Saturday, February 22, 2014

రియాలిటీ చెక్ ప్రసంగాలు-3: కారా మాష్టారు

ఫిబ్రవరి 8, 2014న శ్రీకాకుళం కథానిలయంలో కథానిలయం తరఫున రియాలిటీ చెక్ పుస్తకాన్ని ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావుగారు ఆవిష్కరించారు. ఇది పూర్తిగా కథానిలయం నిర్వహించిన సమావేశాల సమాహారం.
అయితే ఈ కార్యక్రమానికి నేను హాజరు కాలేకపోయాను. పుస్తకాన్ని ఆవిష్కరించిన తరువాత కారా మాష్టారు మాట్లాడారు. ఆ మాటల్ని రికార్డు చేసి "విన్నవి విన్నట్టుగా...'' రాసి పంపారు పుస్తక ప్రచురణకర్తల్లో ఒకరైన సుధామయి గారు. దాన్నే ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
--------------------------------------

తేదీ సరిగా జ్ఞాపకం లేదుగానీ ఒక రెండు వారాలో... క్రితం... మూడు వారాలో... జ్ఞాపకంలా నాకు డేటు... ... అదీ... తుమ్మేటి రఘోత్తమరెడ్డి అనీ... ... ఉన్నారు. ఆయనా... ఈ పుస్తకం మేష్టారూ, మీరు తప్పక చదవాలీ... అన్నాడు. ఎంచేతంటే, నా చూపుతోటి ఇబ్బందుందీ... పగలు తప్ప రాత్రి చదవలేను... కథానిలయంకొచ్చే ఏ పుస్తకమైనా సరే, నేనిక్కడుంటే నేంచూడందే కథానిలయానికి మావాళ్లు తీస్కెళ్లరూ... అంచేత... అలాగ.. ఏదైనా ఒక పుస్తకం
చదువుతూ కొన్నికొన్ని చూసి, ఆ తర్వాత నేను పెట్టేస్తుంటాను.
ఇదీ... ఆ.. చదవడానికి కూచున్నాను. అరవై వ్యాసాలో ఎన్నో... చదవడానికి కూచున్నాను. అరవై వ్యాసాలూ చదవాలీ అంటే - మరీ ఎక్కువుండదు - మూడేసి పేజీలు. మాగ్జిమం నాలుగు పేజీలు... కదమ్మా?
(తలూపాను.) అలా వుంటుందన్నమాట.

అంచేత మొదటగా చూశా...న్నమాట. అరవైలోనూ ఏం చైడమని ఒకటేదో ఒక హెడ్డింగ్ బాగున్నదీ... ఆ... తెలంగాణా సంబురం... ('ఏమ్మా?'... 'అవునండీ'...) తెలంగాణా సంబురం అనీ అలాంటి హెడ్డింగ్‌తో ఉంది. అక్కడి
వంటకాలూ అవీ, ఏమొండుతారూ పండుగల్లోనీ, అవెలాగుంటాయీ... వాటిమీద.
నాకు అన్నిటికన్నా బాగా ఆ... ... ఆకర్షించిందేంటంటే ఎఖ్క... డానూ రచయిత అవుపళ్లా! రచయిత గొంతుకు మాత్రమే వినపడుతూ ఉంది. అదీ... ఆ గొంతుకు... వినపడిందా అంటే... తర్వాత .... చదివింతర్వాత... రచనకు అనుగుణమైన గొంతుక... ఎవరు ఈయనా? అనుకున్నాను...
తర్వాత అడిగితే ఫలానా అని చెప్పారు. ఆయన పేరు నేనెప్పుడూ వినలేదు. ఎంచేతంటే నేను పత్రికల్లో వచ్చే కథలు చదూతాను తప్ప సీరియల్స్ చదవను. రెండోది... ఉమ్... అలాగే ఫీచర్స్ కూడానూ... నేనూ... కాలక్షేపం కోసం పేజీలు నింపటానికి రాస్తారని నా అభిప్రాయం... అంచేత ఎప్పుడూ ముట్టుకునేవాడ్ని కాను.

చదివింతర్వాత ఎవరితనూ... ఏంచేస్తుంటాడు... ఇవన్నీ రఘోత్తమరెడ్డికి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆ... ఆరు చదివాను. ఆరులోనూ ఒకటి కూడానూ ఇబ్బంది పెట్టలేదు. పైగా ఇంకా చదవాలనే ఉంది. కానీ, నాకు ఒకేసారి ఐదారు పుస్తకాలు ఉంటయ్. అలాంటపుడు పక్కనబెడ్తాను. ఇది ఇప్పటికీ కథానిలయంలోకి వెళ్లలేదు, నా గదిలోనె ఉంటది. అదీ దీని గురించిన నా అభిప్రాయం.

తర్వాత ఇంకోటేంటంటే, ఆ... ఆ... ఇరానీ హోటల్... అనీ ఒకటుంటది. ఇర... ఇరానీ హోటల్లో రెండున్నర గంటలు... ఆ రెండున్నర గంటల్లో నిన్ను... ఆయనేంటేంటి చూశాడు... ఏంటేంటి విన్నాడు... ఏం..టేంటి... అలాగ... ఎవరెవరొచ్చారు... ఏంటేంటి విన్నాడు.... ఏరకంవాళ్లొచ్చారు... అంటే... మనిషిని ... ఆ... మనిషిని పోలిన మనిషిగాని... గొంతుకుపోలిన గొంతుక్కాని... వాక్యాన్ని పోలిన వాక్యంకాని... లేకుండా... కొన్ని వందలమంది... ఆ రెండున్నరో మూడు పేజీల్లొనే కొన్ని వందలమంది నా కళ్లముందున్నారు.
నేను హైదరాబాదు కథానిలయం పనులమీద వెళ్లినపుడు ఇరానీ హోటల్‌కి తప్పకుండా వెళ్తుంటాను. అదీ... ఒక ప్రత్యేకమైన ఇదండీ... ఆ... పేరు జ్ఞాపకం రాటంలేదూ... ఆ లాడ్జ్ దగ్గర.... నేనెక్కువగా బసచేసేవాడ్ని. అక్కడ దగ్గర్లో ఉండేది ఇదీ... ఈ... పర్టిక్యులర్స్ తెలియవండీ... అక్కడా... మన విశాఖపట్న్.... హైదరాబాదులో ఉండేటువంటి రచయితలూ, కథకులూ అందర్నూ... ఫలానా ప్రతిరోజూనూ లేదంటే ఫలానా పర్టిక్యులర్ ఏదో ఒక హౌస్‌లో ఫలానాదగ్గర మీటవుతారని తెలుసూ... అలాంటి చోటుకి నేను తప్పకుండా వెళ్లేవాడ్ని. నేను అన్నిసార్లూనూ హైదరాబాదుతో పరిచయం చేసుకున్నానుగానీ... దీంట్లో నాకు పరిచయమైనంతగా ఆ హోటల్ లైఫ్ అన్నది నాకు పరిచయం కాలే!

