Monday, July 27, 2026

నదిలాంటి మనిషి


రాహుల్‌ సాంకృత్యాయన్‌ 

9 Apr - 1893 - 14 Apr 1963


 

నదిలాంటి మనిషి



అద్భుతం అనే విశేషణానికే గనక రూపమొస్తే, అది ఆరడుగుల రాహుల్‌ సాంకృత్యాయన్‌లా ఉంటుంది. ఎలాంటి మనిషాయన!

యాత్రికుడు, చరిత్రకారుడు, భాషాశాస్త్రవేత్త, అనువాదకుడు, ఆచార్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అపారమైన పాండిత్యం ఉన్నప్పటికీ సరళమైన హిందీలో రాసిన రచయిత!

రాహుల్‌జీ పేరు వినగానే, కాళ్లకు కట్టుకోవడానికి బలపాల్ని వెతికేవాళ్లు ఉంటారు. అంతటి ఉత్తేజకర పాదాచారి ఆయన. యాత్రలు వాటికవే ఇవ్వగలిగే పరమానందాన్ని అనుభవిస్తూనే, వాటిద్వారా పరమార్థాన్ని కూడా ప్రజలకు అందించారు రాహులుడు.

ఒకసారి ఈ దృశ్యం ఊహిద్దాం! పదమూడో శతాబ్దంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలను భక్తియార్‌ ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధ భిక్షువులు పవిత్రమైన గ్రంథాలతో పారిపోయారనీ, ఆ విలువైన సంస్కృత పుస్తకాల్ని టిబెట్‌లోని ఆరామాల్లో భద్రపరిచివుంచారనీ ప్రచారంలో ఉంది. అయితే, ఆరు వందల ఏళ్లుగా వాటిల్లో ఏముందో చూసినవారు లేరు.

సాంకృత్యాయన్‌ వాటికోసం అన్వేషిస్తూ, దారి కూడా సరిగాలేని కొండల్లో నడుస్తూ, కాశ్మీర్, లడఖ్, కార్గిల్‌ మీదుగా టిబెట్‌ వెళ్లారు. అక్కడ పుస్తకాలైతే లభించాయిగానీ అవి సంస్కృతంలో లేవు. అన్నీ భోత్‌ భాషలో ఉన్నాయి. రాహుల్జీ కంచరగాడిదల మీద వాటిని తరలించుకొచ్చారు. మరో మూడుసార్లు టిబెట్‌ వెళ్లారు. టిబెటన్‌ నేర్చుకున్నారు. నేర్చుకోవడమేకాదు దాని వ్యాకరణ పుస్తకాలు రాశారు. టిబెటన్‌–హిందీ నిఘంటువు కూర్చారు. ఆ గ్రంథాలన్నీ పాట్నా మ్యూజియంలో ఉన్నాయిప్పుడు.

‘‘ప్రపంచంలో యాత్రలు చేయడానికి మించిన ముఖ్యమైన విషయం మరోటి లేదు. సమాజం కోసం ఒక యాత్రికుడికంటే శ్రేష్టంగా ఆలోచించగలవారు మరెవరూ ఉండరు,’’ అనేవారు రాహుల్జీ. ఈ ప్రపంచం ఈ రీతిన ఉండటానికి యాత్రికుల వివేకమే కారణమంటారాయన. ‘‘యాత్రలంటూ జరగకపోయివుంటే సోమరి మానవమూకలు పశుస్థాయినుంచి పరిణామం చెందేవే కాదు’’.

ఉత్తరప్రదేశ్‌లోని పల్లెటూరులో కేదార్‌నాథ్‌ పాండేగా జన్మించి, తొమ్మిదేళ్లప్పుడే ప్రపంచం ఏమిటో చూడాలని ఇంట్లోంచి పారిపోయాడు సాంకృత్యాయన్‌. వేలాది కిలోమీటర్లు కాలినడకన చుట్టివచ్చారు. బౌద్ధాన్ని తనలో ఇంకించుకున్నవాడుగా తన పేరును రాహుల్‌ సాంకృత్యాయన్‌గా మార్చుకున్నారు. మూడు బౌద్ధ వేదాలనూ జీర్ణించుకుని త్రిపిటకాచార్య అయ్యారు. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్‌ రష్యా... ఎక్కడ తిరిగితే అక్కడి భాష నేర్చుకున్నారు. అరబిక్, భోజ్‌పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళీస్, తమిళం, ఉర్దూలాంటి ముప్పైకి పైగా భాషలు, అందులోని యాసలు కూడా ఆయనకు తెలుసు. ఎక్కడా అధికారికంగా చదువుకోకపోయినా విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదిగారు. అందుకే ఆయన్ని మహాపండిత్‌ అనేవారు.

