Wednesday, August 19, 2026

You’re in a terrible situation either way.



Yan Lianke

 

INTERVIEWER

You talk about the lure of the city, but don’t The Explosion Chronicles and The Family Plot suggest that, as rural villages expand and become wealthier, their inhabitants tend to lose their moral compasses?

YAN LIANKE

I’ve written about all the problems wealth brings, but also about the difficulties of being poor. Humankind lives in an eternal dilemma. You’re in a terrible situation either way.


INTERVIEWER

Could we say that your real subject is power, then? People are powerless when they’re poor, and after gaining power, they use it to oppress others.

YAN

Gaining the power to control others is a terrifying business. I’m currently writing a novel that includes all the revolutionaries who emerged after the Qing dynasty⁠—Sun Yat-Sen, Chiang Kai-Shek, Mao Zedong, Zhou Enlai, Deng Xiaoping, and so on, along with fictional characters from other people’s work, as well as Lu Xun, Hu Shih, and virtually every other Modernist writer. And the writers who killed themselves during the Cultural Revolution, like Lao She and Fu Lei. Obviously, the novel is unpublishable, but I’m strongly drawn to writing it. If only there were no such heroes and we could all calmly live our lives. In any case, I won’t discuss the plot in this interview. Let’s just say that I’m writing a book that I plan never to publish. I’ll leave it to my son, and maybe he’ll pass it on to his children. Maybe, far in the future, people will read it and know that their ancestors once thought and wrote in this way.


(The Paris Review: Yan Lianke, The Art of Fiction  No. 269)

Saturday, August 15, 2026

‘దేశభక్తుల్లో రాజకుమారుడు’


సుభాష్‌చంద్రబోస్‌



‘దేశభక్తుల్లో రాజకుమారుడు’


‘‘భారతదేశ విముక్తి కోసం, 38 కోట్ల నా సాటి భారతీయుల విముక్తి కోసం, దేవుడి పేరుమీద నేను ఈ పవిత్ర ప్రతిన బూనుతున్నాను. సుభాష్‌ చంద్రబోస్‌ అనబడే నేను, నా చివరి శ్వాస వరకూ స్వతంత్రం కోసం పవిత్రయుద్ధం చేస్తాను.’’
బ్రిటిష్‌వారితో పోరాటానికి దిగడానికి, తన 30,000 బలగంతో కూడిన ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ను అధికారికంగా ప్రకటిస్తూ నేతాజీ తనను తాను అంకితం చేసుకున్న తీరు ఇది. ప్రాణాలు అర్పిస్తానని మాటవరసకు చేసిన ఉత్తుత్తి ప్రతిజ్ఞ కాదది. ఉపనిషత్తుల్లో చెప్పిన త్యాగగుణాన్ని నేతాజీ తన రక్తంలో ఇంకించుకున్నాడు. అందుకే ప్రాపంచిక విలాసాలను సమకూర్చగలిగే సివిల్‌ సర్వీసు ఉద్యోగాన్ని ఒక మహోన్నత లక్ష్యం కోసం అట్టే వదిలేయగలిగాడు. 11 సార్లు జైలుకు పోయివచ్చాడు. అంతిమగమ్యం చేరేలోగా మధ్యమార్గంలో ప్రాణం పోయినా ఫర్వాలేదన్నది తనకు తాను ఇచ్చుకున్న తర్ఫీదు.

బేసిగ్గా నేతాజీ కార్యవాది. ఉడుకు నెత్తురు. అందుకే, నూరేళ్ల చరిత్ర ఉన్న ప్రెసిడెన్సీ కాలేజీలో... ‘‘చూడు, అధికులదే ఎప్పుడూ అధికారం. ఇండియన్స్‌ కన్నా బ్రిటిషర్లు మోరల్లీ సుపీరియర్స్‌. ఇది వాస్తవం. దీన్ని అంగీకరించకుండా ఎన్నాళ్లని నినాదాలిస్తారు?’’ అని ‘పేలిన’ ప్రొఫెసర్‌ ఆటెన్‌ మీద ‘చేయిచేసుకున్న’ బీఏ ఫస్టియర్‌ విద్యార్థుల్లో మొదటగా సుభాషుడి పేరే వినిపించింది.

గాంధీజీ ప్రవచించే అహింసా సిద్ధాంతం మీద నేతాజీకి విముఖతకన్నా తనదైన ఒక స్పష్టత ఉంది. తొలిఅడుగు కూడా అహింసతో పడాలనేది మహాత్ముడి ఆలోచన. బ్రిటిష్‌వాడి మెడలు వంచేదాకా దాని అవసరం లేదన్నది సుభాషుడి ప్రతిపాదన. ఆ విభేదం వల్లే, ఆయన ఆల్‌ ఇండియా నేషనల్‌ కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చాడు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ స్థాపించాడు. స్వాతంత్య్రం అనేది బ్రిటిష్‌ వారు తాంబూలంలో పెట్టి సమర్పించే కానుక కాదన్నాడు. దశలవారీ స్వాతంత్య్రాన్ని నిరాకరించాడు. ‘పూర్ణ స్వరాజ్‌’ మాత్రమే అంగీకారమన్నాడు. ‘నాకు రక్తాన్ని ఇవ్వండి; నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అని పలికాడు.

