స్‌గా ఎంపికయ్యారు. ఇలాంటివన్నీ మా ఊరికి సంబంధించి పెద్ద విశేషాలే. అందుకే వారిని మా ఊరు కేంద్రంగా పనిచేసే ‘మై గిఫ్ట్‌’ స్వచ్ఛంద సంస్థ, క్రీడ విజ్ఞాన కళా వేదిక ఉమ్మడిగా ఊళ్లో దసరా పండుగ తెల్లారి జరిగిన ‘అలాయ్‌ బలాయ్‌’ కార్యక్రమంలో భాగంగా సత్కరించాయి. అందులో నన్నూ భాగం చేస్తూ మాట్లాడమంటే, ఈ మాటలు చెప్పాను:)

 

వేదిక ముందు, వేదిక మీద ఉన్న అందరికీ...

ఇక్కడున్న చాలామంది ఏదో సందర్భంలో ఊరికి దూరమై ఉండొచ్చు. అది చదువు కోసం హైదరాబాద్‌ వెళ్లడం కావొచ్చు, బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు పోవడం కావొచ్చు... అట్లా పోయినప్పుడు మన ఊరు మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. ఊరిలోనే ఉన్నప్పుడు మనకు అంతగా తెలియదు గానీ, ఊరికి ఎడంగా జరిగినప్పుడు మన ఊరు మనకు ఒక ఎమోషన్‌ అన్నది అర్థమవుతుంది. అందుకే దూరంగా ఉన్నప్పుడు ఊరి సంగతులు ఇంకా ఆసక్తికరంగా మారిపోతాయి. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న నాకు, ఈ పిల్లలు, వారి విజయాలు నాకు మరింత ముచ్చట గొలిపాయి.

ఇందులో ఇద్దరికి తండ్రులు లేరని తెలిసింది. ఒకతను పని కోసం గల్ఫ్‌ వెళ్లొచ్చి మళ్లీ కానిస్టేబుల్‌ పరీక్ష రాశాడు. ఇట్లా ప్రతి ఒక్కరికీ తమవైన సమస్యలున్నాయి. వాళ్ల కుటుంబ పరిస్థితులు, పరిమితులను అధిగమించిన వీళ్లందరూ నా దృష్టిలో సైలెంట్‌ హీరోలు. అసలు వీళ్లే కాదు, మొన్నటిదాకా బారాత్‌ డీజేలకు డ్యాన్స్‌ చేయడం తప్ప ఇంకేమీ తెలియదని అనిపించినవాళ్లు కూడా నెమ్మదిగా ఏదో ఒక పనిలో కుదురుకుని తమ కుటుంబాలకు అండగా ఉంటున్నారు. వీళ్లందరూ అభినందనీయులే. 

వీరి సంతోషంలో భాగం అయినప్పుడు ఈ విజయం మనది కూడా అనిపిస్తుంది. ఒకరికి పది రూపాయలు దానంగా ఇవ్వొచ్చేమో గానీ, ఒక మనిషిని మనస్ఫూర్తిగా లోలోతుల నుంచి అభినందించడం అంత సులభం కాదు. ఒక మనిషిని అభినందించాలంటే పెద్ద మనసు ఉండాలి. ఈనాటి సత్కారం కూడా అలాంటి ప్రశంసలో భాగమే అనుకుంటున్నాను. దీనికి పూనుకున్న ‘మై గిఫ్ట్‌’ నిర్వాహకుడైన వీర సైనికుడు(సైన్యంలో పని చేస్తున్నాడు) పెరుక రాజుకు అభినందనలు. అట్లాగే దీనికి తోడ్పడిన క్రీడ విజ్ఞాన కళావేదిక బృందం గుర్రం శ్రీకాంత్, ఇతర మిత్రులకు కూడా.

మన ఊరిలో మనం ఫలానా వాళ్ల మనవడిగా, కొడుకుగా ఒక పరంపరలో ఉంటాం. బయటికి వెళ్తే మనం ఎవరో ఒక ‘ఎక్స్‌’ మాత్రమే. ఇప్పుడే మీ ప్రయాణం మొదలైంది. మున్ముందు ఏయే స్థానాల్లోకి వెళ్తారో! మనిషనేవాడు బయటికి వెళ్లాలి, ప్రపంచాన్ని చూడాలి. కానీ ఊరితో మొత్తంగా సంబంధం మాత్రం తెంచుకోవద్దు. వేరు లేనివాళ్లం అయిపోతాం. బయటెక్కడా మన ఆత్మ నిండదు. ఊరిని దాటాలి, ఊరితో టచ్‌లో ఉండాలి. అదే నేనిచ్చే సలహా. అందరికీ ఆల్‌ ద బెస్ట్‌!

(24 అక్టోబర్‌ 2023)

 

Tuesday, October 3, 2023

మా ఊరి ముచ్చట 2: అలాయ్‌ బలాయ్‌

 

మా ఇంట్లో బతుకమ్మ పేర్పు

 

మా ఊరి ముచ్చట 2: అలాయ్‌ బలాయ్‌


(2022లో దసరా పండగ టైమ్‌లో మా ఊరిలో ‘క్రీడ విజ్ఞాన కళా వేదిక’ తరఫున ‘అలాయ్‌ బలాయ్‌’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. యువమిత్రులు అడిగితే, నేను కూడా అందులో పాల్గొని పెద్దమనిషి లాగా నాలుగు మాటలు చెప్పాను.)


అందరికీ నమస్కారం.


మనిషి ఏందంటే, కొన్నిసార్లు ఏకాకి; కొన్నిసార్లు సంఘజీవి. సందర్భాన్ని బట్టి ఆ పాత్రలను ఎంచుకుంటాడు. నేనైతే చాలాసార్లు ఏకాకిని. మనుషుల్లో కలవడం అనేది నాకు కొంచెం కష్టమైన వ్యవహారం. అయితే, వయసు పెరుగుతుండటం కూడా ఒక కారణం కావొచ్చుగానీ... ఈ క్రీడ విజ్ఞాన కళావేదిక మిత్రులు నన్ను సంఘజీవితంలో కలుపుతూ ఉన్నారు.

బతుకమ్మ పండుగ... దసరా... ఆ జమ్మి పెట్టుకోవడం, ఆ మర్రికింద... అందరూ ఒక ఉమ్మడి ఆవేశం పంచుకున్నారు. సామాజిక జీవితంలోని ఉత్సవం అదే. అందరం ఒక పెద్ద కార్యక్రమంలో భాగం తీసుకోవడం ద్వారా, ఒక్కరి సంతోషాన్ని మరింతలు, పదింతలు చేసుకోవడం అది. మనుషులతో కలవడమే పండుగ!

చాలాసార్లు జీవితం ఇంకా ముందుంటుంది అనుకుంటాం. కానీ నిజానికి వెనకే వదిలేసుకుంటూ వస్తాం. వయసు పెరుగుతున్నాకొద్దీ అది ఇంకా బలంగా అర్థమవుతూ ఉంటుంది. అందుకే ఇప్పటి జీవితాన్ని సంతోషించడం తెలుసుకోవాలి. ఒక వయసుకొచ్చాక నీతులు చెప్పడం సులభమేగానీ, ఆ వయసులో మనం ఎట్లా ఉన్నాం, మన ఆవేశాలు ఎట్లా ఉన్నాయి అని గుర్తించి, యువకులను ఒక సానుకూల వాతావరణంలో ఉంచడానికి ప్రయత్నం చేయడం గొప్ప విషయం. అందుకు ‘కేవీకేవీ’ మిత్రులకు అభినందనలు.

కుల భేదం లేకుండా, మత భేదం లేకుండా, రాజకీయ భేదం కూడా లేకుండా అందరం కలవడం బాగుంది. విభేదం వైవిధ్యం అయినంతవరకూ సమస్య లేదు. వైవిధ్యం అనేది ఆనందం కూడా. ఆ ఉన్న విభేదాలన్నీ పోయేలా ఇట్లా కలవాలన్న ఆలోచన బాగుంది. దానికోసం ఊరిలో పెద్దోళ్లు, ఊరితో సంబంధమున్న పెద్దోళ్లు అందరూ భాగస్వాములుగా ఉన్న ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషం.

థాంక్యూ.