అలాగే... అక్కడా... వెంకటేశ్వరుని దేవాలయం ఉందిగదా... ఆ దేవాలయం మీదకీ.... ఆ... వెళ్లేన్నేను... చూసేను... అవన్నీ అయ్యాయ్.... కానీ నేను గమనించనివి ఎన్నో ఉన్నయ్. ఎంతసేపూ తెల్లబట్టలేసుకోని... పట్టుబట్టలేసుకోని దేవాలయానికి వెళ్లేవాళ్లు నాకవుపడ్డారు కానీ, ఉత్పత్తి జనం అవుపళ్లేదు. ఈయన వాళ్లనీ, వాళ్లనే ప్రధానం చేసి .... వాళ్లందర్నీ చిత్రించాడు. అలాగే ప్రతీ వ్యాసంలోనూ అలాగే ఉంటుంది. అంత బాగా... అంటే... ఆ... తక్కువ పేజీల్లో అతి తక్కువ వాక్యాల్లో అతి ఎక్కువ పరిచయం చేసేటువంటి అతని శిల్పమే బ్రహ్మాండమైంది. అందుగురించి నేనా విషయం రఘుకి ఫోన్ చేస్తే, మేష్టారూ, ఈ పుస్తకాన్ని మీరే ఆవిష్కరించాలీ... ఇక్కడ నాతో ఏం చెప్పారో అదే అక్కడ చెప్పండి...

ఆ... ఇదీ... పూడూరి రాజిరెడ్డి ఎవరో నాకు తెలియదూ... మీరూ తెలుసుకోవలసిన అవసరం లేదు. కానీ, హైదరాబాదే కాకుండా తెలంగాణాలో అనేక ప్రాంతాలు, ఇతర చోట్ల అనేక ప్రాంతాలు, అక్కడి జీవితం... ఎ... ఎన్నో ఎన్నో... చెప్పలేవండీ... ఎంతోమందితో మీకు పరిచయమవుతుంది. ఒక్కొక్క వాక్యంతోనే ఒక మనిషిని రూపుకడతాడు. స్వభావాన్ని... .... అలా నాకనిపించింది. ఇది నా అనుభవం. ఇదే కరెక్టని నేననుకోను. ఎంచేతంటే ఏదైనా జరిగినపుడు తమ జీవితం తాలూకు ఉండేటువంటి పరిచయం... లోకంతో ఉండేటువంటి పరిచయం... వయసు... తరవాతా... ఇంకా అనేకమైనవీ... చదువూ, ఆసక్తీ... ఇట్లాంటివి... ఒక్కొక్కళ్లకూ ఒక్కోలాగా ఉంటయి. అందరికీ ఒక్కలాగు ఉండవు. అంచేత అందరికీ ఏ రచనైనా ఒక్కలాగా అనిపించకపోవచ్చు. నిజంగా... ఇందాకా... మా... అర్నాద్ రచన గురించి అంతసేపు ఇంతమంది మాట్లాడుతుంటే ముఖ్యంగా వివినమూర్తి కూడా అలాగ మాట్లాడుతుంటే నాకాశ్చర్యమేసింది. ఎందుకింత చెప్తున్నారు? అని. అయితే దానికొక కారణముంది. కథానిలయానికి బీజం పడ్డానికి ఆ రోజుల్లో ఒక కొన్ని గైడ్‌లైన్స్... ఆ అభిమానం నన్నేకాదు... వివినమూర్తిని కూడా ఎంతో కట్టిపడవేసింది. ఇదీ అంతసేపు మాట్లాడటానికి కారణం. దాసరి రామచంద్రరావైనా అటువంటి కారణంచేతే మాట్లాడి ఉంటాడని నేననుకుంటున్నా. అదీ... అంచేత... దీని...

ఇంకో తమాషా ఏమిటంటే ఎవరైనా రైటరూ ఒక పుస్తకం రాస్తే ఒకప్పుడు అరుదుగా పబ్లిషర్లు వచ్చేవాళ్లు. లేకపోతే... లేపోతే వాళ్లు ఏదో కారణంవల్ల, వేరే కారణాలవల్ల పబ్లిషర్ వస్తాడు. కానీ రచయిత అడక్కుండానే, రచయిత ఎవరో తెలియకుండానే దానికో పబ్లిషర్ రావడమనేది కూడా విశేషం ఈ పుస్తకం విషయంలో. ఈవిడ... ఇది... మొదటిసారి ఒకట్రెండు మాటలు మాట్లాడి ఉంటాను. ఇవ్వాళ ... ఇక్కడ కలిశాను... వీర్ని. ఈవిడ ఆ పుస్తకంలో కొన్ని రచనలు చదివి, అందులో ముఖ్యంగా ఒక రచన... పేరు జ్ఞాపకంలేదు... ఆ రచన చదివి, ఇంప్రెస్ అయ్యి, మొత్తం వ్యాసాలన్నీ కలెక్ట్ చేసి, అవన్నీ కలిపి ఈ పుస్తకంగా ఆథర్ తనని అడక్కుండా అచ్చేసింది. అంచేత... అదీ ప్రత్యేకం... ఈ పుస్తకం తాలూకు.
సెలవు.