యుద్ధక్షేత్రంలో వ్యూహాలు పన్నడమే కాదు, స్వాతంత్య్రం సిద్ధించాక ఆచరించాల్సిన కార్యాచరణ నిమిత్తం ప్రణాళికలు కూడా లిఖించాడు.

భూస్వామ్య వ్యవస్థ ఉండకూడదు. కులాంతర వివాహాలు జరగాలి. గాంధీ అయిష్టత కనబరిచినా నెహ్రూ సంపూర్ణ మద్దతునిచ్చే భారీ పరిశ్రమల స్థాపన జరగాలి. దేశాన్ని కాపాడుకోగలిగే ఆయుధ సంపత్తి మనమే తయారుచేసుకోవాలి. ఉద్యోగి జీవితం యజమాని దయమీద ఆధారపడి ఉండకూడదు. కార్మికులను యధేచ్చగా వీధుల్లోకి తోసేసి ఆకలికి మాడ్చడం కుదరని పని. అందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దేశంలో అసమానతలు తొలగిపోవాలంటే, రష్యా, టర్కీల్లోలాగా ‘సోషలిస్ట్‌ అథారిటేరియనిజం’ ఉండాలి. అలాగని, ప్రభుత్వం యజమాని, ప్రజలు బానిసలు కావడానికి వ్యతిరేకం.

భగవద్గీతను గాఢంగా అభిమానించినప్పటికీ మతం అనేది నేతాజీకి వ్యక్తిగత వ్యవహారమే. దానికి రాజ్యంతో సంబంధం లేదు. దేశమాత సంకెళ్లను తెంచడానికి పనికొచ్చే ప్రతివ్యక్తీ ఆయనకు ఆత్మీయుడే. వాళ్లు మసీదులో ప్రార్థిస్తారని తప్ప ఇంకేవిధంగానూ ముస్లింలు భిన్నమని నాకెన్నడూ తోచలేదన్నాడు. అందుకే ఆయన సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి. తుపాకీ కాల్చడానికి కూడా వెనుకంజ వేయకూడదనేవాడు. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్‌’ను ఏర్పాటుచేసి యువతులనూ సైన్యంలో భర్తీ చేసుకున్నాడు. అమెరికా, ఇటలీ, చెకొస్లొవేకియా, ఐర్లాండ్‌ దేశాల స్వాతంత్య్ర పోరాటాల తీరును పరిశీలించాడు. ఎన్ని విమర్శలు వచ్చినా జర్మనీ, జపాన్, ఇటలీ దేశాల సాయం కోరాడు. ముల్లును తీయడానికి మరో ముల్లును ఆయుధంగా చేసుకోవాలనుకున్నాడు. స్వాతంత్య్రం లభించాక, ఢిల్లీ గద్దె మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాక, అప్పుడు, ‘గురుదేవా! ఇప్పుడిక దేశానికి నీ అహింసే కావాలి’ అని ఎలుగెత్తి చాటాలనుకున్నాడు. పవిత్ర గంగాజలంతో హింసను శుభ్రపరచాలనుకున్నాడు.
కానీ, ఆకాశమంతటి నాయకుణ్ని ఆ ఆకాశం విమానం సహా మాయం చేసింది. కాయం దొరక్కపోయినా ఆ తేజం అంతటా వ్యాపించింది. అది ఎవరినైనా కదిలించింది. గాంధీజీ ఆయన్ని ఇలా కొనియాడారు: ‘దేశభక్తుల్లో రాజకుమారుడు.’

(సాక్షి ఫన్‌డే; 19 జనవరి 2014)
––––––––––––––––––––––

Thursday, August 13, 2026

హిచ్‌ షాక్‌


ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌
13 Aug 1899 - 29 Apr 1980

 హిచ్‌ షాక్‌

ఆగస్టు 13న మేటి దర్శకుడు ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ జయంతి
------------------------------------------------------------------------

కోడిగుడ్లను చూస్తే, హిచ్‌కాక్‌కు భయమేస్తుందట. భయం అటుండనీ, అవి తిరగబడతాయనిపిస్తుందట! ఏ రంధ్రాలూ లేని ఆ గుండ్రటి తెల్లటి ఆకారం... దాన్ని పగలగొట్టుకుని బయటకువచ్చే పసుప్చచ్చటి సొన... రక్తం కూడా ఉత్సాహం కొలిపేదిగా కనబడుతుందటగానీ, ఈ పసుపురంగు సొన మాత్రం... అమ్మో! అందుకే కోడిగుడ్డును ఆయన ఎప్పుడూ రుచి చూడలేదట!

కోడిగుడ్లే కాదు, పోలీసులన్నా ఆయనకు భయమే! ‘నేను పోలీసులకు వ్యతిరేకం కాదు; వాళ్లంటే భయపడతానంతే!’ అంటాడు. కారు నడుపుతూ వెళ్తుంటే ఎక్కడ ‘చలానా’ రాస్తారేమోనని కూడా ఆందోళన చెందుతాడు.

