Thursday, September 17, 2026

ఇదే భాగ్యనగర్‌ కథ


శొంఠి కృష్ణమూర్తి

శొంఠి కృష్ణమూర్తి రచన ‘భాగ్యనగర్‌’ ఇది. తెలంగాణ మలితరం కథకుల్లో ఒకరు. 1924 నవంబరులో తూర్పు గోదావరి జిల్లాలోని సోమేశ్వరంలో జన్మించారు. ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు. ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. 1990 జూన్‌లో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఈయన కథల్ని ‘నవచేతన’ పునర్ముద్రించింది. కథలు రాయడమెలా అనే పుస్తకాన్ని కూడా కృష్ణమూర్తి రాశారు. 

----

 ఇదే ఇదే భాగ్యనగర్‌


ఎర్రటి నీరెండలు లోకాన్ని అరుణకాంతితో నింపుతున్నాయి.

దూరాన్నుండి అతివేగంతో, తన గర్భంలో యెన్నో గత చరిత్రల్ని దాచుకున్న కాలిబాట దుమ్ముని రేగకొడుతో వస్తున్న గుర్రం డెక్కల చప్పుడు అకస్మాత్తుగా ఆగింది.

అది మూసీ నదీతీరంలో వున్న పల్లెటూరు. పెద్ద పూలవనం. చుట్టూ ముళ్లకంచె. ఆ తోటలో పద్దెనిమిదేళ్ల అమ్మాయి. పూలు తెంపుతో పాడుకుంటూ వుంది.

మరుక్షణంలో గుర్రాన్ని వెనక్కి నాలుగడుగులు నడిపించి, ఆ రౌతు కంచెను దాటించి, ఆ అమ్మాయి వద్ద ఆపాడు. ఆవిడ భయపడి పూలసెజ్జని కింద వొదిలేసింది.

అతడు గుర్రం దిగి పూలసెజ్జను అందించబోయాడు. ప్రేమ ధారలు కురిపిస్తో ‘‘ఎవరు నువ్వు?’’ తీయని కంఠస్వరంతో అన్నాడు.

ఆ అమ్మాయికి కోపం వచ్చింది. తన తోటలోకి వచ్చి, తననే యెదురు ప్రశ్నిస్తున్నాడు.

‘‘నువ్వెవరు?’’ అంది.

‘‘మహారాజుని’’

మళ్లీ మొహంలోకి చూసింది. ‘‘ఇక్కడేం పని?’’ అంది, వీడని ధైర్యంతో.

‘‘వేటకోసం బయలుదేరాను. వొఠ్ఠి చేతుల్తో తిరిగిపోవడం ఇష్టంలేక...’’

పచ్చగడ్డి మీద చతికిలబడ్డాడు. గుర్రం తోచక సకిలించింది.

‘‘పల్లెల్లో ఏం వేట? అడవికి వెళ్లండి’’ అంది.

‘‘అడవిలో ఏదీ దొరక్కే ఇక్కడికి వచ్చా.’’

‘‘దయచేసి అవతలకు దయచెయ్యండి.’’

‘‘ప్రణయంలోనూ, రణంలోనూ వెనుకాడ్డం రాజలక్షణం గాదు’’ అన్నాడు, నోటితో గడ్డిపరకను కదిలిస్తో. ‘‘ఒకసారి మొహమెత్తి ఇటుచూడు... నా హృదయేశ్వరివి.’’

ఆ అమ్మాయి ఉక్కిరి బిక్కిరయింది.

అతనో గులాబీ పువ్వుని తెంచుకొచ్చాడు. ‘‘చూడు! అందమైన గులాబీ చెట్టుకీ ముళ్లున్నాయి; నీకూ ముక్కున కోపం ఉంది. అదే దేవుడి సృష్టిలో వింత అనుకుంటాను’’ అన్నాడు.

ఓరగా చూసింది. ‘‘ఆ ముళ్లు చేరేవాళ్ల తెలివిని బట్టి బాధించవు.’’

అతని కళ్లల్లో సంతృప్తి తాండవించింది. ‘‘నీ సౌందర్యాన్ని చూసి ముగ్ధుణ్ణయ్యాను. నీ పాదాల చెంతకు వచ్చి ప్రేమభిక్ష కోరాను.’’

ఆ అమ్మాయి మాట్లాడలేదు.

‘‘మాట్లాడవేం?’’ అని చేతులు పట్టుకున్నాడు.

అంతలోకి ‘‘భాగ్యం; భాగ్యం’’ అని అరుపులు వినపడ్డాయి.

‘‘మా నాన్న! నేను పోవాలి’’ అంది కంగారుగా.

‘‘నీ పేరు?’’

‘‘భాగ్యమతి’’


2

క్షణికమాత్రపు నిర్ణయాలెన్నో చరిత్ర రీతుల్నీ, తీరుల్నీ మార్చిన సందర్భాలున్నాయి. 

క్రమంగా భాగ్యమతికి ఆ నూతన యువకునితో పరిచయం ఎక్కువైంది. రహస్య సమావేశాలు, ప్రణయ కలాపాలు ఎక్కువయ్యాయి. భాగ్యమతి అతన్ని చూడందే ఒక్కరోజూ గడపలేకపోయేది. అతనూ అంతే! భాగ్యమతి సందర్శనా భాగ్యరహితుడై మనలేకపోయేవాడు.

అది వర్షాకాలం. ఉదయం మొదలు ఎడతెగని వర్షం కురుస్తోంది. కారు మేఘాలు క్రమ్మటం వల్ల సాయంత్రమే చీకటి పడినట్టుగా ఉంది. మూసీనది, వర్షపు నీరు చేరడం వల్ల వెల్లువలై పారుతోంది. ఆకాశంలో మెరుపులూ ఉరుములూ ఏదో ప్రళయం రాబోతున్నట్టుగా సూచిస్తూ వున్నాయి.

