Thursday, April 16, 2026

చిన్న చిన్న విప్లవాలు


విప్లవ స్వరూపాలు


ఆంధ్ర పంచకావ్యాలలో వసుచరిత్ర ఒకటి. ఇందులో తెలుగు పద్యరచన పరాకాష్ట పొందినదని చెబుతారు. 16వ శతాబ్దానికి చెందిన రామరాజ భూషణుడు ఈ కావ్యకర్త. ఈయనకే భట్టుమూర్తి అని మరోపేరు. ఆ పేరుతో నరస భూపాలీయం రచించాడు. రామరాయల ఆశ్రయంతో రామరాజ భూషణుడయ్యాడు. ఈయన చిత్రకవితా నిపుణుడు కూడా. అష్టావధానానికీ ఈయనే మూల పురుషుడని పెద్దల మాట. పదము, క్రమము, ఘన, జట మొదలైన అష్ట విధాలుగా వేద పండితులు వేదావధానము చేస్తున్నప్పుడు, తానూ ఆ ప్రజ్ఞను చూపాలని ఉత్సాహపడి, ద్విజుడు కానందువల్ల సాహిత్యపరంగా ఆ ప్రక్రియను అవలంబించాడట.

ఇంగ్లీషు చదువుకుంటే ‘స్వధర్మభ్రంశం తటస్థిస్తుందన్న’ భయం ఉన్న ఇంట్లో జన్మించాడు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆ ఇంగ్లీషు నేర్చుకోలేనందుకు ఎంతో బాధపడతాడు కూడా. కానీ ఆ ఇంగ్లీషు ఆహార్యాన్ని ఆనందంగా స్వీకరించాడు. అప్పట్లో చదువుకున్న కొంతమంది అబ్బాయిలు పిలకలు కత్తిరించుకొని క్రాపింగ్‌ చేయించుకోవడం మొదలుపెట్టారు. వారిని చూసి శ్రీపాదకూ అలాంటి కోరిక కలిగింది. ఒకరోజు క్షురకుడి దగ్గరకు వెళ్లి పిలకను పూర్తిగా కత్తిరించి క్రాపింగ్‌ చేయించుకున్నాడు. ఇంటికి రాగానే తండ్రి గమనించాడు. తలపై పిలక కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయి ‘అయ్యో! పిలక కత్తిరించేశావా?’ అన్నాడట.

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక సంస్కర్త, సూతపురాణం కర్త త్రిపురనేని రామస్వామి తన పేరు చివరి ‘చౌదరి’ అనే కులచిహ్నాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశాడు. కమ్యూనిస్టు భావజాల ప్రభావంతో పుచ్చలపల్లి సుందరయ్య తన పేరులో రెడ్డిని తొలగించుకోవడమే కాకుండా, ఉద్యమ జీవితానికి పూర్తిగా అంకితమవ్వాలనే నిర్ణయంతో సంతానం లేకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా వాసెక్టమీ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. అలా సంతానం లేకుండా ఉండే నిర్ణయాన్ని ఆయన భార్య లీల కూడా అంగీకరించారు. 1942లో భూస్వామ్య సమాజంలోని స్త్రీల జీవితంలోని ఉక్కపోతనూ, వాళ్ల మధ్య ఏర్పడే అనివార్య సాన్నిహిత్యాన్నీ చూపిన ‘లిహాఫ్‌’ కథ రాసిన ఇస్మత్‌ చుగ్తాయి లాహోర్‌ కోర్టు మెట్లు ఎక్కడానికీ వెనుకాడలేదు.

