Saturday, January 31, 2026

మంచి పుస్తకం చదివాను అన్న ఆనందం



 (గంగరాజం బిడ్డ పుస్తకం మీద డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల ట్విట్టర్లో చేసిన పోస్ట్)


గంగరాజం బిడ్డ (3/2026)

అసలు నేను ఇలాంటి పుస్తకాలు చదవను, ఖాళీగా ఉంటే మొదటి కథ చదివాను, చాలా విసుగ్గా అనిపించింది. ఇంకా ఖాళీగా ఉంటే ఇంకో కథ చదివాను. ఇదేదో బాగుందే అనిపించింది. ఎప్పుడూ పూరీ జగన్నాథ్ సినిమాలు చూసేవాడికి ఒకేసారి విశ్వనాథ్ సినిమాలు చూస్తున్నట్లు అనిపించింది. తర్వాత అన్ని కథలూ చదివాను.

తెలంగాణ మాండలికం ఈ ఉత్తరాంధ్రా వాడికి కొంత అర్థం కాకపోయినప్పటికీ, ఈ కథల్లో నా బాల్యాన్ని నేను చూసుకున్నాను. పల్లెలు, వాటిలోని మనుషులు, వాళ్ళ బ్రతుకులు అన్నీ అలవోకగా మనమక్కడే వాళ్ళమధ్యనే ఉండి వాళ్ళందర్నీ చూస్తున్నట్లుగా ఉంది ఈ పుస్తకం చదువుతూ ఉంటే.

ఈ పుస్తకంలో నాకు తెలియని తెలంగాణా మాండలికంలోని పదాలను అడిగి తెలుసుకున్నాను. చదివిన తర్వాత ఒక రకమైన సంతృప్తి. ఎక్కడో ఎప్పుడో వదిలేసిన బాల్యం, హాస్టల్ జీవితం, కౌమారం అన్నీ మళ్లీ ఉప్పెనలా ఎగిసాయి.

రచయిత పూడూరి రాజిరెడ్డి చాలా ఇబ్బందికరమైన విషయాలని చాలా సరళంగా ఈ కథల్లో రాసేశారు. అవి చదివేటప్పుడు ముఖం మీద ఒక చిరునవ్వు మెరుస్తుంది. ఈ కథల్లో ఏవో గొప్ప మలుపులు, ముగింపులు ఉండవు, అన్ని కథల్లో రచయిత మనల్ని చేయి పట్టుకుని అక్కడికి తీసుకెళ్లి అన్నీ చూపిస్తూ మనకొక అనుభూతిని అందిస్తారు. అంతే అనుభూతి మాత్రమే.

ఒక మంచి పుస్తకం చదివాను అన్న ఆనందం ఇంకా సంతృప్తి.

Thursday, January 29, 2026

ఆడ పువ్వు మగ పువ్వు

 ఆనిగెపు / సొర తీగకు ఆడ పువ్వు మగ పువ్వు


మగ పువ్వు


ఆడ పువ్వు


Tuesday, January 27, 2026

గురివింద గింజలు (నిజం గింజలు)

గురివింద గింజలు. ఎప్పుడో చిన్నప్పుడు చూసినుంటి. మళ్లీ ఇన్నేండ్లకు మా పాత బాయిగడ్డకే కనబడ్డాయి. 


కాయ 


తీగ 


గింజలు




Monday, January 19, 2026

అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌


భారత ప్రజలమైన మేము...


పుస్తకం:
అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌: ఎ న్యూ డెమాక్రటిక్‌ హిస్టరీ

రచయితలు:
రోహిత్‌ డే
ఆర్నిట్‌ శని

–––––––––––––––––––––

1946 డిసెంబర్‌ 9న సరిగ్గా 11 గంటలకు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌లో రాజ్యాంగ సభ మొదటిసారిగా సమావేశమైంది. ఈ సభలోని సుమారు 300 మంది సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైనవారు కాదు. బ్రిటిష్‌ ఇండియా ప్రావిన్సుల్లోని శాసనసభలు ఎంపిక చేసినవారు. మూడేళ్లలో 5,546 పేజీల చర్చలు జరిపి, ఈ రాజ్యాంగ సభ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు ఈ మొత్తానికైన ఖర్చు రూ.47 లక్షలు. అయితే ఈ రాజ్యాంగ సభకు వెలుపల రాజ్యాంగం కోసం పడిన భిన్న ఆరాటాలను వివరించే పుస్తకం: ‘అసెంబ్లింగ్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌’. ఈ 400 పేజీల పుస్తకం ఒకప్పుడు దేశాన్ని పట్టిన రాజ్యాంగ జ్వరాన్ని కళ్లకు కడుతుంది.

