Sunday, March 16, 2025

పర్సనల్‌ లైబ్రరీ



వ్యక్తిగత ప్రపంచం


‘ఒక గ్రంథాలయం, ఒక గార్డెన్‌ ఉందంటే నీకు కావాల్సినవన్నీ ఉన్నట్టే’ అన్నారు రోమన్‌ తత్వవేత్త సిసిరో. ఆ రెండింటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ, కేవలం గ్రంథాలయం గురించే ముచ్చటగా తలుచుకున్నారు ఇటీవల ముగిసిన ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో తల్లి, రచయిత్రి సుధామూర్తితో సంభాషిస్తూ అక్షతామూర్తి(బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి సునాక్‌ భార్య). తల్లికీ, తండ్రి(నారాయణమూర్తి)కీ విడి పర్సనల్‌ లైబ్రరీలు ఉండేవనీ; తల్లి దగ్గర సాహిత్యం, చరిత్ర పుస్తకాలుంటే, తండ్రి దగ్గర సైన్సు, టెక్నాలజీ పుస్తకాలుండేవనీ; తానూ, తమ్ముడు రోహన్‌ రెంటినీ కలగలిపి చదివేవారమనీ చెప్పారు. అన్నట్టూ, రోహన్‌ మూర్తి పూనికతో 2015లో ప్రారంభమైన ‘మూర్తి క్లాసికల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా’ భారత సాహిత్యంలోని అన్ని క్లాసిక్స్‌ ఆంగ్లానువాదాలను ప్రచురిస్తోంది. ఏమైనా ఈ ‘ఇన్ఫోసిస్‌’ కుటుంబం పర్సనల్‌ లైబ్రరీ అనే భావనను మరోసారి సాహిత్య పాఠకులకు తియ్యగా గుర్తుచేసింది.

వ్యక్తిగత లైబ్రరీ అనేదానికి నిర్దిష్ట కొలతలు లేవు. అన్ని సైజుల్లో, షేపుల్లో ఉంటుంది. అసలు ఏ ఆకృతి లేకుండా కేవలం పుస్తకాల దొంతర రూపంలోనూ ఉండొచ్చు. ఒంటరి పాఠకుడిగానూ, జీతం లేని లైబ్రేరియన్‌గానూ ద్విపాత్రాభినయం చేసే ఒకరి లైబ్రరీ ఇంకొకరి లైబ్రరీలా ఉండదు. అది వారి అభిరుచికి, సౌకర్యానికి అద్దం. పుస్తకాలను అక్షర క్రమంలో పెట్టుకుంటామా, సైజుల వారీగానా, వర్గీకరణ పరంగానా, రచయితల పరంగానా అన్నది వారి వారి ఛాయిస్‌. ఠక్కున తీసి చదువుకోగలిగే ఫేవరెట్స్‌ ఎక్కడ పెట్టుకోవాలో, రిఫరెన్స్‌ కోసం అవసరమయ్యే పుస్తకాలు ఎటువైపుంచాలో, ఎప్పుడోగానీ తీయమని తెలిసేవి ఎటు పక్కుంచాలో, అసలు ప్రతిపూటా తీయడం వల్ల నలిగిపొయ్యే నిఘంటువుల లాంటివి ఎక్కడ ఉంచితే మేలో, కొనడమేగానీ ఎన్నడూ పేజీ తిప్పన పాపానపోని పుస్తకాలను ఏం చేయాలో ఎవరిది వారికే తెలుస్తుంది. ఏ పుస్తకం పక్కన ఏది వస్తే చెలిమి చేసినట్టుంటుందో, దేని పక్కన ఏది రాకుండా చూసుకుంటే గొడవ తప్పించినట్టు అవుతుందో కూడా చూసుకోవాలి. లైబ్రరీ అనేది భిన్న రూపాలుగా విస్తరించి ఉంటుందనేది నిజమే అయినా, ప్రాథమికంగా అది అచ్చు పుస్తకాల నిలయం. అమెరికా రచయిత్రి సూసన్‌ సోంటాగ్‌ దగ్గర 15,000 పుస్తకాల భారీ భాండాగారం ఉండేది. వాటిని ఆమె ఆర్ట్, ఆర్కిటెక్చర్, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, చరిత్ర, మతం... ఇలా ప్రక్రియలుగా విభజించి పెట్టుకునేవారు. అర్జెంటీనా–కెనడా రచయిత ఆల్బెర్టో మాంగ్యూల్‌ దగ్గర ఏకంగా 35,000 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఎక్కడా సరిగ్గా సర్దుకోలేక ఫ్రాన్స్‌లో అవి పట్టేంతటి ఒక పాత భవంతి దొరికితే దాన్ని ఆయన కొనేశారు. ఇక అబ్బురపరిచే మేధానిధి లాంటి ‘బాబాసాహెబ్‌’ అంబేడ్కర్‌ తన జీవితకాలంలో తన నివాసం ‘రాజగృహ’లో సుమారు యాభై వేల పుస్తకాలను సేకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఇదీ ఒకటి. వందల నుంచి వేల పుస్తకాల ఇంటి లైబ్రరీలు ఉన్న రచయితలు, సాహిత్య ప్రేమికులు తెలుగులోనూ గురజాడ అప్పారావు నుంచి మొదలుకొని ఎందరో ఉన్నారు.

