Sunday, March 5, 2023

అన్నపరెడ్డి బౌద్ధ్ధసాగరం

 



బౌద్ధ్ధసాగరం


దేనికైనా మధ్యేమార్గంలో పోవాలంటారు పెద్దలు. అతివాదాలు ప్రపంచానికి వినాశనకరం. ఈ మధ్యేమార్గం అనేది బౌద్ధం నుంచి ప్రజల్లోకి వచ్చిన భావధార. ఇంతకీ మధ్యేమార్గం అంటే ఏమిటి? మధ్యమాప్రతిపద్‌ అని సంస్కృతంలో, మజ్జిమాపతిపదా అని పాలీలో పిలిచే ఈ మార్గం ‘రెండు అంత్యాలను వదిలి, ఆ అంత్యాన్నో ఈ అంత్యాన్నో కౌగిలించుకోకుండా, అంటే మరీ అతికి పోకుండా, మధ్య దారిలో పోవాలని చెబుతుంది.’ ‘సత్యం, ఆ అంత్యంలోనో, ఈ అంత్యంలోనో కాక మధ్యలో ఉంటుందనే భావనను బౌద్ధ సిద్ధాంతాలకు అన్వయించడం జరిగిం’దని విశదీకరిస్తుంది ‘మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు’. దీన్ని కూర్చినవారు ‘ఉపాసక’ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.
 
మధ్యేమార్గం మన జీవితాలకు ఒక సంయమనాన్ని ఇస్తే, మరి ఆ సంయమనం సాధించడానికి కావాల్సిన ఉపకరణం– ధ్యానం. ఆ ధ్యానంలో రకరకాల మార్గాలున్నాయి, రకరకాల తుది ఫలితాలున్నాయి. బుద్ధుడి ద్వారా ప్రపంచానికి అందిన ఒక ధ్యాన ప్రక్రియ– విపశ్యన. ‘ఇది ఎరుక, అప్రమత్తత, జాగరూకత, పరిశీలనల మీద ఆధారపడినది.’ ఇది ఉనికిలో ఉన్న మిగిలిన ధ్యానాలకు భిన్నం. సమాధి స్థితిలో మనస్సు ‘అనేక మార్మిక స్థితులను చేరుతుంది. కానీ ప్రపంచాన్ని యథాతథంగా చూడలేడు. కాని బుద్ధునికి కావలసింది ప్రపంచాన్ని యథాతథంగా చూడగలగడం...(అందుకే) విపశ్యనను కనిపెట్టాడు. విపశ్యన అంటే, మనస్సును పూర్తిగా విముక్తం చేసి, వస్తువుల యథార్థ స్థితికి తీసుకెళ్లి, తద్వారా నిర్వాణానికి చేర్చే అంతర్ప్రజ్ఞ’ అని చెబుతుంది ఇదే మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు. ఇది ఒక విశ్లేషణాత్మక విధానం. ‘దుఃఖాన్ని, రూపారూప ప్రపంచంలో ఆత్మలేని తనాన్ని ఎరుకపరిచేది ఈ జ్ఞానం’.