అదంతా పెద్ద మనుషుల కాలం. పెద్ద త్యాగాలకు సమాజాలు సిద్ధపడిన కాలం. పెద్ద పోరాటాలకు తగినంత దృఢ సంకల్పం ఉన్న కాలం. ముందు సమాజం, ఆ తర్వాతే నేను అనుకున్న కాలం. మనుషులు అలాంటి విలువల్ని నెత్తిన పెట్టుకున్న సత్యకాలం. ఇప్పుడు కాలం మారింది. విలువలు అలాగే ఉన్నాయి కానీ వాటి మీద అభిప్రాయాలు మారిపోయినై. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అనే వ్యవహారం సరిగ్గా సరిపోయే కాలం. కానీ ఎంత శుద్ధి చేసినా పోని మురికిలా సంఘంలో సమస్యలు చాలానే ఉన్నాయి. ఈ కాలానికి తగినట్టుగా, చిన్న చిన్న విప్లవాలు ఇప్పటి అవసరమని చెబుతాడు ఒక కథలో ఉణుదుర్తి సుధాకర్‌. కాలనీ పార్కులో మూత్రం పోయించే కుక్క యజమానిని నిలదీయడం, పెద్ద శబ్దంతో అపరాత్రి మోగే మైకు మీద ఫిర్యాదు చేయడం, సైలెన్సర్‌ తొలగించిన బైకును అడ్డుకోవడం, పొగ చిమ్మకుంటూ పోతున్న ఆటోను ఫొటో తీయడం, సీట్లో లేని ఉద్యోగిని ప్రశ్నించడం, ఆహార కల్తీ మీద ఉప్పందించడం, నోటీసు ఇవ్వకుండా ఇంటిమీదికొచ్చే బుల్‌డోజర్‌కు ఎదురునిలవడం... అన్నీ చిన్న చిన్న విప్లవాలు. పెద్ద త్యాగాలు చేయకుండానే చిన్న మార్పునైనా సాధ్యం చేసే విప్లవాలు.

2026 మార్చి వరకు మావోయిస్టు ఉద్యమాన్ని లేకుండా చేస్తామన్న మాటకు గడువు దాటిపోయింది. సాంకేతికంగా అది అంతమైపోయిందా? రూపం మార్చుకుంటుందా? ఆ మనుషులు ఇంకే దారుల్లో వ్యక్తమవుతారు? సిద్ధాంత ఆచరణలు రూపు మార్చుకుంటాయేమోగానీ సమస్యలు ఉన్నంతవరకూ ప్రజాగ్రహం ఉంటూనే ఉంటుంది. ప్రజాగ్రహం ఉన్నచోట ఏదో ఒక చిరు విప్లవం మొలుస్తూనే ఉంటుంది. తార్కిక హేతువుకు అందినంతవరకూ, వద్దన్నది వదలకుండా చేయడం కూడా విప్లవమే. సంక్షుభిత కల్లోల సమయాల్లో సాటివాడి మీద కరుణ చూపడం కూడా మేలైన విప్లవ చర్యే! 

(6-4-2026)

Friday, April 3, 2026

ఐజాక్‌ బేబెల్‌: పేరు మాయని మనిషి


పేరు మాయని మనిషి


అసలైన సాహిత్యజీవికి వర్తమానం ఎలాంటి కిరీటమూ పెట్టకపోవచ్చు, కానీ చరిత్ర అతడిని తగిన విధంగా ఆశీర్వదిస్తుందనడానికి ఐజాక్‌ బేబెల్‌ జీవితమే ఉదాహరణ. అయితే ఆ వర్తమానపు విషాదం చరిత్ర ఎప్పటికీ తుడుచుకోలేని మచ్చ. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌లో జన్మించిన ఈ యూదు తన మాతృభాష యిడ్డిష్‌ను కాదని రష్యన్‌ను రచనా భాషగా ఎంచుకున్నాడు. సోవియట్‌ రష్యా ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచాడు. పోలిష్‌–సోవియట్‌ యుద్ధ సమయంలో రచయిత గోర్కీ సూచన మీద పాత్రికేయుడిగా పనిచేసిన బేబెల్‌ ఆ యుద్ధం తాలూకు చీకటి, బీభత్సాల చేదు వాస్తవికతను ‘రెడ్‌ కావల్రీ’ కథలుగా అందించాడు. 1926లో తొలిసారి ప్రచురితమైన ఈ కథలకు ఇది శతాబ్ది సంవత్సరం.

