Wednesday, February 24, 2021

ఎంతో ఎదురుచూసిన పుస్తకం



ఫొటోల్లో అజయ్ ప్రసాద్, పూడూరి రాజిరెడ్డి, మెహెర్ ఉన్నారు.
మబ్బుల 5 గంటల చలిలో ఇరానీ హోటల్లో కలవాలన్నది అజయ్ ఐడియా.
--------------------------------------------------------------------------------

 

(19 ఫిబ్రవరి 2021 రోజు facebookలో మెహెర్ రాసిన పోస్టు)

రాజిరెడ్డి ‘ఆజన్మం’ ఇవాళే చేతికొచ్చింది. ఈమధ్య కాలంలో ఇంతగా ఎదురుచూసిన పుస్తకం లేదు. ఈమధ్య అనేముంది, నేను రాయటం మొదలుపెట్టాకా ఎవరి పుస్తకం కోసమూ ఇంతగా ఎదురుచూడలేదు. అలాగని ఇందులోనివేవీ ఇంతకుముందు చదవలేదని కాదు. చాలా పీసెస్ అవి వెబ్ మేగజైన్లలో పబ్లిష్ కాకముందే చదివాను. అలాగని నా స్నేహితుడి రచన కాబట్టీ కాదు ఈ ఎదురుచూపు. అలా అనుకుంటే రాజిరెడ్డి మిగతా పుస్తకాల కోసం నేనేం ఇంతలా ఎదురుచూడలేదు, ఇలా పోస్టులూ పెట్టలేదు. నా కంటెంపరరీ రైటింగులో నన్ను బాగా ఆకట్టుకున్న ఏకైక వర్క్ కాబట్టి, దీని విలువ ఎక్కువమంది గుర్తించటమా ఎవరూ గుర్తించకపోవటమా అన్నదాన్నిబట్టి తెలుగు సాహిత్య చవిటిమాగాణాల మీద నాతో నేను వేసుకున్న పందేల ఫలితం తేలుతుంది కాబట్టి- దీని కోసం ఎదురు చూశాను.

