Showing posts with label కథాసారం: తెలుగు. Show all posts
Showing posts with label కథాసారం: తెలుగు. Show all posts

Thursday, November 28, 2024

మధురాంతకం రాజారాం కథ ‘జీవన్ముక్తుడు’


మధురాంతకం రాజారాం


మధురాంతకం రాజారాం(1930–99) కథ ‘జీవన్ముక్తుడు’కు సంక్షిప్త రూపం ఇది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన రాజారాం సుమారు నాలుగు వందల కథలు రాశారు.  నాకు నచ్చిన మధురాంతకం రాజారాం కథల్లో ఇదీ ఒకటి.

 

––––

జీవన్ముక్తుడు


మామంచిపురం నుంచి రామదుర్గం వెళ్లే అయిదు గంటల బస్సు ఆ సాయంకాలం గంట ఆలస్యంగా బయల్దేరింది. అప్పటికైనా బస్సు కదిలిందంటే అందుకు ముఖ్యకారకుడు బూరగమంద చెన్నారెడ్డి. రెడ్డి చెరువు క్రింద పొలంలో మడికోసి, బండపైన కుప్పలు పెట్టించి పదిరోజులయింది. కోసిననాటినుంచీ ఆకాశం చిల్లులు పడి పోయినట్టుగా జల్లులే జల్లులు. కరువులో అధికమాసం లాగా అర్జంటు కోర్టు పనొకటి అఘోరించింది. వాన తెరిపి ఇచ్చేది చూసుకుని, వాదె కొట్టి వడ్లు యింటికి చేర్చమని చెప్పిన తర్వాతనే బస్సెక్కాడు. పాలెర్లున్నూ నమ్మకస్తులే! (అయినా) అయిదారు వేల రూపాయల వరమానమాయె! రెడ్డి మనసు వడ్లరాశి చుట్టే గిరికీలు తిరుగుతోంది. ‘‘కేశవులూ! తొమ్మిదింటికల్లా నన్ను మా వూళ్లో దించేశావంటే నీ కొక కోడిపెట్ట ఇనాం’’ అంటూ డ్రయివరుకు బక్షీసు గూడా ప్రకటించాడు చెన్నారెడ్డి.

వరహాలయ్య ప్రాణం తుమ్మపాడులో, తన చిల్లరకొట్లో, మూడు నెలల క్రితం కొని స్టాకు చేసిన కొబ్బరికాయల చుట్టూ పల్టీలు కొడుతోంది. 

నంగమంగలం సుబ్బానాయుడి పరిస్థితి దయనీయంగా వున్నట్టు ఒప్పుకోవాలి. మార్కెట్టు ‘డౌను’గా ఉన్నందువల్ల ఏడాదినుంచీ ఆయన దగ్గర నూరు మూటల చెరుకు బెల్లం నిలవ వుండిపోయింది. ఆ గదిలోకి, మిద్దె పైభాగంలోనుంచీ ఓ రంధ్రం వుంది. వాన కురుస్తున్నప్పుడు గంటసేపు గనక ఆదమరిస్తే, కడవల్లోకి తోడి దిబ్బల్లో పారబోయడానికి తప్పితే ఆ బెల్లం మరొక సత్కార్యానికి పనికిరాదు.

వేగిరపాటయితే లేకపోవచ్చుగానీ మిగిలినవాళ్లు గూడా ఏవో ముఖ్యమైన పనుల మీద ప్రయాణం కడుతున్నవారే. నందవరం సీతారామయ్య ఓ పెళ్లి సంబంధం చూచిరావడం కోసం రామదుర్గం వెళ్తున్నాడు. పులిచెరువు నాగప్ప గిత్త బేరం కోసం పైడిమర్రికి పయనమయ్యాడు. అల్లుడికి అనారోగ్యంగా వుందని తెలిసి మల్లెల గురుమూర్తి ముత్యాలరేవుకు ప్రయాణం పెట్టుకున్నాడు. పోగా బజారు పనిమీద పట్నానికి వచ్చి, తిరిగి వెళ్తున్న సమీప గ్రామాల వాళ్లు గూడా ఏడెనిమిది మంది దాకా బస్సులో ఉన్నారు.

వెళ్లడమా, మానడమా అన్న విచికిత్సలో బడి, మానుకోవడం వైపే మొగ్గుజూపుతూ టీస్టాల్లో బైటాయించిన కండక్టరు నారాయణ ఏకధాటిగా బస్‌ హారన్‌ గొంతు చించుకోడంతో త్రుళ్లిపడి, పరుగునా వచ్చి బస్సెక్కేశాడు.

ఊరి శివారు దాటుకునేసరికి బస్సు సవ్వడితో శ్రుతి కలుపుతూ వానజల్లు ప్రారంభమైంది. నల్లటి మబ్బుల ఆవరణ క్రింద చూస్తూ చూస్తూ వుండగానే ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. కండక్టరు టికెట్లు ‘బుక్‌’ చెయ్యడం ముగించి, తెరలన్నీ దిగ విడిచి, వెళ్లి వెనకసీట్లో ఒంటిగా కూచున్నాడు.

బీభత్సంగా వున్న వాతావరణంలో నిమ్మకు నీరెత్తినట్టు కూచోవడం ప్రయాణీకులకు చేతగావడం లేదు. తుమ్మపాడు వరహాలయ్యకైతే ఎవరితోనైనా బిగ్గరగా మాట్లాడకపోతే మతిపోయేటట్టే వుంది. మాటల్లోకి దింపదగిన వ్యక్తికోసం చేస్తున్న అన్వేషణలో చూపులు మూడో వరసలో కూచున్న సన్యాసిపైకి వ్రాలాయి. బస్సంతా కలయజూచినప్పుడు సన్యాసి ఉనికిని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నవి అతడు ధరించిన కావి రంగు దుస్తులు. స్వాములవారిని దూరం నుంచి మాట్లాడించడం బాగుండదనిపించి వెళ్లి ఆయనకెదురుగా వున్న సీట్లో కూర్చున్నాడు.

‘‘స్వామీ! ఏ పని చేసుకోవడానికైనా యిబ్బందిగా వుంది. ఈ వానయోగం యింకెన్ని రోజులుంటుందంటారు?’’ సర్వప్రపంచానికి తానే ‘గార్డియన్‌షిప్‌’ పుచ్చుకున్నట్టుగా విజ్ఞాపన చేసుకున్నాడు వరహాలయ్య.

‘‘నాయనా! ఏదెప్పుడొస్తుందో, ఏదెప్పుడు పోతుందో చెప్పడానికి మనం కర్తలమా? అంతా వాడి లీల.’’

వాడి లీల కనీసం తమకైనా తెలియదా స్వామీ– అని మనసులోనే గింజుకున్న వరహాలయ్య ‘‘తమరెందాకా వెళ్తున్నారు స్వామీ’’ అంటూ ప్రసంగాన్ని యింకొక వైపు తిప్పాడు.

‘‘నువ్వెక్కడికి బాబూ?’’ ప్రశ్నకు ప్రశ్న ఎదురైంది.

‘‘నాగులేటికా ప్రక్కన తుమ్మపాడుంది గదండీ! అదే మా వూరు.’’

‘‘అయితే నీకీ బస్సు తుమ్మపాడు దాకా వెళ్తే చాలు. అంతే కదూ?’’

‘‘అంతేనండి. రోడ్డులో బస్సు దిగితే ఓ అరమైలు ఉంటుందండి. చక్కా నడచి వెళ్లిపోగలను’’

‘‘బస్సందాకా వెళ్తే చాలునని నువ్వనుకుంటావు. ఆ తరువాత యిదేమైపోయినా నీకు దిగులుండదు...’’

‘‘అబ్బే, నేను చెప్పడం...’’

‘‘ఉన్నమాట చెప్పుకోడానికి ఉలుకెందుకు? నువ్వే కాదు. మనుషులందరూ యింతే. ఏమంటావు పెద్దాయనా?’’

వరహాలయ్య కూచున్న సీట్లోనే ఓ మూలగా ఒదిగి కూర్చున్న ముసలి వ్యక్తి ఉలిక్కిపడ్డాడు. స్వాములవారు హఠాత్తుగా తన నిలా పలకరించే సరికి ఏం చెప్పాలో తోచక తడబడిపోతూ ‘‘స్వాములూ! మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలీడం లేదండీ! నే నచ్చరం ముక్క రానోణ్ని. ఎద్దుల్ని కొట్టి, ముద్దలు తింటూ బతికినోణ్ని’’ అంటూ స్వవిషయం తేటతెల్లంగా చెప్పుకున్నాడు.

స్వాములవారితో తన ప్రసంగం సజావుగా కొనసాగేటట్టు లేదని, ప్రక్కన కూర్చున్న పామరుణ్ని మాటల్లోకి దించడమే వరహాలయ్యకు మేలనిపించింది. కొరకరాని కొయ్యకంటే చొప్పదంటయినా మేలే.

‘‘ఏమయ్యా పెద్దాయనా! ఏవూరు మీది?’’

‘‘నాదా బాబూ! పుట్టింది పెదరావూరు. పెరిగింది తిమ్మసముద్రం. పెళ్లాడింది పాతకోట. గంజి కరువొచ్చినప్పుడు వలసబోయింది తూరుపుగడ్డ. ఏవూరని యివరమడిగితే ఏం జెబుదును బాబయ్యా? కలిగిన మారాజుకైతే ఒకటే వూరు. లేని బీదోడికి ఎక్కడ పొట్ట గడిస్తే అదే వూరు...’’

ఇదేమీ చొప్పదంటు కాదురా బాబో అనుకున్నాడు వరహాలయ్య.

‘‘మరైతే అన్ని వూళ్లూ చెప్పావేగానీ, యిప్పుడెళ్తున్న దేవూరో చెప్పలేదే!’’

‘‘అదేదో మంచి వూరే బాబూ. నోటికి రావడం లేదు. ఎల్లమంద వెళ్లే బస్సెక్కితే పదిహేనో మైలురాయి కాడ వుంటుందండి. ఆ వూళ్లో రాంకోటిగారని... ఓ యబ్బో, పెద్ద సావుకోరంట, ఆయన కొబ్బరితోటలో కాపుదారిగా వుంటానికని వెళ్తున్నాను. రామ్మూర్తి పంతులుగారు సీటీ రాసిచ్చార్లెండి’’

దారి పొడుగునా దిగేవాళ్లేగానీ బస్సెక్కే ప్రయాణీకులు కానరావడం లేదు.

‘‘ఏమయ్యో కండక్టర్‌! లింగాలబావి దాటగానే చెప్పమన్నాను. నేను కుమ్మరోళ్ల సత్రం దగ్గర దిగెయ్యాలి’’ అంటూ ఒకరు–

‘‘ముదినేపాడు చెరువు మరవ దగ్గర నన్ను దింపుతావు గదూ’’ అంటూ వేరొకరూ–

‘‘అయ్యా, ప్యాసెంజర్లూ! అప్పటికి మీవి సాదా కళ్లున్నూ, నావి ఎక్స్‌రే కళ్లా? మిన్నూ మన్నూ నల్లటి తెర గుడ్డలా అలుక్కుపోయిందయ్యా! ఎవరు దిగాల్సినచోటు వాళ్లే గమనించుకోవడం మంచిది’’ కండక్టరు చిచ్చుబుడ్డిలా ప్రేలిపోయాడు.

జరుగుతున్న ప్రసంగం వల్ల వరహాలయ్య కొక విషయం తెలిసివచ్చింది. బస్సింకా లింగాలబావి, కుమ్మరోళ్ల సత్రం దాటలేదు. ఈ మసలోణ్ని యింకొక ట్రిప్పు మాటల్లోకి దింపితే నాలుగైదు మైళ్ల దూరం వెళ్లిపోవచ్చు.

‘‘అయ్యో పాపం. వయసుడిగిన రోజుల్లో పొట్టపూడ్చుకోడం కోసం ఊరు కాని వూరు వెళ్తున్నావు. నీకు నా అన్న వాళ్లెవరూ లేరేమయ్యా పెద్దాయనా?’’

పళ్లులేని బోసినోటితో ముసలతను నవ్వుకున్నాడు. ‘‘గంపెడు బిడ్డల గంగన్నను పట్టుకుని ఎంత మాటన్నారండీ బాబుగోరూ!’’

‘‘అట్లాగా! ఎందరయ్యా నీకు పిల్లలు?’’

‘‘పెద్దోడు వరదయ్య. పాణ్యం సిమెంటు పాక్టరీలో పన్జేసుకుంటున్నాడు. రెండోవోడు రామాంజులు. బండీ, కాడెద్దులు పెట్టుకుని సంత యాపారం జేస్తున్నాడు. మూడోవోడు నాదముని. కరెంటు పన్జేస్తాడు. నాలుగోవోడు దరమయ్య. తాలూకాఫీసులో బిళ్ల బంట్రోతు. కడగొట్టోడు ముక్కంటి. కొడుకుల సంగతి సెప్పానా! కూతుళ్లు ముగ్గురండి. పెద్ద కూతుర్నిచ్చింది చీనెపల్లె. రెండో కూతుర్ని కొండపాలెంలో యిచ్చాను. మూడో కూతుర్ని కాపురానికి పంపి ఆరునెల్లయింది.’’

చిక్కావురా మిడతంబొట్లూ అనుకున్నాడు వరహాలయ్య. ‘‘ఎందరుండి ఏంలాభం లేవోయ్‌ గంగన్నా?’’

‘‘బతికినంతకాలం ఒకిరికి పెట్టినోణ్నేగానీ, ఒకరి తిండి తిన్నోణ్నిగాను. వాళ్ల బతుకు వాళ్లు బతుక్కుంటున్నారు. జానెడు పొట్ట కోసం ఒకర్ని కాపెట్టుకుని కూచుంటామా?’’

వరహాలయ్య విస్తుపోయాడు. ‘ఇల్లు లేదు, వాకిలి లేదు, కట్టుకున్న పంచ, పైన వేసుకున్న గొంగడీ తప్పితే యింకొక బట్ట లేదు. అయినా ఈ ఎముకల గూడులో ఎంత ధీమా ఏడ్చిందిరా బాబూ!’

బస్సు ముదినేపాడు చెరువుకట్ట దాటుకునేసరికి వాన వెలిసిపోయింది. ఆకాశాన నక్షత్రాలు కూడా కానరాసాగాయి. ‘ఇంకెంతదూరం మూడు మైళ్లే గదా’ అనుకున్నాడు వరహాలయ్య. ఆ మూడు మైళ్ల దూరం గూడా పది నిమిషాల్లో గడిచిపోయింది.

డ్రయివరు నాగులేటిగట్టున బస్సు నిలబెట్టి ‘‘ఏటిలో నీళ్లొస్తున్నాయే’’ అన్నాడు.

‘‘ఫరవాలేదులే! వానవొస్తే ఏటికెల్లవ రావడం మామూలే. ఒక్క బిర్రున నువ్వు ముందుకు వెళ్లిపోవయ్యా కేశవులూ’’ హుషారిచ్చాడు చెన్నారెడ్డి.

‘‘అవునవును’’ అన్నాడు సుబ్బానాయుడు.

‘‘వరద ఎక్కువగావచ్చు. తొందరగా వెళ్లిపోవడం మంచిది.’’

‘‘తనకే తెంపుండాలిగానీ డ్రయివరుకు మనం ధైర్యం చెప్పాలంటే అవుతుందా?’’

– డ్రయివరు ఏదో పూనకం వచ్చినవాడిలా బస్సును స్టార్టు చేసి నీటిపైకి వదిలేశాడు. ‘పోనీ పోనీ, ఉండు వుండుండు’ గావుకేకల మధ్య బస్సు సుడిగుండంలో స్తంభించిపోయింది. ముందువైపు ఇంజనులోకి, వెనుక వైపున్న ప్రవేశద్వారం లోనుంచీ ప్రవాహజలం చొచ్చుకురాసాగింది. మృత్యుభయం శరీరంలోకి విద్యుత్తులాంటి శక్తిని రవాణా చేస్తుందేమో. ఏ దారిగుండా వెలుపలికి వచ్చారో, ఏవిధంగా పైకి పాకిపోయారో క్షణాలలోగా ప్రయాణీకులందరూ బస్సు టాపుపైన వున్నారు. తడి ఆరిపోయిన నాలుకలతో, నిలువునా కంపిస్తున్న శరీరాలతో. అర్ధరాత్రి కావొచ్చేసరికి నీటిమట్టం యింకొక అడుగు పైకి లేచింది.

‘‘ఈ చావు గడియల్లోనైనా ఒక మంచి మాట చెవిలో వేస్తారా స్వామీ’’ దీనంగా అర్థించాడు చెన్నారెడ్డి. స్వాములవారు ఆకాశం వైపు చూసారు.

‘‘ఏదైనా మంత్రోపదేశం చేసినా సరే. చివరి క్షణాల్లో జపిస్తూ కళ్లు మూస్తాము’’ నందవరం సీతారామయ్య మరింత ప్రయోజనకరమైన ప్రతిపాదన చేశాడు.

‘‘ఇదొకరు చెప్పగా యింకొకరు వినడానికి తగిన పరిస్థితి కాదు. మీ మీ తీరని కోరికలేవో చెప్పుకుంటే, ఆ బంధం నుంచి విముక్తి పొందవచ్చు.’’

‘‘రెండో పంట కోసం చెరువు క్రింద ఒక బావి తవ్వించి పంపుసెట్టు పెట్టించాలనుకున్నాను’’ చెన్నారెడ్డి.

‘‘కాశీ, రామేశ్వరం చూసి రావాలనుకున్నాను. నాకంత అదృష్టం గూడానా’’ సుబ్బానాయుడు.

ఒక్కొగానొక్క కూతురుకు కడుపున కాయగాయక పోవడం సీతారామయ్యకు తీరని చింత.

మడిచిన గొంగళి తలక్రింద పెట్టుకుని గంగన్న గుర్రుపెడుతూ గాఢంగా నిద్ర పోతున్నాడు.

‘‘మరైతే స్వామీ! తమ తీరని కోరికేమిటో’’

‘‘అబ్బే మాకేం కోరిక. మేం కోరుకునేది ముక్తి. ఈ కట్టె కడతేరిన తర్వాతనే గదా అది లభించేది’’ అన్నాడు.

‘‘బ్రతికుండగా ముక్తి లభించదా స్వామీ?’’

స్వాములవారు ఏదో చెప్పబోయి, గంగన్న ముఖంలోని ప్రశాంతతను గమనించినవారై మౌనముద్రలోకి జారిపోయారు.

తెల్లవారేటప్పటికి వరద తగ్గుముఖం పట్టింది. ‘ఏమయ్యా పెద్దాయనా! నిండుగా పారుతున్న ఏటిలో నీకెలా నిద్ర పట్టింది?’’ అని తోడి ప్రయాణీకుడెవరో ప్రశ్నిస్తే, గంగన్న సిగ్గుతో బుర్ర గోక్కుంటూ ‘‘పదిమందితో సావంటే, పెళ్లితో సమానం గదా’’ అంటుండటం వినిపించింది.


(సాక్షి సాహిత్యం; 13 ఆగస్ట్‌ 2018)








 

Monday, November 25, 2024

నల్లజర్ల రోడ్డు

 


తిలక్‌


బాలగంగాధర తిలక్‌(1921–66) ‘నల్లజర్ల రోడ్డు’ సంక్షిప్తం ఇది. ఈ కథ ఆంధ్రపత్రిక ప్లవ సంవత్సరాది సంచిక(1961)లో ప్రచురితం. కథకుడు కూడా అయిన తిలక్‌ కవిగా మరింత ప్రసిద్ధుడు. ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. ‘అమృతం కురిసిన రాత్రి’ ఆయన కవితల సంకలనం.

––––

అడవి సాయానికి నాగరిక కృతజ్ఞత


ఏలూరులో చూసుకోవాల్సిన పని అయిపోయింది. ప్లీడరు గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక కారు స్టార్టు చేశాడు రామచంద్రం. రాత్రి పది దాటింది. సరిగ్గా తొక్కితే గంటన్నరలో తణుకులో ఉండొచ్చు.

కలెక్టరు గారింట్లో పెళ్లి సరీగా ఉదయం ఏడు గంటలకి. నాగభూషణం మీదా, రామచంద్రం మీదా భరోసా వేసుకుని కూర్చున్నారు కలెక్టరు గారు.  కలెక్టరు గారింట్లో శుభకార్యమంటే వేరే చెప్పాలా!

రామచంద్రం పెద్ద టెన్నీస్‌ చాంపియన్‌. కాలవ ఒడ్డున పెద్ద మేడవుంది. నాగభూషణం కలప వ్యాపారం నడుపుతున్నాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరే. భూషణం అల్లుడు అవధాని కూడా వాళ్లెంబడి వున్నాడు. ఇంకా కుర్రాడు.

ఆరుమైళ్లు వచ్చేప్పటికి కారు ఆగిపోయింది. రామచంద్రం దిగి బానెట్‌ తీసి చూశాడు. ‘వెధవ కారులా ఉంది. నడచి వెనక్కి పోదాం పద’ అన్నాడు నాగభూషణం.

‘అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగానీ యీ కారుని తిడితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు రామచంద్రం. కారు కిందా మీదా ఏవో పరీక్ష చేశాడు. చివరికి ఆల్‌రైట్‌ అంటూ కారులో కూర్చున్నాడు.

ఎర్రని పొడుగాటి రోడ్డు మీద కారు వెళుతూంటే చల్లని గాలి మొహానికి కొడుతోంది. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాల లాగా నక్షత్రాలు మెరుస్తున్నాయి. 

మళ్లీ కారు సడెన్‌గా ఆగిపోయింది. రామచంద్రం విసుగ్గా దిగాడు. బానెట్‌ తీసి పరీక్షించాడు. ‘సరిగ్గా కనపడడం లేదు యీ గుడ్డి వెన్నెలలో’ అన్నాడు. అంతవరకూ వెన్నెల ఉన్నట్టు అవధానికి అనిపించలేదు. ఆకాశం కేసి చూశాడు. జేగురు రంగుగా ఉన్న చంద్రుడి మీద పల్చని మబ్బులు తారాడుతున్నాయి. దారి వెంట వెళ్తున్న ఆసామీలు గీసిన అగ్గిపుల్లల వెలుగులో ఏదో మరమ్మత్తు చేశాడు రామచంద్రం. బయలుదేరుతుండగా, ఆసాములు ‘జాగ్రత్త బాబూ. అడవిలో ఏదో చిరుతపులి’ ఉందన్న కబురును చెవిన వేశారు. దాన్ని కొట్టేస్తూ, ఏక్సిలేటర్‌ మీద కాలు నొక్కాడు రామచంద్రం. కారు రయ్యిమని దూసుకుపోయింది. ‘అడవి వచ్చేసింది. ఇది దాటితే యింక పదిహేను మైళ్లు తణుకు’ అన్నాడు రామచంద్రం. నాగభూషణం వెనక్కి జేర్లబడి నిద్దరోతున్నాడు. అవధాని దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తున్నాడు. అంతా కటిక చీకటి.