అత్యంత సంక్షిప్తంగా రాయడం, ఉన్నట్టుండి కథను మరో తలంలోకి కొనిపోవడం, ‘సాల్ట్‌’ కథ గురించి బోర్హెస్‌ అన్నట్టు– కవిత్వానికే సాధ్యమై మననానికి వీలుండే లయను కథలో సాధించడం బేబెల్‌ గొప్పతనం. రెడ్‌ కావల్రీ, తను పుట్టి పెరిగిన ఒడెస్సా పట్టణం నేపథ్యంలో ‘ఒడెస్సా స్టోరీస్‌’, ఇంకా రెండు నాటకాలు, ఒక సినిమాకు స్క్రీన్‌ప్లే మాత్రమే రాసిన బేబెల్‌(1894–1940) వచనంలో కరుణ, కాఠిన్యం కలగలసి మనసును మెలిపెడతాయి. యుద్ధభూమి తాలూకు బహుముఖ పార్శా్వలనూ, అత్యంత సున్నితమైన మనిషి కూడా అనూహ్య కార్యాలకు సిద్ధమయ్యే విపరిణామాలనూ ఆయన చిత్రించాడు. సాధారణ జీవితం గడపాలని కోరుకుంటూ రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న నిస్సహాయ మానవులు అందులో కనబడతారు. చావు వాసన వేసే కథలు ఆయనవి! యుద్ధం అనేది యుద్ధ క్షేత్రానికే పరిమితమై ఉండదని కూడా ఈ కథలు చెబతాయి.

కమ్యూనిస్టు వ్యతిరేకి కాకపోయినా బేబెల్‌ ప్రాపగాండా వ్యతిరేకి. దాంతో విమర్శను తట్టుకోలేని రాజ్యం ఆయన్ని సోవియట్‌ యూనియన్‌లో ‘నాన్‌–పర్సన్‌’ చేయడానికి పూనుకుంది. 1933 నుంచే ఆయన పుస్తకాలను ఉపసంహరించడం మొదలైంది. స్టాలిన్‌ హయాంలోని ‘సామ్యవాద వాస్తవికత’కు తగ్గట్టుగా రచయితలు తమ పాత రచనలను తిరగరాస్తున్న వేళ, తనను తాను సరిచేసుకోవడం ఇష్టంలేని బేబెల్‌ మౌనం అనే కొత్త సాహిత్య ప్రక్రియలో రాణిస్తున్నానని చెప్పుకొన్నాడు. ఇక ‘ప్రజా శత్రువు’గా అరెస్టయిన తర్వాత బేబెల్‌ మీద ట్రాట్స్‌కీయిస్టు, ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి కేసులు పెట్టారు. ఆయన పేరును సాహిత్య నిఘంటువుల్లోంచీ, ఎన్‌సైక్లోపీడియాలోంచీ తొలగించారు. ఆయన గురించి ఏ సాహిత్య కార్యక్రమంలోనూ ఎత్తడానికి లేదు. బేబెల్‌ అనే మనిషి లేనట్టుగానే వ్యవహరించారు. ఆధునిక సోషల్‌ మీడియా యుగంలో జడలు విప్పిన ‘క్యాన్సిల్‌ కల్చర్‌’ అనేదానికి ఆ కాలంలో బీజాలున్నాయి. 1940 జనవరి 16న పార్టీకీ, సోవియట్‌ ప్రభుత్వానికీ శత్రువులైన 457 మంది జాబితా స్టాలిన్‌కు అందింది. అందులో బేబెల్‌ సహా 346 మందిని కాల్చేయాలన్న సిఫారసు ఉంది. జనవరి 27న మధ్యాహ్నం 1:30కు 45 ఏళ్ల బేబెల్‌కు కాల్చివేత శిక్ష అమలైంది. బేబెల్‌ సమగ్ర రచనలను ఆంగ్లంలోకి అనువదించిన పీటర్‌ కాన్‌స్టంటీన్‌ ఈ మరణ శిక్షను ‘ఇరవయ్యో శతాబ్ద సాహిత్యపు అతి దారుణ విషాదాల్లో ఒకటి’గా అభివర్ణించారు. 1954లో కృశ్చేవ్‌ పాలనలో బేబెల్‌ను నిరపరాధిగా ప్రకటించిన తర్వాతగానీ ఆయన రచనలు మళ్లీ వెలుగు చూడలేదు.

