Saturday, May 14, 2022

ఆశించని గౌరవం

 


(ఫొటో రైటప్‌: మేడి చైతన్య, శ్రీనివాస్‌ చౌదరి, పూడూరి రాజిరెడ్డి, మామిడి హరికృష్ణ, బి.అజయ్‌ ప్రసాద్, మెహెర్, శ్రీశాంతి)

 

ఏప్రిల్‌ 17, 2022
పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్, రవీంద్ర భారతి, హైదరాబాద్‌


ఆశించని గౌరవం
-----------------------

మొన్న ఆదివారం ఏప్రిల్‌ 17న రవీంద్ర భారతిలోని పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌లో మా ‘వెళ్లిపోవాలి’ సినిమాను ప్రదర్శించారు. పెద్దగా జనమేం రాలేదు. కానీ వచ్చినవాళ్లు మాత్రం సానుకూలంగా మాట్లాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరఫున ఈ థియేటర్‌లో మూడేళ్లుగా ‘సండే సినిమా’ పేరుతో ప్రపంచ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ విభాగంలో మొదటిసారి ఒక తెలుగు సినిమాను వేశారు. అది వెళ్లిపోవాలి కావడం ఆశ్చర్యానందం! సినిమా అయిన తర్వాత మమ్మల్ని మాట్లాడమన్నారు. నా స్పందన:

ఎక్కడో చదివాను, దోస్తోవ్‌స్కీ తన మొదటి నవలను పట్టుకెళ్లి ఒక సంపాదకుడికి ఇస్తాడు. ఆయన దాన్ని చదివి, ‘నువ్వేం చేశావో నీకు తెలుసా?’ అన్నాడట. సినిమా తీయడం సగం అయ్యాక మమ్మల్ని మేము బూస్టప్‌ చేసుకోవడానికి మెహెర్‌తో జోక్‌ చేశాను, ‘నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు’ అని. ఇంతా చేస్తే దోస్తోవ్‌స్కీ తొలి వర్క్‌కు వచ్చిన స్పందనే అది. సో Meher! నీ ‘కరమజోవ్‌ బ్రదర్స్‌’ ఇంకా ముందే ఉంది.

సినిమాను యూట్యూబ్‌లో పెట్టడానికి ముందు దీన్ని ఎక్కడైనా స్క్రీన్‌ చేస్తే బాగుండేమో అనుకున్నాం. కానీ మేమేమీ కమర్షియల్‌ సినిమా తీయలేదు. ఆ స్క్రీనింగ్‌ను పబ్లిసిటీగా వాడుకొని మనమేమీ డబ్బులు చేసుకోలేము. ఏదో అప్రిసియేషన్‌ కోసం చేశాము. ఇంకోటేందంటే, ఇట్లాంటి క్లెయిమ్‌కు రుజువులు చూపలేముగానీ బహుశా ప్రపంచంలో దీనంత మినిమలిస్ట్‌ సినిమా ఇంకోటి ఉండకపోవచ్చు. మరి ఒక్క షో స్క్రీన్‌ చేయడానికి పది, ఇరవై వేలు అవుతుందంటున్నారు. అలాంటప్పుడు సినిమాకు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ ఒక్క షో కోసం వెచ్చించడం అనేది దీని ఫిలాసఫీకే విరుద్ధం. అందుకే కామ్‌గా యూట్యూబ్‌లో పెట్టేశాం.

నేను నా మొబైల్‌ ఫోన్లో వంద సినిమాలు చూసివుంటాను. మంచి వరల్డ్‌ సినిమాలు! కాబట్టి పెద్ద స్క్రీన్‌ అనేదానికి ఇంకా అర్థం లేదు. కానీ శంఖంలో పోస్తే తీర్థం అయినట్టుగా, పెద్ద స్క్రీన్‌ మీద వస్తే సినిమా అయిపోతుంది. అట్లా దీన్ని ఇక్కడ ప్రదర్శించి సినిమా చేసిన, అదీ ఇంత మంచి స్లాట్‌లో వేసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సారథి Harikrishna Mamidi  గారికీ, సండే సినిమా నిర్వాహకుడు ప్రణయ్‌రాజ్‌ వంగరికీ, ఈ కార్యక్రమం జరగడానికి వారధిగా పనిచేసిన Akshara Kumarకూ మా టీమ్‌ తరఫున ధన్యవాదాలు.

Friday, May 13, 2022

సినిమాలు ఎలా చూస్తున్నాను?

 



ఫొటో రైటప్‌: 

(కింది వరుస) మహమ్మద్‌ ఖదీర్‌బాబు, కూనపరాజు కుమార్, వేమూరి సత్యనారాయణ, హెచ్చార్కె, వి.మల్లికార్జున్, అనిల్‌ అట్లూరి, రామరాజు, వి.రాజారాంమోహన్‌ రావు, సాయి పాపినేని.