‘‘చలో, చలో’’ అంటూ కొరడాతో గుర్రాన్ని అదిలిస్తూ మన పరిచయస్థుడు ఏటికి అడ్డంగా ఈదసాగాడు. అతి కష్టం మీద అరగంట తర్వాత నాలుగు ఫర్లాంగుల దిగువన గట్టు చేరుకున్నాడు. అలసిపోయిన గుర్రం నురగలు గ్రక్కుతోంది.

పాకలో నుండి– ‘‘వచ్చారా?’’

‘‘ఎందుకు రాను?’’

‘‘ఇంత వర్షంలో...’’

‘‘నువ్వు మాత్రం యెందుకు నిరీక్షిస్తున్నావ్‌?’’

అతనామెను కౌగిట్లోకి తీసుకున్నాడు. ఇద్దరు కొన్ని క్షణాలు మాట్లాడలేదు.

‘‘మీరు ఇట్లాంటి దారుణానికి తయారైతే ఎలా? తుఫానులో వొస్తే వొప్పుకునేది లేదు.’’

‘‘రాణి గారి ఆజ్ఞ అనుసరించక తప్పుతుందా?’’

కొంతసేపు గడిచింది. బుగ్గమీద మీటి గుర్రాన్ని ఎక్కి వెళ్లిపోయాడు. ఎక్కడో దూరంగా పిడుగు పడినట్టయింది. భాగ్యమతి గుండెల్లో రాయిపడింది.


3

పదిహేను రోజుల వరకూ భాగ్యమతి ప్రియుని కోసం వృథాగా ఎదురు చూసింది.

పై సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే మూసీనది వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమైందని వింది.

గోల్కొండ నవాబ్‌ సుల్తాన్‌ ఇబ్రహీం కుతుబ్‌షా గారికి యువరాజు మహమ్మద్‌ మూసీనదిని దాటి జ్వరం పడ్డాడనే వార్త విచారాన్ని కలిగించింది. వెంటనే హకీముల్ని పిలిపించి వైద్యం చేయించసాగాడు. తన వజీర్‌ సాహెబ్‌కు తక్షణం మూసీనదిపై నెల లోపల వంతెన నిర్మించాలని ఫర్మానా జారీ చేశాడు.

ఇబ్రహీం కుతుబ్‌షా 1550 నుండి 1580 వరకు గోల్కొండ ఆంధ్రసామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప విద్వాంసుడు. అప్పుడు రాజ్యం ఒరిస్సా నుండి పెన్న వరకు విస్తరించి వుండేది. టర్కీ, అరేబియా, పర్షియా వరకు వర్తక వ్యాపారాలుండేవి. ఎంతోమంది తెలుగు కవులను పోషించాడు. ‘మల్కిభరాం’ పేరుతో ఆయన్ని తెలుగు కవులు కీర్తించారు. 

యువరాజు పది రోజుల వరకూ మూసిన కన్ను తెరవలేదు. అన్నాళ్లూ ఏదో కలవరిస్తూనే ఉన్నాడు. కాని వివరాలు ఎవరికీ తెలీలేదు. వైద్యులు మాత్రం యువరాజు ఏదో మనోవ్యధతో బాధపడుతున్నారని కనుగొన్నారు.

మహమ్మద్‌ కొంచెం కోలుకోగానే ‘‘భాగ్యమతీ, భాగ్యమతీ!’’ అని పలవరించసాగాడు. ఈ వార్తను విన్న సుల్తాన్‌ కొడుకును చూడ్డానికి వచ్చాడు. అప్పటికి అందరికీ తెలిసింది. యువరాజు పడిన ప్రణయమే ఇంత ప్రళయాన్ని కొని తెచ్చిందని.


4

మరో నెల రోజులు గడిస్తేనేగానీ యువరాజు పూర్తిగా ఆరోగ్యవంతుడు కాలేడు. అప్పుడు సుల్తాన్‌ యువరాజును ‘బాలా హిస్సార్‌’నకు పిలిపించాడు.

మహమ్మద్‌ కొంచెం బలం చేరినప్పట్నుంచీ కూడా న్యాయశాలపై డాబా మీదికి పోయి, సాయంత్రం వేళలందు మూసీనది వైపూ, మూసీనదికి ఆవలవున్న పల్లెవైపూ శూన్యదృక్కుల్ని ప్రసరిస్తుండేవాడు. అక్కడి నుంచీ చూస్తే ముప్పై మైళ్ల వరకూ కనబడతుంది.

ఒకనాడు అలాగే భాగ్యమతిని తల్చుకుంటూ వుంటే సుల్తాన్‌ వారి కబురు వచ్చింది. వెంటనే వెళ్లాడు. 

‘‘భాగ్యమతి ఎవరు?’’ అని నవ్వుతో ప్రశ్నించాడు. యువరాజు నుంచునే సిగ్గుతో తలవంచుకున్నాడు.

‘‘గొప్ప గొప్ప వజీర్లు, సర్దారులు కోట్ల కొలది హొన్నులతో తమ అపురూప సుందరులైన కన్యల్ని ఇస్తామంటుంటే ఇదేమిటి?’’

‘‘నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను.’’

‘‘మన ఇస్లాం మతం?’’

‘‘మీరు అన్నీ తెలిసినవారు. హిందూ, మహమ్మదీయ సఖ్యతకు పాటుపడేవారు.’’

‘‘నీ ఇష్టం. ఆలోచించు. నువ్వు కాబోయే సుల్తాన్‌వని గుర్తుంచుకో.’’


5

కాలచక్రం దొర్లిపోయింది. ఇబ్రహీంషా మరణించడం, మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా 1580లో రాజ్యాభిషిక్తుడవడం జరిగింది. భాగ్యమతి పట్టమహిషి అయింది. సిలాఖానా దక్షిణముగా ఆవిడకై ప్రత్యేక భవనం నిర్మించారు. అంబర్‌ ఖానాకు సమీపంలోనున్న గుహలో ఒక దేవాలయం నిర్మించారు. భాగ్యమతి అక్కడే రోజూ దేవి పూజ కావించుకునేది.

మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా సుల్తాన్‌గా వున్నప్పటికి దాదాపు ఆంధ్రదేశమంతా గోల్కొండ నవాబుల పాలనలోకి వచ్చింది.

రాజ్యానికి వచ్చిన పది సంవత్సరాల తర్వాత 1589లో గోల్కొండ సుల్తాన్‌ సతీ సపరివారంగా తాము కట్టించిన చార్‌మినార్‌ చూడ్డానికి వెళ్లారు. పక్కనే జుమ్మా మసీదు గొప్ప నేత్రానందాన్ని కలిగిస్తోంది. లెక్కలేనన్ని పావురాలు మసీదు మీద నివాసం చేసుకున్నాయి.

మూసీనది కిరువైపులా పూర్వపు పల్లెటూరు పెద్ద బస్తీగా మారిపోయింది. చార్‌మినార్‌ చుట్టూ చార్‌ కమాన్లు నిర్మించబడ్డాయి. విదేశీ వ్యాపారస్థులందరూ ఇక్కడే నివాసాలు ఏర్పర్చుకొని, అవసరమున్నప్పుడు దుర్గానికి వెళ్లి వస్తోవుండేవారు. విదేశీ రాయబారుల నివాసాలు కూడా ఇక్కడేవుండేవి.

భాగ్యమతితోపాటు సుల్తాన్‌ చార్‌మినార్‌ ఎక్కారు. మూసీనదిని, మరొక పక్క గోల్కొండ ఖిల్లాను చూసి భార్యాభర్తలు ముగ్ధులైపోయారు. మరొక పక్క మూసీనదికి ఆవలగా అల్లంత దూరంలో పూలతోట.

‘‘భాగ్యమతీ!’’ అన్నాడు సుల్తాన్‌.

‘‘ఏం ప్రభూ!’’

‘‘అక్కడ చూడు, ఆ పుష్పవనం! ఈ భాగ్యమతి, నా పాలిటి భాగ్యదేవత, ప్రథమ సందర్శనా భాగ్యాన్ని కలిగించిన పూదోట అదిగో.’’

భాగ్యమతి ముఖం మీది పల్చని తెరచాటు నుంచి, పొంచి చూసే చంద్రబింబంలా పటాన్ని తిలకిస్తోంది. 

‘‘నువ్వు నా పాలిటి భాగ్యదేవతవే కాదు, గోల్కొండ సామ్రాజ్యపు భాగ్యలక్ష్మివి. నీ పేరు మీదుగా, కలకాలం మన ప్రేమ ఈ లోకంలో నిలిచివుండేలా ఈ నగరానికి నేటి నుండి భాగ్యనగర్‌ అని పేరు పెడుతున్నాను.’’

‘‘ధన్యురాల్ని ప్రభూ. ప్రభువులు అన్నిటికీ సమర్థులు.’’ భాగ్యమతి హృదయం పొంగిపోయింది.

ఆ భాగ్యనగరే నేటికీ భోగ, భాగ్యాలతో విలసిల్లుతున్న హైదరాబాద్‌!


(సాక్షి సాహిత్యం; 2020 సెప్టెంబర్‌ 14)


Sunday, September 13, 2026

మనసు కవి


ఆచార్య ఆత్రేయ
7 May 1921 - 13 Sep 1989

 మనసు కవి

ఆత్రేయ అంటే అర్థం చంద్రుడు. సినీవినీలాకాశంలో ఆయన కాచిన పున్నమి వెన్నెళ్లు ఎన్నని! ‘మనసు మూగదేకాని బాసుంటది దానికి/ చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇదీ’. ‘నేనొక ప్రేమ పిపాసిని/ నీవొక ఆశ్రమవాసివి’. మనసంత సున్నితమైన మాటలు అల్లినవాడూ, మనసు మర్మాన్ని ఎరిగినవాడూ, మనసయ్యేలా రాసినవాడూ కాబట్టే ఆత్రేయ ‘మనసు కవి’ అయ్యాడు.

ఆత్రేయ అన్న గోత్రనామాన్నే కలంపేరుగా చేసుకున్న కిళాంబి వెంకట నరసింహాచార్యులు... కప్పలు, ఈనాడు, ఎన్జీవో, విశ్వశాంతి లాంటి నాటకాలతో ప్రజాదరణ పొంది సినీరంగంలోకి వచ్చాడు. ‘ఈ భూమి తిరిగేది రూపాయిచుట్టూ’ అని ఆయనకు తెలుసు. ‘కాటికెళ్లితే అందరూ ఒకటే అనుకోబోకు/ అక్కడ కూడా తేడాలున్నాయి కాలేవరకు’ అనీ తెలుసు. కాబట్టే, సమసమాజం ఆదర్శంగా రచనలు చేశాడు. ‘మన భూమి వేదభూమిరా తమ్ముడూ/ మన కీర్తి మంచుకొండరా’ అని పనికిరాని గతాన్ని ఎద్దేవా చేశాడు. ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిచాన (ను) బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా’ అని ప్రశ్నించాడు.

అంతులేని కథ, అభినందన, అర్ధాంగి, ఆరాధన, జయభేరి, డాక్టర్‌ చక్రవర్తి, దసరా బుల్లోడు, నీరాజనం, ప్రేమనగర్, సెక్రటరీ, వెలుగు నీడలు లాంటి సుమారు రెండు వందల చిత్రాలకు మాటలూ, రెండు వేల వరకు పాటలూ రాశాడు ఆత్రేయ. మాటలతో దుఃఖపెట్టాడు. ‘మనిషికి చాలా కాలం బ్రతుకుతాడన్న అబద్ధం కంటే, నేడో రేపో చచ్చిపోతాడన్న నిజం తెలియడం చాలా మంచిది. చేయదల్చుకున్న మంచి ఏదైనా ఉంటే అప్పుడే చేస్తాడు’: వెలుగు నీడలు. పాటలతో సంతోషపెట్టాడు. ‘పెళ్లంటే– పందిళ్లు సందళ్లు/ తప్పట్లు తాళాలు తలంబ్రాలు/ మూడే ముళ్లు ఏడే అడుగులు/ మొత్తం కలిపి నూరేళ్లు’: త్రిశూలం.