(6 అక్టోబర్‌ 2022)

 

Friday, September 29, 2023

మా ఊరి ముచ్చట 1: ఒక వేదిక

మా ఊరి ముచ్చట 1: ఒక వేదిక

మూడేళ్ల కిందట (2020 అక్టోబర్‌) మా ఊరి (నర్సింగాపురం, చందుర్తి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా) యువకులు కొందరు కలిసి ‘క్రీడ విజ్ఞాన కళా వేదిక’ అని ఏర్పాటు చేశారు. ఊరిలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడం, ఉద్యోగార్థులకు కెరియర్‌ గైడెన్స్‌ ఇవ్వడం, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం... ఇలాంటివి దాని కార్యకలాపాలు. మొత్తంగా ఊరిలో ఒక సానుకూల వాతావరణం ఏర్పాటుచేయడం అనేది, లక్ష్యం. ఆ దిశగా మంచి సంకేతాలు కూడా కనబడుతున్నాయి. దాన్ని ప్రారంభించినప్పుడు నా అభిప్రాయాన్ని అడిగి, ఇలా వీడియోగా రికార్డ్‌ చేశారు. దాని లింక్‌ ఇక్కడ ఇస్తున్నా. దీన్ని రికార్డ్‌ చేసింది, ‘మై విలేజ్‌ షో’ టీమ్‌లో రైటర్‌గా ఉన్న మా ఊరి అనిల్‌ కంటె.


నా అభిప్రాయం: #KVKV

 

Thursday, September 14, 2023

‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కోసం నా మాటలు







ఫొటో రైటప్‌ (తలల క్రమం): ఆదిత్య, మంజుల, రహ్మానుద్దీన్‌ షేక్, సంవరుణ్‌(?), ఆదిత్య 2, మాధవ్, రాజిరెడ్డి, ‘కవనమాలి’, పవన్, పవన్‌ 2, శ్రీరామ్, శివగణేశ్, శ్రవణ్‌



ఆదిత్య అన్నావఝల, పూడూరి రాజిరెడ్డి


(నోట్‌ 1: ఎంచుకున్న వేదిక చాలా లైవ్లీగా ఉంది. అక్కడ, అక్కడి నుంచి చూస్తే కనబడేదంతా పాత హైదరాబాద్‌ నగరపు ఈస్తటిక్స్‌కు పూర్తి భిన్నం. ఇది నయా హైదరాబాద్‌. ఇలా కూడా బాగుంది.

నోట్‌ 2: పోగైంది అతి చిరు సమూహమే కాబట్టి, దాదాపు ముఖాముఖిలా నడిచింది. అందరూ నా పుస్తకాల గురించి ఎంత బాగా మాట్లాడారంటే, నేను వాటి గురించి చెబుదామనుకుని రాసుకెళ్లింది ఇక అనవసరమని వదిలేశాను.)


మీట్‌ అండ్‌ గ్రీట్‌

నిర్వహణ: ద తెలుగు కలెక్టివ్‌

ఆదివారం, 10 సెప్టెంబర్‌ 2023

మధ్యాహ్నం: 3– 6

స్థలం: WE హబ్- తెలంగాణ, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

ఆవరణ, హైదరాబాద్‌


స్పోకెన్‌ ప్రసంగాలు నేను చేయలేను; రిటెన్‌ ప్రసంగాలే నాకు చేతనవును.

‘నేను ఒక ఉపన్యాసం అయితే ఇవ్వను; ఊరికే ఎవరైనా అడిగితే దానికి నాకు తోచింది చెప్తాను, ఊరికే ఒక చిట్‌చాట్‌లాగా’ అన్న ప్రీ–కండిషన్‌ మీదే ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాను. కానీ తీరా ఆ ఇన్విటేషన్‌ పోస్టులో రాసిన భారీ మాటలు చూసి భయమేసింది. సాహిత్య ప్రస్థానం... రైటింగ్‌ స్టైల్‌... సహ రచయితలకు సూచనలు... బాబోయ్‌!

వచ్చి ఉత్త వెర్రిమొహం వేసుకుని కూర్చోకుండా ఈ నాలుగు మాటలు సిద్ధం చేసుకుని వచ్చాను.


మీట్‌ అండ్‌ గ్రీట్‌

ఒక వ్యవహారంగా మనుషులతో కలవాలంటే నాకు తెలియని భయం ఉంటుంది. పోయి ఆధార్‌ కార్డులో అడ్రస్‌ మార్పించడం, బండిని సర్వీస్‌కు ఇవ్వడం... అవెంత మామూలు విషయాలైనా సరే, నాకు చిన్న దడ ఉంటుంది లోపల. చాలామందికి మహా అయితే చిన్న చిరాకు ఉంటుంది కావొచ్చు, కానీ నాకు నిజంగా అదొక పెద్ద ఇష్యూ.

మనుషులతో ఏ వ్యవహారమూ లేక, ఊరికే రికామీగా కలవడం అయితే నాకు ఎప్పుడూ ఇంట్రెస్టింగే. ఎంతసేపైనా మాట్లాడగలను.

నేను ఇక్కడికి ఎందుకొచ్చాను అంటే– ఒక కొత్త గ్రూపుతో పరిచయం అవుతుంది. మనకు ఏమాత్రం తెలియని మనుషులు మనతో ఏం మాట్లాడదామని వచ్చివుంటారు? వాళ్లు ఏం చదువుతున్నారు? అసలంటూ ఏమైనా చదువుతున్నారా? నన్ను చదివితే, వాళ్లు ఆ విషయాలను ఎలా చూస్తున్నారు? ఇవన్నీ నాకు ఎక్కువ కుతూహలం. మీట్‌ అండ్‌ గ్రీట్‌ అని–– ‘ఇక్కడ’ కూర్చునేవాడి కోణంలో పెట్టివుంటారు గానీ నా ఉద్దేశంలో అక్కడ కూర్చునేవాళ్లను నేను మీట్‌ అయ్యి, గ్రీట్‌ చేద్దామని వచ్చాను.


నేను రచయితనేనా?

నన్ను నేను రచయితను అనుకోవచ్చా? టాల్‌స్టాయ్, చలం, భైరప్ప... ఇట్లాంటివాళ్లు రచయితలు అయినప్పుడు, మనల్ని మనం కూడా రచయితలం అని చెప్పుకోవచ్చా? అలా అనుకున్నప్పుడు ఎందుకు రాస్తున్నట్టు? 

ప్రపంచంలోని ప్రతివాడూ తన కథ చెప్పుకోవడానికి అర్హుడే. లేదా తనకు తెలిసిన కథ చెప్పడానికి అర్హుడే. ఎన్ని కథలు చెప్తాం, ఎంత బాగా చెప్తాం, ఎంతమంది వాటిల్లో తమను తాము చూసుకునేట్టుగా చెప్తాం అనేది వేరే చర్చ. కథ అంటే ఇక్కడ ఒక ప్రక్రియ అనుకోవద్దు. ఒక ఊసు. ఒక సంగతి. ఒక ముచ్చట. ఒక మనిషి, ఇంకో మనిషితో చెప్పుకోగలిగేది.

అది ఎవరైనా చెప్పొచ్చు. అట్లా నేనూ చెప్తున్నాను. మౌఖిక సాహిత్య దశలో లేము కాబట్టి, వాటిని రాస్తున్నాము. రాసే ప్రతి ఒక్కరినీ ఇప్పటి అర్థంలో రచయితే అంటున్నాం, కాబట్టి, నేనూ రచయితనే! సో, టాల్‌స్టాయ్‌ రచయితే, రాజిరెడ్డీ రచయితే. టాల్‌స్టాయ్‌ రాయనిది నేను ఏం రాయగలను?

చిన్న ఉదాహరణ చెప్తాను.

మామూలుగా బైక్‌ మీద లెఫ్ట్‌ టర్న్‌ అయితే షార్ట్‌ కర్వ్‌ తీసుకుంటాం. అదే రైట్‌ టర్న్‌ అయితే, లాంగ్‌ కర్వ్‌ చేయాలి. ఒకసారి ‘నవోదయ కాలనీ’లో పోతున్నప్పుడు, షార్ట్‌ కర్వ్‌లో మలిగేశాను. ఎదుటినుంచి వస్తున్నవాళ్లకు ఎదురెళ్లినట్టయింది. ట్వెంటీస్‌లో ఉన్నట్టున్నారు ఇద్దరు. వెనక ఉన్నతను, ‘అన్నా, నువ్వు అట్ల పోవాలి’ అన్నాడు. నేను అంతకుముందు నాకు తెలియకుండానే అట్లాగే చేస్తున్నాను కావొచ్చు, కానీ అది స్పృహతో చేసింది కాదు. ఇది జరిగిన తరవాత– అరే అవును కదా, ఇతను చెప్పింది నిజం, అనుకున్నా. చాలా చిన్న విషయమే కావొచ్చు, కానీ అది అప్పటినుంచీ నా వివేకంలోకి చేరింది. ఇంత అల్ప విషయమా అనుకోవచ్చు. ఇలాంటి అల్ప విషయాలే మన జీవితాన్ని అర్థవంతం చేస్తాయని నా నమ్మకం. అందుకే ఎంత చిన్న అనుభవానికైనా దానిదైన విలువ ఉంటుంది. ఇదెందుకు చెప్తున్నానంటే– సాహిత్యంలో అందరూ అన్నీ మాట్లాడేశారని అనుకుంటాం. కానీ ఎందరు ఎన్ని మాట్లాడినా ఇంకేదో మాట్లాడటానికి మిగిలిపోతూనే ఉంటుంది. 