(మెట్ల మీద కింది నుంచి పైకి) శాంత, జయ, సూజాత వేల్పూరి, ఉమా నూతక్కి, ప్రసాద్‌ సూరాడ, శ్రీనాథ్‌ రెడ్డి, శిఖామణి, మానస ఎండ్లూరి, రుబీనా పర్వీన్, చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ, మనోజ్ఞ ఆలమూరు, పూడూరి రాజిరెడ్డి)

 


ఏప్రిల్‌ 16–17, 2022

‘శాంతారామ్‌’, మన్నెగూడ



సినిమాలు ఎలా చూస్తున్నాను?
----------------------------------------


(మొన్న శని, ఆదివారాలు– అంటే ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో, మహమ్మద్‌ ఖదీర్‌బాబు నిర్వహణలో, మాజీ పోలీస్‌ అధికారి చిలుకూరి రామశర్మ– చదువరి శాంత దంపతుల ఆహ్వానం మేరకు వారింట్లో ఓ ఇరవై మంది మిత్రులం కలిశాం. పౌర్ణమి వెన్నెలను చూడటం అనేది దీనికి సాకు(1). ఇదొక ఉప రైటర్స్‌ మీట్‌ లాంటిది. అందుకే ప్రసంగాలు లేవు. ఒక్క హెచ్చార్కే గారూ(డయాస్పోరా సాహిత్యం), నేనూ మాత్రమే మాట్లాడాం. మా ‘వెళ్లిపోవాలి’ వచ్చిన తర్వాత, నన్నో సినిమాజీవిని చేసి, సినిమాల గురించి మాట్లాడమన్నారు. సాధికార వ్యాఖ్యానాలు నాకు చేతగావు కాబట్టి, నేను ఎలా సినిమాలను చూసుకుంటూ వచ్చానో చెప్పాను. రాత కొంత క్రమాన్ని డిమాండ్‌ చేస్తుంది కాబట్టి ఆ మేరకు స్వల్ప మార్పులు చేశాను. సారం మాత్రం అదే.)

నా తరఫు చాలామందిలాగే నేను కూడా చిన్నప్పుడు చిరంజీవి పిచ్చోణ్ని. ఆ పేరు తలుచుకుంటేనే వైబ్రేషన్‌ వచ్చిన రోజులున్నాయి. అసలు సినిమాలు బాగుండకపోవడం అనేది తెలీదు. బొమ్మ ఎదురుగా కనబడుతుంటే బాగోకపోవడం ఏంటి ఇంకా? ఇంటర్మీడియట్, డిగ్రీ దాకా రిలీజైన ప్రతి సినిమా చూడాలని అనుకునేవాణ్ని. అరే, వాళ్లు అన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసినదాన్ని మనం పది రూపాయలు ఇచ్చి చూడగలుగుతున్నాం కదా అని సంబరపడేవాణ్ని. చేతివేళ్ల మీద– బాలకృష్ణ సినిమా ఇదొచ్చిందీ, వెంకటేశ్‌ సినిమా చూశాను, నాగార్జునది చూశాను, తర్వాత మోహన్‌బాబు, రాజశేఖర్‌... జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌... అయితే అన్నీ చూసేసినట్టే! సంవత్సరంలో నూరు నుంచి నూటాయాభై దాకా చూసిన రోజులున్నాయి. ప్రతి రెండు రోజులకో సినిమా అనుకోవచ్చు. అసలు నేను బయటి ఖర్చు అంటూ పెడితే అది సినిమాకే. మళ్లీ థియేటర్లో ఏ సమోసానో ఎప్పుడూ కొనలేదు.

నేను న్యూస్‌ పేపర్లలో విధిగా చదివిన వాటిల్లో ఒకటి, ఏ థియేటర్లో ఏ సినిమాలు నడుస్తున్నాయి అనే సమాచారం. అవి చూడకపోయినా ఊరికే చదవడం కూడా బాగుండేది. అట్లా ఒకసారి కాచిగూడ పరమేశ్వరిలో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఉందని చూసి, పటాన్‌చెరు నుంచి పరుగెత్తుకొచ్చాను( అప్పటికి డిగ్రీ అయ్యి, తొలి ఉద్యోగంలో ఉన్నాను.) ఒక్క మార్నింగ్‌ షో మాత్రమే వేశారు. నేను రెండో రోజు వచ్చేసరికి అదీ తీసేశారు. ఎంత నిరాశపడ్డానో చెప్పలేను. ‘వేరే’ సినిమాలు అనుకునేవి కూడా చూడాలనే ఆకలి అప్పుడప్పుడే మొదలైంది. మణిరత్నం ఒక్కడే నేను అప్పటికి చూస్తున్న ‘వేరే’. సత్యజిత్‌ రే, శ్యామ్‌ బెనెగల్, ఇలాంటి పేర్లు తెలుసు. కానీ ఎప్పుడూ వాళ్ల సినిమాలు చూడలేదు. చూసే అవకాశం కూడా లేదు. కానీ లోలోన ఒక భయం ఉండేది. వీళ్ల సినిమాలు మనం చూడలేమేమో, మెల్లగా నడుస్తాయేమో, నచ్చకపోతే వాళ్లమీద గౌరవం పోతుందేమో అనుకునేవాణ్ని. కానీ ‘పథేర్‌ పాంచాలీ’ చూసిన తర్వాత, నా భ్రమలు పోయాయి. కమర్షియల్‌ సినిమాను ఎంతగా ఆనందించగలమో వీటిని కూడా అంతే హాయిగా చూడగలం అన్నది అర్థమైంది. వాటిని ఏ అంశాల్లో ఇవి అధిగమిస్తాయో, ఎందువల్ల ఇవి క్లాసిక్స్‌ అవుతాయో, ఎందుకు ఇలాంటివే ఒక దేశపు ప్రాతినిధ్య సినిమాలుగా నిలబడతాయో అన్నది మెల్లమెల్లగా తెలిసొచ్చింది.