ఏ సాహిత్య వాసన ఉన్నవారికైనా ఒకరి ఇంటికెళ్తే ముందు చూపు పడేది వారింట్లో ఉన్న పుస్తకాలపైనే. అది సంభాషణకు మంచి ఊతం కాగలదు. కానీ అన్నీ మూటగట్టేసి అటకమీద పెట్టేసే జీవితపు కరుకు వాస్తవంలోకి మనుషులు జారిపోతున్నారు. అందుకే కనీసం ప్రదర్శన నిమిత్తం అయినా లైబ్రరీలు ఇళ్లల్లో ఆకర్షణగా ఉండటం లేదు. చేతిలో పుస్తకంతో కనబడటం పాత వాసనగా మారిపోయింది. కలిసి ఒక సినిమాకో, షాపింగ్‌కో వెళ్లినట్టుగా స్నేహంగా లైబ్రరీకి వెళ్లడం అనేది ట్రెండీగా ఉండటం లేదు. అందుకే పర్సనల్‌ లైబ్రరీలు అటుండనీ, అసలు లైబ్రరీలే తగ్గిపోతున్నాయి. పుస్తకాలను చదవడం బరువైపోతోంది, వాటిని నిర్వహించడం భారమైపోతోంది. ‘‘గత పాతికేళ్లుగా మనం చదివిన స్కూల్‌ లైబ్రరీలోని తెలుగు పుస్తకాలు చదివినవాళ్లు లేరుట. తీసేస్తున్నారని తెలిసి కొంచెం సొమ్ము ఇచ్చి కొనేసాను’ అంటూ విశ్వం నుంచి మెసేజ్‌’’ అని మొదలవుతుంది విజయ కర్రా రాసిన ‘ఆ ఒక్కటి’ కథ. కథానాయకుడు పదో తరగతిలో ఉన్నప్పుడు రాసిన ప్రేమలేఖను ఆ అమ్మాయికి ఇచ్చే ధైర్యం లేక ఒక పుస్తకంలో పెడతాడు. ఇన్నింట్లో ఆ పుస్తకం ఏమిటో ఇన్నేళ్ల తర్వాత వెతకడం ఇందులో కథ. అయితే, ఆ పుస్తకాల డబ్బాలు విప్పుతున్నప్పుడు బయటపడే తెలుగు, బెంగాలీ, సంస్కృత, రష్యన్‌ రచయితల పేర్లు బయటికి చదువుకోవడం పుస్తక ప్రేమికులకు మాత్రమే అర్థమయ్యే సంతోషం. చివరకు ‘భ్రమరవాసిని’ నవల ఆఖరు పేజీలలో ఆ ప్రేమలేఖ బయటపడుతుంది. అలా ‘మన జాతి సంపద’ ఏమిటో కూడా తెలుస్తుంది.

ఇటాలియన్‌ రచయిత అంబెర్తో ఎకో వ్యక్తిగత గ్రంథాలయంలో ముప్పై వేలకు పైగా పుస్తకాలు ఉండేవి. ఇందులో చాలా పుస్తకాలు చదవనివి ఉంటాయని దీన్ని ‘యాంటీ–లైబ్రరీ’ అని అభివర్ణించారు లెబనీస్‌–అమెరికన్‌ వ్యాసకర్త నసీమ్‌ నికోలస్‌ తలాబ్‌. ఒక్క క్లిక్‌ దూరంలో వందల ఈ–బుక్స్‌ అందుబాటులో ఉన్న సాంకేతిక యుగంలో, అవసరమైనది ఇట్టే బ్రౌజ్‌ చేయడం వీలుకాక పుస్తకాల దొంతరలన్నీ తిప్పి తిప్పలు పడాల్సిన పరిస్థితిలో... మన ఇంట్లో ‘స్పేస్‌’ ఇవ్వాల్సివచ్చే భౌతిక పుస్తకం విలువైనది అయివుండాలి. కానీ పుస్తకాలంటూ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే డిజిటల్‌ పుస్తకం చదివిన ఫీలివ్వదు; పుస్తకంలోని విషయమే తప్ప, ఆ పుస్తకం బయటి వ్యవహారంతో ముడిపడే జ్ఞాపకాన్నివ్వదు. మనసుకు నచ్చే కొన్ని పుస్తకాలతో అయినా ఇంటిని అలంకరించుకుందాం. గుండెల్లో భౌతిక పుస్తకాన్ని పదిలపరుచుకుందాం.