2008లో వెలువడిన ఈ మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువులో ఇంకా ఇలాంటి ఎన్నో మాటలకు, రీతులకు అర్థాలు, వివరాలు తెలుస్తాయి. రెండు అట్టల నడుమ బౌద్ధ మహాసాగరాన్ని ఇముడ్చుకున్న గ్రంథం ఇది. పదం పదంలో జ్ఞాన పథం! తెలిసీ, అసత్యం పలకడానికి ఎవరైనా సిగ్గుపడాలనీ, అలాగే పర్యాలోచన(రిఫ్లెక్షన్‌) చేసి కర్మలను పరిశుద్ధం కావించుకోవాలనీ రాహులునికి బుద్ధుడు బోధించింది రాహులోవాద సూత్రం. ‘ఏ ధర్మమూ, వస్తువూ అదే విధంగా ఏ రెండు క్షణాల పాటు ఉండదు’ అని చెప్పేది క్షణికవాదం. యోగ అంటే, కాడి కిందకు తేవటమే. ‘ఎలాగైతే కాడికి పూన్చిన ఎద్దులు నియమబద్ధంగా నడుస్తాయో, అలాగే యోగం మనిషి మనస్సును సంయమిస్తుంది’. ఇక పవిత్రాక్షరం ఓమ్‌ తాంత్రిక బౌద్ధంలో శూన్యతను సూచిస్తుంది. అయితే ఈ గ్రంథం వట్టి ప్రతి పదార్థాల పదకోశం కాదు. ఇది బౌద్ధ సూత్రాలను, శాస్త్రాలను, సిద్ధాంతాలను, పారిభాషిక పదాలను గణనీయంగా వివరిస్తుంది. కొత్తగా బౌద్ధాన్ని తెలుసుకోగోరేవారికీ, అవగాహన చేసుకోగోరేవారికీ ఇది ఒక కరదీపిక. ‘ఇటువంటి బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు తెలుగులో– బుద్ధుని కాలంలోనే బౌద్ధం ఆంధ్రదేశంలో ప్రవేశించినా, క్రీ.పూ. 300ల నుంచి క్రీ.శ. 700ల వరకు, వేయి సంవత్సరాల పాటు, ఆంధ్రదేశాన్ని దున్ని వేసినా– ఒక్కటీ వెలువడలేదు’ అని ప్రకాశకులు (మిసిమి ప్రచురణలు) ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, ‘తెలుగులో వెలువడిన ప్రథమ మహా బౌద్ధ విజ్ఞాన నిఘంటువు’ ఇదని ఘనంగా ప్రకటించారు. అయితే, ‘నేను త్రిపిటకాచార్యుడను కాను. అంతకంటె బౌద్ధ వాజ్ఞయ మహాధ్యక్షుడను అసలే కాను. ఒక సామాన్య బౌద్ధ విద్యార్థిని. అలాగే ఈ ప్రయత్నం చేశాను... ఆ మహా సముద్రంలోని జ్ఞాన జలాన్ని నా ‘బుడ్డి చెంబు’ పట్టింనత మేరకే గ్రహించాను’ అని వినయంగా చెప్పుకొన్నారు కూర్పరి అన్నపరెడ్డి. నిఘంటువు ముందు ‘మహా’ అని చేర్చడం కూడా, బౌద్ధ సంప్రదాయాన్ని(ఉదా: మహా నిదాన సుత్త, మహా పదాన సుత్త) పాటించాలనే కోరికతో చేశానని చెప్పినప్పటికీ ఇది ‘మహా’ అని చేర్చడానికి తగినదే.

బౌద్ధానికి సంబంధించిన అనేక గ్రంథాలను తెలుగులో వెలువరించిన అరుదైన రచయితగా కూడా అన్నపరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇందులో అనువాదాలు, పరిశోధనలు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. మానవీయ బుద్ధ, బుద్ధ దర్శనం, బుద్ధుని దీర్ఘ సంభాషణలు, బుద్ధుని సూత్ర సమచ్ఛయం, తెలుగులో బౌద్ధం, ఆచార్య నాగార్జునుడు, మహోన్నత బుద్ధుడు, నలభై రెండు ప్రకరణాల సూత్రం, బుద్ధుని ధర్మం– శిష్యులు, పోషకులు లాంటి పుస్తకాలను ఆయన వెలువరించారు.
 