ఇంజన్‌లో ఏదో ఠప్‌మని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఒక గంతు వేసి ఆగిపోయింది. రామచంద్రం దిగి పనిముట్లు టిక్‌టిక్‌మనిపించాడు. ‘వద్దురా యీ కార్లో ప్రయాణం అంటే విన్నావు కాదు’ అన్నాడు భూషణం. ‘అబ్బ చంపకు, వెధవ గోలా నువ్వూ’ రామచంద్రం సహనం కోల్పోయాడు. ‘ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్రవుంటే చూడాలి. కారును పైకి ఎత్తి పట్టుకోవాలి’ అంటూ రోడ్డు వారకు పోయి కర్ర కోసం వెదుకుతున్నాడు.

రోడ్డు వారనే చింతచెట్లూ రావిచెట్లూ ఉన్నాయి. ఒక పెద్ద మర్రిచెట్టు ఊడలతో భయంకరంగా వుంది. చెట్టుచెట్టుకీ మధ్య యీత ముళ్ల పొదలు, బ్రహ్మచెముడు డొంకలు, రకరకాల తీగలూ అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి.

హఠాత్తుగా ‘భూషణం పాము పాము’ అన్న కేక నిశ్శబ్దాన్ని చీలుస్తూ వినపడింది. ‘రామచంద్రం’ అంటూ భూషణం పరుగెతుకెళ్లాడు. పెద్ద పాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెలలో మెరుస్తూ వెళ్లిపోయింది. అవధాని ప్రాణాలు బిగుసుకుపోయాయి. రామచంద్రం వణికిపోతున్నాడు. రెండు చేతులతోనూ పొదివి పట్టుకుని రామచంద్రాన్ని తీసుకువచ్చాడు భూషణం. అవధాని కారు తలుపు తీశాడు. వెనుక సీటులో పడుకోబెట్టారు. కండువా తీసి కాలిమీద గట్టిగా బిగించి కట్టారు. రామచంద్రం కళ్లల్లో విపరీతమైన భయం సుళ్లు తిరిగింది. పెదవుల చివరి నుండి నురగ కక్కుతున్నాడు. ‘మనకెంత గతి పట్టిందిరా’ ఏడుస్తున్నాడు భూషణం.

ఇంతలో ఏదో మువ్వల చప్పుడు. ఒక ముసలివాడు రోడ్డు మీద నున్న పొదలను తప్పించుకుని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన ఒళ్లు. భూషణం తడబడుతూ అన్నాడు: ‘ఎ ఎ ఎవరది?’

‘సిద్దయ్యని బాబూ పాములవాణ్ణి’ అన్నాడు ముసలాయన.

‘పాములవాడివా?’ దైవసంకల్పం వుంటే కానీ యీ అడవిలో యిటువంటి వేళ ఒక మనిషి, అందులో పాములవాడు కనిపించడు. భూషణం కారులోంచి దూకి సిద్దయ్య రెండు చేతులూ పట్టుకున్నాడు. రామచంద్రాన్ని సిద్దయ్య పరీక్షగా చూశాడు. ‘ఇంకా బతికే వున్నారు బాబయ్యా’ అన్నాడు బాధతో తోక తెగిన బల్లిలా గిజగిజలాడుతూన్న ప్రాణిని చూసి. ‘మంత్రం వేసి బతికించావా సగం ఆస్తి నీకు రాయిస్తాను’ అన్నాడు భూషణం.

‘అదృష్టం వుంటే బతకొచ్చును బాబయ్యా, అక్కడ పాకలోకి తీసుకురండి. వేరు ముక్కతో మంత్రం వెయ్యాలి’.

రామచంద్రాన్ని గుడిసెలోకి మోసుకెళ్లారు. నులకమంచంలో పడుకున్న యువతిని ‘సూరీడు లే లే’ అంటూ ముసలాయన తట్టి లేపాడు. దానిమీద రామచంద్రాన్ని పడుకోబెట్టారు. సిద్దయ్య రెండు మూడు సంచీలలో చెయ్యి పెట్టి వెదికాడు. పూసలూ పెంకులూ వేర్ల ముక్కలూ రాళ్లూ ఏవేవో ఉన్నాయి. కావాల్సిన వేరు ముక్కలేదు. దూరంగా వెలగచెట్టు అవతల పొదల కాడ ఆ వేరుగల మొక్కలున్నాయి. అక్కడ పాముపుట్టలూ ముళ్లపొదలూ జాస్తి. ముసలాయనకు చీకటిపడితే చూపు సరీగా ఆనదు. భూషణం పర్సులోంచి డబ్బు తీయబోయాడు. ‘నీ డబ్బుకి ఆశపడ్డానా మంత్రం పనిచెయ్యదు’ కఠినంగా అన్నాడు సిద్దయ్య.

‘ఈ అయ్యకి పెదవులు నల్లపడి పోతున్నాయి’ అంది సూరీడు. భూషణం అదిరిపడ్డాడు. యింతకముందు రేగిన ఆశ గప్పున ఆరిపోయినట్టయింది. ‘పోనీ నేను వెళ్లి తీసుకురానా’ అంటూ సూరీడు పరుగెత్తింది. రామచంద్రం చివరి ఘడియల్లో ఉన్నాడు. ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది. ఇంతలో సూరీడు తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. చేతిలో అయిదారు మొక్కలున్నాయి. సిద్దయ్య సంజ్ఞతో గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అరిపాదాల్ని ఒళ్లో పెట్టుకుని రాసింది.

అరగంట తర్వాత, రామచంద్రం మొహంలో చావునీడలు తప్పుకున్నాయి. శ్వాస యథాస్థితికి వస్తోంది. ‘ఇదంతా నీ చలవ సూరీడు’ అంటూ ఆమె కాళ్లమీద పడ్డాడు భూషణం. ‘తప్పండి బాబూ’ అంటూ సూరీడు సిగ్గు పడింది. ఆమె నవలావణ్యంతో ఆకర్షణీయంగా వుంది. అప్పుడు సమయం మూడు గంటలవుతోంది. అందరూ నడుం వాల్చారు.

సుమారు వో గంటకు భూషణం లేచి సూరీడు వొంటి మీద చెయ్యి వేసి లేపాడు. జేబులోంచి డబ్బు ఇస్తూ, ‘నా మనసు తీర్చు’ అన్నాడు. ‘అందుకు డబ్బెందుకు బాబూ’ అంది సూరీడు. మరి? ‘నేనలాంటిదాన్ని కాను. పోయి పడుకో అయ్యా’ అంటూ మరోవైపు తిరిగి పడుకుంది. అవధాని నవ్వాపుకున్నాడు.

తెల్లారి అంతా నిద్రలేచారు. ఆరు గంటల బస్సు వచ్చే వేళయింది. కలెక్టర్‌ గారింట్లో పెళ్లికి సమయానికి వెళ్లొచ్చు! రోడ్డు వైపు నడుస్తున్నారు. రామచంద్రం ఉత్సాహంగా ఉన్నాడు. మళ్లీ శ్రీమంతుడూ టెన్నీస్‌ చాంపియనూ అయిపోయాడు. ‘ఎపుడైనా మా ఊరు వస్తే కనిపించు సిద్దయ్యా’ అన్నాడు కృతజ్ఞతగా. ‘చిత్తం’ అని ముసలాయనా, సూరీడూ వెనక్కి వెళ్లిపోయారు.

కారు తడిసిపోయింది మంచులో. తణుకు వెళ్లగానే దీన్ని తీసుకువచ్చే ఏర్పాటు చేయాలనుకున్నారు. 

ఇంతలో ‘బాబయ్యా’ అని కీచుగా కేక వినపడింది. సూరీడు పరుగెత్తుకొస్తోంది. ‘బాబూ, మా అయ్యని పాము కరిచింది. ఒక్కసారి రండి బాబూ’. అరెరెరె! ‘సగం దూరం వెళ్లగానే వేరు ముక్క కోసం పొదలో చెయ్యిపెట్టి మొక్క పీకబోయాడు. బుస్సున లేచి కాటు వేసింది బాబూ తాచుపాము’. అయ్యో! ఈ బస్సు దాటితే ఎలాగ? ‘మీరుంటే ధైర్యం బాబూ’ సూరీడు ఏడుస్తోంది. ‘కలెక్టర్‌ గారింట్లో పని అంతా నేను చూసుకుంటానని మాట ఇచ్చానే’ రామచంద్రానికి సమస్య వచ్చి పడింది. అదిగో బస్సు వచ్చేస్తోంది. అవధాని నిశ్చేష్టుడై చూస్తున్నాడు. బస్సు ఆగింది. రామచంద్రం గబుక్కున రెండు పదిరూపాయల నోట్లు సూరీడు చేతిలో పెట్టి బస్సు ఎక్కేశాడు. అవధానిని బస్సులోకి తోసి, భూషణం కూడా ఎక్కాడు. బస్సు బర్రున సాగింది. సూరీడు గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది. పది రూపాయల నోట్లు గాలిలో పల్టీలు కొట్టుతున్నాయి.


(సాక్షి సాహిత్యం; ఫిబ్రవరి 12, 2018)

 

Friday, November 22, 2024

మహేంద్ర ‘అతడి పేరు మనిషి’

 


మహేంద్ర


మహేంద్ర కథ ‘అతడి పేరు మనిషి’కి సంక్షిప్త రూపం ఇది. 1983లో అచ్చయింది. హఠాత్తుగా జబ్బుపడి, 39 ఏళ్లకే మరణించిన మహేంద్ర(16 జూలై 1959 – 12 జూన్‌ 1998) కవి, చిత్రకారుడు కూడా. ‘స్వర్ణసీమకు స్వాగతం’ నవలిక రాశాడు. ఆయన మరణానంతరం ‘కనిపించని కోయిల’ కథా సంకలనాన్నీ, ‘పర్వ వేలా తరంగాలు’ కవితా సంకలనాన్నీ ఆయన అన్న, కథకుడు మధురాంతకం నరేంద్ర వెలువరించారు.

–––––

అతడి పేరు మనిషి


వర్షం అవిరామంగా కురుస్తోంది. మహల్‌ గ్రామం చుట్టూ వున్న కొండలపై మబ్బులు బద్దకంగా దొర్లిపోతున్నాయి.

‘‘ఏమైనా నువ్వు యిలా వొంటరిగా వచ్చేయడం ఏం సబబుగా లేదు తల్లీ. నీ అదృష్టం బాగుండి కారు చిత్తూరు దగ్గర ఆగిపోబట్టి రాత్రి ఏ హోటల్లోనో ఆగి సురక్షితంగా రాగలిగావు యిదే ఏ రిమోట్‌ ప్లేస్‌లోనో జరిగుంటే ఏమయ్యేదో నీకర్థం కాదు’’ ఉదయం నుంచీ మాధవి, సుధనలా మందలించడం ఎనిమిదోసారి.

‘‘జరిగినదానికి తానూ బాధపడుతోంది కదవే, వదిలెయ్‌’’ అక్కను విసుక్కున్నాడు కృష్ణమూర్తి.

సుధ మరీ డల్‌ అయిపోవడం గమనించిన మాధవి పాతభవంతి నుంచి పనిమనిషి చేత టిఫనూ, కాఫీలు తెప్పించింది.

ఇంతలో గేటు దగ్గరెవరో తారాడుతుండడం గమనించి ముందుకు నడిచాడు కృష్ణమూర్తి. ఆ ఆగంతకుడెవరో వచ్చి వరండా మెట్ల మీదే నిలుచున్నాడు. సుధ నిర్ఘాంతపోయింది. వర్షంలో ఎంతగా తడవొచ్చునో అంతగానూ తడిసి వున్నాడతను.

‘‘రాత్తిరి బిత్తరంలో దీన్ని మరిసిపొయ్యినారు, బంగారపు వస్తువుగద! తొందరపడతావుంటారని మద్దానమే బయల్దేరినా మద్దిన ఈ వాన మల్లా పనిపాటు చేసింది’’ తన చేతిలోని బంగారుగొలుసును సుధ చేతికిస్తూ ఆలస్యానికి సంజాయిషీ యిచ్చుకుంటున్నట్టుగా అన్నాడతను.

మాధవి అయోమయంగా సుధకేసి చూసింది. ‘‘వస్తున్నప్పుడు కారు ట్రబులిచ్చిందని చెప్పానుగా. అప్పుడు యితనూ యింకా కొందరూ వెనుకనుంచీ త్రోసారు. అప్పుడు పడిపొయ్యుంటుంది’’ తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ అంది సుధ. ఏదో పనివున్నదానికి మల్లే లోపలకెళ్లి కాట్‌ మీద బోర్లాపడింది. ‘అసలేం జరిగిందని కృష్ణమూర్తి అతణ్ని అడిగేస్తాడు. హోటల్లో ఆగిపోయినట్టు కల్పించి చెప్పినదంతా అబద్ధమని తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత తల ఎత్తి మాట్లాడగలదా? ఐనా యితడిలా దాపురిస్తాడని తానేం కలగందా? పేద్ద నిజాయితీపరుడిలా పట్టుకొచ్చాడు.’ గడిచిన భయంకరమైన రాత్రి గుర్తుకు వచ్చింది.

’ ’ ’

ఆకాశం పగిలినట్టు కుండపోతగా వర్షం. ఏడుగంటలే అయినా అర్ధరాత్రిలా ఉంది. చిత్తూరు నుంచీ మహలుకెళ్లే రోడ్డుమీద హెడ్‌లైట్స్‌ వేస్తున్న వెలుతురు మరక ఆధారంగా కారు దూసుకుపోతూంది. అరగంటలో మహల్లో వుంటానన్న నమ్మకం వొక్కటే సుధకు ధైర్యం యిస్తోంది.

ఆమె భయాందోళనలకు పతాక ఘట్టంలా కారు రోడ్డుకడ్డం పడివున్న తాటిచెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఏడవడానికి కూడా నోరు పెగలడం లేదు. ఇంతలో ఓ మెరుపు మెరిసింది. ఆ వెలుగులో పక్కనున్న మిట్టమీద ఒక గుడిసె కన్పించింది.

అయిదారు నిమిషాల విచికిత్స అనంతరం తెగింపు తెచ్చుకుని కారు లాక్‌ చేసి, సెనగ చేలు కడ్డంగా నడిచి గుడిసె చేరుకుంది. కొత్తమనిషిని గుర్తు పట్టినట్టు దొడ్డిలోని మేకలు అరిచాయి.

గడపకు కొంచెం అటువైపుగా నులకమంచం మీద పడుకున్న మనిషి కన్పించాడు బోర్లా పడుకుని. నేలమీద పెట్టిన గోధుమరంగు పుస్తకం జూసి చూరుకు వ్రేలాడుతున్న లాంతరు వెలుగులో ఏదో పద్యాల్ని కాబోలు కూనిరాగంతో చదువుకుంటున్నాడు.

వణుకుతూ యింట్లోకి జొరబడింది సుధ. అతడు లేచి నిలుచున్నాడు. ఇరవైకి మించని వయసు. నల్లటి శరీరం. వుంగరాల జుత్తు.

‘‘కారు నిలిచిపోయింది’’ అప్పుడే మాటలు నేర్చిన పసిపిల్లలా అంది. అతడు రోడ్డుకేసి చూపు సారించాడు. కన్ను పొడుచుకున్నా కన్పించని చీకటి.

‘‘ఎక్కడినుంచి వొస్తావుండారు?’’

‘‘మెడ్రాసు. మహల్‌కెళ్లాలి మా మామగారింటికి’’.

‘‘పెసిడెంటు వాళ్లింటికా?’’ వచ్చిన మనిషెవరో అర్థంగావడంతో అతడు మంచం మీద దుప్పటి దులిపివేశాడు.

‘‘కూచోండి. వొరసం ఈ రాత్తరికి తగ్గేట్టు లేదు. దూరం పయానాలకు బొయ్యేటప్పుడు అడమనిషి వొంటిగా వొచ్చుండగూడదు.’’

సుధ ఇంకా ద్వారం వద్దనే నిలబడి చీర కుచ్చిళ్లను, పమిటను పిండుకోసాగింది.

‘‘పెట్లో మా ఆడోళ్ల కోకలుండాయి. మీ గుడ్డలు ఆరేవరకూ అవి కట్టుకుందురా?’’ అని ప్రశ్నార్థకంగా జూసి, చెక్కపెట్టి మీదినుంచీ ట్రంకును దించి వున్నవాటిలో మంచి చీరను తీసి ఆమెకిచ్చాడు. సుధ తటపటాయించడం చూసి, ‘‘ఈ తేమగుడ్డల్లో తెల్లారగట్ల నానితే రేపు మద్దానానికి జరం ఖాయం’’ ఆమెకు ఏకాంతం కల్పించడం కోసం కాబోలు, రావిఆకుల మోపును తీసుకుని మేకల దొడ్డిలోకి పోయాడు.

పొయ్యి ముట్టించి ఎసరు బెడ్తూ, ‘‘మేము మాలోళ్లము, మా యిండ్లలో మీరు భోజనం జేద్దురా’’ అని నవ్వుతూ ‘‘కారు నిల్సిపోంగా యిట్టొచ్చినారుగానీ– చెన్నపట్నం పుట్టిమునిగితే మటకు మీరు మా గడప దొక్కుతారా?’’

అతడు తనకంటే రెండు మూడేళ్లయినా చిన్నవాడుగా వుండొచ్చు. కానీ ఆ మాట్లాడుతున్న తీరు తనకన్నా యిరవై ముప్పై ఏళ్లు పెద్దవాడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. 

మరో పది నిమిషాల్లో వంట పూర్తి చేసి అతడు సుధను భోజనాని కాహ్వానించాడు. బాగా ఆకలయిందేమో గబగబా అన్నం ముగించింది. సొమ్మసిల్లినట్టుగా మంచం మీద వాలిపోయింది. 

హఠాత్తుగా ఏ రాత్రివేళప్పుడో మెలకువ వచ్చింది. గుడిసె కప్పు ఈదురుగాలికి లేచిపోయేలా ఉంది. అతడు నేలమీద పడుకుని వున్నాడు. చిరుగుల చాప. కప్పుకోను దుప్పటి లేదు. నిద్ర పోతున్నాడా? నటిస్తున్నాడా? విద్యుద్ఘాతం తిన్నదానిలా గజగజ వణికిపోయింది. దుప్పటిని గొంతువరకూ లాక్కుంది. ‘అతడు తలుచుకుంటే యింకేమైనా వుందా? భగవంతుడా, నిరపాయకరంగా తెల్లారేట్టు చూడు.’

ఉదయం అతడు మరికొందరి సాయంతో చెట్టును అవతలికి లాగించేశాడు. అందరూ పది గజాలు తోయగానే కారు స్టార్టు అయింది. లాంఛనంగా కృతజ్ఞత చెప్పుతూ రెండు పది రూపాయల నోట్లను అతని చేతిలో కుక్కింది. అతడు వారిస్తూ ఏదో చెప్పబోయాడు. కారు స్టార్ట్‌ అయిన ఉత్సాహంలో ఆ మాటలను సరిగ్గా విన్పించుకున్నట్టు లేదు.

’ ’ ’

‘‘అతడు వెళ్లిపోయాడా?’’

‘‘మా మామయ్య కష్టపడి సంపాదించిన సొత్తు కాబట్టి మళ్లీ చేతికొచ్చింది. కృష్ణతో అతనికేమన్నా ఇచ్చి పంపమని చెప్పాను. భోజనం చేసి ముగ్గురమూ క్యారమ్స్‌ ఆడుకుందాం’’ అంటూ సుధ చేయి పట్టుకుని బంగళా నుంచి పాత భవంతిలోకి లాక్కుపోయింది మాధవి.

రాత్రి గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టిన తర్వాత వీధి తలుపు తెరుచుకుంది. కృష్ణమూర్తి ‘నాగయ్యా నాగయ్యా’ అని పిలుస్తూ వరండాలోకి వచ్చాడు. వెనుకనే వచ్చిన రాజమ్మ ‘నాగయ్య సందేళ కూతురింటికి పోయినాడయ్యా’ అంది. కృష్ణమూర్తి వీధిలైటు వేశాడు. వరండాలో మూల ఎవరో నిద్రపోతున్నారు. అతణ్ని లేపాడు. ‘ఏమయ్యా, నువ్వింకా మీ ఊరికి పోలేదా? వానలో అంతదూరం పోలేక పొయ్యుంటావు. నువ్విప్పుడు మల్లిమడుగు వెళ్లి– మునసామి తెల్సునా? అతడితో చెప్పి ప్రెసిడెంటు వాళ్లింట్లో ఎవర్నో తేలు కరిచిందని ఈడ్సుకురా’’ అన్నాడు.

‘‘తేలా? నాకు తెలవని తేలు వైద్దమా? కొత్తకోట పెద్ద చెంగయ్య మా నాయినే గదా. బాటరీ ఒకటి తేండి. మందాకు పెరుక్కొస్తా’’ అన్నాడు.

‘‘ఏ ఆకో, దొరుకుతుందా’’ అన్నాడు కృష్ణమూర్తి.

‘‘ఈడలేకపోతే మావూరికన్నా పొయ్యి పెరక్కరానా. అయిదు నిమిసాల్లో వస్తా సూడండి’’. వర్షంలో చీకట్లో కలిసిపోయాడు.

సుధ, మాధవి చేతిలో పడివుంది. కాళ్లూ చేతులూ చల్లబడ్డాయి. ‘ఏమని బయల్దేరిందో– అన్నీ గండాలే’.

మరో పది నిమిషాల్లో మందాకు కోసం పోయినవాడు తలుపులు త్రోసుకుని లోపలికొచ్చాడు. ఆకులు దంచి మందు తయారుచేసి సుధచేత మింగించాడు. కిరోసిన్‌ దీపంలో ఆకువాడ్చి కాలికి కట్టు కట్టాడు. పావు గంటకు సుధకు స్పృహ వచ్చింది. 

రాజమ్మ కళ్లు తుడుచుకుంటూ ఆకులు దంచిన చోట శుభ్రం చేయసాగింది. ‘ఇదేదో కాగితం ఆకుల్తో బాటు దంచేసుండావు సూడు’. పెడనవ్వు నవ్వి వీధిలోకి గిరవాటేశాడు. రూపాయి నోట్లున్న జేబులోనే మందాకు కోసుకొచ్చాడు. నోట్లు కూడా ఆకుల్తో బాటే దంచబడ్డాయి!

సుధ దీనంగా అతడికేసి చూస్తూవుంది. ‘‘నాకేమైనా పెట్టాలనిపిస్తే ఇంత అన్నం పెట్టించండి. నిన్న పొద్దున తిన్న అన్నమే. ఈ వొరసం పున్నాన పగులంతా కోమిటోళ్ల సత్రంలో గొంతు కూసొనుంటి. రాత్తిరి మనింటికాడ ఎవురన్నా బయటికొస్తారేమోనని దీపాలు ఆర్పేదాకా సూస్తావుంటి. ఈ పొద్దు నాకూ నా మేకలకూ ఉపాసమే’’ అన్నాడు. చెళ్లుమని చెంపదెబ్బ కొట్టినట్టయింది సుధకు. అతడు యింత చేసినందుకు తానేం చేయగల్గింది?

రాజమ్మ అతని ముందు విస్తరి వేసి అన్నం పెడుతోంది. తలవాల్చుకుని బురద బురదగా వున్న అరుగుపై మిడికాళ్ల మీద కూచొని వున్నాడతను. అంతవరకూ దూరంగా పడుకున్న కుక్క అతని దగ్గరికొచ్చి తోకాడించసాగింది. 