(Sakshi, March 3rd 2025)

Wednesday, March 12, 2025

కేరళ గొప్పతనం



దేవభూమి


గతేడాది డిసెంబర్‌ 25న మరణించిన మలయాళ మహారచయిత ఎమ్‌.టి.వాసుదేవన్‌ నాయర్‌ తన సాహిత్య జీవితంలో తనను బాగా కదిలించిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 1976లో తీవ్రమైన అనారోగ్యానికి గురై అసుపత్రిలో ఉన్నారు. అప్పుడో పల్లెటూరతను వచ్చి, ఆయనంటే అభిమానమని చెప్పడమే కాదు, ‘మీరు జబ్బుతో ఉన్నారని తెలిసి సేవ చేయడానికి వచ్చాను. కొన్ని పనులు మగ నర్సులే చేయాల్సి ఉంటుంది. మీకు నయమయే దాకా ఆ పనులు చేస్తాను’ అన్నాడట. మనిషి మానసిక ఘర్షణల మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఎమ్‌టీ విస్తారంగా రాశారు. కథలు, నవలలు, యాత్రా రచనలు, బాల సాహిత్యం, విమర్శతో పాటు సినిమాలకు స్క్రీన్‌ప్లే రచనలు చేయడమే కాకుండా, అత్యుత్తమ చిత్రాలు అనదగ్గవాటికి దర్శకత్వమూ వహించారు. కేరళ సంస్కృతి మీద ఆయన ప్రభావం ఎనలేనిది. ఆ పల్లెటూరి మనిషి ఎమ్‌టీ రచనలు చదవడమే కాదు, ఆయన కోసం తన వ్యవసాయ పనులను ఆపుకొని మరీ వచ్చాడు. ఏ రచయితకైనా తన రచనా ప్రయాణంలోని కష్టాల బరువు దిగిపోయే ఘట్టమిది. సహజంగానే ఆ స్పందనకు వాసుదేవన్‌ నాయర్‌ కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక గొప్ప రచయితగా వాసుదేవన్‌ నాయర్‌కు జరిగిన ఒక విడి అనుభవమే కావొచ్చు; కానీ మలయాళీయుల సాహిత్య సంపన్నతకు అది గుర్తు. పామరులను కూడా సాహిత్యం ఎలా పెనవేసుకుపోయిందో చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే, ఇదే వాసుదేవన్‌ నాయర్‌ మరో సందర్భంలో ఒక గ్రామీణుడు ఆయన దగ్గర ఉచితంగా పుస్తకం తీసుకోవడానికి నిరాకరించి, అతడి దగ్గరున్న ముడుతలు పడిన నోట్లు బలవంతంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ నేల అలాంటిది. దోస్తోవ్‌స్కీ లాంటి రష్యన్‌ రచయిత మీద కూడా ఒక సాధారణ ఆటోడ్రైవర్‌ తనదైన అభిప్రాయాన్ని కలిగివుంటాడని మురిసిపోయే మలయాళీ సాహిత్యజీవులు ఎందరో!  

‘స్వర్గాన్ని నేను ఎప్పుడూ ఒక రకమైన గ్రంథాలయంలా ఊహిస్తాను’ అంటారు అర్జెంటీనా రచయిత జార్జ్‌ లూయీ బోర్హెస్‌. పుస్తకాలను మించిన పెన్నిధి ఏముంది! గ్రంథాలయం అనేది ఒక ఆశ. ఒక దారిదీపం. ఎమ్‌టీ సహా చాలామంది రచయితలు తాము రచయితలు కావడానికి ఒక కారణంగా ‘ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం’ అని చెబుతారు. అత్యంత ప్రకృతి రమణీయత వల్ల కాబోలు కేరళను దేవభూమి అని పిలుస్తుంటారు. కానీ అక్కడి గ్రంథాలయాల వల్ల కూడా అది దేవభూమి అవుతోంది. రాష్ట్రంలో ఎనిమిదివేలకు పైగా లైబ్రరీలు ఉండటమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ముప్పైకి పైగా పెద్ద సాహిత్య ఉత్సవాలు జరుగుతుంటాయి. దేశంలో ప్రతి పంచాయితీలో దాదాపు ఎనిమిది గ్రంథాలయాలున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశంలో అత్యధిక పబ్లిక్‌ లైబ్రరీలున్న రాష్ట్రం మహారాష్ట్ర (12,191). తర్వాతి స్థానంలో ఉన్న కేరళ (8,415)తో పోల్చితే మహారాష్ట్ర విస్తీర్ణం సుమారు ఎనిమిదింతలని గ్రహిస్తే కేరళ గొప్పదనం అర్థమవుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కూడా కేరళ సంఖ్యలో నాలుగో వంతైనా లేవు. అక్కడి గిరిజన గ్రామాల్లోనూ కొత్తగా 630 గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని గతేడాది నిర్ణయించారు. కేరళ గ్రంథాలయోద్యమ పితామహుడు పీ.ఎం.పణిక్కర్‌ వర్ధంతి అయిన జూన్‌ 19ని అక్కడ ‘రీడింగ్‌ డే’గా జరుపుతుంటారు. చదవడాన్నీ, చదివే వాతావరణాన్నీ మలయాళీయులు ఎంతగా ప్రోత్సహిస్తున్నారనడానికి ఇది రుజువు. ఈమధ్య ‘కేరళ లెజిస్లేచర్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెస్టివల్‌–2025’ ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా తిరువనంతపురంను ‘యునెస్కో’ గుర్తించాలని కోరింది అందుకే. తమ రాజధాని నగరం ఆ గౌరవానికి పూర్తిగా అర్హమైనదేనని ఆయన ధీమా!