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌ తన గతాన్ని పునఃసమీక్షించుకుంటూ, కొత్త చరిత్రను లిఖించకుంటున్న వేళ, అక్కడి మేధావర్గంలో బేబెల్‌ మీద సంక్లిష్ట స్పందన ఉంది. కానీ ’(ఉక్రెయిన్‌) అంధత్వం, అశక్తత, ఆ ఆశక్తత లోంచి పుట్టిన తెలియని కఠినత్వం’ గురించి రాసిన బేబెల్‌ సృజన విస్మరించలేనిదని పొలిటికల్‌ సైంటిస్ట్‌ వాలెంటీన్‌ బుషాన్‌స్కీ అంటారు. ఒక దిశ లేకుండా పుస్తకాలు చదువుతున్న భార్య ఆంటోనినా పీరుష్కోవాకు అనవసర పుస్తకాల మీద సమయం వృథా చేసుకోకుండా ముఖ్యమైన క్లాసిక్స్‌ ఏవి చదవాలో ఒక జాబితా ఇస్తాడు బేబెల్‌. చదవడం ఎంత ముఖ్యమో, ఏవి చదవాలో తెలియడం అంతకన్నా ముఖ్యం. ఆ జాబితాలో మనం బేబెల్‌ను కలుపుకోవచ్చు.

(9-3-2026)

Monday, February 16, 2026

రచయిత సహజ లక్షణం




సహజ గుణం

తెలుగులో ఇటీవల అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’. దీనికంటే ముందు ‘నా ఇష్టం’, ‘విజయానికి ఐదు మెట్లు’ లాంటివి బెస్ట్‌ సెల్లర్స్‌. అత్యధిక పునర్ముద్రణలు పొందినవాటిల్లో ‘మహాప్రస్థానం’, ‘వేయి పడగలు’ లాంటివి ఉంటాయి. పోటీ పరీక్షలకు చదవాల్సి వచ్చేవో, ఉపవాచకాలుగా నిర్దేశించినవో కూడా మంచి అమ్మకాలే సాధిస్తాయి. కానీ ఇవన్నీ మినహాయింపులు మాత్రమే. సాధారణంగా తెలుగు సాహిత్యంలో బాగా అమ్ముడైన పుస్తకాలంటే వేసిన వెయ్యి కాపీలు మిగలకుండా పోయినవే! ఇప్పుడా వెయ్యీ లేకుండా ఐదొందలు, మూడొందలు, ఆఖరికి వంద కాపీలు ముద్రించుకునే అవకాశం వచ్చింది. లక్ష కాపీలు అమ్ముడుపోవడం అనేది ఏ తెలుగు రచయితైనా కనే పగటి కల మాత్రమే. నిజంగానే లక్ష కాపీలు అమ్ముడైనా ఆ రచయితను మొత్తం తెలుగు జనాభాలో ఎంతమంది చదివినట్టు? సుమారు 0.1 శాతం! ఇలాంటి లెక్కల్నే ఆంగ్ల రచయితలకు అన్వయిస్తూ, ‘‘మీ పుస్తకాన్ని ఎవరూ చదవరు. ఇది అవమానించడం కాదు. ఇది లెక్కలపరమైన వాస్తవం’’ అంటారు పబ్లిషర్‌ స్టీఫెన్‌ స్పార్క్స్‌. ఆయన ప్రకారం, ఏ రచయిత వ్యాప్తి అయినా నామమాత్రమే. అందుకే గొప్పగా రాసివుండీ ఎవరూ చదవని రచయితల గురించి ‘రైటర్స్‌ నో వన్‌ రీడ్స్‌’ పేరుతో టంబ్లర్‌ పేజీ నడుపుతున్నాడు విల్‌ షొఫీల్డ్‌. ఈ రచయితలు గొప్ప రచయితలయ్యింది వాళ్ల అమ్మకాల వల్ల కాదు, వాళ్లది ఎంత ఒరిజినల్‌ రైటింగ్‌ అన్నదాన్నిబట్టి! ‘‘మరిచిపోయిన, నిర్లక్ష్యానికి గురైన, వదిలివేయబడిన, మరుగున పడిన, తక్కువగా అనువదింపబడిన రచయితలను వెలుగులోకి తేవడం...’’ అని షొఫీల్డ్‌ చెప్పింది తెలుగులోనూ చాలామంది రచయితలకు వర్తిస్తుంది.