దీనికి చిన్న నేపథ్యం ఉంది. ఐదేళ్లప్పుడు హిచ్‌కాక్‌ బాగా అల్లరిచేస్తే, వాళ్ల నాన్న ఒక నోటు రాసిచ్చి, పోలీసు చీఫు దగ్గరికి పంపాడు. దానిప్రకారం ఐదు నిమిషాలపాటు పిల్లాణ్ని సెల్‌లో పెట్టి, తాళం వేసి, మళ్లీ వదిలేశాడా అధికారి. వదిలేసేముందు, ‘తుంటరి పిల్లలను ఏం చేస్తామో చూశావు కదా’ అని హెచ్చరించడం మరిచిపోలేదు.
మూలాల్ని కనుక్కుంటే సమస్య తొలగిపోతుందంటారుగానీ, తనవరకు పోలీసుల భయం అలాగే పేరుకుపోయిందంటాడు.

అందుకేనేమో, ఆయన సినిమాల్లో హీరోను అటు నేరస్థులూ ఇటు పోలీసులూ కూడా తరుముతుంటారు. అయితే దానికి హిచ్‌కాక్‌ ఇంకోలా జవాబిస్తాడు: ‘క్రిమినల్స్‌ తరుముతుంటే హీరో పోలీసుల దగ్గరికి వెళ్లొచ్చుకదా అనుకుంటారు ప్రేక్షకులు. పోలీసులు కూడా అతడికోసం వెతుకుతుంటే ఇక ఆ అవకాశం లేదుగా!’

మూకీల నుంచి సినిమారంగంలో ఉన్న ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌(1899–1980) కెరీర్‌ సుదీర్ఘమైనది. హింస, భయం, శృంగారం, నేరం, సస్పెన్స్‌ నేపథ్యంగా ఆయన తీసినవి ప్రత్యేక విశేషణంతో ‘హిచ్‌కాకియన్‌ మూవీస్‌’ అయ్యాయి. వెర్టిగో, సైకో, నార్త్‌ బై నార్త్‌వెస్ట్, రేర్‌ విండో, ద బర్డ్స్, నొటోరియస్, రెబెకా, డయల్‌ ఎం ఫర్‌ మర్డర్, ద ట్రబుల్‌ విత్‌ హ్యారీ, ఐ కన్ఫెస్, రోప్, షాడో ఆఫ్‌ ఎ డౌట్, స్ట్రేంజర్స్‌ ఆన్‌ ఎ ట్రెయిన్‌... కాలంతోపాటు ఆయన సినిమాలు ‘ఎదుగుతున్నాయి’. ‘విమర్శకులు ఎప్పుడూ నా సినిమాల్ని మొదటిసారి ఇష్టపడలేదు. సైకో విడుదలైనప్పడు ఒక లండన్‌ విమర్శకుడు అది నా కెరీర్‌ మీద మచ్చలాంటిది అన్నాడు. అదే సినిమాను ఏడాది తర్వాత క్లాసిక్‌ అన్నారు’ అని పేర్కొన్నాడు.

‘ఎవరిని వారు కాపీ కొట్టుకోవడమే శైలి’ అని జోకులేసే హిచ్‌కాక్‌– ఎన్నో అధునాతన మెళకువల్ని సినీరంగానికి నేర్పాడు. ఆయన ఇచ్చినన్ని ఇంటర్వ్యూలు ఎవరూ ఇవ్వలేదు. మరో సుప్రసిద్ధ దర్శకుడు ఫ్రాంకోయిస్‌ ట్రుప్ఫాట్‌ ఆయన్ని చేసిన ‘50’ గంటల ఇంటర్వ్యూ సుప్రసిద్ధం.

హిచ్‌కాక్‌ పనితీరు చాలా పద్ధతిగా ఉండేది. సెట్లో కెమెరాలోంచి చూడ్డానికి ఇష్టపడడు. తనకు కావాల్సిందేమిటో కెమెరామన్‌కు బాగా తెలుసంటాడు. అవసరమైతే ‘దీర్ఘచతురస్రం’ గీసిస్తాడు. షాట్‌ కంపోజిషన్‌ అంటే పూరించాల్సిన దీర్ఘచతురస్రమే కదా!

నిజానికి ఆయనకు కథ రాసుకున్నప్పుడే మానసికంగా సినిమా పూర్తయిపోతుంది! వారాలకు వారాలు స్క్రిప్టు మీద కూర్చుని, షాట్స్‌ కూడా విభజించి, అవసరమైన చోట బొమ్మలేసి... కాగితం మీదే మొత్తం పూర్తయిపోతుంది! కాకపోతే, ఇంగ్లండ్‌ నుంచి అమెరికా వచ్చాక, తన పాతపద్ధతికి కొంత సడలింపు ఇచ్చానంటాడు. ‘అంత డీటైల్డ్‌గా అమెరికన్‌ రచయితలు వర్కు చేయరు’.