జర్నలిజంలోకి వచ్చి, హైదరాబాద్‌లో ఉండటం మొదలుపెట్టాక ప్రత్యామ్నాయ సినిమాల తావులు తెలియడం మొదలైంది. గోథె జెంత్రమ్, అలయన్స్‌ ఫ్రాన్సైజ్, హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌... ఒకసారి ఓ ఇటాలియన్‌ సినిమాను లామకాన్‌లో వేస్తున్నారని తెలిసి వెళ్లాను. ఇలాంటి జాగాలు నాలాంటివాడివి కాదు అన్న బెరుకు ఎందుకో నన్ను వదలదు. స్క్రీనింగ్‌ ఎక్కడో అర్థం కావడం లేదు. బయట కనబడే తెర దగ్గర ఎవరూ లేరు. మొత్తానికి ఎవరినో అడిగితే, ముఖం విప్పార్చుకుని చూశాడు. తర్వాత అర్థమైందేమిటంటే, ఆయనే ప్రదర్శకుడూ, అప్పటిదాకా నేనే తొలి ప్రేక్షకుడినీ అని!

యూట్యూబ్‌ అనేది పెద్ద నిధి. బెర్గ్‌మన్‌ సర్వస్వం సహా నేను ఎన్నో అందులోనే చూశాను. సినిమా అనేది ఒక సముద్రం. వాటిల్లో ఏది ఎంపిక చేసుకోవాలి అనేదానికి నేను ఏం చేసేవాడినంటే, ఈ వందేళ్లలో వచ్చిన వంద గొప్ప సినిమాలు అని రకరకాల జాబితాలు ఉంటాయి. వాటి తోక పట్టుకుని పోయేవాడిని. రోజర్‌ ఎబర్ట్‌కు నచ్చిన సినిమాలు ఏమిటి? లేకపోతే ఏ స్కోర్సెసీ నోట్లోంచో ఫలానా సినిమా అని ఊడిపడితే అదేమిటో చూడాలనుకోవడం... ఇట్లా నాకు దొరికినవి చూసుకుంటూ వచ్చాను.

సినిమాలు చూడటంలో ఒక షిఫ్ట్‌ లాంటిది ఏమిటంటే– క్లాసిక్స్, ఇంగ్లిష్‌ సినిమాలు పక్కనపెట్టెయ్‌... ఒక దేశానికి సంబంధించిన ఒక్క సినిమా అయినా చూడాలి. అన్నా కరేనినా నవల చదివితే మనకు ఆ మనుషుల ఉద్వేగాలు, చింతన, మనకుగా రూపుకట్టే వారి ముఖాల నీడలు తెలుస్తాయి. కానీ నిజంగా రష్యాలో మనుషులు ఎలా ఉంటారు? వాళ్లు వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి? వాళ్ల ఇండ్లు ఎలా ఉంటాయి? వీటిని సినిమాల్లోనే చూడగలం. సాహిత్యం మీద సినిమా పైచేయి సాధించే సందర్భం నా ఉద్దేశంలో ఇదొక్కటే. అందుకని టాంజానియా, నైజీరియా, ఇండోనేషియా, అజర్‌బైజాన్, అల్బేనియా, రొమేనియా, అర్మేనియా, ఇట్లా చూసుకుంటూ వస్తాను. వాటిల్లో కూడా మంచి సినిమాలు ఏమిటనేది వెతుక్కోవడానికి గూగుల్‌ ఉండనే ఉంది. చైనాలో కూడా భూమ్మీద గడ్డి మొలుస్తుంది, వాకిళ్లకు గేట్లుంటాయి, అక్కడక్కడా చిన్న నీటికుంటలుంటాయి అని అనుకోవడం వేరు, దృశ్యంగా చూడటం వేరు కదా. సినిమాలతో ఇంకో ఎడ్వాంటేజీ ఏమిటంటే, ఏ తైవాన్‌నో, వియత్నాంనో తెలుసుకోవడానికి అక్కడ వచ్చిన ఒక పుస్తకం చదవలేం. దానికి వెచ్చించాల్సిన టైము, ఓపిక ఎక్కువ. కానీ ఒక రెండు గంటల్లో ఒక సినిమా చూసేయగలం.

ఇవన్నీ చూసినదానికి బహుశా ఫలశ్రుతి లాంటిది మా ‘వెళ్లిపోవాలి’. ఇరానియన్‌ సినిమా, ముఖ్యంగా కియరొస్తామీ చూపిన అతి మామూలుతనం, టర్కీ దర్శకుడు న్యూరీ బిల్జే జైలన్‌ కదా క్లౌడ్స్‌ ఆఫ్‌ మేలో తన అమ్మానాన్న కజిన్లనే యాక్టర్లుగా వాడినట్టు తెలిసిన హింటూ, కొంత బ్రెస్సన్, కొంత ఎరిక్‌ రామర్‌... వీళ్లందరినీ మార్గదర్శకులుగా పెట్టుకొని, తీరా షూట్‌ సమయానికి వీళ్లందరినీ పక్కనపడేసి మాకు తోచినట్టు చేసుకుంటూపోతే తయారైన చిత్రరాజం వెళ్లిపోవాలి. మేము ఊహించని విధంగా తెలుగు సాహిత్యలోకం దాన్ని నెత్తిన పెట్టుకుంది. అందుకు చాలా హేపీ!

––––
ఫుట్‌నోట్‌:
(1). అయితే ఆరోజు అనూహ్యంగా ఆకాశం మబ్బుపట్టింది. అయినా మబ్బులు అంటేనే తేలిపోయేవి అని కదా. ఎవరైనా పిలవగానే బ్యాగును భుజాన వేసుకుని ఎగేసుకుని ఎందుకు పోతాము, అక్కడో పెద్దమనిషి తన హోదాను పక్కనబెట్టి చివరి కారు వచ్చేదాకా గేటు దగ్గర ఎందుకు నిలబడతాడంటే... ఏదో హ్యూమన్‌ ఇంటరాక్షన్‌ కోసం. ఇంకా ఏ రుబీనా పర్వీన్‌ లాంటివాళ్ల జీవితగాథో వినడం కొసరు.