రాజ్యాంగ ప్రక్రియలో కేవలం మేధావులు మాత్రమే పాల్గొనలేదనీ, ఇంకా ‘ఇండియా’గా రూపుదిద్దుకోని భారత నేల నలుమూలలలో ఉన్న సకల జనాలు చురుగ్గా పాలుపంచుకున్నారనీ చెబుతారు రచయితలు. స్వతంత్ర భారతంలో తమకు ఏం కావాలో, తాము ఎలాంటి పాలన కోరుకుంటున్నారో బలూచిస్తాన్‌ నుంచి బెజవాడ వరకు వేలాది మంది పౌరులుగా, సంఘాలుగా, తెగలుగా, పార్టీలుగా, అధికార ప్రతినిధులుగా, ట్రేడ్‌ యూనియన్లుగా తమ సంతకాలతో, వేలిముద్రలతో పంపిన అభ్యర్థనలను, అభిప్రాయాలను తవ్వితీసి, ఈ ఉత్సాహపూరిత ప్రజాకోణాన్ని అంతే ఆసక్తికరంగా వెల్లడించారు రచయితలు. ఉదాహరణకు గౌహతి నుంచి నలిన్‌కాంత బర్కాకటి పంపిన చిన్న కాగితం రాజ్యాంగ సభ సచివాలయానికి 1947 జనవరి 8న అందింది. ‘రాజ్యాంగ విషయాల్లో తన అజ్ఞానాన్ని మన్నించమంటూనే’, ఏ శాసనసభ్యుడినైనా ఎప్పుడైనా ‘రీకాల్‌’ చేసే హక్కు ఓటర్లకు ఉండాలని అతడు రాశాడు. అంటరానితనాన్ని నిర్మూలించకుండా సమైక్య భారతదేశం సాధ్యం కాదని వజీరిస్తాన్‌లోని బన్నూ నుంచి ప్రజా ప్రతినిధి కోటూ రామ్‌ కోరాడు. మహిళలకు సమాన హక్కులు; మరణశిక్ష రద్దు; జైనులు, బేనె ఇజ్రాయెలీ యూదులతో సహా మైనారిటీల హక్కులు; నగర బాలురతో సమానంగా గ్రామీణ పిల్లల హక్కుల లాంటివే కాదు, ‘చెవిటి మూగ’ వారికి ప్రత్యేక గ్యారంటీలు, విశ్వకర్మలకు ఫీజుల్లో రాయితీలు కోరుతూ కూడా లేఖలు అందాయి. విచిత్రంగా తమ లేఖల ద్వారా రాజ్యాంగ సభకు జనమే చట్టబద్ధత కల్పించారంటారు రచయితలు.

‘ఆచరణాత్మక’ కారణాల వల్ల, తొలుత రాజ్యాంగ చర్చలను రహస్యంగానే ఉంచదలిచిన పెద్దలు ఈ ప్రజాబాహుళ్యపు ఒత్తిడితో రాజ్యాంగం ఏ రూపం తీసుకుంటుందో బహిరంగపరచదలిచారు. 1948 ఫిబ్రవరి 26న ప్రచురించిన డ్రాఫ్ట్‌ కాన్‌స్టిట్యూషన్‌(ఆంగ్లం) బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. వెల: ఒక్క రూపాయి. ఇది చెల్లించలేనివాళ్లు అణాతో 24 పేజీల సారాంశం చదువుకోవచ్చు. వారంలోనే దీన్ని దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించడానికి అనుమతులు కోరుతూ లేఖలు రాసాగాయి. కె.జి.చౌబాల్‌ అనే మరాఠీ జర్నలిస్టు ‘మాతృదేశ సేవ’ కోసం తన సేవలను వాడుకోవాలని రాశాడు. రేడియోలోనే కాదు, గుళ్లు, మసీదులు, చర్చులు, ట్రేడ్‌ యూనియన్లు, శరణార్థి శిబిరాలు కూడా రాజ్యాంగాన్ని చర్చించడానికి వేదికలయ్యాయి.