‘‘చివరకు కుక్కకు పడేసినట్లు నీకు యింత అన్నం పడేస్తున్నాం గదా’’ భోరున ఏడ్చేస్తూ సుధ అతణ్ని డైనింగ్‌ హాల్లోకి లాక్కుపోయింది.


(సాక్షి సాహిత్యం; 16 ఏప్రిల్‌ 2018)



 

Tuesday, November 19, 2024

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ ‘ఏస్‌ రన్నర్‌’


పెద్దిభొట్ల సుబ్బరామయ్య


పెద్దిభొట్ల సుబ్బరామయ్య (1938–2018) కథ ‘ఏస్‌ రన్నర్‌’కు సంక్షిప్త రూపం ఇది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన కథకుడు సుబ్బరామయ్య. ఇంగువ, నీళ్లు, పూర్ణాహుతి లాంటివి ఆయనకు బాగా పేరు తెచ్చాయి.

––––

డైలీ దౌడ్‌


ఎవరో కుర్రవాడు రన్నింగ్‌ రేస్‌ చేస్తున్నవాడిలా పేవ్‌మెంట్‌ మీద బాణంలాగా పరుగెత్తిపోతున్నాడు. రామచంద్రమూర్తి ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే ఆ కుర్రవాడు కనుచూపుమేర దాటిపోయాడు. వేగంగా పరుగెత్తుతున్న వారెవరిని చూచినా అతడు అలాగే నిలబడిపోతాడు. తర్వాత నవ్వుకుంటాడు.

అతడు మళ్లీ నడవడం ప్రారంభించాడు. మరొక ఫర్లాంగు దూరం నడిస్తే కానీ బస్సు స్టాపు చేరుకోలేడు. ఎంత పెందలాడి యింట్లో నుంచి బయలుదేరితే తప్ప బస్సు అంది ఆఫీసుకు చేరుకోవడం కష్టం. అప్పటికి సీతమ్మ ఎంతో పెందలకడనే– నిద్రలేచి పనులు ప్రారంభిస్తుంది. అవి సర్దుకొని, యివి సర్దుకొని వంటకు ఉపక్రమించి ఎంత ఉరుకులు పరుగుతు పెడుతూ చెమటలు కక్కుతూ పనిచేసినా తొమ్మిది గంటల లోపున వంట తయారు కాదు. నాలుగు మెతుకులు నోట వేసుకుని తాను తయారయ్యేసరికి తొమ్మిదిన్నర అవుతుంది. ఎంత వేగంగా నడిచినా బస్‌స్టాపుకు చేరుకునే సరికి మరొక పావుగంట. ఆ తర్వాత బస్సు కోసం పడిగాపులు పడి ఉండాలి. ఎంతకూ తనెక్కవలసిన బస్సు రాదు. పోనీ ఓపిక చేసుకుని నడిచిపోదామా అంటే ఆఫీసు దగ్గరా దాపూ కాదు. అయిదు కిలోమీటర్ల దూరంలో ఊరికి అవతలి వైపున ఉంటుంది.

‘పోనీ ఆఫీసుకు దగ్గర్లో ఏదైనా యిల్లు చూసుకోరాదూ?’ అన్నారు చాలామంది. కానీ అక్కడి అద్దెలు తాను భరించలేడు. ఆఫీసులో కొందరు జల్సారాయుళ్లు ఉన్నారు. కొత్త కరెన్సీ నోటుల్లా పెళపెళ లాడుతుంటారు. కానీ వారి సీట్లు అటువంటివి.

తన సీటు అటువంటిది కాదు. చాకిరీకి మాత్రం ఏమీ తక్కువ ఉండదు. టన్నుల కొద్దీ ఫైళ్లు పేరుకుపోతుంటాయి. ఫలితం మాత్రం నెల తిరిగేసరికి వచ్చే ఆ జీతపు రాళ్లే. అందులో బోలెడన్ని కట్లూ, కత్తిరింపులూ.

అతడు కోటు వేసుకుంటాడు. ‘మీకేమండీ కోటు తొడుక్కుంటారు దర్జాగా’ అంటారు కొందరు. వారికి తెలియదు తన లోపలి చొక్కాలోని ఎన్ని చిరుగులను బయటికి కనబడకుండా ఆ కోటు కప్పుతున్నదో!

ఎండ చిటచిట లాడుతున్నది. రామచంద్రమూర్తి నుదుట పట్టిన చెమటను అరచేత్తో తుడుచుకుంటూ వీధి చివరకు కళ్లు చికిలించి చూశాడు. ఏదో బస్సు వస్తున్నది. నంబరు సరిగా కనిపించడం లేదు. చత్వారం వస్తున్నదేమో! ఎస్సెల్సీ రిజిస్టరులో ఉన్న తన పుట్టిన తేదీ నిజమే అయితే తనకిప్పుడు నలభై ఎనిమిది వెళ్లి రెండు నెలలయింది. ఇంకా ఏడేళ్లు సర్వీసున్నది. బస్సు దగ్గరికి వచ్చాకకానీ నంబరు సరిగా కనిపించలేదు. అది తన బస్సు కాదు. రామచంద్రమూర్తి ఆలోచిస్తూ నిలబడ్డాడు. తాను ఆఫీసుకు నడిచిపోతే ఎంతసేపటిలో పోగలడు? వేగంగా నడవగలిగితే గంట. పరుగెత్తి పోతే? ఇప్పుడు తాను పరుగెత్తగలడా? ఒకప్పుడు పరుగెత్తాడు. తమ జిల్లా పేరు నిలబెట్టాడని విపరీతంగా మెచ్చుకున్నారు. ఫొటోలు తీశారు, దండలు వేశారు.

తానప్పుడు రోజూ పరుగెత్తేవాడు. మైళ్ల కొద్దీ దూరం అతని సన్నని కాళ్ల క్రింద తరిగిపోయేది. ఆ కండరాలకు అలుపు తెలిసేది కాదు. ఇంతకాలం తరువాత పరుగెత్తగలడా?

పక్కనే నిలబడి ఉన్న వ్యక్తిని ‘‘ఏమండీ! టైమెంత అయింది?’’ అని అడిగాడు. కొంచెం విసుగుతో చేతి గడియారం వంక చూసి ‘‘నైన్‌ ఫిఫ్టీ’’ అని సమాధానం చెప్పాడు. 

బాప్‌రే. తాను పదిగంటలకల్లా సీటులో ఉండాలి. లేకపోతే ఆ కొత్త ఆఫీసరు అగ్గిరాముడై పోతాడు. అసలా మనిషి ముఖం చూస్తేనే అదొక రకంగా ఉంటుంది. మెడ అంతా కొవ్వుపట్టి ఉంటుంది. ఎవరి వంకైనా చూడదలుచుకుంటే మెడ ఒక్కటీ తిప్పి చూడలేడు. మొత్తం శరీరమే గిర్రున తిరగవలిసి ఉంటుంది.

ఇప్పుడు పది దాటుతున్నది కదా? ఈ బస్సు ఎప్పుడే వచ్చేట్టు? తానెలా ఎక్కేట్టు? ఎన్ని గంటలకు ఆఫీసుకు చేరుకునేట్టు? ఆఫీసరుకు ఏమి సంజాయిషీ ఇచ్చుకునేట్టు?

అదుగో బస్సు. ఇంతకాలానికి దాని దర్శనమైంది. రామచంద్రమూర్తి కమ్మీ పట్టుకుని వదల్లేదు. దిగేవారు దిగగానే లోపలికి దూసుకుపోయాడు. బస్సెక్కడం అనే విద్యలో ఈ మాత్రపు ప్రాథమిక అనుభవమైనా లేకపోతే– ఆ సూట్‌వాలాలాగా పేవ్‌మెంట్‌ మీదనే గంటలు తరబడి నిలబడిపోక తప్పదు. సోదరా! దూసుకుపోయేవాడిదే రాజ్యం. లేకపోతే నీ సంగతి అంతే. 

రామచంద్రమూర్తి కళ్లముందు యెప్పటిదో దృశ్యం కనిపించింది. మరీ చిన్నప్పుడు తమ ఊరికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న చిన్న పట్నంలో స్కూలు చదువు. పొద్దున్నే లేచి చద్దన్నం తిని పుస్తకాల సంచీ భుజానికి తగిలించుకుని నడక ప్రారంభించేవాడు. సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు మరీ హుషారుగా ఉండేది. నాలుగు మైళ్లు పరుగెత్తుకుంటూ తిరిగి వచ్చేవాడు. ఆ విధంగా రన్నింగ్‌ అలవాటయింది. స్కూల్‌ పోటీలలో తానే ప్రథముడు. దాంతో ఇంకా అభిరుచి పెరిగింది. ఎక్కడికి వెళ్లినా పరుగెత్తుతూ వెళ్లడమే. 

బస్సు ఆగింది. రామచంద్రమూర్తి ఇద్దరు వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసి మళ్లీ కిందికి దిగాడు. టైమ్‌ కనుక్కున్నాడు. గుండె గతుక్కుమన్నది. మళ్లీ నడక. మరో అర ఫర్లాంగు దూరం. ఎండ నియంత పరిపాలనలా భయంకరంగా ఉంది.

ఆ రోజు... అంతర్‌ జిల్లా ఎథ్లెటిక్స్‌ ముగింపు రోజు. రన్నింగ్‌ ఫైనల్స్‌. ట్రాక్‌ అంతా శుభ్రంగా ఉంది. మొత్తం పద్దెనిమిది మంది. మెత్తని ప్రేలుడు వినిపించగానే ముందుకు దూకాడు. కళ్లముందు ట్రాక్‌ తప్ప మనుషులు కనిపించలేదు. గుండెకు తగిలిన పలుచని దారం తెగిన తర్వాత కొద్ది గజాల దూరం పరుగెత్తిపోయి పచ్చికలో కూలబడిపోయాడు. జనం మూగారు. పైకెత్తి గాలిలోకి ఎగరవేశారు. కలెక్టరు తనకు ట్రోఫీ బహూకరిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం అంతా మార్మోగిపోయింది. ‘ద ఫాస్టెస్ట్‌ రన్నర్‌ ఆఫ్‌ ద స్టేట్‌’ అని సావనీర్‌లో ఫొటో కింద వ్రాశారు.

రామచంద్రమూర్తి ఆఫీసు మెట్లెక్కుతున్నాడు. ఆయాసంతో వగరుస్తున్నాడు. ఆ ట్రోఫీ ఇంకా తనదగ్గరే ఉంది. దాన్ని ఇతర చిన్న చిన్న కప్పులూ దాచేందుకు తన దగ్గర అద్దాల బీరువాలు లేవు. కొన్ని అసలైన వెండికప్పులు డబ్బు అవసరం వచ్చినప్పుడు వాటికి కాళ్లొచ్చి వెండి దుకాణాల్లోకి వెళ్లిపోయాయి.

స్ప్రింగు డోరు తెరుచుకుని లోపల అడుగు పెట్టేసరికి అయ్యగారు పేపరు చదువుతున్నారు. శబ్దం విని కుర్చీ మొత్తం పక్కకు తిప్పి గడియారం వంక చూసి మొహాన గంటు పెట్టుకుని పేపరు బల్లమీద పడేసి ‘‘ఊ’’ అన్నాడు. రామచంద్రమూర్తి రిజిస్టరు అందుకోబోతూ ఉంటే ‘‘కాస్సేపాగండి– ఎలాగూ పన్నెండు అవుతుంది. ఈ పూటకు లీవు పెట్టేద్దురుగాని’’ అన్నాడు. ‘‘లీవు వుందా? అంతా వాడేసుకున్నారా?’’

రామచంద్రమూర్తి రిజిస్టరు మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుని ‘‘ఉందనే అనుకుంటానండి’’ అన్నాడు.

‘‘గూడ్‌. అది సరేనండీ. మీరెన్నింటికి బయలుదేరుతారు ఇంటినుంచి?’’

‘‘బస్సులతో బాగా ఇబ్బందిగా ఉందండి. ఆపరు, ఎక్కించుకోరు’’

‘‘గూడ్‌. కాబట్టి మనకు బస్సు సరిపడదని అర్థం– అంతేనా?’’

రామచంద్రమూర్తి తల వంచుకున్నాడు.

‘‘బస్సు మీద వస్తే లాభం లేదని తెలిశాక మీరు వేరే వసతి చూసుకోవాలి. మరో మీన్స్‌ ఆఫ్‌ కన్వేయన్స్‌. పోనీ ఒక స్కూటరు కొనుక్కోగూడదూ?’’

రామచంద్రమూర్తి నవ్వేందుకు ప్రయత్నించాడు. ‘‘డబ్బు కావాలి కదండీ’’ అన్నాడు.

‘‘గూడ్‌– డబ్బులేదు కాబట్టి కారు, స్కూటరు వగైరాలు వీల్లేదు. ఆగవు, ఎక్కించుకోవు కాబట్టి బస్సు వీల్లేదు. మరి కొంచెం ముందుగా యింటిదగ్గర బయలుదేరితే?’’

‘‘అప్పటికి యింట్లో వంటకాదండి’’

‘‘ఓహో అదొకటా? కాబట్టి అదీ వీలులేదు. ముందు లీవ్‌ లెటరు రాయండి. ఈ లోపల నేను ఉపాయం ఆలోచిస్తాను’’

లీవ్‌ వ్రాస్తున్నంతసేపూ ఆఫీసరు రామచంద్రమూర్తి వంక తమాషాగా చూస్తూ కూర్చున్నాడు. ‘‘ఆ ఉపాయం తట్టింది. అది బెస్టు’’.

‘‘చెప్పండి సార్‌’’

‘‘తొమ్మిదింటికి ఇంట్లోనుంచి బయటికి రండి– వెంటనే పరుగు ప్రారంభించండి. ఎక్కడా ఆగకండి. అరగంటలో ఆఫీసులో ఉంటారు. పైగా వొంటికి ఎంతో మంచిది. ఏమంటారు?’’ ఈ మాటలని అతడు నవ్వడం ప్రారంభించాడు.

రామచంద్రమూర్తి మొహం జేవురించింది. మనిషి నిలువెల్లా ఊగిపోయాడు. ‘‘మీ ధోరణి మీ హోదాకు తగినట్టు లేదు. అయామ్‌ సారీ. రియల్లీ సారీ. అన్నట్టు మీకు తెలియదేమో. పరుగెత్తమని సలహా ఇచ్చారు. ఐ వజ్‌ ఎ ఫేమస్‌ రన్నర్‌ వన్స్‌’’ అని స్ప్రింగ్‌ డోర్‌ మూసి యివతలికి వచ్చాడు.

’ ’ ’

ఆ సాయంకాలం ఆఫీసు నుంచి బయటపడి రామచంద్రమూర్తి నుదురు చేత్తో రుద్దుకున్నాడు. చల్లనిగాలి వీస్తున్నది. వేగంగా నడవడం ప్రారంభించాడు. ఈ ప్రాంతంలో పెద్ద ఆవరణ ఉంది. కొందరు యువకులు రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూవుంటారు. అతనికి పరుగెత్తాలని సరదా పుట్టింది. ప్యాంట్‌ కొంచెం పైకి మడిచాడు. కోటు చేతులు పైకి మడిచాడు. ‘‘రన్‌ రన్‌’’ అనుకున్నాడు. అలా తమ వీధికి చేరుకునేవరకూ పరుగెత్తుతూనే ఉన్నాడు.

ఆయాసంతో వగర్చుతూ యింటికి వచ్చిపడ్డాడు. మంచం మీద కూలబడిపోయాడు. సీతమ్మ ఆదుర్దాగా ‘‘ఏమిటండీ’’ అంటూ వచ్చింది. ఆయాసంలోనే ‘‘మంచినీళ్లు... వద్దు కాఫీ’’ అన్నాడు. ఆమె లోపలికి వెళ్లింది. అతడు కాళ్లు చాపి మంచంలో వెల్లకిలా పడుకున్నాడు. అయిదు నిమిషాల తర్వాత వచ్చి చూసి ఆమె అదిరిపడింది. భయంతో పరుగెత్తుతూ వెళ్లి దగ్గర్లోనే ఉన్న డాక్టరును పిలుచుకొచ్చింది. ఆయన పరీక్ష చేసి ‘‘చిన్న పెరాలసిస్‌ స్ట్రోక్, అదే పక్షవాతం. కుడి కాలూ చెయ్యీ పడిపోయాయి. విశ్రాంతిగా పడుకోనివ్వండి. నేను మళ్లీ వచ్చి చూస్తాను. ప్రాణభయం ఏమీలేదు’’ అని చెప్పి వెళ్లిపోయాడు.

రామచంద్రమూర్తి కళ్లలో నీళ్లు ఉబికి వచ్చి బుగ్గల మీదుగా కిందికి జారుతున్నాయి.

‘‘రన్‌... రన్‌ మై డియర్‌ బాయ్‌ రన్‌...’’


(సాక్షి సాహిత్యం; జూన్‌ 18, 2018)


 

Saturday, November 16, 2024

కవన శర్మ ‘ఆమె ఇల్లు’


కవన శర్మ


ప్రొఫెసర్‌ కవన శర్మ కథ ‘ఆమె ఇల్లు’ సంక్షిప్త రూపం ఇది. కవన శర్మగా ప్రసిద్ధులైన కందుల వరాహ నరసింహ శర్మ 23 సెప్టెంబర్‌ 1939న విశాఖపట్నంలో జన్మించారు. 25 అక్టోబర్‌ 2018న తన 79వ యేట బెంగళూరులో మరణించారు. ఆయన కథల్లో స్త్రీవాదం బలంగా వ్యక్తమవుతుంది. కానీ దీనికంటే ఎక్కువగా హాస్య రచయితగా గుర్తింపుపొందారు. దీనికి మించి సైన్సు రచయితగా పేరొందారు. ‘కవన శర్మ కథలు’, ‘బ్రెయిన్‌ డ్రెయిన్‌– అమెరికా మజిలీ కథలు’, ‘ఇరాక్‌ డైరీ’, ‘రామకాండం’, ‘సైన్స్‌ నడిచిన బాట’, ‘కోతి రాతలు’, ‘మన ప్రాచీన చరిత్ర ఒక కొత్త చూపు’, ‘సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జీవితము–కృషి’ లాంటివి ఆయన పుస్తకాలు.

––––

ఇల్లాలి ఇల్లు


పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది. కష్టపడి ఏ పనైనా చెయ్యటానికి సిద్ధపడే వారికి ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదు. ఉద్యోగం దొరికిన కొన్నాళ్లకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే, అద్దెకు సంపాదించాలనుకుంది. కాని ఇల్లు దొరకటం ఉద్యోగం దొరకటమంత సులభంగా లేదు.

‘‘మీరెంతమంది వుంటారు?’’

‘‘నేనొక్కతినే!’’

‘‘మీవారు, పిల్లలూ ఈ ఊళ్లో ఉండరా?’’

‘‘మావారుంటారు. పిల్లలు పెళ్లిళ్లయి దూరంగా ఉన్నారు.’’

‘‘మీవారు మిమ్మల్ని విడిచిపెట్టారా? లేక విడాకులిచ్చారా?’’

‘‘లేదు’’

‘‘మీవారేం చేస్తూ వుంటారు?’’

కమల చెప్పింది.

‘‘అంత పెద్ద ఉద్యోగస్థుడి భార్య అయిన మీరు ఇంత చిన్న ఇంట్లో ఉండగలరా?’’

‘‘అనే అనుకుంటున్నాను’’

‘‘మీ ఇద్దరు దెబ్బలాడుకున్నారా?’’

‘‘లేదు’’

‘‘మీకు స్వంత ఇల్లుందా?’’

‘‘లేదు’’

‘‘మీరో అద్దె ఇంట్లోనూ, మీ ఆయనో అద్దె ఇంట్లోనూ ఉంటారా?’’

‘‘కాదు. నేను అద్దె ఇంట్లోనూ, ఆయన తన స్వంత ఇంట్లోనూ ఉంటాము.’’

‘‘ఆయన స్వంత ఇల్లు మీది కాదా?’’

‘‘కాదుట’’

‘‘ఎవరన్నారు?’’

.........

ఆఖరికి కమల వయస్సే ఉన్న ఒక అవివాహిత స్త్రీ కమల ఆఫీసులోనే పనిచేస్తున్న ఆవిడ చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకి అద్దెకిచ్చింది, కంపెనీ కోసం. ఆ మర్నాడు కమల ఆఫీసుకు సెలవు పెట్టి బాంకుకు వెళ్లింది. బాంకులో ఆమె పేర్న తండ్రి పోతూ పోతూ వేసిన పదివేల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఉన్నాయి. దానిమీద అయిదు వేలు అప్పు తీసుకుని ఇంటికి కావలసిన మంచం, పరుపు, స్టౌ, పప్పులు, ఉప్పులు కొనిపెట్టుకుంది.

ఆ పైన భర్త ఇంటికి వెళ్లింది. ‘‘ఇన్నాళ్లూ మీరు నన్ను పోషించారు. నేను చాకిరీ చేసాను. రెండింటికీ చెల్లు. ఇందులో నా ఎడ్రస్‌ ఇస్తున్నాను. ఆ ఇల్లు అద్దెది. కాని అది ‘నా’ అద్దె ఇల్లు. మీకెప్పుడైనా రావాలనిపిస్తే రండి’’ అని చీటి వ్రాసిపెట్టి, తాళం వేసి, చెవి పక్కింట్లో ఇచ్చింది.

‘‘ఊరు వెళ్తున్నారా?’’

‘‘లేదు. నా ఇంటికి వెళ్తున్నాను.’’

కమల భర్త ఇంటికి వచ్చి కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు. ఆ కోపంలో కమల చేసిన తెలివితక్కువ పని గురించి ఆమె తమ్ముడికి, తన సంతానానికి ఉత్తరాలు వ్రాసిపడేసాడు.

ఉత్తరం అందగానే కమల తమ్ముడు కృష్ణ పరిగెత్తుకు వచ్చాడు. బావగారు చెప్పినది విన్నాడు. చిరునామా తీసుకున్నాడు.

‘‘నవ్వు చేసిన పనేం బాగాలేదక్కా. బావగారు ముక్కోపే! ముప్పై యేళ్లు సర్దుకొన్నదానివి. అయినా బావకి దూరంగా కొన్నాళ్లుందాం అని నువ్వనుకొంటే వచ్చి నా దగ్గరుండరాదా? నీ కొడుకు దగ్గరకు వెళ్లరాదా? (అయినా) అది నీ ఇల్లు కాదా? అంతింటికి యజమానురాలివి ఈ దోసెడు కొంపలో ఎందుకు ఇరికావు?’’

కమల తాపీగా జవాబు చెప్పింది.

‘‘అది నా ఇల్లు కాదు, ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆయన పెంచుకుంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ ఆపేక్షగానే చూసుకొంటారు, నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన మాకు ఇంటిమీద హక్కులుండవు.’’

‘‘ఎందుకక్కా అంత నిష్ఠూరంగా మాట్లాడ్తావు! ఏదో విషయంలో నీ మనస్సుకి నొప్పి కలిగింది. ఆ నొప్పి తగ్గేవరకు వచ్చి నాతో ఉండు.’’

‘‘అది నా ఇల్లు కాదని విడిచిపెట్టాను. నీ ఇల్లూ నాది కాదు కనుక రాను.’’