1933 ఫిబ్రవరి 22న మహాశివరాత్రి పర్వదినాన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు అన్నపరెడ్డి. లెక్చరర్‌గా పనిచేశారు. ‘చదివింది తత్వశాస్త్రం. బోధించింది సమాజశాస్త్రం. రాసింది మనోవిజ్ఞాన శాస్త్రం. అభిమాన విషయం సాహిత్యం, గ్రంథ రచన’. 1996 నుంచి 2011 వరకు ‘మిసిమి’ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. చాలామంది సాధారణ తెలుగు పాఠకులకు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ఆయన ద్వారానే పరిచయం. మేధావుల మెతకలు, అస్తిత్వవాదం ఆయన ఇతర రచనలు. ‘చింతనాగ్ని కొడిగట్టిన వేళ’ ఆయన ఆత్మకథ. బౌద్ధమతం అవలంబించిన తర్వాత తన పేరును బుద్ధఘోషుడు అని పెట్టుకున్నారు. ఆ పేరుతో రచనలు చేశారు. కానీ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డిగానే ఎక్కువమందికి పరిచితుడు. 2021 మార్చ్‌ 9న ఆయన మరణించారు. ఇది ఆయన జయంతి, వర్ధంతుల ఉమ్మడి సందర్భం. కొంతమంది తాము బతికి ఉన్నంతకాలం సెలయేరుల్లా్ల ప్రవహిస్తారు. వారి దగ్గరికి ఎప్పుడు సమీపించినా మెదడుకు ఇంత జ్ఞానతడి చేసుకుని రావొచ్చు. అలాంటి ఒక తెలుగు సెలయేరు అన్నపరెడ్డి!

(27 ఫిబ్రవరి 2023)
 

Sunday, February 19, 2023

నా ఆకాశవాణి ఇంటర్వ్యూ



ఆకాశవాణి ఇంటర్వ్యూ లింకు


ఆసక్తి ఉన్నవాళ్ల కోసం...

ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు ప్రసారమైన నా ఇంటర్వ్యూ లింకు ఇది. రేడియో వాళ్లే దీన్ని యూబ్యూటులో పెట్టారు. కథాశోభ శీర్షికన ఈ ఇంటర్వ్యూ చేసింది వలేటి గోపీచంద్‌ గారు.


 

Friday, February 17, 2023

సకల నీతి సమ్మతము

సకల జన సమ్మతము 

 ఒక సాధారణ జీకే ప్రశ్నతో దీన్ని మొదలుపెట్టవచ్చు. తెలుగులో తొలి సంకలన కావ్యం ఏది? ‘సకల నీతి సమ్మతము’ అన్నది జవాబు. దీన్ని తెలుగులో తొలి నీతిశాస్త్ర గ్రంథంగానూ చెబుతారు. దీని సంకలనకర్త మడికి సింగన. తెలుగులో ఇలాంటి సంకలన గ్రంథాలకు శ్రీకారం చుట్టింది ఆయనే. సింగనది ప్రధానంగా రాజనీతి దృష్టి. తనకు పూర్వులైన ఆంధ్రకవుల గ్రంథాల నుండి అందుకు సంబంధించిన పద్యాలను మాల కట్టాడు. పంచతంత్రి(మనకు తెలిసిన పంచతంత్రం కాదు), కామందకము, ముద్రామాత్యము, నీతిభూషణము, బద్దెన నీతి, కుమార సంభవము, భారతము, రామాయణము, మార్కండేయ పురాణము, విదురనీతి, చారుచర్య, పురుషార్థసారము, పద్మ పురాణము లాంటి మిక్కిలి కావ్యాలు ఆయనకు ఆధారం. ఆ పద్యాలను తిరిగి నీతిశాస్త్ర ప్రశంస, ప్రజా పాలనము, రాజాదాయవ్యయ ప్రకారము, రాజునకు గొఱగాని గుణములు, కరణికపు నీతులు, పురోహిత నీతి, రాయబార ప్రకారము, చారుల నీతులు, అష్టాదశ వ్యసనములు అంటూ మూడు ఆశ్వాసములుగా విభజించాడు. పద్దు లెక్కలు ఎలా వేయాలో, రుణ పత్రాలు ఎలా రాయాలో కూడా ఇందులో ఉంటుంది. ఆయన గొప్పతనం పద్యాలను ఏర్చడంలోనే కాదు, కూర్చడంలోనూ ఉంది. ఆయా వర్గాల పద్యాలకు అతుకులుగా తన సొంత పద్యాలను రాశాడు. అందుకనో, అంతకుమునుపు ఈ సంకలన ప్రక్రియ లేనందునో తన కావ్యాన్ని ప్రబంధమనే చెప్పుకొన్నాడు. కానంతమాత్రాన దీని విలువ ఏమీ తగ్గలేదు. తరువాతి కాలంలో వచ్చిన సంకలన గ్రంథాలకు ఇది ఒక స్ఫూర్తిగా నిలిచింది. 

