Friday, August 26, 2022

30 రోజుల్లో రచయిత

 


సమాజంలో భౌతికంగా మనిషి ఎదగగలిగే ఎన్నో హోదాలున్నాయి. కానీ ‘రచయిత’ కావడం అనేది వేరే లెవెల్‌. రాయడం వల్ల వచ్చే ‘రిటర్నులు’ ఏమిటనేవి ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేరు. అయినాకూడా కొందరు రాస్తూనేవుంటారు. రాయడం అనేది వారికి గాలి వీచినంత, పూవు పూచినంత, ప్రవాహం సాగినంత సహజం. 

రచయిత అనే ట్యాగ్‌ మనం ఊహించలేనంత పెద్దది. రచయిత అనగానే ఒక మేధావి, ఒక ఆలోచనాపరుడు, జీవితంలో అన్నీ చూసినవాడు అనే ఇమేజ్‌ కదలాడుతుంది. ఆటోమేటిగ్గా అది ఒక ప్రత్యేక గౌరవానికి కారణం అవుతుంది. అయితే రాసేవాళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. చదివేవాళ్లు తగ్గిపోయారు, పుస్తకాలు అమ్ముడు కావడం లేదు, అసలు ఎవరికైనా కాంప్లిమెంటరీ కాపీ ఇచ్చినా దాన్ని ఆసాంతం చదువుతారన్న ఆశ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత స్థితప్రజ్ఞుడైనా కొంత నిరాశ పడక తప్పదు. మరి ఇలాంటప్పుడు ఎవరైనా ఎందుకు రాయాలి?

అసలు ఏ రచయితకైనా తన పుస్తకాన్ని పాఠకులు చదవాలి, పుస్తకం అమ్ముడు కావాలి అని అంత పట్టింపు ఎందుకు? అని ఎదురు ప్రశ్నిస్తారు దీపక్‌ విలాస్‌ పర్బత్‌. ‘వెల్‌ డన్‌! యు ఆర్‌ హైర్డ్‌’, ‘ఎ మాంక్‌ ఇన్‌ సూట్‌’ లాంటి రచనలు చేసిన దీపక్, అచ్చయ్యే పుస్తకాల్లో 60–70 శాతం చదవనివే ఉంటాయంటారు. అందుకే అమ్మడానికి బదులుగా ఫ్రీ గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా పుస్తకానికి వచ్చే ఆ వందో, రెండు వందలో ఖరీదు కంటే కూడా ఎక్కువ సంపాదించవచ్చని చెబుతారు. ‘‘ఒక మోటివేషనల్‌ స్పీకర్‌గా మనం ఒక  కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్‌కు ఏ విజిటింగ్‌ కార్డో, బ్రోషరో ఇస్తే– మనం అక్కడినుంచి వచ్చిన మరుక్షణం అది చెత్తబుట్టలో పడిపోవచ్చు. పైగా అలాంటివి ఎన్ని ఇచ్చినా మన గురించి వాళ్లకు ఒక సరైన అంచనా రాకపోవచ్చు. అదే ఒక పుస్తకం ఇస్తే? బ్రోషర్‌ కంటే తక్కువ ఖర్చుతో ప్రింటయ్యే పుస్తకం మన గురించిన అత్యుత్తమ పరిచయ పత్రం అవుతుంది. ఆయన చదవకపోవచ్చు, ఊరికే ర్యాకులో పెట్టేయొచ్చు; కానీ ఇచ్చివెళ్లినవాడు ఒక రచయిత అనే ఇమేజ్‌ పనిచేస్తుంది. ఆ సైకాలజీతోనే మనం ఆడుకోవాలి,’’ అంటారు.

ఆ కారణంగానే పుస్తకాన్ని మీ ఎదుగుదలకు ఒక పెట్టుబడిగా వాడుకోండి అని సలహా ఇస్తారు కైలాశ్‌ సి.పింజానీ. ‘డేట్‌ యువర్‌ క్లైంట్స్‌’, ‘క్యాచ్‌ ద షార్క్‌’ లాంటి రచనలు చేసిన కైలాశ్‌... ఏ ఫీల్డ్‌ వాళ్లయినా ఎదగడానికి పుస్తకాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవచ్చునంటారు. ‘‘ఉజ్జాయింపుగా సమాజంలో తొంభై తొమ్మిది శాతం మంది రచయితలు కాలేరు. కాబట్టి, ఆ రాయగలిగేవాళ్లు అమాంతం ఆ ఒక్క శాతం బ్రాకెట్లోకి వచ్చేస్తారు. ఆ గుర్తింపే మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. మీరు రాకెట్‌ అనుకుంటే, పుస్తకం మీకు రాకెట్‌ లాంచర్‌ అవుతుంది,’’ అని చెబుతూ అర్జెంటుగా ఒక పుస్తకం రాసేయమని సలహా ఇస్తారు.

