Sunday, September 6, 2026

వెండితెర చక్రవర్తి కురొసావా


అకీరా కురొసావా 
23 March 1910 - 6 Sep 1998

వెండితెర చక్రవర్తి


ఒకసారి దర్శకుడు అకిరా కురసోవాకు ఈ ప్రశ్న ఎదురైంది: ‘‘మీరు ‘రాన్‌’లోని ఆ ఫ్రేమ్‌లో కెమెరా అలా ఎందుకు పెట్టారు?’’
దానికి కురసోవా ఇచ్చిన జవాబు: ‘‘నేను ఒక్క అంగుళం ఎడమకు ప్యాన్‌ చేసినా సోనీ ఫ్యాక్టరీ కనబడుతుంది, అదే ఒక్క అంగుళం కుడికి జరిపితే ఎయిర్‌పోర్టు కనబడుతుంది. పీరియడ్‌ సినిమాకు ఆ రెండూ అనవసరం’’.
కురసోవా అంత పర్ఫెక్షనిస్టు! సినిమా కోసం ప్రాణం పెట్టేవాడు.

1948తో మొదలై నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఆయన కెరీర్లో... రషోమన్, ఇకిరు, సెవెన్‌ సమురాయ్, యొజింబో, థ్రోన్‌ ఆఫ్‌ బ్లడ్, దెర్సు ఉజాలా, ద లోయర్‌ డెప్త్స్, హై అండ్‌ లో, డ్రీమ్స్, రప్సోడీ ఇన్‌ ఆగస్ట్‌... ఒక్కో సినిమా ఒక్కో చరిత్ర!

సినిమా మాస్టర్లు అనిపించుకున్న దర్శకులు ఇన్‌మార్‌ బెర్గ్‌మన్, ఫ్రెడరికో ఫెల్లిని, సత్యజిత్‌ రే, రోమన్‌ పోలన్‌స్కీ, జార్జ్‌ లుకాస్, ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పోలా, మార్టిన్‌ సోర్సెసె, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌లాంటివాళ్లు కూడా కురసోవా వల్ల ప్రభావితమయ్యారు. అందుకే ఆయన్ని విమర్శకులు గౌరవంగా ‘ఎంపరర్‌ ఆఫ్‌ ద సెల్యులాయిడ్‌’ అంటారు.

జపాన్‌ ‘సమురాయ్‌’(సైనిక) కుటుంబంలో జన్మించిన అకిరా సినిమాలు మాత్రమే తన ఉనికిగా బతికాడు. యుద్ధ సన్నివేశాలను చిత్రించడంలో, రిస్కు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి! నటీనటులకు అలవాటు కావడానికి, తద్వారా సహజత్వం కోసం సినిమా కాస్ట్యూమ్స్‌తో వాళ్లను కొంతకాలం పడపమనేవాడు. ఏరోజు రషెస్‌ ఆరోజు స్వయంగా ఎడిట్‌ చేసుకునేవాడు.

‘‘ఆలోచనలు సహజంగా వస్తాయి, కథ ఆ క్యారెక్టర్‌ వెంట సాగిపోతుంది’’ అని తను సినిమా తీసే విధానం గురించి చెప్పేవాడు కురసోవా. స్టోరీబోర్డ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. సినిమాకు ఫండింగ్‌ దొరకని విరామ సమయాల్లో తన సీన్లన్నింటినీ బొమ్మలుగా గీసుకునేవాడు. ఆయన స్వయంగా పెయింటర్‌ కూడా! సినిమాల్లోకి రాకముందు కమర్షియల్‌ ఆర్టిస్టుగా పనిచేశాడు. ‘‘నిజంగా డైరెక్టర్‌ కావాలనుకుంటే ముందు స్క్రీన్‌ప్లేలు రాయండి. రాయడం ద్వారానే సినిమా స్ట్రక్చర్‌ అర్థమవుతుంది, అసలు సినిమా ఏంటో కూడా అర్థమవుతుంది’’ అని ఔత్సాహిక దర్శకులకు సలహా ఇచ్చేవాడు. ‘‘నీలోపల ఎంతో రిజర్వు ఉంటేతప్ప, నువ్వు ఏదీ సృష్టించలేవు. జ్ఞాపకమే సృష్టికి మూలం. శూన్యం నుంచి దేన్నీ సృష్టించలేం’’. అందుకని చదవడం చాలా ముఖ్యమనేవాడు. ‘‘అయితే, చదవడం వల్లగానీ, నీ జీవితానుభవం వల్లగానీ వచ్చినదానికి జోడించగలిగేదేదో నీలోపల లేకపోతే నువ్వు ఏదీ సృజించలేవు’’ అనేవాడు.

ఆయన సినిమాలన్నీ ‘లార్జర్‌ దన్‌ లైఫ్‌’గా కనబడినా, ఆయన మాట్లాడిందంతా జీవితం గురించే! మనిషి ఎప్పుడూ తప్పకూడని నీతినీ, ఎప్పుడూ పాటించవలసిన మానవీయ విలువనీ ఆయన చిత్రాలు  ప్రతిబింబించాయి. మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్నీ, మనిషిగా నిలబడటం కోసం పడే ఆరాటాన్నీ, సమూహంతో కలిసిసాగే సంతోషపు వెతుకులాటనూ ఆయన చిత్రించాడు. అయితే, జీవితం ఎంత సంక్లిష్టమైందో ఆయన సినిమాలు కూడా అంతే సంక్లిష్టమైనవి. అందుకే కురసోవా తన సినిమాల్లో ‘ఫలానాది వెల్లడించాడు’ అనడం తప్పుడు విశ్లేషణే అవుతుంది.
‘‘నా సినిమా ఏం చెబుతుందో నేనేగనక వివరించగలిగితే అందరికీ వెళ్లి అదే చెప్తానుగానీ, అంత కష్టపడి సినిమా ఎందుకు తీస్తాను?’’ అన్నాడాయన. సినిమాను అర్థం చేసుకోవడంలో మెదడుకంటే హృదయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమనేవాడు. ఆయన చిత్రరాజాలు మాత్రం మెదడునూ, హృదయాన్నీ రెంటినీ సంతృప్తిపరుస్తాయి.

(సాక్షి ఫన్‌డే; 23 మార్చ్‌ 2014)
––––––––––––––––––––––

Thursday, September 3, 2026

అల్లం శేషగిరిరావు ‘నరమేధం’


అల్లం శేషగిరిరావు 

అల్లం శేషగిరిరావు (1934–2000) ‘నరమేధం’ సంక్షిప్తరూపం ఇది. 1979లో ప్రచురితమైంది. ఒరిస్సాలో జన్మించి, రైల్వేలో పనిచేసిన శేషగిరిరావు ‘మంచి ముత్యాలు’, ‘అరణ్య ఘోష’ కథాసంకలనాలు వెలువరించారు.

––––––––––

ఒక్కరోజు చావు


ఛత్ర చామరాలతో అలంకరించిన ముఖద్వారం, కొబ్బరాకులతో అల్లిన పూజా మంటపం, రథం అగ్రభాగాన పరుగులు తీస్తున్న శ్వేతాశ్వాలు నేత్రానందకరంగా ఉన్నాయి. జనం గంపులు గుంపులుగా వస్తున్నారు జాతరని చూడ్డానికి.