కమలకు పెళ్లయిన కొత్తలో పుట్టింటికి వెళ్లినప్పుడు, పాత అలవాటు ప్రకారం వాళ్లమ్మ పాత న్యూస్‌ పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బును అక్కా తమ్ముడికీ సమానంగా పంచినప్పుడు కృష్ణ, ‘‘ఆడపిల్లకి పెళ్లవగానే అత్త వారింట్లో హక్కు లేర్పడ్తాయి. పుట్టింట్లో పోతాయి. ఏదో ఒక ఇంటి సంపదలోనే వాటా వస్తుంది. అవ్వాబువ్వా ఎలా వస్తాయి!’’ అన్నాడు. 

‘‘రెండ్రూపాయలకెన్ని మాటలన్నావురా! రేపు నీ ఇంటికి నన్ను రావద్దంటావురా!’’ అంది కమల బాధగా.

‘‘అదేమిటక్కా! నీకీ ఇంట్లో ఎప్పుడూ స్థానముంటుంది’’ అన్నాడు నొచ్చుకుంటూ.

కమలకి నిజానికి పుట్టింట్లో ఏ లోటూ జరగలేదు. కానీ కమలని బాధిస్తున్నది హక్కుగా ఏదీ రాకపోవటం. అన్నీ బహుమానాలుగానే రావటం. బహుమానాలు అవతలి వాళ్లు ఆపేక్షతో పెట్టే భిక్షలు. 

‘‘అది మన ఇల్లు కాదురా! అది నీ ఇల్లు. అక్కడ నేను అతిథిని. మీ బావగారింట్లో దాసిని.’’

‘‘బావగారు మంచివారని నువ్వూ ఒప్పుకుంటున్నావు కదా!’’

‘‘అది మంచికి నువ్విచ్చే నిర్వచనం మీదుంటుంది. నేను కోరుకునే స్వేచ్ఛని బట్టీ ఉంటుంది. ఆయన ఇచ్చింది నేను తీసుకొంటున్నంత కాలం ఏ సమస్యా ఉండదు. నేను నాకింత కావాలని అడిగి ఆయన ఇవ్వకపోతే సమస్యలు మొదలవుతాయి.’’

‘‘అన్నీ ఆయన అమరుస్తుంటే నీకు ఇంకా డబ్బెందుకు!’’

‘‘నువ్విక్కడ రెండ్రోజులుండు. నీ జేబులోని డబ్బు నాకివ్వు. నీ అవసరాలు గమనించి నేనే నీకు అన్నీ అమరుస్తాను. ఆ స్వర్గం అనుభవిస్తే గాని అర్థం కాదు.’’

‘‘నువ్వు లేని సమయంలో నాకు కాఫీ తాగాలనిపిస్తే?’’

‘‘ఆయన లేని సమయంలో నాకనిపిస్తే?’’

‘‘ఇంట్లోనే ఉంటావు కదా కలుపుకొంటావు!’’

‘‘ఇప్పుడు నువ్వూ ఇంట్లోనే కదా ఉండబోతున్నది. కలుపుకుంటావు. ఎంత జాగ్రత్తగా కలుపుకుంటావంటే పాలవాడు పోసిన పాలు అన్ని అవసరాలకి సరిపడేలాగా జాగ్రత్తగా కలుపుకుంటావు. నేను ఆఫీసునుంచి వచ్చి ఓ కప్పు కాఫీ కోరవచ్చునన్న స్పృహతో కలుపుకొంటావు. పాలు వలకకుండా కలుపుకుంటావు. కొలిచి కలుపుకుంటావు.’’

కమల మాటలకి కృష్ణ అప్రతిభుడయ్యాడు. అక్కడ భోంచేసి, బావగారైన రామారావు దగ్గరకు వెళ్లి రాయబారం విఫలమైనదని చెప్పాడు. 

రామారావు వెంటనే వెళ్లలేదు. తన భార్య విడిగా ఉండటం గురించి అందరు అడుగుతుంటే అవమానం అయిపోతోందని ఓ పదిరోజుల తరవాత వెళ్లాడు.

‘‘ఇంటికి రా!’’ అన్నాడు.

‘‘ఎవరింటికి?’’ అని అడిగింది కమల.

‘‘మనింటికి’’ అన్నాడు రామారావు.

‘‘అది మన ఇల్లు అన్న విషయం మీ నోటంట మొదటిసారి వింటున్నాను’’

‘‘ఎప్పుడు కాదన్నాను?’’

‘‘లక్షసార్లు’’ కమల ఒక్కొక్క సందర్భం చెప్పుకు వచ్చింది.

కమల పుట్టింటి విషయం వచ్చినప్పుడల్లా ‘‘మీ ఇంట్లో అట్లాగేమో కాని...’’ అంటూ ఉంటాడు. కమలను వేరు చేస్తూ ‘‘మా ఇంట్లో అట్లా కాదు’’ అంటూ ఉంటాడు. ఎన్నాళ్లయినా ‘మీ’ ‘మా’లు పోయి మన అన్న మాట ఏర్పడలేదు. ఏదన్నా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే, ‘‘ఇది నా యిల్లు. నా ఇంట్లో నా మాటే నెగ్గాలి’’ అనేవాడు.

‘‘నా పుట్టింట్లో ఇది నా యిల్లంటారు. మీరేమో నా పుట్టింటి గురించి ‘మీ ఇల్లు’ అంటూ ఉంటారు. ఈ రెండింటిలో ఏది నా యిల్లు?’’ అడిగింది కమల ఓరోజు.

‘‘ఆడవాళ్లకేమిటి! అన్నీ వాళ్ల ఇళ్ళే’’ అని దాన్ని హాస్యంలోకి దింపి కొట్టిపారేసాడు.

కమల ఇంట్లోంచి బయటికి వచ్చిన నెల రోజులకి తల్లిని ఒప్పించి తీసుకు వెళ్లటానికి కొడుకు నారాయణ వచ్చాడు.

‘‘అమ్మా పోనీ వచ్చి నా దగ్గర ఉండు’’ అన్నాడు.

‘‘నీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది! ఉద్యోగం వదులుకొని వచ్చినా నీ ఇంటి పద్ధతి నాకు పడదు. నాకోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా’’ అంది కమల.

‘‘అమ్మా! నా ఇంట్లో నా భార్యకుగాని నాకు గాని పూర్తి స్వేచ్ఛ ఉందా?’’ అన్నాడు నారాయణ.

‘‘కావచ్చు, కాని నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు’’ అంది కమల.

‘‘అమ్మా, భార్య భర్తకి బానిస. భర్త మొత్తం కుటుంబానికి బానిస. పూర్తి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. పరిమితుల్ని గుర్తించటమే స్వేచ్ఛ అంటారు’’ అన్నాడు నారాయణ.

‘‘నాకు పెద్ద విషయాలు అర్థంకావురా నారాయణా! వ్యవస్థ మారితేగానీ మారనివి కొన్ని వున్నాయి నిజమే. కాని కొన్ని వ్యక్తులు మారటం ద్వారా మారగలిగినవి ఉన్నాయి. మగవాళ్లు మాటల్లో, ప్రవర్తన్లో కొంత అహంకారాన్ని వదులుకుంటే, స్త్రీలకి ఓ మనస్సుందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో మల్లెలు పూస్తాయి.’’

‘‘ఇది నీ ఇల్లా అమ్మా?’’ నారాయణ అడిగాడు.

‘‘అవును. ఇక్కడ నా మాట చెల్లుతుంది’’ అంది కమల.


(సాక్షి సాహిత్యం; 29 అక్టోబర్‌ 2018)


 



 

Wednesday, November 13, 2024

ఆలూరి బైరాగి ‘జేబుదొంగ’


ఆలూరి బైరాగి 


కవీ కథకుడూ ఆలూరి బైరాగి (1925–1978) ‘జేబుదొంగ’ కథకు సంక్షిప్త రూపం ఇది. సంక్షిప్తం: సాహిత్యం డెస్క్‌. ఇందులోని చిక్కటి కవిత్వాన్ని అనుభవించాలంటే మాత్రం పూర్తి పాఠం చదవాల్సిందే. ‘ఆగమ గీతి’, ‘నూతిలో గొంతుకలు’ కవితా సంపుటాలు, ‘దివ్య భవనం’ కథాసంపుటి బైరాగి ప్రసిద్ధ రచనలు.

–––

నువ్వూ నేనూ ఒకటే


నీవు సిద్ధంగా లేని సమయాలలో వస్తాడు. నీవు సిద్ధం కాకముందే వెళ్లిపోతాడు. అతడు వచ్చిన క్షణం మెరుపు మెరుస్తుంది. ఒక క్షణం అంతా వుంటుంది. ఏదీ లేకపోదు. ఆ మనిషి. మనుష్యమాత్రుడు కాదుగాని కేవలం మనుష్యుడు. ఈ క్షణం ఆకాశం క్రింద ఈ ప్రదేశంలో రెండుడుగుల మేర మానవుడా! కొంచెం కరుణ కావాలి కదూ!

అతను తెనాలి స్టేషనులో ప్లాట్‌ఫారం మీద కూచుని వున్నాడు. పేరు ప్రసాదరావు. మెడ్రాసువెళ్లే మెయిలు కోసం ఎదురుచూస్తున్నాడు. ఎవరినో పంపించటానికి వచ్చాడు.

రాత్రి తొమ్మిది గంటలవుతున్నది. బండి రావటానికి అరగంట టైమున్నది. ముందు జాగ్రత్త వున్న ప్రయాణీకులు అప్పుడే ప్లాట్‌ఫారం మీద నిండారు.

ప్రసాదరావు గొంతుకు కూర్చుని వున్నాడు. అతనికి కొంచెం దూరంలో పక్కచుట్ట మీద కుదురుగా కూర్చునివున్నారు పూర్ణచంద్రరావు. ఆయనకు కొంచెం దూరంలో ఆయన భార్య చతికిలబడి వున్నది. ఆమె ఒక మాంసపు ముద్ద. వాళ్లిద్దరిని చూడగానే లక్ష్మీదేవి దయ వాళ్లమీద లేకపోలేదని తోస్తుంది. పూర్ణచంద్రరావు గారికి మెడ్రాసులో ఏదో మంచి ఉద్యోగం అయిందట. గంపెడు సామాన్లతో బండి ఎక్కడానికి సిద్ధంగా వున్నారు.

పూర్ణచంద్రరావు ఇందాకటినుంచి ఏదో మాట్లాడుతూనే వున్నారు. అతను ఊకొడుతూనే ఉన్నాడు. చేయబోయే ఉద్యోగం సంగతి, ఇళ్లు దొరకటం ఎంత కష్టమో, ఆంధ్రుల అరవల తగాదాల సంగతి... ఆఖరుకు ఆయన ఏం చెబుతున్నది కూడా వినటం మానేశాడు అతను. అతని ధ్యాసంతా ఒక బలవత్తరమైన సమస్యపై కేంద్రీకరించబడి వున్నది. సమస్య కొత్తదేమీ కాదు. వయస్సు వచ్చిన దగ్గర్నించీ బాధిస్తున్న సమస్యే. అర్జెంటుగా కొంత డబ్బు కావలసి ఉన్నది. డబ్బు ఎప్పుడూ కావలసిందే! కాని ఇప్పుడు ప్రత్యేకంగా అవసరం వచ్చింది.

అతను ఆ సాయంత్రమే వెళ్లి పూర్ణచంద్రరావుగారిని డబ్బు అడిగాడు. ఆయన ఇస్తాననిగానీ, ఇంత ఇస్తాననిగానీ చెప్పలేదు. లేదనీ చెప్పలేదు. అందువల్ల అతను ఆశ పెట్టుకొనే ఉన్నాడు. కాని పక్షంలో లేదని చెప్పేవాడేగా? ఈ ఆశతోనే ఆ సాయంత్రమంతా ఆయనతో గడిపాడు. కాని మళ్లా డబ్బు ప్రస్తావన రాలేదు. అతనికి ఆ ప్రస్తావన తెచ్చే సాహసం లేదు. అసలు వచ్చి అడిగినందుకే పశ్చాత్తాప పడుతున్నాడు. అందువల్ల అతను మనస్సు ఎక్కడో పెట్టుకుని కాళ్లు గుదులు పట్టిన గుర్రంలా, ఉరకలెత్తుతున్న పూర్ణచంద్రరావు వాగ్దాటిని భరించాడు. అప్పటికీ చాలక తమతో బాటు స్టేషనుకు కూడా రమ్మన్నాడు. విసుగెత్తి తప్పుక పోదామని చూశాడుగానీ వీలుపడలేదు. డబ్బు లేక, ఉద్యోగం లేక డబ్బు అడగటానికి వచ్చిన వాడిమీద డబ్బు ఉండి, మంచి ఉద్యోగం ఉండి, అప్పు పెట్టగలిగిన వానికుండే ఆధిక్యత పూర్ణచంద్రరావుకు అతని మీద ఉంది.

జరుగుతున్నదంతా అతనికి ఒక కల మాదిరిగా ఉంది. ఎందువలనోగాని అతను ఆ డబ్బు అడగడానికి వచ్చిందీ, డబ్బు లేక కష్టాలు అనుభవించపోతున్నదీ తానేనని భావించలేకపోతున్నాడు. కాని ఒక ప్రక్క ఇదంతా తనకు సంభవించిందేనని తెలుసు. ఈ విధంగా అతను కొంతకాలం నుంచి రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నాడు. అందులో ఒక ప్రపంచం రెండోదాన్ని దూరం నుంచి మాత్రమే చూస్తున్నది. ఈ రెండు ప్రపంచాలకూ వంతెనలాగా డబ్బు అవసరం. 

సాయంత్రం పూర్ణచంద్రరావు మాటలు వింటూనే అతను డబ్బు దొరకటానికి ఇతర మార్గాలన్నీ ఆలోచించాడు. ఒక్కొక్క మార్గాన్నీ తీసుకుని పూర్వపరాలన్నీ ఆలోచించి, నిదానంగా ఒక్కొక్కదానికీ నీళ్లు వదులుకున్నాడు. ఆఖరుకు ఏమార్గం అనుసరించినా లాభం లేదని తెలుసుకున్న తర్వాత ఒక రకమైన ప్రశాంతిలో పడ్డాడు. అప్పుడు అతని మనస్సు ఇదివరకు అతను ఎన్నడూ గమనించని విషయాలు గమనించసాగింది. మాట్లాడేటప్పుడు పూర్ణచంద్రరావుగారి మూతి వంకరగా ఒక ప్రక్కగా ఎందుకుపోతుందా అని ఆశ్చర్యపడసాగాడు. ఈ విషయాన్ని ఇదివరకు ఎందుకు గమనించలేదా అనుకున్నాడు.

అతని అవ్యక్తంలో కదులుతున్న నీడ కొంచెం చిక్కనయింది. ఇంటివాడి ముఖం కనిపించింది. ‘ఏమండీ రెండు నెలల అద్దెబాకీ!’ కానీ అది అంత కష్టమైన విషయం కాదు. ఇంటివాణ్ని ఎలాగో మాటలతో సరిపుచ్చవచ్చు. ఇబ్బంది కిళ్లీకొట్టువాడితోనే. ఇరవై ఏడు రూపాయలు. వాడి కొట్టెంత కొట్టు? వాడికి తన మీద ఎంత నమ్మకం? ఉలకడు. పలకడు. మొన్న మాత్రం ‘బాబుగారూ! లెక్క యిచ్చారు కారు. కొంచెం ఇబ్బందిగా ఉంది’ అన్నాడు. ‘కొంచెం’ అన్నాడంటే ఎంత ఇబ్బందిగా ఉండి ఉండాలి!

అతను గొంతుక్కూర్చున్న వాడల్లా కదిలాడు. నడుము నొప్పిపట్టినట్టుంది. భారమంతా మోయటం వల్ల కుడికాలు బొటనవ్రేలు నరం లాగుతున్నది.

అకస్మాత్తుగా బ్రహ్మాండమైన కెరటంలా బాహ్య స్మృతి అతనిమీద విరుచుకు పడింది. బండి వస్తున్నట్లుంది. ప్లాట్‌ఫారం రూపం మారిపోయింది. వందలకొలది తలకాయలు లేచి నుంచున్నాయి. క్రింద కూర్చున్న అతనికి తన చుట్టూ భూమిలోంచి లెక్కలేనన్ని చెట్లు మొలుచుకొచ్చి చూస్తుండగానే పెరిగి పెద్దవై ఆకాశమంత ఎత్తయినట్టు తోచింది. ఒక్క అరక్షణంలో అతనికీ, ఆ సాయంత్రం గడిచిన గడియలకూ సంబంధం తెగిపోయి మధ్య అఘాతం ఏర్పడింది. పూర్ణచంద్రరావుగారి ‘బండి వస్తున్నది. లే’ కేకతోపాటు, తనంతటతానే లేచి నుంచున్నాడు. వందల కాళ్లూ చేతులూ పెట్టెల దరవాజాల దగ్గర కొట్టుకోసాగినై. అతను నడవ నవసరం లేకపోయింది. గట్టిగా ఊపిరి పీల్చి తెప్పరిల్లి చూచేటప్పటికి రెండవ తరగతి పెట్టె ముందు కమ్మీలు పట్టుకొని నిలబడివున్నాడు. లోపల ఒక సీటు మీద బెడ్డింగు సగం పరుచుకొని పూర్ణచంద్రావుగారి భార్య నిండుగా కూచుని వున్నది. పూర్ణచంద్రరావు వాకిట్లో నిలబడి ఏదో చెపుతూ జేబులో చెయ్యిపెట్టాడు. అతని దృష్టంతా చేతిమీదే వున్నది. ఆ చేయి మెల్లగా తన చేతిలో ఏదో పెట్టింది. ఐదు రూపాయల నోటు. అతను ఏమీ మాట్లాడలేకపొయ్యాడు. అతని మనసులో మొట్టమొదట కలిగిన భావం వద్దందామని. కానీ వద్దనలేక పొయ్యాడు.

డబ్బు మీది ఆశ వలన కాదు. ఐదు రూపాయలు అతన్ని గట్టెక్కించలేవు. వద్దనే శక్తి లేకనే మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇది ఒక అవమానం కింద లెక్కగాదు. ఇప్పుడు ఆయన ఐదు ఇచ్చినా వంద ఇచ్చినా ఒకటే. ఆ ఐదు తను తేలిగ్గా తిరిగి ఇచ్చివేయొచ్చు. కాని ఇచ్చినాయన బాధపడినట్టు మొఖం పెట్టడం, ఇద్దరి మధ్యా తప్పనిసరిగా పెంచుకోవలసిన ద్వేషం, ఇవన్నీ తలచుకునేటప్పటికి అతనికి అసహ్యం వేసింది. ఆ పరిస్థితిలో అభిమానం ఒక ఆడంబరంగా తోచింది. ఇంకొకప్పుడయితే ఇలాంటిది జరిగిన పక్షంలో నొచ్చుకుని ఉండేవాడేమో? ఇప్పుడు అలా అనిపించలేదు. సాయంత్రం నుంచి జరుగుతున్నదానికి క్రమానుగతమైన పర్యవసానంలా తోచింది.

రైలు కూతవేసింది. పూర్ణచంద్రరావు వెళ్లొస్తానని చెప్పారు. చెయ్యి ఊపటానికి కూడా సిగ్గు వేసింది. దూరంగా చీకట్ల సుడిగుండంలో మాయమవుతున్న మొఖాలను చూస్తూ నిలబడ్డాడు. ఒక నిమిషం తరువాత అక్కడ ఏమీలేదు.

అతను వెనక్కు తిరిగి, ఆ యాతన నుంచి బయటపడి, వంతెన మెట్లు ఎక్కసాగాడు. ఇక ఇప్పుడు తొందర లేదు. మెల్లగా ఇష్టం వచ్చినప్పుడే గదికి చేరుకోవచ్చు. 

అకస్మాత్తుగా రాత్రి యొక్క సమ్మోహన విద్యుత్స ్పర్శ అనుభవించాడు. నగరమంతా మెలకువకూ నిద్దరకూ మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలా ఉంది. ఈపాటికి ఎక్కువమంది నిద్రపోయి ఉండరు. అంతా నిద్రల నీలవనంలో ప్రవేశించటానికి వుంకిస్తూ వుండి వుంటారు. ఈ నీడల నాటకరంగం మీద జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్లందరూ ఒకే హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతినిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడెవ్వడూ ఉత్తచేతులతో తిరిగి వెళ్లడు. ఇదే రోజువారీగా చేసే యాత్రల గమ్యస్థానం.

అకస్మాత్తుగా తన జేబు ఎవరో లాగినట్లయ్యి వెనక్కు తిరిగాడు. అతని కుడిచెయ్యి దానంతటదే ఏదో వస్తువునో జంతువునో పట్టుకున్నది. ఆ గుడ్డివెలుతురులో మెల్లగా తానొక కుర్రవాడి చెయ్యి పట్టుకొని వున్నానని గ్రహించాడు.

ఆ కుర్రవాడికి 14, 15 ఏళ్లుంటాయ్‌. అతను నడిచివచ్చిన చీకటంత నల్లగా ఉన్నాడు. వీడికేదో జబ్బు అనుకొనేటంత సన్నగా వున్నాడు. ఆకలి మొఖం మీద తాటికాయంత అక్షరాలలో రాసివున్నది. చిరిగిన చొక్కా వేసుకొని వున్నాడు. వాడి కుడిచేతిలో అతని జేబులోంచి ఇప్పుడే తీసిన ఐదు రూపాయల నోటు నలిగి గట్టిగా చిక్కుకుని వున్నది. వాడు దాన్ని ప్రపంచమంతా లాక్కోటానికి వచ్చినా వదలకుండా వుండేటంత దృఢనిశ్చయంతో పట్టుకొని వున్నాడు.

ఆ కుర్రవాడు క్రమంగా అతని దృష్టిలోంచి కరిగిపోయి, అతని నిర్దాక్షిణ్యాన్ని దూషిస్తున్నట్టూ, దేశకాలాలు మరిపించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. క్రమేపీ ద్వేషం లేని కోపం, ప్రత్యేకమైన లక్ష్యం లేని జాలి, జాలితో కూడుకున్న అసహ్యం, ఇంకా అనేక మనోభావాలు విరుచుకుపడి అతని మనఃస్థితిని ముంచెత్తాయి. వాటి బరువు క్రింద అల్లల్లాడిపొయ్యాడు. వాటి బ్రహ్మాండమైన ఆకారం ముందు అతను విశ్వరూపాన్ని సందర్శించిన వానిలా తన అల్పత్వాన్ని గుర్తించాడు. ఒక్క క్షణం అతను అన్ని మెట్టపల్లాలు అధిగమించి ఆ కుర్రవాడితో సంపూర్ణ తాదాత్మ ్మం అనుభవించాడు. తనే జేబుదొంగననీ, ఆ కుర్రవాడి జేబు తనే కొట్టినట్టూ అనుకున్నాడు. ఈ విశాల భూతలం మీద కళ్లు తెరచిన రోజునుంచీ నేటి వరకూ ఎన్నడూ అనుభవించని ఏకత్వాన్ని ఆ క్షణంలో సాధించగలిగాడు. అతనికిప్పుడు ప్రపంచమంటే అసంతృప్తి లేదు.