చివరికి మార్క్సిజం దగ్గర తన భావాల్ని స్థిరీకరించుకున్న రాహుల్జీ... సోషియాలజీ, మతం, తత్వం, భాష, సైన్సు మీద శతాధిక పుస్తకాలు రాశారు. రుగ్వేద ఆర్యులు, లోకసంచారి, దివోదాసు, విస్మృత యాత్రికుడు, సింహసేనాపతి, జయమౌధేయ, మధురస్వప్నం లాంటివి అందులో కొన్ని. సృష్టాది నుంచీ ఈ ప్రపంచపు నడతను మేఘాల్లో కూర్చుని వీక్షించినట్టుగా ఆయన చరిత్రను రికార్డు చేసిపెట్టారు. లేదంటే ‘ఓల్గా నుంచి గంగకు’ రాయడం ఎలా సాధ్యం!

చరిత్రను అర్థం చేయించడానికి ఆయన పూసిన పంచదార పూత ఒక్కోసారి అది చరిత్రేనా అన్న అనుమానాన్ని కలిగిస్తుంది. కానీ ఎన్ని చరిత్రగ్రంథాలు చదివినా మెదడులో నమోదుకాని దృశ్యమాలిక ఆయన ‘ఓల్గా నుంచి గంగకు’ ద్వారా నమోదవుతుంది. రిఫరెన్సు పుస్తకాలు కూడా కంఠోపాఠంగా ఉంచుకున్న ఈ మహావిజ్ఞాని చివరిరోజుల్లో తన పేరేమిటో తనే చెప్పుకోలేని మతిమరుపులోకి జారిపోవడం సృష్టి వైచిత్రి. కానీ ఆయన్ని మనం మాత్రం మరిచిపోగలమా!

(సాక్షి ఫన్‌డే; 6 ఏప్రిల్‌ 2014)
––––––––––––––––––––––

Friday, July 24, 2026

పండిత్‌ చౌరాసియా


హరిప్రసాద్‌ చౌరాసియా 

 

పండిత్‌

హరిప్రసాద్‌ చౌరాసియా వేణుగానం పలికించడం చూస్తే– ఆ నాదం వాద్యంలోంచి మాత్రమే వచ్చినట్టు ఉండదు; మడిచిన పెదాలలోంచీ, ఆడే చేతివేళ్లలోంచీ మాత్రమే కాదు, ఆయన వెన్నులోంచీ, ఎగిరే జుట్టులోంచీ, మొత్తంగా ఆయన ఒంట్లోంచీ సంగీతం వెలువడినట్టుంటుంది.

‘కృష్ణభగవానుడితో నేరుగా అనుసంధానం కలిగిన వాద్యమిది. ఏ ఆడంబరం లేదు, ఏ తొడుగులు లేవు, ఏ తంత్రులు అక్కర్లేదు. వెదురు ముక్క చాలు. గాలిని నియంత్రించడానికి రంధ్రాలు! దేవుడు మాత్రమే ఇంత సరళమైన వాద్యాన్ని కనిపెట్టగలడు!’ అంటారు చౌరాసియా. ‘పైగా తీసుకెళ్లడం ఎంత సులభం’!

ఒక వస్తాదు కొడుకుగా చౌరాసియా సంగీతంతో రహస్యంగా కుస్తీ పట్టాల్సివచ్చింది. కారణం, వాళ్ల నాన్నకు సంగీతమంటే వేశ్యలకు సంబంధించింది! తనలాగే కొడుకూ వస్తాదు కావాలని ఆయన కోరిక.
 