గంగరాజు సిల్కు లాల్చీ తొడుక్కుని పట్టపంచ కట్టుకున్నాడు. బొద్దు మీసాలతో, సన్నంగా, పొడవుగా, వెండి తీగెలా ఉన్నాడు. రథయాత్రా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు.

‘‘టైమయింది, గంగరాజుగారూ’’ అని పూజారి మంత్రజలం చల్లి గంగరాజు మెడలో పూలదండ వేసి కొబ్బరికాయ చేతికి అందించేడు. రాజు ‘‘జై జగన్నాథ్‌!’’ అని టెంకాయని మూడుసార్లు దిష్టితీసి బలంపూర్తిగా కొట్టేడు. కుర్రాళ్లు కొబ్బరి ముక్కల కోసం ఎగబడిపోతున్నారు.

‘‘జగన్నాథ మహాప్రభూకి జై’’ ‘‘గంగరాజు బాబుకీ జై’’. రథం బయలుదేరింది. నీలమాధవుడు జగన్నాథరూపంలో బలరామదేవునితోనూ, చెల్లెలు సుభద్రాదేవితోనూ విజయుని సారథ్యంలో ఊరేగుతున్నాడు. ప్రతి ఏటా ఆషాఢంలో నిజమందిరాన్ని విడిచి, విడిది మందిరం ‘‘గుడిసెన్న గుడికి’’ రథయాత్ర సాగిస్తాడు.

ధర్మకర్తృత్వం వంశపారంపర్యంగా గంగరాజుకి సంక్రమించింది. ఆ అధికారాన్ని సవాల్‌ చేస్తూ ప్రత్యర్థి వెంకునాయుడు కోర్టులో కేసు పెట్టేడు. రెండేళ్లుగా రథయాత్ర జరక్కుండా కోర్టు నుంచి ఇంజంక్షన్‌ ఆర్డరు తెప్పించి ఆపుచేస్తూ వచ్చాడు. చివరికి గంగరాజే గెలిచాడు. కోర్టులో గెలిచిన విజయోత్సాహంతోనూ, వెంకునాయుడి మీద కసితోనూ భోగరాగాలు అన్నీ గంగరాజే చూసుకుంటున్నాడు. ఎల్లక్షన్లు అతి దగ్గరలో ఉన్నాయి.

రథం మీద పూజారులు జనం అందిస్తున్న కొబ్బరికాయలు కొడుతున్నారు. పూలమాలల్ని విగ్రహాల పాదాల దగ్గరికి విసురుతున్నారు.

‘‘గంగరాజు బాబూ, మనం కాస్త జాగ్రత్తగా వుండాలి. ఎగస్పార్టీ వోళ్లు మనలో కలిసే తిరుగుతున్నారు. చూశారా ఆ గళ్ల చొక్కావోడు.’’

‘‘ఒరే సాంబా! కొండంత మనిషివి నువ్వుండగా, జగన్నాథుడు మన పార్టీ అయివుండగా ఎంకునాయుడు ఎవడ్రా? ఝూటాగాడు.’’

‘‘తగవుకి దిగితే తల తీసేస్తాను గాని, రాజుబాబు, రెండు రోజుల్నించి ఎంకునాయుడు ఇటు ఢిల్లీకి అటు హైదరాబాదుకి తెగ ఫోన్లు కొడుతున్నాడట. ఎవడో నాయకుణ్ని తెప్పించి మీటింగు పెడతాడట’’.

‘‘పెట్టనీరా, జనం బఠానీలు నవులుతూ వింటారు. తరువాత ఇళ్లకి పోతారు. మనం కూడా మలి రథయాత్ర నాడు అన్న సంతర్పణ చేయిస్తున్నాం. ఊరు ఊరంతా రావాలి. పూరీ నుంచి జగన్నాథ ప్రసాదాన్ని కుండల్లో తెప్పించి అందులో కలిపాం అందాం. వస్త్రదానం కూడా చేద్దాం. మరో రెండు వేలు ఖర్చు అవనీ. ప్రసాదం తిని మోసం చేస్తే కళ్లు పోవూ?’’

సాంబడు వెనకాల రథం దగ్గర గోలగా వుంటే అక్కడికి పరుగున వెళ్లేడు. ‘‘తొయ్యండ్రా, తొయ్యండెహే. జోర్సే.’’ రథచక్రాలు క్రీచుక్రీచుమంటూ నేలని రాసుకుంటూ కదలడం లేదు. అప్పటికే వడ్రంగి యినప చట్రాల్ని సుత్తితో కొడుతూ సరిచేస్తున్నాడు. ‘‘ఆవదం బాగా పొయ్యండ్రా’’ సాంబడు. ‘‘ఆదిలోనే ఏమిటీ అవాంతరం?’’ గంగరాజు.

‘‘నాయనా, రాజుబాబూ! ఢక్కువాడు రథం మీద కనిపించడం లేదు. దేవుడికి దిష్టి తగిలిందేమో’’ పక్కనే నిల్చున్న ముసలాయన. ఢక్కువాడి పేరు వినగానే చిన్న సంచలనం బయలుదేరింది. రథం మీద బూతు పాటలు పాడేవాణ్ని ఢక్కువాడు అంటారు. ఆ పాటలన్నీ ఒరియా భాషలో ఉంటాయి. రెండేళ్లుగా జాతర లేకపోవడంతో ఢక్కువాడి సంగతే మరిచిపోయాడు పూజారి. వెంటనే ఒక కుర్రాడు ఢక్కువాడి కోసం గాలిలా పరుగెత్తాడు.

‘‘బాబూ, ఢక్కువాడు రానంటున్నాడు. బ్లడీ భంచోత్‌. దేవుడి తరఫున నువ్వు వస్తావుట్రా, లింగులింగుమంటూ అని గసిరేశాడండి.’’

‘‘ఈ జాతి తక్కువ నా కొడుకుని నేను వెళ్లి బ్రతిమాలాలి కాబోలు’’ గంగరాజు.

‘‘వాళ్లు అలగడం, ధర్మకర్తలు వెళ్లి బ్రతిమాలి తీసుకురావడం ఆచారం’’ అన్నాడు పూజారి.

‘‘ఢక్కువాడికి కొత్తబట్టలు కుర్రాడిని పంపించి తెప్పించండి’’ జేబులో డబ్బు తీసి ఇచ్చాడు గంగరాజు.

ఢక్కువాడి పూరి గుడిసె ఊరవతల ఉంది. ఇంటి చుట్టూ కుళ్లు కాలవల కంపు. వైద్య విద్యార్థుల ముందు శవం ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు, ఏడాదికొకసారి ఢక్కువాడికి ప్రాముఖ్యం లభిస్తుంది. 

‘‘ఢక్కువా ఢక్కువా, పద పదరా రథం ఆగిపోయింది’’ హెచ్చరించేడు గంగరాజు. ఈ అలికిడికి పెరట్లో పనిచేసుకుంటున్న ఢక్కువాడి పెళ్లాం ఆదెమ్మ గబగబ వచ్చి ‘‘దండాలు బాబుగారు, ప్రొద్దుట్నుంచీ తెగ తాగేసి తిరుగుతున్నాడు. తిండి మానేసి కొడుకుని తల్చుకుంటూ తిరుగుతున్నాడు. ఇదిగో ఇనుకో, బాబులొచ్చారు, జాతరకెళ్లెల్లు’’ మొగుడ్ని కుదుపుతూ అంది.