Thursday, February 20, 2014

రియాలిటీ చెక్ ప్రసంగాలు-2: అభిమాన మిత్ర వాక్యాలు

తెనాలిలో జరిగిన రియాలిటీ చెక్ ఆవిష్కరణ సభలో ఒక వక్త బి.ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ నాకు మిత్రుడు. ఉద్యోగ రీత్యా ప్రస్తుతం హైదరాబాదులోని డిజిటల్ గ్రీన్ ఎన్జీవోలో పనిచేస్తున్నాడు. రైతులకు వీడియో పాఠాలు నేర్పడం చేస్తుంటాడు. అంతకుముందు లయోలా విద్యార్థులకు 'ఫిలిం' బోధించేవాడు. అయితే, పని ఒత్తిడిలో ఆ రోజు సభకు హాజరుకాలేకపోయిన ప్రవీణ్ తన మాటల్ని రాసి పంపాడు. వాటిని ప్రముఖ న్యాయవాది, సుప్రసిద్ధ న్యాయవాది బి.చంద్రశేఖర్ సహచరుడు అయిన నాగేశ్వరరావు చదివి వినిపించారు. ఆ పాఠాన్నే ఇక్కడ ఉంచుతున్నాను....

-----------------------------------------------------

రియాలిటీ చెక్ ఆవిష్కరణకోసం ఇక్కడికి రావాల్సి ఉండీ అనివార్యంగా రాలేకపోయిన మిత్రుడు ప్రవీణ్ తరఫున ఈ...
అభిమాన మిత్ర వాక్యాలు.

పూడూరి రాజిరెడ్డి పుస్తకం 'రియాలిటీ చెక్' తెనాలిలో ఆవిష్కరింపబడటం చాలా ఆసక్తికరమైన విషయం.

ఈ విషయం లోలోపలికి వెళితేనే రాజిరెడ్డి రచయితగా బాగా అర్థం అవుతాడు. ఎందుకంటే రాజిరెడ్డి ఎప్పుడూ ప్రాంతం గురించి రాస్తున్నానని చెప్పుకోలేదు. అలా ఎప్పుడూ రాయలేదు. అదేవిధంగా- సిద్ధాంతాల ముసుగులో కూడా ఆయన ఎప్పుడూ గంభీరమైన ప్రకటనలు చేయలేదు. మతాల గురించిగానీ, కులాల గురించిగానీ- వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న భావన కూడా ఎప్పుడూ కల్పించలేదు. అయినా రాజిరెడ్డి చాలామంది ఆదివారం పాఠకులతో ఓ అర్ధగంటో, ఓ గంటో స్నేహం చేయగలిగాడు. అందుకే రాజిరెడ్డి పుస్తకం తెనాలిలో ఆవిష్కరింపబడటం నాకు చాలా ఆసక్తికరమైన విషయంగా తోచింది.

మనం(సాధారణంగా) ప్రమాణాలుగా పెట్టుకున్నటువంటి ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని, ఇంకా చెప్పుకుంటూపోవాలంటే వర్గాన్ని కూడా ఆయన ప్రమాణంగా తీసుకోకపోవడమే అందుకు కారణమై ఉండొచ్చు. వీటన్నిటికీ అతీతమైనవాటిని ఏవో - ప్రస్తుతానికి నాకైతే స్పష్టత లేదు - రాజిరెడ్డి పట్టుకుంటున్నాడు. అందుకే రాజిరెడ్డి తెనాలి వాళ్లకు ఈ సందర్భంలో ఆప్తుడయ్యాడు. అలా సాహిత్యం ఉంటే- దానికి విశ్వసనీయత, విశ్వజనీనత ఉంటుందని నా నమ్మకం. ఆ దిశగా మిత్రుడు రాజిరెడ్డి పయనించడం నాకు ముచ్చట కలిగించే విషయం.

ఇప్పుడు రాజిరెడ్డి 'రియాలిటీ చెక్' పుస్తకం గురించి పదివాక్యాలు మాట్లాడుతాను.

నగరాలని కథగా చెప్పడం, లేదా వచనంలో ముక్కలుముక్కలుగా వ్యాసాలుగా చెప్పటం అనేది చాలా అరుదైన ప్రక్రియ. నాకు తెలిసినంత వరకు తెలుగులో నగరాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని చాలా తక్కువమంది రాసారు. రాజిరెడ్డి అటువంటి ప్రక్రియను చాలా సమర్థవంతంగా రాయగలిగాడు. నగరంలో జీవితం ఉంటుంది- ఆ జీవితం చుట్టూ అల్లుకుపోయిన వైవిధ్యాన్ని, చరిత్రను రాజిరెడ్డి తన చక్కెర గుళికల్లాంటి వ్యాసాల్లో బాగా రికార్డు చేయగలిగాడు.

ఇంగ్లీషు సాహిత్యంలో అయితే- చార్లెస్ డికెన్స్... లండన్ నగరం గురించి, జేమ్‌స్ జాయిస్... డబ్లిన్ గురించి, ఓరహాన్ ఫాముక్... ఇస్తాంబుల్ గురించి చాలా అద్భుతమైన వర్ణ వివరణ చేసారు. ఇండియన్ ఇంగ్లీషులో సుకేతు మెహతా 'మ్యాక్సిమమ్ సిటీ' పుస్తకంలో ముంబయి గురించి ఆసక్తికరమైన వచన రచన చేసాడు. అలా మహా మహా రచయితలు భుజానికెత్తుకున్న నగర జీవితం అన్న అంశంపై పూడూరి రాజిరెడ్డి... హైదరాబాద్ గురించి రాయడం తెలుగు సాహిత్యంలో ఒక అరుదైన ప్రయోగం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో హైదరాబాద్ గురించి రాయబడిన పుస్తకం... రేపు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కచ్చితంగా పాపులర్ అవుతుందని పాఠకునిగా నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎన్నుకొన్న బ్యాక్‌డ్రాప్ హైదరాబాదే కావొచ్చు... కానీ అందులో రాసిన జీవితం కేవలం హైదరాబాద్‌కే సంబంధించినది కాదు.

అందుకే మళ్లీ చెబుతున్నాను...
పూడూరి రాజిరెడ్డి పుస్తకం 'రియాలిటీ చెక్' తెనాలిలో ఆవిష్కరించబడటం చాలా ఆసక్తికరమైన విషయం. గమనించాల్సిన విషయం.