‘అమ్మంటే అమ్మ/ ఈ అనంతసృష్టికి ఆమె అసలు బ్రహ్మ’ అన్న ఆత్రేయ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు. ప్రేమించిన ప్రియురాలి చేయిని అందుకోలేకపోయాడు. ‘అనుకున్నామని జరగవు అన్ని/ అనుకోలేదని ఆగవు కొన్ని/ జరిగేవన్నీ మంచికని/ అనుకోవడమే మనిషి పని’ అంటాడో చోట. జీవితం పట్లా, పొందలేనిదాని పట్లా సమాధానం పడటానికి పడే తపన కావొచ్చది. తన యౌవనంలో ఇష్టపడ్డ ‘బాణం అనే అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయిన నలుగుబాటు ఆయన్ని జీవితాంతం వెంటాడింది. ‘నిన్ను ఏమీ సుఖపెట్టలేకపోయాను, నేనూ సుఖపడ్డదీ లేదు,’ అని భార్య పద్మావతికి రాసిన ఉత్తరంలో ఆయన పడిన క్షోభ తెలుస్తుంది.

మనసున్నవాడికి మథనమే మిగిలేది! అది లేకపోవడమే ఒక్కోసారి మేలేమో! ‘తీపి మాటలు గొంతు కోతలు/ నరులకు మాకే సొంతం’ అన్నట్టుగా చరించే మనుషుల మధ్య, మనసనే మధుకలశంలో విషపుచుక్కలు జార్చే కఠిన పాషాణుల మధ్య మనసున్నవాడుగా బతకడం కష్టం. ఆ నిష్టూరంలోంచే కాబోలు, ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికీ సుఖము లేదంతే’ అన్నాడు. ‘బ్రతికుండగా నిన్ను ఏడిపించినోళ్లు/ నువ్వు చస్తే ఏడుత్తారు దొంగనాయాళ్లు’ అని వెక్కిరించాడు. ‘మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా/ తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా’ అని హితవు పలికాడు.

‘మగువ మనసు సగం చదివితే మగవాడప్పుడు డాక్టరాఫ్‌ రొమాన్స్‌’ అన్నాడేగానీ తప్పనిసరైన భోగంపాటలకు ఆత్రేయ నొచ్చుకున్నట్టే కనబడతాడు. ‘సినిమా కవి బ్రతుకు అనేకానేక అభిరుచులుగల విటులను సంతృప్తి పరచవలసిన పడుపు వృత్తి’ అన్న నిరసన బహుశా ఆయన మీద పడిన ‘బూత్రేయ’ ముద్రకు ఒక సంజాయిషీ అనుకోవాలి. 

ఇలాంటి వేదనలో మనిషికి నిద్ర ఎలా పడుతుంది? ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది/ కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది’. అన్నింటికీ నిద్రే మందు మరి. ఒక్కోసారి అది శాశ్వత నిద్రయినా కావొచ్చు.
 
అంతేగా, కాలం పాపమని దేన్నీ ఆపదు. ‘నేడు నిన్నౌతుంది/ రేపు నేడౌతుంది/ ఆ రేపుకూడా నిన్నగా మారుతుంది’. ఆత్రేయ అయినా అంతే! ‘మట్టి బొమ్మలే మనమంతాను/ గిట్టిపోవలె మట్టిలోపలే’.
 
కాకపోతే ఉన్నన్నాళ్లూ, ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ/ నవ్వుతూ చావాలిరా’!

(సాక్షి ఫన్‌డే; మే 4, 2014)

Friday, September 11, 2026

కొన్ని ఇన్నర్‌వ్యూ ఫొటోలు


న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌తో (22–6–2012)





నిర్మాత కె.రాఘవతో (26–7–2012)





సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో (20–4–2012)


సాక్షి ఫన్‌డే కోసం కొన్నేళ్ల కింద ఇన్నర్‌వ్యూ పేరుతో కొంతమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. కానీ ఎప్పుడూ ఫొటోలు దిగలేదు. నేను అడగలేదు. అది నా స్వభావం కాదు. ఏదో అడ్డంపడుతుంది. కానీ నా వెంబడి వచ్చిన ఫొటోగ్రాఫర్లు చొరవగా తీసిన ఈ ఫొటోలు మాత్రం ఇప్పుడు  జ్ఞాపకంగా మిగిలాయి.

Sunday, September 6, 2026

వెండితెర చక్రవర్తి కురొసావా


అకీరా కురొసావా 
23 March 1910 - 6 Sep 1998

వెండితెర చక్రవర్తి


ఒకసారి దర్శకుడు అకిరా కురసోవాకు ఈ ప్రశ్న ఎదురైంది: ‘‘మీరు ‘రాన్‌’లోని ఆ ఫ్రేమ్‌లో కెమెరా అలా ఎందుకు పెట్టారు?’’
దానికి కురసోవా ఇచ్చిన జవాబు: ‘‘నేను ఒక్క అంగుళం ఎడమకు ప్యాన్‌ చేసినా సోనీ ఫ్యాక్టరీ కనబడుతుంది, అదే ఒక్క అంగుళం కుడికి జరిపితే ఎయిర్‌పోర్టు కనబడుతుంది. పీరియడ్‌ సినిమాకు ఆ రెండూ అనవసరం’’.
కురసోవా అంత పర్ఫెక్షనిస్టు! సినిమా కోసం ప్రాణం పెట్టేవాడు.