నాలుగున్నరేళ్లప్పుడే అమ్మపోయింది కాబట్టి, నాన్నను ఒప్పించే మార్గం లేకపోయింది. అందుకే గుడికి వెళ్తున్నానని చెప్పి స్నేహితుడింటికి వెళ్లేవారు. అక్కడ పాడటం సాధన చేసేవారు. పండిత్‌ రాజారామ్‌ ఆయనలో ప్రతిభ ఉందని గుర్తించి, బోధించడం మొదలుపెట్టారు. అప్పటికింకా హరిప్రసాద్‌ చేతుల్లోకి వేణువు రాలేదు.

‘పదిహేనేళ్ల వయసులో అలహాబాద్‌ రేడియోలో తొలిసారి వేణుగానం విన్నాను. స్వర్గానికి రవాణా అయినట్టుగా అనుభూతి చెందాను. అది నా జీవితంలో కీలకమలుపు,’ అంటారు చౌరాసియా. అంతే! అంత గొప్పగాలేని తన గాత్రానికి స్వస్తిచెప్పారు. ఆ వేణువూదిన పండిత్‌ భోలానాథ్‌ను వెతుక్కుంటూ వెళ్లి, గుమ్మంలో వాలిపోయారు. కూరగాయలు కోయడం, మసాలాలు నూరడానికైనా ఈ పిల్లాడు పనికొస్తాడని ఒప్పుకున్నారాయన. కానీ అదే భోలానాథ్‌ అచ్చెరువొందేలా, వేణువుకు సరికొత్త ఊపిరిలూదారు చౌరాసియా.

వేణువు అర్హతగా ఒరిస్సా రేడియోలో ఉద్యోగం వచ్చినరోజున చౌరాసియా నాన్న ఆశ్చర్యపోయారు, దాచివుంచిన సంగతి గురించి! కానీ ఒప్పుకోక తప్పలేదు. అదే ఒరిస్సా రేడియో ఆయన్ని ‘బొంబాయి’ చేర్చింది. మదన్‌మోహన్, రోషన్‌ లాంటి సంగీతదర్శకులు ఆయన వేణుగానానికి సమ్మోహితులై సినిమాల్లోకి ఆహ్వానించారు. ఎస్‌ డి బర్మన్, ఆర్‌ డి బర్మన్‌తోనూ పనిచేశారు(తర్వాతి కాలంలో ‘సిరివెన్నెల’కు తన వేణువుతో  ప్రాణం పోశారు). ‘బాలీవుడ్‌ అవకాశాలు నన్ను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. భవంతి సమకూరింది, కారు ముంగిట ఆగింది, భౌతిక అవసరాలు తీరాయి; కానీ ఒక అసంతృప్తి మొదలైంది. నేను కళాకారుడిగా ఎదగడం లేదు. నాకు ఇంకేదో కావాలి, నా ఆత్మ సుఖించడం లేదు,’ అని అప్పటి మథనం గురించి చెబుతారాయన.

దాంతో ‘సుర్‌బహార్‌’ విద్వాంసురాలు అన్నపూర్ణాదేవిని కలిశారు. అప్పటికే పండిత్‌ రవిశంకర్‌నుంచి విడిగా ఉంటున్నారామె. బహిరంగ ప్రదర్శనలు మానేశారు. ఆమె చౌరాసియాను ముందు శిష్యుడిగా అంగీకరించలేదు. బయటికి తోసినంత పనిచేశారు. కానీ మూడేళ్లుగా చూపిస్తున్న ఆయన తపనకు తలొగ్గక తప్పలేదు. ‘నేను పట్టుదలతో ఉన్నానని తెలియజేయడానికి నా చేతుల్ని మార్చుకున్నాను. అంతకుముందు కుడిచేత్తో వాయించేవాడిని. ఎడమచేతికి మారిపోయాను. వెనక్కి చూడకుండా వెనక్కి తిరిగి నడవడం లాంటిదది. హింస! కానీ సంతోషం! ఆమె నాకు గురువు మాత్రమే కాదు, దేవతకన్నా ఎక్కువ. నా ఆకలి, ఆరోగ్యం పట్టించుకున్నారు. నా సంగీతానికి పరమార్థం కల్పించారు,’ అని తబ్బిబ్బవుతారు చౌరాసియా.