అకస్మాత్తుగా ఆ కుర్రవాడి భుజం మీద చెయ్యి వేసి బుజ్జగించాలనీ, దగ్గరకు తీసి లాలించాలనీ కోరిక కలిగింది. కుర్రవాడి చెయ్యి వదిలి భుజం మీద చెయ్యి వేయటానికి చెయ్యిజాచాడు. కుర్రవాడు గిరుక్కున పిల్లిలా వెనక్కు తిరిగి చీకటిలో మాయమయ్యాడు. వాడు ఐదు రూపాయల నోటును గుప్పెటతో అలాగే పట్టుకొని వున్నాడు.

అతడు కుర్రవాడు మాయం కావడం చూస్తూ నిలబడ్డాడు.


(సాక్షి సాహిత్యం; నవంబర్‌ 19, 2018)

 

Sunday, November 10, 2024

అల్లం శేషగిరిరావు ‘చీకటి’


అల్లం శేషగిరిరావు

అల్లం శేషగిరిరావు(1934–2000) ‘చీకటి’ సంక్షిప్త రూపం ఇది. 1995లో అచ్చయింది. ఆయన ఒరిస్సాలో జన్మించాడు. రైల్వేలో పని చేశాడు. రెండు కథా సంకలనాలు ‘మంచి ముత్యాలు’, ‘అరణ్య ఘోష’ ప్రచురించాడు. నాకు నచ్చే కథకుల్లో అల్లం శేషగిరిరావు ఒకరు.

––––

మనిషిలోని వెలుగు చీకటి


బాతుల వేటకు బయల్దేరాడు కెప్టెన్‌ వర్మ. డబుల్‌ బేరల్‌ షాట్‌గన్‌ భుజానికి తగిలించుకుని హంటింగ్‌ సూట్లో బంగళా మెట్లు దిగాడు. వెంట పెంపుడు కుక్క సీజర్‌. తంపర వైపు నడుస్తున్నాడు. చుట్టూ చీకటి. చలి మంచు. పొల్లాల్లో నక్కల మంద ఊళ. క్రాంక్‌... క్రాంక్‌... ఆకాశంలో బాతుల మంద.

అదే చీకట్లో, అదే తంపర వైపు పిట్టల వేటకు బయల్దేరాడు డిబిరిగాడు. వయసు అరవై దాటింది. గోచీ తప్ప మరేమీ లేదు. చేతిలో నాటు తుపాకి. భుజానికి పాత మురికి సంచి. అందులో ముసలి పెంపుడు కొంగ. సంచీలోంచి నాటుసారా తీసి డగ్‌డగ్‌మని గుటకేశాడు. బీడీ వెలిగించాడు. 

తంపర ఒడ్డున మొగలి డొంకలో కూర్చున్న వర్మకు దూరంగా ఏదో దీపం కదులుతున్నట్టనిపించింది. అప్పుడే బాతుల మంద నీటి మీద వాలడానికి చక్కర్లు కొడుతోంది. చీకట్లో రెండు మెరుపులు ధన్‌ ధన్‌. తుపాకి నిప్పులు కక్కింది. ధప్‌ ధప్‌ మని మంటిముద్దల్లా చచ్చిన బాతులు. వాటిని నోట కరుచుకుని ఒడ్డుకు తెచ్చింది సీజర్‌. రిలాక్సింగ్‌గా సిగరెట్‌ వెలిగించి ముందుకు నడిచాడు వర్మ. దూరంగా డిబిరిగాడు చలి కాగుతున్నాడు. ‘దండాలు దొరా’.

‘నీది ఏ ఊరు?’

‘నక్కలోణ్ణి’

‘ఏ ఊరు?’

‘ఎక్కడుంటే అదే మా ఊరు’

‘ఈ రాత్రప్పుడు ఏం చేస్తున్నావు?’

‘ఏటకి వచ్చాను’ చెప్పాడు డిబిరి. దీపం ఎలుతుర్లో ఏట. బుర్ర మీద లాంతరుంటుంది. మనిషి నీళ్లల్లో ఉంటాడు. లాంతరు లైటుకి పిట్టలు ఎగిరొచ్చి వాల్తాయి. వాలగానే గబుక్కున లాగేయాలి. పక్క పిట్ట కూడా పోల్చుకోకూడదు. చిన్నప్పుడు వాళ్ల బాబు దగ్గర నేర్చుకున్నాడు.

‘పిట్టలు దొరికాయా?’

‘రెండు మూడు దీపం ఎలుతుర్లో చెక్కర్లు కొట్టాయి. నువ్వు దూరంగా తుపాకి పేల్చావు. ఆ శబ్దానికి పారిపోయాయి. మరి దిగవు’. అర్థం కాకుండా నవ్వాడు డిబిరి. నీ ఏటతో నా ఏటకి దెబ్బకొట్టేశావనే నిస్పృహ. వర్మ మనసు చివుక్కుమంది. 

నాటుసారా తీసి గడగడా తాగేశాడు డిబిరి. ఎర్రటి కళ్లు. లస్క్‌ ఠపక్‌ లస్క్‌ ఠపక్‌. మందు ఎక్కువైందనుకున్నాడు వర్మ. దూరంగా పెంపుడు కొంగ సైతాన్‌ పట్టినట్టు దగ్గింది. వెళ్లి వలను తెచ్చాడు. డిబిరి సంచీ పక్కనే నాటు తుపాకి. దాన్ని చేతిలోకి తీసుకుంటూ సిగరెట్‌ ఇచ్చాడు వర్మ.

‘సారూ అది మర్డరీ తుపాకి’.

వర్మకు షాక్‌ కొట్టినట్లయింది. వెనక్కిచ్చేశాడు.

‘ఈ కొంగను పెంచుతున్నావా?’

ఏ జాతి పిట్టల్ని పట్టుకోవాలంటే ఆ జాతి పిట్టను మచ్చిక చేసుకోవాలి. వల మీద దీన్ని ఉంచాలి. దీన్ని చూసి అక్కడ కూడా మేతుందని నత్తగొట్లు వాలి చిక్కడిపోతాయి. కానీ దీనియమ్మ దీని అరుపులకే అవి దిగకుండా పారిపోతున్నాయని ఒక్క బాదు బాదాడు డిబిరి. అది కేర్‌మంది.

‘ఇది ఎగిరిపోదా?’

దానికి చూపులేదు. కంటిరెప్పల్ని దారంతో కుట్టేశాడు. దాని మందను చూసిందా ఎగిరిపోతుంది. చూపులేని పిట్టతో చూపున్న పిట్టల్ని వలేసి పట్టుకోవడం ఈ వేటలో తమాషా. డిబిరిగాడి హంటింగ్‌ టాక్టిక్స్‌కు అబ్బురపడ్డాడు వర్మ.

‘నత్తగొట్లు రాత్రిళ్లు రావుకదా? రాత్రి వలేశావు?’

‘గానీ సారూ తుంగ గుబుర్లలో గూళ్లు కట్టుకున్న కొండకోళ్లు, దాసరికోళ్లు  చీకట్లో కానుకోలేక వలలో చిక్కడిపోతాయి. పరదలు కూడా ఈ అరుపుకి అప్పుడప్పుడు దిగిపోతాయి. గానీ దొరా ఇందాక నువ్వు పరదల మందని బెదరగొట్టేశావు’.

‘నేనా?’

‘నువ్వు అరప దిగి అగ్గిపుల్ల గీసి సిగరెట్టు ఎలిగించలేదూ?’

అగ్గిపుల్ల వెలుగులో వర్మ తుపాకి గొట్టాలు జిగేల్‌మన్నాయి. ఆ మెరుపుకి దిగబోతున్న పరదల మంద బెదిరి వెనక్కి తిరిగింది.

‘ఇది మర్డర్‌ తుపాకీ అన్నావుకదా ఇందాక... మర్డర్‌ చేశావా?’

గారబట్టిన పళ్లతో గుసగుస నవ్వాడు డిబిరి. ‘నేను కాదు నా బాబు. ఈ తుపాకీతో ఒకే దెబ్బకి ఒకణ్ణి ఖూనీ చేశాడు’. డిబిరి పెదాలు ఆవేశంగా కదులుతున్నాయి. చూపులు గతాన్ని చూస్తున్నాయి.

‘సాలాకాలం క్రిందట... అప్పుడు తెల్లదొరలుండేవోళ్లు. నేను చిన్నోడ్ని. ఒకరోజు ఏటకెళ్లిన మా బాబు చీకటి పడ్డా ఇంటికి రాలేదు. ఇంతలో పక్కనున్న మావోడు వచ్చి, ‘ఏట్రా డిబిరిగా! నీ బాబుని నిన్నటినుంచి పోలీస్‌ స్టేషన్లో కుళ్లబొడిచేస్తున్నారు’ అన్నాడు.

‘ఎందుకూ?’

‘దొంగతనం చేశాడట. షావుకారి ఇంట్లో బంగారం పోయిందట’. 

కంగారెత్తిపోయి పరుగెత్తాడు. బాబాను రెండు చేతులూ చాచి కట్టేసి దూలానికి వేలాడదీశారు. కాళ్లు కట్టేసున్నాయి. గోచీ తప్ప వంటి మీద గుడ్డ లేదు. దబ్‌ ఫట్‌... వంటì æనిండా లాఠీ దెబ్బలు. చర్మం చిట్లి రక్తం ముద్ద కట్టేసింది. గావుకేకలు. కాళ్లు తన్నుకోలేక గింజుకుంటున్నాడు. 

‘చెప్పరా బంగారం ఎక్కడ దాచావో’

కొడుకును కొడితేనన్నా చెబుతాడేమోనని పసివాడి బుర్రను గోడకేసి కొట్టారు. బాబోయ్‌ అమ్మోయ్‌... దెబ్బకి రాత్రి తిన్నది కక్కుకున్నాడు.

‘ఆడ్ని ఒదిలెయ్యండి. నేను నిజం చెబుతాను’. పోలీసులు నవ్వుకున్నారు.

బంగారం దాచిన చోటు తెల్లారి చూపాలని ఆదేశిస్తూ, ఒక పోలీసును వెంట పంపారు. వెళ్లాక, ‘బాబూ, నువ్వు దొంగతనం చేశావా?’ అడిగాడు డిబిరి. జుట్టు నిమిరి, కొడుకును పడుకొమ్మన్నాడు. 

తెల్లారి తుపాకీ అందుకున్నాడు. మెరుపు వేగంతో థూమ్‌. పోలీసు ఎగిరిపడ్డాడు. ‘దొరా! నిన్న నేను దొంగతనం చేశానని ఒప్పించారే అది పచ్చి అబద్ధం. నేను దొంగతనం చేయలేదు. ఖూనీ చేశాను’. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ముందు లొంగిపోయాడు. జైలుకి తీసుకెళ్లిపోయారు. పిల్లాడినే కోర్టులో సాక్షిగా వేశారు. నిజం చెప్పాలని బెదిరించారు. అబద్ధం మాత్రం ఎందుకు ఆడతాడు?

‘బాగా ఏట చెయ్యి బాగా తిను’ అని చెప్పాడు తండ్రి డిబిరికి. అప్పుడే దెబ్బలకు తట్టుకోగలవన్నాడు. మనవి దెబ్బలు తినే బతుకులన్నాడు.

తర్వాత అతడిని ఇంకేదో పెద్ద జైలుకు మార్చారు. చాలా రోజులైంది. ఒకరోజు డిబిరి ఉడుము మాంసం వంతులేసి అమ్ముతున్నాడు. ఒక కానిస్టేబుల్‌ వచ్చి, ‘ఓరీ ఇక్కడున్నావట్రా. నీ చెట్టు దగ్గర చూశాను. రేపు పొద్దుట నీ బాబుకు సెంట్రల్‌ జైలులో ఉరి తీస్తారట. కావాలంటే వెళ్లి చూసుకో’ అన్నాడు.

ఉరి... ఒళ్లు గజగజలాడిపోయింది. పెద జైలు చాలా దూరం. ఎలా వెళ్లాలో తెలీదు. ఉడుం మాంసం అమ్మిన పైసలు చాలవు. దాంతో అడుక్కున్నాడు. చేతులు చాచి. మా బాబుకు ఇలాగైందని చెప్పి. ఖూనీకోరు కొడుకని ఎగతాళి చేశారు. ఇక పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఎండకీ, ఆకలికీ ఓర్చుకుంటూ, చీకటినీ, వర్షాన్నీ లెక్కచేయకుండా... ఉరుకు పరుగు నడక ఆయాసం ఆకలి... వచ్చిందా? ఇంకాదూరం. మళ్లీ నడక. పరుగు. అదిగో జైలు. ‘ఏం కావాల్రా గుంట నాకొడకా’ విసుక్కున్నాడు వార్డెన్‌.

‘నా బాబుకి ఈ రోజు ఉరిసిచ్చని కబురెట్టారు’

వార్డెన్‌ వాడి కళ్లలోకి చూశాడు. ఇంత ఆలస్యమైందేంటి? తెల్లవారుజామునే ఉరి తీసేశారు!

సచ్చిపోయాడా? నా బాబు సచ్చిపోయాడా? ఒళ్లు గజగజ వణికింది. 

వార్డెన్‌ విస్తరాకులో రెండు జొన్నరొట్టెలు ఇచ్చి తినమన్నాడు. వాళ్ల బాబు చివరి కోరిక ఈ జొన్నరొట్టెలు.  ఉరితీసేముందు, ‘బాబూ నా కొడుకు ఇంకా రాలేదూ? రాలేదుగానీ వస్తాడు. రాత్రంతా కడుపు నకనకలాడిపోతూ పరుగెత్తుకుంటూ వస్తాడు. వాడికియ్యండి బాబూ’ అన్నాడు.

బాబు శవాన్ని పాతిపెట్టిన చోటే కూర్చుని ఆ రొట్టెలు తిన్నాడు డిబిరి.

’ ’ ’

గతం పూర్తయ్యేసరికి తూర్పు ఆకాశం మీద వెలుగు. నత్తగొట్టు ఇక వేటకు పనికిరాదని చాకుతో మెడ సఫా చేశాడు డిబిరి. పెంచుకున్న కొంగను చంపడం వర్మకు పాపం అనిపించింది. అమానవీయం. తుపాకీతో కాల్చడానికీ చాకుతో కోయడానికీ మధ్య తేడా ఏమిటన్నాడు డిబిరి. కోడిని పెంచి కోసుకుని తినవా సారూ? ‘ఈరోజు నేను దీనినే తిని పొట్టనింపుకోవాలా! లేదంటే ఆకలితో సవ్వాలా!’ ఏది పాపం? భుజానికి సంచీ తగిలించుకున్నాడు డిబిరి. అప్పటికే వర్షం మొదలవుతోంది. అలాగే నిల్చుండిపోయాడు వర్మ.

(సాక్షి సాహిత్యం; మార్చ్‌ 12, 2018)


 

 

Friday, September 20, 2024

చిలుకూరి దేవపుత్ర: ఊడల మర్రి


చిలుకూరి దేవపుత్ర

చిలుకూరి దేవపుత్ర (24 ఏప్రిల్‌ 1952 – 18 అక్టోబర్‌ 2016) ‘ఊడల మర్రి’ కథకు సంక్షిప్త రూపం ఇది. పాతికేళ్ల క్రితం 1993లో ఆహ్వానం పత్రికలో అచ్చయింది. దేవపుత్ర అనంతపురంలో జన్మించారు. రచనల్లో దళిత జీవన చిత్రణ చేశారు. వంకర టింకర, ఆరు గ్లాసులు, ఏకాకి నౌక చప్పుడు, బందీ లాంటి సంపుటాలుగా ఆయన కథలు వెలువడ్డాయి. అద్దంలో చందమామ, పంచమం, కక్షశిల, చీకటిపూలు ఆయన నవలలు.

––––––––––

ఊడల మర్రి


ఆ మరుసటి రోజు జరుగనున్న పంచాయితీ ఎలక్షన్లకు గానూ ఆ సాయంత్రానికల్లా వీరాపురం చేరుకున్నాం. జనరల్‌ ఎలక్షన్‌ అయితే తక్కువ సిబ్బందే ఉండేదే. పంచాయితీ ఎలక్షను అయినందువల్ల మా సిబ్బందే చిన్నసైజు బెటాలియనంత ఉంది. లెక్క ప్రకారం ముప్పయి మందన్నమాట! పోలింగు కేంద్రమైన ఎలిమెంటరీ స్కూలు ముందు ఓ బోరింగు ఉండటంతో అందరం దానిమీదికి దాడి జరిపాం, ముఖ ప్రక్షాళన కోసం.

అప్పటికే పొద్దు కుంకింది. చీకట్లు ఆ పల్లెనంతటినీ ఆక్రమించుకోవడం ప్రారంభించాయి. మా పోలింగు కేంద్రానికి కరెంటు లేదు. ఊళ్లో నించి రెండు పెట్రోమాక్స్‌ లైట్లను మోసుకొచ్చారు తలార్లు.

‘‘మనందరికీ భీమప్ప గారింట్లో భోజనాలు అరేంజి చేశారట’’ అంటూ అందర్నీ ఉద్దేశించి చెప్పాడు ఎలక్షను ఆఫీసరు.

‘‘అలాగే సార్‌! కవర్ల మీద పంచాయితీ పేరు రాయడం, బ్యాలెట్‌ పేపర్ల వెనుక సీలు కొట్టడం అవీ పూర్తి చేసుకుంటే భోంచేసి వచ్చాక తక్కిన పనులు చేసుకోవచ్చు’’ అన్నాను నేను.

‘‘భోంచేశాకే ఏ పని అయినా మొదలుపెట్టగలం’’ అన్నాడు నీరసంగా మా హనుమంత రాయుడు. ఆయనా నేనూ సహోపాధ్యాయులం. నేను తెలుగు టీచర్ని, ఆయన హిందీ టీచరు. నా మూలవేతనం ఆయన మూలవేతనం కంటే తక్కువ కావడంతో ఆయన్ని పోలింగు ఆఫీసరుగానూ, నన్ను అసిస్టెంటు పోలింగు ఆఫీసరుగానూ వేశారు.

హనుమంత రాయుడు అన్నది ఎలక్షన్‌ ఆఫీసరు విన్నారేమో– ‘‘భోంచేసుకుని వచ్చాకే పని మొదలు పెట్టవచ్చులెండి’’ అంటూనే దూరంలో నిలుచుని బాతాఖానీ కొడుతున్న కానిస్టేబుల్స్‌ని ఉద్దేశించి ‘‘మేం ఒక అరగంటలో భోజనాలు చేసుకుని వచ్చేస్తాం. జాగ్రత్త, ఎవర్నీ రానీయకండి. మీకు భోజనాలని తలారితో ఇక్కడికే పంపే ఏర్పాటు చేస్తాం’’ అంటూనే అడుగులు వేయసాగాడు. అందరం ఉత్సాహంగా ఆయన్ని అనుసరించాం.

రెండు పంక్తులు తీరి ఆవురావురుమంటూ భోంచేస్తున్నాం. కొద్ది దూరంలో ఘనమైన చెక్కకుర్చీలో కూచుని ఉన్నాడు భీమప్ప.

‘‘సర్పంచు పదవికి ముప్పయి అయిదేళ్లుగా నేనే పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చినాను సార్‌. గవర్నమెంటోళ్లు ఈసారి షెడ్యూల్డు కులాల వాళ్లకి రిజర్వు చేసింది కదా, అందుకే పోటీ చేయడం లేదు’’ అన్నాడు.

భోమప్ప ఆకారంలో భీముడిలాగానే ఉన్నాడు. నిడుపాటి విగ్రహం, బుర్రమీసాలు, రోల్డుగోల్డ్‌ ఫ్రేమ్‌ కళ్లజోడు. మెర్క్యూరీ లైట్‌ వెలుతుర్లో అతని పంచె, చొక్కా మరింత తెల్లగా మెరిసిపోతున్నాయి.

‘‘ఇంతకీ మీ క్యాండిడేట్‌ని చూపనేలేదు’’ అడిగాడు ఎలక్షన్‌ ఆఫీసరు. పెళ్లికి వెళ్లి పెళ్లి కొడుకును చూడకుండా ఎవరైనా ఉంటారా? ఆఫీసరుకి ఉన్న కుతూహలమే నాకూ ఉంది.

అందరం భోజనాలు చేసేసి వరండాలో వేసివున్న నల్లకంబళి మీద కూచున్నాం. వరండా ముందున్న గాటిపట్లకు నాలుగు జతల దేశపు ఎద్దులు కట్టేసి ఉన్నాయి. ట్యూబ్‌లైట్‌ వెలుతుర్లో వాటి కొమ్ములు నిగనిగలాడుతున్నాయి.

పెద్ద స్టీలు కంచంలో తాంబూలం ఉంచారు. ఇష్టమున్నవాళ్లు తాంబూలం వేసుకుంటున్నారు. మరికొందరు సిగరెట్లు వెలిగించారు. నేను రెంటినీ సేవించడానికి ఉపక్రమించాను.

‘‘ఏం సార్, మా కాండేట్‌ చూడాల్లంటిరే. అగ్గో వాడే. పేరు ఓబులుగాడు’’ అన్నాడు భీమప్ప– ఎద్దులకి పొట్టు వేస్తున్న జీతగాడిని చూపిస్తూ.

పాతకాలపు సల్లాడం, చిరిగిన బనియను, చింపిరి నెత్తికి మాసిపోయిన ఎరుపుగళ్ల తువ్వాలు చుట్టి ఉన్నాడు. వయసు ఏభై లోపే ఉండవచ్చు.

‘‘మీరంతా ఆశ్చర్యపోతున్నారు అవునా? ఈ గుడ్డి గవర్నమెంటు రిజర్వేషను పెట్టిందే. ఏం జేసేదిమల్ల. ఎట్లా ఈ నా కొడుకు మాలనాయాలే. ఈడయితే మనం యాడుండమంటే ఆడ పడి ఉంటాడు’’ అంటూ భీమప్ప చెప్పుకుపోతున్నాడు. మా వాళ్లందరూ నోళ్లు వెల్లబెట్టి వింటున్నారు.

ఓబులేసు– భీమప్ప మాటలు కానీ, మా చూపుల్ని కానీ పట్టించుకునే స్థితిలో లేడు. ఎలక్షన్‌ గెలుస్తానా, లేదా అన్న ఆందోళన, ఆదుర్తా నామమాత్రంగానైనా లేవు.

భీమప్ప దగ్గర్నించి సెలవు తీసుకుని మళ్లీ పోలింగు కేంద్రానికి చేరుకున్నాం.

‘‘మొత్తానికి భీమప్ప అసాధ్యుడప్పా! ఈ ఊర్లో ఆయప్పకి మాంచి పలుకుబడి ఉంది. అవతల అభ్యర్థికి డిపాజిట్లు గల్లంతయినా ఆశ్చర్యం లేదు’’ అన్నాడు హనుమంత రాయుడు.

‘‘అప్పుడే ఎంక్వయిరీ చేసినావా? అసాధ్యుడప్పా నువ్వూ’’ అన్నాను.

పోలింగు ఉదయం ఎనిమిదికి ప్రారంభమయి ఒంటిగంటకి ముగిసింది. 90 శాతం ఓట్లు పోలయినాయి. మధ్యాహ్నం భోజనం అక్కడికే పంపించాడు భీమప్ప. 2 గంటల నుంచీ ఓట్ల లెక్కింపు మొదలయింది.

