Saturday, March 10, 2018

ఒక అంతర్ముఖుని బహుముఖ రూపాలు


పాఠకుడిగా ఒక కథను చదవడమంటే ఆ రచయిత వెంట ప్రయాణించడం లాంటిది. రచయిత చెప్పాలనుకున్న వస్తువు, విషయం, ముగింపు, గమ్యం అయితే, కథని నిర్మించే తీరు, చెప్పే పధ్ధతి ప్రయాణంలాంటిది. అందుకే ఒకే విషయం మీద ఎన్ని కథలు చదివినా మన అనుభూతిలో తేడాలుంటాయి. దాన్ని శిల్పమన్నా, శైలి అన్నా, అది పాఠకుడి ప్రయాణాన్ని మనోరంజకం చేయడమే దాని ఉద్దేశం.
పూడూరి రాజిరెడ్డితో కథల ప్రయాణం అద్భుతమైన అనుభవం. మనకు విసుగు తెలీకుండా కబుర్లు చెబుతూనే వుంటాడు. తన అనుభవాలు చెబుతూనే, అందులోనుండి గ్రహించిన జీవిత సత్యాలను, తాత్త్విక అవగాహనను మనతో పంచుకుంటాడు.

(పూర్తి పాఠం దిగువ లింకులో)


http://eemaata.com/em/issues/201712/14495.html

వినూత్నమైన కథా కథనాలు



తను, తన కుటుంబం - కుటుంబ జీవితానికి సంబంధించినవే కాకుండా తన అనుభవాలను, జ్ఞాపకాలను యథాతథంగా అక్షరీకరించి 'చింతకింది మల్లయ్య ముచ్చట్లు' పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు (పూడూరి రాజిరెడ్డి).

ఇవన్నీ స్వీయ కథనాలు. అందునా ఆత్మకథాత్మకాలు కాబట్టి కథలన్నింటిలోనూ వున్న రచయిత ఆలోచనాధార చైతన్య స్రవంతిని జ్ఞాపకం తెస్తుంది. అవిచ్ఛిన్నమైన అన్సెన్సార్డ్ఆలోచనాధార చైతన్య స్రవంతి అని చెప్పబడుతుంది. ఇందులో వున్న 'మంట' కథ ఒక్కటే పూర్తి చైతన్య స్రవంతి ధోరణిలో వచ్చింది. కొన్నింటిలో పాక్షిక చైతన్య స్రవంతి ధోరణి, మరి కొన్నింటిలో చైతన్య స్రవంతి ఛాయలు కనిపిస్తాయి. అన్సెన్సార్డ్గా వచ్చే చైతన్య స్రవంతి ధోరణిలో కనిపించే కాముకత్వం, లైంగిక ప్రకోపం, అశ్లీలాలు మర్యాదస్తులకు కొరుకుడు పడడం కష్టమే. చైతన్య స్రవంతి వల్ల వచ్చే ప్రమాదమేమిటంటే, రచయిత తనకు తెలియకుండానే తాను బహిర్గతమవుతాడు. తాను, తన ఇష్టాయిష్టాలు, న్యూనతలు - అసంతృప్తులు, తన జీవితం, తన కుటుంబ జీవితాన్ని కూడా బజార్న పెట్టే అవకాశముంది. అందుకే చాలామంది రచయితలు దాని జోలికి పోలేదు. దాన్ని డీల్చేసే సత్తా కూడా చాలామందిలో లేకపోవడం కూడా ఒక కారణమే. ఒక విస్తృతి అధ్యయనశీలి, ఒక తాత్త్వికుడు, ఒక అసంతృప్త జీవి అంతరంగ మథనమే అనేకానేక విషయాల్ని పాఠకులతో పంచుకుంటుంది. అందులో భాష మరీ ప్రధానం. చైతన్య స్రవంతి పద్ధతిలో భాషతో చెడుగుడు ఆడుకోవచ్చు. శ్రీశ్రీ నుండి లెనిన్ధనిశెట్టి వరకు అలాగే సక్సెస్అయ్యారు. కోవలో వచ్చిన మరో వినూత్న శైలి పూడూరి రాజిరెడ్డిది.  మౌఖిక కథనరీతికి దగ్గరగా వుండి రచయిత మనతో ముచ్చటిస్తున్నట్లే వుంటుంది. కొన్నిసార్లు రచయిత మనమే అన్నట్లుగా, అనుభవాలు మనవే అన్నట్లుగా భ్రమింపజేస్తుంది. కథ ప్రారంభమే మన చేతుల్లో వుంటుంది. ఒకసారి ప్రారంభించామా ఆటోమేటిగ్గా చివరివాక్యం వరకు అద్భుత శైలీ ప్రవాహంలో కొట్టుకుపోక తప్పదు. ద్రవరూప శైలి ఎంతటి గొప్ప పఠనీయతని సాధించి పెట్టిందో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. యు..నరసింహమూర్తి అనే విమర్శకుడు 'తెలుగు వచనశైలి' పేరిట వచనాన్ని అద్భుతంగా రాసే వారి పరిచయాన్ని, వారి వచనశైలి గొప్పదనాన్ని వివరిస్తూ ఒక బృహద్గ్రంథమే రాశారు. ఒకవేళ వారు బతికివుంటే తప్పకుండా పూడూరి రాజిరెడ్డికి ఒక అధ్యాయమే కేటాయించేవారు.