 ఇలాంటి ఉత్తమ గ్రంథాన్ని మానవల్లి రామకృష్ణ కవి 1923లో సంపాదించి ప్రకటించారు. ఆ ప్రచురణకు ఇది శతాబ్ది సంవత్సరం. విస్మృత కవుల కృతులలో ఒకటిగా మానవల్లి దీన్ని వెలువరించారు. ‘ఆంధ్రపత్రికా ముద్రాక్షర శాల’లో ముద్రితమైంది. తిరిగి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ 1979లో దీన్ని ‘విద్యారత్న’ నిడుదవోలు వేంకటరావు, డాక్టర్‌ పోణంగి శ్రీరామ అప్పారావు సంపాదకులుగా ప్రచురించింది. తెలంగాణ సాహిత్య అకాడెమీ కూడా ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ముద్రించింది. 

మడికి సింగన క్రీ.శ.1420 ప్రాంతపువాడు. ‘ఓరుగల్లున కుత్తరమున నుండు రామగిరి పట్టణమున కధీశ్వరుండగు కందన మంత్రి కాశ్రితుడై బహు గ్రంథముల రచించె’ని మానవల్లి రామకృష్ణ కవి రాశారు. ఇప్పటి వ్యవహారంలో చెప్పాలంటే తెలంగాణలోని ‘పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి’. పద్మ పురాణోత్తర ఖండము, భాగవతము దశమ స్కంధము(ద్విపద), జ్ఞాన వాసిష్ఠ రామాయణము ఆయన లభ్య రచనలు. ఆయన పేరు నిలిచి ఉన్నది మాత్రం సకల నీతి సమ్మత సంకలనకర్తగానే! 

‘అల్లకల్లోలమైన దుగ్ధనిధి ద్రచ్చి/ దేవామృతము తేటదేర్చుపగిది/ గంధకారుడు మున్నుగల వస్తువులు జోక గూర్చి సుగంధంబు గూడినట్లు/ అడవి పువ్వుల తేనెలన్నియు మధుపాళి యిట్టలంబుగ జున్ను వెట్టుభంగి/ దననేర్పు మెఱసి వర్తకుడు ముత్తెములీడు గూర్చి హారంబు తాగ్రుచ్చు కరణి’ రీతిలో ఈ గ్రంథం కూర్చానని సింగన చెప్పుకొన్నాడు. రాజసభలలో పద్యాలను గమకముతో, అంటే రసోచిత స్థాయులతో చదివే వారి వాచకం ఎట్లుండాలో– ‘వెనుకకు బోక హాయనక వేసట నొందక బంతి బంతిలో బెనపక... యక్షరాక్షరము కందువు దప్పక యేకచిత్తుడై యనుపమ భక్తితో జదువునాతని వాచకుడండ్రు సజ్జనుల్‌’ పద్యం చెబుతుంది. ‘రవికి మఱుగైన గొందిని దివియ’ ప్రకాశింపజేసినట్టుగా, అధికుడు తెలుపని యుక్తివిశేషాన్ని ‘చిఱుతవాడు’ చెప్పగలండంటుంది ఇంకొక పద్యం. ‘సరస కవిత రుచి యెఱుగని పురుషుల బశువులని నిక్కముగ నెఱుగు’మంటుంది మరొకటి. ‘కుక్క తోక బట్టుకొని మహాంబుధి దాట’డం, ‘తల్లి సచ్చినను జూదరి లేచిపోవండు’ లాంటి వాడుకలు, జాతీయాలు ఇందులో కనిపిస్తాయి.