ఈ పుస్తకంలోని రచనలు ‘ఆజన్మం’ పేరుతో 2013లో సాక్షిలో ఆదివారం సంచికలో శీర్షికగా మొదలయ్యాయి. అది మొదలైన మూడో/ నాలుగో వారానికే నేను ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టాను (https://bit.ly/3ptphCs). ఆ వారం శీర్షికలో ‘ఫిక్షన్’, ‘నాన్ ఫిక్షన్’ల మధ్య తేడాపై రాజిరెడ్డి చేసిన తీర్మానాన్ని నెగేట్ చేస్తూ ఆ పోస్టు పెట్టాను. అయితే ఆ పోస్టులో రాజిరెడ్డితో విభేదించటంతోపాటు, నా తోటి రచయిత మొదలుపెట్టిన ఒక కొత్త ప్రయాణాన్ని గుర్తించిన కుతూహలం కూడా ఉంది. ఆ పోస్టు చివర్లోని వాక్యాలివి:
‘‘“నేను” వైపు చూసుకోవటంలో రెండు రకాలున్నాయి. [రచయిత] తనని తాను మనుషుల్లో ప్రత్యేకతగా చూసుకోవటం ఒకటి. తనని తాను మనిషికి ప్రతినిధిగా చూసుకోవటం ఒకటి. ఈ రెంటి మధ్యా గీత చాలా పల్చన. మొదటి రకం కేవలం narcissism. రెండోది, ఒక శాస్త్రీయమైన కుతూహలం. ఈ ఫలానా గెలాక్సీలో, ఫలానా సౌరకుటుంబంలో, మూడో గ్రహమైన భూమ్మీద పుడుతూ జీవిస్తూ చివరికి చచ్చే ఈ మనిషి అనే జీవిని పరిశీలించాలంటే... రచయితకు అతి దగ్గరగా అందుబాటులో ఉన్న స్పెసిమన్ తానే. కాబట్టి మొత్తం మానవాళికి ప్రాతినిధ్యం వహించగలిగే ఈ స్పెసిమన్ ని శ్రద్ధగా చూస్తాడు, తన పరిశీలనల్ని నిర్మమత్వంతో నమోదు చేస్తాడు.... ప్రక్రియల్ని నిరాకరించే దిలాసా రాజిరెడ్డిలో ఉంది (I hope it’s not his job as a journalist that’s making it compulsory for him to resort to these ingenious inventions). ప్రక్రియల మధ్య గీతలున్నాయని మర్చిపోగలిగేంత తన్మయత్వంలో కూడా పడిపోతేనో....’’
అంతకుముందు వచ్చిన రాజిరెడ్డి పుస్తకాలు ‘మధుపం’, ‘రియాల్టీ చెక్’లలో నాకు ఒక రచయితా, జర్నలిస్టూ కలగాపులంగంగా కలిసి కనపడ్డారు. ‘ఆజన్మం’తోనే రాజిరెడ్డి జర్నలిస్టును పూర్తిగా వెనక వదిలిపెట్టి ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. అది గమనించినందుకే నాకు ఆ కుతూహలం. ఈ ఏడేళ్ళలో వాటిని చదువుతూ వచ్చిన సందర్భాలన్నీ ఒక ఎక్సయిట్మెంట్. వీటిలో ఇండివిడ్యువల్ పీసెస్ ఏమైనా ఒక్కోచోట నిరాశ పరిచినా, తన మానసిక నిర్మాణానికి అచ్చంగా సరిపోయే శిల్పాన్ని కనుక్కోవటంలో ఆయన చేసిన ప్రయాణం నాకు ఎప్పుడూ గొప్పగానే అనిపించింది. ఇది తెలుగులో ఇంతకుముందు లేని శిల్పం అనను. అయితే ఇంతకుముందు ఈ తోవలో వచ్చినవేవీ, ఇలా అయితే లేవు. ఈ రచనల తీరుని బట్టి ఇది సహజమే కావొచ్చు. మన రచనా శిల్పాన్ని మన మానసిక నిర్మాణంవైపుకు దగ్గరగా జరిపేకొద్దీ ఈ వైవిధ్యం, అద్వితీయత వస్తాయి. ఆ తోవలో ఒంటరిగా సాగే ధైర్యం లేనప్పుడూ, ఆ నిశితమైన అన్వేషణ లేనప్పుడూ ఇప్పటి మిగతా కంటెంపరరీ రైటింగ్ మల్లే ప్రతి రచనా ఇంకో రచనకి నకల్లాగ, ఏ ఇండివిడ్యువాలిటీ లేకుండా, బాగా ఏడ్చి పౌడరు పూసుకున్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఆ రచనలకి సమాజం కోసం రాస్తున్న యుటిలిటేరియన్ కోణం ఒకటి ఆపాదించి సంతృప్తి పడతారు రచయితలు. మానవానుభవాన్ని అక్షరాల్లోకి తీసుకురావటం చేతకానప్పుడు, అది ఒక norm గాక exception అయి మిగిలినప్పుడు, అది కంటపడినా conceptual binaries లో కూరుకున్న మెదడుకి దాని విలువ అర్థం కానప్పుడు... ఇక ఏం చేయగలరు పాపం! ఇక ఇదొక గుంపులాగ మారుతుంది. రాజిరెడ్డి లాంటి రచయితల గురించి మాట్లాడటానికి వీళ్ల దగ్గర ‘వాక్యం బాగుంటుంది’, ‘వచనం బాగుంటుంది’ లాంటి డొల్లపుచ్చు విశేషణాలు తప్ప ఏమీ దొరకవు. ఎందుకంటే వాళ్ళకి ఈ రచనల్లో సామాజిక చలన సూత్రాలు లేవు, రాజిరెడ్డి విప్లవ ప్రసవ వేదనలెక్కడా పడలేదు, ఏ ఉద్యమానికీ ఎడమ భుజం అరువిచ్చిన పాపాన పోలేదు. కానీ అలాంటివాటి గురించి.. I am constitutionally incapable of giving a fuck కాబట్టి, ఏం చెప్పలేను.
‘సాక్షి’లో ‘ఆజన్మం’ శీర్షిక మొదలైన కొన్ని వారాలకే ఆగిపోయింది. తర్వాత కొన్ని పీసెస్ కినిగె వెబ్ మేగజైన్లో నేనే పబ్లిష్ చేశాను. అప్పట్లోనే మా మధ్య స్నేహం కూడా మొదలైంది. దాంతో మేం రాసుకున్నవన్నీ బైటికి పంపే ముందు ఒకరికొకరు పంపుకోవటం మొదలైంది. అలా ఇవన్నీ బైట పబ్లిష్ కాకముందే చదవగలిగాను. ‘ఆజన్మం’ స్కోప్ ని చాలామంది కంటే బాగా అర్థం చేసుకోగలిగాను. చాలామంది కంటే ముందే అర్థం చేసుకోగలిగాను. అందుకే గత ఏడాది ‘ఈ దశాబ్దం ధ్రువతారలు’ అన్న పోస్టులో ఇలా రాశాను:
‘‘రాజిరెడ్డి తలకు ఎత్తుకున్న ఈ ప్రాజెక్టుని ఎవరైనా దగ్గరగా గమనించారో లేదో తెలీదుగానీ, ఇది 'సాక్షి'లో మొదలై 'కినిగె పత్రిక'లో కొన్నాళ్లు నడిచి ప్రస్తుతం 'ఈమాట'కు చేరే దాకా నేను ఒక్కటీ వదలకుండా చదువుతూ వచ్చాను. ...బహుశా 'ఆజన్మం' పుస్తకంగా వచ్చాకనే దాని బృహత్ ఆకాంక్షా, అందులోని తెగువా అందరికీ అర్థమవుతాయేమో. ఫిక్షన్ అనే వ్యవస్థతో రాజిరెడ్డి పెట్టుకున్న తగువు తెలుగులో ఇదివరకూ ఎవ్వరూ పెట్టుకుని ఉండరు. దీనికి మధ్యలో అడపాదడపా బై ప్రొడక్టుల్లాగా వచ్చిన కథలు కూడా ఉన్నాయి. వాటినెందుకు కథలన్నాడో, వీటినెందుకు కథలనలేదో, ఈ రేఖామాత్రమైన బేధాన్ని పసిగట్టి అర్థం చేసుకుంటేనే ఫిక్షన్ తో రాజిరెడ్డికి ఉన్న తగువేమిటో అర్థమవుతుంది, కొంతలో కొంత రాజిరెడ్డీ అర్థమవుతాడు.’’
ఏడేళ్ళ క్రితం సాక్షిలో ‘ఆజన్మం’ అన్న పేరు చూడగానే దొంగిలించేయాలన్నంత ముచ్చటేసింది. ఆ తర్వాత ఆ పేరు మీద రాజిరెడ్డి రాసినవి చూశాక, దొంగిలించినా అంత గొప్పగా ఆ పేరు మీద ఏం రాయలేనులే అనిపించింది. ‘ఆజన్మం’ అని పేరుపెట్టి నలభై ఏళ్ళకే ఈ పుస్తకం తెచ్చేశాడు రాజిరెడ్డి. ఇప్పుడు ఆజన్మానికి అతీతంగా ఏం చేస్తాడన్నది మరో కుతూహలం.
Congratulations
mate! Go

No comments:

Post a Comment