‘ఒక్కో క్షణం అద్భుతంగా ఉంటుంది. ఆ క్షణంలో సంగీతం ప్రవహిస్తుంది. ఒక నీటిచుక్క నువ్వు దాహంగా ఉన్నప్పుడు ఆర్తి తీర్చుతుంది. అదే బిందువు నీటియంత్రంలోంచి పైకి ఎగిరినప్పుడు దాని అందంతో మురిపిస్తుంది. మళ్లీ అదే చుక్క మురికినీరులో కలిసి అసహ్యం పుట్టిస్తుంది. అదే నీటిబిందువు నదిలో కలిసి ఈదే ఉత్సాహం కలిగిస్తుంది. అదే చుక్క సముద్రంలో కలిసినప్పుడు తన శక్తితో ఆశ్చర్యగొలుపుతుంది. ఇదంతా కూడా సంగీతంతో పలికించొచ్చు’.
 
‘వేణుగానం చేయడమంటే శ్వాసను నియంత్రించడం. ఇంకోమాటలో యోగా చేయడం. ఒక పవిత్రమైన బాధ్యతతో, ఆధ్యాత్మిక మానసిక స్థితితో ఒక ధ్యానంలాగా యోగంలాగా నేను పాడతాను. అసలు నేను శ్రోతలకోసమే పాడతాను. కానీ అందులో ఎన్నో రకాలవాళ్లుంటారు. వారందరినీ తృప్తి పరచడం సాధ్యం కాదు. వాళ్ల మధ్యలో ఒక గొప్ప శక్తి ఏదో కనబడుతుంది. అది మాధవుడే కావొచ్చు. ఆ శక్తికోసం నేను వేణువు పలుకుతాను. నాలోనేను దైవాన్ని అనుభవిస్తాను,’ అంటారు తన వేణుగానం గురించి.

‘సంగీతమే నా ప్రార్థన. సంగీతమే నా మతం’ అనే చౌరాసియాకు ఎక్కడా రికార్డుగా లేని కృష్ణుడి గానం వినలేదన్న చింత ఉందట! కానీ మనకా బాధ లేదు.

(సాక్షి ఫన్‌డే; 29 జూన్‌ 2014)
––––––––––––––––––––––

Tuesday, July 21, 2026

అగ్నిధార దాశరథి


దాశరథి కృష్ణమాచార్య
22 July 1925 - 5 Nov 1987
 

అగ్నిధార

జూలై 22న కవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి
---------------------------------------------------------------

‘‘నువ్వు ఎటు వెళుతున్నావ్‌?’’ అనడానికి ‘‘త్వకుంత్ర గచ్ఛసి’’ అనాలనేంతటి పట్టుదలవున్న ఇంట్లో జన్మించాడు దాశరథి. కానైతే ఆయనకు అంతటి సంస్కృత ‘ఛాందసం’ నచ్చేదికాదు. అలాగే, నిజాం కాలంలో ‘తెలుగు మీద దండయాత్ర’ జరుగుతున్న కాలంలో చదువుకున్నాడు. ఆయన అదీ సహించేవాడు కాదు. బహుశా, ఈ కారణాలవల్లేనేమో ఆయనలో రెండు పరస్పర విరుద్ధాంశాలు అద్భుతంగా సంలీనం చెందిన తీరు కనిపిస్తుంది. ‘సంప్రదాయం’లో బతుకుతూనే విప్లవమార్గాన్ని అనుసరించాడు; ‘పాత బూజు’గా ఎద్దేవా అవుతున్న పద్యాల్లోనే అభ్యుదయాన్ని కలగన్నాడు.