‘‘జాత్తర? నెల రోజుల క్రితం నా కొడుక్కి శ్మశానంలో పెద్ద జాతర చేశాను. ఈ రోజు దేవుడికి జాతర పట్టిస్తాను.’’

‘‘ఏటి బాబులొస్తే మరియాద లేకుండా?’’

‘‘రెండేళ్ల నించి నేను సచ్చానో వున్నానో పట్టించుకోని బాబులు ఈయేళ ఎందుకొచ్చారే?’’

‘‘ఒరే ఢక్కువా, కొత్తబట్టలు తెచ్చేడు. కట్టుకొని బయలుదేర్రా’’ పూజారి గర్జించేడు.

‘‘ఓల్‌రైట్‌’’ కుర్రాడు తెచ్చిన బట్టల్ని అందుకున్నాడు. ‘‘మరి కట్నం?’’

‘‘ఇదుగో ఇరవై’’ చేతిలో పెట్టబోయాడు గంగరాజు.

‘‘నో నో ఫిఫ్టీ డాలర్స్‌. ఏభై లేకపోతే నేను రానెహోయ్‌’’ 

మిగతా ముప్పై కలిపి చేతిలో పెట్టాడు గంగరాజు. తూలుతున్న ఢక్కువాడి జబ్బ పట్టుకుని పెరట్లోకి తీసుకెళ్లింది ఆదెమ్మ. గిన్నెడు తరవాణి తాగించింది. ఆ పులుపుకి మొగమంతా వికృతంగా చిట్లించుకుంటూ బ్రేవ్‌మని తేన్చాడు. ‘‘ఇక్కడ కాదు, నా కొడుకు శవాన్ని స్నానం చేయించిన దగ్గరే నాకూ నీళ్లు పొయ్యి’’ తడబడుతూ వెళ్లి కూర్చున్నాడు.

‘‘ఏభై రూపాయలు ఇలా తే. మనం తిన్నా తినకపోయినా ముందు అప్పులోళ్ల సంగతి చూడు, బజార్లో పట్టుకుని నానా తిట్లు తిడతన్నారు.’’

‘‘అప్పులు చెయ్యడం, తిట్లు తినడం, పస్తులుండటం మనకలవాటేనే. ఈ అప్పు తీరిస్తే మళ్లీ మరో అప్పు. అప్పుడెక్కడ్నుంచి వస్తయి పైసలు. ఈరోజు నేను రాజా. ఈరోజు పోతే రేపు మరి నాకు లేదు. ఫుల్‌గా పఠాసు కొట్తేస్తాను.’’

‘‘తిండికి లేక సస్తుంటే తాగుతానంటా వేంటీ?’’

దూరంగా బాజాల మ్రోత. సన్నాయి మేళం, జేగంటలు దగ్గరవుతూ ఢక్కువాడి ఇంటి ముందర ఆగాయి. ఆదెమ్మ ఒళ్లంతా తుడిచి కొత్తబట్టలు కట్టించింది. కొత్త పంచ, కొత్త తలపాగా. కండువా నడుంకి. చేతి కర్రకి రంగు గావంచ యెత్తి పట్టుకుని వాకిట్లో నిల్చున్నాడు ఢక్కువాడు. గంగరాజు స్వయంగా కాళ్లు కడిగి పూలదండ వేసి నమస్కరించాడు. ఢక్కువాడు రథయాత్రకి  బయలుదేరాడు.

‘‘ఢక్కువాడొచ్చేడు! ఢక్కువాడొచ్చేడు’’ అంటూ జనం చుట్టుముట్టేరు. వాళ్లందర్నీ పక్కుకు నెడుతూ నిచ్చెన వేసి వాడ్ని రథం మీదకు ఎక్కించేరు. తండ్రులు పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని ఢక్కువాడ్ని చూపిస్తున్నారు.

‘‘తైతైతైతై తైతైతైతై’’ అంటూ సంకీర్తన మేలగాళ్లని గొడుగు కర్రని ఆడిస్తూ హెచ్చరించేడు. ‘‘ఢింఢిం తకఢింఢిం’’ ‘‘ఢైంయ్‌ ఢైంయ్‌’’ ‘‘రొధొ ఢీకొ ఢీకొయిలా! మహాప్రాంకొరొ కొండియా నపాయిలా తైతైతై’’ వలయాకారంగా నడ్డి తిప్పుకుంటూ రథం మీద గెంతుతున్నాడు ఢక్కువాడు. బూతు పేలింది. రథచక్రాలు కదిలేయి. ఆ పాటకి అర్థం యేమిటన్నట్లు పూజారికి సంజ్ఞ చేశాడు గంగరాజు. ఒరియా తెలిసిన పూజారి గంగరాజు చెవిలో గొణిగాడు. ముసిముసి నవ్వుకుంటూ సంబరంతో పాటు నడుస్తున్నాడు గంగరాజు. ఢక్కువాడు మరో పాట అందుకున్నాడు. రకరకాలుగా గెంతుతున్నాడు. కోతిలా యెగురుతున్నాడు.

రథం దగ్గర చిన్న గందరగోళం మొదలైంది. గళ్లచొక్కావాడు ‘‘కొబ్బరికాయలు అందిస్తున్న ఆడవాళ్ల చేతులు పట్టుకుంటావా?’’ అని పూజారి పెద్దకొడుకు చొక్కా పట్టుకున్నాడు. ‘‘రౌడీవెధవ, నువ్వు చూశావురా?’’

సాంబడు రథస్తంభం పట్టుకుని ఎగిరి గళ్ల చొక్కావాణ్ని జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. ‘‘సంబరం భగ్నం చేయడానికి పితూరీ లేవదీస్తున్నావా? ఎంకునాయుడు ఎంగిలి కూడు కతికి జగడానికి వస్తావా?’’ క్రిందపడేసి ఈడ్చి ఈడ్చి తంతున్నారు. వాడి పార్టీ వాళ్లు బలం చాలక జారుకున్నారు.

బాజాలు మ్రోగుతున్నాయి. ఈ సందడిలో ఢక్కువాడు దిగిపోయేడు. సీసా తీసి డగ్‌ డగ్‌ మని గుటకలు వేసి మూతి తుడుచుకున్నాడు. ‘‘నేను దరిద్రపు నా కొడుకుని. నా బాబూ తాతలందరూ దరిద్రంతో బతికి ఆకలితో సచ్చారు. తరతరాల నుంచి మా బూతులు యింటూ కులాసా పడిపోతున్న దేవుడు మా ఆకలి తీర్చాడా? నా కొడుకును రచ్చించాడా?’’ ఢక్కువాడి కంఠం రుద్దం అవుతోంది. ‘‘నా కొడుకు పోయాడు నాయనా, ఆరు నెలలు రోగంతో తీసుకుని మందుల్లేక తిండిలేక తడపలా అయిపోయి, బిళ్ల బిళ్లలు రకతం కక్కుకుంటూ సచ్చిపోయేడు. నా పద్దెనిమిదేళ్ల కొడుకు ఎలిపోయాడు నాయనా’’ గొల్లున ఏడుస్తూ కూలిపోయాడు. సాంబడు వాడ్ని ఓదారుస్తూ రథం యెక్కించి వెనకాల ఎవరికీ కనబడకుండా పడుకోబెట్టాడు.