అలాగే, నటీనటుల కళ్లే కథ చెప్పాలని ఆయన భావిస్తాడు. ‘సంభాషణలు కూడా శబ్దాల్లో కలిసిపోయే ఇంకోరకం శబ్దాలు మాత్రమే. కాకపోతే అవి మనుషుల నోట్లోంచి వస్తాయి.’ అలాగని, ఎక్కువ వ్యక్తీకరణల్ని కూడా ఆయన ఇష్టపడడు. ఎన్నో భావాలు ముఖంలో పలికితే– ప్రేక్షకుడు దేన్నని పట్టుకోవాలి? కాగితం మీద ఎక్కువ అక్షరాలుంటే దేన్నని చదువుతాం? తెల్లజాగా ఉంటే చదవడానికి హాయిగా ఉంటుంది. రాతలో పదాల్ని మితంగా వాడినట్టే, నటనలోనూ వ్యక్తీకరణ మితంగా ఉండాలంటాడు. దర్శకుడు కాకపోయివుంటే హిచ్‌కాక్‌ మంచి సంపాదకుడు అయ్యుండేవాడేమో! కాకపోతే, ఆయనమాత్రం క్రిమినల్‌ లాయర్‌కు ఓటేస్తాడు. ‘విలన్‌ పూర్తి చెడ్డవాడు కాదు; హీరో పూర్తి మంచివాడు కాదు’ అని విశ్వసిస్తాడు కాబట్టి.

ఇన్ని చెబుతాడు కాబట్టి, హిచ్‌కాక్‌కు ఎలాంటి నేరబుర్ర ఉంది? ఎప్పుడైనా హత్య చేశాడా? అండీ వార్‌హోల్‌ ఈ ప్రశ్నలు అడిగాడు కూడా. ‘నా ఉద్వేగాలేవీ నా పాత్రలు ప్రకటించవు. నేను వాటితో ఐడెంటిఫై కాను’ అని చెబుతాడు హిచ్‌కాక్‌. ‘వస్తువు కన్నా నాకు శైలి ప్రధానం. అది మాత్రమే ఒకరిని కళాకారుణ్ని చేస్తుంది. ఒక చిత్రకారుడు చిత్రించాలి కాబట్టి పళ్లబుట్టను వేసినట్టుగా– నాకు కథ అనేది కేవలం సినిమాను మలుచుకోవడానికి ఒక అంశం’ అంటాడు. ఆ లెక్కన ఆయన నిజమైన కళాకారుడు.

(సాక్షి ఫన్‌డే; 10 ఆగస్ట్‌ 2014)
––––––––––––––––––––––

Monday, August 10, 2026

చాసో ‘వాయులీనం’

 


చాగంటి సోమయాజులు

చాసోగా సుప్రసిద్ధులైన కథకులు, కవి చాగంటి సోమయాజులు(1915–1994) ‘వాయులీనం’ కథకు ఇది సంక్షిప్త రూపం.

–––


మూగ గీతం/ మౌన రాగం


రాజ్యానికి వొంటిమీద స్పృహ తప్పిపోయింది. వెంకటప్పయ్య పెళ్లాం మొహంలోకి చూశాడు. పెదిమలు కదులుతున్నాయి.

‘‘వొసే రాజ్యం!’’ ఆదుర్దాగా పిలిచాడు. పలకలేదు. మనోహరమైన తోడిరాగాన్ని తోడుపుచ్చుకుని అంబరవీధుల్లో విహరిస్తున్నాది.

వసారాలో పిల్లలు గందరగోళం చేస్తున్నారు. ‘‘వెధవల్లారా ఏమిటా అల్లరి!’’ వెంకటప్పయ్య కసిరాడు.

‘‘అబ్బ తుళ్లిపడ్డానండీ! పిడుగు పడ్డట్టు విరుచుకు పడుతున్నారేం?’’ రాజ్యం తెలివి తెచ్చుకొని అడిగింది.

‘‘కసిరితే కసిరాను. వంట్లో ఎలాగుందో చెప్పు?’’

‘‘ఇప్పుడేమొచ్చిందని?’’ రాజ్యం నవ్వింది. నవ్వుమొహం చూడ్డానికి భయంకరంగా వుంది. పైకి వచ్చేసిన గుడ్లగూబ కళ్లు, పొడుచుకు కనబడుతున్న ముందు పళ్లు.

రాజ్యం టైఫాయిడ్‌ జ్వరంతో తీసుకొని కిందపెట్టవలసినంతా అయి బతికి బట్టకడుతున్నాది. పత్యం తింటూ ఇంకా వారం రోజులే అయింది. జ్వరం మూడు వారాలుగా పొక్కిపోసిన తరువాత దిగజారలేదు. మళ్లా తిరగబెట్టింది. ఏ క్షణంలోనైనా ప్రాణం గుటుక్కుమంటుందనే వాడి భీతి!

‘‘నా వంట్లో హాయిగా ఉంది. తింటున్నది అరుగుతున్నాది. అంత జబ్బు పడ్డాక నిలుచున్న పాళంలా మామ్మూలు మనిషిని కమ్మంటే అవుతానా?’’ అన్నాది రాజ్యం.

‘‘నువ్వు పరధ్యానంగా ఉంటే గుండెలార్చుకు పోయాయి’’ అన్నాడు.

‘‘ఈ యింటికి మారిన దగ్గరనుంచీ హాయిగా ఉంది. ఎటొచ్చి అద్దెకే బెంగగా ఉంది’’ అన్నాది రాజ్యం.

అంతకుముందు వాళ్లు ఇరుకు సందులో ఉండేవారు. ఇప్పుడు కొత్తగా కట్టిన డాబాలో రెండు చిన్న గదులూ, వసారా అద్దెకు తీసుకొన్నారు. చుట్టూ విశాలంగా పెరళ్లున్నాయి.