Thursday, May 12, 2022

నూరేళ్ల స్రవంతి



(ప్రచురణ: మే 9, 2022) 


మానవ అంతరంగపు సంక్లిష్టతను మహాద్భుతంగా చిత్రించిన మహారచయితలు ఎందరో ఉన్నారు. అయితే ఆ అంతరంగపు సంక్లిష్టతకు తగిన మరింత దగ్గరి రూపాన్ని సాహిత్య ప్రపంచం ఎప్పటికప్పుడు వెతుక్కుంటూనే ఉంది. అట్లా ఆధునిక వచనపు అత్యున్నత సృజనశీలతకు ప్రతి రూపంగా చైతన్య స్రవంతి టెక్నిక్‌ ఉద్భవించింది. ఆ సృజన ప్రక్రియలో శిఖరప్రాయమైన రచన – ‘ఉలిసేస్‌’ నవల. చైతన్య స్రవంతి అనగానే మొట్టమొదలు గుర్తొచ్చే ఈ నవలకు ఇది శతాబ్ది సంవత్సరం. 1922 ఫిబ్రవరి 2న దీని తొలి ఎడిషన్‌ వచ్చింది – జేమ్స్‌ జాయిస్‌ నలభయ్యో (1882–1941) పుట్టినరోజుకు సరిగ్గా అందేట్టుగా!

గ్రీకులో హోమర్‌ విరచిత ‘ఒడిస్సీ’ కావ్యానికి ఆధునిక రూపంగా ఐరిష్‌ రచయిత అయిన జేమ్స్‌ జాయిస్‌ ఆంగ్లంలో ఈ ‘ఉలిసేస్‌’ రాశాడు. ట్రోజన్‌ యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి తన రాజ్యమైన ఇతకాకు వెళ్తూ, పదేళ్లపాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, చివరకు అన్నేళ్లుగా తనకోసమే వేచివున్న భార్య పెనలోపి, కొడుకు తలామకస్‌ను చేరుకుంటాడు హోమర్‌ కావ్యనాయకుడు ‘ఒడిస్సీస్‌’. దీన్ని లాటిన్‌లో ఉచ్చరించే విధానం ‘ఉలిసేస్‌’. అదే పేరును తన నాయకుడికి ఎంచుకున్నాడు జాయిస్‌. నవలలోని లియోపాల్డ్‌ బ్లూమ్, ఆయన భార్య మోలీ బ్లూమ్, ఇంకా స్టెఫాన్‌ డిడాలస్‌... ఈ మూడు పాత్రలూ ‘ఒడిస్సీ’లోని ఉలిసేస్, పెనలోపి, తలామకస్‌కు ఆధునిక రూపాలు. అయితే ఈ సాధారణ మనుషులు ఎదుర్కొనే కష్టాలు మాత్రం రోజువారీ అతి అల్పమైన, ‘నీచమైన’ అంశాలే. 

ఈ నవల ఒక్కరోజులో 1904 జూన్‌ 16న ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌ కేంద్రంగా సాగుతుంది. లియోపాల్డ్‌ బ్లూమ్‌ ఆ ఒక్క సుదీర్ఘరోజులో ఉదయం లేచినప్పటి నుంచీ ఏ రాత్రికో కొంపకు చేరుకోవడం దాకా సాగే అనుభవాల సారం ఇది. పెంపుడు పిల్లి కోసం దుకాణంలో మాంసం కొనుగోలు చేయడం, పత్రికాఫీసుకు వెళ్లడం, ఒక చావుకు హాజరు కావడం, ఒక పుట్టుకను చూడటం, ఒక యూదుడిగా పరాయివాడి ముద్రను ఎదుర్కోవడం, మ్యూజియం దర్శించడం, తినడం, తాగడం, వ్యభిచార గృహం చేరుకోవడం, కొడుకు లాంటి తలామకస్‌కు తారసపడటం, ‘విశ్వాసం’ లేని భార్య గురించి క్షోభపడటం... ఈ ప్రతి సందర్భంలోనూ అతడి అంతరంగపు అగాథాలనూ, తాత్విక వివేచననూ, ప్రతి సూక్ష్మ వివరం సహా జాయిస్‌ దర్శింపజేస్తాడు.

నవల ఒక్క రోజులో జరిగేదైనప్పటికీ దీన్ని రాయడానికి జాయిస్‌కు ఏడేళ్లు పట్టింది. ఇరవైల్లో ఉన్నప్పుడు తన మాతృదేశంలోని పరిస్థితుల మీది విముఖతతో తనకు తాను స్వీయ బహిష్కరణ విధించుకున్నాడు జాయిస్‌. అట్లా ట్రీఎస్ట్‌(ఇటలీ), జ్యూరిక్‌(స్విట్జర్లాండ్‌) నగరాల్లో గడిపాక ప్యారిస్‌(ఫ్రాన్స్‌) చేరుకున్నాడు. ఆ మూడు నగరాల్లోనూ రచన సాగింది. ఒక విధంగా తనకు ఎంతో ఇష్టమైన డబ్లిన్‌ను దూరం నుంచి అపురూపంగా చూసుకున్నాడు. అందుకే అక్కడి ప్రతి వీధీ ఇందులో దర్శనమిస్తుంది. దీనిలోని కొన్ని భాగాలు 1920లో యూఎస్‌ మ్యాగజైన్‌ ‘లిటిల్‌ రివ్యూ’లో అచ్చయినాయి. అయితే అశ్లీలంగా ఉందన్న కారణంగా ఆ పత్రిక సంపాదకులు విచారణను ఎదుర్కొన్నారు. జరిమానా విధిస్తూ తర్వాతి ప్రచురణను నిలిపివేయమని ఉత్తర్వులిచ్చింది కోర్టు. గ్రేట్‌ బ్రిటన్‌లో కూడా ఇలాంటి నిందలే మోపారు. ఐర్లాండ్‌లో మాత్రం ఇది నిషేధానికి గురికాలేదు. దాన్ని ఎటూ చదివేది గుప్పెడు మంది; మళ్లీ దానికోసం నిషేధం అవసరమా అన్నది అప్పుడు వారి ఆలోచన. చాలాకాలం జాయిస్‌ను ఐర్లాండ్‌ పూర్తిగా సొంతం చేసుకోలేదు కూడా!