దాశరథి లాంటివాళ్లకు, లేదా ఆ కోవకు చెందిన రచయితలకు సాహిత్యం కేవలం సాహిత్యం కాదు; అది ఒక సామాజిక బాధ్యత. నిర్బంధం, చిత్రహింసలకు వ్యతిరేకంగా జాతిని జాగృతం చేయాల్సిన పవిత్ర కర్తవ్యం. అందువల్లే, ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’, ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘తిమిరంతో సమరం’ లాంటి కావ్యాలు వెలువరించాడు. ‘అగ్నిధార అనేపేరును కొందరు ఆక్షేపించారు. అగ్ని ధారలా ప్రవహిస్తుందా? అన్నారు కొందరు. విద్యుత్తు అగ్ని కాదా? అది ప్రవహించదా? సముద్రంలోని బడబ, అగ్ని కాదా? అది నీటిలో అన్నివైపులా సాగిపోదా?’ అన్నాడు దాశరథి. అగ్నిని చైతన్యానికి సంకేతంగా, ఆ చైతన్యం ఒక మానవహృదయంలోనుండి ఇంకొకనిలోకి ప్రవహించి, జాతినంతటినీ ఏకసూత్రాన కట్టిపడేసేదిగా ఆయన తలచాడు.

‘నా గమ్యం ప్రపంచశాంతి. నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం’ అని ప్రకటించుకున్న దాశరథి జీవితాన్నే పోరాటంగా మలుచుకున్నాడు. ‘తిమిరంతో ఘనసమరం, జరిపిన బ్రతుకే అమరం’ అన్నాడు. ‘ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగల్చి కాల్చి, నాలో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు’ అని ప్రకటించాడు. కార్యాచరణ కూడా కవి కర్తవ్యంగా భావించినవాడు కాబట్టి, కటకటాల పాలయ్యాడు.

1948లో ఆయన్ని వరంగల్లు జైలునుంచి నిజామాబాద్‌ జైలుకు మార్చినప్పుడు మొదట వట్టికోట ఆళ్వారుస్వామి కనిపించి సంబరపడ్డాడట. వట్టికోట కోసం దాశరథి జైలుగోడమీద బొగ్గుతో ఈ పద్యం రాశాడు: ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్నబోలిన రాజు మాకెన్నడేని;/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ, కోటిరత్నాల వీణ.’

గాఢమైన యౌవనప్రాయంలో ఆయన జైలుగోడల్లో బందీ అయ్యాడు. కానీ ఆయన మధురస్వప్నాల్ని ఎవరు బంధించగలరు? ‘అంగారం, శృంగారం నీ రచనలో కలగలిసి ఉంటాయి,’ అనేవారు ఆయన్ని చనువున్న మిత్రులు. సైనికుడు యుద్ధంలో పోరాడుతూకూడా అప్పుడప్పుడూ తన ప్రియురాలి అందమైన కళ్లను తలచుకోవడం అస్వాభావికమా? అని ప్రశ్నిస్తాడు దాశరథి. అందుకేనేమో, ఆ భయానక ఒంటరి క్షణాల్లో వాళ్ల ఊరి నదికి మంచినీళ్లు తీసుకుపోవడానికి వచ్చే పచ్చని అమ్మాయి తలపుల్లో మెదులుతుండేదట! ఆకాశంలోకి తలెత్తి చూస్తే, మేఘాలు అందమైన అమ్మాయిల ఆకారాలు ధరించి, పొంగిన వక్షస్థలాలతో కవ్వించేవట! మరోపక్కేమో జైలు బ్యారకు, నగ్న ఖడ్గం ధరించిన తుపాకీ భటుడు కనిపించేవాడు. వాణ్ని నరికేసి, లేదా వానిచే నరకబడి, ఆకాశంలోని మేఘభూమి వైపు సాగిపోవాలనిపించేదట! ఏ శషభిషలు లేకుండా, ‘పాపులర్‌’ మూడ్‌ను పట్టించుకోకుండా రాయడం దాశరథి నిజాయితీ!

‘నేను పోతన కవీశానుగంటములోని ఒడుపుల కొన్నింటిని బడసినాను’ అని తన అభిమానాన్ని వెల్లడించిన దాశరథి... ‘మంచి కవిత్వం ఏ భాషలో వుంటే అది నా భాష/ మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు’ అని తన రసహృదయాన్ని చాటుకున్నాడు. గాలిబ్‌ను అందువల్లే ఆయన పలవరించివుండొచ్చు. దాశరథిని తలుచుకోవడానికి నిజానికి గాలిబ్‌ గీతాల అనువాదం ఒక్కటి చాలు. ‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము/ నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము’. ‘దేవి! మన పూర్వబంధమ్ము త్రెంచబోకు/ ప్రేమలేకున్న నుండనీ ద్వేషమేని’. ‘మనిషి ఏకాకియౌనను మనసులోన/ గుంపులుగ భావములు జేరి గోష్ఠి జరుపు’.