అసందర్భమే కావొచ్చు. ఇంకో విషయం చెప్తాను. ఒకసారి లామకాన్‌లో ఒక స్వీడిష్‌ సినిమా వేశారు. కొత్త సినిమా. 2014లో వచ్చింది. స్వీడన్‌ అంటేనే బెర్గ్‌మన్‌ కదా. ఆయన అన్ని తీసిన తర్వాత, ఇంకా వీళ్లు ఏం తీసివుంటారా అన్న కుతూహలంతో వెళ్లాను. ఆ సినిమా పేరు: ఫోర్స్‌ మజూర్‌. ఇది కూడా బాగుంది. కాబట్టి ప్రతి రచయితా, ఆర్టిస్టు ఆ కాలానికి రిలవెంటే.


మానవోద్వేగ మహాసముద్రం

సాహిత్యం హ్యూమన్‌ కండిషన్‌ గురించి మాట్లాడుతుందంటారు కదా. అంటే ఏమిటి? నీకూ నాకూ మధ్య ఏం జరుగుతోంది? నాకూ ఇంకొకతనితో ఏం జరుగుతోంది? మనకు అయినవాళ్లు, బంధువులు, స్నేహితులు, పరిచితులు, కొన్నిసార్లు అపరిచితులతో కూడా కావొచ్చు... ప్రతి మనిషికీ, ఇంకో మనిషికీ మధ్య ఒక నిరంతర డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇంకో మనిషితో అన్నానుగానీ, మనిషి కూడా కానక్కరలేదు. మనిషితో ముడిపడినదైతే చాలు... కుక్క, చెట్టు, చెరువు... శ్రీశ్రీ అననే అన్నాడు కదా: అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల అని! ఈ డ్రామాలో వందలు, వేలు, లక్షలు, కోట్ల ఉద్వేగాలకు సంభావ్యత ఉంది. ఇది అసలు అనంతం. భూమి పుట్టినప్పటినుంచో, భూమ్మీద మనుషులు నడుస్తున్నప్పటినుంచో, లేదా మనుషులకు ఈ రకమైన స్పృహ వచ్చినప్పటినుంచో మనిషికీ మనిషికీ మధ్య ఎంత తమాషా నడిచివుంటుంది! ఇదంతా సాహిత్యంగా రావలసిందే. అది ఏ ప్రక్రియల రూపంలో వస్తుందనేది అంత ముఖ్యం కాదు. కానీ వచ్చింది, వస్తూనే ఉంది, వస్తూనే ఉంటుంది.

మొత్తం సాహిత్యాన్ని నేనొక మానవోద్వేగాల మహాసముద్రంగా చూస్తాను. ఒక ఊహ చేయండి! మొత్తం ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రాసిన సాహిత్య పుస్తకాలన్నీ ఒక నీటి బిందువుల రూపంలోకి కరిగిపోయి, అలలుగా తేలియాడుతూ, ఎల్లలు లేని సముద్రంగా పరుచుకుని ఉంటే ఎలా ఉంటుంది? కానీ ఈ మహాసముద్రం ఎంత పోసినా నిండేది కాదు; ఇంక చాలు అనేది కాదు. మనుషులు ఉన్నంతవరకూ వాళ్ల మధ్యలో సంభవించే సకల ఉద్వేగాలను ఇందులో పోయొచ్చు. ఒకరికి ఏం జరిగిందో ఇంకొకరికి తెలుస్తూనే ఉండాలి కదా. అట్లా తెలుసుకోవాలన్న కుతూహలం మానవ సహజం కదా. అందుకే మనం రాస్తుంటాం. రచయిత అనేవాడు రాస్తుంటాడు. వాడు మహారచయిత అయితే ఆ మానవోద్వేగ మహాసాగరంలోకి బిందెలు, ట్యాంకర్లతో ఉద్వేగ జలాన్ని కుమ్మరిస్తుంటాడు. నేను మరీ చంచాతో కాకపోయినా ఒక టీ గ్లాసుతో పోస్తుంటాను.

అట్లా పోసిన తర్వాత ఇవన్నీ ఏమవుతాయి? సముద్రంలో నీళ్లు ఆవిరై తిరిగి వానరూపంలో నేల మీద కురిసినట్లు, ఈ ఉద్వేగాలన్నీ సామూహిక వివేకంగా మారి మానవ హృదయ సీమల మీద కురుస్తాయని అనుకుంటే ఈ ఉద్వేగాల పోలికకు ఒక లాజికల్‌ కంక్లూజన్‌ వస్తుంది.


నాకేం ఫిలాసఫీ ఉంది?

రచయిత అన్నాక ఒక ధార ఏదో ఉండాలి. చాలామందికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. గట్టి అభిప్రాయాలు, నిశ్చిత అభిప్రాయాలు ఉంటాయి. నాకు మొదటినుంచీ ఉన్నది ఏమిటంటే, గందరగోళం, డోలాయమానం. ఎవరు ఏది చెప్తే అందులోనూ కొంత పాయింట్‌ ఉందనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఒక ఫ్లోటింగ్‌ స్థితిలోనే ఉంటాను. ఇది స్థిరం, ఖాయం, కచ్చితం అనేది ఉండదు. స్థిరత్వం లేకపోవడం అంటే నా అభిప్రాయాలు బలహీనమైనవని కాదు, గాలివాటం అని కాదు. నా ఆలోచనలు ఎప్పుడూ తర్కానికి లోనవుతూనే ఉంటాయి. అదీ, ఇదీ అని లోపల చింతన నడుస్తూనే ఉంటుంది. ఇదీ అని ఒకటి గట్టిగా పైకి తేలదు. ఇప్పుడు ఒకటి ఇటు మాట్లాడుతుండగానే, ఇంకొకటి లోపల ఫామ్‌ అవుతూ ఉంటుంది. కాబట్టి, ఏ పాయింట్‌ దగ్గర నేను నిలబడాలి? 

నేను ఫలానా అని ఒక వాదంలోకి పోలేకపోవడానికి ఇదీ కారణం అనుకుంటాను. అందుకే నా రచనల్లో అన్ని వాదాల ప్రతిఫలనాలు ఉంటాయి. లేదా ఏ వాదాలు లేకపోవచ్చు. ఉన్నవాటికి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. కానీ రాజిరెడ్డి ఏమిటి? దేనికి నిలబడతాడు? మీకు తెలుసో లేదోగానీ... మన విమర్శకులు, కవులు... ఫలానా రచయిత ఎటువైపున్నాడు? అని అడుగుతుంటారు. ప్రజల వైపున్నాడా? పేదల వైపున్నాడా? అని మాటల్లో ఉంటుంది. మాటలు చాలా ట్రిక్కీగా ఉంటాయి. పేదల వైపు ఉండను, మంచి వైపు ఉండను అని ఎవడైనా చెప్తాడా, చెప్పగలడా? కానీ ‘సారం’గా వాళ్ల దిక్కున్నామా లేదా; ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాళ్లు బలపరిచే రాజకీయాలకు మనం మద్దతిస్తున్నామా లేదా అని చూడటమే వాళ్లు అడిగే ప్రశ్నకు అసలైన అంతరార్థం. ఆ అర్థంలో అయితే నేను ఎటువైపూ ఉండను. నా అనుభవంలో, నా తర్కంలో అప్పటికి నాకు నిగ్గుదేలింది మాత్రమే నా సత్యం. ఆ సత్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను.

ఇంకా ముఖ్యమైనది, మనుషులు! మనుషులు ఎట్లా అంటే, మనం ఎంతో గొప్ప వాదం అనుకున్నదాన్ని కూడా ఎడమకాలితో తంతుంటారు. జీవితం చాలా రకాలుగా ఉంటుంది. ఆ మనుషుల బహుముఖీనతను, జీవితపు సంక్లిష్టతను, అర్థం కాలేకపోవడాన్ని పట్టుకోవడం నాకు ఇష్టం.


ఎలా రాస్తే బాగుంటుంది?

పాలన్నీ ఒక్కటే, అన్నీ తెల్లగా ఉంటాయి అని మనకు చిన్నప్పుడు చెప్పారు. అందులోని సారం గ్రహించడం వరకు సరే. కానీ పెద్దయ్యేకొద్దీ అర్థమవుతుంటుంది– ఏ బర్రెపాలు ఇంకో బర్రెలా ఉండవు, ఏ బాయి నీళ్లు ఇంకో బాయిలా ఉండవు. అట్లాగే మనిషి కూడా. ఆ లిటిల్‌ డిఫరెన్స్‌ ఏమిటనేదే మనకు ముఖ్యం.