‘మహా వేధ’ నవల రాసిన చివుకుల పురుషోత్తంను ఎవరైనా తలుచుకుంటున్నారా? కథకుడు అల్లం శేషగిరిరావు స్థాయికి తగిన గుర్తింపు ఉందా? తొలితరం యాక్టివిస్టు–రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మకు ఎన్ని విగ్రహాలు పెట్టారు? దళిత ఉనికితో కాకుండా నాగప్పగారి సుందర్రాజును గుర్తుచేసుకోవడం జరుగుతోందా? ‘చంఘిజ్‌ఖాన్‌’ను తెలుగు నేల మీద నిలబెట్టిన తెన్నేటి సూరికి ఎవరైనా హారతులు పడుతున్నారా? గుర్తింపు ఉన్న రచయితలు అనుకునేవాళ్లకు కూడా పెద్దలెక్కల్లో ఏ గుర్తింపూ లేనట్టే! ఇక అచ్చుకే ‘నోచుకొని’ రచయితల సంగతి? ప్రపంచ వ్యాప్తంగా విస్మరించలేని రచయిత అయిన ఫ్రాంజ్‌ కాఫ్కా రచనలు అతడు బతికివుండగా పెద్దగా అచ్చుకాలేదు. ఎమిలీ డికిన్సన్‌ కవిత్వమూ అంతే. ‘నువ్వు లేని అద్దం’ నవల ద్వారా కొత్త ఆసక్తికి కారణమైన చిత్రకొండ గంగాధర్‌ పుస్తకాలేవీ అతడు తన నలభైల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అచ్చుకాలేదు. మరి చదువుతారన్న గట్టి హామీ లేనప్పుడు కూడా రచయితలు ఎందుకు రాస్తున్నారు? వాళ్లను నడిపించే ఆ జీవలక్షణం ఏమిటి?

