Monday, February 16, 2026

రచయిత సహజ లక్షణం




సహజ గుణం

తెలుగులో ఇటీవల అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’. దీనికంటే ముందు ‘నా ఇష్టం’, ‘విజయానికి ఐదు మెట్లు’ లాంటివి బెస్ట్‌ సెల్లర్స్‌. అత్యధిక పునర్ముద్రణలు పొందినవాటిల్లో ‘మహాప్రస్థానం’, ‘వేయి పడగలు’ లాంటివి ఉంటాయి. పోటీ పరీక్షలకు చదవాల్సి వచ్చేవో, ఉపవాచకాలుగా నిర్దేశించినవో కూడా మంచి అమ్మకాలే సాధిస్తాయి. కానీ ఇవన్నీ మినహాయింపులు మాత్రమే. సాధారణంగా తెలుగు సాహిత్యంలో బాగా అమ్ముడైన పుస్తకాలంటే వేసిన వెయ్యి కాపీలు మిగలకుండా పోయినవే! ఇప్పుడా వెయ్యీ లేకుండా ఐదొందలు, మూడొందలు, ఆఖరికి వంద కాపీలు ముద్రించుకునే అవకాశం వచ్చింది. లక్ష కాపీలు అమ్ముడుపోవడం అనేది ఏ తెలుగు రచయితైనా కనే పగటి కల మాత్రమే. నిజంగానే లక్ష కాపీలు అమ్ముడైనా ఆ రచయితను మొత్తం తెలుగు జనాభాలో ఎంతమంది చదివినట్టు? సుమారు 0.1 శాతం! ఇలాంటి లెక్కల్నే ఆంగ్ల రచయితలకు అన్వయిస్తూ, ‘‘మీ పుస్తకాన్ని ఎవరూ చదవరు. ఇది అవమానించడం కాదు. ఇది లెక్కలపరమైన వాస్తవం’’ అంటారు పబ్లిషర్‌ స్టీఫెన్‌ స్పార్క్స్‌. ఆయన ప్రకారం, ఏ రచయిత వ్యాప్తి అయినా నామమాత్రమే. అందుకే గొప్పగా రాసివుండీ ఎవరూ చదవని రచయితల గురించి ‘రైటర్స్‌ నో వన్‌ రీడ్స్‌’ పేరుతో టంబ్లర్‌ పేజీ నడుపుతున్నాడు విల్‌ షొఫీల్డ్‌. ఈ రచయితలు గొప్ప రచయితలయ్యింది వాళ్ల అమ్మకాల వల్ల కాదు, వాళ్లది ఎంత ఒరిజినల్‌ రైటింగ్‌ అన్నదాన్నిబట్టి! ‘‘మరిచిపోయిన, నిర్లక్ష్యానికి గురైన, వదిలివేయబడిన, మరుగున పడిన, తక్కువగా అనువదింపబడిన రచయితలను వెలుగులోకి తేవడం...’’ అని షొఫీల్డ్‌ చెప్పింది తెలుగులోనూ చాలామంది రచయితలకు వర్తిస్తుంది.

‘మహా వేధ’ నవల రాసిన చివుకుల పురుషోత్తంను ఎవరైనా తలుచుకుంటున్నారా? కథకుడు అల్లం శేషగిరిరావు స్థాయికి తగిన గుర్తింపు ఉందా? తొలితరం యాక్టివిస్టు–రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మకు ఎన్ని విగ్రహాలు పెట్టారు? దళిత ఉనికితో కాకుండా నాగప్పగారి సుందర్రాజును గుర్తుచేసుకోవడం జరుగుతోందా? ‘చంఘిజ్‌ఖాన్‌’ను తెలుగు నేల మీద నిలబెట్టిన తెన్నేటి సూరికి ఎవరైనా హారతులు పడుతున్నారా? గుర్తింపు ఉన్న రచయితలు అనుకునేవాళ్లకు కూడా పెద్దలెక్కల్లో ఏ గుర్తింపూ లేనట్టే! ఇక అచ్చుకే ‘నోచుకొని’ రచయితల సంగతి? ప్రపంచ వ్యాప్తంగా విస్మరించలేని రచయిత అయిన ఫ్రాంజ్‌ కాఫ్కా రచనలు అతడు బతికివుండగా పెద్దగా అచ్చుకాలేదు. ఎమిలీ డికిన్సన్‌ కవిత్వమూ అంతే. ‘నువ్వు లేని అద్దం’ నవల ద్వారా కొత్త ఆసక్తికి కారణమైన చిత్రకొండ గంగాధర్‌ పుస్తకాలేవీ అతడు తన నలభైల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అచ్చుకాలేదు. మరి చదువుతారన్న గట్టి హామీ లేనప్పుడు కూడా రచయితలు ఎందుకు రాస్తున్నారు? వాళ్లను నడిపించే ఆ జీవలక్షణం ఏమిటి?

