Thursday, November 28, 2024

మధురాంతకం రాజారాం కథ ‘జీవన్ముక్తుడు’


మధురాంతకం రాజారాం


మధురాంతకం రాజారాం(1930–99) కథ ‘జీవన్ముక్తుడు’కు సంక్షిప్త రూపం ఇది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన రాజారాం సుమారు నాలుగు వందల కథలు రాశారు.  నాకు నచ్చిన మధురాంతకం రాజారాం కథల్లో ఇదీ ఒకటి.

 

––––

జీవన్ముక్తుడు


మామంచిపురం నుంచి రామదుర్గం వెళ్లే అయిదు గంటల బస్సు ఆ సాయంకాలం గంట ఆలస్యంగా బయల్దేరింది. అప్పటికైనా బస్సు కదిలిందంటే అందుకు ముఖ్యకారకుడు బూరగమంద చెన్నారెడ్డి. రెడ్డి చెరువు క్రింద పొలంలో మడికోసి, బండపైన కుప్పలు పెట్టించి పదిరోజులయింది. కోసిననాటినుంచీ ఆకాశం చిల్లులు పడి పోయినట్టుగా జల్లులే జల్లులు. కరువులో అధికమాసం లాగా అర్జంటు కోర్టు పనొకటి అఘోరించింది. వాన తెరిపి ఇచ్చేది చూసుకుని, వాదె కొట్టి వడ్లు యింటికి చేర్చమని చెప్పిన తర్వాతనే బస్సెక్కాడు. పాలెర్లున్నూ నమ్మకస్తులే! (అయినా) అయిదారు వేల రూపాయల వరమానమాయె! రెడ్డి మనసు వడ్లరాశి చుట్టే గిరికీలు తిరుగుతోంది. ‘‘కేశవులూ! తొమ్మిదింటికల్లా నన్ను మా వూళ్లో దించేశావంటే నీ కొక కోడిపెట్ట ఇనాం’’ అంటూ డ్రయివరుకు బక్షీసు గూడా ప్రకటించాడు చెన్నారెడ్డి.

వరహాలయ్య ప్రాణం తుమ్మపాడులో, తన చిల్లరకొట్లో, మూడు నెలల క్రితం కొని స్టాకు చేసిన కొబ్బరికాయల చుట్టూ పల్టీలు కొడుతోంది. 

నంగమంగలం సుబ్బానాయుడి పరిస్థితి దయనీయంగా వున్నట్టు ఒప్పుకోవాలి. మార్కెట్టు ‘డౌను’గా ఉన్నందువల్ల ఏడాదినుంచీ ఆయన దగ్గర నూరు మూటల చెరుకు బెల్లం నిలవ వుండిపోయింది. ఆ గదిలోకి, మిద్దె పైభాగంలోనుంచీ ఓ రంధ్రం వుంది. వాన కురుస్తున్నప్పుడు గంటసేపు గనక ఆదమరిస్తే, కడవల్లోకి తోడి దిబ్బల్లో పారబోయడానికి తప్పితే ఆ బెల్లం మరొక సత్కార్యానికి పనికిరాదు.

వేగిరపాటయితే లేకపోవచ్చుగానీ మిగిలినవాళ్లు గూడా ఏవో ముఖ్యమైన పనుల మీద ప్రయాణం కడుతున్నవారే. నందవరం సీతారామయ్య ఓ పెళ్లి సంబంధం చూచిరావడం కోసం రామదుర్గం వెళ్తున్నాడు. పులిచెరువు నాగప్ప గిత్త బేరం కోసం పైడిమర్రికి పయనమయ్యాడు. అల్లుడికి అనారోగ్యంగా వుందని తెలిసి మల్లెల గురుమూర్తి ముత్యాలరేవుకు ప్రయాణం పెట్టుకున్నాడు. పోగా బజారు పనిమీద పట్నానికి వచ్చి, తిరిగి వెళ్తున్న సమీప గ్రామాల వాళ్లు గూడా ఏడెనిమిది మంది దాకా బస్సులో ఉన్నారు.

వెళ్లడమా, మానడమా అన్న విచికిత్సలో బడి, మానుకోవడం వైపే మొగ్గుజూపుతూ టీస్టాల్లో బైటాయించిన కండక్టరు నారాయణ ఏకధాటిగా బస్‌ హారన్‌ గొంతు చించుకోడంతో త్రుళ్లిపడి, పరుగునా వచ్చి బస్సెక్కేశాడు.

ఊరి శివారు దాటుకునేసరికి బస్సు సవ్వడితో శ్రుతి కలుపుతూ వానజల్లు ప్రారంభమైంది. నల్లటి మబ్బుల ఆవరణ క్రింద చూస్తూ చూస్తూ వుండగానే ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. కండక్టరు టికెట్లు ‘బుక్‌’ చెయ్యడం ముగించి, తెరలన్నీ దిగ విడిచి, వెళ్లి వెనకసీట్లో ఒంటిగా కూచున్నాడు.

బీభత్సంగా వున్న వాతావరణంలో నిమ్మకు నీరెత్తినట్టు కూచోవడం ప్రయాణీకులకు చేతగావడం లేదు. తుమ్మపాడు వరహాలయ్యకైతే ఎవరితోనైనా బిగ్గరగా మాట్లాడకపోతే మతిపోయేటట్టే వుంది. మాటల్లోకి దింపదగిన వ్యక్తికోసం చేస్తున్న అన్వేషణలో చూపులు మూడో వరసలో కూచున్న సన్యాసిపైకి వ్రాలాయి. బస్సంతా కలయజూచినప్పుడు సన్యాసి ఉనికిని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నవి అతడు ధరించిన కావి రంగు దుస్తులు. స్వాములవారిని దూరం నుంచి మాట్లాడించడం బాగుండదనిపించి వెళ్లి ఆయనకెదురుగా వున్న సీట్లో కూర్చున్నాడు.

‘‘స్వామీ! ఏ పని చేసుకోవడానికైనా యిబ్బందిగా వుంది. ఈ వానయోగం యింకెన్ని రోజులుంటుందంటారు?’’ సర్వప్రపంచానికి తానే ‘గార్డియన్‌షిప్‌’ పుచ్చుకున్నట్టుగా విజ్ఞాపన చేసుకున్నాడు వరహాలయ్య.

‘‘నాయనా! ఏదెప్పుడొస్తుందో, ఏదెప్పుడు పోతుందో చెప్పడానికి మనం కర్తలమా? అంతా వాడి లీల.’’

వాడి లీల కనీసం తమకైనా తెలియదా స్వామీ– అని మనసులోనే గింజుకున్న వరహాలయ్య ‘‘తమరెందాకా వెళ్తున్నారు స్వామీ’’ అంటూ ప్రసంగాన్ని యింకొక వైపు తిప్పాడు.

‘‘నువ్వెక్కడికి బాబూ?’’ ప్రశ్నకు ప్రశ్న ఎదురైంది.

‘‘నాగులేటికా ప్రక్కన తుమ్మపాడుంది గదండీ! అదే మా వూరు.’’

‘‘అయితే నీకీ బస్సు తుమ్మపాడు దాకా వెళ్తే చాలు. అంతే కదూ?’’

‘‘అంతేనండి. రోడ్డులో బస్సు దిగితే ఓ అరమైలు ఉంటుందండి. చక్కా నడచి వెళ్లిపోగలను’’

‘‘బస్సందాకా వెళ్తే చాలునని నువ్వనుకుంటావు. ఆ తరువాత యిదేమైపోయినా నీకు దిగులుండదు...’’

‘‘అబ్బే, నేను చెప్పడం...’’

‘‘ఉన్నమాట చెప్పుకోడానికి ఉలుకెందుకు? నువ్వే కాదు. మనుషులందరూ యింతే. ఏమంటావు పెద్దాయనా?’’

వరహాలయ్య కూచున్న సీట్లోనే ఓ మూలగా ఒదిగి కూర్చున్న ముసలి వ్యక్తి ఉలిక్కిపడ్డాడు. స్వాములవారు హఠాత్తుగా తన నిలా పలకరించే సరికి ఏం చెప్పాలో తోచక తడబడిపోతూ ‘‘స్వాములూ! మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలీడం లేదండీ! నే నచ్చరం ముక్క రానోణ్ని. ఎద్దుల్ని కొట్టి, ముద్దలు తింటూ బతికినోణ్ని’’ అంటూ స్వవిషయం తేటతెల్లంగా చెప్పుకున్నాడు.

స్వాములవారితో తన ప్రసంగం సజావుగా కొనసాగేటట్టు లేదని, ప్రక్కన కూర్చున్న పామరుణ్ని మాటల్లోకి దించడమే వరహాలయ్యకు మేలనిపించింది. కొరకరాని కొయ్యకంటే చొప్పదంటయినా మేలే.

‘‘ఏమయ్యా పెద్దాయనా! ఏవూరు మీది?’’

‘‘నాదా బాబూ! పుట్టింది పెదరావూరు. పెరిగింది తిమ్మసముద్రం. పెళ్లాడింది పాతకోట. గంజి కరువొచ్చినప్పుడు వలసబోయింది తూరుపుగడ్డ. ఏవూరని యివరమడిగితే ఏం జెబుదును బాబయ్యా? కలిగిన మారాజుకైతే ఒకటే వూరు. లేని బీదోడికి ఎక్కడ పొట్ట గడిస్తే అదే వూరు...’’

ఇదేమీ చొప్పదంటు కాదురా బాబో అనుకున్నాడు వరహాలయ్య.

‘‘మరైతే అన్ని వూళ్లూ చెప్పావేగానీ, యిప్పుడెళ్తున్న దేవూరో చెప్పలేదే!’’

