Monday, November 24, 2025

అసంపూర్ణ న్యాయమేనా?


 

అసంపూర్ణ న్యాయమేనా?


(ఇన్‌)కంప్లీట్‌ జస్టిస్‌?: ద సుప్రీం కోర్ట్‌ ఎట్‌ 75–– క్రిటికల్‌ రిఫ్లెక్షన్స్‌

సంపాదకుడు:
జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌


రాజ్యాంగ అవతరణ జరిగిన రెండు రోజులకు, అంటే 1950 జనవరి 28న భారత అత్యున్నత న్యాయస్థానం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ 75 ఏళ్లలో ఎనిమిది మంది న్యాయమూర్తుల నుంచి 34 మంది న్యాయమూర్తులకు అది విస్తరించింది. భారతీయ న్యాయవ్యవస్థ పిరమిడ్‌ పైభాగాన ఉండే సుప్రీం కోర్టును ఢిల్లీలోని ఒక భవన సముదాయంగా పరిగణిస్తే– కోర్టు రూములు, వందలాది మంది కూర్చోగలిగే న్యాయవాదుల భిన్న ఛాంబర్లతో అది కళకళలాడుతుంటుంది. అక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదుల సంఖ్య 22,734. మరో 3,500 మంది ‘అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌’. స్టెనోగ్రాఫర్స్, రిజిస్ట్రార్స్, డ్రైవర్స్, ప్యూన్స్‌ లాంటి ఇతర సిబ్బంది 3,770. ఇక 2025 మే 31 నాటికి పెండింగ్‌ కేసులు 81,735. ప్రజాస్వామ్యానికి మూడో స్తంభంగా పరిగణించే న్యాయవ్యవస్థ ఈ 75 ఏళ్లలో ఎలాంటి ఎత్తుపల్లాలను చూసిందో లోతుగా చర్చించే పుస్తకం ‘(ఇన్‌)కంప్లీట్‌ జస్టిస్‌?’ శీర్షికే ఇది సంపూర్ణ న్యాయం చేకూర్చలేకపోయిందన్న భావన కలిగిస్తుంది. దాన్నే 24 మంది న్యాయనిష్ణాతులు తమ వ్యాసాలు, ఎడిటర్‌ స్వయంగా చేసిన ఇంటర్వ్యూల రూపంలో అభిప్రాయాలను పంచుకున్నారు.

‘అందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా మా స్థానిక హవల్దార్‌కు ఉన్నంత శక్తి లేదు’ అని 1992 నాటి కుమ్హేర్‌ ఊచకోత నుంచి బతికి బయటపడ్డ రాజస్థాన్‌కు చెందిన ‘చున్నీ లాల్‌ జాతవ్‌’ చెప్పిన మాటల్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ పి.సాయినాథ్‌ ఉటంకిస్తారు. గ్రామాల్లోని అంచుల్లో ఉండేవాళ్లకు కోర్టుల్లోని న్యాయం ఎంత దూరమో ఆయన వివరిస్తారు. రాజ్యాంగానికి ‘ఫౌండింగ్‌ డాటర్‌’నని చెప్పుకొనే న్యాయవాది ఇందిరా జైసింగ్‌... సుప్రీంకోర్టులో, మొత్తంగా న్యాయస్థానాల్లో ఉండే లింగ వివక్షను, లైంగిక హింసను ఎత్తిచూపుతారు. కార్మిక చట్టాల కేసులతో పాటు, ప్రత్యేకంగా పురుష న్యాయమూర్తుల బాధితులుగా ఉన్న మహిళా న్యాయమూర్తుల కేసుల్ని వాదించిన జైసింగ్‌ ‘అది న్యాయవ్యవస్థ డర్టీ సీక్రెట్‌’ అంటారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని మరో కోర్టుకు బదిలీ చేయడం అర్థరహిత చర్య, అది ఇంకో కోర్టుకు చేస్తున్న అన్యాయం అంటారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ లోకూర్‌. కొలీజియం పేరిట న్యాయమూర్తుల ఎంపికలో కార్యనిర్వాహక వ్యవస్థను మొత్తంగా పక్కనపెడితే, దాని ఆధిక్యాన్ని చాటుకోవడానికి కార్యనిర్వాహక వ్యవస్థ పలు దారులు వెతుకుతుందంటారు లా కమిషన్‌ మాజీ చైర్మన్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా.

ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ, సగటున అరవై ఏళ్ల వయసుండే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక్కోసారి రోజుకు 60–65 హియరింగ్స్‌తో వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే వాటన్నింటికి సంబంధించిన పత్రాలను ముందుగా చదివుండటం తప్ప మార్గం లేదు. ‘ప్రపంచంలో ఏ సుప్రీం కోర్టు జడ్జికి కూడా ఇంతటి పని ఒత్తిడి ఉండదు’ అంటారు సీనియర్‌ అడ్వకేట్‌ శ్రీరామ్‌ పంచు. వర్చువల్‌ హియరింగ్స్‌కు ఆన్‌లైన్‌ ఫైలింగ్స్‌ను కూడా తప్పనిసరి చేయగలిగితే సుప్రీంకోర్టు సమర్థత పెరుగుతుందనీ, కోర్టు ప్రాంగణంలో మనుషుల తొక్కిడి ఉండదనీ సలహా ఇస్తారు సీనియర్‌ అడ్వకేట్‌ మీనాక్షి అరోరా. 2023 జూలై 30 నాటికి 4,40,47,503 పెండింగ్‌ కేసులున్న జిల్లా కోర్టుల్లో 20 శాతం పోస్టులు ఖాళీగా ఉండటాన్నీ, కొన్నిచోట్ల కనీసం సరైన ప్రింటర్‌ కూడా ఉండని వైనాన్నీ వివరిస్తారు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌.రవీంద్ర భట్‌. ఇంకా రాజు రామచంద్రన్‌(జడ్జీల తొలగింపు), ఉపేంద్ర బక్షి(పిల్స్‌), కె.చంద్రు(కార్మిక చట్టాలు), ఫైజాన్‌ ముస్తాఫా(ఆర్టికల్‌ 30) లాంటివాళ్లు భిన్న అంశాలను స్పృశిస్తారు. ఎన్నో తీర్పుల ఉటంకింపులతో సాగే ఈ వ్యాసాల్ని చదవడం సామాన్య పాఠకులకు కొంత ఇబ్బందే అయినా స్పిరిట్‌ అర్థం కాకుండా పోదు.


(13-10-2025)

Friday, November 21, 2025

Shattered Lands పరిచయం


(ఈమధ్య సాక్షి ఎడిటోరియల్‌ పేజీ కోసం కొన్ని ఆంగ్ల పుస్తకాల పరిచయాలు రాస్తున్నాను. రికార్డ్‌ కోసం వాటిని ఇక్కడ ఉంచుతున్నా. అందులో ఇది మొదటిది.)
 

పుస్తక ప్రపంచం


విభజన రేఖల చరిత్ర

భారతదేశ విభజన అంటే ‘హిందుస్థాన్‌’, పాకిస్తాన్‌గా విడిపోయిన నేల గురించే అనుకుంటాం. కానీ బ్రిటిష్‌ వారి పాలనలో, అదన్‌ రేవు (యెమెన్‌) నుంచి రంగూన్‌ వరకు, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అంతా ‘ఇండియన్‌ ఎంపైరే’! అందరూ ‘ఇండియన్సే’. రూపాయే అంతటా చెల్లుబాటయ్యేది. అంతటి నేల ఐదు సార్లు ఎలా విభజితమైందో చెప్పే పుస్తకం ‘షాటర్డ్‌ ల్యాండ్స్‌’. ఢిల్లీలో పెరిగిన స్కాట్‌లాండ్‌ చరిత్రకారుడు సామ్‌ డాల్రింపుల్‌ రచయిత.

గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని నమ్మిన బర్మా (బ్రహ్మదేశ్‌) నాయకుడు యు ఒట్టామా, బ్రిటిష్‌–బర్మా ‘అధిపతి’ బా మా భారత సామ్రాజ్యంలో బర్మా అంతర్భాగమని  పోరాడారు. కానీ స్వాతంత్య్రోద్యమ సెగ నుంచి తమను కాపాడుకోవడానికి, విభజన రాజకీయాల్లో భాగంగా బ్రిటిష్‌వారు 1937లో బర్మాను విడదీశారు. ‘ఆసియా రూపురేఖలను మార్చడానికి దేవుడు పంపిన మనిషి ముందు నేను మౌనంగా నిలబడ్డాను’ అంటాడు గల్ఫ్‌కు వచ్చిన గాంధీజీని చూస్తూ యెమన్‌ రచయిత మహమ్మద్‌ అలీ లుక్‌మాన్‌. కానీ తమను ‘మెయిన్‌ ల్యాండ్‌’ అంతగా పట్టించుకోవడం లేదన్న భావన అరబ్బుల్లో ఉండేది. ‘హిందూ జాతీయవాదుల’ దృష్టిలోనేమో పవిత్ర భరతభూమి అనుకునే భౌగోళిక హద్దుల్లో అరబ్బు ప్రాంతం లేదు. 1931లో అదన్‌ రేవును, 1947లో ‘పర్షియన్‌ గల్ఫ్‌’ను విడదీయడంతో ఆ బంధమూ ముగిసింది.

ఎన్నో రిఫరెన్సులతో ఒక ఉద్విగ్న చరిత్రను కళ్లముందు నిలబెట్టే ఈ 520 పేజీల పుస్తకం అధికంగా ఒక మాటగానైనా ఉనికిలో లేని ‘పాకిస్తాన్‌’ ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను చర్చిస్తుంది. వేల్స్, స్కాట్‌లాండ్‌ దేశాలు యూకేలో భాగమైనట్టుగానే, పాక్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో స్వతంత్ర ప్రాంతంగా ఉండటానికి అంగీకరించిన జిన్నా తన మనసు మార్చుకోవడం, మత ద్వేషాలు కలగలిసి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభం తలెత్తింది. రాడ్‌క్లిఫ్‌ లైన్‌ అన్న ఒక్క గీతతో జాతీయతలు మారిపోయాయి. లక్షలాది మంది మరణించారు, కోట్లాదిమంది నిరాశ్రయులయ్యారు.

చదరపు కిలోమీటరు విస్తీర్ణం కలిగిన అతిచిన్న సంస్థానాల నుంచి యూరప్‌ దేశాలంతటి పెద్దవైన సుమారు ఆరు వందల సంస్థానాలే ఇప్పటి ఇండియాకు ఈ రూపునిచ్చాయనేది వాస్తవం(నాలుగో విభజన–విలీనం). ‘శరీరం లేని రెండు రెక్కలతో’ మతం పేరుతో ఏర్పడిన పాకిస్తాన్‌ నుంచి భాష కారణంగా బంగ్లాదేశ్‌ విడిపోవడంతో పుస్తకం ముగుస్తుంది(ఐదో విభజన). 1931 నుంచి 1971 వరకు జరిగిన ఐదు విభజనలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, నేపాల్, భూటాన్,  యెమెన్, ఒమన్, యూఏఈ, ఖతార్, బహ్రయిన్, కువైట్‌ ఇప్పటి రీతిలో ఏర్పడటానికి కారణమైన పరిస్థితులను పుస్తకం లోతుగా వివరిస్తుంది. మనుషుల సూక్ష్మ వివరాలను జోడిస్తూ రాయడం వల్ల చారిత్రక నవలను చదివిన అనుభూతినిస్తుంది. ఈ ద్రవరూప సరిహద్దులు అనాదిగా ఇలాగే ఉన్నాయని నమ్మించడంలో రాజ్య ప్రయోజనాలు ఉన్నాయి; అందుకే గత ఉమ్మడి చరిత్ర పట్ల  దేశాలు మరుపును ప్రదర్శిస్తాయంటారు రచయిత. ఈ విభజనలకు బాధితులు మాత్రం ప్రజలు. ‘ఇండియన్స్‌’ తమ అవకాశాలను లాక్కుంటున్నారని బర్మాలో యు సా మొదలుపెట్టిన ప్రచారం హింసాత్మకమై లక్షలాది మంది కట్టుబట్టలతో ఆ నేలను వీడి వందల మైళ్లు నడుచుకుంటూ వచ్చారు. బెంగాలీ మహిళల మీద పాక్‌ సైన్యం జరిపిన అత్యాచారాల వల్ల 1,70,000 గర్భస్రావాలు జరగడం, 30,000 మంది ‘యుద్ధ శిశువులు’ పుట్టడం మానవత్వానికి మచ్చ. గల్ఫ్‌లోనూ జనాలు ఇబ్బందులు పడ్డారు.