‘‘వెధవ డబ్బు. ఏదో కూడిక చేసుకొంటాము. నువ్వు బతికావు చాలు’’ అన్నాడు.

‘‘నా జబ్బుకి ఎక్కణ్ణుంచి తెచ్చారో, ఎంత అయిందో ఇప్పటికి నాకు చెప్పకుండా ఉన్నారు’’ అన్నాది.

‘‘ఆ వూసు నిన్నెత్తొద్దన్నానా? ఆరోగ్యం చూసుకో. కావలసినంత ఓవల్టిన్ను తాగు. తెచ్చిన పళ్లన్నీ తినెయ్యి. పిల్లలకు కూడా పెట్టకు.’’

‘‘తినకేం చేస్తున్నాను? కాళ్లు జాపుకొని మీ చేత వండించుకొని మరీ తింటున్నాను. ఏదైనా అప్పు అప్పే కదా? మనకింకో విధం ఉంది కనకనా?’’

డబ్బు మాటెత్తగానే వాడికి గాభరా పుట్టింది. జీతం రెండు నెలలదీ కాక రెండువందలకి దాటి ఖర్చు అయిపోయింది. వాడికా సంభాషణ పెంచటం ఇష్టం లేదు. పెరట్లో కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కొని వచ్చాడు. 

రాజ్యం మళ్లా ఈ ప్రపంచంలో లేదు. మొహం మీదపడి బంగారపు పూత పూస్తున్నాది. కొన్ని సంవత్సరాలై రాజ్యం అంత సంతోషంగా ఉండటం వెంకటప్పయ్య చూడలేదు. కాపరానికొచ్చిన తొలి సంవత్సరం కిలకిల నవ్వుతూ ఉండేది. సంవత్సరం తిరక్కుండా గుండెలికి చంటికుర్రాణ్ణి వప్పగించి సంసార సాగరాన్ని ఉత్తరించుకుంటూవెళుతూ, అవతలదరికి చేరమంది జీవితం! కాపరానికొచ్చి ఆరేళ్లయింది. ముగ్గురు కొడుకుల తల్లి అయి ఈదుతున్నాది.

అకస్మాత్తుగా రాజ్యం తల ఓ పక్కకు పెట్టి ఆడిస్తున్నాది. వెంకటప్పయ్య పకాలున నవ్వాడు.

‘‘ఎందుకూ అంత విరగబాటు నవ్వు?’’ మొగుణ్ణడిగింది.

‘‘ఏదీ, మళ్లా మెడవంచి ఆడించు’’

‘‘అదా! ఎదురింటి పిల్ల పాడుతున్నాది, వినండి’’ అన్నాది. రాజ్యం చెప్పాక ఎదురింటి నుంచి సంగీతం వస్తున్నట్లు చెవులకు తెలిసింది.

‘‘ఓహో! అదియా సంగతి! చిన్నప్పుడు నువ్వు వాయులీన విద్వాంసురాలివి కదూ!’’ అన్నాడు. 

‘‘చీకటిపడుతూ ఉంటే ఇప్పుడెందుకూ వీధిలోకి? పెందరాళే అన్నం తినకూడదూ?’’ అన్నాది.

‘‘అనుకొంటూ ఉండగా ఆలస్యమైపోతున్నాది. ఇలాగ్గా ఇహనెళ్లి పాపపరిహారార్థం మంచిపని చెయ్యాలి’’ అన్నాడు.

‘‘పాపాలు కూడా చేస్తున్నారా?’’

‘‘పాపం చెయ్యందీ బతుకు వెళ్లలేదు.’’ వెంకటప్పయ్య వీధిలోకి నడిచాడు.

పిల్లలిద్దరూ సంగీతం వింటున్నారు. రాజ్యం మెల్లిగా లేచి స్విచ్చి నొక్కింది. గదినిండా కాంతి పడ్డాది. రాజ్యం ఫిడేలు మూలపడ్డాది. కమాను విరిగి పెంటకుప్పని చేరింది. జీవితంలోంచి సంగీతం తొలగిపోయినా ఎదురింటి అమ్మాయి పాడుతూవుంటే ఎక్కడలేని సంతోషాన్ని ఇస్తున్నాది.

ఆరేళ్ల క్రితం రాజ్యాన్ని చూడడానికి పెళ్లివారు వచ్చారు. వాళ్లతో వెంకటప్పయ్య వచ్చాడు. రాజ్యాన్ని పాడమన్నారు. వాళ్ల నాన్న నాలుగేళ్లయి సంగీతం చెప్పిస్తున్నందుకు పాడవలసిన శుభముహూర్తం వచ్చింది. తోడిలో కీర్తన సిగ్గుపడుతూ అందుకుంది. గొంతుకెత్తేసరికి అపశృతి. ఉసిలోకి రావాలసిన తాళం వేలుమీదకొచ్చింది. వొళ్లంతా జలదరించి పాటంతా గాభరా అయింది. రాజ్యానికి ఏడుపు పర్యంతం అయింది. కాని పెళ్లిపెద్దలు సెహబాస్‌ అన్నారు. తెలుగు పెద్దలకి శృతీ, అపశృతీ తెలియవనీ, వాళ్ల జీవితాలలో సంగీతం లేనేలేదనీ అమాయకపు పెళ్లికూతుళ్లకి ఏమితెలుసు!