‘‘నా రచనకు ఆరంభ బిందువు ఎల్లప్పుడూ ఒక పక్షపాతం, ఒక అన్యాయ భావనే... నేను రాస్తాను– ఎందుకంటే బయటపెట్టవలసిన ఏదో అబద్ధం ఉంటుంది, చూపించవలసిన ఏదో నిజం ఉంటుంది’’ అంటాడు జార్జ్‌ ఆర్వెల్‌. ‘‘ప్రతి వ్యక్తి ఆత్మ తాలూకు వైశిష్ట్యాన్ని స్పష్టంగా చూపించటం నవలాకారుడి బాధ్యత అని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అంటాడు హరూకీ మురకామి. ‘‘రచన నా శరీరానికి పొడిగింపు’’ అంటారు నటాలీ డయాజ్‌. ‘‘మనిషిగా ఉండే ఒక పార్శా్వన్ని చూపించడం’’ కోసం రాస్తానంటాడు కజువో ఇషిగురో. కీర్తి కోసం అని విలియమ్‌ ఫాక్‌నర్‌ బోల్డుగా చెప్పేయొచ్చు; నాలుగు డబ్బుల కోసం అని ఇంకో రచయిత ఒప్పేసుకోవచ్చు. కానీ ప్రతి రచయితకూ భిన్న కారణం ఉంటుంది. అసలు ఏ కారణమూ ఉండకపోవచ్చు. ‘సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అని కృష్ణశాస్త్రి అన్నట్టుగా– రాయడం అనేది రచయిత సహజ లక్షణం. వాళ్లు రాయగలుగుతారు కాబట్టి రాస్తారు. రాయకుండా ఉండలేరు గనుక రాస్తారు. లోకం మీది ప్రేమతో దాన్ని జనానికి కానుక చేస్తారు.

 

Saturday, January 31, 2026

మంచి పుస్తకం చదివాను అన్న ఆనందం



 (గంగరాజం బిడ్డ పుస్తకం మీద డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల ట్విట్టర్లో చేసిన పోస్ట్)


గంగరాజం బిడ్డ (3/2026)

అసలు నేను ఇలాంటి పుస్తకాలు చదవను, ఖాళీగా ఉంటే మొదటి కథ చదివాను, చాలా విసుగ్గా అనిపించింది. ఇంకా ఖాళీగా ఉంటే ఇంకో కథ చదివాను. ఇదేదో బాగుందే అనిపించింది. ఎప్పుడూ పూరీ జగన్నాథ్ సినిమాలు చూసేవాడికి ఒకేసారి విశ్వనాథ్ సినిమాలు చూస్తున్నట్లు అనిపించింది. తర్వాత అన్ని కథలూ చదివాను.

తెలంగాణ మాండలికం ఈ ఉత్తరాంధ్రా వాడికి కొంత అర్థం కాకపోయినప్పటికీ, ఈ కథల్లో నా బాల్యాన్ని నేను చూసుకున్నాను. పల్లెలు, వాటిలోని మనుషులు, వాళ్ళ బ్రతుకులు అన్నీ అలవోకగా మనమక్కడే వాళ్ళమధ్యనే ఉండి వాళ్ళందర్నీ చూస్తున్నట్లుగా ఉంది ఈ పుస్తకం చదువుతూ ఉంటే.

ఈ పుస్తకంలో నాకు తెలియని తెలంగాణా మాండలికంలోని పదాలను అడిగి తెలుసుకున్నాను. చదివిన తర్వాత ఒక రకమైన సంతృప్తి. ఎక్కడో ఎప్పుడో వదిలేసిన బాల్యం, హాస్టల్ జీవితం, కౌమారం అన్నీ మళ్లీ ఉప్పెనలా ఎగిసాయి.

రచయిత పూడూరి రాజిరెడ్డి చాలా ఇబ్బందికరమైన విషయాలని చాలా సరళంగా ఈ కథల్లో రాసేశారు. అవి చదివేటప్పుడు ముఖం మీద ఒక చిరునవ్వు మెరుస్తుంది. ఈ కథల్లో ఏవో గొప్ప మలుపులు, ముగింపులు ఉండవు, అన్ని కథల్లో రచయిత మనల్ని చేయి పట్టుకుని అక్కడికి తీసుకెళ్లి అన్నీ చూపిస్తూ మనకొక అనుభూతిని అందిస్తారు. అంతే అనుభూతి మాత్రమే.