1948తో మొదలై నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఆయన కెరీర్లో... రషోమన్, ఇకిరు, సెవెన్‌ సమురాయ్, యొజింబో, థ్రోన్‌ ఆఫ్‌ బ్లడ్, దెర్సు ఉజాలా, ద లోయర్‌ డెప్త్స్, హై అండ్‌ లో, డ్రీమ్స్, రప్సోడీ ఇన్‌ ఆగస్ట్‌... ఒక్కో సినిమా ఒక్కో చరిత్ర!

సినిమా మాస్టర్లు అనిపించుకున్న దర్శకులు ఇన్‌మార్‌ బెర్గ్‌మన్, ఫ్రెడరికో ఫెల్లిని, సత్యజిత్‌ రే, రోమన్‌ పోలన్‌స్కీ, జార్జ్‌ లుకాస్, ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పోలా, మార్టిన్‌ సోర్సెసె, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌లాంటివాళ్లు కూడా కురసోవా వల్ల ప్రభావితమయ్యారు. అందుకే ఆయన్ని విమర్శకులు గౌరవంగా ‘ఎంపరర్‌ ఆఫ్‌ ద సెల్యులాయిడ్‌’ అంటారు.

జపాన్‌ ‘సమురాయ్‌’(సైనిక) కుటుంబంలో జన్మించిన అకిరా సినిమాలు మాత్రమే తన ఉనికిగా బతికాడు. యుద్ధ సన్నివేశాలను చిత్రించడంలో, రిస్కు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి! నటీనటులకు అలవాటు కావడానికి, తద్వారా సహజత్వం కోసం సినిమా కాస్ట్యూమ్స్‌తో వాళ్లను కొంతకాలం పడపమనేవాడు. ఏరోజు రషెస్‌ ఆరోజు స్వయంగా ఎడిట్‌ చేసుకునేవాడు.

‘‘ఆలోచనలు సహజంగా వస్తాయి, కథ ఆ క్యారెక్టర్‌ వెంట సాగిపోతుంది’’ అని తను సినిమా తీసే విధానం గురించి చెప్పేవాడు కురసోవా. స్టోరీబోర్డ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. సినిమాకు ఫండింగ్‌ దొరకని విరామ సమయాల్లో తన సీన్లన్నింటినీ బొమ్మలుగా గీసుకునేవాడు. ఆయన స్వయంగా పెయింటర్‌ కూడా! సినిమాల్లోకి రాకముందు కమర్షియల్‌ ఆర్టిస్టుగా పనిచేశాడు. ‘‘నిజంగా డైరెక్టర్‌ కావాలనుకుంటే ముందు స్క్రీన్‌ప్లేలు రాయండి. రాయడం ద్వారానే సినిమా స్ట్రక్చర్‌ అర్థమవుతుంది, అసలు సినిమా ఏంటో కూడా అర్థమవుతుంది’’ అని ఔత్సాహిక దర్శకులకు సలహా ఇచ్చేవాడు. ‘‘నీలోపల ఎంతో రిజర్వు ఉంటేతప్ప, నువ్వు ఏదీ సృష్టించలేవు. జ్ఞాపకమే సృష్టికి మూలం. శూన్యం నుంచి దేన్నీ సృష్టించలేం’’. అందుకని చదవడం చాలా ముఖ్యమనేవాడు. ‘‘అయితే, చదవడం వల్లగానీ, నీ జీవితానుభవం వల్లగానీ వచ్చినదానికి జోడించగలిగేదేదో నీలోపల లేకపోతే నువ్వు ఏదీ సృజించలేవు’’ అనేవాడు.

ఆయన సినిమాలన్నీ ‘లార్జర్‌ దన్‌ లైఫ్‌’గా కనబడినా, ఆయన మాట్లాడిందంతా జీవితం గురించే! మనిషి ఎప్పుడూ తప్పకూడని నీతినీ, ఎప్పుడూ పాటించవలసిన మానవీయ విలువనీ ఆయన చిత్రాలు  ప్రతిబింబించాయి. మనిషి బతకడం కోసం చేసే పోరాటాన్నీ, మనిషిగా నిలబడటం కోసం పడే ఆరాటాన్నీ, సమూహంతో కలిసిసాగే సంతోషపు వెతుకులాటనూ ఆయన చిత్రించాడు. అయితే, జీవితం ఎంత సంక్లిష్టమైందో ఆయన సినిమాలు కూడా అంతే సంక్లిష్టమైనవి. అందుకే కురసోవా తన సినిమాల్లో ‘ఫలానాది వెల్లడించాడు’ అనడం తప్పుడు విశ్లేషణే అవుతుంది.
‘‘నా సినిమా ఏం చెబుతుందో నేనేగనక వివరించగలిగితే అందరికీ వెళ్లి అదే చెప్తానుగానీ, అంత కష్టపడి సినిమా ఎందుకు తీస్తాను?’’ అన్నాడాయన. సినిమాను అర్థం చేసుకోవడంలో మెదడుకంటే హృదయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమనేవాడు. ఆయన చిత్రరాజాలు మాత్రం మెదడునూ, హృదయాన్నీ రెంటినీ సంతృప్తిపరుస్తాయి.

(సాక్షి ఫన్‌డే; 23 మార్చ్‌ 2014)
––––––––––––––––––––––

Thursday, September 3, 2026

అల్లం శేషగిరిరావు ‘నరమేధం’


అల్లం శేషగిరిరావు 

అల్లం శేషగిరిరావు (1934–2000) ‘నరమేధం’ సంక్షిప్తరూపం ఇది. 1979లో ప్రచురితమైంది. ఒరిస్సాలో జన్మించి, రైల్వేలో పనిచేసిన శేషగిరిరావు ‘మంచి ముత్యాలు’, ‘అరణ్య ఘోష’ కథాసంకలనాలు వెలువరించారు.