ఇక... ‘ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’, ‘నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా’, ‘ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా’... సినిమా పాట స్థాయిని దిగజార్చకుండా పాటలు రాసిన అతికొద్దిమందిలో దాశరథీ ఒకరు.

ఆయన ‘ఆంధ్రప్రదేశ్‌ తొలి ఆస్థానకవి’గా నియమితుడయ్యాడు. ‘యాత్రాస్మృతి’ పేరిట చక్కటి వచనం రాశాడు. ఆయన్ని ఎరిగినవారు స్నేహశీలి, మృదుస్వభావి, నిరాడంబరుడు అని చెబుతారు. వేటూరి అన్నట్టు, ‘అతను బుడుగైనా ఆర్తి పొడుగు. మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది’!

(సాక్షి ఫన్‌డే; 20 జూలై 2014)

Saturday, July 18, 2026

Watching Iranian films helped me...

Watching Iranian films helped me to picture the sections set in Tehran, and I always like to cook any food that’s mentioned in the books I’m translating; listen to the music; do anything I can to get a feel for a place; though no, I’ve never been to Iran.


(Ruth Martin on Translating The Nights are Quiet in Tehran by Shida Bazyar; Outlook, June 8, 2026)

Wednesday, July 15, 2026

దిమ్మరి చార్లీ


చార్లీ చాప్లిన్‌
16 Apr 1889 - 25 Dec 1977


దిమ్మరి చార్లీ!


పుడుతూనే నడకతోపాటుగా నటన నేర్చుకున్నవాడు... చార్లీ చాప్లిన్‌! వేదిక మీద ఆగిపోయిన తల్లి పాటను అందుకుని గొంతెత్తి పాడితే, దానికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందిస్తుంటే, తనుమాత్రం మీదకు విసిరిన చిల్లరడబ్బుల్ని ఏరుకోవడంలో మునిగిపోయాడు. చప్పట్లు ఆకలి తీర్చుతాయా! ఆకలికి మాడినవాడు కాబట్టే, ‘బూట్లను ఉడికించి, తినాల్సివచ్చిన’ సన్నివేశాన్ని(గోల్డ్‌ రష్‌) సృజించగలిగాడు.

తాగుబోతు తండ్రి, మతిస్థిమితం తప్పిన తల్లి, అనాథశ్రమాల్లో గడపాల్సిన పరిస్థితి, రెండేళ్లు మాత్రమే చదివిన చదువు... ఖరీదైనదిగానే తప్ప మరోలా మన ఊహకు అందని లండన్‌ నగరంలోని అతిపేదరికాన్ని చిరు చాప్లిన్‌ అనుభవించాడు. అందుకేనేమో, ‘‘నేనెప్పుడూ వాననీటిలో నడవడానికి ఇష్టపడతాను, నా కన్నీళ్లు ఎవరికీ కనబడకుండా’’ అన్నాడు.

పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడకముందు చాప్లిన్‌ చాలాపనులు చేశాడు. స్టేషనరీ స్టోరులో, డాక్టర్‌ ఆఫీసులో, గ్లాసు ఫ్యాక్టరీలో, షాండ్లియర్‌ షాపులో, ప్రింటింగ్‌ ప్లాంటులో. అయినా అదంతా జీవితం ఇవ్వగలిగే అనుభవంగానే లెక్కించాడు. అసలంటూ బతక్కపోవడంకంటే అది మేలే కదా!
 
‘‘జీవితంలో ట్రాజెడీ ఒక భాగం. కానీ దాన్ని ఎదుర్కోవడానికి పుట్టిందే కామెడీ’’ అన్నాడు చాప్లిన్‌. కానీ ఆ కామెడీ ఎలా ఉండాలి? ‘‘నా బాధ ఒకరి నవ్వుకు కారణమైతే కావొచ్చుగాక, కానీ నా నవ్వుకు మాత్రం మరొకరి బాధ కారణం కారాదు’’. ‘‘ఒక వృద్ధుడు అరటితొక్క మీద కాలువేసి జారి పడితే– దానికి మనం నవ్వం. అదే కొంచెం అతిశయంతో నడుస్తున్న వ్యక్తి పడితే మాత్రం నవ్వుతాం’’. ఇదీ చాప్లిన్‌ హాస్యం! ప్రపంచంలో ఇంతమందికి బుగ్గల్లో సొట్టలు పడేలా చేసిన నటుడు మరొకరు లేరు.