చివరకు ప్యారిస్‌లో ఇంగ్లిష్‌ పుస్తకాలు అమ్మే సిల్వియా బీచ్‌ దీన్ని ఏకమొత్తంగా పుస్తకంగా తెచ్చింది. ‘షేక్‌స్పియర్‌ అండ్‌ కంపెనీ’ పేరుతో పుస్తకాల దుకాణం నడిపేదామె. ప్రింటర్‌కు చెల్లించ డానికి తాను ప్రతి చిల్లిగవ్వా దాచానని పేర్కొంది. తానొక మాస్టర్‌ పీస్‌ను ప్రచురిస్తున్నానన్న నమ్మకం ఆమెను ముందుకు నడిపింది. పుస్తకం వచ్చాకా విమర్శలు ఆగలేదు. రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌ దీన్ని చెత్తగా కొట్టిపారేసింది. పైగా దీన్ని చదవడం ఏమంత సుఖమైన అనుభవం కాదు. అత్యంత సంక్లిష్టంగా ఉండి, శ్లేషలు, ప్రతీకలు, వ్యంగ్యం పరుచుకుని ఉంటాయి. అంతర్ముఖమైన గొంతుకలు వినిపిస్తుంటాయి; స్టెఫాన్, మోలీ అంతరంగాలు సహా. అందుకే ఆదరణ అంతంతే ఉండింది. అయినా జాయిస్‌ ‘కనీసం జనాల అభిరుచికి తగ్గట్టుగా కామాను మార్చడానికి కూడా’ ఇష్టపడలేదు. ఏమైనా నెమ్మదిగా తన మాతృదేశంతో సహా ప్రపంచమంతటా జేమ్స్‌ జాయిస్‌ ‘కల్ట్‌’ మొదలైంది. ‘చైతన్య స్రవంతి’ అనే పేరుతోనే తెలుగులో బుచ్చిబాబు ఈ టెక్నిక్‌ను పరిచయం చేయడానికి కథ రాశాడు. నవీన్‌ ఈ ప్రక్రియలో రాసిన నవలతో ‘అంపశయ్య’ నవీన్‌ అయ్యాడు.

2,65,000 పదాలు గల ‘ఉలిసేస్‌’ కష్టం అనే మాటతో జోడింపబడింది; నిజానికి అక్కడ ఉండాల్సిన మాట ఆనందం అంటాడు విమర్శకుడు స్టీఫెన్‌ ఫ్రై. ఈ నవల వీరాభిమానులు దీన్ని చదవడానికి కొన్ని మార్గాలు చెబుతారు: విమర్శలను చదవొద్దు, పుస్తకం చదవాలి. వేగంగా చదవొద్దు, గట్టిగా చదువుతుంటే దానికదే సజీవంగా ఆవిష్కృతమవుతుంది. నాలుగో అధ్యాయం చదవడానికి అవసరమైన క్లూస్‌ మూడో అధ్యాయంలో ఉండే డిటెక్టివ్‌ నవల కాదిది; కాబట్టి వరుస పెట్టి చదవాల్సిన పని కూడా లేదు. నెమ్మదిగా అందులో మునిగిపోతే ఇది ఇవ్వగలిగే పఠనాను భవాన్ని ఇంకో పుస్తకం ఇవ్వలేదు. ఒక్కటైతే గట్టిగా చెప్తారు. సులభంగా ఒక పుస్తకం చదివి పక్కన పెట్టేయాలనుకునేవారికి మాత్రం ఇది తగినది కాదు!

Wednesday, May 11, 2022

అంతా బానే ఉంది



(ప్రచురణ: ఏప్రిల్‌ 11, 2022)


చింతనాపరుడైన ఒక బాటసారి ఏవో యాత్రలు చేస్తూ మార్గమధ్యంలో అలసి కాసేపు విశ్రమిద్దా మనుకున్నాడు. అడవిలోని పిల్ల బాట అది. దగ్గరలోనే పుచ్చకాయల తీగ ఒకటి కనబడి, ఆకలి కూడా పుట్టించింది. మోయలేనంత పెద్ద కాయను ఒకదాన్ని తెంపుకుని, అక్కడే ఉన్న మర్రిచెట్టు నీడన కూర్చున్నాడు. ఏ పిట్టలు కొరికి వదిలేసినవో అంతటా మర్రిపండ్లు పడివున్నాయి. ‘‘ఈ తమాషా చూడు! అంత సన్నటి తీగకేమో ఇంత బరువైన కాయా? ఇంత మహావృక్షానికేమో ఇంతింత చిన్న పండ్లా? ఈ సృష్టి లోపాలకు అంతం లేదు కదా! పరిమాణం రీత్యా ఆ తీగకు మర్రి పండ్లు, ఈ చెట్టుకు పుచ్చకాయలు ఉండటం సబబు’’ అనుకున్నాడు.