ఒక మంచి పుస్తకం చదివాను అన్న ఆనందం ఇంకా సంతృప్తి.

Thursday, January 29, 2026

ఆడ పువ్వు మగ పువ్వు

 ఆనిగెపు / సొర తీగకు ఆడ పువ్వు మగ పువ్వు


మగ పువ్వు


ఆడ పువ్వు


Tuesday, January 27, 2026

గురివింద గింజలు (నిజం గింజలు)

గురివింద గింజలు. ఎప్పుడో చిన్నప్పుడు చూసినుంటి. మళ్లీ ఇన్నేండ్లకు మా పాత బాయిగడ్డకే కనబడ్డాయి. 


కాయ 


తీగ 


గింజలు




Monday, January 19, 2026

అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌


భారత ప్రజలమైన మేము...


పుస్తకం:
అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌: ఎ న్యూ డెమాక్రటిక్‌ హిస్టరీ

రచయితలు:
రోహిత్‌ డే
ఆర్నిట్‌ శని

–––––––––––––––––––––

1946 డిసెంబర్‌ 9న సరిగ్గా 11 గంటలకు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌లో రాజ్యాంగ సభ మొదటిసారిగా సమావేశమైంది. ఈ సభలోని సుమారు 300 మంది సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైనవారు కాదు. బ్రిటిష్‌ ఇండియా ప్రావిన్సుల్లోని శాసనసభలు ఎంపిక చేసినవారు. మూడేళ్లలో 5,546 పేజీల చర్చలు జరిపి, ఈ రాజ్యాంగ సభ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు ఈ మొత్తానికైన ఖర్చు రూ.47 లక్షలు. అయితే ఈ రాజ్యాంగ సభకు వెలుపల రాజ్యాంగం కోసం పడిన భిన్న ఆరాటాలను వివరించే పుస్తకం: ‘అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌’. ఈ 400 పేజీల పుస్తకం ఒకప్పుడు దేశాన్ని పట్టిన రాజ్యాంగ జ్వరాన్ని కళ్లకు కడుతుంది.

రాజ్యాంగ ప్రక్రియలో కేవలం మేధావులు మాత్రమే పాల్గొనలేదనీ, ఇంకా ‘ఇండియా’గా రూపుదిద్దుకోని భారత నేల నలుమూలలలో ఉన్న సకల జనాలు చురుగ్గా పాలుపంచుకున్నారనీ చెబుతారు రచయితలు. స్వతంత్ర భారతంలో తమకు ఏం కావాలో, తాము ఎలాంటి పాలన కోరుకుంటున్నారో బలూచిస్తాన్‌ నుంచి బెజవాడ వరకు వేలాది మంది పౌరులుగా, సంఘాలుగా, తెగలుగా, పార్టీలుగా, అధికార ప్రతినిధులుగా, ట్రేడ్‌ యూనియన్లుగా తమ సంతకాలతో, వేలిముద్రలతో పంపిన అభ్యర్థనలను, అభిప్రాయాలను తవ్వితీసి, ఈ ఉత్సాహపూరిత ప్రజాకోణాన్ని అంతే ఆసక్తికరంగా వెల్లడించారు రచయితలు. ఉదాహరణకు గౌహతి నుంచి నలిన్‌కాంత బర్కాకటి పంపిన చిన్న కాగితం రాజ్యాంగ సభ సచివాలయానికి 1947 జనవరి 8న అందింది. ‘రాజ్యాంగ విషయాల్లో తన అజ్ఞానాన్ని మన్నించమంటూనే’, ఏ శాసనసభ్యుడినైనా ఎప్పుడైనా ‘రీకాల్‌’ చేసే హక్కు ఓటర్లకు ఉండాలని అతడు రాశాడు. అంటరానితనాన్ని నిర్మూలించకుండా సమైక్య భారతదేశం సాధ్యం కాదని వజీరిస్తాన్‌లోని బన్నూ నుంచి ప్రజా ప్రతినిధి కోటూ రామ్‌ కోరాడు. మహిళలకు సమాన హక్కులు; మరణశిక్ష రద్దు; జైనులు, బేనె ఇజ్రాయెలీ యూదులతో సహా మైనారిటీల హక్కులు; నగర బాలురతో సమానంగా గ్రామీణ పిల్లల హక్కుల లాంటివే కాదు, ‘చెవిటి మూగ’ వారికి ప్రత్యేక గ్యారంటీలు, విశ్వకర్మలకు ఫీజుల్లో రాయితీలు కోరుతూ కూడా లేఖలు అందాయి. విచిత్రంగా తమ లేఖల ద్వారా రాజ్యాంగ సభకు జనమే చట్టబద్ధత కల్పించారంటారు రచయితలు.