కృతజ్ఞతలతో...
బి.ప్రవీణ్ కుమార్
(జనవరి 5, 2014)

Friday, February 14, 2014

నా తొలి అధికారిక ప్రసంగం

జనవరి 5, 2014న 'రియాలిటీ చెక్' పుస్తక ఆవిష్కరణ తెనాలిలో జరిపాం. పుస్తక రచయితగా మాట్లాడక తప్పదు కాబట్టి, ముందే రాత ప్రతిని సిద్ధం చేసుకుని వెళ్లాను. అయితే రాసుకున్నది రాసుకున్నట్టుగా మాట్లాడలేదు. కొన్నింటిని అక్కడ కంగారును బట్టి స్కిప్ చేశాను, అదే కంగారును బట్టి కొన్ని కలిపాను కూడా. మొత్తానికి విజయవంతంగానే పూర్తిచేయగలిగాను. ఆ ప్రతిని, అంటే నేను కలిపినవాటిని కలుపుకొని, రాసుకునీ మాట్లాడనివాటిని విస్మరించకుండా తుదిరూపం ఇచ్చిన కాపీని ఇక్కడ ఉంచుతున్నాను.

నిజానికి సభ సభలా ఉండకూడదనీ, ప్రసంగం ప్రసంగంలా ఉండకూడదనీ, దానివల్ల ఒక ఇన్‌ఫార్మల్ లుక్ వస్తుందనీ ఎంత ప్లాన్ చేసినా కూడా, వందమంది కూర్చుండి ఒక మనిషి నిలబడి మాట్లాడటంతోనే అది ఫార్మల్ అయిపోతుంది కదా! ఆ లెక్కన ఇది నా తొలి అధికారిక ప్రసంగం.
అంతకు ముందు, అంటే ఏడాది క్రితం చిలుమూరు కథకుల సమావేశంలో చాలా 'ఊగిపోయి' మాట్లాడాను. నేను నిజాయితీగా ఊగానని అందరూ మెచ్చుకున్నారు కూడా! కాకపోతే అది కూర్చుండి మాట్లాడటం కాబట్టి, దానికి అధికారిక ముద్ర వేయడంలేదు.

ఇక ఉపన్యాసంలోకి వెళ్లేముందు...
ఊహించుకోవడానికి వీలుగా... తెనాలి చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్... పై అంతస్తు... సాయంత్రం ఆరుగంటల ప్రాంతం... చిన్న స్టేజీ... ఆ వీడియోను ఏం చేయాలో ఇప్పటికీ (మాకు) తెలియని ఒక వీడియోగ్రాఫర్... లోకల్ ఎడిషన్ల ఫొటోగ్రాఫర్లు... నేనేం మాట్లాడబోతున్నానోనని నావైపే చూస్తున్న కొన్ని జతల కళ్లు... నా గొంతు మీకు తెలిసే అవకాశం లేదు కాబట్టి మీ గొంతు మీకే అరువిచ్చుకుని...
స్టార్ట్!


రియాలిటీ చెక్ ఆవిష్కరణ నెపంతో ఒక సాయంత్రం

నా కాళ్లల్లో వణుకు మీకు తెలిసే అవకాశం లేదుగానీ, గొంతులో వణుకును మాత్రం అర్థం చేసుకోండి.

మీరు చెప్తే నమ్మరేమో!
నాకు ఫ్రాన్స్ అంటే ఒక పిచ్చి. ఆ పేరుతో నేను ఎందుకో కనెక్ట్ అయిపోతాను. నాకు ఆ దేశంతో ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. అదేంటో నేను స్పష్టంగా చెప్పలేను. కానీ ఏదో ఒక లింకు... టెన్నిస్‌లో మేరీ పియర్స్ నాకు నచ్చడానికి కారణం- ఆమె జడ ఒక్కటే కాదు, ఆమె ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహించడం కూడా. ఇంకా- ఫుట్‌బాల్‌లో జినదిన్ జిదానే తెలుసంటే కేవలం కారణం ఆయన ఫ్రాన్స్‌కి చెందినవాడు! 1998 వరల్డ్ కప్‌లో నేను ఫ్రాన్స్‌కు ఎందుకు మద్దతిచ్చానంటే- అది ఫ్రాన్స్ కాబట్టి. నిజంగానే వాళ్లే కప్ గెలుచుకున్నారు.
ఇప్పుడు ఫ్రాన్స్ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానో మీకు తెలిసిపోయేవుంటుంది... ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో తెనాలికి ఉన్న చారిత్రక లంకెను గుర్తుచేయడానికి.
ఆ పారిస్‌లో లేకపోయినా ఈ క్షణం నేను ఈ పారిస్‌లో ఉన్నాను. అదీ విషయం!

నాకు సంబంధించిన రెండు విషయాలు బ్రేక్ చేస్తున్నానిక్కడ. ఇంతకుముందు రెండు పుస్తకాలు అచ్చు వేసినా కూడా ఆవిష్కరణ సభంటూ జరపలేదు. స్పీచ్ అనేది పెద్దమాట అనుకుంటే, కొంత ఫార్మల్‌గా కూడా ఎప్పుడూ నేను మాట్లాడలేదు.
సాకం నాగరాజ గారు, కోట పురుషోత్తం గారు అడిగితే 'రైతు కథలు' పుస్తకానికి ఒంగోలులో మాట్లాడుదామని రిహార్సల్ చేసుకున్నాగానీ అక్కడికి వెళ్లడానికి రైల్వే వాళ్లు అడ్డంపడ్డారు, నాలుగైదు గంటలు ఆలస్యం చేసి. (ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఇక్కడ చేయివూపాలి... అని ఎంతో ప్రాక్టీస్ చేశాను.)
నిజానికి ఈ సభ- దీనికంటే ముందటిది హైదరాబాద్‌లో జరగాలి. చివరి నిమిషం- అంటే ఖరారు చేసుకునే సమయంలో నాకు చిరాకొచ్చేసింది. ఈ ఫోన్లేమిటి? వాళ్లను పిలవడం ఏమిటి? వాళ్లకు వాళ్లు ఏయే పనుల్లోనో ఉంటారు, వారి ఉద్వేగాల్లోంచి దీన్లోకి నేను దారిమళ్లించాలి... ఇదంతా ఒక క్రమంలోకి పెట్టుకురావాలి... అయ్యబాబోయ్! అందుకే చేతులెత్తేసి... వద్దంటే వద్దని వదిలేశాను. కానీ వీళ్లు (సురేశ్ గారు, నారాయణ గారు, సుధామయి గారు) కచ్చితంగా చేయాలన్నారు. అందరం కలిసినట్టుగా కూడా ఉంటుంది కదా...