ఆలోచిస్తూనే ఆ కాయను కడుపునిండా తిన్నాడేమో, ఆ మిట్ట మధ్యాహ్నపు ఎండ తన మీద పడకుండా చెట్టు కాపు కాస్తున్న దేమో, అటే నిద్ర ముంచుకొచ్చింది. మర్రిపండు ఒకటి ముఖం మీద టప్పున రాలినప్పుడు గానీ మెలకువ రాలేదు. ‘‘ఆ, నేను తలపోసినట్టుగానే ఆ కాయ దీనికి కాసి ముఖం మీద పడివుంటే ఏమయ్యేది నా పరిస్థితి? ఔరా, ఈ సృష్టి విలాసం!’’ అనుకుని చక్కా పోయాడు బాటసారి. ఏ దేశపు జానపద గాథో! ఏది ఎలా ఉండాలో అది అలాగే ఉందని సృష్టి క్రమాన్ని అభినందిస్తుంది.

పాలగుమ్మి పద్మరాజు రాసిన ఓ కథలో కూడా ఇంకా సున్నితం కోల్పోని కాంట్రాక్టర్‌ అయిన కథా నాయకుడికి ఇలాంటి సందేహమే వస్తుంది. ఆ కూలీలు ఎర్రటి ఎండలో ఆ ఇంటి నిర్మాణం కోసం చెమటలు కక్కడమూ, వారి తిండీ, వారి బక్కటి శరీరాలూ, వారి మోటు సరసాలూ, అరుపులూ, ఇవన్నీ చూశాక అతడికి ఊపిరాడదు. సాయంత్రం పని ముగించి, తిండ్లు తినేసి, ఎక్కడివాళ్లక్కడ ఆదమరిచి నిద్రలోకి జారుకుంటారు. కలత నిద్రలో ఉన్నాడేమో, ఆ రాత్రి వీస్తున్న చల్లటి గాలి ఎందుకో అతడిని ఉన్నట్టుండి నిద్రలేపుతుంది. దూరంగా ఆ వెన్నెల కింద తమదైన ఏకాంతాన్ని సృష్టించుకుని ఆనంద పరవశపు సాన్నిహిత్యంలో ఉన్న ఒక కూలీల జంటను చూడగానే అతడిలోని ఏవో ప్రశ్నలకు జవాబు దొరికినట్టు అవుతుంది. ప్రపంచం మనం అనుకున్నంత దుర్మార్గంగా ఏమీ లేదు అనుకుంటాడు. అసలైనదీ, దక్కాల్సినదీ ఈ భూమ్మీద అందరికీ దక్కితీరుతుందన్న భావన లోనేమో అతడు తిరిగి హాయిగా నిద్రలోకి జారుకుంటాడు.

ఈ భూమండలం నిత్య కల్లోలం. మూలమూలనా ఏదో అలజడి, ఏదో ఘర్షణ, ఏదో సమస్య, ఏదో దారుణం. శ్రీలంకలో బాలేదు, పాకిస్తాన్‌లో బాలేదు, ఉక్రెయిన్‌లో అంతకంటే బాలేదు. రష్యాలో మాత్రం బాగుందని చెప్పలేం. ఇక్కడ మనదేశంలో మాత్రం? ఇన్ని యుద్ధాలు, ఇన్ని సంక్షో భాలు చుట్టూ చూస్తూ కూడా ఈ లోకం బానేవుంది అని ఎవరూ అనే సాహసం చేయరు. కానీ ఎప్పుడు ఈ ప్రపంచం బాగుందని! కనీసం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉందని! ప్రపంచం దాకా ఎందుకు? వ్యక్తిగత జీవితంలో మాత్రం నేను బాగున్నానని గట్టిగా చెప్పగలిగేవాళ్లు ఎందరు? ‘నా ప్రపంచంలో అంతా బాగానే ఉంది’ అని అనుకోగలిగే వాళ్లెవరు? దీనివల్లే అసంతృప్తులు, కొట్లాటలు, చీకాకులు, ఇంకా చెప్పాలంటే అనారోగ్యాలు. అవును, అనారోగ్యం! ఇదొక్కటే ప్రపంచంలో అసలైన సమస్య. దీని ప్రతిఫలనాలే మిగిలినవన్నీ! మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఏ ప్రతికూలతకూ కారణం కాలేడు– అది ప్రపంచంలోనైనా, ఇంట్లోనైనా. అందుకే మనిషికి సర్వతో ముఖ ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యంతో సంతోషం కలుగుతుంది, ఆ సంతోషంతో ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే మనంబాగుంటాం. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది.

‘‘అనారోగ్యంగా పిలవబడే ప్రతిదాన్నీ మన శరీరంలో మనమే సృష్టించుకుంటాం,’’ అంటారు తొలితరం కౌన్సిలర్‌ లూయిస్‌ హే. బలమైన సంకల్పం, సానుకూల ఆలోచనలు తేగలిగే అనూహ్య మార్పులను గురించి ఆమె ఎన్నో పుస్తకాలు రాశారు. మన సమస్యలన్నీ మన అంతర్గత ఆలోచన విధానాల వల్ల కలిగే బాహ్య ప్రభావాలు మాత్రమేనని చెబుతారామె. నెగెటివ్‌ థింకింగ్‌ వల్ల బ్రెయిన్‌లో ఆటంకాలు ఏర్పడుతాయి; అక్కడ ఫ్రీగా, ఓపెన్‌గా సంతోష ప్రవాహం ముందుకు సాగ డానికి అవకాశం ఉండదంటారు. ఏ రకమైన ఆలోచనా విధానం ఏయే రకమైన జబ్బులకు కారణ మవుతుందో... దురద, చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, సైనస్, మలబద్ధకం, చిగుళ్ళ సమస్యలు, మైగ్రేన్‌... ఇలా పెద్ద జాబితా ఇస్తారు. అయితే ఏ రకమైన వ్యాధికైనా భయం, కోపం– ఈ రెండు మెంటల్‌ పాటరన్స్‌ మాత్రమే మూలకారకాలుగా ఉంటాయంటారు. మనల్ని మనం నిజంగా ప్రేమించుకోవడం, ఎదుటివాళ్లను నిందించి మన శక్తిని అంతా వదిలేసుకునే బదులు ఇవ్వాల్సిన ‘క్షమాపణ’ ఇచ్చేయడం, ఆమె సూచించే మార్గాలు.