‘‘అదేదో మంచి వూరే బాబూ. నోటికి రావడం లేదు. ఎల్లమంద వెళ్లే బస్సెక్కితే పదిహేనో మైలురాయి కాడ వుంటుందండి. ఆ వూళ్లో రాంకోటిగారని... ఓ యబ్బో, పెద్ద సావుకోరంట, ఆయన కొబ్బరితోటలో కాపుదారిగా వుంటానికని వెళ్తున్నాను. రామ్మూర్తి పంతులుగారు సీటీ రాసిచ్చార్లెండి’’

దారి పొడుగునా దిగేవాళ్లేగానీ బస్సెక్కే ప్రయాణీకులు కానరావడం లేదు.

‘‘ఏమయ్యో కండక్టర్‌! లింగాలబావి దాటగానే చెప్పమన్నాను. నేను కుమ్మరోళ్ల సత్రం దగ్గర దిగెయ్యాలి’’ అంటూ ఒకరు–

‘‘ముదినేపాడు చెరువు మరవ దగ్గర నన్ను దింపుతావు గదూ’’ అంటూ వేరొకరూ–

‘‘అయ్యా, ప్యాసెంజర్లూ! అప్పటికి మీవి సాదా కళ్లున్నూ, నావి ఎక్స్‌రే కళ్లా? మిన్నూ మన్నూ నల్లటి తెర గుడ్డలా అలుక్కుపోయిందయ్యా! ఎవరు దిగాల్సినచోటు వాళ్లే గమనించుకోవడం మంచిది’’ కండక్టరు చిచ్చుబుడ్డిలా ప్రేలిపోయాడు.

జరుగుతున్న ప్రసంగం వల్ల వరహాలయ్య కొక విషయం తెలిసివచ్చింది. బస్సింకా లింగాలబావి, కుమ్మరోళ్ల సత్రం దాటలేదు. ఈ మసలోణ్ని యింకొక ట్రిప్పు మాటల్లోకి దింపితే నాలుగైదు మైళ్ల దూరం వెళ్లిపోవచ్చు.

‘‘అయ్యో పాపం. వయసుడిగిన రోజుల్లో పొట్టపూడ్చుకోడం కోసం ఊరు కాని వూరు వెళ్తున్నావు. నీకు నా అన్న వాళ్లెవరూ లేరేమయ్యా పెద్దాయనా?’’

పళ్లులేని బోసినోటితో ముసలతను నవ్వుకున్నాడు. ‘‘గంపెడు బిడ్డల గంగన్నను పట్టుకుని ఎంత మాటన్నారండీ బాబుగోరూ!’’

‘‘అట్లాగా! ఎందరయ్యా నీకు పిల్లలు?’’

‘‘పెద్దోడు వరదయ్య. పాణ్యం సిమెంటు పాక్టరీలో పన్జేసుకుంటున్నాడు. రెండోవోడు రామాంజులు. బండీ, కాడెద్దులు పెట్టుకుని సంత యాపారం జేస్తున్నాడు. మూడోవోడు నాదముని. కరెంటు పన్జేస్తాడు. నాలుగోవోడు దరమయ్య. తాలూకాఫీసులో బిళ్ల బంట్రోతు. కడగొట్టోడు ముక్కంటి. కొడుకుల సంగతి సెప్పానా! కూతుళ్లు ముగ్గురండి. పెద్ద కూతుర్నిచ్చింది చీనెపల్లె. రెండో కూతుర్ని కొండపాలెంలో యిచ్చాను. మూడో కూతుర్ని కాపురానికి పంపి ఆరునెల్లయింది.’’

చిక్కావురా మిడతంబొట్లూ అనుకున్నాడు వరహాలయ్య. ‘‘ఎందరుండి ఏంలాభం లేవోయ్‌ గంగన్నా?’’

‘‘బతికినంతకాలం ఒకిరికి పెట్టినోణ్నేగానీ, ఒకరి తిండి తిన్నోణ్నిగాను. వాళ్ల బతుకు వాళ్లు బతుక్కుంటున్నారు. జానెడు పొట్ట కోసం ఒకర్ని కాపెట్టుకుని కూచుంటామా?’’

వరహాలయ్య విస్తుపోయాడు. ‘ఇల్లు లేదు, వాకిలి లేదు, కట్టుకున్న పంచ, పైన వేసుకున్న గొంగడీ తప్పితే యింకొక బట్ట లేదు. అయినా ఈ ఎముకల గూడులో ఎంత ధీమా ఏడ్చిందిరా బాబూ!’

బస్సు ముదినేపాడు చెరువుకట్ట దాటుకునేసరికి వాన వెలిసిపోయింది. ఆకాశాన నక్షత్రాలు కూడా కానరాసాగాయి. ‘ఇంకెంతదూరం మూడు మైళ్లే గదా’ అనుకున్నాడు వరహాలయ్య. ఆ మూడు మైళ్ల దూరం గూడా పది నిమిషాల్లో గడిచిపోయింది.

డ్రయివరు నాగులేటిగట్టున బస్సు నిలబెట్టి ‘‘ఏటిలో నీళ్లొస్తున్నాయే’’ అన్నాడు.

‘‘ఫరవాలేదులే! వానవొస్తే ఏటికెల్లవ రావడం మామూలే. ఒక్క బిర్రున నువ్వు ముందుకు వెళ్లిపోవయ్యా కేశవులూ’’ హుషారిచ్చాడు చెన్నారెడ్డి.

‘‘అవునవును’’ అన్నాడు సుబ్బానాయుడు.

‘‘వరద ఎక్కువగావచ్చు. తొందరగా వెళ్లిపోవడం మంచిది.’’

‘‘తనకే తెంపుండాలిగానీ డ్రయివరుకు మనం ధైర్యం చెప్పాలంటే అవుతుందా?’’

– డ్రయివరు ఏదో పూనకం వచ్చినవాడిలా బస్సును స్టార్టు చేసి నీటిపైకి వదిలేశాడు. ‘పోనీ పోనీ, ఉండు వుండుండు’ గావుకేకల మధ్య బస్సు సుడిగుండంలో స్తంభించిపోయింది. ముందువైపు ఇంజనులోకి, వెనుక వైపున్న ప్రవేశద్వారం లోనుంచీ ప్రవాహజలం చొచ్చుకురాసాగింది. మృత్యుభయం శరీరంలోకి విద్యుత్తులాంటి శక్తిని రవాణా చేస్తుందేమో. ఏ దారిగుండా వెలుపలికి వచ్చారో, ఏవిధంగా పైకి పాకిపోయారో క్షణాలలోగా ప్రయాణీకులందరూ బస్సు టాపుపైన వున్నారు. తడి ఆరిపోయిన నాలుకలతో, నిలువునా కంపిస్తున్న శరీరాలతో. అర్ధరాత్రి కావొచ్చేసరికి నీటిమట్టం యింకొక అడుగు పైకి లేచింది.

‘‘ఈ చావు గడియల్లోనైనా ఒక మంచి మాట చెవిలో వేస్తారా స్వామీ’’ దీనంగా అర్థించాడు చెన్నారెడ్డి. స్వాములవారు ఆకాశం వైపు చూసారు.

‘‘ఏదైనా మంత్రోపదేశం చేసినా సరే. చివరి క్షణాల్లో జపిస్తూ కళ్లు మూస్తాము’’ నందవరం సీతారామయ్య మరింత ప్రయోజనకరమైన ప్రతిపాదన చేశాడు.

‘‘ఇదొకరు చెప్పగా యింకొకరు వినడానికి తగిన పరిస్థితి కాదు. మీ మీ తీరని కోరికలేవో చెప్పుకుంటే, ఆ బంధం నుంచి విముక్తి పొందవచ్చు.’’

‘‘రెండో పంట కోసం చెరువు క్రింద ఒక బావి తవ్వించి పంపుసెట్టు పెట్టించాలనుకున్నాను’’ చెన్నారెడ్డి.

‘‘కాశీ, రామేశ్వరం చూసి రావాలనుకున్నాను. నాకంత అదృష్టం గూడానా’’ సుబ్బానాయుడు.

ఒక్కొగానొక్క కూతురుకు కడుపున కాయగాయక పోవడం సీతారామయ్యకు తీరని చింత.

మడిచిన గొంగళి తలక్రింద పెట్టుకుని గంగన్న గుర్రుపెడుతూ గాఢంగా నిద్ర పోతున్నాడు.

‘‘మరైతే స్వామీ! తమ తీరని కోరికేమిటో’’

‘‘అబ్బే మాకేం కోరిక. మేం కోరుకునేది ముక్తి. ఈ కట్టె కడతేరిన తర్వాతనే గదా అది లభించేది’’ అన్నాడు.

‘‘బ్రతికుండగా ముక్తి లభించదా స్వామీ?’’

స్వాములవారు ఏదో చెప్పబోయి, గంగన్న ముఖంలోని ప్రశాంతతను గమనించినవారై మౌనముద్రలోకి జారిపోయారు.

తెల్లవారేటప్పటికి వరద తగ్గుముఖం పట్టింది. ‘ఏమయ్యా పెద్దాయనా! నిండుగా పారుతున్న ఏటిలో నీకెలా నిద్ర పట్టింది?’’ అని తోడి ప్రయాణీకుడెవరో ప్రశ్నిస్తే, గంగన్న సిగ్గుతో బుర్ర గోక్కుంటూ ‘‘పదిమందితో సావంటే, పెళ్లితో సమానం గదా’’ అంటుండటం వినిపించింది.


(సాక్షి సాహిత్యం; 13 ఆగస్ట్‌ 2018)








 

Monday, November 25, 2024

నల్లజర్ల రోడ్డు

 


తిలక్‌


బాలగంగాధర తిలక్‌(1921–66) ‘నల్లజర్ల రోడ్డు’ సంక్షిప్తం ఇది. ఈ కథ ఆంధ్రపత్రిక ప్లవ సంవత్సరాది సంచిక(1961)లో ప్రచురితం. కథకుడు కూడా అయిన తిలక్‌ కవిగా మరింత ప్రసిద్ధుడు. ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. ‘అమృతం కురిసిన రాత్రి’ ఆయన కవితల సంకలనం.