అంత అర్జెంటుగా ఎలా రాసేయడం? ముప్పై రోజుల్లో పుస్తకం ఎలా రాయాలో ఈ ఇరువురు సహచరులు ‘సూపర్‌ ఫాస్ట్‌ ఆథర్‌’ పేరుతో శిక్షణ ఇస్తుంటారు. ‘‘పుస్తకం నూటాయాభై పేజీలకు మించకూడదు. ఏ మనిషైనా రాయగలిగేవి మూడు ఏరియాలు: సొంతం జీవితంలోని డ్రామా, వృత్తిపరమైన అనుభవాలు, ప్రత్యేక ఇష్టాయిష్టాలు. పెద్దగా రీసెర్చ్‌ అవసరం లేని టాపిక్‌ ఎంచుకోండి. దాన్ని పది అధ్యాయాలుగా విభజించుకోండి. ప్రతి అధ్యాయానికీ పది ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోండి. ఒక ప్రశ్నను ఒక పేరాగా విస్తరించండి. దానికి జవాబును మూడు పేరాల్లో రాయండి. అంటే పది అధ్యాయాల్లో వంద ప్రశ్నలకు నాలుగు వందల పేరాలు అవుతాయి. రోజుకు ఐదు ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఇరవై రోజుల్లో వంద ప్రశ్నలు పూర్తవుతాయి. ఐదు రోజులు రీసెర్చ్‌కు వదిలేస్తే, ఇంకో ఐదురోజుల్లో మార్పులు చేర్పులు, కరెక్షన్స్‌ చేయండి. ముప్పయ్యో నాటికి ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ రెడీ! ఎగ్జామ్‌ హాల్లో ఇచ్చే మూడు గంటల సమయంలో మనకు ఇష్టం లేని పాఠాల మీద ఎన్నో అడిషనల్‌ పేపర్లు రాసివుంటాం. అలాంటప్పుడు మనకు ఇష్టమైన టాపిక్‌ మీద రాయడం ఎంత సులభం?’’ అంటారు కైలాశ్‌.

ఇలా మ్యాగీ నూడుల్స్‌లా వండే రచనలు ఎలా ఉంటాయో తెలీదు. బాగుండొచ్చు కూడా. అయితే కొందరు తెలుగు కవులు, రచయితలకు ఇవి కొత్త చిట్కాలు కాకపోవచ్చు. వాళ్లు ఇంతకంటే వేగంగా రాయగలరు; ఇంతకంటే బాగా ప్రమోట్‌ చేసుకోగలరు. తేడా అల్లా దీపక్, కైలాశ్‌ లాంటివాళ్లకు తమ విషయంలో ఒక పారదర్శకత ఉంది; మనవాళ్ల విషయంలో అదీ కనబడదు.

కేవలం నెమ్మదిగా రాయడం వల్లే ఒక రచన గొప్పదైపోదు. తన రాత మీద రచయిత ఎంత ప్రాణం పెడతాడన్నది ముఖ్యం. ‘యుద్ధము–శాంతి’ మహానవలను టాల్‌స్టాయ్‌ తొమ్మిదిసార్లు తిరగరాశాడట. ‘కరమజోవ్‌ బ్రదర్స్‌’ చదువుతున్నప్పుడు దోస్తోవ్‌స్కీ ఒక ఆధ్యాత్మిక జ్వర పీడితుడిలా కనబడతాడు. వాక్యంలో పెట్టాల్సిన ఒక్క కామా గురించి కూడా ఆస్కార్‌ వైల్డ్‌ తల బద్దలుకొట్టుకునేవాడట. యావజ్జీవితం సాహిత్యమే ఊపిరిగా బతికాడు చలం. జీవితకాలం రాసిన మొత్తం కూడా గట్టిగా ఒక పుస్తకానికి మించనివాళ్లు ఉన్నారు. వాళ్లు నిజంగా రచయితలు. కానీ ఇప్పుడు పుంఖానుపుంఖంగా వస్తున్న పుస్తకాలు కొన్ని చెట్ల ప్రాణాలు తీయడానికి తప్ప పనికిరావు. కాబట్టి రాసేవాళ్లందరూ రచయితలు కారు. వచ్చిన ప్రతిదీ పుస్తకం కాదు. దాన్ని వేరు చేసుకోగలగడమే పాఠకుల విజ్ఞత.