––––––––––

ఒక్కరోజు చావు


ఛత్ర చామరాలతో అలంకరించిన ముఖద్వారం, కొబ్బరాకులతో అల్లిన పూజా మంటపం, రథం అగ్రభాగాన పరుగులు తీస్తున్న శ్వేతాశ్వాలు నేత్రానందకరంగా ఉన్నాయి. జనం గంపులు గుంపులుగా వస్తున్నారు జాతరని చూడ్డానికి.

గంగరాజు సిల్కు లాల్చీ తొడుక్కుని పట్టపంచ కట్టుకున్నాడు. బొద్దు మీసాలతో, సన్నంగా, పొడవుగా, వెండి తీగెలా ఉన్నాడు. రథయాత్రా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు.

‘‘టైమయింది, గంగరాజుగారూ’’ అని పూజారి మంత్రజలం చల్లి గంగరాజు మెడలో పూలదండ వేసి కొబ్బరికాయ చేతికి అందించేడు. రాజు ‘‘జై జగన్నాథ్‌!’’ అని టెంకాయని మూడుసార్లు దిష్టితీసి బలంపూర్తిగా కొట్టేడు. కుర్రాళ్లు కొబ్బరి ముక్కల కోసం ఎగబడిపోతున్నారు.

‘‘జగన్నాథ మహాప్రభూకి జై’’ ‘‘గంగరాజు బాబుకీ జై’’. రథం బయలుదేరింది. నీలమాధవుడు జగన్నాథరూపంలో బలరామదేవునితోనూ, చెల్లెలు సుభద్రాదేవితోనూ విజయుని సారథ్యంలో ఊరేగుతున్నాడు. ప్రతి ఏటా ఆషాఢంలో నిజమందిరాన్ని విడిచి, విడిది మందిరం ‘‘గుడిసెన్న గుడికి’’ రథయాత్ర సాగిస్తాడు.

ధర్మకర్తృత్వం వంశపారంపర్యంగా గంగరాజుకి సంక్రమించింది. ఆ అధికారాన్ని సవాల్‌ చేస్తూ ప్రత్యర్థి వెంకునాయుడు కోర్టులో కేసు పెట్టేడు. రెండేళ్లుగా రథయాత్ర జరక్కుండా కోర్టు నుంచి ఇంజంక్షన్‌ ఆర్డరు తెప్పించి ఆపుచేస్తూ వచ్చాడు. చివరికి గంగరాజే గెలిచాడు. కోర్టులో గెలిచిన విజయోత్సాహంతోనూ, వెంకునాయుడి మీద కసితోనూ భోగరాగాలు అన్నీ గంగరాజే చూసుకుంటున్నాడు. ఎల్లక్షన్లు అతి దగ్గరలో ఉన్నాయి.

రథం మీద పూజారులు జనం అందిస్తున్న కొబ్బరికాయలు కొడుతున్నారు. పూలమాలల్ని విగ్రహాల పాదాల దగ్గరికి విసురుతున్నారు.

‘‘గంగరాజు బాబూ, మనం కాస్త జాగ్రత్తగా వుండాలి. ఎగస్పార్టీ వోళ్లు మనలో కలిసే తిరుగుతున్నారు. చూశారా ఆ గళ్ల చొక్కావోడు.’’

‘‘ఒరే సాంబా! కొండంత మనిషివి నువ్వుండగా, జగన్నాథుడు మన పార్టీ అయివుండగా ఎంకునాయుడు ఎవడ్రా? ఝూటాగాడు.’’

‘‘తగవుకి దిగితే తల తీసేస్తాను గాని, రాజుబాబు, రెండు రోజుల్నించి ఎంకునాయుడు ఇటు ఢిల్లీకి అటు హైదరాబాదుకి తెగ ఫోన్లు కొడుతున్నాడట. ఎవడో నాయకుణ్ని తెప్పించి మీటింగు పెడతాడట’’.

‘‘పెట్టనీరా, జనం బఠానీలు నవులుతూ వింటారు. తరువాత ఇళ్లకి పోతారు. మనం కూడా మలి రథయాత్ర నాడు అన్న సంతర్పణ చేయిస్తున్నాం. ఊరు ఊరంతా రావాలి. పూరీ నుంచి జగన్నాథ ప్రసాదాన్ని కుండల్లో తెప్పించి అందులో కలిపాం అందాం. వస్త్రదానం కూడా చేద్దాం. మరో రెండు వేలు ఖర్చు అవనీ. ప్రసాదం తిని మోసం చేస్తే కళ్లు పోవూ?’’

సాంబడు వెనకాల రథం దగ్గర గోలగా వుంటే అక్కడికి పరుగున వెళ్లేడు. ‘‘తొయ్యండ్రా, తొయ్యండెహే. జోర్సే.’’ రథచక్రాలు క్రీచుక్రీచుమంటూ నేలని రాసుకుంటూ కదలడం లేదు. అప్పటికే వడ్రంగి యినప చట్రాల్ని సుత్తితో కొడుతూ సరిచేస్తున్నాడు. ‘‘ఆవదం బాగా పొయ్యండ్రా’’ సాంబడు. ‘‘ఆదిలోనే ఏమిటీ అవాంతరం?’’ గంగరాజు.

‘‘నాయనా, రాజుబాబూ! ఢక్కువాడు రథం మీద కనిపించడం లేదు. దేవుడికి దిష్టి తగిలిందేమో’’ పక్కనే నిల్చున్న ముసలాయన. ఢక్కువాడి పేరు వినగానే చిన్న సంచలనం బయలుదేరింది. రథం మీద బూతు పాటలు పాడేవాణ్ని ఢక్కువాడు అంటారు. ఆ పాటలన్నీ ఒరియా భాషలో ఉంటాయి. రెండేళ్లుగా జాతర లేకపోవడంతో ఢక్కువాడి సంగతే మరిచిపోయాడు పూజారి. వెంటనే ఒక కుర్రాడు ఢక్కువాడి కోసం గాలిలా పరుగెత్తాడు.

‘‘బాబూ, ఢక్కువాడు రానంటున్నాడు. బ్లడీ భంచోత్‌. దేవుడి తరఫున నువ్వు వస్తావుట్రా, లింగులింగుమంటూ అని గసిరేశాడండి.’’