––––

అడవి సాయానికి నాగరిక కృతజ్ఞత


ఏలూరులో చూసుకోవాల్సిన పని అయిపోయింది. ప్లీడరు గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక కారు స్టార్టు చేశాడు రామచంద్రం. రాత్రి పది దాటింది. సరిగ్గా తొక్కితే గంటన్నరలో తణుకులో ఉండొచ్చు.

కలెక్టరు గారింట్లో పెళ్లి సరీగా ఉదయం ఏడు గంటలకి. నాగభూషణం మీదా, రామచంద్రం మీదా భరోసా వేసుకుని కూర్చున్నారు కలెక్టరు గారు.  కలెక్టరు గారింట్లో శుభకార్యమంటే వేరే చెప్పాలా!

రామచంద్రం పెద్ద టెన్నీస్‌ చాంపియన్‌. కాలవ ఒడ్డున పెద్ద మేడవుంది. నాగభూషణం కలప వ్యాపారం నడుపుతున్నాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరే. భూషణం అల్లుడు అవధాని కూడా వాళ్లెంబడి వున్నాడు. ఇంకా కుర్రాడు.

ఆరుమైళ్లు వచ్చేప్పటికి కారు ఆగిపోయింది. రామచంద్రం దిగి బానెట్‌ తీసి చూశాడు. ‘వెధవ కారులా ఉంది. నడచి వెనక్కి పోదాం పద’ అన్నాడు నాగభూషణం.

‘అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగానీ యీ కారుని తిడితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు రామచంద్రం. కారు కిందా మీదా ఏవో పరీక్ష చేశాడు. చివరికి ఆల్‌రైట్‌ అంటూ కారులో కూర్చున్నాడు.

ఎర్రని పొడుగాటి రోడ్డు మీద కారు వెళుతూంటే చల్లని గాలి మొహానికి కొడుతోంది. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాల లాగా నక్షత్రాలు మెరుస్తున్నాయి. 

మళ్లీ కారు సడెన్‌గా ఆగిపోయింది. రామచంద్రం విసుగ్గా దిగాడు. బానెట్‌ తీసి పరీక్షించాడు. ‘సరిగ్గా కనపడడం లేదు యీ గుడ్డి వెన్నెలలో’ అన్నాడు. అంతవరకూ వెన్నెల ఉన్నట్టు అవధానికి అనిపించలేదు. ఆకాశం కేసి చూశాడు. జేగురు రంగుగా ఉన్న చంద్రుడి మీద పల్చని మబ్బులు తారాడుతున్నాయి. దారి వెంట వెళ్తున్న ఆసామీలు గీసిన అగ్గిపుల్లల వెలుగులో ఏదో మరమ్మత్తు చేశాడు రామచంద్రం. బయలుదేరుతుండగా, ఆసాములు ‘జాగ్రత్త బాబూ. అడవిలో ఏదో చిరుతపులి’ ఉందన్న కబురును చెవిన వేశారు. దాన్ని కొట్టేస్తూ, ఏక్సిలేటర్‌ మీద కాలు నొక్కాడు రామచంద్రం. కారు రయ్యిమని దూసుకుపోయింది. ‘అడవి వచ్చేసింది. ఇది దాటితే యింక పదిహేను మైళ్లు తణుకు’ అన్నాడు రామచంద్రం. నాగభూషణం వెనక్కి జేర్లబడి నిద్దరోతున్నాడు. అవధాని దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తున్నాడు. అంతా కటిక చీకటి.

ఇంజన్‌లో ఏదో ఠప్‌మని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఒక గంతు వేసి ఆగిపోయింది. రామచంద్రం దిగి పనిముట్లు టిక్‌టిక్‌మనిపించాడు. ‘వద్దురా యీ కార్లో ప్రయాణం అంటే విన్నావు కాదు’ అన్నాడు భూషణం. ‘అబ్బ చంపకు, వెధవ గోలా నువ్వూ’ రామచంద్రం సహనం కోల్పోయాడు. ‘ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్రవుంటే చూడాలి. కారును పైకి ఎత్తి పట్టుకోవాలి’ అంటూ రోడ్డు వారకు పోయి కర్ర కోసం వెదుకుతున్నాడు.

రోడ్డు వారనే చింతచెట్లూ రావిచెట్లూ ఉన్నాయి. ఒక పెద్ద మర్రిచెట్టు ఊడలతో భయంకరంగా వుంది. చెట్టుచెట్టుకీ మధ్య యీత ముళ్ల పొదలు, బ్రహ్మచెముడు డొంకలు, రకరకాల తీగలూ అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి.

హఠాత్తుగా ‘భూషణం పాము పాము’ అన్న కేక నిశ్శబ్దాన్ని చీలుస్తూ వినపడింది. ‘రామచంద్రం’ అంటూ భూషణం పరుగెతుకెళ్లాడు. పెద్ద పాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెలలో మెరుస్తూ వెళ్లిపోయింది. అవధాని ప్రాణాలు బిగుసుకుపోయాయి. రామచంద్రం వణికిపోతున్నాడు. రెండు చేతులతోనూ పొదివి పట్టుకుని రామచంద్రాన్ని తీసుకువచ్చాడు భూషణం. అవధాని కారు తలుపు తీశాడు. వెనుక సీటులో పడుకోబెట్టారు. కండువా తీసి కాలిమీద గట్టిగా బిగించి కట్టారు. రామచంద్రం కళ్లల్లో విపరీతమైన భయం సుళ్లు తిరిగింది. పెదవుల చివరి నుండి నురగ కక్కుతున్నాడు. ‘మనకెంత గతి పట్టిందిరా’ ఏడుస్తున్నాడు భూషణం.

ఇంతలో ఏదో మువ్వల చప్పుడు. ఒక ముసలివాడు రోడ్డు మీద నున్న పొదలను తప్పించుకుని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన ఒళ్లు. భూషణం తడబడుతూ అన్నాడు: ‘ఎ ఎ ఎవరది?’

‘సిద్దయ్యని బాబూ పాములవాణ్ణి’ అన్నాడు ముసలాయన.

‘పాములవాడివా?’ దైవసంకల్పం వుంటే కానీ యీ అడవిలో యిటువంటి వేళ ఒక మనిషి, అందులో పాములవాడు కనిపించడు. భూషణం కారులోంచి దూకి సిద్దయ్య రెండు చేతులూ పట్టుకున్నాడు. రామచంద్రాన్ని సిద్దయ్య పరీక్షగా చూశాడు. ‘ఇంకా బతికే వున్నారు బాబయ్యా’ అన్నాడు బాధతో తోక తెగిన బల్లిలా గిజగిజలాడుతూన్న ప్రాణిని చూసి. ‘మంత్రం వేసి బతికించావా సగం ఆస్తి నీకు రాయిస్తాను’ అన్నాడు భూషణం.

‘అదృష్టం వుంటే బతకొచ్చును బాబయ్యా, అక్కడ పాకలోకి తీసుకురండి. వేరు ముక్కతో మంత్రం వెయ్యాలి’.

రామచంద్రాన్ని గుడిసెలోకి మోసుకెళ్లారు. నులకమంచంలో పడుకున్న యువతిని ‘సూరీడు లే లే’ అంటూ ముసలాయన తట్టి లేపాడు. దానిమీద రామచంద్రాన్ని పడుకోబెట్టారు. సిద్దయ్య రెండు మూడు సంచీలలో చెయ్యి పెట్టి వెదికాడు. పూసలూ పెంకులూ వేర్ల ముక్కలూ రాళ్లూ ఏవేవో ఉన్నాయి. కావాల్సిన వేరు ముక్కలేదు. దూరంగా వెలగచెట్టు అవతల పొదల కాడ ఆ వేరుగల మొక్కలున్నాయి. అక్కడ పాముపుట్టలూ ముళ్లపొదలూ జాస్తి. ముసలాయనకు చీకటిపడితే చూపు సరీగా ఆనదు. భూషణం పర్సులోంచి డబ్బు తీయబోయాడు. ‘నీ డబ్బుకి ఆశపడ్డానా మంత్రం పనిచెయ్యదు’ కఠినంగా అన్నాడు సిద్దయ్య.

‘ఈ అయ్యకి పెదవులు నల్లపడి పోతున్నాయి’ అంది సూరీడు. భూషణం అదిరిపడ్డాడు. యింతకముందు రేగిన ఆశ గప్పున ఆరిపోయినట్టయింది. ‘పోనీ నేను వెళ్లి తీసుకురానా’ అంటూ సూరీడు పరుగెత్తింది. రామచంద్రం చివరి ఘడియల్లో ఉన్నాడు. ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది. ఇంతలో సూరీడు తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. చేతిలో అయిదారు మొక్కలున్నాయి. సిద్దయ్య సంజ్ఞతో గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అరిపాదాల్ని ఒళ్లో పెట్టుకుని రాసింది.

అరగంట తర్వాత, రామచంద్రం మొహంలో చావునీడలు తప్పుకున్నాయి. శ్వాస యథాస్థితికి వస్తోంది. ‘ఇదంతా నీ చలవ సూరీడు’ అంటూ ఆమె కాళ్లమీద పడ్డాడు భూషణం. ‘తప్పండి బాబూ’ అంటూ సూరీడు సిగ్గు పడింది. ఆమె నవలావణ్యంతో ఆకర్షణీయంగా వుంది. అప్పుడు సమయం మూడు గంటలవుతోంది. అందరూ నడుం వాల్చారు.