సాయంత్రం నాలుగున్నర అవుతున్నట్లే ఊరు ఊరంతా స్కూలు ముందర నిలబడింది. అందరి మొహాల్లోనూ ఫలితాలు తెలుసుకోవాలనే ఆత్రం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది.

అయిదు గంటలు అవుతున్నట్టే ఫలితాలు ప్రకటించారు మా ఆఫీసరు. ‘‘ఓబులేసు 800 ఓట్ల మెజారిటీతో గెలిచాడు’’ అంటూ.

విజిల్స్, చప్పట్లు, వెర్రికేకలు– ఏం చేయాలో తోచని జనం భీమప్పకి ‘జై’ కొడుతున్నారు.

అంతమంది హర్షధ్వానాలూ, కేరింతలూ మిన్నుముడుతున్నా ఎక్కడా ఓబులేసు జాడలేదు.

‘‘ఎక్కడండీ గెలిచిన అభ్యర్థి? అతను తొందరగా వస్తే సర్పంచుగా ప్రమాణ స్వీకారం చేయించేస్తే మా పని పూర్తి అయిపోతుంది’’ అంటూ ఆఫీసరు భీమప్పతో అంటున్నాడు.

‘‘వస్తాడు లెండి సార్‌’’ అన్నాడు భీమప్ప. అతని మొహంలో ప్రత్యర్థి రామానాయుడి క్యాండేట్‌ని దెబ్బతీసిన ఆనందం తొణికిసలాడుతోంది.

ఎక్కడినుంచో రానే వచ్చాడు ఓబులేసు. రాత్రి ఎట్లా చూశానో అట్లానే ఉన్నాడు. కాకపోతే తలకు కొంచెం చమురు రాసి దువ్వుకొని, తువ్వాల్ని భుజనా వేసుకొని ఉన్నాడు. సల్లాడంలోనూ, బట్టబనియన్‌లోనూ మార్పేమీ లేదు.

‘‘రండి ఓబులేసు గారూ! లోపలికి’’ అంటున్నాడు ఎలక్షన్‌ ఆఫీసరు.

అతడు గదిలోకి అడుగు పెట్టడం లేదు, సిగ్గు పడటం లేదు, అలాగని భయపడుతున్నాడని చెప్పడానికీ లేదు. ‘‘నేను బళ్లోకి రాగూడదు సారూ! అదీగాక అక్కడ మా అయ్య ఉండాడు ఎట్ల సారూ? నన్ను ఈడనే ఉణ్ణీయండ్రి’’ అన్నాడు.

‘‘చూడండి ఓబులేసు గారూ! మనది ప్రజాస్వామ్య దేశం. కులాలకీ, మతాలకీ అతీతంగా ఉండే లౌకిక రాజ్యం. పెద్దోళ్లూ చిన్నోళ్లూ అన్న తేడాలు ఉండనేకూడదు. తక్కువ కులాలని పైకి తేవాలనే ప్రభుత్వం ఇలా రిజర్వేషన్లని పెట్టింది. మీరు ఎన్నికయినారు, నా మాట విని రండి’’ ఆఫీసరు ఓ మినీ లెక్చరిచ్చాడు. చివరి వాక్యం తప్ప ఓబులేసుకు ఒక్క ముక్క కూడా అర్థమయివుండదు.

‘‘సర్పంచుగా గెలిచాక ప్రమాణ స్వీకారం చేయక తప్పదు పదండీ’’ అంటూ పోలింగు ఆఫీసర్లంతా చెప్పేటప్పటికి–

‘‘మా అయ్య ఎదురుంగ నేను కూసోవల్లా? నా వల్ల గాదు సామీ’’ అంటూ ఏడుపుమొహం పెట్టాడు ఓబులేసు.

‘‘మీరయినా చెప్పండి భీమప్ప గారూ’’ ఆఫీసరు నిస్సహాయంగా చూస్తూ అన్నాడు.

‘‘నేనేంది చెప్పేది. వాన్ని పట్టుకోని అండీ, గుండీ, గారూ, గీరూ అంటే ఇంటాడా ఆ నా కొడుకు. ఓబుళుగా! రావోయ్‌’’

భీమప్ప పలుకు వినబడేసరికి ఠక్కున లోపలికి వచ్చేశాడు ఓబులేసు.

‘‘ఆఫీసరు గారూ! నాదొక్కమాట. ఈ గది పెద్దదే కదా, చాపలూ కంబళ్లూ తెప్పిస్తానూ. కింద కూచుని ప్రమాణ స్వీకారం చేయించండి సరిపోతుంది. అందరికీ సరిపోయేటన్ని కుర్చీలు లేవు కదా’’ అన్నాడు భీమప్ప.

‘‘సారీ అండీ భీమప్ప గారూ! ప్రమాణ స్వీకారం చేయించడం నేల మీద కాదు. అది సాంప్రదాయం కూడా కాదు. మీరు ఏమనుకోకుండా ప్రేక్షకుల్లో కూచోండి’’ అంటూ భీమప్పకి చాప చూపించాడు ఆఫీసరు.

గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు గుడ్లు మిటకరిస్తూ ప్రేక్షకుల్లో కూలబడ్డాడు భీమప్ప. 

ప్రమాణ స్వీకారం పూర్తయింది. 

ఉపసర్పంచి ఎన్నిక కూడా పూర్తయింది. 

జనం అంతా వెళ్లిపోయారు. 

ఇక జరగాల్సిందల్లా ఓట్ల పెట్టెల్నీ, మెటీరియల్నీ తిరిగి లారీలోకి ఎక్కించి మేము బయల్దేరడమే. అక్కడే వచ్చింది చిక్కు. చావు కబురు చల్లగా చెప్పాడు లారీడ్రైవరు, చెడిపోయిందంటూ. అప్పటికే ఏడున్నర అవుతోంది. చీకటి ముసురుకుంది. మధ్యాహ్నం ఎప్పుడో తిన్న అన్నం ఎప్పుడో అరిగిపోయింది. మరో లారీ తేవడానికి పట్నానికి వెళ్లాలన్నా సాయంత్రం అయిదు తర్వాత ఆ ఊరికి బస్సు లేదాయె. ఆ రాత్రి భీమప్ప మమ్మల్ని భోజనానికి ఆహ్వానించలేదు.

రాత్రి పదిగంటలయింది. ఏదో మాటలు వినబడితే లేచి చూశాను. తలారి చుట్టూ గుమిగూడారు మా వాళ్లు.

‘‘భలే తన్నిరిలే సారూ! వానికి అట్లే జరగాల్సింది’’ అంటున్నాడు తలారి రాముడు.

‘‘ఎందుకు తన్నడం?’’

‘‘ఏంది సార్‌ అట్లంటావు? భీమప్ప అయ్యంటే ఏందనుకుంటివి? ఎంత పేరూ ఏం కత? అట్లా అయ్య ముందర కుర్చీలో కూచ్చుంటాడా వాడు?’’ అంటూ సాధారణమైన విషయంగా చెబుతున్నాడు తలారి.

నా మనసు చివుక్కుమంది.

(సాక్షి సాహిత్యం: 2018 అక్టోబర్‌ 22)



 

Saturday, September 14, 2024

ఈలోకం

 


చలం

మహారచయిత చలం(1929–89) కథ ‘ఈలోకం’ సంక్షిప్త రూపం ఇది. కానీ దీని పూర్తి పాఠం చదివితేనే అసలైన మజా!

–––––––––––––––

క్షణికంలో శాశ్వతానందం


మా పెద్ద తగాదా ఐన తరవాత మూడువారాలకి జయలక్ష్మి ఓనాటి ఉదయం చీటీ పంపింది. కాని నాకు తెలుసు. కలుసుకున్నా లాభం లేదు. సాయంత్రం లోపలే మళ్లీ పోట్లాడుకుంటాము. కాని పోట్లాడి విడిపడ్డ తరవాత, జీవితంలో యీ కాసిని గంటలూ ఎందుకు వృథా చేసుకుంటున్నామా అని నిశ్చయంగా పరితాపపడి నిలవలేక నిమిషాలమీద కలుసుకుంటాము.

కాదు. ఈవేళ స్పష్టంగా మాట్లాడి వొస్తాను. ఇక లాభం లేదని, నా కోసం చీటీ రాయవద్దని, నిశ్చయంగా చెప్పేసి వెళ్లిపోతాను. ఈ మాత్రం అందం దొరకదా ఏమిటి నాకు?

సామాను సద్దమన్నాను నౌకర్ని. బొంబాయికి బెర్తు రిజర్వు చేయించాను. తాత్సారం చేసి చేసి నాలుగింటికి బైలుదేరాను జయలక్ష్మి ఇంటికి. 

తలుపు లోపల గడియవేసి వుంది. గట్టిగా తలుపు కొట్టాను. దూరంనించి దాసీది కనకం వొస్తున్నానని కేకవేసింది. అమ్మగారు తలంటి పోసుకుంటున్నారుట.

గదిలో కూచున్నాను. అరగంటయింది. దూరంగా నీళ్లు పోసుకుంటున్న చప్పుడు తప్ప ఇంకేం వినపట్టంలేదు. రాదేం ఇంకా? కావలిసే ఈ ఆలస్యం? సరాసరి నీళ్ల గదిలోనికి వెడితే?

‘‘జయా!’’ నమ్రతగా పిలిచాను.

‘‘ఏం సంగతి!’’ వెక్కిరింపు.

‘‘ఎంతసేపు’’

‘‘నాలుగు గంటలు కాలయాపన చెయ్యగలిగిన అయ్యగారికి యీ పది నిమిషాలు భారమైనాయి గావును’’ అని చీదరించుకుంది.

నా కోపాన్ని మింగుకుని– ‘‘ఒక్కసారి నిన్ను చూడనీ.’’

‘‘వీల్లేదు. నేను వొచ్చేలోపల దొడ్లోకి వెళ్లి స్తానం చేస్తున్న నీటి కాలవని ఆరాధించండి.’’

విసుక్కుని దొడ్లోకి పోయినాను. తూములోనుంచి నవ్వుతో దూకుతున్నాయి తెల్లటి నీళ్లు– వట్టివేళ్ల సున్నిపిండితో పరిమళమైన నీళ్లు.

ఇంతేనా? ఈమెని విడవలేనా? మళ్లీ ఆ మాయలో పడుతున్నానా? స్త్రీలేంది బతకలేను. స్త్రీతో వేగలేను. ఈ చక్రంలోంచి విముక్తి లేదా? మోహప్రవాహంలో ఇట్లా కొట్టుకుపోవడానికి వొప్పుకోను.

ఆ నీళ్ల కాలవ వెంట పదడుగులు నడిచాను. ఆ నీళ్లు ఓ మురిగిన పేడకుప్పని పాయలై చుట్టుకుంటున్నాయి, స్త్రీ హస్తాల వలె. చప్పున పెద్ద విరక్తి తోచింది. ఇంతే స్త్రీ మోహం. ఇంతకన్న నీచం ఇంకేంలేదు.

నా కళ్లముందు ప్రపంచం తళతళమంది. దివ్యచక్షువు తెరుచుకున్నట్టయింది. ఇల్లు దొడ్డి అన్నీ మాయమైనాయి. నా ముందు ఆ మురిగిన పేడకుప్ప తప్ప యింకేం కనిపించలేదు. ఆ పేడకుప్ప పెరిగి నా లోకమైపోయింది. నా దృష్టి ఆ పేడని చీల్చుకుని చూస్తోంది. కుప్పనిండా పురుగులు– పెద్దవీ, చిన్నవీ. వాటి సంభాషణ కూడా అర్థమౌతోంది.

టీచరు: ‘‘భూమి గుండ్రముగా వుందనడానికి నిదర్శనం ఏమిటి?’’

విద్యార్థి: ‘‘ఎంత తిరిగినా పేడ తప్ప ఏం కనిపించదండీ.’’

టీచరు: ‘‘రైట్, పది మార్కులు. కొన్ని యుగాల కిందట, ఈ భూమి పొగలు కక్కుతూ ఉండేదిట. ఇప్పుడు చల్లారింది. అటు తరవాతే యీ జీవసృష్టి ప్రారంభమైంది.’’

(ఇందాకనేకదా ఆవు పేడ వేసింది. ఆ వేడి సంగతి గావును!)

పక్కనే ఇంకోచోట ఒక సభ జరుగుతోంది. అక్కడ కాషాయ వస్త్రాలు వేసుకున్న పురుగూ, నల్లటి సూటు వేసుకున్న తెల్లటి పురుగూ సభలో ఎత్తు స్తలం మీద కూచున్నారు. సూటు పురుగు ఉపన్యాసం ఇస్తోంది.

‘‘నిన్న రాత్రి నాకు కలలో ఈశ్వరుడు కనబడ్డాడు. ఈ కొత్త మతవిధానాన్ని ప్రసాదించాడు. ఇంక కొత్తయుగం ప్రారంభం కాబోతోంది. ఇంక మరణభయం లేదు’’

ఇంతలో పొరుగమ్మ వొచ్చి పేడ ఓ ముద్ద చేతిలోకి తీసుకుంది. ఆ ముద్దలో యీ ఉపన్యాసకుడు కూడా లేచి వెళ్లిపోయినాడు. సభాసదులంతా ‘బొందితోనే కైలాసానికి వెళ్లాడని’ అతనికి గొప్ప సమాధి కట్టించడానికి తీర్మానాలు చేసుకుంటున్నారు.

ఆ పక్కనే ఓ ఆడపురుగు తన పిల్లతో అంటోంది– ‘‘ఒసే ఎన్నడన్నా మన వంశంలో వుందే ఇట్లాంటి నీచపు గుణం? ఆ పాడు మురికి నల్లపురుగుని నీ తోకతో దాని ముదనష్టపు తోకని కలవనిచ్చావే!’’

ఇంకోవేపు చూశాను. రెండు పురుగులు పోట్లాడుకుంటున్నాయి.

‘‘నా గీతాలు ఆచంద్రార్కంగా నిలుస్తాయి. ఈ పేడకుప్పలో నా అంత అందంగా రాసేవాణ్ణి చూపగలవా? నీ మొహం నువ్వూ ఓ కవివే!’’

రెండో పురుగు: ‘‘నా కవిత్వం ఈనాటి ప్రజలకు కాదు. నాలుగు యుగాలు పోయాక పుట్టబోయే పురుగులకి. అవి నీకన్న తెలివైన మెదడుతో పుడతాయి.’’

ఇంతలో ఓ బొండుపురుగు సమీపించి ‘‘నాకో పుస్తకం అంకితం ఇవ్వరా మీలో వొకరు? నా పేరు ఆకల్పాంతం నిలుస్తుంది. నేను పుస్తకాన్ని అందంగా పేజీకి ఒక్క పంక్తి చొప్పున అచ్చు వేయిస్తాను’’ అంటోంది.

ఇంక కొంతదూరంలో ఒక మొండిగోడల ఇల్లు కనపడ్డది. దాంటో కొన్ని పురుగులు తలకిందుగా వేళ్లాడుతున్నాయి. కొన్ని మేకుల మీద పడుకునివున్నాయి. చెక్క మీద ‘‘యోగాశ్రమం. దీంటోకి స్త్రీలు ప్రవేశించకూడదు’’ అని వుంది.

వాకిలిముందు ఒక పెద్ద సభ. ఆశ్రమపు అధ్యక్ష పురుగు ఉపన్యాసం ఇస్తోంది. ‘‘ఈలోకం అసత్యం. ఆత్మ శాశ్వతం. ఇంద్రియాల్ని అరికట్టితేనేగానీ ఆత్మజ్యోతి దర్శనం కాదు. యోగప్రభావం వల్ల గాలిలో పైకిలేచే శక్తి వొస్తుంది.’’

అంటోవుండగా ఆ వేపుకు వొచ్చిన ఓ కోడి ఆ యోగిపురుగుని ముక్కుతో పైకెత్తింది. పురుగుల కళ్లదృష్టి అంతయెత్తుకి చూడలేదు గనక ఆ యోగి అట్లా పైకి లేచి వెళ్లిపోయినాడనుకొని భక్తితో అన్ని పురుగులు సాష్టాంగపడ్డాయి.

కొన్ని పురుగులు ఒకచోట చేరి, సభ చేస్తున్నాయి. ‘‘మన పేడ వేరు, మన జాతి వేరు. పక్కనున్న నల్ల పురుగులు, అవి పేడని వుండలుగా చేసుకునిగాని తినవు. మనం ఎట్లానన్నా సత్యాగ్రహం చేసి ఐనా సరే విడిపోవాలి’’ అంటూ వుండగా పైనించి ఆవు వుచ్చపోసింది. ఆ ధారతో ఆ దేశమంతా జలమయమయింది. బతికిన ఒక జడలపురుగు ‘‘ఈ వరదలు మన తాతలు చేసిన పాపాలకి ఈశ్వరుడు కోపించి చేసిన ప్రతీకారం’’ అంటున్నాడు.

ఒక తెల్లని గడ్డంపురుగు, ‘‘ఇదేమి మూర్ఖం, మన తాతలు చేసినదానికి మన మీద కోపం కలుగుతుందా ఈశ్వరుడికి? అదేదో నీటిధార పడ్డది. శాస్త్రజ్ఞులు దానికి కారణం కనుక్కోగలరు!’’ అన్నాడు. ఆ మాటలకి పురుగుజాతికి కోపమొచ్చి, ఆ గడ్డంపురుగుని మోసుకుపోయి గట్టిపేడలో వూపిరాడకుండా పాతి చంపేశాయి.

ఇంకొకచోట అఖిల సారస్వత సమ్మేళనం. ఒక సంపాదకీయ పురుగు చచ్చిన చిన్న పురుగుమీద నుంచుని ఉపన్యాసమిస్తోంది. ‘‘ఈ పురుగు పేడ వాంగ్మయానికి చాలా సేవచేసింది. మనం ఒక్క సన్మానమూ చెయ్యలేదు. మనం చందాలిచ్చి గొప్ప స్మారకచిహ్నం కట్టాలి.’’

గుసగుసలాడుతున్నారు సభాసదులు. ‘‘చందాలన్నీ వీడే కొట్టెయ్యడానికి.’’

అక్కడే ఓ ముసలిపురుగు కొంత పేడని పోగుచేసుకుని దానిమీద కూచుంది. పిల్ల కవి పురుగులు తమ రచనల్ని అర్పించి, వరుసగా చదువుతున్నాయి. ఆ పురుగు తన యిష్టప్రకారం ‘‘ఈ కావ్యం తుక్కు. ఈ కావ్యం పదేళ్లు నిలుస్తుంది’’ అంటోంది. అందమైన ఆడపురుగుల కావ్యాలు మాత్రం ఆచంద్రార్కంగా నిలుస్తాయని దీవించి, తన పీఠం మీద కూచోపెట్టుకుంటోంది.

ఇంతలో పెద్దపెద్ద జండాలతో అరుపులతో ఓ పురుగు గుంపు ప్రవేశించింది. ‘‘లాగెయ్యండి వాణ్ణి. కిందికి లాగెయ్యండి. ఇదంతా పేడ గలవారి సారస్వతం. వీళ్లు రాసే గ్రంథాలూ, కవిత్వాలూ, ఎవరికీ అర్థం కావు. దేవుడూ భక్తీ శృంగారం ఇట్లాటివే రాస్తారు వీళ్లు. వీళ్లనీ వీళ్ల కవిత్వాన్ని ధ్వంసం చేస్తేనేగానీ శాంతి లేదు లోకానికి’’ అని చిందరవందరచేసి పోయినారు వాళ్లు.

ఇంతలో పెద్ద పెద్ద జండాలు పట్టుకుని ఓ గుంపు ప్రవేశించింది. దాంటో బక్కపురుగు, గంభీరోపన్యాసం ప్రారంభించింది. ‘‘యీ పురుగు దేశముందే యిది దేవతలు స్వయంగా నిర్మించుకున్న భూమి. దీనికి పతనం లేదు. ఇది అనంతకోటి యుగాల వరకు ప్రపంచానికి జ్యోతిౖయె వెలగాలంటే, నాకు మీ ఓట్లు యివ్వండి...’’ 

ఇంతలో జయలక్ష్మి స్నానం నీళ్లు పేడకుప్ప చుట్టూ పెద్దమడుగు కడుతున్నాయి. పేడ నాని పెళ్లలు పెళ్లలుగా కూలిపోతోంది. 

‘‘అసలు పచ్చి పేడనేగానీ మగ్గిన పేడని తినకూడ’’దని కొన్ని పురుగులు బోధిస్తున్నాయి. పేడరసాన్ని పులిపించి తాగడంవల్ల ఘోరాలు తటస్తిస్తున్నాయననీ, పేడ మద్యాన్ని నిషేధించమనీ ప్రభుత్వానికి అర్జీలు పెడుతున్నాయి కొన్ని పురుగులు.

ఇంతలో జయలక్ష్మి దాసీది వొచ్చి పొయ్యి అలకడానికి ఆ పురుగులున్న పేడనంతా ముద్దచేసి తీసుకుపోయింది. ఆ ముద్దకింద నించి రెండు తెల్లటి పురుగులు బైటపడ్డాయి. ఒకదానికి జయలక్ష్మి మొహం, ఇంకాదానికి నా మొహం. వెంటనే పేడకుప్ప నా కళ్లముందు మాయమై ప్రపంచం మామూలుగా ప్రత్యక్షమయింది. జయలక్ష్మి తలలో కదంబం, గులాబి పువ్వులు పెట్టుకుని, ఆకుపచ్చ వెంకటగిరి చీర కట్టుకుని, నవ్వుతోంది నన్ను చూసి.

‘‘ఆరాధన అయిపోయిందా?’’

‘‘ఏం బతుకు మనది?’’

‘‘ఈ తగాదాలేనా?’’

‘‘అసలు ఈ ప్రేమ’’

‘‘బతుక్కీ ప్రేమకీ కూడా అర్థం కనపట్టం లేదా మీకు?’’

‘‘ఏమిటో యిప్పుడు పుట్టి రేపు నశించే పురుగులం’’

‘‘కాని ఈ రాత్రికి దేవతలం’’

‘‘పోట్లాడతావు నాతో’’

‘‘నా పోట్లాట మాత్రం ఏం శాశ్వతం? ఎందుకంత బాధగా తీసుకోవాలి నువ్వు? ఏదో రేపు పొద్దున్నకి నశించేవాడివి? పద.’’

రెండు పురుగులు గూట్లోకి వెళ్లాయి.


(సాక్షి సాహిత్యం: 2018 ఆగస్ట్‌ 27)


 

Sunday, September 8, 2024

కొడవటిగంటి కుటుంబరావు: దుక్కిటెద్దు


కొడవటిగంటి కుటుంబరావు

కొడవటిగంటి కుటుంబరావు(1909–1980) కథ ‘దుక్కిటెద్దు’ సంక్షిప్త రూపం ఇది. సౌజన్యం: అ.ర.సం. గుంటూరు శాఖ. కథలు, నవలలు, నాటికలు, గల్పికలు, వ్యాసాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కొ.కు. ఆయన ‘చదువు’ తప్పక చదవాల్సిన తెలుగు నవలల్లో ఒకటి.

–––––––––


దుక్కిటెద్దు


‘‘వద్దు, వద్దు! నాకు డాక్టరొద్దు! రెండు రోజులుంటే అదే నిమ్మళిస్తుంది!’’ అన్నాడు కిష్టయ్య ఆయాసంగా.