వెంకటప్పయ్య పెళ్లినాటికి ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారి పట్టభద్రుల్లో ఒకడు. చెన్న రాష్ట్ర ప్రభుత్వపు డెబ్బయి రెండు రూపాయల ఎల్‌.డి. గుమస్తాలలో ఒకడు. 

పెళ్లయిన కొత్తలో రాజ్యం మాబాగా పాడుతుందని ఊళ్లోవాళ్లు పేరంటానికి వెళితే పాడించేవారు. అత్తవారింట్లో నోరెత్తి పాడుకొనే సమయం రాకుండానే వేవిళ్లతో పుట్టింటి కెళ్లింది.

వసారాలో పిల్లలు గందరగోళం ప్రారంభించారు. 

‘‘తమ్ముడు నిద్రపోతున్నాడా??’’ అనడిగింది.

‘‘గుర్రు పెడుతున్నాడు’’ అన్నాడు పెద్దవాడు.

‘‘అల్లరి చేస్తే లేచిపోడూ. ఎదురింటి అమ్మాయి హాయిగా పాడుతున్నాది. కూచుని వినండి’’ అన్నాది. ఎదురింటి అమ్మాయి స్వరకల్పన ప్రారంభించింది. రాజ్యానికి ఏనుగంత సత్తువ వచ్చింది. జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి సంగీతం అవసరమే.

పానకంలో పుడకలాగ ఎదురింటి అమ్మాయి తమ్ముడు కాబోలు వచ్చాడు. ‘‘గిమపదని ఓజగ...’’ గొంతుక చించుకొని అపశృతిలో స్వరాలు వేశాడు. ఆ అమ్మాయి తంబూరా, పాటా ఆపేసింది.

‘‘వెధవా! సంగీతం నేర్చుకోమంటే రావుకానీ అల్లరికి సిద్ధం’’ అన్నాది.

‘‘ఇంక పాడదేంటమ్మా?’’ పెద్దకొడుకు అడిగాడు.

‘‘అదిగో మీలాంటి అల్లరి కుర్రవాడు వచ్చి కంగాళీ చేస్తే కోపం వచ్చి పాట మానేసింది.’’ 

‘‘నువ్వు పాడతావూ?’’

‘‘ఓ పాడతాను. నీకు చెప్పమన్నావా?’’

‘‘ఛీ! మొగాళ్లు పాడరు.’’

‘‘మొగాళ్లూ పాడతారమ్మా’’ అని రాజ్యం కాళ్లు జాపి గదిలో అడ్డంగా పడుకుంది. ‘‘ఒరే పెద్దాడూ! కాళ్లు పట్టుబాబూ’’ అంది. పెద్దవాడు మెల్లిగా కాళ్లు గుద్దుతూ కూచున్నాడు. 

‘‘నేను చేతులు గుద్దుతానమ్మా!’’ అంటూ రెండోవాడు చేతులు గుద్దుతూ కూచున్నాడు.

రాజ్యం కళ్యాణి కృతి అనుకొంటూ పడుకుంది. అంతా మరిచిపోయింది. సంగతులు చిక్కుపడ్డ కురుల్లాగ అవకతవక అయిపోయాయి.

‘‘నువ్వా పిల్లలాగ పాడ్డం లేదు’’ అన్నాడు పెద్దవాడు.

‘‘అంతా మరిచిపోయానురా!’’ పెరటి వసారా గూట్లోంచి సిబ్బి కిందపడి వికారంగా చప్పుడు.

‘‘కుక్క కాబోలు కొట్టండి. గూట్లో అన్నం మండబెట్టింది కాబోలు!’’ అన్నాది రాజ్యం.

కొడుకులు పరిగెట్టారు. ‘‘కుక్క కాదమ్మా పిల్లి. అన్నంగిన్నె మీదా సిబ్బి తిరగదోసింది’’ అన్నాడు పెద్దవాడు.

‘‘నయమే. మళ్లా వండుకోకుండా. కుక్క ముట్టుకున్న కూడూ తినవలసిన రోజులు. గడియ పెట్టి రావొద్దూ?’’ అన్నాది రాజ్యం.

వెంకటప్పయ్య తిరిగి వచ్చేశాడు. ‘‘పెరట్లో వెన్నెలా, పువ్వువెలగ వాసన మహబాగున్నాయి’’ అన్నాడు.

‘‘అప్పడే వచ్చేశారేం? పాపపరిహారం అయిందా?’’

‘‘కొంచెం అయింది.’’ వెంకటప్పయ్య కండువాలో దాచి చంకక్రింద ఏదో పెట్టాడు. గుండ్రంగా పేపరు చుట్టి ఉంది.

‘‘ఏమిటిది?’’ అన్నాది రాజ్యం.

లోపల నాలుగువేళ్ల వెడల్పు చుట్టు జరీ అంచు చీర ఉంది. దానికి తగ్గ పట్టు రవికల గుడ్డా ఉంది.

‘‘కొన్నారా?’’

‘‘కొన్నాను. ఉన్నడబ్బు కాస్తా అయిపోకుండా కొనేశాను.’’