నాకేంటంటే-
మనుషుల్లో కలవడం ఇబ్బంది. గుంపులో కలిసిన మరుక్షణమే నాకు గదిలోకి పారిపోవాలనిపిస్తుంది. అలాగని గదిలోనే ఎక్కువసేపుంటేగనక బయటికి పరుగెత్తాలనిపిస్తుంది. ఆ గోడలు బోరుకొట్టేస్తాయి.
నాకేమనిపిస్తుందంటే, ఏదీ ఎక్స్‌ట్రీం ఉండకూడదు;
మన ఏకాంతాన్ని చీకాకు పరిచేంత సందడి ఉండకూడదు, అలాగే- స్తబ్ధతగా మారిపోయేంత ఏకాంతం కూడా ఉండకూడదు.
కొంత మితి... మధ్యేమార్గం... నార్మల్సీ... అదే సహజమేమో!
సభా మర్యాదలోకి రాని మాటలు- నా ఉద్దేశంలో రియాలిటీ అంటే ఒక్కోసారి మర్యాదను అతిక్రమించేదైనాసరే, అది వాస్తవమైనపుడు చెప్పాలనే అనుకుంటాను.
ఏదైనా కూడా రెండు పెగ్గుల సాయంత్రంలాగుండాలి; ఒకటీ కాదు, నాలుగూ కాదు. రెండే!
అట్లా నేను ఆశించే పరిమిత సందడి దొరుకుతుందనే నమ్మకంతోనే మనం ఇలా కలవాలని నేను కోరుకున్నాను.

వెయ్యి కాపీల మిడిమేళానికి ఓ పుస్తకం వేయడం అవసరమా? అనికూడా ఒకటేదో నాలోపల గుంజాటన ఉంటుంది...
పుస్తకాలను చదవకపోవడం ఎప్పుడూ ఉంది.
పురాణం సుబ్రహ్మణ్య శర్మగారే 500 కాపీలతో మూడుసార్లు ప్రచురించుకుని మూడు ముద్రణలు పొందిందని సంతోషపడ్డారని మొన్నెక్కడో చదివాను.
శ్రీపాదలాంటివారు కూడా రచయిత పుస్తకం కష్టాలు అంటూ రాశారు. (అదృష్టవశాత్తూ నాకు మంచి పబ్లిషర్స్ దొరికారు...)
మనం రాసింది పుస్తకంగా ఎందుకు రికార్డ్ చేయాలనేదానిమీద నాక్కొంత క్లారిటీ ఉంది.
'2012 యుగాంతం' సినిమాలో అంతా నాశనమైపోతుంటే, కొందరు కొన్నింటిని కాపాడుతుంటారు... ఏనుగులు, ఒంటెలు, మోనాలిసా లాంటి పెయింటింగ్సు...
నిజంగానే భూమి అంతమంటూ జరిగితే ఒక కొత్త ప్రపంచంలో ఉండాల్సిన విలువైనవన్నింటినీ వాళ్లు భద్రపరిచే ప్రయత్నం ఒకటి చేస్తారందులో...
భూమి మునిగిపోయినా నా పుస్తకం అలా ఉండాలని కాదు ఇక్కడ నేను చెప్పబోయేది...
అందులో- యుగాంతం విషయం తక్కువ మందికి తెలిసుంటుంది.... అందులో ఒక శాస్త్రవేత్తగా నటించిన షువెటల్ ఎజియోఫార్ ఒక డైలాగ్ చెబుతాడు.
తన బ్యాగులో ఉన్న పుస్తకాన్ని హీరోయిన్‌కు చూపిస్తాడు. ఫేర్‌వెల్ అట్లాంటిస్ అని ఉంటుంది దానిమీద...
'హార్డ్లీ 500 కాపీస్ సోల్డ్ రచయిత' పుస్తకం తననెంట వస్తోందంటాడు. ఎందుకంటే ఆ క్షణాన ఆ పుస్తకం చదువుతున్నాడు కాబట్టి.
పుస్తకాన్ని అందరూ చదవాలని ఆశిస్తామేమోగానీ, ఎప్పుడూ చదవరు. కానీ చదివేవారు ఎవరో ఒక్కరే ఉంటారు. వాళ్లే ఆ పుస్తకం గురించి నమోదు చేస్తారు. దానివల్లే ఈ పుస్తకం పేరో, రచయిత పేరో ముందువాళ్లకు బట్వాడా అవుతూవుంటుంది, అందులో బట్వాడా కాదగినంత విషయం ఉంటే.
అట్లా కావడం వల్లే నేను మొన్నమొన్న పొట్లపల్లి రామారావు కథలు చదివాను. కల్యాణ సుందరీ జగన్నాథ్ పేరు విన్నానుగానీ ఇంతవరకూ ఆమె కథలు చదవలేదు. రేపెప్పుడో కచ్చితంగా చదువుతాను. ఎందుకంటే ఆ పేరుకు సంబంధించిన ఇదేదో పడిపోయింది నాలో...
పేరు రికార్డ్ కావడంవల్ల పుస్తకాన్ని ఎప్పటికైనా చదివించగలిగే ప్రేరేపణ ఏదో కలుగుతుంది. అట్లాంటి క్యుములేటివ్ దాన్లో యాడ్ అవుతూవస్తుంది. అయోమయంగా ఉన్న పాఠకుడికి ఒక సూచిక ఏదో దొరుకుతుంది. ధూర్జటి... ఈ పేరు వినడంవల్ల నేను కొత్తగా చదివాను. నాకు అభిమాన కవిగా మారిపోయేంత గొప్పతనం ఆయనకుంది. భావాల వల్లనేగానీ కవిత్వపు సొగసువల్ల కాదు; దానర్థం ధూర్జటి కవిత్వం సొగసైనది కాదని కాదు. కవిత్వాన్ని, చిత్రాల్ని అర్థంచేసుకునే శక్తి నాకు లేకపోవడంవల్ల నేను భావానికే పరిమితం అయ్యానని చెబుతున్నాను.
అలా నా గురించో, రియాలిటీ చెక్ పుస్తకం గురించో కూడా రికార్డ్ అవుతుందేమోనని ఆశ!
పుస్తకాన్ని చదవాల్సింది ఎప్పుడూ ఇప్పటి తరం వాళ్లు కాదు; చదివితే చదవొచ్చుగాక, కానీ చదవాల్సింది తర్వాతివాళ్లే!