కథ ఇక్కడితో ముగిసిందా? బెంగాల్‌ను ఒక దేశంగా చేయాలని సుహ్రవర్దీ పట్టుబట్టాడు. నాగాలాండ్‌ కోసం ఫిజో పోరాడాడు. ట్రావెన్‌కోర్, అండమాన్, ‘ప్రిన్సిస్థాన్‌’(సంస్థానాలన్నీ కలిపి), ‘అచ్యుతిస్థాన్‌(దళితుల కోసం) లాంటి దేశాలు కూడా ఒక దశలో ఆలోచనలుగా ఉన్నవే. కశ్మీర్, బలూచిస్తాన్, ‘రోహింగ్యా’ పోరాటాలు ఇప్పటి వాస్తవమే. కాబట్టి ఇది ఇంకా నడుస్తున్న చరిత్రే!


(8-9-2025)

 

Tuesday, November 18, 2025

పోయిన్నెల మా కరెంట్‌ బిల్లు 51 రూపాయలు!



పోయిన్నెల మా కరెంట్‌ బిల్లు 51 రూపాయలు!

2025 ఏప్రిల్‌ నెలకుగానూ హైదరాబాద్‌లోని మా (అద్దె) ఇంటికి వచ్చిన కరెంట్‌ బిల్లు 51 రూపాయలు. మేము ఏసీ, ఫ్రిజ్‌ లాంటివి వాడం కాబట్టి మామూలుగా బిల్లులు తక్కువగానే వస్తుంటాయి. ఆ తక్కువల్లోనూ ఇది ఇంకా తక్కువ. అది కూడా నడి ఎండాకాలంలో. నేను ఒక్కడినే ఉంటే గనక ఎంత వేడిగా ఉన్నా ఫ్యాను కూడా వేయను. శరీరాన్ని అట్లా అలవాటు చేయడానికి సాధన చేస్తున్న. వేసవి సెలవులకు మావాళ్లు ఊరికి వెళ్లడంతో ఇంక రాత్రిపూట కాసేపు ఒకట్రెండు బల్బులు; ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌, (వారానికోసారి) ట్రిమ్మర్ చార్జింగుల కోసం తప్ప ఇంక దేనికీ పెద్దగా కరెంట్‌ వాడింది లేదు. బిల్లు ప్రకారం 4 యూనిట్లు కాలింది. నాకు తెలిసిన ఒక మేడమ్‌ వాళ్లకు పోయిన్నెల పది వేల బిల్లు వచ్చిందంటే (అలాంటి వస్తువులూ, వాటికి తగిన వాడకమూ ఉన్నాయన్నారు) ఇది రాయబుద్ధయింది.

(20-5-2025 నాటి ఎఫ్బీ పోస్ట్‌)
 

Saturday, November 15, 2025

చెహోవ్‌ ‘విద్యార్థి’ కథ



చెహోవ్‌ ‘విద్యార్థి’ కథ నేను ఇంతకుముందు చదవలేదు(అంటోన్‌ చెకోవ్‌ కథలు–1; అనువాదం: అరుణా ప్రసాద్‌). చిన్న కథ. నాలుగు పేజీలు. పూర్తవుతూనే ఏడుపొచ్చింది. అలాగని అందులో నాటకీయత లేదు, హృదయ విదారక సన్నివేశాలు లేవు. ఒక యువకుడి తలపోత ముఖ్యంగా. అసలు ఆ చివరి వాక్యం పూర్తయ్యేవరకూ అలా కదిలిపోతానని నాకూ తెలీదు. మళ్లీ ఆ చివరి వాక్యంలోనే ఏదో ఉందని కాదు. మొత్తంగా కథే. ఎప్పుడో క్రీస్తు కాలం నుంచీ, ‘మానవ జీవితాలకు మార్గదర్శనం చేసిన సత్యం, సౌందర్యం యివాళ్టి వరకూ ఏ అంతరాయం లేకుండా మానవులను నడిపిస్తూనే ఉన్నా’యన్న స్పృహ కలగడం వల్ల వచ్చిన ఆనందోద్వేగం అది. నా పూర్వీకుల తాలూకు సుఖదుఃఖాల పరంపరకు నన్ను కొనసాగింపుగా చూసుకోవడం వల్ల; గతం, వర్తమానాలను ముడేస్తున్న ‘గొలుసు’ తాలూకు ‘రెండు చివరలూ’ కనబడటం వల్ల; 130 ఏళ్ల క్రితపు(కథ ప్రచురణ: 1894) యువ చెహోవ్‌ కరచాలన స్పర్శ నాకు స్పష్టంగా తెలియడం వల్ల వచ్చిన కన్నీళ్లు అవి.