ప్రజల పక్షం, పేదల పక్షం అన్నప్పుడు– ఆ ప్రజలు అనేవాళ్లు ఎవరూ నీ కథల్లోకి రారు. వచ్చేది ఒకటో రెండో ముఖ్య పాత్రలు. వాళ్లను ప్రజలు అందామా అంటే కుదరదు. అయితే ఆయన చింతకింది మల్లయ్య అవుతాడు. లేదంటే లింగయ్య కొడుకు బుచ్చిరెడ్డి అవుతాడు. వాళ్లు వాళ్ల లెక్కనే ప్రవర్తిస్తారు గానీ ప్రజల్లా కాదు. ప్రజలు అనేది రాజకీయాల్లో నిజం కావొచ్చు గానీ, సాహిత్యంలో మాయ.

ఒక కమ్యూనిటీకి ప్రాతినిధ్య పాత్రలు ఉండటం దోషం కాదు. కానీ అప్పుడు కూడా అతడు ప్రజల్లో భాగం కాకుండా, విడిగా అతడిలాగే ఉంటాడు. నిర్దుష్టంగా అతడిలాగే ప్రవర్తిస్తాడు. దీనికోసం డీటెయిల్స్‌ ముఖ్యమవుతాయి. ఇవే ఏ పాత్రకైనా ప్రాణం. ఈ హాల్‌కు చేరడానికి అందరమూ ఒకే దారిలో వచ్చివుండొచ్చు. కానీ ‘ఆదిత్య’ను మన నుంచి వేరు చేసేది ఏమిటి? అది పట్టుకోవాలి. తను మాత్రమే గ్రహించగలిగింది రాయడం ద్వారా అది సాధ్యమవుతుంది.

ఆర్కే నారాయణ్‌ ఎక్కడో అన్నది చదివాను: ఒక దొంగ పాత్ర గురించి రాస్తుంటే నాకు ఆ పాత్ర మీద కూడా ప్రేమ కలుగుతుందీ అని. ఇలా దుష్టపాత్ర మీద ప్రేమ కలగడం మంచిదేనా? దీన్ని ఇంకోరకంగా చూడాలి. నీకు ఇష్టం లేని పాత్రకు కూడా ఇవ్వాల్సిన స్కోప్‌ ఇవ్వడం. అట్లా నేను రాస్తున్నానో లేదో నాకు తెలీదుగానీ, ఏకపక్షంగా ఒక్క వైపుకే కథను మళ్లించకుండా రాసేవాళ్లు నాకు ఇష్టం.


ఇవి సూచనలా?

వాదంలో రాయడం తేలిక, సోమరితనం. పైగా ఎంతోకొంత పేరు కూడా వస్తుంది. ఎందుకంటే, ఆల్రెడీ ఫ్రేమ్స్‌ ఫిక్స్‌ అయివున్నాయి. మీరు రాయగానే మన గ్రూపులోకి ఒకరు వచ్చారని ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అది మీదా? మీ అనుభవం కూడా అదే చెప్తోందా? మీ సత్యం భిన్నంగా ఉంటే దానికి ఎదురు నడవగలరా? ఈ ప్రశ్నల మీద మీ సాహిత్యాన్ని మలుచుకుంటే... కనీసం మీకు మిమ్మల్ని ఒక కానుక చేసుకున్నవాళ్లవుతారు. ఇదొక్కటే ఎవరైనా రాయాలనుకుంటే నేను ఇవ్వగలిగే సలహా.


థాంక్యూ

నేను పొద్దున్నే పిల్లల్ని స్కూలు బస్సెక్కించడానికి వెళ్తాను. వస్తూ వస్తూ ఏవో కూరగాయలు తెస్తుంటాను. అప్పుడప్పుడూ గిర్నీకి వెళ్లి పిండి పట్టిస్తుంటాను. కత్తులు మొండిపోతే దారు పట్టించడానికి వెళ్తాను. నా భార్య ‘లైనింగ్‌’ క్లాత్స్‌ తీసుకుంటుంటే రోడ్డు మీద నిలబడి ఉంటాను. కుట్టు మిషన్‌ పాడైతే రిపేరుకు తీసుకెళ్తాను. ఈ ఏ సందర్భంలోనూ నేను రచయితను కాదు. ఒక సినిమా నటుడు సెట్‌లోనూ నటుడిగానే ఉంటాడు; రోడ్డు మీదికి వచ్చినా నటుడిగానే ఉంటాడు. కానీ రచయితలు అలాక్కాదు. 99 శాతం జీవితంలో రచయితగా ఉండం. ఆ మిగిలిన ఒక్క శాతం సందర్భం ఇలాంటి మీట్స్, గ్రీట్స్‌. నా రచయిత మూమెంట్‌ను సెలబ్రేట్‌ చేయడానికి సంకల్పించిన ఆదిత్య(అన్నావఝల)కూ, ‘ద తెలుగు కలెక్టివ్‌’ టీమ్‌కూ, ఇక్కడికి వచ్చి నన్ను విలువైన మనిషిని చేసిన యువ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. తెలుగు కలెక్టివ్‌ యానివర్సరీ ఈవెంట్‌కు నన్ను ప్రత్యేకంగా ఎంచుకోవడం నాకు మరింత గౌరవం. థాంక్యూ ఎగైన్‌.

Sunday, June 26, 2022

గూడూరి సీతారాం కథా పురస్కార స్వీకరణ ప్రసంగం


నలిమెల భాస్కర్, ఆకునూరి శంకరయ్య, గూడూరి వేణు, జూలూరి గౌరీశంకర్, పూడూరి రాజిరెడ్డి, జుకంటి జగన్నాథం, గూడూరి రాఘవేంద్ర, గూడూరి ప్రవీణ్, పత్తిపాక మోహన్, ఎలగొండ రవి





 

గూడూరి సీతారాం కథా పురస్కార స్వీకరణ ప్రసంగం

సినారె విజ్ఞాన మందిరం, సిరిసిల్ల

ఉదయం 10:00; 19 జూన్‌ 2022

---------------------------------------------

ఇలా ఈ పురస్కారం తీసుకుంటున్నానని ఫేస్‌బుక్‌లో పెడితే, కొందరు మిత్రులు గూడూరి–పూడూరి మధ్య ఉన్న రైమింగ్‌ను ప్రస్తావించారు. నాకు తెలియకుండానే ఎప్పుడో గూడూరితో నా పేరు ముడిపడిపోయినట్టుగా ఉంది.

మామూలుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటుంటారు కదా. సాహిత్యం అనేది గెలుపు ఓటములకు సంబంధం ఉన్నది కాదు. కానీ నన్ను నిజంగా ఎంతోకొంత సీరియస్‌గా చదివే ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారనిపిస్తుంది. ఈ మాట అంటే మేము లేమా అని నామీద అభిమానంతో కోపానికి వచ్చే తెలంగాణవాళ్లు కూడా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను చెప్పేది, ఆ సంఖ్యతో పోల్చినప్పుడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుండె... ఇక్కడ నన్ను నిజంగా చదువుతున్నారా, నిజంగా సాహిత్యం అనేదాన్ని అర్థం చేసుకునే పాఠకులున్నారా... వీళ్లకు అలవాటైన మూసలు దాటితే వీళ్లకు అర్థమైతదా... కానీ ఈ పురస్కారం వల్ల ఇక్కడ కూడా నన్ను చదువుతున్నారు, పట్టించుకుంటున్నారు అన్న చిన్న ఫీలింగ్‌ వచ్చింది. ఒక విధంగా ఇంట కూడా గెలిచిన ఫీలింగ్‌ వచ్చింది.