చీకటి పడింది. గేస్‌లైట్లు, దివిటీలు వెలిగించారు. గుడిసెన్న గుడి దగ్గర పడుతుందనగా ధన్‌మని సోడాబుడ్డి పేలింది. నలువైపుల నుంచి రాళ్లవర్షం. జనంలో గోల. గళ్ల చొక్కావాడు సైకిల్‌ చెయిన్‌తో సాంబడ్ని కొట్టాడు. చెట్టులా పడిపోయేడు సాంబడు. పూజారులు గెంతేసి పరుగు లంకించుకున్నారు. ‘‘ఎలక్షన్‌ కార్యాలయానికి నిప్పింటించేరు’’ అరిచేడు జనంలోంచి వెంకునాయుడు పార్టీవాడు. క్షణంలా వూరంతా పాకిపోయింది వార్త. కొన్ని యిళ్లు తగలబడుతున్నాయి. గళ్లచొక్కావాడిని ఎవరో కత్తితో పొడిచేరు. ధన్‌ ధన్‌ ధన్‌– గాలిలో తుపాకుల కాల్పులు. పోలీసులు పోలీసులు. అరగంటలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గంగరాజునీ, వెంకునాయుణ్నీ అరెస్టు చేశారు. కరెంట్‌ కట్‌ చేశారు. కర్ఫ్యూ విధించారు. 

రథాన్ని గుడిసెన్న గుడికి తీసుకురావడానికి పోలీసుల బలగం బయలుదేరింది. పోలీసుల్ని పురమాయిస్తూ ఇన్‌స్పెక్టరు రథం మీదికి టార్చిలైటు వేశాడు. ఒక మానవ కళేబరం రథానికి వేలాడుతోంది. ఢక్కువాడు కొత్త కండువాతో ఉరిపోసుకున్నాడు.

తరువాతి కథ: గంగరాజు, వెంకునాయుడు తిరిగి జనాల్లోకి వచ్చారు. ప్రతీ సంవత్సరం వైభవంగా రథయాత్ర జరుగుతూనే ఉంది. వెంకునాయుడు, గంగరాజు రొటేషన్‌ పద్ధతిలో ఎంఎల్‌ఏలు అవుతూనే ఉన్నారు. పాత రథం స్థానే కొత్త రథం వచ్చింది. ఢక్కువాడి పీనుగుతో మైలపడిన పాత రథాన్ని ఊరవతల పడేశారు. చుట్టుపక్కల వాళ్లకి అప్పుడప్పుడూ ఊరవతల నించి అర్ధరాత్రివేళ స్పష్టాస్పష్టంగా ఏవో పాటలు, ఏడుపులు వినిపిస్తుంటాయట! 


(సాక్షి సాహిత్యం; 24 సెప్టెంబర్‌ 2018)

Monday, August 31, 2026

6ద్ర


ఆరుద్ర
31 Aug 1925 - 4 June 1998


6ద్ర

ఆగస్టు 31న ఆరుద్ర జయంతి
-------------------------------------

ఆరుద్రకు ఒక ‘నేమ్‌ప్లేట్‌’ చేయించాలంటే, ఆయన పేరుముందు ఏం చెక్కించాలి? బహుముఖ ప్రజ్ఞాశాలి అనేయొచ్చు సింపుల్‌గా. కానీ ఆ ప్రజ్ఞ  ఎన్నిరకాలు?

కవి, కథకుడు, డిటెక్టివ్‌ నవలా రచయిత(నెలకొకటి చొప్పున రాస్తానని అలాగే రాయడం ఆయన చేసిన ఆరుద్రశపథం), గేయకర్త, గేయనాటకకర్త, వ్యాసకర్త, గడీనుడీకారుడు, సంపాదకుడు, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, అభ్యుదయ రచయితల సంఘం– అరసం వ్యవస్థాపకుల్లో ఒకరు(సంఘాల గొడుగు ఎందుకు? అంటే, వానపడకుండా ఉండటానికంటాడు!), చివరగా సినిమా రచయిత. అనగా, పాటలూ మాటలూ అనువాదాలూ.
 
రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా(గోరంతదీపం); అమ్మకడుపు చల్లగా (సాక్షి); కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల); వేదంలా ప్రవహించే గోదావరి (ఆంధ్రకేసరి); ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం (ఎంఎల్‌ఏ); ఎదగడానికెందుకురా తొందర (అందాల రాముడు); ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ (ముత్యాలముగ్గు); శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది (పెళ్లిపుస్తకం)...  ఆరుద్రను ఇలాంటి ఏ కొన్ని పాటలతోనైనా పరిచయం చేయొచ్చు; లేదా, ఒకే ఒక్క వాక్యంతోనూ ఆయన్ని స్ఫురణకు తేవొచ్చు. ‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’.

భాగవతుల సదా శివశంకరశాస్త్రిగా జన్మించి, జన్మనక్షత్రం పేరిట తన కలంపేరును స్వీకరించిన ఆరుద్ర– కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చాటుకున్నాడు. ‘నాకోసం నేను రాసుకోను. అందరికోసం నేను రాస్తాను. అందరూ నావాళ్లే కాబట్టి, నాకోసం రాసింది అందరికోసం రాసిందే’ అంటాడు.

తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ఆరుద్ర రాసిన ‘త్వమేవాహం’ చదివి, ఇక నేను పద్యాలు రాయకపోయినా పరవాలేదు, అని ఆనందపడ్డాడట ఆరుద్రకు మేనమామైన శ్రీశ్రీ. ఇందులో ఆరుద్ర– సమాజాన్ని గడియారంతోనూ, ధనికుల్ని గంటల ముల్లుతోనూ, మధ్యతరగతివాళ్లని నిమిషాలముల్లుతోనూ, పేదల్ని సెకన్లముల్లుతోనూ, ‘కీ’ని విప్లవగొంతుకగానూ ప్రతీకిస్తాడు.

అంత్యప్రాసల ముద్ర–ఆరుద్ర అనిపించుకున్న ఈ ‘సన్యాసి రూప’ కవి... ‘ఛందస్సులతో అడ్డమైన చాకిరీ అందంగా చేయించుకోగలడు’. శ్లేషలు, చమత్కారాలతో మురిపిస్తాడు. చెరిషించి, పెరిషించి లాంటి తెలుగు ఇంగ్లీషు పదాల కాక్‌టెయిల్‌ సృష్టిస్తాడు. ‘ఆ/ మెన్‌/ ఆమెన్‌/ చెరపట్టన్‌/ మ్రోగెన్‌/ నీగన్‌/ నా/ పెన్‌/ ఆపెన్‌’... లాంటి పదాల గారడీలో వస్తువుకు ఔచిత్యభంగం వాటిల్లుతోందా? అనే మీమాంస ఒకటి కలిగినప్పటికీ!