గతేడాదే ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో కేరళలోని మరో నగరమైన కోజికోడ్‌ను ‘సాహిత్య నగరం’గా గుర్తించిన సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి. భారత్‌లో యునెస్కో గౌరవం దక్కించుకున్న తొలి నగరం ఇదే. ఒక్క కోజికోడ్‌లోనే 600 గ్రంథాలయాలు, రీడింగ్‌ రూములు ఉన్నాయి. వాసుదేవన్‌ నాయర్, వైకోం మహమ్మద్‌ బషీర్, పి.వత్సల లాంటి ఎందరో రచయితలకు కోజికోడ్‌తో అనుబంధం ఉంది. యునెస్కో మొదలైన 1945లోనే కేరళలో ‘సాహిత్య ప్రవర్ధక సహకార సంఘం’ ఏర్పాటుకావడం ఆ రాష్ట్ర ఘన సాహిత్య వారసత్వాన్ని గుర్తుచేస్తోంది. పుస్తకాల ప్రచురణ కోసం కొంతమంది రచయితలు కలిసి ఏర్పాటుచేసిన ఈ సంఘం సుమారు 8,400 పుస్తకాలను ప్రచురించింది. మలయాళ సినిమా అంతగా వర్ధిల్లుతుండటానికి కూడా ఈ సాహిత్య దన్నే కారణం. అందుకే ప్రముఖ సినీ జర్నలిస్ట్‌ అనుపమ చోప్రా నవతరం మలయాళ దర్శకులను ఇంటర్వ్యూ చేస్తూ, ‘అసలు మీరు ఏం చదువుతారు? ఏం చూస్తారు?’ అని ప్రశ్నించారు.

పుస్తక ప్రేమికులుగా వ్యక్తులు ఉండటం దానికదే విశేషమే. కానీ వ్యవస్థలు పుస్తకాన్ని ప్రేమిస్తే దాని ప్రభావం వేరే ఉంటుంది. ‘పర్వతము ఎంత ఎత్తయి గగన భేద్యమయినా దాని విశాలమైన వక్షస్థలము నుండి చిన్న సెలయేరుగాని ప్రవహించకపోతే ఆ ప్రకృతి సౌందర్యం అసమగ్రంగా ఒంటరిగా శుష్కంగా గోచరిస్తుంది, ’ అంటారు తన ‘జీవనలీల’ పుస్తకంలో కాకాసాహెబ్‌ కాలేల్కర్‌. ఒక ఇల్లు ఎంత ఘనంగా నిర్మించినా దానిముందు ఒక పూలచెట్టో, ఒక ఊరు ఎంత పెద్దదయినా దాని మధ్యన ఒక గ్రంథాలయమో లేకపోతే అవి అసంపూర్ణం అవుతాయి. పువ్వులు (ప్రకృతి), పుస్తకాలు (వివేకం) ఉన్న ప్రతిచోటూ దేవభూమే.

(Sakshi, Feb 3rd 2025)

Saturday, March 8, 2025

కూట ప్రశ్న


 

జీవితపు తాళంచెవి


‘‘ఉదయం నాలుగు కాళ్లతో, మధ్యాహ్నం రెండు కాళ్లతో, సాయంత్రం మూడు కాళ్లతో నడిచేది ఏమిటి?’’ క్రీస్తు పూర్వ కాలపు గ్రీకు విషాదాంత నాటక రచయిత సోఫోక్లిస్‌ రాసిన ‘ఈడిపస్‌ రెక్స్‌’ నాటకంలో ‘స్ఫింక్స్‌’ అడిగే ఈ చిక్కుప్రశ్న పాశ్చాత్య సాహిత్యంలో శ్రేష్ఠమైనది. థీబ్స్‌ నగరంలోకి ప్రవేశించాలంటే– మనిషి ముఖం, సింహం శరీరం, గద్ద రెక్కలుండే స్ఫింక్స్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరాలి. లేదంటే మరణం తప్పదు. చివరకు రాజు ఈడిపస్‌ వాటికి జవాబు చెప్పి, ఆ విచిత్ర జీవి పీడను వదిలిస్తాడు. పాకే బాలుడిగా నాలుగు కాళ్లతో, నిటారుగా నిలబడే యువకుడిగా రెండు కాళ్లతో, వృద్ధుడిగా కర్ర ఊతంగా మూడు కాళ్లతో నడిచే ‘మనిషి’ దీనికి సమాధానం. ఇందులోదే మరో ప్రశ్న. ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అక్క చెల్లికి జన్మనిస్తే, తిరిగి చెల్లి అక్కకు జన్మనిస్తుంది. ఏమిటి ఇందులోని మర్మం? ఆ అక్కాచెల్లెళ్లు రాత్రీ పగలూ అని తెలిస్తే, ఆ రోజు ఎంత బాగుంటుంది!