రియాలిటీ చెక్ ఎలా ప్రారంభం అయిందీ...
ఇదో పద్ధతిగా మొదలైంది కాదు. ఇలా రాయబోతున్నానని కూడా అనుకోలేదు.
2011లో ఫన్‌డేలో మార్పులు చేసినపుడు-
మెయిన్ కవర్ స్టోరీతో పాటు సెకండ్ స్టోరీ ఏదో ఉండాలనుకున్నారు అప్పుడు కన్సల్టంట్-గా ఉన్న ఇప్పటి ఫీచర్స్ ఎడిటర్ ఇందిర పరిమి గారు. ఈ ఐటెం, ఆ ఐటెం అనుకున్న తర్వాత- ఇరానీ హోటల్ మీద ఏదైనా రాయొచ్చు కదా... ఇరానీ హోటల్ రాశాం కాబట్టి, ఎర్రగడ్డకు వెళ్తే బాగుంటుంది కదా... అట్లా ఇందిరా పార్క్... అప్పటికి స్పష్టత రావడం మొదలైంది. ఈ ఫీచర్‌కు ఒక రూపం రావడం మొదలైంది... నేను కేవలం పాత్రికేయుడిగా కాకుండా, దాన్లోకి మరింత నేనుగా చొరవ తీసుకుంటూ వెళ్లాను.
చార్మినార్... బిర్లా మందిర్... మెన్స్ బ్యూటీ పార్లర్... షాపింగ్ మాల్... పశువుల అంగడి...
కల్లు కాంపౌండ్‌కు వెళ్లాను... అలాగని పబ్బులోకి వెళ్లడం నిషేధం అనుకోలేదు.
అడ్డాకూలీలతో మాట్లాడాను... ఎఫ్ఎం రేడియో జాకీలనూ పరామర్శించాను...
భిక్షుకుల కోసం వెతికాను... వేద పాఠశాల విద్యార్థులను కలిశాను.
శ్మశానమూ... జూ పార్కూ...
చేపల మార్కెట్... రైతు బజారు...
తలకోన అడవి... కొత్తపట్నం సముద్రం...
గాంధీ హాస్పిటలూ... కుక్కలకోసం పెట్టిన ఆసుపత్రీ...
ఎక్కడెక్కడ జీవితం ఉందనిపిస్తే అక్కడికి వెళ్లొచ్చాను... ఎన్ని రకాలుగా జీవితాన్ని పట్టుకోవచ్చో అన్నిరకాలుగా పట్టుకోవడానికి ప్రయత్నించాను.
నిజానికి ఈ ఫీచర్ 59 వారాలతో ముగిసిపోయినా... ఇది ఎప్పటికీ రాయదగిన టాపిక్కేనేమో!
ఇది రాసినప్పటికంటే రాసింతర్వాత- ఇప్పుడు నాకు మరింత విలువైన అనుభవంగా కనబడుతోంది.
హిజ్డాలు సజీవంగా ఉన్నారు... మార్చురీ దగ్గర ఏడుపులు గుర్తున్నాయి...

జీవితంలో సాహిత్యం మాత్రమే సర్వస్వం కాదు. సాహిత్యం మాత్రమే దేన్నీ పూరించలేదు. అసలు ఏదీ సర్వస్వం కాజాలదు.
రుచిగా వండిన వంకాయ కూర కూడా ఒక పూరింపు అవుతుంది.
కొన్ని మాటలు, కొంత ఆత్మీయ సమావేశాలు... మీరందరూ నాకు కాగితాల ద్వారా తెలుసు... కానీ వాస్తవంగా నిలువెత్తుగా ఇలా చూడటం కూడా నాక్కావాలి... ఇవన్నీ మన జీవితంలో దేన్నో ఒకదాన్ని పూడ్చుతూనే ఉంటాయని నమ్ముతాను. అందుకే నా విన్నపాన్ని మన్నించి మీరందరూ రావడం నాకు సంతోషంగా ఉంది.
చివరగా ప్రచురణకర్తల గురించి...
పుస్తకాన్ని ప్రచురించడం వేరు. అభిమానంతో, శ్రద్ధతో ప్రచురించడం వేరు. నా పుస్తకాన్ని చక్కగా తెచ్చిన తెనాలి ప్రచురణల బృందం సుధామయి గారు, సురేశ్ గారు, నారాయణ గారు... పుస్తకాన్ని ముద్రించిన చరిత సుబ్బయ్య గారు... వీళ్లను ఈ సందర్భంగా తలచుకుంటూ...
పెద్దలు, స్నేహితులు అందరికీ పేరుపేరునా నమస్కరిస్తూ... థాంక్యూ!

మీ
పూడూరి రాజిరెడ్డి

Monday, February 10, 2014

'ఫిక్షన్- నాన్ ఫిక్షన్' ఆర్టికల్ మీద మెహెర్ స్పందన

(ఇప్పుడు నిలిచిపోయిన 'ఆజన్మం' సీరిస్-లో భాగంగా రాసిన 'ఫిక్షన్-నాన్ ఫిక్షన్' ఆర్టికల్ మీద Facebookలో  మెహెర్ వెల్లడించిన అభిప్రాయం:)
నోట్: (ఫొటోలోవి) అని విమర్శలో భాగంగా వచ్చేచోట ఆ భాగాన్నివిడిగా పెట్టకుండా మొత్తం ఐటెమ్-ను పోస్టు చేశాను. ఒకవేళ ఆ వ్యాసాన్నిచదవకపోయినా దీనికిదే అర్థం చేసుకోవచ్చు.
............................................................