(19-10-2024 నాటి ఎఫ్బీ పోస్ట్‌)
 

Wednesday, November 12, 2025

గంగరాజం బిడ్డ కోవెటుకొచ్చింది...





(26-3-2025 నాటి గంటా వెంకట్‌ రెడ్డి ఎఫ్బీ పోస్ట్‌)

 

గంగరాజం బిడ్డ కోవెటుకొచ్చింది.

వచ్చే బస్సు పొయ్యే బస్సు. ఏదీ ఎక్కకుండా నా మటుకు నేను ఖైతాన్ బస్టాప్ లో పుస్తకం చదువుతూ కూర్చున్నాను. అందరూ ఫోన్ స్క్రీన్లను తుడుస్తా వుంటే, విచిత్రంగా నేనొక్కణ్ణే పుస్తకం తిరగేస్తా ఉన్నట్టుంది, 'ఏం బుక్కు' ఆరా తీశాడు అక్కడ బస్సులను కంట్రోల్ చేసే ఈజిప్ట్ మనిషి.
'గంగరాజం బిడ్డ' ఆంటి.
'ఏంది గాంధీ బిడ్డనా' అన్నాడు అయోమయంగా నా ఇండియా మొఖాన్ని ఎగాదిగా చూస్తూ అరబ్బీలో. కాదు కథల పుస్తకమని చెప్పాను.
తన చేతికి పుస్తకాన్ని తీసుకుని బాక్ కవర్ ఫొటో తీసుకుని గూగుల్ సహాయంతో 'మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్వి క్కడ లేవు, సరిపోవు' అనే వాక్యాన్ని తన భాష లోకి తర్జుమా చేసుకుని 'అద్భుతం' అన్నాడు.
ఇందులోని కథలన్నీ అద్భుతమే!

గంగరాజానికీ నాకూ ఒకటే తేడా! గంగరాజం మస్కట్ బోతే నేను కోవెటొచ్చినా. నా ఎద్దులమ్ముకొని నేను విమానామెక్కితే, గాటి మీద కాడెద్దులు సచ్చిపోయిన గంగరాజం అనుమానంతో ఎవుర్నో జంపి జైలు పాలై ఊరిడిసిపాయ.
మనతో పాటు బడిలో చేరిన పిల్లతో చిన్నప్పుడు అరమరికలు లేకుండా చదువులో, ఆటపాటల్లో కలసిపోతాం. హైస్కూల్లోకి వెళ్లేసరికి పైకి ఏదో దూరం పెరిగినట్టనిపిస్తుంది కానీ, లోపల తెలియని ఆకర్షణ మొదలవుతుంది. ఉన్నఫలంగా అదృష్యమైన ఆ పిల్ల, వారం పది రోజుల్లో పచ్చిపసుపుకొమ్ములా పైటా పావడతో దర్శనమిస్తే, గుండె గొంతులోకొచ్చినట్టు, గుండెకాయకు చమట పట్టినట్టూ అనిపిస్తుంది. ఏమోయ్ అన్నట్టు ఆ పిల్ల నొసలు ఎగరేసినా నోరు పెగలదు.
గంగరాజం బిడ్డ కథలో పూర్ణలతను ఆ పిలగాడు మళ్ళీ కలవాలని కొటకలాడింది నా పానం.