సుమారు వో గంటకు భూషణం లేచి సూరీడు వొంటి మీద చెయ్యి వేసి లేపాడు. జేబులోంచి డబ్బు ఇస్తూ, ‘నా మనసు తీర్చు’ అన్నాడు. ‘అందుకు డబ్బెందుకు బాబూ’ అంది సూరీడు. మరి? ‘నేనలాంటిదాన్ని కాను. పోయి పడుకో అయ్యా’ అంటూ మరోవైపు తిరిగి పడుకుంది. అవధాని నవ్వాపుకున్నాడు.

తెల్లారి అంతా నిద్రలేచారు. ఆరు గంటల బస్సు వచ్చే వేళయింది. కలెక్టర్‌ గారింట్లో పెళ్లికి సమయానికి వెళ్లొచ్చు! రోడ్డు వైపు నడుస్తున్నారు. రామచంద్రం ఉత్సాహంగా ఉన్నాడు. మళ్లీ శ్రీమంతుడూ టెన్నీస్‌ చాంపియనూ అయిపోయాడు. ‘ఎపుడైనా మా ఊరు వస్తే కనిపించు సిద్దయ్యా’ అన్నాడు కృతజ్ఞతగా. ‘చిత్తం’ అని ముసలాయనా, సూరీడూ వెనక్కి వెళ్లిపోయారు.

కారు తడిసిపోయింది మంచులో. తణుకు వెళ్లగానే దీన్ని తీసుకువచ్చే ఏర్పాటు చేయాలనుకున్నారు. 

ఇంతలో ‘బాబయ్యా’ అని కీచుగా కేక వినపడింది. సూరీడు పరుగెత్తుకొస్తోంది. ‘బాబూ, మా అయ్యని పాము కరిచింది. ఒక్కసారి రండి బాబూ’. అరెరెరె! ‘సగం దూరం వెళ్లగానే వేరు ముక్క కోసం పొదలో చెయ్యిపెట్టి మొక్క పీకబోయాడు. బుస్సున లేచి కాటు వేసింది బాబూ తాచుపాము’. అయ్యో! ఈ బస్సు దాటితే ఎలాగ? ‘మీరుంటే ధైర్యం బాబూ’ సూరీడు ఏడుస్తోంది. ‘కలెక్టర్‌ గారింట్లో పని అంతా నేను చూసుకుంటానని మాట ఇచ్చానే’ రామచంద్రానికి సమస్య వచ్చి పడింది. అదిగో బస్సు వచ్చేస్తోంది. అవధాని నిశ్చేష్టుడై చూస్తున్నాడు. బస్సు ఆగింది. రామచంద్రం గబుక్కున రెండు పదిరూపాయల నోట్లు సూరీడు చేతిలో పెట్టి బస్సు ఎక్కేశాడు. అవధానిని బస్సులోకి తోసి, భూషణం కూడా ఎక్కాడు. బస్సు బర్రున సాగింది. సూరీడు గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది. పది రూపాయల నోట్లు గాలిలో పల్టీలు కొట్టుతున్నాయి.


(సాక్షి సాహిత్యం; ఫిబ్రవరి 12, 2018)

 

Friday, November 22, 2024

మహేంద్ర ‘అతడి పేరు మనిషి’

 


మహేంద్ర


మహేంద్ర కథ ‘అతడి పేరు మనిషి’కి సంక్షిప్త రూపం ఇది. 1983లో అచ్చయింది. హఠాత్తుగా జబ్బుపడి, 39 ఏళ్లకే మరణించిన మహేంద్ర(16 జూలై 1959 – 12 జూన్‌ 1998) కవి, చిత్రకారుడు కూడా. ‘స్వర్ణసీమకు స్వాగతం’ నవలిక రాశాడు. ఆయన మరణానంతరం ‘కనిపించని కోయిల’ కథా సంకలనాన్నీ, ‘పర్వ వేలా తరంగాలు’ కవితా సంకలనాన్నీ ఆయన అన్న, కథకుడు మధురాంతకం నరేంద్ర వెలువరించారు.

–––––

అతడి పేరు మనిషి


వర్షం అవిరామంగా కురుస్తోంది. మహల్‌ గ్రామం చుట్టూ వున్న కొండలపై మబ్బులు బద్దకంగా దొర్లిపోతున్నాయి.

‘‘ఏమైనా నువ్వు యిలా వొంటరిగా వచ్చేయడం ఏం సబబుగా లేదు తల్లీ. నీ అదృష్టం బాగుండి కారు చిత్తూరు దగ్గర ఆగిపోబట్టి రాత్రి ఏ హోటల్లోనో ఆగి సురక్షితంగా రాగలిగావు యిదే ఏ రిమోట్‌ ప్లేస్‌లోనో జరిగుంటే ఏమయ్యేదో నీకర్థం కాదు’’ ఉదయం నుంచీ మాధవి, సుధనలా మందలించడం ఎనిమిదోసారి.

‘‘జరిగినదానికి తానూ బాధపడుతోంది కదవే, వదిలెయ్‌’’ అక్కను విసుక్కున్నాడు కృష్ణమూర్తి.

సుధ మరీ డల్‌ అయిపోవడం గమనించిన మాధవి పాతభవంతి నుంచి పనిమనిషి చేత టిఫనూ, కాఫీలు తెప్పించింది.

ఇంతలో గేటు దగ్గరెవరో తారాడుతుండడం గమనించి ముందుకు నడిచాడు కృష్ణమూర్తి. ఆ ఆగంతకుడెవరో వచ్చి వరండా మెట్ల మీదే నిలుచున్నాడు. సుధ నిర్ఘాంతపోయింది. వర్షంలో ఎంతగా తడవొచ్చునో అంతగానూ తడిసి వున్నాడతను.

‘‘రాత్తిరి బిత్తరంలో దీన్ని మరిసిపొయ్యినారు, బంగారపు వస్తువుగద! తొందరపడతావుంటారని మద్దానమే బయల్దేరినా మద్దిన ఈ వాన మల్లా పనిపాటు చేసింది’’ తన చేతిలోని బంగారుగొలుసును సుధ చేతికిస్తూ ఆలస్యానికి సంజాయిషీ యిచ్చుకుంటున్నట్టుగా అన్నాడతను.

మాధవి అయోమయంగా సుధకేసి చూసింది. ‘‘వస్తున్నప్పుడు కారు ట్రబులిచ్చిందని చెప్పానుగా. అప్పుడు యితనూ యింకా కొందరూ వెనుకనుంచీ త్రోసారు. అప్పుడు పడిపొయ్యుంటుంది’’ తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ అంది సుధ. ఏదో పనివున్నదానికి మల్లే లోపలకెళ్లి కాట్‌ మీద బోర్లాపడింది. ‘అసలేం జరిగిందని కృష్ణమూర్తి అతణ్ని అడిగేస్తాడు. హోటల్లో ఆగిపోయినట్టు కల్పించి చెప్పినదంతా అబద్ధమని తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత తల ఎత్తి మాట్లాడగలదా? ఐనా యితడిలా దాపురిస్తాడని తానేం కలగందా? పేద్ద నిజాయితీపరుడిలా పట్టుకొచ్చాడు.’ గడిచిన భయంకరమైన రాత్రి గుర్తుకు వచ్చింది.

’ ’ ’

ఆకాశం పగిలినట్టు కుండపోతగా వర్షం. ఏడుగంటలే అయినా అర్ధరాత్రిలా ఉంది. చిత్తూరు నుంచీ మహలుకెళ్లే రోడ్డుమీద హెడ్‌లైట్స్‌ వేస్తున్న వెలుతురు మరక ఆధారంగా కారు దూసుకుపోతూంది. అరగంటలో మహల్లో వుంటానన్న నమ్మకం వొక్కటే సుధకు ధైర్యం యిస్తోంది.

ఆమె భయాందోళనలకు పతాక ఘట్టంలా కారు రోడ్డుకడ్డం పడివున్న తాటిచెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఏడవడానికి కూడా నోరు పెగలడం లేదు. ఇంతలో ఓ మెరుపు మెరిసింది. ఆ వెలుగులో పక్కనున్న మిట్టమీద ఒక గుడిసె కన్పించింది.

అయిదారు నిమిషాల విచికిత్స అనంతరం తెగింపు తెచ్చుకుని కారు లాక్‌ చేసి, సెనగ చేలు కడ్డంగా నడిచి గుడిసె చేరుకుంది. కొత్తమనిషిని గుర్తు పట్టినట్టు దొడ్డిలోని మేకలు అరిచాయి.

గడపకు కొంచెం అటువైపుగా నులకమంచం మీద పడుకున్న మనిషి కన్పించాడు బోర్లా పడుకుని. నేలమీద పెట్టిన గోధుమరంగు పుస్తకం జూసి చూరుకు వ్రేలాడుతున్న లాంతరు వెలుగులో ఏదో పద్యాల్ని కాబోలు కూనిరాగంతో చదువుకుంటున్నాడు.

వణుకుతూ యింట్లోకి జొరబడింది సుధ. అతడు లేచి నిలుచున్నాడు. ఇరవైకి మించని వయసు. నల్లటి శరీరం. వుంగరాల జుత్తు.

‘‘కారు నిలిచిపోయింది’’ అప్పుడే మాటలు నేర్చిన పసిపిల్లలా అంది. అతడు రోడ్డుకేసి చూపు సారించాడు. కన్ను పొడుచుకున్నా కన్పించని చీకటి.

‘‘ఎక్కడినుంచి వొస్తావుండారు?’’

‘‘మెడ్రాసు. మహల్‌కెళ్లాలి మా మామగారింటికి’’.

‘‘పెసిడెంటు వాళ్లింటికా?’’ వచ్చిన మనిషెవరో అర్థంగావడంతో అతడు మంచం మీద దుప్పటి దులిపివేశాడు.