మనం ఊహించినట్టుగా మన జీవితం ఉండదనీ, మనం కోరుకున్నట్లుగా మన జీవితం కొనసాగదనీ తెలిసినప్పుడు, వాటిని ఇతరుల జీవితాలలో చూడడం అనవసరమని 'చింతకింది మల్లయ్యతో ముచ్చట' పెడితే తెలుస్తుంది. అబ్సర్డ్కథాకథనానికి 'రెండడుగుల నేల' గురించి చెప్పుకోవాలి. ఇందులో కొన్ని కథలు స్కెచ్ లాగా లేదా డాక్యుమెంటరీ కథనాలుగా వున్నాయనే మాట వినపడింది. అది నిజం కాదు. లాటిన్అమెరికన్కథకుడు 'బోర్హెస్' పద్ధతి అది. ఇది శిల్పపరంగా కొనసాగే వినూత్న ప్రక్రియ. టెక్నిక్గురించి తెలియనివారు ఇది కథ కాదు, స్కెచ్అని పొరపడే ప్రమాదముంది. ఇవి కథలు అయినా కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఒక అద్భుతమైన రచనాశైలి పుస్తకం నిండా కమ్ముకుని వుంది. అది మనసు చివరిదాకా లాక్కెళ్ళి ఆసక్తిగా చదివింపజేస్తుంది. అదే పుస్తకం ప్రత్యేకత.

చింతకింది మల్లయ్య ముచ్చట్లు (ఇతర కథలు); రచన: పూడూరి రాజిరెడ్డి; పేజీలు: 154; వెల: 144; ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు. ప్రచురణ కర్త ఫోన్: 9848023384

(నవ తెలంగాణ పత్రిక సాహిత్యం పేజీ దర్వాజాలో మార్చి 5న వచ్చిన పరిచయం.)

-
కె.పి.అశోక్కుమార్


ముచ్చట గొలిపిన కథలు



ఈ (చింతకింది మల్లయ్య ముచ్చట) కథలను చదివించడానికి నన్ను ఆకర్షించింది ముందుగా కథలకు పెట్టిన పేరు. ‘చింతచెట్టు’ వొక గొప్ప మెటఫర్‌గా మనకు కనబడుతుంది. గడిచిపోయిన, గడుస్తున్న కాలానికి మధ్య చింతచెట్టు వొక వంతెన. వొక చెట్టుగా కాకుండా అనేక పదుల, వందల చెట్లుగా (ఇది) విస్తరించింది. మన గ్రామీణ ముచ్చట్లన్నీ చెట్ల కిందే కదా పరుచుకొని సేద తీరుతుంటాయి. ఊరి చుట్టూ పరుచుకున్న నేలతో, దానిమీద వలయాలుగా తిరుగాడే ఆకుపచ్చటి వాసనలతో గుబురు చెట్ల కింద కనపడీ కనపడకా గొంగళ్ళు కప్పుకొని ముసురులో మునిమాపులో కథలూ, ముచ్చట్లూ చెప్పుకునే వచన రంగస్థలం ఊరు. ఈ పుస్తకంలోని కథలన్నీ కూడా మన పక్కన నడుస్తూ, ముచ్చట్లు పెడుతూ మనల్ని మనకు ఎరుక పరిచే కథలు.