ఇంకోటి ఏంటంటే– నేను ఆరో తరగతి నుంచి ఊరికి దూరంగానే ఉంటున్నా. మేడ్చల్, కీసరగుట్ట, పటాన్‌చెరు, హైదరాబాద్‌... చదువు, ఉద్యోగం... ఏం చేసినా ఆల్మోస్ట్‌ ముప్పై ఏళ్లుగా నేను హైదరాబాద్‌లోనో, హైదరాబాద్‌తో సంబంధంలోనో ఉంటున్నా. దసరాకూ, సంక్రాంతికీ ఏదో పండుగకు ఊరికి వచ్చినట్టే అయిపోయింది. ఈ ఒకట్రెండేళ్ల నుంచే కొంచెం ఊరికి ఎక్కువ వచ్చిపోతున్నా, ఎక్కువ ఉంటున్నా కూడా. కరోనా వల్ల జరిగిన మంచి విషయాల్లో అదొకటి. నలభై ఐదు రోజులు వరుసగా, రెండు దఫాల్లో ఉండగలిగిన. ఎప్పుడు ఇట్ల వీలు గాలె. ఉరుకుడు, ఉరుకుడు... మూడ్రోజులు సెలవు పెట్టుకునుడు, ఆదివారం కలిసి వచ్చేటట్టు చూసుకునుడు... వచ్చుడు, పోవుడు ఇదే కథ... కానీ నేను ఎక్కడినుంచన్నా రానీ... ఈ సిద్దిపేట, సిరిసిల్ల మోపుకు రాంగనే... ఆ వాతావరణమే మారిపోతది. మన మనుషుల్ల పడ్డం అనిపిస్తది. వాళ్ల ఎవ్వరితోటి మనకు పరిచయం ఉండది. మనం పోయి మాట్లాడకపోవచ్చు. కానీ మనోళ్లు అని అనిపిస్తది. మన భూమితో, మన ప్రాంతంతో, మన ఊరితో ఉండే సంబంధం అది. ఏదో ఒక గుండె నిండినట్టు. అట్ల ఈ అవార్డు మన మనుషుల్ల తీసుకునుడు ఇంకొంచెం సంబురం.

సీతారాం గారిది హన్మాజీపేట అని తెలిసి అది ఇంకా పెరిగింది. ఇగ అది మన ఊళ్లే, మన ఇంట్ల తీసుకున్నట్టే.

నా బాధ్యత పెరిగింది, నేనేదో సమాజానికి ఏదో చేశాను ఇట్లాంటి మాటలేమీ చెప్పను. నా వరకు పురస్కారం అంటే ఏమిటంటే, అది ప్రశంసకు ఒక భౌతికరూపం ఇవ్వడం. మీరు రాసింది బాగుంది అంటే ఎట్లాంటి సంతోషం అనిపిస్తదో, అట్లాంటిదే ఇది కూడా.

అయితే అవార్డుల మీద నేను మరీ ఎక్కువేమీ ఆలోచించలేదుగానీ ఇవి తీసుకోవడం అనేది లేని బరువును మీద పెట్టుకున్నట్టు అవుతుందా? తెలియకుండానే దేనికో కమిట్‌ చేసుకోవడం లాంటిది అవుతుందా? అని కొంత సంశయించాను. మళ్లీ ఈ స్మారక అవార్డులు అంటే– వాళ్లు ఏ ఆదర్శానికో, ఏ భావజాలానికో నిలబడి ఉంటారు. నేను అట్లాంటి ప్రకటిత భావజాలాల్లోకి రాను. మన ధోరణికీ, వాళ్ల దానికీ మధ్య వైరుధ్యం ఉంటే ఇదొక ప్రశ్నను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నాకు అవసరమా అనుకున్నాను. అందుకే ఇట్లా పురస్కారం అని నాకు మొదటిసారి ఫోన్‌ చేసినప్పుడు– నా పేరు మీ దృష్టికి రావడం సంతోషమేగానీ వద్దులేవే అనే చెప్పాను. ఒక రెండు, మూడు వారాలకు మళ్లీ చేశారు. నాకు రకరకాల బలహీనతలు ఉన్నాయిగానీ ఈ పురస్కారాల లౌల్యం అయితే లేదనే అనుకుంటాను. కానీ రెండోసారి చేసినప్పుడు– నిరాకరించలేని మొహమాటం ఒకటి, రెండోది మర్యాద కూడా కాదనిపించింది. అందుకే ఇప్పుడు ఇలా మీ ముందున్నాను.

మనం ఒకరి పేరు మీద అవార్డు తీసుకుంటున్నప్పుడు వాళ్లు ఏమిటి అని తలుచుకోవడం ఒక సాహిత్య మర్యాద. నేను గూడూరి సీతారాం గారి కథలు మరీ ఎక్కువ చదవలేదు. అవైనా మనకంటే ముందుతరంలో రాసినవాళ్లు ఏం రాసివుంటారు అనే చిన్నపాటి కుతూహలంతో చదివినవే. అందుకే నేను చదివినవాటితో ఆయన నిజమైన ప్రతిభను అంచనా కట్టవచ్చా అన్నది చెప్పలేను. కానీ చదివినమేరకు కథకు ఉండే నిజమైన పొటెన్షియల్‌ను, విస్తృతిని ఆయన అందుకోలేదేమో అనిపించింది. కానీ ఆయన రాసిన కథలు చూస్తే– నారిగాని బతుకు, మారాజు ఇట్లాంటివి– 1954, 1957 ఇట్లా ఉన్నాయి అవి అచ్చయిన సంవత్సరాలు. 1936లో జన్మించారనుకుంటే– ఆయన ఎర్లీ ట్వెంటీస్‌లో, పచ్చి యువకుడిగా రాసిన కథలు. అంత చిన్న వయసులో ఆయన సాహిత్య రంగం మీదకు రావడం ఒక విశేషం... 

ఇంకా ముఖ్యంగా, ఇప్పుడు తెలంగాణ భాష కూడా ఒక కమర్షియల్‌ ఎలిమెంట్‌ స్థాయిని అందుకోవడం వల్ల ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్లలో కూడా యధేచ్ఛగా మాట్లాడే పరిస్థితి వచ్చిందిగానీ... ఆ 1950, 60ల కాలంలో, అలాంటివి అచ్చుకు నోచుకోవడం చాలా కష్టమైన రోజుల్లో ఆయన తెలంగాణ మాండలికంలో రాయడం గొప్ప విషయం. బహుశా సీతారాం గారిని సాహిత్య లోకం తలుచుకుంటున్నది ఆయన కథల కంటే కూడా ఆయన భాష కోసం అనుకుంటున్నాను. ఈ అవార్డు పెట్టిన ఉద్దేశం కూడా తెలంగాణ భాషలో రాస్తున్నవాళ్లకు ఇవ్వడానికే.

అయితే భాష మీద నా వైఖరి కూడా చెప్తాను. రాతపూర్వక భాషకూ, మాట్లాడే భాషకూ కొంత తేడా ఉంటుందనీ, ఉండాలనీ అనుకుంటాను. అంటే, భాష కోసం భాష అని మరీ తెచ్చిపెట్టి కృతకం చేయను. కానీ తెలంగాణ ఫ్లేవర్‌ నా రైటింగులో చాలానే ఉంటుందనుకుంటాను. ఇంక స్పోకెన్‌ సందర్భాలు వచ్చినప్పుడు– రియాలిటీ చెక్‌ పుస్తకంలో చాలాచోట్ల... ఆజన్మం పుస్తకంలో కొన్ని చోట్ల... చింతకింది మల్లయ్య ముచ్చట, కాశెపుల్ల, చినుకు రాలినది, రెండో భాగం, గంగరాజం బిడ్డ, కొండ లాంటి కథల్లో సందర్భాన్ని బట్టి జీవితానికి చాలా దగ్గరగా ఉండే భాషను వాడగలిగానని అనుకుంటాను. అదొక్కటే నేను ఈ పురస్కారం అందుకోవడానికి అర్హత అనుకోగలిగేది.

గూడూరి సీతారాం పేరిట ఒక పురస్కారాన్ని ఏర్పాటుచేయడమూ, దాన్ని మొదటగా నాకే ఇవ్వడమూ చాలా సంతోషంగా ఉంది. ఇది ఫార్మాలిటీ మాటగా చెప్పేదే కావొచ్చు. కానీ ఆ ‘మొదటి’ అనే మాట సంతోషాన్ని రెట్టింపు కూడా చేస్తోంది. దీన్ని ఏర్పాటుచేసిన సీతారాం గారి సంతానం గూడూరి వేణు గారికీ, సీతారాం తమ్ముడు రాఘవేంద్ర గారికీ, నాకు ఈ పురస్కారం ఇవ్వడానికి చొరవ చూపిన పత్తిపాక మోహన్, జూకంటి జగన్నాథం గార్లకూ ధన్యవాదాలు. ఇంకా ఈ వేడుకలో భాగమైన జూలూరు గౌరీశంకర్‌ గారికీ, ఆకునూరి శంకరయ్య గారికీ, గూడూరి ప్రవీణ్‌ గారికీ, గరిపెల్లి అశోక్‌ గారికీ... నిర్వహణలో భాగం పంచుకున్న మానేరు రచయితల సంఘం కవులు ఎలగొండ రవి, జిందం అశోక్, గోనె బాల్‌రెడ్డి, ఆడెపు లక్ష్మణ్, బూర దేవానందం గార్లకూ ధన్యవాదాలు. ఇంకా దీన్ని ముఖ్యమైన ఈవెంట్‌గా తలచి వచ్చిన ‘మీ అందరికీ’ కూడా!