Poodoori Rajireddy వారం వారం రాసే “ఆజన్మం” శీర్షిక ఒక్కటే నేను సాక్షి ఫన్ డేలో శ్రద్ధగా చదివేది. ప్రస్తుతం platitudes బారిన పడని వాక్యాలు దొరకటం తెలుగులో అరుదైన సందర్భం. అందుకే అది చదవటం. ఈ వారం శీర్షిక “ఫిక్షన్ – నాన్‌ఫిక్షన్”. అందులోని ఈ పేరాలు నన్ను కాస్త కన్ఫ్యూజ్ చేశాయి (ఫొటోలోవి).

వచనం – కవిత్వం అనే విభజనలాగే, ఫిక్షన్ – నాన్ఫిక్షన్ అనే విభజన కూడా నాకు arbitrary గా తోస్తుంది. Joyce, Proust, Kafka, Beckett లాంటి ఫిక్షన్ రచయితలు ఈ విభజన ఎప్పుడో చెరిపేశారు. అసలు ఫిక్షన్ - నాన్ఫిక్షన్ అన్న ముద్రలు పక్కన పెట్టి ఆలోచిస్తే ఒక మనిషి  ఏం రాసినా అది అతని స్వీయచరిత్రే అవుతుంది. స్వీయ చరిత్ర కానిదంటూ ఎవరూ ఏమీ రాయలేరు. ఒక్క వాక్యం కూడా. ఈ భావననే అర్జెంటినా రచయిత బోర్హెస్ (తన రచనా జీవితమంతా తనను ఆకట్టుకున్న ఫిలసాఫికల్ రిడిల్స్ ని డిటెక్టివ్, క్రైమ్ స్టోరీల రూపంలో చెప్పిన బోర్హెస్) ఇలా చెప్తాడు:

“A man sets out to draw the world. As the years go by, he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and individuals. A short time before he dies, he discovers that the patient labyrinth of lines traces the lineaments of his own face.”

అందుకే, “వ్యవస్థను శుభ్రం చేయసంకల్పించేది [ఫిక్షన్] ఐతే, వ్యక్తిని శుభ్రం చేసుకునే ప్రక్రియ [నాన్ ఫిక్షన్]” అన్న రాజిరెడ్డి తీర్మానంలో నాకు అర్థం కనపడలేదు.

పోనీ ఇంత లోతుకు వెళ్లకుండా, ఈ రెండు ప్రక్రియల మధ్య form పరంగా కనిపించే బేధాన్నే తీసుకుని మాట్లాడినా, అప్పుడు కూడా నాకు నాన్-ఫిక్షన్ లోనే ఎక్కువ లోటు కనిపిస్తుంది. దానికి నేను అనుకునే కారణం చెప్తాను. బహుశా ఈ కారణం వల్లనే పైన పేర్కొన్న రచయితలంతా (తమ స్వీయానుభవాల్లోంచే రాసిన వీరంతా) ఫిక్షన్ అనే form వైపు మొగ్గు చూపి ఉంటారు.

నాన్ – ఫిక్షన్ ఎప్పుడూ రాసేవాణ్ణించి స్వతంత్రంగా ఉండలేదు. రాజిరెడ్డి అన్న బైలైన్ లేకుండా ఈ “ఆజన్మం” శీర్షిక నిలబడలేదు. ఇవి ఎవరి అనుభవాలు, ఇవి ఎవరి పరిశీలనలు, ఇవన్నీ ఎవరికి నిజాలు... అనే ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకి జవాబులు రచనలో దొరకవు, రచన వెలుపల ఉంటాయి: రాజిరెడ్డి, ఒక మగవాడు, ఒక భర్త, ఒక తండ్రి, సాక్షి ఫన్ డే ఉద్యోగి, హైదరాబాదీ, చదువరి, రచయిత... వగైరా.

కానీ ఫిక్షన్ అలాక్కాదు. అది రచయిత నుంచి స్వతంత్రంగా నిలబడగలదు, మనగలదు. కాబట్టి పాఠకుడు ఆ అనుభవాల్ని ఫలానా వ్యక్తి అనుభవాలుగా చదవడు, అతని ఏకాంత పఠనంలో ఇంకో వ్యక్తి సమక్షం ఉండదు, అప్పుడు పఠనం తనతో తనకు సంభాషణగా మారుతుంది, చదివేదాన్ని వెంటనే సొంతం చేసుకోగలుగుతాడు. ఈ ఆజన్మంలోవే కొన్ని వాక్యాల్ని ఒక కథలోని ఫిక్షనల్ వాక్యాలుగా భావిస్తే, “కొన్నిసార్లు, ఊరికే, అలా తీరుబడిగా కూర్చుని, ఆలోచనల్తో పొద్దుపుచ్చడం బాగుంటుంది” అన్న వాక్యం చదవగానే, ఇలా ఎవరికి బాగుంటుందీ అన్న ప్రశ్న రాదు, ఈ వాక్యం ఎవరిదీ అన్న ప్రశ్న రాదు. వచ్చినా వాటికి జవాబులు రచనకు వెలుపల వెతుక్కోనక్కర్లేదు. కాబట్టి నా పఠనం రాజిరెడ్డి మరియూ నేనూగా సాగదు, రచనా మరియూ నేనుగా సాగుతుంది. ఇంకోలా చెప్పాలంటే ఒక నిజమూ మరియూ నేనుగా సాగుతుంది. (అందుకే పాఠకుల్లో కొంతమందికి కథలు గుర్తుంటాయి గానీ, రచయితలు గుర్తుండరు. వీళ్లనే శాలింజర్ తన “Raise High the Roof beam...” పుస్తకంలో “అమెచ్యూర్ రీడర్” అంటాడు, ఆ పుస్తకాన్ని వాళ్లకే అంకితం ఇస్తాడు.)  