ఇలాంటి చిక్కు ప్రశ్నలు సాహిత్యంలో లెక్కకు మిక్కిలిగా కనబడతాయి. కూట ప్రశ్న, పొడుపు కథ, ప్రహేళికగా అర్థం ఉన్న ‘రిడిల్స్‌’ ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి. ‘పొడుపు కథల’ రూపంలో చెప్పినప్పుడు పిల్లలు వాటికోసం చెవులు అప్పగిస్తారు; పెద్దలకు జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి. ఏ స్థాయిలో వారికి ఆ స్థాయి కఠినత్వం, విస్తృతి వీటిల్లో కలగలిసి ఉంటాయి. అందుకే ఇవి సాహిత్యంలో ఒక మనోహరమైన అంశంగా ప్రత్యేకంగా కనబడతాయి. జీవితంలోని సంక్లిష్టతలను తేలిగ్గా విడమరిచి చెప్పడానికి పనికొస్తాయి.

నాలుగు వేల ఏళ్ల క్రితం నుంచే జనం తమ మేధాశక్తిని, విశ్లేషణా సామర్థ్యాలను చిక్కుప్రశ్నలతో సాన పట్టుకున్నారు. ప్రపంచానికి తెలిసిన తొట్టతొలి చిక్కుప్రశ్నల్లో ఒకటి ఒకప్పటి సుమేరియన్‌(ఇప్పటి ఇరాక్‌ ప్రాంతం) నాగరికతా సాహిత్యంలో కనిపిస్తుంది. ‘అక్కడొక ఇల్లుంది. అందులోకి ఒకరు గుడ్డివాడిగా ప్రవేశించి, చూపుతో బయటికి వస్తారు. ఏమిటది?’ ప్రపంచానికి రాత రూప పలకలను పరిచయం చేసిన సుమేరియన్‌ నాగరికత మనిషి విజ్ఞానానికి అమితమైన ప్రాధాన్యతను ఇచ్చింది. అందుకే పై ప్రశ్నకు ‘బడి’ సమాధానం కావడంలో ఆశ్చర్యం లేదు. అజ్ఞానం అనేది అంధత్వమే కదా! చదువుతో వచ్చే జ్ఞానం మనిషికి ఒక కొత్త చూపునిస్తుంది కదా!

‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా, శ్రమ తెలియకుండా ఉండటానికి’’ అంటూ ప్రారంభించి ఒక కథ చెప్పడమూ, ఆ కథ చివర పలు ప్రశ్నలు సంధించడమూ, ఆ కథలోని ప్రశ్నలకు ‘సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వేయి ముక్కలుగా పగిలిపోతుంది’ అని షరతు విధించడమూ, విక్రమార్కుడు జవాబు చెప్పి ‘మౌనభంగం కాగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్క’డమూ తెలుగు బాల కథా సాహిత్యంలో ఒక అరుదైన ధారావాహిక వేడుక. మూలంలోని భట్టి విక్రమార్క కథల్లో బేతాళుడు అడిగిన 23 ప్రహేళిక ప్రశ్నల నమూనాలోనే ‘చందమామ’ పత్రిక ఎన్నో ప్రశ్నలను సంధించింది. అయితే, అసలు మూలంలో విక్రమార్కుడంతటివాడు కూడా జవాబు ఇవ్వలేని ప్రశ్న ఏమిటి? ఇరువురికీ భార్యలు లేని ఓ తండ్రి కొడుకులు తోవలో పాదముద్రలను చూసి, పెద్ద పాదాలావిడను తండ్రీ, చిన్న పాదాలావిడను కొడుకూ పెళ్లాడాలనుకుంటారు. తీరా పెద్ద పాదాలావిడ కూతురుగానూ, చిన్న పాదాలావిడ తల్లిగానూ తేలుతుంది. అయినా ఇచ్చుకున్న మాట ప్రకారమే వాళ్లు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరికీ చెరొక కొడుకు పుడితే, వాళ్లు వరుసకు ఏమవుతారు? బేతాళుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం లేక, విక్రమార్కుడు సహేతుక మౌనం వహించడంతో బేతాళుడు ఆయన వశమవుతాడు. కాలగమనంలో సడలనున్న నైతిక నియమావళికి ఈ ప్రశ్నొక ముందుచూపు.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘వడ్లగింజలు’ కథలోని ఇతివృత్తం ఒక ప్రశ్న కాకపోయినా చిక్కుతో ముడిపడినదే. ‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ’’ అంటూ తాను చదరంగంలో గెలిస్తే ఏమివ్వాలో తన ప్రత్యర్థి అయిన ‘శ్రీ వత్సవాయి చతుర్భజ తిమ్మజగపతి మహారాజులు’ గారికి తంగిరాల శంకరప్ప సవినయంగా విన్నవించుకుంటాడు. తీరా ఆటలో మహారాజును కట్టడి చేశాక, ‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అని తేలినప్పుడు అందరూ నోరెళ్లబెట్టవలసి వస్తుంది.