(సాక్షి ఎడిట్‌: 22 ఆగస్ట్‌ 2022)



Saturday, August 6, 2022

వ్యక్తి విషాదం


వ్యక్తి విషాదం


యుద్ధాన్ని నేను ద్వేషిస్తాను, అన్ని రూపాల్లోని యుద్ధాన్నీ నేను ద్వేషిస్తాను, అంటాడు ఆర్చెమ్‌ చపేయే. ఈ ఉక్రెయినియన్‌ రచయిత తనను తాను ‘పసిఫిస్ట్‌’ అని చెప్పుకొంటాడు. శాంతికాముకుడు అని ఈ మాటకు విస్తృతార్థం. యుద్ధం, హింస ఏ కోశానా సమర్థనీయం కావు అనేది ఇలాంటివాళ్ల భావన. పాపులర్‌ ఫిక్షన్, క్రియేటివ్‌ నాన్‌ఫిక్షన్‌ రచనలతో ఆర్చెమ్‌ ఉక్రెయిన్‌లో మంచి ఆదరణ ఉన్న రచయిత. నాలుగుసార్లు ‘బీబీసీ ఉక్రెయిన్‌ బుక్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఫైనలిస్టు. ఫొటోగ్రఫీ, విజువల్‌ స్టోరీటెల్లింగ్‌ మీద కూడా ఈమధ్యే మక్కువ పెంచుకున్నాడు. ఈమధ్యే అంటే ఉక్రెయిన్‌ మీద రష్యా దాడికి దిగకముందు. రాజధాని నగరం కీవ్‌ మీద బాంబుల మోత మొదలుకాగానే ఆయన చేసిన మొదటి పని, ముందు తన కుటుంబాన్ని అక్కడినుంచి సురక్షిత చోటుకు తరలించడం. రెండోది, యుద్ధంలో చేరడానికి తన పేరును నమోదు చేసుకోవడం. యుద్ధం మీద ఆర్చెమ్‌ అభిప్రాయాలు ఏమీ మారలేదు. కానీ అణిచివేత తనమీద మోపిన యుద్ధం కాబట్టి దీన్నుంచి పారిపోలేనంటాడు.
ఓలెహ్‌ సెన్‌త్సోవ్‌– రచయిత, దర్శకుడు. ‘క్రిమియా’ ఆయన స్వస్థలం.  ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియాను రష్యా తన అనుబంధంగా మార్చుకున్నప్పుడు చేసిన నిరసనలకుగానూ తీవ్రవాద ఆరోపణల మీద అరెస్టయ్యాడు. ఐదేళ్లు జైల్లో ఉన్నాడు. (బలవంతపు సప్లిమెంట్స్, మెడికేషన్‌ కలుపుకొని) 145 రోజుల పాటు చేసిన నిరవధిక నిరశనకుగానూ దాదాపు చావుదాకా వెళ్లొచ్చాడు. 2019లో నేరస్థుల బదిలీ ఒప్పందం మీద ఉక్రెయిన్‌కు వచ్చాక దాడి నేపథ్యంలో ‘ద సెకండ్‌ వన్స్‌ ఆల్సో వర్త్‌ బైయింగ్‌’ అనే వ్యంగ్య నవల రాశాడు. ఉక్రెయిన్‌లో 1990ల నాటి నేరస్థుల గ్యాంగుల నేపథ్యంలో సాగే ‘రైనో’ సినిమా 2020లో విడుదలైంది. దానికి సానుకూల సమీక్షలు వచ్చాయి. అయితే, మళ్లీ యుద్ధం మొదలుకాగానే ప్రాదేశిక భద్రతా దళంలో చేరిపోయాడు. ఇంకా ఈ జాబితాలో స్తానిస్లావ్‌ అసెయేవ్, క్రిస్టియా వెంగ్రీనియుక్‌ లాంటి ఉక్రెయిన్‌ రచయితలూ ఉన్నారు.
అమెరికా రచయితలు ఎర్నెస్ట్‌ హెమింగ్వే, ఇ.ఇ.కమ్మింగ్స్, టి.ఇ.లారెన్స్, జె.ఆర్‌.ఆర్‌.టోల్కీన్‌ లాంటివాళ్లు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. జె.డి.శాలింజర్‌ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జార్జ్‌ ఆర్వెల్‌ స్పానిష్‌ సివిల్‌ వార్‌లో పాల్గొని గాయపడ్డాడు. తెలుగు కవి, కథకుడు శిష్టా›్ల ఉమామహేశ్వరరావు; మరో రచయిత అంగర వెంకట కృష్ణారావు కూడా యుద్ధ అనుభవం ఉన్నవారే. అసలు కవిగానో, రచయితగానో ఉండటమే దానికదే ఒక యుద్ధం కదా!