‘‘డబ్బెక్కడిది?’’

‘‘చెపితే నువ్వు నన్ను క్షమించవు.’’

‘‘ఏం చేశారండీ?’’

‘‘ఏమీ అననని చేతిలో చెయ్యివెయ్యి’’ అన్నాడు. ముందుకు చెయ్యి జాపాడు. వాడి చెయ్యి వణుకుతున్నాది. రాజ్యం చేతిలో చెయ్యి వేసింది.

‘‘అలాగ వొణికిపోతున్నారేం? దొంగతనం చెయ్యలేదు కదా?’’

‘‘అంతకన్నా హీనమైనదే. నీకు టైఫాయిడు మళ్లా తిరగబెట్టింది కదూ! నాకు ఆశలన్నీ ఉడిగిపోయాయి. స్నేహితుడొకడు ఇంటికివచ్చి చూసీచూడ్డంతో సలహా ఇచ్చాడు. తెగించి వాడికిచ్చేశాను.’’

‘‘ఏమిటిచ్చేశారు?’’

‘‘నీ కింకా తెలియలేదు. వాడే పట్టుకెళ్లి రెండువందల ఏభైకి అమ్మేశాడు. అంతడబ్బు వస్తుందని కలలోకూడా అనుకోలేదు. పాతదనుకున్నాను. పాతదానికే విలువ ఎక్కువట!’’

రాజ్యానికి అర్థమైంది. గది నాలుగుపక్కలా కలియజూసింది.

‘‘ఇహ నువ్వు చూడనక్కర్లేదు.’’

‘‘వెళ్లిపోయిందా?’’ అని దీర్ఘంగా నిట్టూర్చింది.

‘‘నీకు కష్టంగా ఉంటుందని తెలుసు. నేను చేసింది తప్పే!’’ అని నేరస్తుడిలాగ మొహం పెట్టుకున్నాడు. మొగుడి మనస్సు బాధపడుతున్నాదని గ్రహించి తన విచారాన్ని క్షణంలో దిగమింగుకుంది.

‘‘ఏ తప్పూ చెయ్యలేదు. ఏం సంసారైనా అదే చేస్తాడు. మీరేం తినేశారా?’’

‘‘మనకంతా మొగపిల్లలే కదా అని ధైర్యం చేశాను.’’

‘‘పోనియ్యండి, నా నోరు ఏనాడో నొక్కుకుపోయింది. ఇహ నా ఫిడేలు ఉండి నన్ను రక్షిస్తుందా? సర్వతీ కటాక్షం నా కంతే ఉంది. తల్లి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ తల్లిగుణాన్ని చూపించుకొంది. నాకు ప్రాణం పోసింది. నాకో చీరా రవికలగుడ్డా పెట్టింది’’ అని గుడ్లనిండా నీళ్లు నింపుకొంది.

‘‘నాలుగు కాలాల పాటు ఉంటుంది కదా అని కొనేశాను’’ అని చీర సగం విప్పేసి రాజ్యం భుజం మీద కప్పేశాడు వెంకటప్పయ్య.

‘‘జ్ఞాపకంగా ఉంటుంది లెండి!’’ అన్నాది రాజ్యం.

(సాక్షి సాహిత్యం; డిసెంబర్‌ 3, 2018)


Thursday, August 6, 2026

ఆలోచనాపరుడు కృష్ణమూర్తి


జిడ్డు కృష్ణమూర్తి 
11 May 1895 - 17 Feb 1986


ఆలోచనాపరుడు


చిన్నారిగా ఇంకా ఆటలు ఆడుకుంటున్న జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో అనుకోని మలుపు– అతను దివ్యజ్ఞాన సమాజం దృష్టిలో పడటం! ఆ పిల్లాడే మున్ముందు అవతరించనున్న ‘వరల్డ్‌ టీచర్‌’ మైత్రేయుడికి వాహకుడై మానవజాతికి ‘మోక్షం’ కలిగిస్తాడని లెడ్‌బీటర్, అన్నీబీసెంట్‌లాంటి వాళ్లు సంపూర్ణంగా విశ్వసించారు; దానికి తగిన ఇమేజ్‌ను కృష్ణమూర్తికి కల్పించారు.

అయితే, యువకుడిగా కృష్ణమూర్తి జీవితంలోని రెండో మలుపునకు పూర్తి కారణం ఆయనే! తననొక దేవుడి అవతారంగా నమ్ముతుండటాన్ని ఆయన పూర్తిగా నిరసించాడు; తనచుట్టూ ఏర్పాటైన ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ద స్టార్‌’ సంస్థని రద్దుచేశాడు; సత్యాన్ని కనుగొనడానికి తొక్కుడుపడిన దారంటూ ఒకటి లేదు, అది వ్యవస్థలు అందిచ్చేది కాదు, అది పూర్తిగా వ్యక్తిగత ప్రయాణం, అని తేల్చేశాడు.

కృష్ణమూర్తి ఆలోచనల్లో సత్యానికి దారి చూపే గురువంటూ లేడు, దానికి పనికొచ్చే మతమంటూ లేదు, దానికోసం ఎవరూ చేయిపట్టుకుని నడిపించరు. అన్వేషణ, ప్రశ్నించే గుణాలే సత్యాన్ని చేరేందుకు ఉపకరణాలు!