‘చిన్ని పాదములందు/చివరి ప్రాసల చిందు/ చేయు వీనులవిందు/ ఓ కూనలమ్మా’ అంటూ కూనలమ్మ పదాలు ప్రారంభించాడు ఆరుద్ర. ‘ఆలి కొన్నది కోక/ అంతరిక్షపు నౌక/ అంతకన్నను చౌక/ ఓ కూనలమ్మా’ అని నవ్విస్తూనే, ‘కోర్టుకెక్కినవాడు/ కొండకెక్కినవాడు/ వడివడిగ దిగిరాడు’ అన్న సత్యాన్నీ చెబుతాడు. ‘అంతుచూసేవరకు/ అకట ఆంధ్రుల చురుకు/ నిలువ ఉండని సరుకు’ అని తెలుగువారి ఆరంభశూరత్వాన్ని వెక్కిరిస్తాడు. ‘అణువు గుండెను చీల్చి/ అమితశక్తిని పేల్చి/ నరుడు తన్నును బాల్చి’... చిన్న పదాల్లో పెద్ద భావాన్ని ఇముడుస్తాడు. ‘పరుల మేలును కోరి/ పదములల్లెడు వారి/ పథము చక్కని దారి’ అనిపిస్తాడు.

ప్రయోగశీలత ఆయన కథల్లోనూ కనిపిస్తుంది. ‘సుబ్బారావున్నరగంటలసేపు’ అంటాడొకచోట. తన పురుషుడిని తన పూర్తి ప్రపంచంగా మలచుకున్న స్త్రీ హృదయానికి ఈ కొలత సులభంగా అర్థమవుతుంది!

‘రాముడికి సీత ఏమౌతుంది?’ లాంటి ఆకస్తికర శీర్షికతో సకల రామాయణాల్ని తవ్విపోశాడాయన. శ్రీకృష్ణుడు అసలుసిసలు ఆంధ్రుడనీ, ఏకలవ్యుడు కుంతీదేవి అక్క కొడుకనీ, పుత్రికకూ కుమార్తెకూ భేదముందనీ, పుత్రిక అంటే సహోదరులు లేనిదనీ, కుమార్తె అంటే తోడబుట్టినవారిని కలిగినదనీ తేల్చిచెప్పాడు.

‘సినీవాలి’, ‘ఇంటింటి పజ్యాలు’, ‘గాయాలు–గేయాలు’, ‘పైలాపచ్చీసు’, ‘శుద్ధ మధ్యాక్కరలు’, ‘గుడిలో సెక్స్‌’, ‘వేమన్న వాదం’, ‘తిరుక్కురళ్‌’అనువాదం, చదరంగ పుస్తకం, ‘సినీ మినీ కబుర్లు’... ఇక, రాయడం అటుండనీ, చదవడానికే జీవితకాలం చాలదనిపించే బృహత్తరమైన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ ఆయన పరిశోధనాశక్తికి పరాకాష్ట! సంస్థలుగా మాత్రమే చేయగలిగిన పనిని ఒక్కడే పూనిక వహించి పూర్తిచేశాడు. ‘నాకు స్పష్టంగా తెలుసు అనుకున్నదాన్ని పాఠకులకు స్పష్టంగా’ చెప్పదలిచాడు. చాళుక్యులు నుండి ఆధునిక కాలం వరకు ‘ఆర్థికసంబంధాల ప్రాతిపదికన యుగవిభజన’ చేసిన ఈ పుస్తకం కోసం– ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. మధుమేహం పెరిగి మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. కంటిచూపు తగ్గిపోయింది. అయినా అన్ని కష్టాలనూ ఓర్చి వెయ్యేళ్ల చరిత్రను తెలుగువాళ్లకు అందించగలిగాడు. ‘సాహిత్యం అర్ణవమైతే, ఆరుద్ర మథించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు; ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు’.

(సాక్షి ఫన్‌డే; 31 ఆగస్ట్‌ 2014)
––––––––––––––––––––––

Thursday, August 27, 2026

ఏబది వేల బేరము


కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు(1877–1923) కథ ‘ఏబది వేల బేరము’కు సంక్షిప్త రూపం. కె.రామానుజరావు అనే కలంపేరుతో రాశారు. ఆంధ్రపత్రికలో1910లో ప్రచురితం. సౌజన్యం: వికీపీడియా. కొమర్రాజు తెలుగు, మరాఠీ భాషల్లో సమాన పండితుడు. సంస్కృతం, హిందీ, బెంగాలీ, గుజరాతీ భాషల మీదా పట్టుంది. శివాజీ చరిత్ర, హిందూ మహాయుగము, ముస్లిం మహాయుగము రాశారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలు వెలువరించారు. వ్యక్తి కాదు, సంస్థ అనిపించుకున్నారు. అనారోగ్యంతో 46 ఏళ్లకే మరణించారు. తొలి తెలుగు కథారచయిత్రి భండారు అచ్చమాంబ ఈయన అక్క.

–––

కంగారు ఆభరణాలు


చెన్న పట్టణమందలి షాహుకారుపేట లక్ష్మికి నివాస స్థలము.

ఒకనాడుదయము జగజీవన్‌ లాల్‌ నాలుగంతస్థుల మేడ యెదుట రెండు గుఱ<ముల కోచి బండి నిలచెను. బండిలో వెనుక ప్రక్కనొక పురుషుడును, అతని భార్యయు గూర్చుండియండిరి. వారికి నెదుట నైదారు నెలల పిల్లవాని నెత్తుకొని యొక దాసి కూర్చుండి యుండెను. బండి వెనుక చిత్రమైన దుస్తులు ధరించిన గుఱ<పు వాండ్రిద్దరు నిలిచి యుండిరి. బండికి ముందు భాగమున నెత్తుగనున్న యాసనముపై కోచిమన్, వాని ప్రక్కన మరియొక సేవకుడును గూర్చుండియుండిరి. యజమానుడు తన జేబులో నుండి విజిటింగ్‌ కార్డు నొకదానిని తీసిచ్చెను. జగజీవన్‌ లాల్‌ ఆ కార్డును చూచుకొని రాజా ఆఫ్‌ నర్సాపూర్‌ అని చదివి తత్తరపాటుతో బండియొద్దకు వచ్చెను.

ఈ వర్తకుడు రవ్వలు, కెంపులు, పచ్చలు, వైఢూర్యముల వర్తకమే చేయుచుండును. పుష్యరాగముల వంటి తక్కువ వెలగల రాళ్ళనుగాని, వెండి బంగారములను గాని ముట్టనే ముట్టడు. ఆతని పద్దులన్నియు వేలు లక్షలు. రాజులు, మహరాజులితని వద్ద లక్షల కొద్ది వెల గల రాళ్ళను తీసికొని పోవుచుండిరి. ఆతడు బండి సమీపమునకు వచ్చిన తోడనే, సేవకుడు బండి తలుపుల దీసెను. బండిలో నుండి జమీందారు దిగి, షాహుకారుతో షేక్‌ హాండు చేసి ‘మీరేనా జగజీవనలాలు షేట్జీగారు’ అని యడిగెను. ‘కుబేరుని తరువాత తామే కుబేరులని వినియున్నాను’.