ఈ పుస్తకం వెల్లడించే మరో కోణం, ‘ఇండియన్‌ యూనియన్‌’కు సమాంతరంగా, అప్పటికి స్వతంత్రంగానే ఉండదలిచిన సంస్థానాల్లో కూడా రాజ్యాంగ రచన ఎలా జరిగిందో వివరించడం. సంస్థానాలకు రాజ్యాంగ సభ 93 ప్రాతినిధ్య స్థానాలను ఇచ్చినప్పటికీ, తమను తాము ప్రజాస్వామీకరించుకోవడంలో భాగంగా అవి ఈ ప్రక్రియ చేపట్టాయి. రాంపూర్‌ పాలకుడు తన ప్రజలకు భావస్వేచ్ఛతో సహా తొమ్మిది ప్రాథమిక హక్కులను ప్రసాదించాడు. రత్‌లామ్‌ రాజ్యాంగం ఉచిత ప్రాథమిక విద్యను రాజ్య బాధ్యతగా పేర్కొంది. మణిపుర్‌ రాజ్యాంగం భారత రాజ్యాంగానికన్నా మూడేళ్ల ముందే అందరికీ ఓటుహక్కును కల్పించింది. ‘మేము ఇప్పటివరకు తమ సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకున్న 75 సంస్థానాలను గుర్తించాం’ అంటారు రచయితలు.

ఇంకా న్యాయమూర్తులు ఎలా ఇందులో భాగమయ్యారు; ట్రూమన్‌తో సహా అమెరికా, యూకే, ఐర్లాండ్, కెనడా నాయకులు, న్యాయనిపుణుల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం ద్వారా రాజ్యాంగపు ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ రూపొందించిన సర్‌ బి.ఎన్‌.రావు ఇండియా రాజ్యాంగాన్ని ‘ప్రపంచ వేదిక’కు ఎలా పరిచయం చేశారు; ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులు తమ హక్కుల కోసం ఎలా నిలబడ్డారు లాంటి అంశాలను విపులంగా చర్చించిన ఈ పుస్తకం రాజ్యాంగపు బహుముఖ పార్శా్వలను తెలుసుకోగోరేవారికి ఆసక్తి కలిగిస్తుంది. కోట్ల మంది ఆశలను ఒక దగ్గర గుదిగుచ్చడం ఎంత దుర్భరమో, అబ్బురమో కూడా అర్థమవుతుంది. తర్వాత జరిగిన ఎన్నో రాజ్యాంగ సవరణలు కూడా ఈ ప్రజా చైతన్యపు కొనసాగింపే.

– ఎడిటోరియల్‌ టీమ్‌

(6 జనవరి 2025)
 

Wednesday, January 14, 2026

నలభై ఏళ్లు దాటకుండానే...


 నూటా నలభై


‘నేను బూడిదగానైనా మిగులుతానుగానీ మట్టిగొట్టుకుపోను’ అన్నాడు జాక్‌ లండన్‌. బతికినన్నాళ్లూ అగ్నిజ్వాలలా బతికాడు. లోకాన్ని మెరుపులా చుట్టాడు. చేయగలిగిన పనులన్నీ చేశాడు. యాక్టివిస్టు, సాహస యాత్రికుడు, యుద్ధక్షేత్రంలో విలేఖరి; నావికుడు, పేపర్‌ బాయ్, బొగ్గు గని కార్మికుడు, ఐసు బండి డ్రైవరు, వలస కూలీ, ఫొటోగ్రాఫర్, గోల్డ్‌ డిగ్గర్‌ లాంటి రెండు డజన్ల పనులు చేశాడు. నియమంగా రోజుకు వెయ్యి పదాలైనా రాసేవాడు. నవలలు, జ్ఞాపకాలు, కథలు, నాటకాలు, కవిత్వం, వ్యాసాలతో సుమారు 50 పుస్తకాలు వెలువరించాడు. తన కాలంలో అత్యంత ప్రభావశీల అమెరికా రచయితగా వెలిగాడు. కానీ నలభై ఏళ్లకే మరణించాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన మనిషి నలభై ఏళ్లకే కాలగర్భంలో కలిసిపోవడమేమిటి? కాలానికి ఏ కనికరమూ ఉండదేమో! లేదా, దాని లెక్కలు మనకు అర్థం కావేమో! ఏ లెక్కలూ పాటించని కాలాన్ని మన లెక్కల్లోకి తీసుకునే ప్రయత్నంలో దానికి లేని లక్షణాలను ఆపాదిస్తామేమో! ఫ్రాంజ్‌ కాఫ్కా, ఎడ్గార్‌ అలెన్‌ పో, కాథరీన్‌ మాన్స్‌ఫీల్డ్‌; జాన్‌ కీట్స్, ఎమిలీ బ్రాంటే, పి.బి.షెల్లీ, లార్డ్‌ బైరన్‌; స్వామి వివేకానంద; అలెగ్జాండర్‌; మొజార్ట్‌; బ్రూస్‌ లీ, మార్లిన్‌ మన్రో; మాల్కమ్‌ ఎక్స్, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌; త్రిపురనేని శ్రీనివాస్, నాగప్ప గారి సుందర్రాజు, చిత్రకొండ గంగాధర్‌– వీళ్లంతా కూడా నలభై ఏళ్లు దాటకుండానే ఈ అవనీ తీరం దాటేసినవారు!

