Friday, May 29, 2015

కథానేపథ్యం: రెక్కలపెళ్లాం

ప్రాతినిధ్య కథ- 2014 ఆవిష్కరణ
తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, హైదరాబాద్; మే 3, 2015
---------------------------------------------------------------

పెద్దలు, మిత్రులు...

రెండు పాయింట్లేవో రాసుకొచ్చాను.

కథకు నిజంగా నేపథ్యం చెప్పడం సాధ్యమేనా? నేనైతే చెప్పలేను. దీనివల్ల ఈ కథ రాశాను అనే కాంక్రీట్ సమాధానం నా దగ్గర ఉండదు. దీనికోసం ఈ కథ రాశాను అని కూడా నేను చెప్పలేను.
కథ అనేది మరీ భవననిర్మాణం లాంటిది కాదేమో! కాగితం మీదే తుది స్ట్రక్చర్ ఊహించే క్రాఫ్ట్ కాదు అది. కనీసం నా వరకు.

అనగనగా... అనే ఒక బేసిక్ ఫామ్లో కథ చెప్పాలి... అది నేరేటివ్ స్టోరీ అయివుండాలి... ఇది ఈ కథకు ఒక బేసిక్ ఐడియా. ఇలా చెప్పాలనే ఆలోచనకు ఏది మూలమో తెలీదు. బహుశా ఈమధ్య నేను చదువుతున్న పాతసాహిత్యం, జానపద సాహిత్యం కారణం కావొచ్చు. కథ వినే వయసుకు వస్తున్న నా పిల్లలు కూడా ఒక కారణం కావొచ్చు. ఇందులో ఏ కారణం పనిచేసినా ఇది ఒక ఐడియా. అంతే!

ఆటోమేటిగ్గా, అనగనగా... అనే రూపం తీసుకున్నప్పుడు మన ఊహ సామాజికం కానక్కర్లేదు. అంటే మరీ వాస్తవికంగా ఉండాల్సిన పనిలేదు. అందులో మన ఊహను ఎంతదూరమైనా తీసుకెళ్లొచ్చు. కాబట్టే ఇందులో మగవాళ్లకు తురాయిలు, ఆడవాళ్లకు రెక్కలు మొలుచుకొస్తాయి.

అలాగని నేనేమీ ఈ సమాజం నుంచి దూరంగా లేనుకదా! ఈ వాస్తవికత నన్ను అంత సులభంగా వదిలిపెట్టదు కదా! అందుకే ఇందులో మళ్లీ అస్తిత్వ పోరాటాలకు సంబంధించిన నా అవగాహన వచ్చిచేరింది. ఆ అవగాహన కోసమే ఈ కథ రాయకపోయినా నా వరకు ఇది చాలా కీలకమైన అంశం కథలో.

ఇక, ఈ రెక్కలకు, తురాయిలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? మనిషి తన భాగస్వామిలో ఒక దివ్యత్వాన్ని కోరుకుంటాడని నా నమ్మకం. ఎదుటివాళ్లలో ఆ దివ్యత్వం ఉందా? లేదా? ఉన్నా గుర్తించామా? గుర్తించలేకపోయామా? అనేది మళ్లీ ఆయా వ్యక్తుల మీద ఆధారపడివుంటుంది. ఈ కథలోని మగవాడు తన భార్యలోని దివ్యత్వాన్ని గుర్తించలేకపోవడం ఒక విషాదం.

నిజానికి, ఈ కథ ప్రారంభించినప్పుడు... నేను స్త్రీని ప్రతినాయికను చేద్దామనుకున్నాను. అంటే స్త్రీ వల్ల మగవాడు ధ్వంసం కావడం అనేదేదో చెప్పాలన్నట్టుగా లీలగా ఉండింది. కానీ రాస్తూపోతుంటే నాకు ఆ స్త్రీమూర్తి పాత్రలోకి విషాన్ని ఇంజెక్ట్ చేయడానికి ఒక్క కారణమూ దొరకలేదు. అందువల్ల పురుషుడే దివ్యాంధతకు లోనై మరణించాడు. ఒక విధంగా ఓడిపోయాడు. మళ్లీ తన స్వచ్ఛత వల్ల గెలిచాడు.
అలాగని ఆమెకు కూడా ముందునుంచీ దివ్యత్వం లేదు; తను సంపాదించుకోగలిగింది, అన్నట్టుగా దాన్నిచెప్పీచెప్పకుండా వదిలేశాను.

అందుకే నేను మొదట అన్నది ... కథ అనేది మరీ భవననిర్మాణం లాంటిది కాదు. అది ఎలా ఉండబోతుందో మనకు తెలీదు. ఆలోచనకూ తుదిరూపుకూ మధ్య ఏం జరుగుతుందో... ఏ రెక్కలు మొలుచుకువచ్చి మనం దాన్ని పూర్తిచేయగలుగుతామో... అదే ప్రతిరచయితలోనూ ఉండే దివ్యత్వం!

థాంక్యూ.
               

Wednesday, May 27, 2015

కథానేపథ్యం: మరణ లేఖలు

పోయినేడాది కర్నూలు కథాసమయం మిత్రులు జరిపిన రెండు రోజుల కార్యక్రమంలోని ఒక సెషన్లో కథకులు తమ ఒక కథనేపథ్యాన్ని వివరించాలి. ఇది తప్పించుకోలేనిది. కాబట్టి, ఒక కథ మీద నేను కూడా ప్రిపేరై వెళ్లాను. దాన్నే ఇక్కడ పోస్టు చేస్తున్నా.