కానీ ఆయన సినిమా అంటే హాస్యమొక్కటేనా? నలుపు తెలుపు చిత్రాల్లోనే జీవితంలోని అన్ని రంగుల్నీ చూపించాడు; నిశ్శబ్ద సినిమాల్లోనే జీవితపు అన్ని పార్శా్వల్నీ వ్యాఖ్యానించాడు.  పార్కు, ఓ అమ్మాయి, ఒక పోలీసు ఉంటే చాలు, సినిమా తీసేస్తాననేవాడు చాప్లిన్‌. మిగతా నటులందరికీ భిన్నంగా అందమైన ముఖాన్ని మేకప్‌ చాటున దాచిన ఏకైక నటుడు చాప్లిన్‌. బ్యాగీప్యాంటు, టైటుకోటు, పెద్ద తల, చిన్న టోపీ, వెలిసిపోయిన బట్టలు, అయినా హుందాతనాన్ని కాపాడుకునే యత్నంగా చేతికర్ర, చేసేది కామెడీయే అయినా సీరియస్‌నెస్‌ తేవడానికి చిన్నమీసాలు, పెద్దబూట్లు, పెంగ్విన్‌ లాంటి నడక... ఆయన నిజంగా దిమ్మరిగా గడిపినప్పుడు ఆదరణ లేదు; కానీ దిమ్మరి వేషానికి (ట్రాంప్‌) మాత్రం జేబుల్నిండా డబ్బులు కుక్కింది హాలీవుడ్‌. ద కిడ్, ద గోల్డ్‌ రష్, ద సర్కస్, సిటీ లైట్స్, మోడర్న్‌ టైమ్స్, ద గ్రేట్‌ డిక్టేటర్‌(టాకీ), లైమ్‌లైట్‌(టాకీ)... ఆయన సినిమాల్లోని సన్నివేశాల్లోంచీ, ఆయన కూర్చిన సంగీతంలోంచీ ఎన్నో సినిమాల్లో ఏదో ఒక రిఫరెన్సు లేకుండా ఉండదు! చాప్లిన్‌ లాంటివాళ్లకు తప్ప, కాలాతీతం అనేది ఊరికే వాడగలిగే మాటకాదు.

అయినా ఒరిజినాలిటీ అనేదాన్ని చాప్లిన్‌ అంగీకరించలేదు. ‘‘జీవితం మొత్తం స్టీరియోటైపే. మనం ఏ ఒరిజినాలిటీతోనూ నిద్ర లేవం. మనందరమూ మూడు పూటల భోజనం, ప్రేమలో పడి లేవడమనే సాధారణ వ్యవహారాలతోనే పుట్టి చచ్చిపోతాం. కాకపోతే దాన్ని మలచడంలోనే ఆసక్తి పుట్టించగలగాలి’’ అనేవాడు.

తొలుత ఆదరణ చూపిన అమెరికా చివరిదశలో వామపక్ష ముద్రతో తనను ఎంత వేధించినా, మనుషుల మీద ఆయన పూర్తి నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చినా, ‘‘అద్దం నా మంచి స్నేహితుడు; నేను ఏడ్చినప్పుడు అది నవ్వదు’’ అనేంతగా ఒంటరితనాన్ని అనుభవించినా, ‘‘జనం నిన్ను ఏకాంతంగా వదిలేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది’’ అనేంత పరాయితనాన్ని అనుభవించినా, ఆయన అందరికీ నవ్వునీ, ప్రేమనూ పంచాడు; ‘‘చిట్టచివరికి జీవితం ఒక ప్రాక్టికల్‌ జోక్‌’’ అని తేలిగ్గా తీసుకున్నాడు.

(సాక్షి ఫన్‌డే; ఏప్రిల్‌ 13, 2014)