(ఫొటోలు పంపిన నాగేంద్ర శర్మ గారికి కృతజ్ఞతలు.)



Friday, May 13, 2022

సినిమాలు ఎలా చూస్తున్నాను?

 



ఫొటో రైటప్‌: 

(కింది వరుస) మహమ్మద్‌ ఖదీర్‌బాబు, కూనపరాజు కుమార్, వేమూరి సత్యనారాయణ, హెచ్చార్కె, వి.మల్లికార్జున్, అనిల్‌ అట్లూరి, రామరాజు, వి.రాజారాంమోహన్‌ రావు, సాయి పాపినేని.

(మెట్ల మీద కింది నుంచి పైకి) శాంత, జయ, సూజాత వేల్పూరి, ఉమా నూతక్కి, ప్రసాద్‌ సూరాడ, శ్రీనాథ్‌ రెడ్డి, శిఖామణి, మానస ఎండ్లూరి, రుబీనా పర్వీన్, చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ, మనోజ్ఞ ఆలమూరు, పూడూరి రాజిరెడ్డి)

 


ఏప్రిల్‌ 16–17, 2022

‘శాంతారామ్‌’, మన్నెగూడ



సినిమాలు ఎలా చూస్తున్నాను?
----------------------------------------


(మొన్న శని, ఆదివారాలు– అంటే ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో, మహమ్మద్‌ ఖదీర్‌బాబు నిర్వహణలో, మాజీ పోలీస్‌ అధికారి చిలుకూరి రామశర్మ– చదువరి శాంత దంపతుల ఆహ్వానం మేరకు వారింట్లో ఓ ఇరవై మంది మిత్రులం కలిశాం. పౌర్ణమి వెన్నెలను చూడటం అనేది దీనికి సాకు(1). ఇదొక ఉప రైటర్స్‌ మీట్‌ లాంటిది. అందుకే ప్రసంగాలు లేవు. ఒక్క హెచ్చార్కే గారూ(డయాస్పోరా సాహిత్యం), నేనూ మాత్రమే మాట్లాడాం. మా ‘వెళ్లిపోవాలి’ వచ్చిన తర్వాత, నన్నో సినిమాజీవిని చేసి, సినిమాల గురించి మాట్లాడమన్నారు. సాధికార వ్యాఖ్యానాలు నాకు చేతగావు కాబట్టి, నేను ఎలా సినిమాలను చూసుకుంటూ వచ్చానో చెప్పాను. రాత కొంత క్రమాన్ని డిమాండ్‌ చేస్తుంది కాబట్టి ఆ మేరకు స్వల్ప మార్పులు చేశాను. సారం మాత్రం అదే.)

నా తరఫు చాలామందిలాగే నేను కూడా చిన్నప్పుడు చిరంజీవి పిచ్చోణ్ని. ఆ పేరు తలుచుకుంటేనే వైబ్రేషన్‌ వచ్చిన రోజులున్నాయి. అసలు సినిమాలు బాగుండకపోవడం అనేది తెలీదు. బొమ్మ ఎదురుగా కనబడుతుంటే బాగోకపోవడం ఏంటి ఇంకా? ఇంటర్మీడియట్, డిగ్రీ దాకా రిలీజైన ప్రతి సినిమా చూడాలని అనుకునేవాణ్ని. అరే, వాళ్లు అన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసినదాన్ని మనం పది రూపాయలు ఇచ్చి చూడగలుగుతున్నాం కదా అని సంబరపడేవాణ్ని. చేతివేళ్ల మీద– బాలకృష్ణ సినిమా ఇదొచ్చిందీ, వెంకటేశ్‌ సినిమా చూశాను, నాగార్జునది చూశాను, తర్వాత మోహన్‌బాబు, రాజశేఖర్‌... జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌... అయితే అన్నీ చూసేసినట్టే! సంవత్సరంలో నూరు నుంచి నూటాయాభై దాకా చూసిన రోజులున్నాయి. ప్రతి రెండు రోజులకో సినిమా అనుకోవచ్చు. అసలు నేను బయటి ఖర్చు అంటూ పెడితే అది సినిమాకే. మళ్లీ థియేటర్లో ఏ సమోసానో ఎప్పుడూ కొనలేదు.

నేను న్యూస్‌ పేపర్లలో విధిగా చదివిన వాటిల్లో ఒకటి, ఏ థియేటర్లో ఏ సినిమాలు నడుస్తున్నాయి అనే సమాచారం. అవి చూడకపోయినా ఊరికే చదవడం కూడా బాగుండేది. అట్లా ఒకసారి కాచిగూడ పరమేశ్వరిలో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఉందని చూసి, పటాన్‌చెరు నుంచి పరుగెత్తుకొచ్చాను( అప్పటికి డిగ్రీ అయ్యి, తొలి ఉద్యోగంలో ఉన్నాను.) ఒక్క మార్నింగ్‌ షో మాత్రమే వేశారు. నేను రెండో రోజు వచ్చేసరికి అదీ తీసేశారు. ఎంత నిరాశపడ్డానో చెప్పలేను. ‘వేరే’ సినిమాలు అనుకునేవి కూడా చూడాలనే ఆకలి అప్పుడప్పుడే మొదలైంది. మణిరత్నం ఒక్కడే నేను అప్పటికి చూస్తున్న ‘వేరే’. సత్యజిత్‌ రే, శ్యామ్‌ బెనెగల్, ఇలాంటి పేర్లు తెలుసు. కానీ ఎప్పుడూ వాళ్ల సినిమాలు చూడలేదు. చూసే అవకాశం కూడా లేదు. కానీ లోలోన ఒక భయం ఉండేది. వీళ్ల సినిమాలు మనం చూడలేమేమో, మెల్లగా నడుస్తాయేమో, నచ్చకపోతే వాళ్లమీద గౌరవం పోతుందేమో అనుకునేవాణ్ని. కానీ ‘పథేర్‌ పాంచాలీ’ చూసిన తర్వాత, నా భ్రమలు పోయాయి. కమర్షియల్‌ సినిమాను ఎంతగా ఆనందించగలమో వీటిని కూడా అంతే హాయిగా చూడగలం అన్నది అర్థమైంది. వాటిని ఏ అంశాల్లో ఇవి అధిగమిస్తాయో, ఎందువల్ల ఇవి క్లాసిక్స్‌ అవుతాయో, ఎందుకు ఇలాంటివే ఒక దేశపు ప్రాతినిధ్య సినిమాలుగా నిలబడతాయో అన్నది మెల్లమెల్లగా తెలిసొచ్చింది.

జర్నలిజంలోకి వచ్చి, హైదరాబాద్‌లో ఉండటం మొదలుపెట్టాక ప్రత్యామ్నాయ సినిమాల తావులు తెలియడం మొదలైంది. గోథె జెంత్రమ్, అలయన్స్‌ ఫ్రాన్సైజ్, హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌... ఒకసారి ఓ ఇటాలియన్‌ సినిమాను లామకాన్‌లో వేస్తున్నారని తెలిసి వెళ్లాను. ఇలాంటి జాగాలు నాలాంటివాడివి కాదు అన్న బెరుకు ఎందుకో నన్ను వదలదు. స్క్రీనింగ్‌ ఎక్కడో అర్థం కావడం లేదు. బయట కనబడే తెర దగ్గర ఎవరూ లేరు. మొత్తానికి ఎవరినో అడిగితే, ముఖం విప్పార్చుకుని చూశాడు. తర్వాత అర్థమైందేమిటంటే, ఆయనే ప్రదర్శకుడూ, అప్పటిదాకా నేనే తొలి ప్రేక్షకుడినీ అని!

యూట్యూబ్‌ అనేది పెద్ద నిధి. బెర్గ్‌మన్‌ సర్వస్వం సహా నేను ఎన్నో అందులోనే చూశాను. సినిమా అనేది ఒక సముద్రం. వాటిల్లో ఏది ఎంపిక చేసుకోవాలి అనేదానికి నేను ఏం చేసేవాడినంటే, ఈ వందేళ్లలో వచ్చిన వంద గొప్ప సినిమాలు అని రకరకాల జాబితాలు ఉంటాయి. వాటి తోక పట్టుకుని పోయేవాడిని. రోజర్‌ ఎబర్ట్‌కు నచ్చిన సినిమాలు ఏమిటి? లేకపోతే ఏ స్కోర్సెసీ నోట్లోంచో ఫలానా సినిమా అని ఊడిపడితే అదేమిటో చూడాలనుకోవడం... ఇట్లా నాకు దొరికినవి చూసుకుంటూ వచ్చాను.