కథాసమయం
ఇండస్ పబ్లిక్ స్కూలు, గుత్తి రోడ్, కర్నూలు; మే 31, జూన్ 1-2014
---------------------------------------------------------------

మెయిల్ చూడంగానే ఈ వచ్చేవాళ్ల లిస్టు అదీ అంతా బానేవుందిగానీ కథానేపథ్యం వివరించాలి, అనేసరికి ఉత్సాహం ఎగిరిపోయింది. ఏదో విన్నట్టు నటిద్దామని వస్తే ఈ మాట్లాడించుడు ఏందబ్బా!
తేనీటి విరామం ఒక్కటే హాయిగా ఉంది, ఆ జాబితాలో...
మిత్రుడు భగవంతం ఊరడించినట్టు, శూన్యం నింపడానికి ఏదో ఒకటి చేయాలి కదా మరి! నావి కూడా ఆ శూన్యపు భర్తీకి కొన్ని మాటలు...

సరే, మిత్రులందరికీ నమస్కారం.
కొత్తగా చూస్తున్నవాళ్లతో ఇంకా పరిచయం పెరగాల్సివుంది. కొందరి కథలు తెలుసు, కొందరివి తెలీదు...
మొత్తానికైతే రొటీన్ నుంచి ఇదొక మంచి బ్రేక్. దానికైతే సంతోషం. శ్రీశైలం వచ్చానుగానీ కర్నూలు రాలేదు, ఇది కూడా మరో ఆనందం... దానికి కథాసమయం వాళ్లకు ధన్యవాదాలు.


నేను నేపథ్యం చెప్పాలనుకుంటున్న కథ: మరణ లేఖలు

ఇది సాక్షి-ఫన్డేలో 2008లో అచ్చయింది. ఒకవిధంగా ఇది నా రెండో కథ. ఒక విధంగా ఎందుకంటే, నాలుగైదు సింగిల్ పేజీ కథల్ని మినహాయించడం వల్ల...

చాలా గొప్ప కలలుగనే సమయంలో కూడా దానికి పూర్తి విరుద్ధమైన భయాలు ఏవో ఉంటాయనుకుంటాను మనిషికి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కథ మొదలుపెట్టినప్పటికి నాకు పెళ్లి కూడా కాలేదు.
కానీ దాంపత్య జీవితంలో ఒక శూన్యంలోకి జారిపోయే క్షణాలు వస్తాయి, ఒక నిరాసక్తత మొదలవుతుందన్న తెలివిడిలోంచి ఈ కథకు బీజం పడిందనుకుంటాను.

నేపథ్యం కోసం ఏదో చెబుతాంగానీ కాంక్రీట్ పాయింటుతో దేన్నయినా మొదలుపెడతామంటే నేను ఈజీగా నమ్మను. ఒక అంచునుంచి మొదలవుతాం... మనకు ఎక్కడో ఒక ఊహారేఖ ఉంటుంది, దాన్ని అందుకోవాలని తాపత్రయం ఉంటుంది... కానీ చివరికి ఎక్కడో తేలుతాం... నిజానికి మన ఊహారేఖకన్నా ఈ వాస్తవమే బాగుందని కూడా అనిపించవచ్చు.
పోతూవుంటే స్పష్టపడే దారిలాగా... రాస్తూవుంటే కూడా ఒక కొత్తరూపం వస్తూ రచనలో మిళితమైపోతుంది.

ఒక మనిషి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అనేది నన్ను ఎప్పుడూ కలిచివేస్తుంది. దాంపత్యంలో వచ్చే పొరపొచ్చాలు, వివాహానంతర ఆకర్షణలు, తార్కిక ముంగిపుకు తీసుకెళ్లలేని నైతిక సంకెళ్లు, ఆడవాళ్లు ఉద్యోగం చేయడం, దాన్నుంచి కుటుంబాల్లో వస్తున్న మార్పు... మనల్ని ఒక ఒడ్డుకు చేరనివ్వని ద్వంద్వం... ఇట్లాంటి ముక్కలు ముక్కల ఆలోచనలు అన్నీ ఇందులో ఉన్నాయి. బుచ్చిబాబు తరహాలో స్త్రీ పురుష వ్యాఖ్యానం చేయాలన్న ఉబలాటం కూడా ఉంటుంది.

2003లో పాతడైరీల్లో మొదలుపెట్టి... ఎటు తీసుకెళ్లాలో అర్థంకాక అలా ఉండిపోయింది కథ. కనీసం ఐదేళ్ల తర్వాత ఒక కొలిక్కి వచ్చింది. అంటే మనిషిలో ఉండే ద్వంద్వం కూడా సహజమైనదేనని నేను గుర్తించడం వల్ల ... దీనికి ముగింపు దొరికింది. ఇలాగే, ఇది ఇలాగే అనే నిర్దిష్టత జీవితానికి ఉండదనుకుంటున్నాను. బతకడం కోసం అవసరమైన ఈ ద్వంద్వాన్ని కథానాయకుడు అంగీకరించివుంటే బతికిపోయేవాడు.

నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఉమా, వెంకటేశ్...  ఇతర కథాసమయం మిత్రులకు థాంక్యూ చెబుతూ...
సెలవు.