కానీ దేవుడికో, గురువుకో ఒక నమస్కారం పెట్టేయడం తేలిక; వాటిచుట్టూవున్న అంశాల్ని తర్కించి అవగాహన చేసుకోవడం కష్టం; అందుకే జిడ్డు కృష్ణమూర్తి బాటలో నడవడంకన్నా ఏదో ఒక మతం చాటున దాక్కోవడం మనుషులకు సులభమవుతోంది. అయితే, ఈ మానవ బలహీనత గురించి కృష్ణమూర్తికి బాగా తెలుసు.

మనిషి తనకుతానుగా బతకడు; కనబడని షరతులకు లోబడివుంటాడు; అదృశ్య సంకెళ్లకు బందీగా ఉంటాడు;  నిత్యం రొద పెట్టే కీచుగొంతులకు బానిసయి ఉంటాడు; భావజాలాల ఒత్తిడిలో మునిగివుంటాడు. వీటన్నింటినీ తట్టుకుని ఒంటరిగా నిలబడాలంటే చాలా సామర్థ్యం ఉండాలి; ఇది లేనివాళ్లు మరొకరివైపు చూస్తారు; వాళ్లే గురువును నిలబెడతారు.

గురుపీఠాన్ని నిరాకరించిన ఈ సరికొత్త ఆలోచనాపరుడికి అనూహ్యమైన సంఖ్యలో అనుచరులు ఏర్పడ్డారు. వాళ్లు కృష్ణాజీ, కృష్ణ అని పిలిచేవారు. తనను గురువుగా కాకుండా ఒక స్నేహితుడిలా మాత్రమే చూడమన్నాడు కృష్ణమూర్తి. ప్రపంచమంతా తిరిగాడు; వేలాది ప్రసంగాలు చేశాడు; వ్యక్తులతోనూ, సమూహాలతోనూ సంభాషించాడు. అవే మనకు లభ్యమవుతున్న ఆయన తత్వచింతన!

ఏ మతమైనా నీ శత్రువును కూడా ప్రేమించమనే చెబితే, ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంత హింస ఎందుకు చోటు చేసుకుంటోంది? జాతీయత పేరుతో, మతం పేరుతో, సిద్ధాంతాల పేరుతో, మనుషుల మధ్య గీసుకునే గీతలు అవి ఏ రకమైనవైనా పనికిరావన్నాడు. గాలి వీచినప్పుడు అది గీతలు చూసుకోదు; సత్యం కూడా అలా  వ్యాపించాలి; అప్పుడు మాత్రమే జీవితానికి ఆధ్యాత్మిక సొబగు అద్దగలం. భయం, ఘర్షణ, హింస లేకుండా జీవించగలిగే స్వేచ్ఛ అందరికీ ఉండాలి. ఎవరూ సెకండ్‌ హాండ్‌ మనిషిలా బతగ్గూడదు; సొంతంగా ఆలోచించాలి; చేస్తున్న ఆలోచన మీద పూర్తి స్పృహ కలిగివుండాలి; ధ్యానం అంటే ఏదో ఒకటి చేయడం కాదు; ఏదీ చెయ్యకుండావుంటే దానికదే కలిగే ఒక స్థితి!

రోజువారీ జీవితంలో మనిషి ఎదుర్కునే అన్ని రకాల ఘర్షణలనూ ఆయన చర్చించాడు. ఒక సందర్భంలో, ‘‘నా రహస్యం ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా? అయితే వినండి, ఏది జరిగినా నేను పట్టించుకోను,’’ అన్నాడు. సమస్య ఉందని గుర్తించడానికీ, సమస్యను మనసుకు తీసుకోకుండా ఉండటానికీ మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాను పసిగట్టాలని ఆయన ఉద్దేశం!

జిడ్డు కృష్ణమూర్తి అన్న పేరు కూడా ఒక పూర్వవాసన కలిగివుంది కాబట్టి, కేవలం సాంకేతికంగా, తనను ‘కె’ అనిపించుకున్నాడు. ఆలోచనలు పవిత్రమైనవేమీ కావు; నన్ను కూడా గుడ్డిగా నమ్మవద్దన్నాడు. ఎప్పటికైనా నేను తెలుసుకున్న సత్యమే ఉంటుంది తప్ప, నీకు పనికొచ్చే సత్యం ఉండదు, నీది నువ్వే తెలుసుకోవాలి, అని చెప్పాడు.  తానేదో తెలుసుకున్నాడు కాబట్టి, తనకు గొప్పదనాన్ని ఆపాదించడానికి నిరాకరించాడు. మనుషులు మూర్ఖులైతే సత్యాన్నీ, వ్యక్తినీ కలగలుపుతారు; వ్యక్తి చుట్టూ ఆలయం నిర్మిస్తారు; వ్యక్తికంటే సత్యం గొప్పది; సత్యంకన్నా వ్యక్తి ఏనాటికీ గొప్పవాడు కాదు, అన్నాడు. ఆ విషయం చెప్పినందుకైనా ఆయన గొప్పవాడు!

(సాక్షి ఫన్‌డే; 11 మే 2014)
––––––––––––––––––––––