‘‘నా రచనకు ఆరంభ బిందువు ఎల్లప్పుడూ ఒక పక్షపాతం, ఒక అన్యాయ భావనే... నేను రాస్తాను– ఎందుకంటే బయటపెట్టవలసిన ఏదో అబద్ధం ఉంటుంది, చూపించవలసిన ఏదో నిజం ఉంటుంది’’ అంటాడు జార్జ్‌ ఆర్వెల్‌. ‘‘ప్రతి వ్యక్తి ఆత్మ తాలూకు వైశిష్ట్యాన్ని స్పష్టంగా చూపించటం నవలాకారుడి బాధ్యత అని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అంటాడు హరూకీ మురకామి. ‘‘రచన నా శరీరానికి పొడిగింపు’’ అంటారు నటాలీ డయాజ్‌. ‘‘మనిషిగా ఉండే ఒక పార్శా్వన్ని చూపించడం’’ కోసం రాస్తానంటాడు కజువో ఇషిగురో. కీర్తి కోసం అని విలియమ్‌ ఫాక్‌నర్‌ బోల్డుగా చెప్పేయొచ్చు; నాలుగు డబ్బుల కోసం అని ఇంకో రచయిత ఒప్పేసుకోవచ్చు. కానీ ప్రతి రచయితకూ భిన్న కారణం ఉంటుంది. అసలు ఏ కారణమూ ఉండకపోవచ్చు. ‘సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అని కృష్ణశాస్త్రి అన్నట్టుగా– రాయడం అనేది రచయిత సహజ లక్షణం. వాళ్లు రాయగలుగుతారు కాబట్టి రాస్తారు. రాయకుండా ఉండలేరు గనుక రాస్తారు. లోకం మీది ప్రేమతో దాన్ని జనానికి కానుక చేస్తారు.

(9-2-2026)

 

Saturday, January 31, 2026

మంచి పుస్తకం చదివాను అన్న ఆనందం



 (గంగరాజం బిడ్డ పుస్తకం మీద డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల ట్విట్టర్లో చేసిన పోస్ట్)


గంగరాజం బిడ్డ (3/2026)

అసలు నేను ఇలాంటి పుస్తకాలు చదవను, ఖాళీగా ఉంటే మొదటి కథ చదివాను, చాలా విసుగ్గా అనిపించింది. ఇంకా ఖాళీగా ఉంటే ఇంకో కథ చదివాను. ఇదేదో బాగుందే అనిపించింది. ఎప్పుడూ పూరీ జగన్నాథ్ సినిమాలు చూసేవాడికి ఒకేసారి విశ్వనాథ్ సినిమాలు చూస్తున్నట్లు అనిపించింది. తర్వాత అన్ని కథలూ చదివాను.

తెలంగాణ మాండలికం ఈ ఉత్తరాంధ్రా వాడికి కొంత అర్థం కాకపోయినప్పటికీ, ఈ కథల్లో నా బాల్యాన్ని నేను చూసుకున్నాను. పల్లెలు, వాటిలోని మనుషులు, వాళ్ళ బ్రతుకులు అన్నీ అలవోకగా మనమక్కడే వాళ్ళమధ్యనే ఉండి వాళ్ళందర్నీ చూస్తున్నట్లుగా ఉంది ఈ పుస్తకం చదువుతూ ఉంటే.

ఈ పుస్తకంలో నాకు తెలియని తెలంగాణా మాండలికంలోని పదాలను అడిగి తెలుసుకున్నాను. చదివిన తర్వాత ఒక రకమైన సంతృప్తి. ఎక్కడో ఎప్పుడో వదిలేసిన బాల్యం, హాస్టల్ జీవితం, కౌమారం అన్నీ మళ్లీ ఉప్పెనలా ఎగిసాయి.

రచయిత పూడూరి రాజిరెడ్డి చాలా ఇబ్బందికరమైన విషయాలని చాలా సరళంగా ఈ కథల్లో రాసేశారు. అవి చదివేటప్పుడు ముఖం మీద ఒక చిరునవ్వు మెరుస్తుంది. ఈ కథల్లో ఏవో గొప్ప మలుపులు, ముగింపులు ఉండవు, అన్ని కథల్లో రచయిత మనల్ని చేయి పట్టుకుని అక్కడికి తీసుకెళ్లి అన్నీ చూపిస్తూ మనకొక అనుభూతిని అందిస్తారు. అంతే అనుభూతి మాత్రమే.

ఒక మంచి పుస్తకం చదివాను అన్న ఆనందం ఇంకా సంతృప్తి.

Thursday, January 29, 2026

ఆడ పువ్వు మగ పువ్వు

 ఆనిగెపు / సొర తీగకు ఆడ పువ్వు మగ పువ్వు


మగ పువ్వు


ఆడ పువ్వు