సినిమాలు చూడటంలో ఒక షిఫ్ట్‌ లాంటిది ఏమిటంటే– క్లాసిక్స్, ఇంగ్లిష్‌ సినిమాలు పక్కనపెట్టెయ్‌... ఒక దేశానికి సంబంధించిన ఒక్క సినిమా అయినా చూడాలి. అన్నా కరేనినా నవల చదివితే మనకు ఆ మనుషుల ఉద్వేగాలు, చింతన, మనకుగా రూపుకట్టే వారి ముఖాల నీడలు తెలుస్తాయి. కానీ నిజంగా రష్యాలో మనుషులు ఎలా ఉంటారు? వాళ్లు వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి? వాళ్ల ఇండ్లు ఎలా ఉంటాయి? వీటిని సినిమాల్లోనే చూడగలం. సాహిత్యం మీద సినిమా పైచేయి సాధించే సందర్భం నా ఉద్దేశంలో ఇదొక్కటే. అందుకని టాంజానియా, నైజీరియా, ఇండోనేషియా, అజర్‌బైజాన్, అల్బేనియా, రొమేనియా, అర్మేనియా, ఇట్లా చూసుకుంటూ వస్తాను. వాటిల్లో కూడా మంచి సినిమాలు ఏమిటనేది వెతుక్కోవడానికి గూగుల్‌ ఉండనే ఉంది. చైనాలో కూడా భూమ్మీద గడ్డి మొలుస్తుంది, వాకిళ్లకు గేట్లుంటాయి, అక్కడక్కడా చిన్న నీటికుంటలుంటాయి అని అనుకోవడం వేరు, దృశ్యంగా చూడటం వేరు కదా. సినిమాలతో ఇంకో ఎడ్వాంటేజీ ఏమిటంటే, ఏ తైవాన్‌నో, వియత్నాంనో తెలుసుకోవడానికి అక్కడ వచ్చిన ఒక పుస్తకం చదవలేం. దానికి వెచ్చించాల్సిన టైము, ఓపిక ఎక్కువ. కానీ ఒక రెండు గంటల్లో ఒక సినిమా చూసేయగలం.

ఇవన్నీ చూసినదానికి బహుశా ఫలశ్రుతి లాంటిది మా ‘వెళ్లిపోవాలి’. ఇరానియన్‌ సినిమా, ముఖ్యంగా కియరొస్తామీ చూపిన అతి మామూలుతనం, టర్కీ దర్శకుడు న్యూరీ బిల్జే జైలన్‌ కదా క్లౌడ్స్‌ ఆఫ్‌ మేలో తన అమ్మానాన్న కజిన్లనే యాక్టర్లుగా వాడినట్టు తెలిసిన హింటూ, కొంత బ్రెస్సన్, కొంత ఎరిక్‌ రామర్‌... వీళ్లందరినీ మార్గదర్శకులుగా పెట్టుకొని, తీరా షూట్‌ సమయానికి వీళ్లందరినీ పక్కనపడేసి మాకు తోచినట్టు చేసుకుంటూపోతే తయారైన చిత్రరాజం వెళ్లిపోవాలి. మేము ఊహించని విధంగా తెలుగు సాహిత్యలోకం దాన్ని నెత్తిన పెట్టుకుంది. అందుకు చాలా హేపీ!

––––
ఫుట్‌నోట్‌:
(1). అయితే ఆరోజు అనూహ్యంగా ఆకాశం మబ్బుపట్టింది. అయినా మబ్బులు అంటేనే తేలిపోయేవి అని కదా. ఎవరైనా పిలవగానే బ్యాగును భుజాన వేసుకుని ఎగేసుకుని ఎందుకు పోతాము, అక్కడో పెద్దమనిషి తన హోదాను పక్కనబెట్టి చివరి కారు వచ్చేదాకా గేటు దగ్గర ఎందుకు నిలబడతాడంటే... ఏదో హ్యూమన్‌ ఇంటరాక్షన్‌ కోసం. ఇంకా ఏ రుబీనా పర్వీన్‌ లాంటివాళ్ల జీవితగాథో వినడం కొసరు.

Wednesday, January 5, 2022

సాహిత్యంలో సున్నితమైన గమనింపులు





 

రైటర్స్‌ మీట్‌

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, హైదరాబాద్‌
11–12 డిసెంబర్‌ 2021

(రైటర్స్‌ మీట్‌ నిర్వహించిన రెండు రోజుల శీతాకాల కథా ఉత్సవంలో సాహిత్యంలో సున్నితమైన గమనింపుల మీద మాట్లాడమన్నారు. ప్రత్యేకంగా ప్రిపేర్‌ అయ్యి, ఏవో పేపర్లు సమర్పించేలాంటి సమావేశాలు కావు కాబట్టి, ఆ ఉన్న సమయంలో నాకు గుర్తొచ్చిన మేరకు చెప్పాను. ‘కావు’ అని వాటి విలువను తగ్గించడం కోసం అనలేదు. వాటి ఉద్దేశమే ఇన్‌ఫార్మల్‌గా మాట్లాడుకోవడం. అది నాకు సౌకర్యం కూడా.
ఇందులో కొన్ని తప్పులు ఏమైనా ఉండొచ్చు కూడా. యధాతథ వాక్యాలు ఏమిటో తర్వాతైనా వెతికే పని పెట్టుకోలేదు. నేను మాట్లాడింది మాట్లాడినట్టే ఉంచేస్తున్నా. దీనివల్ల ఒక పాఠకుడి మెమరీ పరిమితులను కూడా అర్థం చేసుకోవచ్చు.)



సాహిత్యంలో సున్నితమైన గమనింపులు
----------------------------------------------------



ఎంత అసాంఘికంగానైనా మాట్లాడొచ్చు కదా.

ఫైట్‌క్లబ్‌ మీలో చాలామంది చూసేవుండొచ్చు. చూడనివాళ్లకు రికమెండ్‌ చేయదగిన సినిమా.
అమెరికా వాళ్లు మనకంటే ముందే మేల్కున్నారు కాబట్టి, ఈ ఆధునికత మీదా,  తెలియకుండానే ఆఫీసుల్లో క్యూబికల్స్‌కు పరిమితమైపోవడం మీదా, రిలేషన్స్‌లో ఏ ఉద్వేగాలూ లేకపోవడం మీదా, మనుషులు మనుషులుగా కాకుండా కేవలం వినియోగదారులుగా మారిపోవడం మీదా, గొప్ప వ్యాఖ్యానం అది.

అందులో ఒక సీన్‌ ఉంటుంది. టైలర్‌ డర్డెన్‌ ఫ్లైట్లో ఎయిర్‌ హోస్టెస్‌ను దాటుకుంటూ వెళ్లాల్సివచ్చినప్పుడు– ఆ సీట్ల మధ్యలో ఉండే చిన్న ఇరుకులో– ముందు వైపు భాగాన్ని రుద్దుకుంటూ వెళ్లడం మర్యాదనా, వెనకవైపు భాగాన్ని రాసుకుంటూ వెళ్లడం మర్యాదనా అని అడుగుతాడు.
(నౌ, ఎ క్వశ్చన్‌ ఆఫ్‌ ఎటికెట్‌. యాస్‌ ఐ పాస్, డు ఐ గివ్‌ యూ ది ఆస్‌ ఆర్‌ ద క్రోచ్‌?)

సినిమా మొదటిసారి చూసినప్పుడు ఎంత థ్రిల్‌ అయ్యానో చెప్పలేను. ఈ సినిమా ఎంత గుర్తుందో, ఈ ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ అంతే గుర్తుంది. ఒక చిన్న వాక్యం ఆ మొత్తం సినిమాకు ఈక్వేట్‌ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఆ రైటర్‌ ఎట్లా పట్టుకోగలిగాడు ఈ వాక్యాన్ని అని.
(ఈ సినిమాకు మూలమైన నవల– దాని పేరు కూడా ఫైట్‌ క్లబ్‌– అది నేను చదవలేదు– కానీ దాని రైటర్‌ చక్‌ పాలనిక్‌ రాసిన వాక్యాలే సినిమాలోకి కూడా వచ్చాయి.)

ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ద సీ– ఇందులో ముసలాయన చేపల వేటకు వెళ్లి వస్తూ, ఇసిరెలను అక్కడే పడవ దగ్గర పడేద్దామనుకుంటాడు. కానీ దొంగతనాన్ని చేయాలన్న టెంప్టేషన్‌ చూసినవారికి ఎందుకు పుట్టించాలని మనసు మార్చుకుని వాటిని పట్టుకెళ్లిపోతాడు.
తర్వాత జరిగిన పోరాటం, ఇవన్నీ సరే, కానీ ఈ ఒక్క వివరం హెమింగ్వేను నా వరకూ ఒక మెట్టు మీద ఉంచింది.