చాలాసార్లు మనం చెప్పాలనుకున్న కథలు, చెప్పలేక దాచుకున్న కథలు ఎన్నో ఉంటాయి. కొన్ని అనివార్యంగా మన చేతిలోంచి జారి పుస్తకాల్లో పడిపోయి పలకరిస్తాయి. ఈ కథలన్నీ అలా ఉండనివ్వనితనంలోంచి జారిపడిన ముచ్చట్లు అనిపిస్తుంది. ఒక పాఠకుడిగా నాకు తెలిసినంతవరకు ఏ కథయినా మనకు నచ్చితే దానికి కారణం కథకుడి నిజాయితీయే కారణమని తోస్తుంది.రచయిత నిజాయితీ వల్ల రచనకుగానీ/ కథలకుగానీ అపురూపమయిన సౌందర్యాకర్షణ ఏర్పడుతుందేమో. ఈ ముచ్చట్లలో అలా చదివించగలిగే ఆకర్షణ అలరారింది. వొక మంచి కథను measure చేయడానికి ఏ స్కేలు ఉండదు. అది sixth senseకు సంబంధించిందని చాలాసార్లు పాఠకుడిగా నాకు ఎదురయిన అనుభవం. చాలావరకు రాజిరెడ్డి ఈ కథల్లో వొక non-personగా ఉంటూ కథ చెప్పుకొస్తాడు. మల్లయ్య వ్యక్తిత్వాన్ని పట్టుకొని కథాగమనంలోకి మళ్లించాలని ప్రయత్నిస్తాడు. మల్లయ్య వొక సజీవధార కాబట్టి ఆ ధారను సరిగ్గా పట్టుకోలేకపోయానని రచయిత failureని వ్యక్తం చేస్తాడు కూడా. కానీ పాఠకులు మాత్రం ఆ అసంతృప్తికి లోనుకారు. రచయితకు ఉండే aesthetic hunger వల్ల అలా అనుకుంటాడు. అంతే! 

ఈ కథలన్నీ కూడా మనల్ని మనకు చేరువగా చేర్చగలిగిన కథలు. ఈ కథలన్నింటిలోనూ తను ప్రత్యేకమయిన సింపుల్‌ అనుభవాలను విస్తృతానుభవంగా మేజికల్‌గా మార్చి అందించడంలో సఫలత చెందాడనీ, తన దాహాన్ని తీర్చుకున్నాడనీ నాకనిపించింది. రాజిరెడ్డి టెంపర్‌మెంటే ఈ కథలన్నింటికీ చదివించే గుణాన్ని ఇచ్చింది. అతను మాట్లాడే తీరే అతని శైలి. అతనితో మాట్లాడితే అతని ఊరుతో మాట్లాడినట్టే, అతని కథలతో మాట్లాడినట్టే ఉంటుంది. ఈ కథలన్నింటిలో ఉండే సంభాషణలు, పాత్రలు, వస్తువుల మధ్య డ్రమటిక్‌గా ఉండే గ్రామీణ మననం వొక ప్రత్యేకమయిన అంశంగా కనిపించింది. తను చెప్పాలనుకున్న కంటెంట్‌ని సారవంతమయిన సంభాషణలో ఇమిడ్చే ప్రయత్నం చేస్తాడు రచయిత. ఈ కథల్లో కొన్నింటిలో వ్యంగ్యం ఉంటుంది. అయితే ఈ సోషల్‌ సెటైర్‌ని పొలిటికల్‌ సెటైర్‌ దాకా తీసుకెళ్లకుండా వ్యక్తుల స్వభావ చింతన దగ్గర ఆగిపోతుండటం చూస్తాం. దానివల్ల కూడా పాఠకుడు, కథలకు మరింత దగ్గరగా రావటం చూస్తాం. ఇటువంటి బ్యాలెన్స్‌ పతంజలి గారి కథల్లో రుచి చూశాం. ఇందులోని సంఘటనలను పాత్రలే నిర్వహిస్తాయి. తమని తాము సంఘటనలకు అప్పజెప్పవు. మొత్తం కథాంతరంగాన్ని పాత్రలవైపు నుంచే రచయిత కథను నిర్వహించడం చింతకింది మల్లయ్య ముచ్చట్లలో కొత్తదనంగా తెలిసొచ్చింది. వొక నైసర్గిక గ్రామీణ ప్రాంతంలోని మల్లయ్య ముచ్చట మొత్తం కథలన్నింటిలోకి సారవంతంగా ప్రవహించింది కైనటిక్‌ ఎనర్జీ లాగ.
(ఆంధ్రప్రదేశ్‌ పత్రిక నవంబర్‌ 2017 సంచికలో వచ్చిన పరిచయం.)
– సిద్ధార్థ