‘‘కూచోండి. వొరసం ఈ రాత్తరికి తగ్గేట్టు లేదు. దూరం పయానాలకు బొయ్యేటప్పుడు అడమనిషి వొంటిగా వొచ్చుండగూడదు.’’

సుధ ఇంకా ద్వారం వద్దనే నిలబడి చీర కుచ్చిళ్లను, పమిటను పిండుకోసాగింది.

‘‘పెట్లో మా ఆడోళ్ల కోకలుండాయి. మీ గుడ్డలు ఆరేవరకూ అవి కట్టుకుందురా?’’ అని ప్రశ్నార్థకంగా జూసి, చెక్కపెట్టి మీదినుంచీ ట్రంకును దించి వున్నవాటిలో మంచి చీరను తీసి ఆమెకిచ్చాడు. సుధ తటపటాయించడం చూసి, ‘‘ఈ తేమగుడ్డల్లో తెల్లారగట్ల నానితే రేపు మద్దానానికి జరం ఖాయం’’ ఆమెకు ఏకాంతం కల్పించడం కోసం కాబోలు, రావిఆకుల మోపును తీసుకుని మేకల దొడ్డిలోకి పోయాడు.

పొయ్యి ముట్టించి ఎసరు బెడ్తూ, ‘‘మేము మాలోళ్లము, మా యిండ్లలో మీరు భోజనం జేద్దురా’’ అని నవ్వుతూ ‘‘కారు నిల్సిపోంగా యిట్టొచ్చినారుగానీ– చెన్నపట్నం పుట్టిమునిగితే మటకు మీరు మా గడప దొక్కుతారా?’’

అతడు తనకంటే రెండు మూడేళ్లయినా చిన్నవాడుగా వుండొచ్చు. కానీ ఆ మాట్లాడుతున్న తీరు తనకన్నా యిరవై ముప్పై ఏళ్లు పెద్దవాడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. 

మరో పది నిమిషాల్లో వంట పూర్తి చేసి అతడు సుధను భోజనాని కాహ్వానించాడు. బాగా ఆకలయిందేమో గబగబా అన్నం ముగించింది. సొమ్మసిల్లినట్టుగా మంచం మీద వాలిపోయింది. 

హఠాత్తుగా ఏ రాత్రివేళప్పుడో మెలకువ వచ్చింది. గుడిసె కప్పు ఈదురుగాలికి లేచిపోయేలా ఉంది. అతడు నేలమీద పడుకుని వున్నాడు. చిరుగుల చాప. కప్పుకోను దుప్పటి లేదు. నిద్ర పోతున్నాడా? నటిస్తున్నాడా? విద్యుద్ఘాతం తిన్నదానిలా గజగజ వణికిపోయింది. దుప్పటిని గొంతువరకూ లాక్కుంది. ‘అతడు తలుచుకుంటే యింకేమైనా వుందా? భగవంతుడా, నిరపాయకరంగా తెల్లారేట్టు చూడు.’

ఉదయం అతడు మరికొందరి సాయంతో చెట్టును అవతలికి లాగించేశాడు. అందరూ పది గజాలు తోయగానే కారు స్టార్టు అయింది. లాంఛనంగా కృతజ్ఞత చెప్పుతూ రెండు పది రూపాయల నోట్లను అతని చేతిలో కుక్కింది. అతడు వారిస్తూ ఏదో చెప్పబోయాడు. కారు స్టార్ట్‌ అయిన ఉత్సాహంలో ఆ మాటలను సరిగ్గా విన్పించుకున్నట్టు లేదు.

’ ’ ’

‘‘అతడు వెళ్లిపోయాడా?’’

‘‘మా మామయ్య కష్టపడి సంపాదించిన సొత్తు కాబట్టి మళ్లీ చేతికొచ్చింది. కృష్ణతో అతనికేమన్నా ఇచ్చి పంపమని చెప్పాను. భోజనం చేసి ముగ్గురమూ క్యారమ్స్‌ ఆడుకుందాం’’ అంటూ సుధ చేయి పట్టుకుని బంగళా నుంచి పాత భవంతిలోకి లాక్కుపోయింది మాధవి.

రాత్రి గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టిన తర్వాత వీధి తలుపు తెరుచుకుంది. కృష్ణమూర్తి ‘నాగయ్యా నాగయ్యా’ అని పిలుస్తూ వరండాలోకి వచ్చాడు. వెనుకనే వచ్చిన రాజమ్మ ‘నాగయ్య సందేళ కూతురింటికి పోయినాడయ్యా’ అంది. కృష్ణమూర్తి వీధిలైటు వేశాడు. వరండాలో మూల ఎవరో నిద్రపోతున్నారు. అతణ్ని లేపాడు. ‘ఏమయ్యా, నువ్వింకా మీ ఊరికి పోలేదా? వానలో అంతదూరం పోలేక పొయ్యుంటావు. నువ్విప్పుడు మల్లిమడుగు వెళ్లి– మునసామి తెల్సునా? అతడితో చెప్పి ప్రెసిడెంటు వాళ్లింట్లో ఎవర్నో తేలు కరిచిందని ఈడ్సుకురా’’ అన్నాడు.

‘‘తేలా? నాకు తెలవని తేలు వైద్దమా? కొత్తకోట పెద్ద చెంగయ్య మా నాయినే గదా. బాటరీ ఒకటి తేండి. మందాకు పెరుక్కొస్తా’’ అన్నాడు.

‘‘ఏ ఆకో, దొరుకుతుందా’’ అన్నాడు కృష్ణమూర్తి.

‘‘ఈడలేకపోతే మావూరికన్నా పొయ్యి పెరక్కరానా. అయిదు నిమిసాల్లో వస్తా సూడండి’’. వర్షంలో చీకట్లో కలిసిపోయాడు.

సుధ, మాధవి చేతిలో పడివుంది. కాళ్లూ చేతులూ చల్లబడ్డాయి. ‘ఏమని బయల్దేరిందో– అన్నీ గండాలే’.

మరో పది నిమిషాల్లో మందాకు కోసం పోయినవాడు తలుపులు త్రోసుకుని లోపలికొచ్చాడు. ఆకులు దంచి మందు తయారుచేసి సుధచేత మింగించాడు. కిరోసిన్‌ దీపంలో ఆకువాడ్చి కాలికి కట్టు కట్టాడు. పావు గంటకు సుధకు స్పృహ వచ్చింది. 

రాజమ్మ కళ్లు తుడుచుకుంటూ ఆకులు దంచిన చోట శుభ్రం చేయసాగింది. ‘ఇదేదో కాగితం ఆకుల్తో బాటు దంచేసుండావు సూడు’. పెడనవ్వు నవ్వి వీధిలోకి గిరవాటేశాడు. రూపాయి నోట్లున్న జేబులోనే మందాకు కోసుకొచ్చాడు. నోట్లు కూడా ఆకుల్తో బాటే దంచబడ్డాయి!

సుధ దీనంగా అతడికేసి చూస్తూవుంది. ‘‘నాకేమైనా పెట్టాలనిపిస్తే ఇంత అన్నం పెట్టించండి. నిన్న పొద్దున తిన్న అన్నమే. ఈ వొరసం పున్నాన పగులంతా కోమిటోళ్ల సత్రంలో గొంతు కూసొనుంటి. రాత్తిరి మనింటికాడ ఎవురన్నా బయటికొస్తారేమోనని దీపాలు ఆర్పేదాకా సూస్తావుంటి. ఈ పొద్దు నాకూ నా మేకలకూ ఉపాసమే’’ అన్నాడు. చెళ్లుమని చెంపదెబ్బ కొట్టినట్టయింది సుధకు. అతడు యింత చేసినందుకు తానేం చేయగల్గింది?

రాజమ్మ అతని ముందు విస్తరి వేసి అన్నం పెడుతోంది. తలవాల్చుకుని బురద బురదగా వున్న అరుగుపై మిడికాళ్ల మీద కూచొని వున్నాడతను. అంతవరకూ దూరంగా పడుకున్న కుక్క అతని దగ్గరికొచ్చి తోకాడించసాగింది. 

‘‘చివరకు కుక్కకు పడేసినట్లు నీకు యింత అన్నం పడేస్తున్నాం గదా’’ భోరున ఏడ్చేస్తూ సుధ అతణ్ని డైనింగ్‌ హాల్లోకి లాక్కుపోయింది.


(సాక్షి సాహిత్యం; 16 ఏప్రిల్‌ 2018)



 

Tuesday, November 19, 2024

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ ‘ఏస్‌ రన్నర్‌’


పెద్దిభొట్ల సుబ్బరామయ్య


పెద్దిభొట్ల సుబ్బరామయ్య (1938–2018) కథ ‘ఏస్‌ రన్నర్‌’కు సంక్షిప్త రూపం ఇది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన కథకుడు సుబ్బరామయ్య. ఇంగువ, నీళ్లు, పూర్ణాహుతి లాంటివి ఆయనకు బాగా పేరు తెచ్చాయి.

––––

డైలీ దౌడ్‌


ఎవరో కుర్రవాడు రన్నింగ్‌ రేస్‌ చేస్తున్నవాడిలా పేవ్‌మెంట్‌ మీద బాణంలాగా పరుగెత్తిపోతున్నాడు. రామచంద్రమూర్తి ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే ఆ కుర్రవాడు కనుచూపుమేర దాటిపోయాడు. వేగంగా పరుగెత్తుతున్న వారెవరిని చూచినా అతడు అలాగే నిలబడిపోతాడు. తర్వాత నవ్వుకుంటాడు.