నా ఉద్దేశంలో ఫిక్షన్ అనేది రచయితకు “నేను” అనే చెరసాల నుంచి విముక్తి కల్పిస్తుంది. బహుశా పై రచయితలందరూ ఈ చెరసాల నుంచి విముక్తి కోరుకున్న వారే ఐ వుండొచ్చు.

కొంతమంది బాగా రాసేవాళ్లు ఫిక్షన్ వైపు వెళ్లలేకపోవటానికి ఈ “నేను” అనేది వాళ్ల చుట్టూ కట్టిన బలమైన చెరసాలలే కారణమని నాకు అనిపిస్తుంది. (మరో అభిశప్తుడు Naresh Nunna). రాజిరెడ్డి చుట్టూ ఈ చెరసాల ఎంత బలంగా ఉందో “పలక – పెన్సిల్”లో కొన్ని చోట్ల కనపడింది. అంటే “నేను”కి narcissistic సంకెళ్లతో బంధీ అయిపోవడం. కానీ “ఆజన్మం” దగ్గరికి వచ్చేసరికి, నెమ్మదిగా, “నేను” వైపు చూసే చూపు మారుతోందనిపించింది.

“నేను” వైపు చూసుకోవటంలో రెండు రకాలున్నాయి. తనని తాను మనుషుల్లో ప్రత్యేకతగా చూసుకోవటం ఒకటి. తనని తాను మనిషికి ప్రతినిధిగా చూసుకోవటం ఒకటి. ఈ రెంటి మధ్యా గీత చాలా పల్చన. మొదటి రకం కేవలం narcissism. రెండోది, ఒక శాస్త్రీయమైన కుతూహలం. ఈ ఫలానా గెలాక్సీలో, ఫలానా సౌరకుటుంబంలో, మూడో గ్రహమైన భూమ్మీద పుడుతూ జీవిస్తూ చివరికి చచ్చే ఈ మనిషి అనే జీవిని పరిశీలించాలంటే... రచయితకు అతి దగ్గరగా అందుబాటులో ఉన్న స్పెసిమన్ తానే. కాబట్టి మొత్తం మానవాళికి ప్రాతినిధ్యం వహించగలిగే ఈ స్పెసిమన్ ని శ్రద్ధగా చూస్తాడు, తన పరిశీలనల్ని నిర్మమత్వంతో నమోదు చేస్తాడు. ఈ నమోదు కాఫ్కాలో కనిపిస్తుంది. మనిషి అనే స్పెసిమన్ ని మరింత నిశితంగా పరిశీలించటానికి ఆయన తన ఫిక్షన్ లో మనుషుల్ని జంతువులు చేశాడు, జంతువులకు మనిషితనాన్ని ఆపాదించాడు –ఫిక్షన్ అన్న పేరు మీదే అలా చేయగలిగాడు.

ప్రక్రియల్ని నిరాకరించే దిలాసా రాజిరెడ్డిలో ఉంది (I hope it’s not his job as a journalist that’s making it compulsory for him to resort to these ingenious inventions). ప్రక్రియల మధ్య గీతలున్నాయని మర్చిపోగలిగేంత తన్మయత్వంలో కూడా పడిపోతేనో....  '

(నవంబర్ 17, 2013)


Saturday, February 1, 2014

'పోలీస్ స్టేషన్లో రెండు గంటలు' వ్యాసానికి ప్రతిస్పందన

నేను ప్రతిదానికీ వివరణ ఇవ్వబూనుకుంటున్నానంటే, ఏదో డిఫెన్సులో పడిపోతున్నానని నాకే అర్థమవుతోంది. అంటే ఇక్కడ స్పందనలు పెట్టడం వల్ల నా గురించి నేను గొప్పకు పోతున్నానని ఈ బ్లాగు చదివే పాఠకులు అనుకుంటారనీ, అలా కాదని చెప్పడానికి నేను శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాననీ అర్థం. ఈ రెండూ నిజమే అయినా, మరి నా ఐటెమ్స్ మీద వచ్చిన స్పందనలు ప్రచురించడానికి
ఈ బ్లాగు కాకుండా మరేదీ దీనికి అనువైన చోటు?
కాబట్టి, ఆ ఫీలింగును వదలించుకుని దీన్ని పోస్టు చేస్తున్నాను.
రియాలిటీ చెక్ సిరీస్-లో భాగంగా పోలీస్ స్టేషన్ వాతావరణం మీద రాసిన ఆర్టికల్-కు వచ్చిన స్పందన ఇది. అందుకున్న తేది మార్చ్ 21, 2012. మెయిల్ ద్వారా వచ్చిన ఈ స్పందన వ్యాసకర్త అప్పుడు 'ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం'  రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న యేదుల గోపిరెడ్డి గారు. ఇప్పుడాయన అదే సంఘానికి అధ్యక్షులయ్యారు.

ఈ ఉత్తారానికి స్పందనగా ఆయనతో నేను ఫోన్లో సంభాషించానేగానీ ఉత్తర రూపంలో మాత్రం జవాబు ఇవ్వలేదు. ఆయన మంచి చదువరి. స్నేహశీలి.
పోలీసులు, ముఖ్యంగా పోలీసు కానిస్టేబుళ్ల కోణంలో అర్థం చేసుకోవాల్సిన ఎన్నో అంశాల్ని గోపిరెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు. వాటన్నింటితో నేను అంగీకరిస్తానుగానీ, నన్ను ముల్లులా పొడిచిందీ, ఆ వాతావరణంలో నా మనసును చేదెక్కించిందీ వాళ్ల అమర్యాదకర ప్రవర్తన. బహుశా, "ప్రశ్నించజాలని అధికారం" వాళ్లను ఇలా ప్రవర్తించేలా చేస్తుందేమో! మండల కేంద్రాల పోలీసు స్టేషన్లలో ఇది మరింత నిజం. వాళ్లకు వంద చికాకులున్నా కూడా సాటి మనిషి పట్ల మనిషి చూపాల్సిన కనీస మర్యాదకు ఇవన్నీ అడ్డం రాకూడదని నా నిశ్చయమైన నమ్మిక.