‘‘ఈ జాతి తక్కువ నా కొడుకుని నేను వెళ్లి బ్రతిమాలాలి కాబోలు’’ గంగరాజు.

‘‘వాళ్లు అలగడం, ధర్మకర్తలు వెళ్లి బ్రతిమాలి తీసుకురావడం ఆచారం’’ అన్నాడు పూజారి.

‘‘ఢక్కువాడికి కొత్తబట్టలు కుర్రాడిని పంపించి తెప్పించండి’’ జేబులో డబ్బు తీసి ఇచ్చాడు గంగరాజు.

ఢక్కువాడి పూరి గుడిసె ఊరవతల ఉంది. ఇంటి చుట్టూ కుళ్లు కాలవల కంపు. వైద్య విద్యార్థుల ముందు శవం ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు, ఏడాదికొకసారి ఢక్కువాడికి ప్రాముఖ్యం లభిస్తుంది. 

‘‘ఢక్కువా ఢక్కువా, పద పదరా రథం ఆగిపోయింది’’ హెచ్చరించేడు గంగరాజు. ఈ అలికిడికి పెరట్లో పనిచేసుకుంటున్న ఢక్కువాడి పెళ్లాం ఆదెమ్మ గబగబ వచ్చి ‘‘దండాలు బాబుగారు, ప్రొద్దుట్నుంచీ తెగ తాగేసి తిరుగుతున్నాడు. తిండి మానేసి కొడుకుని తల్చుకుంటూ తిరుగుతున్నాడు. ఇదిగో ఇనుకో, బాబులొచ్చారు, జాతరకెళ్లెల్లు’’ మొగుడ్ని కుదుపుతూ అంది.

‘‘జాత్తర? నెల రోజుల క్రితం నా కొడుక్కి శ్మశానంలో పెద్ద జాతర చేశాను. ఈ రోజు దేవుడికి జాతర పట్టిస్తాను.’’

‘‘ఏటి బాబులొస్తే మరియాద లేకుండా?’’

‘‘రెండేళ్ల నించి నేను సచ్చానో వున్నానో పట్టించుకోని బాబులు ఈయేళ ఎందుకొచ్చారే?’’

‘‘ఒరే ఢక్కువా, కొత్తబట్టలు తెచ్చేడు. కట్టుకొని బయలుదేర్రా’’ పూజారి గర్జించేడు.

‘‘ఓల్‌రైట్‌’’ కుర్రాడు తెచ్చిన బట్టల్ని అందుకున్నాడు. ‘‘మరి కట్నం?’’

‘‘ఇదుగో ఇరవై’’ చేతిలో పెట్టబోయాడు గంగరాజు.

‘‘నో నో ఫిఫ్టీ డాలర్స్‌. ఏభై లేకపోతే నేను రానెహోయ్‌’’ 

మిగతా ముప్పై కలిపి చేతిలో పెట్టాడు గంగరాజు. తూలుతున్న ఢక్కువాడి జబ్బ పట్టుకుని పెరట్లోకి తీసుకెళ్లింది ఆదెమ్మ. గిన్నెడు తరవాణి తాగించింది. ఆ పులుపుకి మొగమంతా వికృతంగా చిట్లించుకుంటూ బ్రేవ్‌మని తేన్చాడు. ‘‘ఇక్కడ కాదు, నా కొడుకు శవాన్ని స్నానం చేయించిన దగ్గరే నాకూ నీళ్లు పొయ్యి’’ తడబడుతూ వెళ్లి కూర్చున్నాడు.

‘‘ఏభై రూపాయలు ఇలా తే. మనం తిన్నా తినకపోయినా ముందు అప్పులోళ్ల సంగతి చూడు, బజార్లో పట్టుకుని నానా తిట్లు తిడతన్నారు.’’

‘‘అప్పులు చెయ్యడం, తిట్లు తినడం, పస్తులుండటం మనకలవాటేనే. ఈ అప్పు తీరిస్తే మళ్లీ మరో అప్పు. అప్పుడెక్కడ్నుంచి వస్తయి పైసలు. ఈరోజు నేను రాజా. ఈరోజు పోతే రేపు మరి నాకు లేదు. ఫుల్‌గా పఠాసు కొట్తేస్తాను.’’

‘‘తిండికి లేక సస్తుంటే తాగుతానంటా వేంటీ?’’

దూరంగా బాజాల మ్రోత. సన్నాయి మేళం, జేగంటలు దగ్గరవుతూ ఢక్కువాడి ఇంటి ముందర ఆగాయి. ఆదెమ్మ ఒళ్లంతా తుడిచి కొత్తబట్టలు కట్టించింది. కొత్త పంచ, కొత్త తలపాగా. కండువా నడుంకి. చేతి కర్రకి రంగు గావంచ యెత్తి పట్టుకుని వాకిట్లో నిల్చున్నాడు ఢక్కువాడు. గంగరాజు స్వయంగా కాళ్లు కడిగి పూలదండ వేసి నమస్కరించాడు. ఢక్కువాడు రథయాత్రకి  బయలుదేరాడు.

‘‘ఢక్కువాడొచ్చేడు! ఢక్కువాడొచ్చేడు’’ అంటూ జనం చుట్టుముట్టేరు. వాళ్లందర్నీ పక్కుకు నెడుతూ నిచ్చెన వేసి వాడ్ని రథం మీదకు ఎక్కించేరు. తండ్రులు పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని ఢక్కువాడ్ని చూపిస్తున్నారు.