సాహిత్యంలో ఇలాంటి చిక్కుప్రశ్నలు మాటల ఎత్తుగడలను, భాషాపటిమను చాటుతాయి. పాత్ర లక్షణాలను బహిర్గతం చేయడానికీ, వాటి తెలివితేటలను తెలియజెప్పడానికీ, కథను ముందుకు నడపడానికీ కూడా రచయితలు వాటిని ఉపయోగించుకున్నారు. ఈ చిక్కుప్రశ్నలు తరచుగా జ్ఞానం, అవగాహన కోసం మానవుడు చేసే అన్వేషణను సూచిస్తాయి. జీవితం అనేది ఒక తాళం అయితే, దాన్ని తెరిచే తాళంచెవి ఒక కూటప్రశ్న. అదే సమయంలో అది ఒక మనోవ్యాయామం, ఒక భాషావినోదం, ఒక తాత్విక పరిమళం, ఒక జీవిత రహస్యం కూడా!

(Sakshi Edit, Jan 6th 2025)


Wednesday, January 1, 2025

నచ్చిన/ప్రభావితం చేసిన పుస్తకం

(హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో నచ్చిన/ప్రభావితం చేసిన పుస్తకం గురించి ఒక పది నిమిషాలు మాట్లాడమని కవిమిత్రుడు ఒద్దిరాజు ప్రవీణ్‌ కాల్‌ చేశారు. రోజూ ఒక ధారావాహికగా చాలామంది రచయితలు పాల్గొన్న కార్యక్రమం అది. నాకు డిసెంబర్‌ 26న వీలు కుదిరింది. వర్షం పడి కార్యక్రమం కొంత ఆగం అయింది. అనుకున్న పది నిమిషాల్లో కూడా కోత పడింది.  ఆలస్యంగానైనా మొత్తానికి బాగానే జరిగింది. అయితే, అందరూ ఏకధారగా మాట్లాడితే నేను సహజంగానే తట్టుకుంటూ మాట్లాడాను. నేను అక్కడ చెప్పాలనుకున్నది ఇక్కడ పోస్టు చేస్తున్నా.)



మా సెషన్‌లో పాల్గొన్న/పాల్గొనాల్సిన వాళ్లు
 


మాట్లాడుతున్నవారు  మోతుకూరి నరహరి.
కూర్చున్నవారు: నెల్లుట్ల రమాదేవి(ముఖం కనబడటం లేదు), ఎస్‌.రఘు, 
పులికొండ సుబ్బాచారి, సంగనభట్ల నర్సయ్య, పూడూరి రాజిరెడ్డి, 
రాయారపు సూర్యప్రకాశరావు, మారోజు దేవేంద్ర
 


మాట్లాడినందుకు ప్రతిఫలం: పోచంపల్లి తువ్వాల
(ఈ ఫొటోలను పరిమి వెంకట సత్యమూర్తి గారు తీసి పంపారు. వారికి ధన్యవాదాలు.)
 
--------------------------------------------------------------- 


నచ్చిన/ప్రభావితం చేసిన పుస్తకం

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌

డిసెంబర్‌ 26; సాయంత్రం 6 గం.

పూడూరి రాజిరెడ్డి


అందరికీ నమస్తే.


ఇది చూస్తుంటే గుళ్లల్లో ప్రవచనం చెప్పడం గుర్తొస్తుంది. ప్రవచనం నడుస్తూనే ఉంటుంది, ఎవరి మానాన వాళ్లు పోతూనే ఉంటారు. కానీ ఆ పోతున్న క్రమంలోనే ఏ ఒక్క మంచి మాటైనా చెవిలో పడకపోతుందా అని ఆశ. బహుశా బుక్‌ ఫెయిర్‌ నిర్వాహకులు కూడా అలాంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటుచేసివుంటారు. అందులో నన్ను కూడా భాగం చేసినందుకు థాంక్యూ.

28 ఏళ్లకు మనిషి ఏర్పడిపోతాడు అంటాడు బుచ్చిబాబు. అంటే ఇంక ఆ తర్వాత మనిషి మారేది పెద్దగా ఉండదు. అందుకే వయసు పెరిగినాకొద్దీ ఆల్రెడీ ఉన్న అభిప్రాయాలను బలపరుచుకోవడానికి పనికొచ్చేవే ఎక్కువ చదువుతాం తప్ప, ఫ్రీగా, ఓపెన్‌గా ఉండి చదవం. మూవ్‌ అవడానికి సిద్ధంగా ఉండే వయసులో చదివేదే చదువు అనుకుంటాను. అందుకే నా డిగ్రీ నుంచి నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త వరకు చదివిందే అసలైన చదువు. డిగ్రీలో రెండు రోజులకొక్కటి చదవాలన్నంత ఆబగా చదివాను. జర్నలిజం వారానికో పుస్తకం కచ్చితంగా చదవాలని నియమం ఉండేది. ఇప్పుడు పుస్తకం మీద అలాంటి పాషన్‌ లేదు. కాబట్టి నాలాంటివాడు ఇప్పుడు పుస్తకం గురించి మాట్లాడటం రాంగ్‌ ఛాయిస్‌. కానీ సోషల్‌ మీడియా మీద విరక్తి కలిగాక మళ్లీ అలాంటి పాషన్‌ వస్తుందని ఆశిస్తున్నా.