‘మీ వంటి రాజాధిరాజుల యనుగ్రహముండ నేను కుబేరుడనే, దయచేయుడు’ అని మాట్లాడుకొనుచు వారిద్దరును లోనికి పోయిరి. జమీందారు భార్యయు, పిల్లను నెత్తుకొన్న దాసియు లోనికి బ్రవేశించిరి. ఈ జమీందారుడు ఇంగ్లీషు ఫ్యాషన్‌ గలవాడగుటచే తన భార్యకు ఘోషా లేకుండజేసినట్లు కానవచ్చుచున్నది. ఘోషా లేదుకాని, యీమెకు వంటిమీద నగలు మాత్రము పరిమితముగా నుండెను. మెడలోనున్న సూర్యహారమే యొక పదివేలు, చంద్రహారమే పదియైదు వేలు చేయవచ్చును. కాళ్ళకున్న బంగారు పాంజేవులు అయిదువేలయిన ఖరీదు చేయవో? దాసి భుజముపై నిద్రించుచున్న బాలునికి మిక్కిలి విలువగల నగలు పెట్టబడెను.

మేడమీద గొప్ప గొప్ప రాజుల కొఱకై అలంకరించబడిన హాలులోనికి దీసికొనిపోయి జమీందారు నొక కుర్చీమీద కూర్చుండబెట్టి అతని భార్యకు కొంచెము చాటుననున్న యొక స్థలమును చూపించెను. 

జగ: ‘అయ్యా, తమ రాజధాని ఏ జిల్లాలోదండి.’

జమీం: ‘మా సంస్థానము గోదావరి జిల్లాలోనున్నది. మేము కలక్టరును చూచుటకు వెళ్ళినపుడు పదిహేను ఫిరంగులు కాల్చెదరు. వెండి కుర్చీల మీదగాని మేము కూర్చుండము. కాని నేనింగ్లీషు యెడ్యుకేటెడ్‌ జంటిల్‌మన్‌ అయినందున ఈ పిచ్చి ఆచారములు పాటింపను. టట్‌ నాన్సెన్సు అని మా ఆడవారి ఘోషా కూడ తీసివేసితిని. ఈ సంగతులకేమి గాని నిన్నటిదినము జయపురము మహారాజు మీవద్ద కొన్న లక్ష రూపాయల జవాహిరి చూచితిని. వారికి నాకు మిక్కిలి స్నేహము.’

జగ: ‘చిత్తము, మహారాజులంగారికి నాయందు మిక్కిలి అనుగ్రహము.’

జమీం: ‘రవ్వలంటే మీ వద్దనే రవ్వలు, ఏమి ఆ కాంతి? ఇంకను అట్టి రవ్వలు గలవా?’

జగ: ‘కొనువారుండిన రవ్వలకేమి తక్కువ. తెప్పించెదనా?’ అని అడిగి, లేచి లోనికి బోయి సేవకునిచే నొక పెద్ద ట్రంకు పెట్టెను పట్టించుకొని వచ్చి బల్లమీద పెట్టి దానిందెఱిచి రవ్వల పొట్లము నొకటి వెనుక నొకటి తీయుచు జమీందారు గారికి చూపదొడగెను. ఇవి బాగున్నదని బాగుండ లేదనియు జెప్పుచు, దీని వెల యెంత దాని వెల యెంత అని అడుగుచు ‘మీరు మిక్కిలి సత్యసంధులని జయపుర మహారాజా గారు నాతో చెప్పినంతనే వచ్చితిని. క్రమమైన వెల జెప్పవలయును సుమా’యని నడుమ నడుమ ననుచు తనకు చక్కగ గానుపించిన వానిని భార్య వద్దకి తీసుకొనివెళ్ళి చూపుచు మరల దెచ్చును. గంట వఱకు బేరము చేసెను. తుద కేబది వేల రవ్వలను బేరము చేసి విడిగా తీయించెను. షాహుకారు జమీందారు రత్నపరీక్ష జ్ఞానమునకు యాశ్చర్యమందుచు నడుమ నడుమ అతనిని పొగడుచుండెను.

ఇట్లు సిసలు పఱిచిన రవలనన్నింటిని చిన్న చిన్న పొట్లములుగా గట్టి ఆ పొట్లముల నన్నింటిని జమీందారు తనయొద్దనున్న పెద్ద మనీగాన్‌లో పెట్టి దానిని తన జేబులో నుంచుకొని షాహుకారుతో నిట్లనియె.

‘అయ్యా, అప్పనగా నాకు చీదఱ. కొన్న సరుకులకు వెలవెంటనే ఇయ్యవలయునని నా తాత్పర్యము. ఇంటి నుండి బయలుదేరునప్పుడు మీవద్దకు రావలెనని యనుకొనలేదు. ఈ త్రోవన మఱియొక చోటికి పోవుచుండగా నదియే మీ యిల్లని మా బండివాడు చెప్పెను. మిమ్ముల చుడవలెనని యాగితిమి. చూచినందుకు లాభమేయైనది. నిచ్చటికి వచ్చెదమని తలంపనందున పైకము తేలేదు. నేను యింటికి వెళ్ళి పైకము తీసుకొని వచ్చెదను. అంతవఱకు మన వాండ్రిక్కడనే యుండెదరు. తండియార్పేట వఱకు మనవాళ్లను తీసుకొని వెళ్ళవలసిన పనివున్నది. కావున ఇప్పుడు వీని నింటికి తీసుకొని పోవుట యెందుకు’ అని చెప్పి యాతడు లేచి భార్యతో నే వచ్చువఱకు నీ విక్కడనే యుండుమని చెప్పి కోచిబండి నెక్కి వెళ్ళిపోయెను.

భార్యాపుత్రులను యుంచి వెళ్ళుటకు జమీందారు గారొక కారణము చెప్పినను, జగజీవనలాలు మాత్రమా కారణమును నమ్మక, జమీందారు మిక్కిలి మర్యాదగల వాడగుటచే, తన నమ్మకమునకై వారిని తన ఇంట దించిపోయెనని తలచి, సంతసించెను.

జమీందారు వెళ్ళి అరఘంటయిన తరువాత సేవకుడు పరుగెత్తుకొని వచ్చి ‘దొరసానిగారూ? ఖజానా తాళపుచేతుల గుత్తి మీవద్దనే యున్నదట, దొరగారు మఱచి వెళ్ళినారు. తొందరగా తీసుకొని రమ్మని నన్ను పంపినారు. ప్రొద్దెక్కుచున్నది. పైకము తెచ్చి షాహుకారుగారికిచ్చి మనము తండియార్పేట వెళ్ళవలసి యున్నది’ అని పలికెను. అంతనామె తాళపు చేతుల గుత్తి వానిపై వేసి తొందరగా పొమ్మని యాజ్ఞాపించెను. వాడు పదియడుగులు వేయగా మఱల వానిని బిలిచి ఏమో యాలోచించి ‘గుత్తి నిటుతే’యని, ‘దినములు మంచివి కావు. లక్షల కొలది ధనమున్న ఖజానా తాళపుచేతులు వీనికిచ్చి పంపిన వీడేమి చేయునో? వీడు నమ్మిక కలవాడే గాని ధనముజూచిన ఎట్టి వారికి దుర్బుద్ధి పుట్టకమానదు. ఏమండీ షాహుకారుగారూ నిజమేనా?’ అని యడుగగా నాతడు ‘నిజమే నిజమే. డబ్బునెడల బహు జాగ్రత్తగా నుండవలెను’ అని తల యూపెను. ‘అట్లయిన నేనే తాళపుచెవుల గుత్తిని తీసుకొని వెళ్ళి పైకము తీసుకొని మేమిద్దఱము వచ్చెదము. నేను వచ్చు వఱకు అబ్బాయి పాలకేడ్చునేమో కావున కొంచెము పాలిచ్చి వెళ్ళెదనని ‘సీతా సీతా’యని దాసిని పిలిచెను.