అతడు మళ్లీ నడవడం ప్రారంభించాడు. మరొక ఫర్లాంగు దూరం నడిస్తే కానీ బస్సు స్టాపు చేరుకోలేడు. ఎంత పెందలాడి యింట్లో నుంచి బయలుదేరితే తప్ప బస్సు అంది ఆఫీసుకు చేరుకోవడం కష్టం. అప్పటికి సీతమ్మ ఎంతో పెందలకడనే– నిద్రలేచి పనులు ప్రారంభిస్తుంది. అవి సర్దుకొని, యివి సర్దుకొని వంటకు ఉపక్రమించి ఎంత ఉరుకులు పరుగుతు పెడుతూ చెమటలు కక్కుతూ పనిచేసినా తొమ్మిది గంటల లోపున వంట తయారు కాదు. నాలుగు మెతుకులు నోట వేసుకుని తాను తయారయ్యేసరికి తొమ్మిదిన్నర అవుతుంది. ఎంత వేగంగా నడిచినా బస్‌స్టాపుకు చేరుకునే సరికి మరొక పావుగంట. ఆ తర్వాత బస్సు కోసం పడిగాపులు పడి ఉండాలి. ఎంతకూ తనెక్కవలసిన బస్సు రాదు. పోనీ ఓపిక చేసుకుని నడిచిపోదామా అంటే ఆఫీసు దగ్గరా దాపూ కాదు. అయిదు కిలోమీటర్ల దూరంలో ఊరికి అవతలి వైపున ఉంటుంది.

‘పోనీ ఆఫీసుకు దగ్గర్లో ఏదైనా యిల్లు చూసుకోరాదూ?’ అన్నారు చాలామంది. కానీ అక్కడి అద్దెలు తాను భరించలేడు. ఆఫీసులో కొందరు జల్సారాయుళ్లు ఉన్నారు. కొత్త కరెన్సీ నోటుల్లా పెళపెళ లాడుతుంటారు. కానీ వారి సీట్లు అటువంటివి.

తన సీటు అటువంటిది కాదు. చాకిరీకి మాత్రం ఏమీ తక్కువ ఉండదు. టన్నుల కొద్దీ ఫైళ్లు పేరుకుపోతుంటాయి. ఫలితం మాత్రం నెల తిరిగేసరికి వచ్చే ఆ జీతపు రాళ్లే. అందులో బోలెడన్ని కట్లూ, కత్తిరింపులూ.

అతడు కోటు వేసుకుంటాడు. ‘మీకేమండీ కోటు తొడుక్కుంటారు దర్జాగా’ అంటారు కొందరు. వారికి తెలియదు తన లోపలి చొక్కాలోని ఎన్ని చిరుగులను బయటికి కనబడకుండా ఆ కోటు కప్పుతున్నదో!

ఎండ చిటచిట లాడుతున్నది. రామచంద్రమూర్తి నుదుట పట్టిన చెమటను అరచేత్తో తుడుచుకుంటూ వీధి చివరకు కళ్లు చికిలించి చూశాడు. ఏదో బస్సు వస్తున్నది. నంబరు సరిగా కనిపించడం లేదు. చత్వారం వస్తున్నదేమో! ఎస్సెల్సీ రిజిస్టరులో ఉన్న తన పుట్టిన తేదీ నిజమే అయితే తనకిప్పుడు నలభై ఎనిమిది వెళ్లి రెండు నెలలయింది. ఇంకా ఏడేళ్లు సర్వీసున్నది. బస్సు దగ్గరికి వచ్చాకకానీ నంబరు సరిగా కనిపించలేదు. అది తన బస్సు కాదు. రామచంద్రమూర్తి ఆలోచిస్తూ నిలబడ్డాడు. తాను ఆఫీసుకు నడిచిపోతే ఎంతసేపటిలో పోగలడు? వేగంగా నడవగలిగితే గంట. పరుగెత్తి పోతే? ఇప్పుడు తాను పరుగెత్తగలడా? ఒకప్పుడు పరుగెత్తాడు. తమ జిల్లా పేరు నిలబెట్టాడని విపరీతంగా మెచ్చుకున్నారు. ఫొటోలు తీశారు, దండలు వేశారు.

తానప్పుడు రోజూ పరుగెత్తేవాడు. మైళ్ల కొద్దీ దూరం అతని సన్నని కాళ్ల క్రింద తరిగిపోయేది. ఆ కండరాలకు అలుపు తెలిసేది కాదు. ఇంతకాలం తరువాత పరుగెత్తగలడా?

పక్కనే నిలబడి ఉన్న వ్యక్తిని ‘‘ఏమండీ! టైమెంత అయింది?’’ అని అడిగాడు. కొంచెం విసుగుతో చేతి గడియారం వంక చూసి ‘‘నైన్‌ ఫిఫ్టీ’’ అని సమాధానం చెప్పాడు. 

బాప్‌రే. తాను పదిగంటలకల్లా సీటులో ఉండాలి. లేకపోతే ఆ కొత్త ఆఫీసరు అగ్గిరాముడై పోతాడు. అసలా మనిషి ముఖం చూస్తేనే అదొక రకంగా ఉంటుంది. మెడ అంతా కొవ్వుపట్టి ఉంటుంది. ఎవరి వంకైనా చూడదలుచుకుంటే మెడ ఒక్కటీ తిప్పి చూడలేడు. మొత్తం శరీరమే గిర్రున తిరగవలిసి ఉంటుంది.

ఇప్పుడు పది దాటుతున్నది కదా? ఈ బస్సు ఎప్పుడే వచ్చేట్టు? తానెలా ఎక్కేట్టు? ఎన్ని గంటలకు ఆఫీసుకు చేరుకునేట్టు? ఆఫీసరుకు ఏమి సంజాయిషీ ఇచ్చుకునేట్టు?

అదుగో బస్సు. ఇంతకాలానికి దాని దర్శనమైంది. రామచంద్రమూర్తి కమ్మీ పట్టుకుని వదల్లేదు. దిగేవారు దిగగానే లోపలికి దూసుకుపోయాడు. బస్సెక్కడం అనే విద్యలో ఈ మాత్రపు ప్రాథమిక అనుభవమైనా లేకపోతే– ఆ సూట్‌వాలాలాగా పేవ్‌మెంట్‌ మీదనే గంటలు తరబడి నిలబడిపోక తప్పదు. సోదరా! దూసుకుపోయేవాడిదే రాజ్యం. లేకపోతే నీ సంగతి అంతే. 

రామచంద్రమూర్తి కళ్లముందు యెప్పటిదో దృశ్యం కనిపించింది. మరీ చిన్నప్పుడు తమ ఊరికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న చిన్న పట్నంలో స్కూలు చదువు. పొద్దున్నే లేచి చద్దన్నం తిని పుస్తకాల సంచీ భుజానికి తగిలించుకుని నడక ప్రారంభించేవాడు. సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు మరీ హుషారుగా ఉండేది. నాలుగు మైళ్లు పరుగెత్తుకుంటూ తిరిగి వచ్చేవాడు. ఆ విధంగా రన్నింగ్‌ అలవాటయింది. స్కూల్‌ పోటీలలో తానే ప్రథముడు. దాంతో ఇంకా అభిరుచి పెరిగింది. ఎక్కడికి వెళ్లినా పరుగెత్తుతూ వెళ్లడమే. 

బస్సు ఆగింది. రామచంద్రమూర్తి ఇద్దరు వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసి మళ్లీ కిందికి దిగాడు. టైమ్‌ కనుక్కున్నాడు. గుండె గతుక్కుమన్నది. మళ్లీ నడక. మరో అర ఫర్లాంగు దూరం. ఎండ నియంత పరిపాలనలా భయంకరంగా ఉంది.

ఆ రోజు... అంతర్‌ జిల్లా ఎథ్లెటిక్స్‌ ముగింపు రోజు. రన్నింగ్‌ ఫైనల్స్‌. ట్రాక్‌ అంతా శుభ్రంగా ఉంది. మొత్తం పద్దెనిమిది మంది. మెత్తని ప్రేలుడు వినిపించగానే ముందుకు దూకాడు. కళ్లముందు ట్రాక్‌ తప్ప మనుషులు కనిపించలేదు. గుండెకు తగిలిన పలుచని దారం తెగిన తర్వాత కొద్ది గజాల దూరం పరుగెత్తిపోయి పచ్చికలో కూలబడిపోయాడు. జనం మూగారు. పైకెత్తి గాలిలోకి ఎగరవేశారు. కలెక్టరు తనకు ట్రోఫీ బహూకరిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం అంతా మార్మోగిపోయింది. ‘ద ఫాస్టెస్ట్‌ రన్నర్‌ ఆఫ్‌ ద స్టేట్‌’ అని సావనీర్‌లో ఫొటో కింద వ్రాశారు.

రామచంద్రమూర్తి ఆఫీసు మెట్లెక్కుతున్నాడు. ఆయాసంతో వగరుస్తున్నాడు. ఆ ట్రోఫీ ఇంకా తనదగ్గరే ఉంది. దాన్ని ఇతర చిన్న చిన్న కప్పులూ దాచేందుకు తన దగ్గర అద్దాల బీరువాలు లేవు. కొన్ని అసలైన వెండికప్పులు డబ్బు అవసరం వచ్చినప్పుడు వాటికి కాళ్లొచ్చి వెండి దుకాణాల్లోకి వెళ్లిపోయాయి.

స్ప్రింగు డోరు తెరుచుకుని లోపల అడుగు పెట్టేసరికి అయ్యగారు పేపరు చదువుతున్నారు. శబ్దం విని కుర్చీ మొత్తం పక్కకు తిప్పి గడియారం వంక చూసి మొహాన గంటు పెట్టుకుని పేపరు బల్లమీద పడేసి ‘‘ఊ’’ అన్నాడు. రామచంద్రమూర్తి రిజిస్టరు అందుకోబోతూ ఉంటే ‘‘కాస్సేపాగండి– ఎలాగూ పన్నెండు అవుతుంది. ఈ పూటకు లీవు పెట్టేద్దురుగాని’’ అన్నాడు. ‘‘లీవు వుందా? అంతా వాడేసుకున్నారా?’’