వాజ్ఞయ పరిశోధన మనకు 15వ శతాబ్దిలోనే, అంటే మడికి సింగనతోనే మొదలైందంటారు పెద్దలు. ‘‘ఆంధ్ర సాహిత్య పరిశోధనా రంగమున సింగన ప్రథముడు; అతని కృతి తెలుగున ప్రథమ పరిశోధనా గ్రంథము’’ అంటారు నిడుదవోలు వేంకటరావు. ‘‘అయితే, ప్రస్తుత కాలము వలె, ఆ కాలమున పరిశోధనకు పట్ట ప్రదానము లేదు. అంతే భేదము.’’ మనం సంబరపడటానికి ఇంకొక విషయం కూడా ఉన్నది. అంతకుముందు ఇంత నిధి ఉన్నదని మరోమారు రుజువవుతోంది కదా!

సకల నీతి సమ్మతమును వెలికి తెచ్చిన మానవల్లి రామకృష్ణ కవి(1866–1957) మద్రాసులో జన్మించిన బహుభాషా పండితుడు. పదహారేళ్లకే ‘కవి’ బిరుదును పొందినవాడు. తెలుగు ‘కుమార సంభవం’ కావ్యాన్ని వెలికి తీసి, నన్నెచోడుని పేరును లోకానికి చాటిన మహానుభావుడు. అనంతర గొప్ప పరిశోధకులైన వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల రామచంద్ర వంటివారికి మార్గదర్శి. తాళపత్ర గ్రంథాల కోసం ఆయన ఊరూరా తిరిగేవారు. వాటిని ఇవ్వడానికి ఆ యజమానులు ఒప్పుకోకపోతే అక్కడే చదివి ఏకసంతాగ్రాహిలా బసకు వచ్చి అక్షరం పొల్లుపోకుండా రాసుకునేవారట. ‘నైజాము రాజ్యమున... అమరచింత రాజాస్థానామున’ ఆయన సకల నీతి సమ్మతము లిఖిత ప్రతిని చూశారు. మానవల్లి తన అవసాన దశలో కఠిన దారిద్య్రాన్ని అనుభవించి, వీధుల వెంట భిక్షాటన చేస్తూ బతికాడంటారు. కానీ ఆయనే తెలుగు సాహిత్య లోకానికి కావ్య సిరులను భిక్షగా వేశారని చెప్పాలి. ఆయన తన పేరును ‘మా– రామకృష్ణ కవి’ అని పూర్వపు తెలుగు పద్ధతిలో రాసుకునేవారు. అలా ఆయన ‘మా రామకృష్ణ కవి’ అవుతారు, మన రామకృష్ణ కవి అవుతారు. మన మడికి సింగన! మన రామకృష్ణ కవి!! 

(6 ఫిబ్రవరి 2023)

Monday, February 13, 2023

నా స్నేహితుడు అజయ్‌



నా స్నేహితుడు అజయ్‌


అజయ్‌తో నాకు పరిచయం, స్నేహం వేర్వేరు కాలేదు. మాది తొలిచూపు స్నేహం అనుకోవచ్చు. పన్నెండేళ్ల క్రితం ఉప్పల్‌లో ఒక చీకటి సాయంత్రం భగవంతం పరిచయం చేశాడు. ఆ మొదటిరోజు నుంచే తెలిసినట్టుగా మాట్లాడుకున్నాం. అంటే ఎక్కువ మాట్లాడేసుకున్నాం అని కాదు. ఎక్కువ మాట్లాడటం తెలియడానికి గుర్తు కాదు. ఏమీ మాట్లాడకపోయినా ఏ అసౌకర్యానికీ గురి కాకుండా ఉండటం! అలాంటి సౌకర్యం నాకు అజయ్‌ సాహచర్యంలో దొరుకుతుంది.