‘‘తైతైతైతై తైతైతైతై’’ అంటూ సంకీర్తన మేలగాళ్లని గొడుగు కర్రని ఆడిస్తూ హెచ్చరించేడు. ‘‘ఢింఢిం తకఢింఢిం’’ ‘‘ఢైంయ్‌ ఢైంయ్‌’’ ‘‘రొధొ ఢీకొ ఢీకొయిలా! మహాప్రాంకొరొ కొండియా నపాయిలా తైతైతై’’ వలయాకారంగా నడ్డి తిప్పుకుంటూ రథం మీద గెంతుతున్నాడు ఢక్కువాడు. బూతు పేలింది. రథచక్రాలు కదిలేయి. ఆ పాటకి అర్థం యేమిటన్నట్లు పూజారికి సంజ్ఞ చేశాడు గంగరాజు. ఒరియా తెలిసిన పూజారి గంగరాజు చెవిలో గొణిగాడు. ముసిముసి నవ్వుకుంటూ సంబరంతో పాటు నడుస్తున్నాడు గంగరాజు. ఢక్కువాడు మరో పాట అందుకున్నాడు. రకరకాలుగా గెంతుతున్నాడు. కోతిలా యెగురుతున్నాడు.

రథం దగ్గర చిన్న గందరగోళం మొదలైంది. గళ్లచొక్కావాడు ‘‘కొబ్బరికాయలు అందిస్తున్న ఆడవాళ్ల చేతులు పట్టుకుంటావా?’’ అని పూజారి పెద్దకొడుకు చొక్కా పట్టుకున్నాడు. ‘‘రౌడీవెధవ, నువ్వు చూశావురా?’’

సాంబడు రథస్తంభం పట్టుకుని ఎగిరి గళ్ల చొక్కావాణ్ని జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. ‘‘సంబరం భగ్నం చేయడానికి పితూరీ లేవదీస్తున్నావా? ఎంకునాయుడు ఎంగిలి కూడు కతికి జగడానికి వస్తావా?’’ క్రిందపడేసి ఈడ్చి ఈడ్చి తంతున్నారు. వాడి పార్టీ వాళ్లు బలం చాలక జారుకున్నారు.

బాజాలు మ్రోగుతున్నాయి. ఈ సందడిలో ఢక్కువాడు దిగిపోయేడు. సీసా తీసి డగ్‌ డగ్‌ మని గుటకలు వేసి మూతి తుడుచుకున్నాడు. ‘‘నేను దరిద్రపు నా కొడుకుని. నా బాబూ తాతలందరూ దరిద్రంతో బతికి ఆకలితో సచ్చారు. తరతరాల నుంచి మా బూతులు యింటూ కులాసా పడిపోతున్న దేవుడు మా ఆకలి తీర్చాడా? నా కొడుకును రచ్చించాడా?’’ ఢక్కువాడి కంఠం రుద్దం అవుతోంది. ‘‘నా కొడుకు పోయాడు నాయనా, ఆరు నెలలు రోగంతో తీసుకుని మందుల్లేక తిండిలేక తడపలా అయిపోయి, బిళ్ల బిళ్లలు రకతం కక్కుకుంటూ సచ్చిపోయేడు. నా పద్దెనిమిదేళ్ల కొడుకు ఎలిపోయాడు నాయనా’’ గొల్లున ఏడుస్తూ కూలిపోయాడు. సాంబడు వాడ్ని ఓదారుస్తూ రథం యెక్కించి వెనకాల ఎవరికీ కనబడకుండా పడుకోబెట్టాడు.

చీకటి పడింది. గేస్‌లైట్లు, దివిటీలు వెలిగించారు. గుడిసెన్న గుడి దగ్గర పడుతుందనగా ధన్‌మని సోడాబుడ్డి పేలింది. నలువైపుల నుంచి రాళ్లవర్షం. జనంలో గోల. గళ్ల చొక్కావాడు సైకిల్‌ చెయిన్‌తో సాంబడ్ని కొట్టాడు. చెట్టులా పడిపోయేడు సాంబడు. పూజారులు గెంతేసి పరుగు లంకించుకున్నారు. ‘‘ఎలక్షన్‌ కార్యాలయానికి నిప్పింటించేరు’’ అరిచేడు జనంలోంచి వెంకునాయుడు పార్టీవాడు. క్షణంలా వూరంతా పాకిపోయింది వార్త. కొన్ని యిళ్లు తగలబడుతున్నాయి. గళ్లచొక్కావాడిని ఎవరో కత్తితో పొడిచేరు. ధన్‌ ధన్‌ ధన్‌– గాలిలో తుపాకుల కాల్పులు. పోలీసులు పోలీసులు. అరగంటలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గంగరాజునీ, వెంకునాయుణ్నీ అరెస్టు చేశారు. కరెంట్‌ కట్‌ చేశారు. కర్ఫ్యూ విధించారు. 

రథాన్ని గుడిసెన్న గుడికి తీసుకురావడానికి పోలీసుల బలగం బయలుదేరింది. పోలీసుల్ని పురమాయిస్తూ ఇన్‌స్పెక్టరు రథం మీదికి టార్చిలైటు వేశాడు. ఒక మానవ కళేబరం రథానికి వేలాడుతోంది. ఢక్కువాడు కొత్త కండువాతో ఉరిపోసుకున్నాడు.

తరువాతి కథ: గంగరాజు, వెంకునాయుడు తిరిగి జనాల్లోకి వచ్చారు. ప్రతీ సంవత్సరం వైభవంగా రథయాత్ర జరుగుతూనే ఉంది. వెంకునాయుడు, గంగరాజు రొటేషన్‌ పద్ధతిలో ఎంఎల్‌ఏలు అవుతూనే ఉన్నారు. పాత రథం స్థానే కొత్త రథం వచ్చింది. ఢక్కువాడి పీనుగుతో మైలపడిన పాత రథాన్ని ఊరవతల పడేశారు. చుట్టుపక్కల వాళ్లకి అప్పుడప్పుడూ ఊరవతల నించి అర్ధరాత్రివేళ స్పష్టాస్పష్టంగా ఏవో పాటలు, ఏడుపులు వినిపిస్తుంటాయట! 


(సాక్షి సాహిత్యం; 24 సెప్టెంబర్‌ 2018)