ఇంకా 'ఎఱుక' 'చిన్న సమస్య' కథలు కూడా అప్పుడప్పుడే ముక్కుకింద మూతి నల్లబడి బాల్యం నుండి యవ్వనంలోకి అడుగు పెట్టే పిల్లవాని దృష్టితో రాసినవి.
యవ్వనంలో తన ప్రేమను వెల్లడించాలనుకుని తనకలాదే యువకుని కథ 'చిలుము'. ఐతే మనిషి మనసుకు పట్టిన చిలుము వదలడం కష్టం కదా!
అందీ అందని అందాల అతివ అధరాన్ని అందుకుందామని ఆశపడ్డ వేళ, ఆమె ఎదమింద మొగుడుగట్టిన తాళి కనిపించి కత్తిలా వీని గుండెల్లో దిగినట్టు, ఆమె తన భర్త, కూతురుతో దిగిన 'ఫ్యామిలీ ఫొటో' గోడమీద కనిపించి వెక్కిరిస్తే అది అద్భుతమైన కథవుతుంది.
ఎప్పుడో మాటకు మాట అనుకున్న వాళ్లు ఏదో ఫంక్షన్ లో కలిసి అన్నీ మర్చిపోయి ఓసారి ఇంటికి ఆహ్వానిస్తే ఎట్లుంటుంది. అక్కడొక మెరుపుతీగ కనపడి గుండె మెలితిప్పితే నీ మనసు 'బోర్లించిన చెప్పు' కథ చెప్తుంది.

ఉండూర్లో పెళ్లి జేసుకున్నోడు సగం సచ్చినట్టు, ఇల్లరికం పోయినోడు మొత్తం సచ్చినోని కింద లెక్కని మా ఊర్లో సామెత.
'కొండ' కథలో లింగయ్య, 'ఎడ్డి' కథలో సత్తెయ్యా ఇల్లరికమెల్లి సచ్చిపోయ్యిందాకా సచ్చినోళ్ల మాదిరి బతికిసచ్చిరి.
కొండలా అండగా ఉంటాడనుకున్న కొడుకు కొండంత బరువైతే, దాని జతకు ఇల్లరికమొచ్చిన మొగుణ్ణి మనిషిగా ఏనాడూ సూడని పెళ్ళాముంటే ఆ మొగోని యాష్ఠ ఏ దేవుడు తీర్సాల.
నోరు జచ్చిన సత్తెయ్య యాత్రకు తొడకపోయిన అత్తను అక్కన్నే దిగ్గులికి వచ్చిండని 'ఎడ్డి' గా మిగిలిపాయ.

సారా దుకాణం పెట్టి ప్రజారోగ్యం నాసినం జేసిన మొగుని సావుకు కారణమైన మనిషి నాయకునిగా ఎదిగి బ్రాందీ షాపు ప్రారంభిస్తే భార్య స్థానిక నాయకురాలి హోదాలో ఆ సభను అలంకరించడం. మరో అద్భుతమైన కథ 'రెండోభాగం'.
జీవిత తత్త్వమేదో ఎరుక పరచే 'జీవగంజి'.
శ్వాసమీద ద్యాసనిలిపి ఎంతగా మెడిటేషన్ చేద్దామన్నా 'ఎంత అనుభవించినా మిగిలిపోయే శరీరం గల ఆడమనిషి నడుస్తూ చూసిన చూపు' గుర్తుకొచ్చి గురి కుదరడం లేదు. మళ్ళీ చదవాలి 'మెడిటేషన్' కథను.

పిల్లతనం నుండి వృద్ధాప్యం వరకు మగవాని వివిధ దశల్లోని ఆలోచనలను, పెనుగులాటలను, అనుభూతులను, కోరికలను, ఆశలను, భయాలను ఇంత అద్భుతమైన కథలుగా శ్రీ పూడూరి రాజిరెడ్డి గారు మాత్రమే రాయగలనిపించింది. ఎన్నో వాదాలున్నట్లు ఇవి మగవాద కథలనొచ్చేమో!

శ్రీ పూడూరి రాజిరెడ్డి గారిని ప్రత్యక్షంగా కలవలేదు కానీ, మేము ఎప్పటినుండో ఫేస్బుక్ మిత్రులుగా వున్నాము. ఇన్నాళ్లకు వారి అద్భుతమైన కథలను చదవడం చాలా సంతోషంగా వుంది.
కథాభిమానులు తప్పకుండ చదవాల్సిన కథలివి.

- గంటా వెంకట్‌ రెడ్డి