రామచంద్రమూర్తి రిజిస్టరు మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుని ‘‘ఉందనే అనుకుంటానండి’’ అన్నాడు.

‘‘గూడ్‌. అది సరేనండీ. మీరెన్నింటికి బయలుదేరుతారు ఇంటినుంచి?’’

‘‘బస్సులతో బాగా ఇబ్బందిగా ఉందండి. ఆపరు, ఎక్కించుకోరు’’

‘‘గూడ్‌. కాబట్టి మనకు బస్సు సరిపడదని అర్థం– అంతేనా?’’

రామచంద్రమూర్తి తల వంచుకున్నాడు.

‘‘బస్సు మీద వస్తే లాభం లేదని తెలిశాక మీరు వేరే వసతి చూసుకోవాలి. మరో మీన్స్‌ ఆఫ్‌ కన్వేయన్స్‌. పోనీ ఒక స్కూటరు కొనుక్కోగూడదూ?’’

రామచంద్రమూర్తి నవ్వేందుకు ప్రయత్నించాడు. ‘‘డబ్బు కావాలి కదండీ’’ అన్నాడు.

‘‘గూడ్‌– డబ్బులేదు కాబట్టి కారు, స్కూటరు వగైరాలు వీల్లేదు. ఆగవు, ఎక్కించుకోవు కాబట్టి బస్సు వీల్లేదు. మరి కొంచెం ముందుగా యింటిదగ్గర బయలుదేరితే?’’

‘‘అప్పటికి యింట్లో వంటకాదండి’’

‘‘ఓహో అదొకటా? కాబట్టి అదీ వీలులేదు. ముందు లీవ్‌ లెటరు రాయండి. ఈ లోపల నేను ఉపాయం ఆలోచిస్తాను’’

లీవ్‌ వ్రాస్తున్నంతసేపూ ఆఫీసరు రామచంద్రమూర్తి వంక తమాషాగా చూస్తూ కూర్చున్నాడు. ‘‘ఆ ఉపాయం తట్టింది. అది బెస్టు’’.

‘‘చెప్పండి సార్‌’’

‘‘తొమ్మిదింటికి ఇంట్లోనుంచి బయటికి రండి– వెంటనే పరుగు ప్రారంభించండి. ఎక్కడా ఆగకండి. అరగంటలో ఆఫీసులో ఉంటారు. పైగా వొంటికి ఎంతో మంచిది. ఏమంటారు?’’ ఈ మాటలని అతడు నవ్వడం ప్రారంభించాడు.

రామచంద్రమూర్తి మొహం జేవురించింది. మనిషి నిలువెల్లా ఊగిపోయాడు. ‘‘మీ ధోరణి మీ హోదాకు తగినట్టు లేదు. అయామ్‌ సారీ. రియల్లీ సారీ. అన్నట్టు మీకు తెలియదేమో. పరుగెత్తమని సలహా ఇచ్చారు. ఐ వజ్‌ ఎ ఫేమస్‌ రన్నర్‌ వన్స్‌’’ అని స్ప్రింగ్‌ డోర్‌ మూసి యివతలికి వచ్చాడు.

’ ’ ’

ఆ సాయంకాలం ఆఫీసు నుంచి బయటపడి రామచంద్రమూర్తి నుదురు చేత్తో రుద్దుకున్నాడు. చల్లనిగాలి వీస్తున్నది. వేగంగా నడవడం ప్రారంభించాడు. ఈ ప్రాంతంలో పెద్ద ఆవరణ ఉంది. కొందరు యువకులు రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూవుంటారు. అతనికి పరుగెత్తాలని సరదా పుట్టింది. ప్యాంట్‌ కొంచెం పైకి మడిచాడు. కోటు చేతులు పైకి మడిచాడు. ‘‘రన్‌ రన్‌’’ అనుకున్నాడు. అలా తమ వీధికి చేరుకునేవరకూ పరుగెత్తుతూనే ఉన్నాడు.

ఆయాసంతో వగర్చుతూ యింటికి వచ్చిపడ్డాడు. మంచం మీద కూలబడిపోయాడు. సీతమ్మ ఆదుర్దాగా ‘‘ఏమిటండీ’’ అంటూ వచ్చింది. ఆయాసంలోనే ‘‘మంచినీళ్లు... వద్దు కాఫీ’’ అన్నాడు. ఆమె లోపలికి వెళ్లింది. అతడు కాళ్లు చాపి మంచంలో వెల్లకిలా పడుకున్నాడు. అయిదు నిమిషాల తర్వాత వచ్చి చూసి ఆమె అదిరిపడింది. భయంతో పరుగెత్తుతూ వెళ్లి దగ్గర్లోనే ఉన్న డాక్టరును పిలుచుకొచ్చింది. ఆయన పరీక్ష చేసి ‘‘చిన్న పెరాలసిస్‌ స్ట్రోక్, అదే పక్షవాతం. కుడి కాలూ చెయ్యీ పడిపోయాయి. విశ్రాంతిగా పడుకోనివ్వండి. నేను మళ్లీ వచ్చి చూస్తాను. ప్రాణభయం ఏమీలేదు’’ అని చెప్పి వెళ్లిపోయాడు.

రామచంద్రమూర్తి కళ్లలో నీళ్లు ఉబికి వచ్చి బుగ్గల మీదుగా కిందికి జారుతున్నాయి.

‘‘రన్‌... రన్‌ మై డియర్‌ బాయ్‌ రన్‌...’’


(సాక్షి సాహిత్యం; జూన్‌ 18, 2018)


 

Saturday, November 16, 2024

కవన శర్మ ‘ఆమె ఇల్లు’


కవన శర్మ


ప్రొఫెసర్‌ కవన శర్మ కథ ‘ఆమె ఇల్లు’ సంక్షిప్త రూపం ఇది. కవన శర్మగా ప్రసిద్ధులైన కందుల వరాహ నరసింహ శర్మ 23 సెప్టెంబర్‌ 1939న విశాఖపట్నంలో జన్మించారు. 25 అక్టోబర్‌ 2018న తన 79వ యేట బెంగళూరులో మరణించారు. ఆయన కథల్లో స్త్రీవాదం బలంగా వ్యక్తమవుతుంది. కానీ దీనికంటే ఎక్కువగా హాస్య రచయితగా గుర్తింపుపొందారు. దీనికి మించి సైన్సు రచయితగా పేరొందారు. ‘కవన శర్మ కథలు’, ‘బ్రెయిన్‌ డ్రెయిన్‌– అమెరికా మజిలీ కథలు’, ‘ఇరాక్‌ డైరీ’, ‘రామకాండం’, ‘సైన్స్‌ నడిచిన బాట’, ‘కోతి రాతలు’, ‘మన ప్రాచీన చరిత్ర ఒక కొత్త చూపు’, ‘సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జీవితము–కృషి’ లాంటివి ఆయన పుస్తకాలు.

––––

ఇల్లాలి ఇల్లు


పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది. కష్టపడి ఏ పనైనా చెయ్యటానికి సిద్ధపడే వారికి ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదు. ఉద్యోగం దొరికిన కొన్నాళ్లకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే, అద్దెకు సంపాదించాలనుకుంది. కాని ఇల్లు దొరకటం ఉద్యోగం దొరకటమంత సులభంగా లేదు.

‘‘మీరెంతమంది వుంటారు?’’

‘‘నేనొక్కతినే!’’

‘‘మీవారు, పిల్లలూ ఈ ఊళ్లో ఉండరా?’’

‘‘మావారుంటారు. పిల్లలు పెళ్లిళ్లయి దూరంగా ఉన్నారు.’’

‘‘మీవారు మిమ్మల్ని విడిచిపెట్టారా? లేక విడాకులిచ్చారా?’’

‘‘లేదు’’

‘‘మీవారేం చేస్తూ వుంటారు?’’

కమల చెప్పింది.

‘‘అంత పెద్ద ఉద్యోగస్థుడి భార్య అయిన మీరు ఇంత చిన్న ఇంట్లో ఉండగలరా?’’

‘‘అనే అనుకుంటున్నాను’’

‘‘మీ ఇద్దరు దెబ్బలాడుకున్నారా?’’

‘‘లేదు’’

‘‘మీకు స్వంత ఇల్లుందా?’’

‘‘లేదు’’

‘‘మీరో అద్దె ఇంట్లోనూ, మీ ఆయనో అద్దె ఇంట్లోనూ ఉంటారా?’’

‘‘కాదు. నేను అద్దె ఇంట్లోనూ, ఆయన తన స్వంత ఇంట్లోనూ ఉంటాము.’’

‘‘ఆయన స్వంత ఇల్లు మీది కాదా?’’

‘‘కాదుట’’

‘‘ఎవరన్నారు?’’

.........

ఆఖరికి కమల వయస్సే ఉన్న ఒక అవివాహిత స్త్రీ కమల ఆఫీసులోనే పనిచేస్తున్న ఆవిడ చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకి అద్దెకిచ్చింది, కంపెనీ కోసం. ఆ మర్నాడు కమల ఆఫీసుకు సెలవు పెట్టి బాంకుకు వెళ్లింది. బాంకులో ఆమె పేర్న తండ్రి పోతూ పోతూ వేసిన పదివేల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఉన్నాయి. దానిమీద అయిదు వేలు అప్పు తీసుకుని ఇంటికి కావలసిన మంచం, పరుపు, స్టౌ, పప్పులు, ఉప్పులు కొనిపెట్టుకుంది.

ఆ పైన భర్త ఇంటికి వెళ్లింది. ‘‘ఇన్నాళ్లూ మీరు నన్ను పోషించారు. నేను చాకిరీ చేసాను. రెండింటికీ చెల్లు. ఇందులో నా ఎడ్రస్‌ ఇస్తున్నాను. ఆ ఇల్లు అద్దెది. కాని అది ‘నా’ అద్దె ఇల్లు. మీకెప్పుడైనా రావాలనిపిస్తే రండి’’ అని చీటి వ్రాసిపెట్టి, తాళం వేసి, చెవి పక్కింట్లో ఇచ్చింది.