ఈ ప్రేమకు సమస్త భూగోళాన్నీ హీల్‌ చేయగల శక్తి ఉందని ఆమె స్థిర విశ్వాసం. ‘‘మనం ఏది ఆలోచించాలనుకుంటామో, ఏది నమ్మాలనుకుం టామో, ఆ ప్రతి ఆలోచననీ, నమ్మకాన్నీ విశ్వం పూర్తిగా సమర్థిస్తుంది, అవి జరగడానికి సహకరి స్తుంది’’ అంటారు. ఈ సృష్టి మనకోసం మన జీవితాన్ని దాని సర్వశక్తితో డిజైన్‌ చేసేవుంటుంది. మనం సమస్యలు అనుకునేవి సృష్టి విన్యాసంలో అసలు సమస్యలే కాకపోవచ్చు. కానీ మన ప్రాణాలకు అవన్నీ నిజమే. ‘గజం మిథ్య, ఫలాయనం మిథ్య’ అని మన సాధారణ చూపుతో అనుకోలేక పోవచ్చు. కానీ ఈ సృష్టి అశాశ్వతత్వంపై ఒక ఎరుక ఉంటే, జీవితాన్ని చూసే తీరు మారిపోవచ్చు. జీవితంతో కొనసాగిస్తున్న ఒక ఘర్షణ ఏదో తొలగిపోవచ్చు. ఎక్కడో ఒకరు మరణిస్తున్నప్పుడు కూడా ఇంకెక్కడో ఎవరో పుడుతూనే ఉన్నారు!  

Tuesday, May 10, 2022

చదవడమే మొదలు...


(ప్రచురణ: మార్చ్‌ 14, 2022)


ఒకరోజు ఆన్‌ మోర్గాన్‌ తన బుక్‌షెల్ఫ్‌ చూసుకుంది. సుమారు ఇరవై ఏళ్ల గొప్ప కలెక్షన్‌ అది. కానీ ప్రధానంగా అన్నీ ఇంగ్లిష్, నార్త్‌ అమెరికన్‌ పుస్తకాలే. ఈ లండన్‌ నివాసికి ఏమాత్రమూ సంతృప్తి కలగలేదు. ‘ఇరవై ఏళ్లుగా చదువుతున్నానే! కానీ ఒక విదేశీ భాషా పుస్తకాన్ని నేను దాదాపుగా ముట్టుకోనేలేదు’ అనుకుంది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది, ప్రపంచంలోని దేశాలన్నింటికీ సంబంధించి కనీసం ఒక్క పుస్తకమైనా చదవాలని. ఐక్యరాజ్య సమితి గుర్తింపున్న 193 దేశాల జాబితా చూసుకుని తన యజ్ఞం మొదలుపెట్టింది. దీన్ని యజ్ఞం అనడం ఎందుకంటే, వీటన్నింటినీ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల!

ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటంటే– అన్ని దేశాల పుస్తకాలు సంపాదించాలి; డబ్బు, శ్రమ. ఒక దేశానిది ఒకటే అనుకున్నప్పుడు ఏది ఎంపిక చేసుకోవాలనే సమస్య ఉండనే ఉంది. క్లాసిక్స్, జానపదాలు, సమకాలీన సాహిత్యం, నవలలు, కథాసంపుటాలు, ఆత్మకథలు, బెస్ట్‌ సెల్లర్స్‌... ఎలా వడపోయాలి? జపాకు ప్రాతినిధ్యం వహించగలిగే పుస్తకం ఏది? ఏది చదివితే కువైట్‌ సరిగ్గా అర్థమవుతుంది? ఉత్తర కొరియా నుంచి ఎలాంటిది తీసుకోవాలి? ఏది చదివితే తోగో పరిచయం అవుతుంది? ఖతార్‌కు చేరువ కాగలిగే పుస్తకం ఏది? వీటన్నింటినీ మదిలో ఉంచుకుని, స్నేహితులు, తెలిసినవాళ్లు, ఔత్సాహికుల సాయంతో పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టింది.

అసలైన సమస్య ఇంకోటుంది. రోజువారీ పనులు మన కోసం ఆగవు. మోర్గాన్‌ వృత్తిరీత్యా పాత్రికేయురాలు. ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యం చేరాలంటే, అటూయిటుగా ఒక్కో పుస్తకం 200–300 పేజీలు ఉంటుందనుకుంటే, 1.85 రోజులో పుస్తకం చదివెయ్యాలి. చదవడంతోపాటు చిన్న సమీక్ష రాయాలనుకుంది. ఆ పుస్తకం ఎలాంటిదో చెబుతూ తన పఠనానుభవాల్ని కూడా జోడిస్తూ బ్లాగ్‌ రాసుకుంటూ పోయింది. భూటాన్, బెలారస్, మంగోలియా, బురుండి, మొజాంబిక్‌ లాంటి ఎన్నో దేశాల పుస్తకాలు ఆమె జాబితాలో ఉన్నాయి. ఇంతకీ భారత్‌ నుంచి ఏం తీసుకుంది? పదేళ్లు చదివినా భారతీయ వైవిధ్యభరిత సారస్వత వైభవపు ఉపరితలాన్ని కూడా చేరలేనని తనకు తెలుసంటుంది మోర్గాన్‌ . కానీ లెక్క కోసం ఎం.టి.వాసుదేవన్‌  నాయర్‌ మలయాళీ నవల ‘కాలం’ తీసుకుంది. అది ఆమెకు గొప్పగా నచ్చింది కూడా! తన పఠనానుభవాలన్నింటినీ కలిపి 2015లో ‘ద వరల్డ్‌ బిట్వీన్‌  టు కవర్స్‌: రీడింగ్‌ ద గ్లోబ్‌’ పుస్తకంగా ప్రచురించింది.