నలభై ఏళ్లంటే మనిషి సరిగ్గా పక్వానికి వచ్చే వయసు. అన్ని బాల్య, యవ్వన చాపల్యాలను అధిగమించి నింపాదితనాన్ని సంతరించుకునే వయసు. జీవితాన్ని అత్యంత సమీపంగా దర్శించే వయసు. స్వీయ అనుభవాల వెలుతురులో గత చీకట్లను తరచి చూసుకునే వయసు. తాను నేర్చుకున్నదానికీ, తన జీవిత పాఠాలకూ మధ్యగల తేడాను నిశితంగా పట్టుకుని, తనదైన చింతనకు రూపు కట్టుకునే వయసు. ఉరుకులాటలు, వెంపర్లాటలు తగ్గి తనదైన స్థిమితాన్ని నెలకొల్పుకునే వయసు. అవసరం రీత్యా వేసుకున్న అన్ని మేకప్పులనూ కరిగించుకునే వయసు. స్పష్టమైన, స్థిరమైన గొంతును ఏర్పరుచుకునే వయసు. లోకానికి ఏదైనా కచ్చితంగా చెప్పగలిగే వయసు. కానీ వీళ్లెవరూ ఈ వయసుకు చేరకుండానే అంతకుమించిన పరిణతిని చూపారు, మహాద్భుతాలు చేశారు. కాలం కఠినాత్మురాలే కాదు, కరుణామయి కూడానేమో. వాళ్లకు పుట్టుకతోనే నూరేళ్ల వివేకాన్ని ఆశీర్వదించింది. అట్లా వాళ్లు నూటా నలభై ఏళ్లు బతికేసి వెళ్లారు.

‘ద కాల్‌ ఆఫ్‌ ద వైల్డ్‌’, ‘ద సీ–వూల్ఫ్‌’, ‘వైట్‌ ఫాంగ్‌’, ‘ది ఐరన్‌ హీల్‌’ లాంటి నవలలు రాసిన జాక్‌ లండన్‌ 1876లో జన్మించాడు. ఈ జనవరి 12తో 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. కిడ్నీ ఫెయిలై, స్కర్వీతో ముందటి నాలుగు పళ్లు కోల్పోయి, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు తుదిదశలో అగ్ని ప్రమాదంలో కాలిపోయి, డిసెంట్రీ, యురేమియా లాంటి అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ తాను  చేయగలిగింది చేసిపోయాడు లండన్‌. గొగోల్, చెకోవ్, డి.హెచ్‌.లారెన్స్, ఎఫ్‌. స్కాట్‌ ఫిట్జ్‌గెరాల్డ్, సాదత్‌ హసన్‌ మంటో లాంటివాళ్లంతా కూడా నలభైల్లోనే వెళ్లిపోయారు. ఇంకా యుద్ధ క్షేత్రాల్లో, విప్లవ రణరంగంలో, సామాజిక కార్యాచరణలో తమ నిండు యవ్వనాల్ని బలిచ్చిన జ్ఞాత, అజ్ఞాత తేజోదివ్వెలు ఎన్నో! వీళ్లు ఇంకా కొన్నేళ్లు బతికివుంటే మరింత వెలుగు కురిసేదా? అసలు, కురిసినదే చాలినంతా? ఏ కారణాల వల్లయినా వీళ్లు లోకం వీడొచ్చుగాక! ఈ వెళ్లిపోవడంలో బాధతో పాటు, అబ్బురం కలగలిసి ఉండటం ఒక వైచిత్రి. పాతుకుపోతున్నకొద్దీ అంటే ఈ లోకపు మకిలిని పులుముకోకుండానే, ఇంకా లోకం వారిపట్ల సంభ్రమంగా కళ్లు విప్పార్చుతున్నప్పుడే వెళ్లిపోవడం ఇందులోని మరో పార్శ్వం. డాట్‌ బాల్స్‌ ఆడుతూ విసుగెత్తించకుండా, సిక్సులతో మైదానాన్ని హోరెత్తిస్తూ రిటైర్‌ కావడం లాంటిదది. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమిది నాటకము అని అన్నమయ్య ఏ అర్థంలో పాడినా, నాటకం లాంటి ఈ జీవిత రంగస్థలం మీద ఉజ్జ్వలంగా, ధగద్ధగాయమానంగా తమ పాత్రను వెలిగించి నిష్క్రమించారు. సెల్యూట్‌!

(5 జనవరి 2025)