దాసి పిల్లవానిని జోలపాడి నిద్రబుచ్చుచు మేడ క్రింద నొంటరిగా నుండెను. దాని జోల పాట మాత్రము పైకి వినబడుచుండెను. పిలిచిన తోడనేయది పిల్లవానిందీసికొని యజమానురాలి వద్దకు వచ్చెను. పిల్లవాని శరీరమంతయు నగలతో నిండియుండెను. రవ్వల, కెంపుల, పచ్చల పతకములు వ్రేలాడుచు ముఖమును కప్పివేసి యుండెను. యామె వానికి పాలిచ్చి యొక చిన్న పరుపు దెప్పించి వానినచ్చట బరుండబెట్టి భద్రమని దాసికి జెప్పి తన శరీరము మీది యేబది యరువది వేల విలువగల నగలను తీసి యాపిల్లవాని ప్రక్కనే యుంచి ‘మీ నమ్మిక కొఱకు వీనినిక్కడ నుంచుచున్నానని’ షావుకారుతో చెప్పెను. ‘కోటి వెలగల మీ కుమారునే ఇచ్చట నుంచుచున్నపుడు వేరే నగలుంచవలయునా? ఒకరిపై నొకరికి నమ్మిక లేని యెడల కలియుగ మెట్లుసాగు’నని, ‘మీరు వెళ్ళుటకు నా కోచిబండిని తెప్పింతునా’ అని యడిగెను. అచటనున్న సేవకుడు ‘అక్కర లేదు. నేను నడచి వచ్చిన తాళపు చేతి గుత్తి తీసికొని వచ్చుట కాలస్యమగునని నా యజమానుడు నన్ను కోచిబండి మీదనే పంపెను’ అని చెప్పెను. 

యజమానురాలు వెడలిన కొంతసేపటికి దాసి షాహుకారు వద్దకు వచ్చి ‘అయ్యా బీదదానిని. మా దొరవారు మీ యొద్దనెన్నో రాళ్ళు కొన్నారు. మీకింత లాభమైనప్పుడు నాకు కొంచెము యీనామియ్యకూడదా? దొరసానితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను’ అని పెక్కు మాటలు చెప్పి ఎప్పుడెవ్వరి కేమియు నియ్యని లుబ్ధాగ్రేసర చక్రవర్తియగు జగజీవనలాలు యొద్దనుండి యొక రూపాయి బహుమానము వడసెను. రూపాయి చేతిలో పడగానే ‘అయ్యా, కల్లుగాని సారాగాని త్రాగనిది యుండలేము. మా దొరగారికి దొరసాని గారికీ పేరన్న గిట్టదు. నెలదినముల నుండి లేక చచ్చిపోవుచున్నాను. వారు వచ్చువఱకు ఈ ప్రక్క యంగడిలోనికి పోయి పావులా సారా తాగి వచ్చెదను. నిముసములో వచ్చెదను. అంతవఱకు చిన్నదొరగారికి కొంచెము చూచుచుండుడి. నిద్రలో ఏడ్చెనేని కొంచెము జోకొట్టుడి’ అని చెప్పి వెడలిపోయెను.

పది ఘంటలాయెను. పదునొకండు ఘంటలాయెను. పండ్రెండు ఘంటల సమయమై ‘ధమ్మ’ని ఫిరంగి మ్రోత వినబడెను. షాహుకారుకు సంశయము పుట్టదొడగెను. కడుపున పుట్టిన బిడ్డను, ఇంత ధనముని విడిచి వారేల పోయెదరని సమాధానము చేసికొనెను. నొంటిగంటయ్యె. అప్పటికైనను, ఎవ్వరు తిరిగి రాలేదు. నిద్రబోవుచున్న పిల్లడైనను యేడువలేదు. ఆహారము లేక సొమ్మసిల్లెనేమోయని షాహుకారు పిల్లవాని యొద్దకుపోయి నెత్తుకొని చూడ యాశ్చర్యము! అది పిల్లవాని యంతయాకారము గల యొక జాతి బొమ్మ!! షాహుకారు సేవకులనందఱిని పిలిచి చూపెను. వారందఱును అదియొక మోసమని తెలిసికొని ‘మోసమైన మనకేమి, మనరాళ్ళ వెలకంటె మించిన నగలున్నవి’ యని నగలకు మదింపు వేయసాగిరి. ఒక్కోనగ తీసి చూచిన కొలదిని అవి గిల్టు నగలేకాని నిజమైనవి కావని స్థిరపడెను. నగలన్నియు నూరు రూపాయల కంటె వెలచేయవు.

పోలీసు వారికీ సమాచారమును తెలిపిరి. పోలీసువారు కొందఱును జగజీవనులాలు సేవకులు కొందఱును మాఱు వేషములతో నర్సాపురము వెళ్ళి విచారించి, నర్సాపురపు జమీందారీ సృష్టియందెచ్చటను లేదని తిరిగివచ్చిరి.

ఎంతమంది జమీందారులనో మోసపుచ్చిన తనను ఈ బూటకపు జమీందారు మోసపుచ్చె గదాయని చింతించుట తక్క జగజీవనలాలుకు మఱియేమి యుపాయమును లేకపోయెను.


(సాక్షి సాహిత్యం; 12 ఆగస్ట్‌ 2019)

Monday, August 24, 2026

చదువరి బోర్హెస్‌


జార్జ్‌ లూయీ బోర్హెస్‌


చదువరి, రాయరి

ఆగస్టు 24న జార్జ్‌ లూయీ బోర్హెస్‌ జయంతి
-----------------------------------------------------

బోర్హెస్‌ను పట్టించే రెండే పదాల్ని చెప్పమంటే, తడుముకోకుండా ఎంచుకోగలిగేవి: చదవడం, రాయడం!

చిన్నతనంలోనే వాళ్ల నాన్న తన గ్రంథాలయాన్ని బోర్హెస్‌కు పరిచయం చేశాడట. ‘అందులో ఏం కావలిస్తే అది చదువుకో’మన్నాడట. ‘కాని ఏదైనా విసిగిస్తే వెంటనే దాన్ని పక్కన పెట్టేయమన్నాడు. అంటే నిర్బంధ పఠనానికి వ్యతిరేకం అన్నమాట. పఠనమంటే ఆనందం కలిగించేదిగా వుండాలి.’

తన పఠనాన్ని బోర్హెస్‌ ఎంత ఆనందమయం చేసుకున్నాడంటే, స్వర్గం కూడా గ్రంథాలయంలా ఉండింటే బాగుండేదని తలపోశాడు.

