Tuesday, February 3, 2015

బుచ్చిబాబు: రసమూర్తి

ఒక రకం మానసిక సంసిద్ధత ఉన్న పాఠకుడికి... బుచ్చిబాబు కథల్ని విశ్లేషించడం తెలియకపోయినా, ‘ఇది నాకు నచ్చుతోంది,’ అని మాత్రం అనిపిస్తుంది. ‘నేను’ అంటూ ఆయన ఆత్మీయంగా భుజం మీద చేయి వేసి, పాఠకుల్ని అలా తనవెంట నడిపించుకుంటూ వెళ్తారు. అలాగని తన గోడు వెళ్లబోసుకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే మనిషి కాదు. ‘తన వ్యక్తిత్వాన్ని దిగమింగి, అహంని జయించటంలోనే కళాకారుడి పురోగమనం ఉందన్న సూత్రాన్ని నేను స్వీకరిస్తాను’ అంటారు. అలా నమ్మినా, బోధ చేయడంలోకి రచనల్ని దిగజార్చకుండా, తన వ్యక్తిగతమైన విముక్తి మాత్రమే ప్రేరణగా రచనలు చేశారు.

  సౌందర్యం, సత్యం, తత్వం ఆయన సహజగుణాల్లాగా, సాహిత్యం కేవలం ఆయన ధారను స్పష్టపరుచుకునే ప్రక్రియలాగా తోస్తుంది. అందుకే తన ఏకైక నవల ‘చివరకు మిగిలేది’ ముందుమాటలో ఈ మాట అనగలిగారు: ‘చాలాకాలం దగ్గర పరిచయం వల్ల, వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం సులభమన్నది నా అనుభవం కాదు’.

 ఆయన వాక్యాలు ఒక్కోసారి అర్థంకాని పెయింటింగ్‌లాగా ఉన్నా, అందులోని అందం కట్టిపడేస్తుంది. ‘ఇంటికప్పు మీద నుండి జారిన వెన్నెల వెలుగు ఆమె నుదుటి మీద గీతలా పడుతోంది. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకుని పవ్వళిస్తోంది.’ ‘ఆకుల మధ్య కిరణాలు వనదేవత కుట్టుపనిలో సూదులలా వెనక్కీ ముందుకీ కదుల్తున్నాయి.’

 ‘సమాజంలో స్త్రీ, పురుషులు ఎలా బ్రతకాలి? ఏ మార్గం మానసిక చైతన్యాన్నిస్తుంది? సంసారంలో బందితుడైన వ్యక్తికి వ్యక్తిగతమైన స్వేచ్ఛ, అందునుండి జనించిన వికాసం సాధ్యమా?’ లాంటి ప్రశ్నలకు జవాబులేవో ఆయన రచనల్లో అందుతాయి. స్త్రీ, పురుషులమధ్య ఉండీలేని సజీవ ఆకర్షణలు, ‘నిప్పులేని పొగ’లాంటి బంధాలు, మనుషులు పెంచుకోవాల్సిన మనోవైశాల్యం, జీవితంతో సమాధానపడవలసిన తీరు, వీటన్నింటితోపాటుగా, ‘ఆధునిక నాగరకతలో పూర్తిగా లౌకిక విలువలకి లొంగిపోతున్న మానవుడిలో ఎక్కడో అణిగిమణిగి ఉన్న కళాతృష్ణ, అలౌకిక విలువలు వొకానొక సన్నివేశంలో ఉప్పొంగి బయటపడటం ఆయన కథల్లో చూస్తాము’.

 ‘మళ్లా మళ్లా చదివించే ఖండకావ్యంలా కొనసాగాలంటాను కథానిక,’ అంటారు బుచ్చిబాబు. దానికోసం ఆయన చేసే పరిశోధన, పరిశీలన అసామాన్యం. ‘ఈరకం వైజ్ఞానిక విషయాల సమీకరణ, పాండిత్యం నవలకి అవసరం కాని, కథానికకి అక్కర్లేదు. ‘ఈయన హడావుడి చేస్తున్నాడు’ అనుకోవచ్చు కొందరు. అక్కర్లేదు, నిజమే. నేను తెలుసుకున్న వాటిలో ఒకటి రెండు తప్ప ఈ కథలో వాడనేలేదు. ఏమీ తెలుసుకోకుండా వ్యాధితో బాధపడినవారిని చూస్తే సరిపోవచ్చు. కానీ నాకట్లాగనిపించదు. ఆ వ్యాధి భోగట్టా అంతా తెలుసుకున్నాక మనస్సులో వస్తువుకి అనువైన మానసిక స్థితి ఏర్పడుతుంది,’ అని చెబుతారు.
 తెలుగు సాహిత్యపు కిటికీలను ప్రపంచంవైపునకు తెరవడానికి ప్రయత్నించారు బుచ్చిబాబు. పాశ్చాత్య మనోవైజ్ఞానికతనీ, చైతన్య స్రవంతినీ తెలుగుకథకు అద్దారు. మనిషి అంతరంగ సంక్లిష్టతను విడమరిచే ప్రయత్నం చేశారు. అనుభూతి ప్రాధాన్యతను గుర్తించారు. కథనం దానికదే ప్రధానమైనదే అయినా, ఆయన చింతనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన మనిషి.

 ‘మనం ప్రకృతికి దాస్యం చెయ్యడం తప్పదు. దాస్యం నేను సహించలేను. కానీ, అది తప్పదనుకుంటాను. నేను ఎదురు తిరగలేక కాదు. నాకదిష్టం లేదు. జీవితానికి తలవొగ్గి ప్రపంచాన్ని అంగీకరిస్తాను.’
 ‘జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు. నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం. ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా వుండొచ్చు; కాని ప్రేమించలలేకపోవడంలో అట్లా సమాధాన పడేటందుకేమీ లేదు’.

 ‘ప్రపంచాన్ని మనం ఏదేనా కోరి ఆశిస్తే దాన్ని ఇవ్వదు. మనం దేన్నీ ఆశించకుండా, దూరంగా వుండి చెయ్యగలిగిన పని చేస్తుంటే ప్రపంచం మన పాదాలముందు వాల్తుంది.’
 ‘ఈ జీవితం రహస్యం- దాన్ని తెలుసుకోవడానికి మానవుడు చేసే యత్నం.’
 ఆయన, ‘రచనల్లోనే కాదు- నిత్య జీవితంలోనూ- నిజమైన కళోపాసకుడుగా, సంపూర్ణ మానవుడుగా, స్నేహవత్సలుడుగా జీవించిన గొప్ప కళాతపస్వి’.
 ‘నన్ను గురించి కథ వ్రాయవూ’లో  కథానాయిక కుముదంను ఇలా వర్ణిస్తారు: ‘ఆమె ఒక జీవి. ప్రత్యేకమైన ఉనికిగలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది’.
 బుచ్చిబాబు అనే కలంపేరుగల శివరాజు వెంకటసుబ్బారావు గనక తెలుగు నేలమీద జన్మెత్తకపోయివుంటే, తెలుగు సాహిత్యంలో కచ్చితంగా కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడివుండేది.

(జూన్ 8, 2014 సాక్షి ఫన్డే సంచిక)

 - జూన్ 14న రచయిత బుచ్చిబాబు జయంతి

No comments:

Post a Comment