ఈ రచయితలు మనకు గుర్తున్నది వాళ్లు పట్టుకున్న ఆయుధం వల్ల కాదు, వారి రచనల వల్ల. కాకపోతే అది వారికి ఒక అనుభవంగా పనికివచ్చింది. కానీ ఆ ‘అనివార్యత’ ఎంత దుర్మార్గమైనది? రాసుకోగలిగేవాడు రాసుకునే, ఆనందంగా నర్తించే అమ్మాయి నర్తిస్తూ ఉండగలిగే ప్రపంచాన్ని కోరుకోవడం మరీ అంత పెద్ద కోరికా? లేక, ఇంకో తలంలో వీటన్నింటికీ కారణం అవుతున్న ‘ఇంకో’ మనిషి బుద్ధి అంత చిన్నదా?
యుద్ధం అనేది ఏ ఒక్క రూపంలోనో ఉండదని అందరికీ తెలుసు. నేరుగా సరిహద్దు యుద్ధాలు చేయకపోయినా, భిన్నరకాల యుద్ధాల్లో ఎందరు తెలుగు కవులు పాల్గొనలేదు! భావజాల పోరాటాలు మాత్రం యుద్ధం కాదా? సమస్య ఏమిటంటే– ఈ యుద్ధాలు గీతకు అటువైపు ఉన్నావా, ఇటువైపు ఉన్నావా అని తేల్చుకునే విపత్కర పరిస్థితిలోకి మనిషిని నెడతాయి. దీనికి స్పందించడం తప్ప ఇంకో మార్గం ఉండదు. అప్పుడు సమూహంగా మాట్లాడటం తప్ప వ్యక్తికి విడిగా చోటుండదు. వ్యక్తి అనేవాడు లేకుండాపోవడం కంటే బౌద్ధిక విషాదం ఏముంటుంది?
అవసరాన్ని బట్టి మనిషి వ్యక్తిగానూ, సమూహంగానూ ఉంటాడు. కానీ సరిగ్గా అదే సందర్భంలో గీతకు అటువైపు ఉన్నవాడు కేవలం విడి మనిషిగానే ఉండదలిస్తే! నేటికి సత్యాలుగా కనబడివి, రేపటికి మబ్బుల్లా కదిలిపోవని ఎవరూ చెప్పలేరు. కానీ యుద్ధాలు, భావజాలాల్లో వర్తమానపు కెలేటరల్‌ డామేజ్‌ అనబడే అనివార్య నష్టం లెక్కలోకి రాదు. వీళ్ల వల్ల గాయపడ్డ ఆ ‘ఎదుటి’ మనిషి ఎవరో వీరికి ఎప్పటికీ సంపూర్ణంగా తెలియకపోవచ్చు. నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు చేసే లాఠీఛార్జీలో రెండు దెబ్బలు తినేవాడి నొప్పి ఎవరికీ పట్టదు. ఏ కోర్టులూ, ఏ ప్రజాసమూహాలూ దీనికి న్యాయం చేయలేవు. కానీ ఒక్కడు మాత్రం తన జీవితకాలం ఆ రెండు దెబ్బల బరువును మోయాల్సి వస్తుంది. ఆ చివరి మనిషి గాయానికి కూడా లేపనం పూయనంతవరకూ, అసలు ఆ మనిషికి గాయం కాని పరిస్థితులు వచ్చేంతవరకూ మనది నాగరిక సమాజం కాబోదు.
వేపచెట్టు మీద వాలి కూసేది ఒక కాకి కాదు. అది ‘ఫలానా’ కాకి మాత్రమే అవుతుంది. దాని కూతకు స్పందనగా వచ్చి జతకూడది కూడా ఇంకో కేవలం కాకి కాదు. అది మరో ఫలానా కాకి అవుతుంది. రెండూ వేర్వేరు కాకులు, ఇద్దరు వేర్వేరు సంపూర్ణ మనుషుల్లా. అవి వాలిన వేపచెట్టుకు కూడా మనం పేరు పెట్టివుండకపోవచ్చుగానీ అది కూడా దానికదే ప్రత్యేక యూనిట్‌. దానికదే యూనిక్‌. దాన్ని పోలిన చెట్టు, దానిలాగా కొమ్మలను విరుచుకున్న చెట్టు ఇంకోటి ఎక్కడా ఉండదు. మన ఇంట్లో మన కాళ్లకు తగిలే పిల్లిలాంటిది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. కానీ మనుషులే కేవలం సమూహ అస్తిత్వాలకు పరిమితమయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నప్పుడు, ఇంక పక్షులు, జంతువులు, చెట్లూ చేమలను కూడా విడిగా గుర్తించాలంటే మనిషి ఎంత సున్నితం కావాలి! ఎంత సూక్ష్మం కావాలి!

(1st August, 2022)