ఇది కుప్రిన్‌ రాళ్లవంకీ కథాసంపుటి అనుకుంటున్నా. ఇందులో కథనాయకుడు ఆమె ఇంటిముందు ఆగివుంటాడు. గుర్రం ఇంటిముందు నిలిపివుంటుంది. గుర్రపు డెక్కల అడుగుల్లో నిలిచిన నీటిలో చంద్రుడు కనబడుతుంటాడు. ఒక్కసారి గుర్రం కదలడం వల్ల చంద్రుడి నీడ ఆ నీటిలో చెదురుతుంది. ఎంత అందంగా చంద్రుణ్ని చూపించాడా అనిపించింది. ఆ రాత్రిపూట, చీకటి, ఇదంతా నాకు అట్లా గుర్తుండిపోయింది.

అన్నా కరేనినాలో డాలీ పిల్లాడిని తయారుచేస్తుంటుంది. చలికోటు గుండీ ఏదో ఊడివుంటే దాన్ని పీక్కుంటూ పిల్లాడు ఆడుతూవుంటాడు. ఒకసారి వారించి, రెండోసారికి దాన్ని తీసి తన జేబులో వేసుకుంటుంది డాలీ. ఈ దృశ్యాన్ని మామూలుగా కూడా రాయొచ్చు. ఒక తల్లి తన పిల్లాడిని తయారుచేస్తున్నట్టు. దీనివల్ల కథకు వచ్చే ఇబ్బంది ఏమీ వుండదు. ఇది లేకుండా కూడా ఆ లవ్‌స్టోరీ, ఆ డిస్కషన్‌ అంతా కూడా చేయొచ్చు. కానీ ఆ గమనింపు వల్ల ఆ సీన్‌కు జీవితం అనేది మరింత సన్నిహితంగా వస్తుంది. టాల్‌స్టాయ్‌ లాంటివాడు అట్లా కాకుండా రాస్తాడా?

చలం– జీవితాదర్శంలో– దేశికాచారి బీచిలో నడుచుకుంటూ వస్తాడు.
అంతకుముందు మాట్లాడిన మాటలకు జవాబుగా ఉన్న నవ్వుమొహంతో వచ్చాడంటాడు చలం. ఈ గమనింపును చలం ఎట్లా పట్టుకున్నాడా అనిపిస్తుంది. నన్ను చలానికి హుక్‌ అయ్యేట్టు కూడా చేసిన వాక్యం అనుకోవచ్చు.

కుటుంబరావు చదువు నవలలో– సుందరం తన స్నేహితుడు శివుడిని ఇంటికి రమ్మని పిలుస్తాడు. శివుడికి కూడా తనన్ని మార్కులు వస్తాయి కాబట్టి తనంతవాడు అనుకుంటాడు. కానీ తన కులం వల్ల తన పరిమితులు తెలిసినవాడు కాబట్టి శివుడు ఇంట్లోకి రావడానికి మొహమాటపడతాడు, దగ్గరికి వచ్చాక వాళ్లమ్మ చెరొక అప్పా ఏదో చేతిలో పెడుతుంది. ఆ మేరకే అయితే ఇది మామూలు విషయమే. కానీ శివుడి చేతిలో ఉన్నది కొద్దిగా మాడివుంటుంది. వివక్షను ఎత్తిచూపడానికి పెద్ద ఆర్భాటం చేయనక్కరలేదు. ఈ చిన్న వివరం మనసు చివుక్కుమనేలా చేస్తుంది.

అజయ్‌ ప్రసాద్‌ రాసిన ‘చల్లపరెడ్డి’ పాత్రగా ఉండే కథ– ఊళ్ల గురించి తెల్సినవాళ్లకు మాత్రమే అనుభవంలో ఉండే విషయం. ఊళ్లల్లో రాత్రిపూట సద్దు అనేది మణగదు. చిమ్మటలు, కప్పల రొద ఉంటూనే ఉంటుంది. ఇతను రాత్రి మూత్రానికని బయటకు వెళ్లి, మూత్రం పోస్తాడు. ఆ ధార కిందపడగానే ఒక్కసారి వాటి శబ్దం ఆగి, మళ్లీ మొదలవుతుంది. ఇలాంటి వ్యక్తీకరణ నేను ఇంకెక్కడా చదవలేదు. అజయ్‌ లోయ కథలన్నీ ఒకెత్తు, ఈ ఒక్క గమనింపు నా వరకూ ఒకెత్తు అనిపించింది.

ఖదీర్‌ పెండెం సోడా సెంటర్‌ కథలో– ఆ ఉప్పునీటి వాతావరణానికీ, ఆ కొత్తగా వచ్చిన సోడాకూ ఎలా మైత్రి కుదిరిందో చెబుతాడు. ఇలాంటి వాక్యం కథకు అదనపు విలువను జత చేస్తుంది. సబ్జెక్టు మీద కథకుడి పట్టు ఏమిటో చెబుతుంది.

మెహెర్‌ కథ– నాకు పేరు గుర్తులేదు. బయటి నుంచి పడుతున్న ఎండను కిటికీ వడగడుతున్నదని రాస్తాడు. ఆ ఊహే అనూహ్యం అనిపిస్తుంది. కిటికీలోంచి లోపలికి వచ్చే వెలుతురు మొత్తాన్ని నాకు ఒక బొమ్మ కట్టి చూపించినట్టుగా అనిపిస్తుంది.

శిరీష్‌ ఆదిత్య రాసిన 90స్‌ బ్లూస్‌ కథలో– చాలా ఏళ్ల తర్వాత కలిసిన వాళ్ల మామయ్యలో పెద్దతనం వచ్చిందని చెప్పడానికి ఆ పిల్లాడు చెంపల అంచుల్లో వచ్చిన సన్న ముడతలను గమనిస్తాడు (క్రోస్‌ ఫీట్‌). ఆ పరిణామాన్ని భలే పట్టుకున్నాడు కదా అనిపించింది.

వినడం వల్ల, జ్ఞానం వల్ల ఇలాంటి వ్యక్తీకరణలు రావు. గమనింపు వల్ల, ఆ అనుభవంలో ఉండటం వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. ఇవి లేకుండా కూడా ఆ విషయ బలం వల్ల మంచి కథ రాయొచ్చు. కానీ ఈ వివరాల వల్లే నాకు ఒక రచయిత శక్తి తెలుస్తుంది. వాళ్లు చదవాల్సిన వాళ్లా, మున్ముందు పక్కన పెట్టాల్సినవాళ్లా అనేది అర్థం అవుతుంది

పొద్దున లేచేసరికి గ్రెగర్‌ జామ్జా ఒక పెద్ద పురుగుగా మారిపోయివున్నాడన్న కాఫ్కా మెటమార్ఫసిస్‌లో రాసిన మొదటివాక్యం చదవగానే– బోర్హెస్‌? మార్క్వెజ్‌? ... ఇట్లా కూడా రాయొచ్చా అని ఆశ్చర్యపోయాడంటారు. అంటే రాయడానికి సంబంధించిన ఒక సంకెళ్లు ఏవో తెగిపోయినట్టు ఆయన ఫీలయివుంటాడు.

రాయడానికి సంబంధించి నాకు అంత మేలుకొలుపు అని చెప్పనుగానీ –
క్యాచర్‌ ఇన్‌ ద రై నవలలో హోల్డెన్‌ కింది పెదవును పైకి వంచి గాలి ఊదుతూ దుర్వాసనను చెక్‌ చేసుకుంటాడు. ఇట్లాంటిది కూడా రాయొచ్చా అనిపించింది.
ఇంత చిన్న విషయానికి, ఇంత సూక్ష్మమైన వివరానికి కూడా సాహిత్యంలో పట్టింపు ఉంటుంది, దానికి మనం విలువను ఇవ్వొచ్చు, అది విస్మరించాల్సిన విషయం ఏమీ కాదు అని ఒక నమ్మకం కుదిరింది. ఈ పుస్తకం మొత్తంగా కూడా అద్భుతం. ఇది వన్‌ ఆఫ్‌ మై ఫేవరిట్‌ బుక్స్‌ కూడా.

ఇది మన వాక్యం అన్నది ఒక్కటైనా రాయకుండానే మెడలో పది పురస్కారాలు పడినవాళ్లు ఉండొచ్చు. కానీ అట్లాంటివాళ్లు రచయితలుగా నా వరకూ ఏమీకారు. ఇట్లాంటి వాక్యం రాసినవాడు ఏ గుర్తింపు లేకుండా కూడా ఉండొచ్చు. ఇలాంటివాళ్లే నా హీరోలు.

(మీకు బాగా నచ్చిన గమనింపులను సెలబ్రేట్ చేయవచ్చు కామెంట్లలో👍)