‘‘అదేమిటి, నాన్నగారూ? అసలు జబ్బేమిటో తెలుసుకోనివ్వండి. ముందుగా జాగర్తపడాలి గాని, రోగం ముదర బెట్టుకుంటారా?’’ అన్నది అనసూయ. ఆమె పిల్లలు నలుగురూ ఆమె చుట్టూ నిలుచున్నారు.

‘‘పిల్లల కోడి’’ అని కిష్టయ్య తన కూతురికి ఏనాడో పేరు పెట్టుకున్నాడు. కాని ఆయన ఆ మాట ఎప్పుడూ పైకి అనలేదు. ఆయన పెళ్లాంతోగాని, పిల్లలతోగాని అనని విషయాలు, ఇటువంటివి, బోలెడున్నై.

ఒకప్పుడు కిష్టయ్య తన భార్యను గురించీ, పిల్లల్ని గురించీ మురిసినవాడే. ఆయన చిన్నతనంలో కష్టాలు పడ్డాడు. ఆయన తన తల్లి నెరగడు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. మారుతల్లి కిష్టయ్యని హీనంగా చూసేది. వాళ్ల పల్లెటూళ్లో ఇంగ్లీషు బడి లేదు. బస్తీ చదువు డబ్బు దండగన్నది మారుతల్లి. తండ్రి కాదనలేదు. కిష్టయ్య– పదేళ్లవాడు– ఇంట్లో చెప్పకుండా బస్తీకి వెళ్లి వారాలు చేసుకుని, పుస్తకాలు, జీతం డబ్బులు, ఇతరులు పారేసిన బట్టలు ముష్టెత్తి చదువుకున్నాడు. తాను మేజరై తండ్రితో ఆస్తి పంపకం చేసుకునేసరికి కిష్టయ్య చదువు అయేపోయింది. ‘‘మంచివాడు’’ అనిపించుకోవటం ఇతరులను ఏ మాత్రమూ నొప్పించకుండా వారి సహకారం పొందటం, పొందిన సహాయానికి రెట్టింపు కృతజ్ఞత చూపటం ఆయనకు అలవాటైపోయింది. ఇదే ఆయనకు ఉద్యోగంలో పైకి రావటానికి కూడా ఉపకరించింది. చదివినది స్కూలు ఫైనలే అయినా పెళ్లి అయేనాటికి అప్పుడే నూరు రూపాయలు– ఆ రోజుల్లో బియ్యేలు కూడా చెయ్యలేని సంపాదన– సంపాదిస్తున్నాడు.

భార్య కాపరానికి వచ్చాక కిష్టయ్య ఆనందానికి మితి లేదు. ‘‘తన’’ అన్న మనిషంటూ కిష్టయ్య ఎరగడు. ఇప్పుడాయనకు భార్యా, సహజీవనమూ, తన యిష్టప్రకారం ఇల్లు అమర్చుకోవటం, వంట చేయించుకు తినటం ఏర్పాటయింది. పిల్లలు పుట్టుకొచ్చారు– ఇద్దరు కొడుకులూ, ఒక కూతురూ, మళ్లీ ముగ్గురు కొడుకులూనూ. భార్యనూ, ఆరుగురు పిల్లల్నీ సాధ్యమైనంతగా సుఖపెడతానని కిష్టయ్య శపథం చేసుకున్నాడు. అదనంగా రెండు రూపాయలు సంపాదించటానికి రెండు పూటలు తిండిలేకుండా తిరగవలసి వస్తే తిరిగాడు.

కిష్టయ్య ఏళ్ల తరబడి దుక్కిటెద్దులాగా పని చేశాడు. ఎన్ని వ్యాపారాలలోనో భాగం తీసుకున్నాడు. దీని ఫలితం, కిష్టయ్య తప్ప అందరూ అనుభవించారు. కిష్టయ్య పెళ్లాం నూరు రూపాయలకు తక్కువ చీర కట్టి బయటికి పొయ్యేది కాదు. కిష్టయ్య కొడుకులకు చదువు సంధ్యలు అబ్బినా, అబ్బకపోయినా సరికొత్త ఫాషన్‌లో దుస్తులు ధరించటం, మోటారు సైకిళ్లెక్కి తిరగటం, టెన్నిస్‌ ఆడటం మొదలైనవన్నీ అబ్బినై.

పెద్దవాడు చిన్న టెన్నిస్‌ ఛాంపియన్‌. తాను ఉద్యోగం చెయ్యబోవటం లేదని వాడు చదువుతూండగానే ప్రకటించాడు. రెండోవాడు ఇంజనీరు చదివి, జంషెడ్పూరులో ఉద్యోగం సంపాదించాడు. వాడి భార్య లక్షాధికార్ల బిడ్డ. ఆవిడ తాహతుకు తగినట్టుగా బతకడానికి తండ్రి దగ్గరినుంచి ప్రతి నెలా వందా, రెండువందలు తెప్పించుకుంటాడు. మూడోవాడికి చీట్లాట పిచ్చి. అందులో వాడు సంపాదిస్తాడని ప్రతీతి. కాని వాడికింద కిష్టయ్య ఏటా నాలుగైదు వేలు ఖర్చు చేస్తూనే ఉన్నాడు. నాలుగోవాడికి సినిమా స్టారు కావాలని. వాడు స్కూలు ఫైనల్‌తో చదువు ఆపేశాడు. చదవరా అని కిష్టయ్య అంటే, ‘‘నీవు చదివినంత నేనూ చదివాను. సినిమాస్టారు ఛాన్సు రానీ, నీకన్న ఎక్కువే సంపాదిస్తాను’’ అనేవాడు. అయిదోవాడు మట్టుకు చదువుతున్నాడింకా.

అనసూయకు పదోఏటనే పెళ్లిచేశాడు– శారదా చట్టాన్ని ధిక్కరించి. ఉన్నవాళ్ల పిల్లవాణ్ణే చూసి చేశారు. అనసూయను మొగుడి దగ్గరికి పంపిన కొద్ది రోజులకే డిప్రెషన్‌ వాళ్ల మీద పెద్ద దెబ్బ తీసింది. ‘‘మహాతల్లి మెట్టిన వేళావిశేషం’’ అని అనసూయ వింటుండగా అత్తవారు అన్నారు. పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వచ్చేసింది. వారం రోజులు వెనకగా అనసూయ భర్త కామేశ్వరరావు కూడా వచ్చేశాడు.

అనసూయకు చాలారోజులు పిల్లలు లేక వరసగా నలుగురు పుట్టుకొచ్చారు. కిష్టయ్య వాళ్లందర్నీ పగవాళ్లళ్లే చూసేవాడు. కొడుకుల పిల్లలూ, కూతురి పిల్లలూ డజనుమంది దాకా ఉన్నారు. ‘‘లంకంత ఇల్లున్నది! వీళ్లు నేనున్నచోటికే ఎందుకువస్తారో?’’ అనుకునేవాడు.

కిష్టయ్యకు మనుషులంటే అసహ్యం మనవలతో మనవరాళ్లతో ఆరంభం కాలేదు; పెళ్లాం పిల్లలతో ఆరంభమయింది. వాళ్లు ఆయనను డబ్బు సంపాదించే యంత్రంగా చూడసాగారు. డబ్బు దేనికో తెలుసుకుందామని తాను ఎప్పుడన్నా విచారిస్తే చెప్పటానికి విసుక్కునేవాళ్లు. 

తాను ఏపూటా వేళకు భోంచేసేవాడు కాడు కిష్టయ్య. దానికి అందరూ అలవాటు పడిపోయారు. ఒకరాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వస్తే అందరూ నిద్రపోతున్నారు. ‘‘భోజనం చేస్తావా?’’ అని అడిగినవాళ్లు లేరు.

ఇంట్లో కిష్టయ్య తప్ప మిగిలిన వాళ్లందరి మధ్యా ఏవో బంధాలున్నాయి. వాళ్లు ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్లు. అంతలో చడామడా తిట్టుకునేవాళ్లు. కాని వాళ్ల మధ్య కిష్టయ్యకు ఏమీ స్థానం లేదు.

‘‘వీళ్లందరి కోసం నేనెందుకు హూనం కావాలి. నా తిండికీ బట్టకూ యాభై చాలు, నాకు నస్యం కూడా అలవాటు లేదు’’ అని కిష్టయ్య చాలాసార్లు అనుకున్నాడు. కాని దొర్లే రాయి దొర్లుతూనే ఉంది. ఎప్పుడైనా పెందలాడే ఇంటికి వచ్చినా, ఇల్లుదాటి పోకపోయినా ఏదో ఆత్మద్రోహం చేసినట్టుగా తోచేది.

‘‘ఈవాళ తాత ఇంట్లోనే ఉన్నాడే!’’ అనేవాళ్లు కుర్రాళ్లు. అందులో కిష్టయ్యకి ఏదో వెటకారం వినిపించేది.

ఇంట్లో ఎవరికీ తన అవసరం లేదని తెలుసుకోవడనికి కిష్టయ్యకు చాలాకాలం పట్టింది. డబ్బు ఇవ్వటానికి తప్ప మిగిలిన అన్ని విషయాలకూ తాను పరాయివాడే.

కిష్టయ్యకు జబ్బు చేసింది. జబ్బు నుంచి ఆయనకు కోలుకోవాలని లేదు. ఈ అవతారం ఇక చాలించవచ్చు ననిపించింది.

మిగిలినవాళ్లకు ఆయనను చావనివ్వాలని లేదు. డాక్టరును పిలవనంపారు. డాక్టరు ఏవో ఇంజెక్షన్లూ టానిక్కులూ రాసి ఇచ్చాడు.

ఇంజెక్షన్లు పని చేశాయి. విశ్రాంతి కూడా పనిచేసిందేమో? కిష్టయ్య మంచంలో లేచి కూచుంటే అందరి ముఖాలూ విప్పారినై.

‘‘బంగారుగుడ్లు పెట్టే కోడి చావలేదని ఎంత సంతోషం!’’ అనుకున్నాడు కిష్టయ్య.

కాస్త ఆరోగ్యం కుదుటపడగానే కిష్టయ్యకు ఏమీ చెయ్యకుండా ఉండటం దుర్భరమనిపించింది. అధమం ఏదన్నా చదువుదామనుకున్నాడు. అనసూయ ఆఖరు కొడుకు కనిపిస్తే వాణ్ని పిలిచి, ‘‘చదువుకునేందుకు ఏదన్నా పట్రారా?’’ అని అడిగాడు.

వాడు వెళ్లి ఏదో పత్రిక తెచ్చి యిచ్చాడు. కిష్టయ్య పేజీలు తిరగేస్తూ, ‘‘వట్టి చెత్త! ఇహమూ, పరమూ లేని రాతలు!’’ అనుకున్నాడు. అకస్మాత్తుగా ఆయన దృష్టి కొన్ని పద్యాల మీద పడింది. పద్యాలకు ‘‘దుక్కిటెద్దు’’ అని శీర్షిక ఉంది. దాని కింద తన ఆఖరు కొడుకు పేరుంది.

‘‘వీడు తిక్కన సోమయాజి అని నేను ఎరగనే!’’ అనుకుంటూ కిష్టయ్య పద్యాలు చదవసాగాడు. పొలాల మొహం ఎరగని తన ఆఖరు కొడుకు దుక్కిటెద్దు గురించి పద్యాలు రాయటమేమిటి?

కాని కుర్రాడు, కిష్టయ్య అనుకున్నంత తెలివితక్కువవాడు కాడు. వాడు తానెరిగిన దుక్కిటెద్దు గురించే రాశాడు. ఆ దుక్కిటెద్దుకు జీవించటం చేతకాదు. తన కష్టసుఖాలను ఇంకొకరితో పంచుకోదు. ఇతరుల కోసం అస్తమానం శ్రమపడి వాళ్లను సోమరిపోతులను చేసి, వారంతా తనకు రుణపడి ఉన్నారని సంతోషిస్తుంది. వాళ్లు తనకు కృతజ్ఞత చూపటం లేదని మనసులో బాధపడుతుంది. ఆఖరుకు కోపం వచ్చి కొమ్ము విసరటం కూడా చాతగాని స్థితిలో పడి చావుకోసం ఎదురుచూడసాగుతుంది.

కిష్టయ్య ఆఖరు కొడుకు కొద్దిపాటి హాస్యధోరణిలో రాసిన అయిదు పద్యాల సారాంశమూ ఇంతే.

‘‘ఓరి పిడుగా!’’ అనుకున్నాడు కిష్టయ్య. కిష్టయ్యలో కొద్దిపాటి హాస్యం ఉంది. అదే తన కొడుక్కు కూడా సంక్రమించింది. 

అనసూయ గ్లాసులో పళ్లరసం తెచ్చింది.

‘‘ప్రతిపూటా నాకు పంచదార తక్కువవుతున్నది!’’ అంటూ గొణిగాడు కిష్టయ్య.

‘‘తక్కువైతే అడిగి వేయించుకోరాదూ?’’ అన్నది అనసూయ ఆశ్చర్యంగా.

‘‘అదే దుక్కిటెద్దు లక్షణం!’’ అన్నాడు కిష్టయ్య.

‘‘ఏమిటీ?’’ అన్నది అనసూయ, అయోమయంగా.

‘‘ఏం లేదులే! పిల్లల్నందర్నీ ఒకసారి పంపించు.’’

‘‘దేనికి?’’

‘‘దేనికేమిటి? పంపించమంటుంటే!’’

అనసూయ తల అడ్డంగా ఆడించి వెళ్లిపోయింది.

కాస్సేపటికి ఏడెనిమిది మంది పిల్లలు కిష్టయ్య గదిలోకి వచ్చి కుక్కిన పేలల్లే నిలబడ్డారు.

‘‘చదవండి, నా వెంట!’’ అంటూ ‘‘దుక్కిటెద్దు’’ పద్యాలు వాళ్ల చేత చదివించాడు. వాళ్లు మొదట బెరుకు బెరుకుగా చదివారుగాని రాను రాను గొంతులు హెచ్చినై.

తండ్రి పంచదార కావాలని అడిగినమాట మరచిపోయిన అనసూయ తిరిగి జ్ఞాపకం తెచ్చుకుని పంచదారసీసా, చంచా పట్టుకుని వచ్చేసరికి కిష్టయ్య గది వీధిబడిలాగా ఉంది. పిల్లలంతా కప్పెగిరిపోయేట్టు తాతవెంట పద్యాలు చదువుతున్నారు. పళ్లరసం గ్లాసు పక్కనే బల్లమీద ఖాళీగా పెట్టి ఉంది. దాని అడుగున చంచాడు పంచదార కరిగీ కరగకుండా మిగిలి ఉన్నది.

‘‘పంచదార చాలా ఎక్కువేశావ్‌!’’ అన్నాడు కిష్టయ్య అనసూయకేసి చూడకుండానే.


(సాక్షి సాహిత్యం: 2018 డిసెంబర్‌ 17)



 

Monday, September 2, 2024

పాలగుమ్మి పద్మరాజు: కూలిజనం

 


పాలగుమ్మి పద్మరాజు


పాలగుమ్మి పద్మరాజు (1915–1983) కథ ‘కూలిజనం’ సంక్షిప్త రూపం ఇది. దీని తొలి ప్రచురణ 1944లో ఆంధ్రపత్రికలో. సౌజన్యం: కథానిలయం. గాలివాన, పడవ ప్రయాణం, పద్మరాజు ప్రసిద్ధ కథల్లో కొన్ని. బతికిన కాలేజీ, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూణ్నాళ్ల పాలన, ఆయన నవలలు. సినిమా రచయితగానూ పనిచేశారు. ‘లోకం ఉండవలసినట్టుగానే ఉంది! నడవవలసినట్టుగానే నడుస్తోంది’ అని చెప్పే కథ ఇది.

––


కూలిజనం


ఈవేళో రేపో కాలవ తెరుస్తారు. తవ్వు ఇంకా పూర్తికాలేదు. కంట్రాక్టరు కోప్పడతాడు. ఇంకా చిన్న గుంట దగ్గర ఓ వంద గజాల మేర కాలవ తవ్వి గట్టు బాగు చెయ్యాలి. దొరికినంతమంది కూలీలను రాత్రి రాత్రి పోగుచేశాను. పనికాకపోతే కంట్రాక్టు డబ్బు ప్రభుత్వం వారు ఇవ్వరు.

ఎండిన కాలవ నీటికోసం దాహంగా ఉంది. ఇరుగట్లనీ పరువుకొచ్చిన మామిడికాయలు గుత్తులుగా వేళ్లాడుతున్నాయి. అప్పుడే తెల్లవారినా, రాబోయే గాడుపు వేడిగా సూచనగా తగులుతోనే ఉంది. కాలవ మధ్యని నీటిచెలమలో తప్ప కనుచూపు మేరలో నీరు లేదు.

నేను గట్టు మీద కూర్చుని నీరసంగా కూలివాళ్లని హెచ్చరిస్తున్నాను. ఎంత తొందరపెట్టినా మెల్లగానే పారలు వేసి తవ్వుతున్నారు. ఆడకూలీలు మెల్లగా తట్టలు నెత్తిమీద ఎత్తుకుని గట్టు తెగిపోయిన చోట పోస్తున్నారు. 

కూలివాళ్ల నల్లటి దేహాల మీద చెమట నిగనిగ మెరుస్తోంది. వాళ్ల కండలకి ఆ తడి ఓ వింతమెరుపు నిచ్చింది. ఆడ మగ మెల్లగా కబుర్లు చెప్పుకుంటో పని చేస్తున్నారు. బొద్దుమీసాల పెద్దవాడు అందరిలోకి సోమరిపోతు. అతని పేరు సత్తిరెడ్డి. కాని తెలివయిన వాడు. అతని కబుర్లలో పడి అంతా పని మరచిపోతారు. పావుగంట కొకసారి గునపం పాతుతుంటాడు. కాని బలమయినవాడు. పద్దెనిమిదేళ్ల పిల్ల అతను తవ్విన మట్టిబెడ్డలు తట్టలో వేసుకుంది. ఒక క్షణం అతని మాటలు వింటో నవ్వింది. తట్ట ఎత్తుకు వెళ్లిపోయింది. ఆమె పేరు రత్తి. తరవాత ముప్ఫయియేళ్ల పడుచు వచ్చింది. ఆమె పేరు చెల్లమ్మ.

‘‘యెయ్యి పిల్లా! సూడకు’’ అన్నాడు మీసాల పెద్ద.

‘‘నువ్వు పాడు’’ అంది ఆమె.

పొద్దు ముదురుతోంది. కూలివాళ్ల సంభాషణ రోదలాగ వినబడుతోంది. రత్తి కిచకిచ నవ్వుతోంది. ఆమె మొగుడు కుర్రతనపు గర్వంతో తవ్వుతున్నాడు. బూతుపాటలు పాడుతున్నాడు. అతన్ని ముసలయ్య అంటారు. ఏభయి ఏళ్ల గడ్డపు ముసిలి పద్దాలు వాళ్ల ఊళ్లో మావుళ్లమ్మ మహత్తు వర్ణిస్తున్నాడు.

ఎండ ముదురుతోంది. నేను కాలవగట్టు మీద నించి లేచి పక్కనే ఉన్న కరణంగారి ఇంటి అరుగు మీద కూర్చున్నాను. తాటాకు చూరు కింద పెద్ద వరికంకెల గుత్తి వేళ్లాడుతోంది. పిచికలు పక్కని ఏటవాలుగా వాలి గింజలు తింటున్నాయి. అరుగు ముందు చింతచెట్టు కింద ఆవు సగంనిద్రతో నిలబడి ఉంది. ముసిలి పద్దాలు చెపుతున్నాడు.

‘‘సంబరం నాడు పోతుని బలేత్తారు. ఒక్క యేటకి తల తెగెపోవాల. తప్పితే గండమన్నమాట. నెత్తురంతా పెద్ద మూకుళ్లో పడతారు.’’

పని అంతకంతకి వడి తగ్గింది. పొద్దు నడినెత్తికి ఎక్కుతోంది. ఊళ్లో జనసంచారం లేదు. కాకులు దాహంగా చెట్టుమీది నుంచి చెట్టుమీదికి ఎగురుతున్నాయి. చివరాకి మీసాలవాడు గునపం పాతి మళ్లీ పైకి ఎత్తలేదు. అంతా పని ఆపారు. గట్టు సగం అయింది. సత్తిరెడ్డి కాలవ దగ్గర ఒళ్లు కడుక్కుంటున్నాడు. రత్తి దగ్గరికి వెళ్లి నీళ్లిమ్మంది. అతను చేదతో నీళ్లు తీసి ఆమె ముఖం మీదికి చిమ్మాడు.

‘‘సచ్చినోడా’’ అంది రత్తి సరదాగా. రత్తి మొగుడు ముసలయ్య గుర్రుగా చూశాడు. సత్తిరెడ్డి నోట్లో నీళ్లు పోసుకున్నాడు. ‘‘థూ! ఉప్పనీల్లేసే’’ అని చీదరించుకున్నాడు. అంతా కాలవలో ఉన్న చెలమ దగ్గరికి పరుగెత్తారు.

ఒక గిన్నెలోనే రత్తీ, (ముసలయ్యా) తినడం మొదలుపెట్టారు. ఉప్పువేసిన గంజీ అన్నం, కక్కముక్కలు కొరుక్కుంటున్నారు. సత్తిరెడ్డి తన మూటలో ఉన్న ఊరగాయ అందరికీ కొంత కొంత పంచాడు. ఎక్కువభాగం రత్తికిచ్చాడు. చెల్లమ్మ సాభిప్రాయంగా చిరునవ్వు నవ్వింది. ముసలయ్య చెల్లమ్మ వేపు చూసి రత్తివేపు అనుమానంగా చూశాడు.

లోకమంతా ఏదో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నట్టుగా దీనంగా ఉంది. నేను అరుగు మీద చాపమీద వెన్నువాల్చి ఏమీ చూడకుండా చూస్తున్నాను. కూలివాళ్లు తిని గిన్నెలు మెల్లగా కడుక్కున్నారు. ఆ గిన్నెలతోనే నీళ్లు సంతృప్తిగా తాగారు. చింతచెట్టు మొదట్లో చుట్టూ కూర్చున్నారు. తలగుడ్డల్లోంచీ, రొంటినించీ పొగాకు తీసి, కొంచెం నీళ్లతో తడిపి చుట్టలు చుట్టుకున్నారు.

పొద్దు తిరిగింది. కంగారుగా లేచి వాళ్లని హెచ్చరించాను. తొందరలేని స్థిమితంతో మెల్లగా లేచారు. తలపాగలు చుట్టుకున్నారు. నేలమీద తట్టలు ఎడమకాలితో లేవతన్ని ఎడమచేత్తో వంగకుండా పట్టుకున్నారు. తొందరలేని వేగంతో తవ్వు మళ్లీ ప్రారంభమయింది. మట్టిలో ఇసక పాలుంది. అంచేత పారలతో తవ్వవలసి వస్తోంది. సత్తిరెడ్డి గునపం పారేసి, తట్టల్లోకి పారలతో తవ్విపోస్తున్నాడు. తట్ట కాలితో వొడుపుగా రత్తి తన్ని పెట్టింది. యధాలాపంగా ఒక పార మట్టి రత్తి కాలి మీదకి సత్తిరెడ్డి విసిరాడు. తట్ట తన్నేసి చీదరగా కాళ్లు దులుపుకుంది. ముసలయ్య ఆవేపొక సారి చూశాడు.