నచ్చిన పుస్తకాలు ఉంటాయి. మన వ్యక్తిత్వానికి సరిపడే పుస్తకం మనకు నచ్చుతుంది. ఆ పుస్తకంలో మనకు ఏది నచ్చడానికి కారణం అవుతున్నదో అది మనలోపల ఆల్రెడీ ఉంటుంది. మనం గుర్తించకపోవచ్చు, ఉన్నట్టు తెలియకపోవచ్చు. కానీ ప్రభావితం చేసిన పుస్తకాలు ఉంటాయా? ఉంటే వాటి ప్రభావం నిజంగా ఎంత? దానివల్ల మన జీవితమే మొత్తంగా మారిపోయేంత ప్రభావం ఉంటుందా? మారిపోయింది అని చెప్పనుగానీ, వాటి ఎసెన్స్ నాలోకి ఎంతో కొంత ఇంకిపోయిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఒక్కదాని గురించి మాత్రం ఇక్కడ చెప్తాను.  జపాన్‌ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఓకా తన వ్యవసాయ అనుభవాలతో రాసిన ‘గడ్డి పరకతో విప్లవం’ అది.

గడ్డి పరకతో విప్లవం పుస్తకం జపనీస్‌ నుంచి ఇంగ్లీషులోకి ‘వన్‌ స్ట్రా రివొల్యూషన్‌’గా వచ్చింది. 1990లో దీన్ని తెలుగులో ‘టింబక్టు కలెక్టివ్‌’ వాళ్లు ప్రచురించారు. అనువాదం: సురేశ్, సంపత్‌.

నేను ఏ ఒక్క రచయిత ఫొటోను కూడా ఇంట్లో పెట్టుకోలేదు. కానీ నాకు ఫుకుఓకా ఇష్టం అని తెలిసిన కొందరు మిత్రులు ఇలాంటి ఒక సాహిత్య సమావేశం జరిగినప్పుడు ప్రెజెంట్‌ చేశారు. అది నాకు రోజూ చూసే ముఖం అయిపోయింది. ఇప్పుడు అందరూ సహజ వ్యవసాయం, ఆర్గానిక్‌ ఫుడ్స్, ప్రకతి పరిరక్షణ అని మాట్లాడుతున్నారు. కానీ ఎన్నో ఏళ్ల క్రితమే, రసాయనిక ఎరువులు వేయకుండా, క్రిమి సంహారకాలు ఉపయోగించకుండా, కనీసం నేలను దున్నకుండా వ్యవసాయం చేశాడు ఫుకుఓకా. ఆ తర్వాత నాకు ఇలాంటి వ్యవసాయ పద్ధతులు, ఇలాంటి ప్రకతి ఆహారానికి సంబంధించిన ఆసక్తుల వెనుక ఈ పుస్తకం ఉంది. డక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, ఖాదర్‌వలీ, సుభాష్‌ పాలేకర్, సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్, తాజాగా ఆర్గానిక్‌ మండ్య... ఇట్లాంటివి ఫాలో కావడానికి ఈ పుస్తకం నాలో నింపిన ప్రకృతి స్పృహ కారణం. కనీసం మా ఇంటివరకైనా నేను స్వయంగా చిరుధాన్యాలు, వడ్లు ఒక ఆరేడేళ్లు పండించేంత దూరం కూడా ప్రయాణించాను. అది ఇంకా ముందుకుపోతుందా, ఆగుతుందా, ఇంకా సీరియస్‌గా టేకప్‌ చేస్తానా తెలీదు.

గాంధీజీ దక్షిణాఫ్రికాలో వ్యవసాయం చేసినప్పుడు ఆ వ్యవసాయ క్షేత్రానికి పెట్టిన పేరు ‘టాల్‌స్టాయ్‌ ఫామ్‌’. నేను అంత సీరియస్‌గా వ్యవసాయం చేయకపోయినా కనీసం నా బ్లాగు రాతలకు పెట్టకున్న పేరు ‘ఫుకుఓకా ఫామ్‌’.

అయితే, ఆరోగ్య స్పృహ పెరిగినప్పటి నుంచీ నాకు అనారోగ్యం పెరిగిందనుకోండి! అంటే తిండి అనగానే కలిగే ఎక్సైట్‌మెంట్‌ స్థానంలోకి ఒక సంశయం వచ్చి చేరుతుంది. దేన్నీ మనస్ఫూర్తిగా తిననీయదు. కానీ ఇది పుస్తకం సమస్య కాదు. నా సమస్య. మన సమస్య. ఆహారం మొత్తంగా కలుషితమైపోయిన సామాజిక సమస్య. మళ్లీ దీనికి పరిష్కారం ఫుకుఓకా దగ్గరే, ప్రకృతి వ్యవసాయం దగ్గరే ఉంది.