అయితే, ముప్పై ఏళ్లవరకూ తనను తాను నిరర్థకమైన జీవిగానే భావించుకున్నాడాయన. గంభీరమైన చరిత్రగల కుటంబంలో అర్జెంటీనాలో జన్మించిన బోర్హెస్‌(1899–1986) తాతలు యుద్ధాల్లో పాల్గొన్నవారు! తనకు రోజూ పొద్దునే గడ్డం గీసుకోవడానికి ఉపకరించే రెమింగ్టన్‌ కంపెనీయే తన తాతయ్య మరణానికి కారణమైన రైఫిళ్లను ఉత్పత్తి చేసిందన్న నిజం ఆయనకు చిత్రమైన గగుర్పాటు కలిగించేదట. సాహసాలతో నిండి సుసంపన్నంగా కనిపించే తన పూర్వీకుల జీవితంతో పోల్చుకుంటే ఆయనకు న్యూనత కలిగేదట. కార్యశూరత లేని ‘ఒక పాఠకుని జీవితం, అప్పుడప్పుడు తీవ్రంగా, ఒక పేద జీవితమని అనిపించే’దట.
 
కాని దాన్నుంచి ఆయన బయటపడగలిగాడు. ‘ఒక పాఠకుని జీవితం కూడా వేరే ఏ జీవితంతోనైనా సమానంగా సమృద్ధమైనదే’ అని మనస్ఫూర్తిగా తెలుసుకున్నాడు. ‘అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటారు. కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటాను. నేను మంచి రచయితను అవునో కాదో నాకు తెలియదుగాని నేను చాలా మంచి పాఠకుణ్ని,’ అని గర్వంగా చాటుకున్నాడు.

తర్వాత ఎన్ని ముద్రణలు వెలువడినప్పటికీ, తను చదివిన ఆ పాత పుస్తకం, దాని అట్ట, అందులోని అక్షరదోషాలు,  గీసుకున్న గీతలున్నదే అసలైన ‘డాన్‌ కిహోటి’గా భావించడం ఆయన వేలాది పఠనానుభవాల్లో ఒకటి!

తన మాతృభాష స్పానిష్‌ సాహిత్యంతో మొదలుకొని, జర్మన్‌ సాహిత్యం (ఎంతో ఉన్నతమైన సాహిత్యాన్ని అందించిన జర్మన్, ఆ సాహిత్యకంటే అందమైన భాషంటాడు!), ఫ్రెంచ్‌ సాహిత్యం (ఎంతో శ్రేష్టమైన సాహిత్యాన్ని అందించిన ఫ్రెంచ్, ఆయనకు వికారంగా తోచిందట!), ఆంగ్ల సాహిత్యం (ఆయన్ని షేక్‌స్పియర్‌ ముగ్ధుణ్ని చేయలేదు; ఆంగ్లాన్ని మాత్రం సొంతభాషలా ప్రేమించాడు.), ఇంకా, చరిత్ర, తత్వశాస్త్రం, గణితం, భూగోళం, మతగ్రంథాలు... ఎంత చదవాలో అంత చదివాడు; తిరిగి, వాటి గురించి ఎంత రాయాలో అంత రాశాడు. ‘కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు, మేజిక్‌ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకు ఆద్యుడు’గా నిలిచాడు. ‘ఫిక్షన్స్‌’ ‘ది అలెఫ్‌’ కథాసంకలనాలు ఆయనకు విశ్వవిఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

ఆయన తండ్రి జార్జ్‌ గిలెర్మో బోర్హెస్‌ ఒక విఫల రచయిత! తండ్రి సాధించలేని చోట, తను కృతకృత్యుడవ్వాలన్న నైతిక ఒత్తిడి కూడా ఆయన్ని రాయడానికి పురిగొల్పింది. తొమ్మిదేళ్లప్పుడే ఆస్కార్‌ వైల్డ్‌ ‘ద హాపీ ప్రిన్స్‌’ను స్పానిష్‌లోకి అనువదించాడు; కానీ అది వాళ్ల నాన్న చేశాడనుకున్నారట. అయితే, తరువాతి రెండు దశాబ్దాలపాటు ఆయన ఎన్నో పుస్తకాలు రాసినప్పటికీ, వాటిలో కొన్ని అచ్చువేసినప్పటికీ వాటన్నింటినీ తన ‘ప్రాక్టీస్‌’గా మాత్రమే పరిగణించాడు. ఆడంబర గుణంలోంచి జనించే ‘మేలిమి రచన’కన్నా, ఏ అవాంతరాలూ లేకుండా సాఫీగా సాగే మంచి రచనే ఉత్తమమైనదిగా పేర్కొన్నాడు. ఎవరైనా తనని విమర్శిస్తూ సమీక్షించినప్పుడు, వాళ్లకన్నా తనే మారుపేరుతో మరింత పదునుగా విమర్శ చేసుకోగలనన్నాడు!

తొమ్మిదేళ్లపాటు బోర్హెస్‌ లైబ్రరీలో పనిచేశాడు. గొప్ప పాఠకుడికి తగిన చోటు! మరోవైపు రచయితగానూ ఆయన పేరు మార్మోగుతోంది. అలాంటి రోజుల్లో ఆయన సహోద్యోగి ఒకరు, ‘జార్జ్‌ లూయీ బోర్హెస్‌’ అనే రచయిత పేరూ, ఇతడి పేరూ ఒకటేకావడం; పైగా ఇద్దరికీ ఒకే పుట్టినరోజు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట! తనపక్కనుండి బుద్దిగా పుస్తకాలు సర్దుతుండే ఈ యువకుడే అంతటి కథకుడని ఆ సహోద్యోగి ఎలా నమ్మగలడు!

55 ఏళ్ల వయసులో బోర్హెస్‌కు చూపు పోయింది. అటు ఎనిమిది లక్షల పుస్తకాల వరాన్నీ ఇచ్చి, ఇటు అంధత్వాన్నీ శాపించిన దేవుణ్ని ఆయన నిందించాడు. అయితే, ఒక కళాకారునికి సంభవించే ప్రతిదీ అతని కళకు కావాల్సిన ముడిసరుకేననీ, తనకు ప్రాప్తించే ప్రతీ వేదననీ మూసలోకి మలిచేందుకు పనికొచ్చే మన్నుగానే భావించాలనీ ఆయన చెప్పినట్టుగానే... క్రూరమైన అంధత్వాన్ని కూడా తన జీవితానికి దక్కిన బహుమతిగానే స్వీకరించాడు. డిక్టేషన్‌ చెబుతూ రచనలు చేశాడు; అడాల్ఫో బోయ్‌ కాసరస్‌ లాంటివారితో జతగానూ రాశాడు; ఎన్నో దేశాల్లో పర్యటించాడు; విశ్వవిద్యాలయాల్లో రచన కళ గురించి ఉపన్యసించాడు; పాఠకుడిగానూ, రచయితగానూ రెండు జీవితాల్నీ సంపూర్ణంగా జీవించి నిష్క్రమించాడు!

(సాక్షి ఫన్‌డే; 24 ఆగస్ట్‌ 2014)