ఆ తర్వాత ఎన్నో ఖాళీ ఆదివారాలు ఎక్కడెక్కడో తిరిగాం. చూడవలసినదే చూడాలి అనే పట్టింపు ఇద్దరికీ లేకపోవడం వల్ల అతి మామూలు ప్రదేశాలు కూడా మాకు దర్శనీయ స్థలాలు అయ్యాయి. ‘బార్కాస్‌’లో ఏదో ఆఫ్రికా చాయ్‌ దొరుకుతుందంటే కూడా ఎగేసుకుని వెళ్లిపోతాం. అట్లాంటి ప్రయాణాలవి. పొద్దున్న బయలుదేరడం, ఏదో ఒక బస్సెక్కడం, సాయంత్రం తిరిగి ఊరి దాపులోకి వస్తున్నామనుకునే చోట ఆగి, కొంచెం చల్లగా సేదదీరడం... ఇంతే అజెండా! తర్వాత మాతో మెహెర్‌ కలిశాడు. అప్పట్నించీ ‘త్రీ ఎమిగోస్‌’ అయ్యాం.

అజయ్‌ నెమ్మదైన మనిషి. ఒక జీవిగా తన లోపల ఎన్నో ఆందోళనలు ఉన్నాయని తెలుసు. కానీ ఆ తాపీదనం మాత్రం మనిషి చేరవలసిన గమ్యంలా నాకు తోస్తుంది. ఇది అజయ్‌లో స్వభావరీత్యా ఎంతుందో గానీ, అందులో కొంతైనా సాధనతో ఆర్జించుకున్నదే అని నేననుకుంటాను. ఆందోళన, ఆతృత, లౌల్యాలు కలగలిసిన నాకు, నేను కోరుకునే నా భవిష్యత్‌ రూపంలా తోస్తాడు అజయ్‌. కళాకారుడిలో ఉండే సహజమైన ఆబను కూడా తను జయించినట్టే కనబడుతుంది. ఈ లక్షణాల వల్లే కావొచ్చు అజయ్‌ కథల్లో ఒక ‘ఊపు’, ‘కుదుపు’ కనబడవు; మంద్రంగా, ఇవి రాయకపోయినా నాకేం పోయేది లేదన్నట్టుగా ఉంటాయి. ఒక కళాకారుడు యోగి అయినప్పుడు మాత్రమే వచ్చే శైలి ఇది. అందుకే కొట్టొచ్చినట్టుగా ఆకర్షించవు; ముఖ్యంగా నెమ్మదితనపు శ్రేష్ఠత ఇంకా తెలిసిరానివాళ్లకు.

– పూడూరి రాజిరెడ్డి

జూలై 2022


(బి.అజయ్‌ ప్రసాద్‌ కొత్త కథల సంపుటి ‘గాలి పొరలు’ కోసం రాసిచ్చిన ఒక జనరల్‌ ఫ్రెండ్లీ నోట్‌ ఇది. ప్రచురణ: బోధి; 2022)

 

Thursday, February 9, 2023

నా పుస్తకాలు

ఇప్పటివరకూ ప్రచురించిన నా పుస్తకాలు: 

 మధుపం: ఒక మగవాడి ఫీలింగ్స్‌ (2009; పాలపిట్ట బుక్స్‌. రీ: 2014; కృష్ణకాంత్‌ ప్రచురణలు) 

 పలక–పెన్సిల్‌ (2013; సారంగ బుక్స్‌) 

 రియాలిటీ చెక్‌ (2013; తెనాలి ప్రచురణలు) 

 చింతకింది మల్లయ్య ముచ్చట (2017; ఛాయ) 

 ఆజన్మం (2021; కృష్ణకాంత్‌ ప్రచురణలు)