ఫుకుఓకా కేవలం వ్యవసాయం గురించి మాత్రమే మాట్లాడితే, ఈ పుస్తకం నాకు నచ్చిన పుస్తకం కాకపోయేదేమో! వ్యవసాయం అనేది కేవలం పంటలు పండించడం కాదు, అదొక జీవన సాధన, అదొక ఆధ్యాత్మిక ప్రగతి అంటాడు ఫుకుఓకా. ఈ జనన మరణ చక్రంలో ఇష్టంగా బందీ కావడం గురించి మాట్లాడుతాడు. ఈ ఇష్టంగా బందీ కావడం అనేది ఒక యోగి మాత్రమే చెప్పగలిగే మాట. జీవితం మొత్తాన్నీ అర్థం చేసుకుని, ఒక పూర్ణ మానవుడు తన తుది మాటగా వెల్లడించిన సత్యంలా ఇది నాకు అనిపిస్తుంటుంది. జీవితంలోకి తెచ్చుకోగలిగే నెమ్మదితనం గురించీ, జీవితాన్ని తేలిక చేసుకోవడం గురించీ కూడా ఈ పుస్తకం చెబుతుంది.

జీవితం ఎప్పుడు తేలికవుతుంది? పొరలు ఎప్పుడు విడిపోతాయి? మనం చేసే ఏ పనికీ అర్థం లేదంటాడు ఫుకుఓకా. ‘నా ఉనికి సైతం ఉత్త భ్రమే’ అన్న జ్ఞానోదయం ఫుకుఓకాకు కలిగింది. నా లాంటి సాధారణ మనిషికి అది కలగడం లేదు. అందుకే నేను దీనితో స్ట్రగుల్‌ అవుతున్నాను. 2006లో పుస్తకాన్ని మొదటిసారి చదివినప్పుడు ఏదైతో నచ్చిందో, 2024కు వచ్చేసరికల్లా ఎదురు తిరుగుతోంది. బహుశా పెరుగుతున్న వయసు ఈ జీవితానికి ఒక అర్థాన్ని, చేస్తున్న ప్రతి పనికి ఒక ప్రయోజనాన్ని కోరుకుంటున్నది కావొచ్చు. అలాగని ఈ భావనకు వ్యతిరేకమైనదేదీ నా దగ్గర లేదు. అనంత విశ్వంలో ధూళికణం లాంటి మనిషి జీవితానికి ఏ ఉద్దేశం ఉంది?

టాల్‌స్టాయ్‌ ప్రస్తావన ఇంతకు ముందు వచ్చింది కదా! అన్నా కరేనినా నవలలో లేవిన్‌  చిట్టచివరకు నేను ఇలాగే ఉంటాను, బండి వాడి మీద ఇలాగే అరుస్తాను, అనుకుంటాడు. ఎన్ని చేసినా మనం ఏమీ మారం అనేది కూడా చాలా పెద్ద అవగాహన నా వరకూ. ఇది చాలా పెద్ద బ్యాగేజీని మన మీది నుంచి దింపేస్తుంది. అన్నీ చూసి, అన్నీ తెలుసుకుని, ఒక దగ్గర మన మనసును స్థిరం చేసుకోవడం. అది ఏదో ఒక దగ్గర స్థిరం చేసుకోవడం కాదు. మన వ్యక్తిత్వానికి సరిగ్గా దగ్గరగా, మన అత్యంత సమీపానికి మనం చేరుకోవడం అది. మనం నిజంగా ఏమిటో అర్థం చేసుకోవడం. మనం ఏమిటో తెలుసుకోవడం అనేది చిన్న విషయం కాదని అందరికీ తెలుసనుకుంటున్నా.

ఫుకుఓకాకు బోధపడినట్టుగా నా నిజమైన ప్రకృతి ఏమిటో నేను ఇంకా కనుక్కోవలసే ఉంది. బహుశా దానిక్కూడా మళ్లీ ఆయన పుస్తకమే నాకు దారి చూపుతుందనుకుంటాను. ఎందుకంటే, చదివినప్పుడల్లా నాకు మళ్లీ మళ్లీ ఇంకేదో కొత్త విషయం అది చెబుతూనే ఉన్నది.

 

Tuesday, December 31, 2024

పుస్తకం హస్తభూషణం

 


మంచినీళ్ల కుండ


‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్‌!’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్య కశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ చదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల చదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుక్కు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.

అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతక కర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హృదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.

మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తలమీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్‌ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్‌ లిటెరసీ ట్రస్ట్‌’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతి రోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దార్లు మూస్తున్నట్టే!

ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’ డిసెంబర్‌ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్‌ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్‌ ఫెయిర్‌ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్‌ ఫెయిర్‌. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్‌ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్‌. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం, రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్‌ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి.

 (Sakshi: December 16th, 2024)