‘‘ఊరు వెళ్తున్నారా?’’

‘‘లేదు. నా ఇంటికి వెళ్తున్నాను.’’

కమల భర్త ఇంటికి వచ్చి కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు. ఆ కోపంలో కమల చేసిన తెలివితక్కువ పని గురించి ఆమె తమ్ముడికి, తన సంతానానికి ఉత్తరాలు వ్రాసిపడేసాడు.

ఉత్తరం అందగానే కమల తమ్ముడు కృష్ణ పరిగెత్తుకు వచ్చాడు. బావగారు చెప్పినది విన్నాడు. చిరునామా తీసుకున్నాడు.

‘‘నవ్వు చేసిన పనేం బాగాలేదక్కా. బావగారు ముక్కోపే! ముప్పై యేళ్లు సర్దుకొన్నదానివి. అయినా బావకి దూరంగా కొన్నాళ్లుందాం అని నువ్వనుకొంటే వచ్చి నా దగ్గరుండరాదా? నీ కొడుకు దగ్గరకు వెళ్లరాదా? (అయినా) అది నీ ఇల్లు కాదా? అంతింటికి యజమానురాలివి ఈ దోసెడు కొంపలో ఎందుకు ఇరికావు?’’

కమల తాపీగా జవాబు చెప్పింది.

‘‘అది నా ఇల్లు కాదు, ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆయన పెంచుకుంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ ఆపేక్షగానే చూసుకొంటారు, నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన మాకు ఇంటిమీద హక్కులుండవు.’’

‘‘ఎందుకక్కా అంత నిష్ఠూరంగా మాట్లాడ్తావు! ఏదో విషయంలో నీ మనస్సుకి నొప్పి కలిగింది. ఆ నొప్పి తగ్గేవరకు వచ్చి నాతో ఉండు.’’

‘‘అది నా ఇల్లు కాదని విడిచిపెట్టాను. నీ ఇల్లూ నాది కాదు కనుక రాను.’’

కమలకు పెళ్లయిన కొత్తలో పుట్టింటికి వెళ్లినప్పుడు, పాత అలవాటు ప్రకారం వాళ్లమ్మ పాత న్యూస్‌ పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బును అక్కా తమ్ముడికీ సమానంగా పంచినప్పుడు కృష్ణ, ‘‘ఆడపిల్లకి పెళ్లవగానే అత్త వారింట్లో హక్కు లేర్పడ్తాయి. పుట్టింట్లో పోతాయి. ఏదో ఒక ఇంటి సంపదలోనే వాటా వస్తుంది. అవ్వాబువ్వా ఎలా వస్తాయి!’’ అన్నాడు. 

‘‘రెండ్రూపాయలకెన్ని మాటలన్నావురా! రేపు నీ ఇంటికి నన్ను రావద్దంటావురా!’’ అంది కమల బాధగా.

‘‘అదేమిటక్కా! నీకీ ఇంట్లో ఎప్పుడూ స్థానముంటుంది’’ అన్నాడు నొచ్చుకుంటూ.

కమలకి నిజానికి పుట్టింట్లో ఏ లోటూ జరగలేదు. కానీ కమలని బాధిస్తున్నది హక్కుగా ఏదీ రాకపోవటం. అన్నీ బహుమానాలుగానే రావటం. బహుమానాలు అవతలి వాళ్లు ఆపేక్షతో పెట్టే భిక్షలు. 

‘‘అది మన ఇల్లు కాదురా! అది నీ ఇల్లు. అక్కడ నేను అతిథిని. మీ బావగారింట్లో దాసిని.’’

‘‘బావగారు మంచివారని నువ్వూ ఒప్పుకుంటున్నావు కదా!’’

‘‘అది మంచికి నువ్విచ్చే నిర్వచనం మీదుంటుంది. నేను కోరుకునే స్వేచ్ఛని బట్టీ ఉంటుంది. ఆయన ఇచ్చింది నేను తీసుకొంటున్నంత కాలం ఏ సమస్యా ఉండదు. నేను నాకింత కావాలని అడిగి ఆయన ఇవ్వకపోతే సమస్యలు మొదలవుతాయి.’’

‘‘అన్నీ ఆయన అమరుస్తుంటే నీకు ఇంకా డబ్బెందుకు!’’

‘‘నువ్విక్కడ రెండ్రోజులుండు. నీ జేబులోని డబ్బు నాకివ్వు. నీ అవసరాలు గమనించి నేనే నీకు అన్నీ అమరుస్తాను. ఆ స్వర్గం అనుభవిస్తే గాని అర్థం కాదు.’’

‘‘నువ్వు లేని సమయంలో నాకు కాఫీ తాగాలనిపిస్తే?’’

‘‘ఆయన లేని సమయంలో నాకనిపిస్తే?’’

‘‘ఇంట్లోనే ఉంటావు కదా కలుపుకొంటావు!’’

‘‘ఇప్పుడు నువ్వూ ఇంట్లోనే కదా ఉండబోతున్నది. కలుపుకుంటావు. ఎంత జాగ్రత్తగా కలుపుకుంటావంటే పాలవాడు పోసిన పాలు అన్ని అవసరాలకి సరిపడేలాగా జాగ్రత్తగా కలుపుకుంటావు. నేను ఆఫీసునుంచి వచ్చి ఓ కప్పు కాఫీ కోరవచ్చునన్న స్పృహతో కలుపుకొంటావు. పాలు వలకకుండా కలుపుకుంటావు. కొలిచి కలుపుకుంటావు.’’

కమల మాటలకి కృష్ణ అప్రతిభుడయ్యాడు. అక్కడ భోంచేసి, బావగారైన రామారావు దగ్గరకు వెళ్లి రాయబారం విఫలమైనదని చెప్పాడు. 

రామారావు వెంటనే వెళ్లలేదు. తన భార్య విడిగా ఉండటం గురించి అందరు అడుగుతుంటే అవమానం అయిపోతోందని ఓ పదిరోజుల తరవాత వెళ్లాడు.

‘‘ఇంటికి రా!’’ అన్నాడు.

‘‘ఎవరింటికి?’’ అని అడిగింది కమల.

‘‘మనింటికి’’ అన్నాడు రామారావు.

‘‘అది మన ఇల్లు అన్న విషయం మీ నోటంట మొదటిసారి వింటున్నాను’’

‘‘ఎప్పుడు కాదన్నాను?’’

‘‘లక్షసార్లు’’ కమల ఒక్కొక్క సందర్భం చెప్పుకు వచ్చింది.

కమల పుట్టింటి విషయం వచ్చినప్పుడల్లా ‘‘మీ ఇంట్లో అట్లాగేమో కాని...’’ అంటూ ఉంటాడు. కమలను వేరు చేస్తూ ‘‘మా ఇంట్లో అట్లా కాదు’’ అంటూ ఉంటాడు. ఎన్నాళ్లయినా ‘మీ’ ‘మా’లు పోయి మన అన్న మాట ఏర్పడలేదు. ఏదన్నా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే, ‘‘ఇది నా యిల్లు. నా ఇంట్లో నా మాటే నెగ్గాలి’’ అనేవాడు.

‘‘నా పుట్టింట్లో ఇది నా యిల్లంటారు. మీరేమో నా పుట్టింటి గురించి ‘మీ ఇల్లు’ అంటూ ఉంటారు. ఈ రెండింటిలో ఏది నా యిల్లు?’’ అడిగింది కమల ఓరోజు.

‘‘ఆడవాళ్లకేమిటి! అన్నీ వాళ్ల ఇళ్ళే’’ అని దాన్ని హాస్యంలోకి దింపి కొట్టిపారేసాడు.

కమల ఇంట్లోంచి బయటికి వచ్చిన నెల రోజులకి తల్లిని ఒప్పించి తీసుకు వెళ్లటానికి కొడుకు నారాయణ వచ్చాడు.

‘‘అమ్మా పోనీ వచ్చి నా దగ్గర ఉండు’’ అన్నాడు.

‘‘నీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది! ఉద్యోగం వదులుకొని వచ్చినా నీ ఇంటి పద్ధతి నాకు పడదు. నాకోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా’’ అంది కమల.

‘‘అమ్మా! నా ఇంట్లో నా భార్యకుగాని నాకు గాని పూర్తి స్వేచ్ఛ ఉందా?’’ అన్నాడు నారాయణ.

‘‘కావచ్చు, కాని నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు’’ అంది కమల.

‘‘అమ్మా, భార్య భర్తకి బానిస. భర్త మొత్తం కుటుంబానికి బానిస. పూర్తి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. పరిమితుల్ని గుర్తించటమే స్వేచ్ఛ అంటారు’’ అన్నాడు నారాయణ.

‘‘నాకు పెద్ద విషయాలు అర్థంకావురా నారాయణా! వ్యవస్థ మారితేగానీ మారనివి కొన్ని వున్నాయి నిజమే. కాని కొన్ని వ్యక్తులు మారటం ద్వారా మారగలిగినవి ఉన్నాయి. మగవాళ్లు మాటల్లో, ప్రవర్తన్లో కొంత అహంకారాన్ని వదులుకుంటే, స్త్రీలకి ఓ మనస్సుందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో మల్లెలు పూస్తాయి.’’

‘‘ఇది నీ ఇల్లా అమ్మా?’’ నారాయణ అడిగాడు.

‘‘అవును. ఇక్కడ నా మాట చెల్లుతుంది’’ అంది కమల.


(సాక్షి సాహిత్యం; 29 అక్టోబర్‌ 2018)