పొద్దు వాలుతోంది. వాళ్ల తత్వాలని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్లు చెయ్యాలంటే చేస్తారు. మనం తొందరపెట్టినా వాళ్లు తొందరపడరు. వాళ్లకి కాలం, తొందర అనేవి లేవు. అయినా వాళ్లకొక అంచనా ఉంది. పని అయిపోతుందని వాళ్లకి తెలుసు. అయిపోతుంది కూడాను. కాని వాళ్లు మన చేతుల్లో లేరు. మన అవసరాలన్నీ వాళ్ల చేతుల్లో కట్టుబడి ఉన్నాయి. వాళ్లకి మనం బానిసలం. వాళ్ల యెడల మన అంచనాలు పని చెయ్యవు.

చటుక్కుని ముసలయ్య తట్ట కుడిచేత్తో ఎత్తి రాక్షసిలాగ రత్తిమీద పడ్డాడు. తట్టతో నెత్తిమీద మోదాడు. చేతులతో కాసుకుంది. అంతా పని ఆపి ముసలయ్యని పట్టుకున్నారు. కోపంతో వణికిపోతో అన్నాడు, ‘‘సరసాలాడతంది నెంజ’’.

‘‘నేదండి బాబో! నేదండి’’ అని దీనంగా కంగారుగా సగం ఏడుస్తోంది రత్తి.

‘‘తోలు వొలిచేత్తాను’’ ముసలయ్య మళ్లీ విజృంభించబోయాడు. సత్తిరెడ్డి బలంగా అతన్ని పట్టుకున్నాడు. ‘‘ఏటబ్బా ఆ యిసురు? కూంత పరాసకాలాడితేనే అంత కోపమా? పారుచ్చుకో. పారుచ్చుకో. సందలడిపోతంది. రండల్లా రండి.’’ అంతా మళ్లీ పని ప్రారంభించారు. నా గుండెల్లో అదుటు పోలేదు. ఆమెను తరవాత ముసలయ్య ఏం చేస్తాడో.

గట్టు పూర్తి అయేసరికి పొద్దు కుంకింది. వెన్నెల కూడా వేడిగా వ్యాపిస్తోంది. గిన్నెల్లో మిగిలిన అన్నాలు మళ్లీ వాళ్లంతా తిన్నారు. నేను అనుమానంగా రత్తి వేపు చూస్తున్నాను. కూలీల్లో ఒకడు వచ్చి కొంత డబ్బు కావాలన్నాడు. అనుమానిస్తో ఇచ్చాను.

కరణం గారింట్లో భోజనం చేసి నేను వారిచ్చిన మంచం ఒకటి అరుగు పక్కని ఖాళీస్థలంలో వాల్చాను. గాలి కొంత చల్లబడుతోంది. కూలీలంతా ఎక్కడికో పోయారు. ముసలయ్య రత్తి ఎల్లాగ సమాధానపడతారో నని ఆందోళనగా పడుకున్నాను. ముసలయ్య ముఖంలో నాగరకతకు లొంగని పశుత్వం అప్పుడు చూశాను. రత్తిలో అసహాయమయిన దైన్యం చూశాను.

కూలీలు గొడవగా వచ్చారు. తాగి వచ్చారని గ్రహించాను. గట్టు మీద అల్లరి చిల్లరగా పడిపోయారు. ముసలయ్య తప్ప తాగాడు. రత్తీ బాగా తాగింది. ముసలయ్య పాట ప్రారంభించాడు. 

సింత కొమ్మల మీద సిరిబొమ్మ ఆడింది

పుంతలో ముసలమ్మ పురిటి కెల్లిందే

‘‘పురిటి కెల్లిందే’’ అంతా అందుకున్నారు. ఎవరికొచ్చింది వాళ్లు పాడారు. క్రమంగా గొంతుకలు సన్నగిల్లాయి. పాటలు ఆగిపోయాయి. 

నాకు మసగ్గా నిద్ర పడుతోంది. చటుక్కుని రెండు స్వరూపాలు ఏవో నడిచినట్టయింది. కళ్లు విప్పి కదలకుండా చూశాను. రెండు మూర్తులు ఒకళ్ల మీద ఒకళ్లు తూలుతూ నడుస్తున్నాయి. రత్తి. ముసలయ్య. ముసలయ్య రహస్యంగా అన్నాడు.

‘‘ఈ యరుగు మీద తొంగుందాం.’’

‘‘ఈ యెన్నిట్లోనే?’’

‘‘నడేశే’’ ఆమె నడుము పట్టుకున్నాడు. ఆమె తన్మయంగా అతని మీదికి వంగింది.

నేను మేలుకున్నాను. కాని కదలకుండా పడుకున్నాను. అతని ఈర్ష్య, కోపం, అంతా ఏమయింది? నాకా ప్రశ్న అర్థం కాలేదు కాని, నా మనస్సులో అనంతమయిన సంతృప్తి, ప్రశాంతి నిండుకున్నాయి. లోకం ఉండవలసినట్టుగానే ఉంది! నడవవలసినట్టుగానే నడుస్తోంది. నా కర్థం కాకపోతే మట్టుకు నష్టమేముంది? నాకు క్రమంగా నిద్ర పట్టింది.

ఏదో కలకలంతో మెలకువ వచ్చింది. కళ్లు నులుపుకుంటూ లేచి కూర్చున్నాను. కూలీలు హడావిడాగా తట్టలూ పారలూ గట్టుని పడేస్తున్నారు. కాలవలో అడుగుని సన్నగా నీటితడి ఆనింది. మనస్సు నిండిపోయినట్టయింది. చంద్రుడప్పుడే అస్తమించాడు. కూలీలు మళ్లీ నిద్రలో మునిగిపోయారు. అరుగుమీద చీకట్లో ఏమీ కనబడలేదు. కాని నాకు మాత్రం నిద్ర పట్టలేదు.


(సాక్షి సాహిత్యం; 2019 మార్చ్‌ 11)


 

Tuesday, August 13, 2024

వడ్ల గింజలు


శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 


శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (1891–1961) ‘వడ్లగింజలు’ కథ ఇది. 1941లో ప్రచురితమైంది. 73 పేజీల కథని కేవలం 950 పదాలకు కుదించాను. కథక చక్రవర్తి అనిపించుకున్న శ్రీపాద ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’ తెలుగులోని గొప్ప పుస్తకాల్లో ఒకటి. ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టుగా, వాక్యం మీద వాక్యం చేర్చుతూ కథను నిర్మించే శైలి శ్రీపాదది. ఆయన్ని ఎప్పుడు తలుచుకున్నా ఎందుకో ఒక రుమాలు చుట్టుకున్న రచయిత ఇమేజ్‌ నా మనసులో కదలాడుతుంది, గిడుగు రామ్మూర్తి పంతులు లాగా!

––

వడ్ల గింజలు


‘‘రాజద్వారే, రాజగృహే సర్వదా దిగ్విజయోస్తు. వేదోక్తం పరిపూర్ణమా–’’

ద్వారంలోంచే ఆశీర్వచనం ప్రారంభించిన తంగిరాల శంకరప్పకు ఠాణేదారు గభీమని అడ్డం వచ్చి ‘‘ఫో– మళ్లీ వచ్చావూ?’’ అంటూ ‘‘ఏయ్, జవాన్లూ?’’ అని కరుగ్గా పిలిచాడు.

‘‘చిత్తం బాబయ్యా, మేమడ్డుపెడుతూనే వుండగా, జలగలాగ జారి వచ్చేస్తున్నారండి’’ అంటూ శంకరప్ప అంగాస్త్రపు కొంగులు పట్టుకున్నారు.

‘‘దివాన్జీగా రుండగా మధ్య మీరు ఎవరయ్యా?’’ అంటూ శంకరప్ప బింకంగా ముందుకు రాబోయాడు. ‘‘నేను డబ్బు కోసం రాలేదు’’ అని యేదో చెప్పబోయాడు.

అప్పటికి తెరిపయిన దివాన్జీ ‘‘యేమిటా అల్లరి?’’ అని నిదానంగా అడిగాడు.

‘‘ఎవరో పిచ్చిబ్రాహ్మడు మహాప్రభూ! ఏలినవారి దర్శనం కావాలని నానా అల్లరీ చేస్తున్నా డండి.’’

‘‘ఒక రూపాయి చేతిలో పెట్టి పొమ్మనలేక పోయావా?’’

‘‘నేను కార్యార్థిని గాని, పిచ్చివాణ్ణి కాను మహాప్రభూ!’’ శంకరప్ప కేక వేశాడు.

‘‘యెదటికి రప్పించు’’ అన్నాడు దివాన్జీ.

శంకరప్ప మొగంమీద బ్రహ్మతేజస్సు వెలిగిపోతోంది.

‘‘ఏమిటి పని?’’

‘‘మహారాజులుంగారి దర్శనం చేసుకుందామని వచ్చాను.’’

‘‘ఈ వేషంతోటే?’’ అనే మాటలు దివాన్జీ నాలుక చివరనుంచి జారిపోయాయి.

‘‘విద్వత్తు వున్నచోట వేషం అక్కర్లేదండి’’ శంకరప్ప బదులు చెప్పాడు. ‘‘శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగారంటే చదరంగం ఆటలో నిధి అని దిగ్ధంతులు ఘోష పెడుతూ వుండడం వల్ల– ఒక్క ఆట వారితో ఆడాలని–’’

దివాన్జీకి అభిజాత్యం తోచింది. ‘‘చదరంగం ఆడకూడదని నిశ్చయించుకున్నారు ప్రభువు’’ అని మాట జారి వచ్చేసింది.

‘‘ఎంచేతో?’’

‘‘తగిన వుజ్జీ దొరక్క... ఆట కట్టడం మాట దేవు డెరుగును, నాలుగైదు యెత్తులయినా పొంకంగా వెయ్యగలవాడు కనబడలేదు పృథివి మీద.’’

‘‘విపులా చ పృథ్వీ!’’

దివాన్జీ వులిక్కిపడ్డాడు. వుగ్రుడైనాడు. ‘‘బతకతలుచుకోలేదూ?’’

‘‘నా విద్వత్తుకి వినియోగం కనబడలేదు. ఇక బతికేం ప్రయోజనమూ? మొండిపట్టు పట్టి ఆటలో కూచుని వోడిపోతే, మహారాజులుంగారు వచ్చినవాడి తలకొట్టించి కోట కొమ్ములకు కట్టించడానికి శపథం పట్టారని తెలుసు. సిద్ధపడే వచ్చేశాను.’’

తన అంతస్తు స్మరించుకుని ఈ దరిద్రుడి మీద పడి మొట్టాలన్నంత ఆవేశం వచ్చింది దివాన్జీకి. ‘‘ఇక దయ చెయ్యి.’’

‘‘నాకేమి చెప్పినట్టూ?’’ ముదలకించాడు శంకరప్ప.

‘‘ఏయ్‌ జవాన్లూ!’’ దురుసుగా పిలిచాడు దివాన్జీ.

‘‘ఏం జరిగింది నాయనా?’’ ఆత్రంగా అడిగింది పేదరాసి పెద్దమ్మ.

‘‘వ్యవహారం అంతా తల్లకిందులయి పోయింది పెద్దమ్మా’’ అంటూ చతికిలబడ్డాడు శంకరప్ప.

నిరాశా, వుడుకుమోత్తనమూ, దుఃఖమూ అతని శరీరంలో ప్రతీ అణుమాత్ర భాగంలోనూ నిండి చిప్పిలిపోతూ వున్నాడు. ముప్ఫయేళ్ల శంకరప్ప పెద్దమ్మ అడ్డాల్లో బిడ్డ అయిపోయినాడు. 

‘‘విద్వాంసుల మంటూ వచ్చేవాళ్లని చాలామందిని చూశాను; అందరూ యిలాగే లౌక్యం సుతరామూ లేక...’’

‘‘ఆ పెద్దమనిషి మొదటే హేళనలోకి దిగాడు.’’

‘‘మరి విను. ఇప్పటిదాకా రాజదర్శనానికి నువు తిప్పలుపడ్డావు. ఇక నీ దర్శనం కోసం రాజే తిప్పలుపడాలి.’’

‘‘నీళ్లముంచినా పాలముంచినా– పెద్దమ్మా, నేను నీ కొడుకుని’’ అంటూ ఆమె పాదాలు పట్టుకున్నాడు.

‘‘ఇంత వెర్రిబాగుల నాయనవు, చదరంగంలో నీకింత నేర్పెలా వచ్చిందోయ్‌?’’

‘‘దాని కంతకీ కారణం యీశ్వరానుగ్రహం.’’

ఒక్కమాటు పైకి చూసి ‘‘పెద్దాపురప్పట్నం అంతా యెప్పుడైనా చూశావా?’’ అని అడిగింది.

‘‘సెబాస్‌’’ అంటూ లేచి, గుమ్మంలోకి వొక్కటే వురక. అక్కణ్ణుంచి వీధిలోకి వొక్కటే అంగ.

శంకరప్ప సందు మళ్లాటప్పటికొక పెద్ద భవంతి కనపడింది. మండువా వాకట్లోనుంచి చదరంగానికి సంబంధించిన ఘర్షణ వినవచ్చింది.

లోపల యిద్దరు బ్రాహ్మణ యువకులు చదరంగం ఆడుతున్నారు. వారికిద్దరికీ చెరో సలహాదారూ దగ్గిరసా కూచుని వున్నారు. ఒక్కమాటు నలుగురి మొగాలూ చూశాడు. బలమున్నూ చూశాడు. స్తంభానికానుకు నుంచున్నాడు. అరగడియ గడిచినా యెత్తు పడలేదు. శంకరప్ప విసిగిపోయాడు. ‘‘ఏమండీ, యెత్తు వెయ్యరేం?’’ అని సరసంగానే అడిగాడు. 

‘‘నీకెందుకయ్యా మా గొడవ’’ అని సలహాదారు మిడుతూ చూసి కొంచెం విసుక్కున్నాడు.

‘‘మీ గొడవ నా కెందుకూ? ఆట గొడవ అడుగుతున్నాను.’’

‘‘నాలుగ్ఘళ్ల పొద్దెక్కేటప్పటికి ఆట యీ స్థితికి వచ్చింది.’’

‘‘ఇంతమంది– యింతసేపు– యిందులో యేం వుందీ?’’

ఆటకాడి కిది కొట్టినంత పని చేసింది. బుస్సుముంటూ మొగం పైకెత్తి ‘‘చదరంగం అంటే మీ కేమయినా తెలుసా?’’ అని అడిగాడు.

ఆటగాడి మొగం మీద చక్కని వర్ఛస్సు కనపడింది శంకరప్పకి. ‘‘ఇతగాణ్ణి భృత్యుణ్ణి చేసుకుతీరాలి’’ అని నిశ్చయించుకున్నాడు. ‘‘వారి ఆట నేను కట్టిస్తాను. నేను చెప్పినట్టెత్తు వెయ్యండి’’ అన్నాడు.

‘‘అయితే సలహా చెప్పు’’ అని బల్లకేసి తిరిగా డాటగాడు.

‘‘ఎన్ని యెత్తుల్లో ఆట కట్టమంటారు?’’

‘‘సొరకాయలు నరుకుతున్నావే!’’

‘‘మీ నల్లగది శకటు వారి గుర్రం ముందు వెయ్యండి’’అన్నాడు శంకరప్ప. చెప్పినట్టు వేశాడు ఆటకాడు.

‘‘వోస్‌! అయితే, మరి, గుర్రం యిక్కడ వేశాను’’ అన్నాడు ప్రతిపక్షి.

‘‘ఆ బంటుతో మీరు తోసిరాజనండీ!’’

‘‘అరే, అరే’’ అంటూ ఆటగాడు ఆశ్చర్యపడ్డాడు. ‘‘మహానుభావా’’ అని శంకరప్పను కౌగిలించుకున్నాడు. 

‘‘అయ్యా, యీపూట మీరు భోజనానికి మా యింటికి దయచెయ్యాలి’’ అని ఆహ్వానించాడు సలహాదారు.

‘‘మీ అనుగ్రహానికి సంతోషం. నే నింతలో యీవూరు విడిచివెళ్లను. ఇప్పటికి నన్ను విడిచి పెట్టండి.’’ అని శంకరప్ప చెయ్యి విడిపించుకున్నాడు.

దాంతో రామశాస్త్రీ, యాజులూ ఆయన సహచరులయ్యారు.

తర్వాతి ఆట పంతులుతో. మరో ఆట రాజుతో. ఒక తెలగా, ఒక వైశ్యుడూ, ఒక బ్రాహ్మడూ.

‘‘మూడెత్తుల్లో ఆట కట్టేస్తారు వీరు’’ అని శంకరప్పను పరిచయం చేయసాగారు శాస్త్రీ, యాజులూ.

‘‘అంత సమర్థులా వారు’’ అని ఎదుటివారు అనుమానపడటమూ, తర్వాత నోరు కుట్టేసుకోవడమూ.

మరో ఆట భీమరాజుతో. ఇంకో ఆట కృష్ణంరాజు గారితో. అటుపై దుర్వాసుల ఆదివారాహ మూర్తితో.

‘‘కుడివైపునున్న మన యేనుగుని వారి శకటు దగ్గిరగా వేయించండి.’’ 

‘‘మన యెర్రగది శకటు రాజుకి అయిమూల గదిలో పడెయ్యండి.’’

పెద్దాపురంలో పేరుపడ్డ ఆటగాళ్లు చిత్తయిపోయారు. తంగిరాల శంకరప్ప పేరు చుట్టుపట్ల రామనామం అయిపోయింది. అనేకులు పట్టంచుల చాపు లివ్వ వచ్చారు. ఉప్పాడ జరీజామార్లు కట్టబెట్టపోయారు. బరంపురం తాపితాలు సమర్పించపోయారు. కాశ్మీర శాలువాలు కప్పపోయారు. శంకరప్ప వొకటీ పుచ్చుకోలేదు.

సామంతులూ, సేనాధిపతులూ, రాజబంధువులూ, రాజపురుషులూ, సంపన్నులూ, సరసులూ కోరి శంకరప్పతో ఆడి, ఆట కట్టించుకుని, అదే తమకొక గొప్పగా ఆనందించసాగారు. పాలకీ, పదహారుగురు బోయీలు, పది పదిహేనుగురు భటులు ‘‘చామర్లకోట శ్రీ రావు రాయడప్ప రంగా రాయణింగారి మనుష్యులం’’ అంటూ వచ్చారు. రాజనర్తకి అలివేణి, మహారాజు సన్నిధిని వుండవలసిన నలుగురు వేశ్యలలోనూ వొకతె రంగనాయిక కూడా శంకరప్ప ప్రతిభను చూసి ‘ధన్యులు’ అయినారు. 

‘‘పట్నంలో కెవరో అసాధ్యపు ఆటకాడు వచ్చారుట, మీ కేమయినా జాడ?’’

‘‘లేదు మహాప్రభూ!’’

రాజ కార్యాలన్నీ ముగించుకుని, పెద్దాపురం కోటలో, మహా రాజాధిరాజ, పేషణి హనుమంత, నెలవోలు గండాంక శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు లక్కమేడ వసారాలో పచారుజేస్తున్నారు. కాగితాలు చేత పట్టుకుని దివాన్జీ మాట్టాడుతున్నాడు.

‘‘ఊరంతా కోడయికూస్తోందిట– మీకు తెలవకపోవడం యేమిటండీ?’’ మహారాజు అసంతృప్తి కనపరిచాడు.

దివాన్జీ వెళ్లిపోయిన తర్వాత, ఆట దగ్గర కూర్చోకుండానే ‘‘గోడ అవతల నుంచుని నాలుగెత్తుల్లో’’ ఆట కట్టించిన శంకరప్ప గొప్పతనాన్ని వివరించింది ‘రంగి’.

ఈలోగా దాట్ల అప్పలనరసింహరాజు లోగిట్లో వత్సవాయి విజయరామరాజుతో ఆడుతుండగా– ప్రౌఢ, మధ్య, ముగ్ధలు చిలకలు చుడుతూ, విసనకర్ర విసురుతూ, బంగారపు గంధపు గిన్నెలతో యేకాగ్రత భంగపరిచేందుకు ప్రయత్నించినా వికారం యేమీ కనబరచకుండా శంకరప్ప నెగ్గాడు. ‘‘తమ రొక్కమాటు మహారాజులుంగారితో ఆడాలండీ!’’

పాలకీ కోటగుమ్మంలోకి వెళ్లింది. శంకరప్పకు ఠాణేదారు నమస్కరించాడు. దివాన్జీ ఆహ్వానించాడు. మహారాజుకి శంకరప్ప దగ్గిర మహేశ్వరాంశ కనబడింది. మహారాజు దగ్గిర శంకరప్పకి విష్ణ్వంశ ద్యోతకం అయింది.

రంగ నాయిక బలం సద్ది వుంది. ఒక పక్షానికి కెంపులూ, వొక పక్షానికి పచ్చలూ పొదిగిన బంగారపు బలం అది. పచ్చల వేపు శంకరప్ప, కెంపుల వేపు మహారాజు. ఆ నడకే కొత్తగా సాగింది. దిగ్ధంతుల ద్వంద్వయుద్ధం భయంకరమే. అయినా ద్రష్టలకు దర్శనీయమే. తాపీగా ప్రారంభం అయిన ఆట నాలుగ్ఘడియలు గడిచేటప్పటికి ‘‘యెత్తు పడదేం?’’ అన్న స్థితికి వచ్చింది. మరో గడియ. మన్నాడు. తరువాత. వారాలు, మాసాలు. ‘‘నెగ్గేశాం పెద్దమ్మా. ఆరుమాసాలకయినా ఆట కట్టిందని మహారాజు వొప్పుకోవలసిందే.’’ 

ఠాణేదారుకి దేవిడిమన్నా అయిపోయింది. పెద్దాపురంలో ఉండటానికే లేదు. దివాన్జీ మీద వీరభద్రావతారం తాల్చేశారు మహారాజు. 

చివరికి ఒకరోజు మహారాజు శంకరప్పని కౌగలించుకున్నాడు. ‘‘చదరంగంలో నాకిదే మొదటి వోటమి. ఇంతటి ఉత్కటానందం నాకింతవరకు కలగలేదు. పెద్దాపురం రాజ్యంలో వున్నది యేమయినా సరే తమకి సమర్పించుకుంటాను, సెలవిప్పించండి.’’

‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపుచేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ!’’

విషయం ఎవరికీ బోధపడినట్టులేదు.

‘‘ఏమి, లెక్క తేలిందా?’’ అడిగాడు మహారాజు.

‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అంటూ షరాబు కాగితం మహారాజు కందించాడు. 

రాజ్యమే సమర్పించుకునేందుకు మహారాజు సిద్ధపడ్డాడు. శంకరప్ప అంగీకరించలేదు. చివరకు సర్వలక్షణ సంపన్నమైన అగ్రహారం, పెద్దమ్మకు సాలీనా నూటాపదహారు రూపాయల బహుమానం, శాస్త్రీ, యాజుళ్లకు చెరొక నూటపదహారు రూపాయల బహుమానం ఏర్పాటు చేసి, శంకరప్పను దగ్గిర వుండి గజారోహణం చేయించాడు మహారాజు.


(సాక్షి సాహిత్యం; 2019 జూన్‌ 24)