‘ఆచరణాత్మక’ కారణాల వల్ల, తొలుత రాజ్యాంగ చర్చలను రహస్యంగానే ఉంచదలిచిన పెద్దలు ఈ ప్రజాబాహుళ్యపు ఒత్తిడితో రాజ్యాంగం ఏ రూపం తీసుకుంటుందో బహిరంగపరచదలిచారు. 1948 ఫిబ్రవరి 26న ప్రచురించిన డ్రాఫ్ట్‌ కాన్‌స్టిట్యూషన్‌(ఆంగ్లం) బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. వెల: ఒక్క రూపాయి. ఇది చెల్లించలేనివాళ్లు అణాతో 24 పేజీల సారాంశం చదువుకోవచ్చు. వారంలోనే దీన్ని దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించడానికి అనుమతులు కోరుతూ లేఖలు రాసాగాయి. కె.జి.చౌబాల్‌ అనే మరాఠీ జర్నలిస్టు ‘మాతృదేశ సేవ’ కోసం తన సేవలను వాడుకోవాలని రాశాడు. రేడియోలోనే కాదు, గుళ్లు, మసీదులు, చర్చులు, ట్రేడ్‌ యూనియన్లు, శరణార్థి శిబిరాలు కూడా రాజ్యాంగాన్ని చర్చించడానికి వేదికలయ్యాయి.

ఈ పుస్తకం వెల్లడించే మరో కోణం, ‘ఇండియన్‌ యూనియన్‌’కు సమాంతరంగా, అప్పటికి స్వతంత్రంగానే ఉండదలిచిన సంస్థానాల్లో కూడా రాజ్యాంగ రచన ఎలా జరిగిందో వివరించడం. సంస్థానాలకు రాజ్యాంగ సభ 93 ప్రాతినిధ్య స్థానాలను ఇచ్చినప్పటికీ, తమను తాము ప్రజాస్వామీకరించుకోవడంలో భాగంగా అవి ఈ ప్రక్రియ చేపట్టాయి. రాంపూర్‌ పాలకుడు తన ప్రజలకు భావస్వేచ్ఛతో సహా తొమ్మిది ప్రాథమిక హక్కులను ప్రసాదించాడు. రత్‌లామ్‌ రాజ్యాంగం ఉచిత ప్రాథమిక విద్యను రాజ్య బాధ్యతగా పేర్కొంది. మణిపుర్‌ రాజ్యాంగం భారత రాజ్యాంగానికన్నా మూడేళ్ల ముందే అందరికీ ఓటుహక్కును కల్పించింది. ‘మేము ఇప్పటివరకు తమ సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకున్న 75 సంస్థానాలను గుర్తించాం’ అంటారు రచయితలు.

ఇంకా న్యాయమూర్తులు ఎలా ఇందులో భాగమయ్యారు; ట్రూమన్‌తో సహా అమెరికా, యూకే, ఐర్లాండ్, కెనడా నాయకులు, న్యాయనిపుణుల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం ద్వారా రాజ్యాంగపు ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ రూపొందించిన సర్‌ బి.ఎన్‌.రావు ఇండియా రాజ్యాంగాన్ని ‘ప్రపంచ వేదిక’కు ఎలా పరిచయం చేశారు; ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులు తమ హక్కుల కోసం ఎలా నిలబడ్డారు లాంటి అంశాలను విపులంగా చర్చించిన ఈ పుస్తకం రాజ్యాంగపు బహుముఖ పార్శా్వలను తెలుసుకోగోరేవారికి ఆసక్తి కలిగిస్తుంది. కోట్ల మంది ఆశలను ఒక దగ్గర గుదిగుచ్చడం ఎంత దుర్భరమో, అబ్బురమో కూడా అర్థమవుతుంది. తర్వాత జరిగిన ఎన్నో రాజ్యాంగ సవరణలు కూడా ఈ ప్రజా చైతన్యపు కొనసాగింపే.

– ఎడిటోరియల్‌ టీమ్‌

(6 జనవరి 2025)