గతేడాది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్‌  లీ కూడా ఇలాంటి పనే చేసింది. కాకపోతే ఆమె ప్రయోగం వేరు. కోవిడ్‌ మహమ్మారి మొదలైన కొత్తలో బయటికి వెళ్లలేని జీవితంతో విసుగెత్తి ఆన్‌ లైన్‌  జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంది. దానికిగానూ తనలాంటి వారందరినీ ఆహ్వానిస్తూ, లియో టాల్‌స్టాయ్‌ మహానవల ‘యుద్ధము–శాంతి’ని సామూహిక పఠనం చేద్దామని పిలుపునిచ్చింది. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం, మొత్తంగా 85 రోజుల్లో వెయ్యికి పైగా పేజీల నవల పూర్తయ్యింది. తన పఠనానుభవాలను ‘టాల్‌స్టాయ్‌ టుగెదర్‌: 85 డేస్‌ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ పేరుతో పుస్తకంగా రాసింది లీ.

ఇరాకు చెందిన ప్రొఫెసర్‌ అజర్‌ నఫీసీ అనుభవం దీనికి భిన్నమైనది. ఆమె ‘రీడింగ్‌ లోలిటా ఇన్‌  తెహ్రాన్‌ ’ పేరుతో 2003లో పుస్తకం ప్రచురించింది. ఛాందస ప్రభుత్వంలో తనలాంటి ఉదారవాది ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజెప్పడమే రచన లక్ష్యం అయినప్పటికీ పుస్తకాల ఊతంగా తన అనుభవాలను చెప్పడం ఇందులోని విశేషం. కొన్ని పాశ్చాత్య రచనలను గురించి తన విద్యార్థులతో చర్చించే నేపథ్యంలో ఈ రచన సాగుతుంది. ఇందులో చర్చకు వచ్చే కొన్ని పుస్తకాలు: మదామ్‌ బావరీ(ఫ్లాబే), ద గ్రేట్‌ గాట్స్‌బీ(ఫిట్జ్‌గెరాల్డ్‌), ద డైరీ ఆఫ్‌ ఆన్‌  ఫ్రాంక్, ద ట్రయల్‌ (కాఫ్కా), ద అడ్వెంచర్స్‌ ఆఫ్‌ హకల్‌బెరీ ఫిన్‌ (మార్క్‌ ట్వెయిన్‌ ). మానవ లైంగికతను ప్రధానంగా చేసుకొన్న నబకోవ్‌ నవల ‘లోలిటా’ కూడా ఇందులో ఉంది. దాన్నే పుస్తక శీర్షికగా ఎంచుకోవడానికి కారణం – ఇరాన్‌  లాంటి దేశంలో ఉండే పరిమితులు, పరిధులు, ఆంక్షలను తెలియజెప్పడానికే!
పుస్తకాన్ని రాయడం గొప్పనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ దాన్ని చదవడంలో కూడా గొప్పతనం తక్కువా? ఒక వెయ్యి పేజీల మహత్తర గ్రంథరాజాన్ని చదవడం తక్కువ ప్రయత్నంతో కూడినదా? పైగా దాన్ని చదవడం వల్ల కూడా రచయిత అనుభవాన్ని జీవించగలుగుతున్నప్పుడు, ఉత్త పాఠకులుగానే మిగిలిపోతే మాత్రమేం? పైగా రచయిత పడే శ్రమ కూడా తప్పుతుంది. కానీ మోర్గాన్‌  లాంటి కొందరు పాఠకులు, కేవలం వారి పఠనానుభవం కారణంగా రచయితగా మారగలిగారు.

‘మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ రాసినప్పుడు, పాత్రికేయుడు కల్లూరి భాస్కరం ప్రధాన వనరు–శీర్షిక సూచిస్తున్నట్టుగా మహాభారతమే! ఇందులోని పరిశోధనా పటిమను తక్కువ చేయడం కాదుగానీ ప్రాథమికంగా అది ఒక సీరియస్‌ పాఠకుడు మాత్రమే చేయగలిగే వ్యాఖ్యానం. అలాగే ‘కన్యాశుల్కం పలుకుబడి’ని వివరిస్తూ మరో జర్నలిస్ట్‌ మందలపర్తి కిశోర్‌ గురజాడ పదకోశమే వెలువరించారు. సరిగ్గా చదవడానికి పూనుకోవాలేగానీ ప్రతి పుస్తకంతోనూ ప్రపంచాన్ని దర్శించవచ్చు; అలాగే ప్రతి పుస్తకంతోనూ ప్రపంచానికి పరిచయం కూడా కావొచ్చు. ఏ రచయితైనా పాఠకుడిగానే తన కెరియర్‌ను మొదలుపెడతాడని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా!
ఇప్పుడు మీ చేతిలో ఏ పుస్తకం ఉంది?